koodali

Thursday, August 2, 2012

హయగ్రీవ భగవంతుడు.

        ఓం.  
 శ్రీ లక్ష్మీదేవిహయగ్రీవులు .                
 
       విష్ణువు  ధరించిన  హయగ్రీవ  రూపం  సకల  విద్యలకు  ఆధారభూతమైనది  అని    శ్రుతులు  కీర్తిస్తున్నాయని  పండితులు  చెబుతున్నారు.  


సకలశక్తి  స్వరూపిణి  అయిన  లలితాదేవి  ఉపాసనా  రహస్యాన్ని  సహస్రనామ,  త్రిశతి, అష్టోత్తర, ఖడ్గమాల  మొదలైన  రూపాలుగా  హయగ్రీవుడు  అగస్త్యునికు  ఉపదేశించినట్లు  బ్రహ్మాండపురాణం   వివరిస్తోందని  పండితులు  చెబుతున్నారు.  

ఇంకా , 

సూతుడు  శౌనకాది  మహామునులకు  చెప్పిన  హయగ్రీవుని  వృత్తాంతం  లోని  కొన్ని  విషయములు.       (  శ్రీ  దేవీ  భాగవతములో  ఈ  వృత్తాంతం  ఉన్నది. )

  పరమతేజస్వి  దేవదేవుడు  అయిన విష్ణుమూర్తి  10వేల  సంవత్సరాల  పాటు  రాక్షసులతో  భయంకరంగా  మహాయుద్ధం  చేసిచేసి  బాగా   అలిసిపోయాడు.  ఎక్కుపెట్టి  ఉన్న  ధనుస్సును  అలాగే  ఒక  సమతల ప్రదేశంలో  నేలకు  ఆన్చి   ,  పైకొనకు  గడ్డం  
ఆన్చి  శరీర  భారమంతా  ధనుస్సుపై  మోపి   , అలా  నిలబడే  విశ్రమించాడు.  అలసటో  దైవయోగమో   చటుక్కున   నిద్ర  పట్టేసింది.  గాఢనిద్ర.   చాలా  కాలం  గడిచింది.  
 

  అంతలోకి ,  ఏదో  యజ్ఞం  చెయ్యాలని  తలపెట్టిన   దేవతలు  బ్రహ్మను  శివుణ్ణీ  తీసుకొని  విష్ణులోకానికి  వెళ్ళారు.  యజ్ఞప్రభువు  కదా  విష్ణుమూర్తి ,..... అందుచేత  జగన్నాధుని   అనుమతి   తీసుకుని  ప్రారంభిద్దాం   అని  వారి  ఆకాంక్ష.

  అక్కడ  విష్ణుమూర్తి   కనబడలేదు.  వారు  దివ్యదృష్టితో  చూడగా ,   యుద్ధరంగంలో   నిలబడి  నిద్రపోతున్న   విష్ణుమూర్తి   కనిపించాడు.  అందరూ  అక్కడకు  చేరుకున్నారు.   విష్ణుమూర్తిని  నిద్ర లేపటం  గురించి  రకరకాలుగా  ఆలోచించారు.

అప్పుడు,   బ్రహ్మదేవుడు  ఒక  వమ్రిని  (  చెద  పురుగు  )  సృష్టించాడు.  వింటినారిని  భక్షించమన్నాడు.  అప్పుడు   ధనుస్సు  జారిపడుతుంది. అని   .....

అప్పుడు ,  ఆ  వమ్రి   కొన్ని  ధర్మసందేహాలను  వెలిబుచ్చగా...........

వమ్రీ  నీకు  యజ్ఞంలో  భాగం  కల్పిస్తాము.  హోమకుండాలలో  హవిస్సులు     వేల్చేటప్పుడు  అటూఇటూ  చెదిరి పడే  భాగాలు  ఇక  నుంచీ  నీవే  ......అనగా,  

వమ్రి  వెళ్ళి  ,  నేలపై  ఆని  ఉన్న  ధనురగ్రం  దగ్గర  నారిని  చటుక్కున   కొరికింది.  ఒక్కపెట్టున  ధనుస్సు  ఎగిసిపడింది.  భీకరశబ్దం  భూనభోంతరాళాలలో    ప్రతిద్వనించింది. ...సూర్యుడు  అస్తమించి  ....చీకట్లు   వ్యాపించాయి. 

ధనుస్సు  పై  కొనకు   
ఆన్చి  ఉన్న  శిరస్సు  ,  దేవదేవుడి  శిరస్సు  ,  కుండలమండితమైన  శిరస్సు  ...త్రుటిలో  తెగి,  ఎటో  ఎగిరి ,  ఎక్కడో  పడింది.  .....

కాసేపటికి  చీకట్లు  విడిపోయాయి.  భీభత్సం  శాంతించింది. శిరస్సులేని  మొండెం  కనిపించింది.  .....దేవతలు  బావురుమన్నారు.  భయపడ్డారు.   నిశ్చేష్టులయ్యారు.
 
జగన్నాయకా !  నువ్వు  దేవాదిదేవుడవు.  సనాతనుడవు  ఏమిటి  ఈ   దారుణం  ? ఏమిటి  ఈ   మాయ  ?  ....నువ్వే  ఇలా   అయిపోతే  మరింక  దేవతలలో   మిగిలేది  ఎవడు.  ......మేము   తలపెట్టిన  యజ్ఞానికి  ఇది  యక్షులో   రాక్షసులో  కల్పించిన  విఘ్నం    కానే  కాదు.  మాకు  మేమే  చేసుకున్నాం.  స్వయంకృతం.  ఎవరిని  నిందిస్తాం......అని    బాధపడుతుండగా.......

బృహస్పతి   నెమ్మదిగా   దేవతలను  ఓదారుస్తూ  ప్రసంగించాడు.  మహానుభావులారా  !  ధైర్యం   తెచ్చుకోండి.   ఎంత   దుఃఖించి   ఏమి   లాభం  !  రవ్వంత   తేరుకోండి..... అని  ధైర్యం  చెప్పగా ...

 ....,   దేవతలు,  దేవతానాయకులూ     అందరం    కళ్ళు  అప్పగించి  చూస్తూనే  ఉన్నాం....అయినా   విష్ణుమూర్తికి  ఇలా  జరిగింది   అని  , ఇంద్రుడు   అనగా.......

  బ్రహ్మదేవుడు   వేదాంతధోరణిలో   ప్రసంగించాడు.   దేవేంద్రా  !  శుభం  కానీ  అశుభం   కానీ  కాలం  తెచ్చిన   దాన్ని  అనుభవించవలసిందే.  దైవఘటనను   తప్పించుకోవటం   ఎవరివల్లా  కాదు.   దేహం   ధరించాక  సుఖ దుఃఖాలు    తప్పవు.  .....ఎంతటివాడికైనా   కష్టాలు   రాక   తప్పదు.    .........అందుచేత   అతిగా   దుఃఖించక    ఉపాయం   ఆలోచించండి.   సనాతని   అయిన  ఆ  మహామాయను,  మహావిద్యను,  మహాదేవిని    ధ్యానించండి.  .  ఆ  పరాశక్తి  ఆ   నిర్గుణ   ఆ  ప్రకృతి  మనకు  దారి  చూపుతుంది.  ఆవిడ  బ్రహ్మవిద్య,  జగద్ధాత్రి,  (  పోషకురాలు,  దాది  ) సర్వలోకజనని.  ఈ  ముల్లోకాలలో  చరాచరజగత్తు  అంతటా   ఆమె   వ్యాపించి  ఉంది. 

ఈ  ఉపదేశానికి   దేవతలంతా   సమ్మతించారు.  దేవీస్తవం  ఆరంభించారు. 


 
 బ్రహ్మదేవుడి   నాలుగుముఖాల   నుంచి  వేదాలు   మాతృసూక్తం  ఆలపించాయి.....................
...
వేదాలు   స్వయంగా  చేసిన  ఈ  ప్రస్తుతికి  మహేశ్వరి   ప్రసన్నురాలు   అయింది.  కనిపించకుండా  ఆకాశవాణిని   వినిపించింది.  చెవులకు   ఇంపైన  శబ్దాలతో   ఆనందకరంగా   శుభప్రదంగా   మాట్లాడింది. 

 
 
దేవతలారా  !  చింతించకండి.  వేదస్తుతులతో  నేను   సంతుష్టి  చెందాను.  కుదుటపడండి.  ఈ  స్తుతిని  ఇటుపైని  ఎవరు  చేసినా  చదివినా  విన్నా  వారి  కోరికలన్నీ  తీరతాయి.  వేదాలు  చేసిన  స్తోత్రమంటే   వేదతుల్యమే   కదా  !  సరే  ,  విష్ణుమూర్తి  శిరస్సు  అలా  అయిపోడానికి  కారణం  ఉంది.  ఈ  ప్రపంచంలో  అకారణంగా   ఏ  పనీ   జరగదు. 

ఈ  విష్ణుమూర్తి   ఒకరోజున   తన  ప్రియభార్య   లక్ష్మీదేవి  సుందరవదనాన్ని  చూసి  అదోలా  నవ్వాడు.  ఎందుకబ్బా   అనుకొంది  లక్ష్మీదేవి.  నా   ముఖం  వికృతంగా  కనిపించిందా  ?  లేకపోతే   ఉత్తినే   ఎందుకలా  నవ్వుతాడు.  కాదులే  ఎవతినో   నాకు  సవతిని  చేసి  ఉంటాడు.  అందుకే  ఈ  వంకర  నవ్వు.  ....అని  ఆవిడ  ఒక  నిర్ణయానికి  వచ్చేసింది.

 మనసులో  కోపం  భగ్గుమంది.  తామసీ  శక్తి  ఆమెలో  ప్రవేశించింది.  ఇది  భవిష్యత్తులో  దేవకార్యం  కోసమే.  పట్టరాని  ఆ  కోపంలో  భర్తను  శపించింది.  నీ  శిరస్సు  తెగిపడిపోవుగాక  ...అనేసింది.   ఆ  క్షణాన  కాలయోగం  అటువంటిది.  తన  సుఖాన్నే  మరిచిపోయింది.  వైధవ్యం  కన్నా  సపత్నీదుఃఖం  ఎక్కువ  అనుకొంది.  స్త్రీ  స్వభావం   అలాంటిది  కదా  ! 

ఆ  శాపం  ఇప్పుడు  కార్యరూపం  ధరించింది.  శిరస్సు  వెళ్ళి  ఉప్పు  సముద్రంలో   పడిపోయింది.   అయినా  ఫరవాలేదు.  ఇప్పుడే   శౌరిని  బ్రతికిస్తాను.

సురసత్తములారా !  మీరు  తలపెట్టిన  మహాకార్యం   నెరవేరుతుంది.  సందేహం  లేదు.  ఈ  సంఘటనకు  మరొక   చిన్న   కారణం  కూడా  ఉంది.  ......................

ఒకప్పుడు   హయగ్రీవుడనే  రాక్షసమహావీరుడు   సరస్వతీ  నదీతీరంలో పరమదారుణంగా   తపస్సు  చేశాడు. మాయాబీజాత్మకమై  ఏకాక్షరమైన  (  హ్రీం  ) నా  మంత్రాన్ని  ఘోరనిష్ఠతో  జపించాడు.  అప్పుడు  తామసరూపంతో  దర్శనం   అనుగ్రహించాను.   ఏ  రూపాన్ని    ధ్యానించాడో  అదే  రూపంలో  సింహవాహనంపై    కనిపించాను.  వరం  కోరుకోమన్నాను.....

నా  రూపాన్ని  చూసి  అతడి  కన్నులు  ప్రేమతో  విప్పారాయి.   నమస్కరించి  ప్రదక్షిణం  చేశాడు.   ఆనందభాష్పాలలో   దొప్పదోగుతూ   అద్భుతంగా   స్తుతించాడు.......................

హయగ్రీవా !  నీ  తపస్సుకీ   నీ  స్తోత్రానికీ  సంతసించాను.  నీ  కోరిక  ఏమిటో  చెప్పు....అన్నాను.

మాతా !  నాకు  మరణం   లేకుండా  వరం   ప్రసాదించు.  నేను  యోగిగా  సురాసురులకు  అమరుడుగా   ఉండిపోవాలి.  అనుగ్రహించు.

హయవదనా  !  ఇది  అసంభవం.  పుట్టినవాడు  గిట్టకతప్పదు.  గిట్టినవాడు  తిరిగి  పుట్టకా  తప్పదు.  ఇది  లోకంలో  స్థిరపడిన  మర్యాద.  దీనికి  భిన్నంగా   నువ్వు  అమరుడవు  ఎలా  అవుతావు.  కుదరదు.  కాబట్టి,  రాక్షసోత్తమా  ! మరణం  తప్పదు  అనే  మాటను  నిశ్చయంగా  మనసులో  పెట్టుకుని  బాగా  ఆలోచించి,  నీ  ఇష్టం,  ఏ  వరమైనా  కోరుకో.



సరే అయితే ,  జగదంబికా  ! హయగ్రీవుడి  చేతిలో  తప్ప  మరింక  ఎవ్వరి   చేతిలోనూ  నాకు  మృత్యువు  ఉండకూడదు.  ఈ  వరం  ప్రసాదించు.

రాక్షసమహావీరా !  తధాస్తు. ఇంక  ఇంటికి  వెళ్ళు.  సుఖంగా  రాజ్యం   పరిపాలించుకో.  హయగ్రీవుడి  చేతిలో  తప్ప  మరింక  ఎవ్వరి  చేతిలోనూ  నీకు   చావు  లేదు.

 

ఇలా  వరం  ఇచ్చిన  నేను  అంతర్ధానం  చెందాను.


 ఆ  హయవదన   రాక్షసుడు   పట్టరాని  ఆనందంతో  ఇంటికి  వెళ్ళి  ఇక  అక్కడినుంచి   వేదాలనూ  వేదవిదులనూ  మునులనూ  దారుణంగా   హింసించడం  మొదలుపెట్టాడు.  ఆ  దుష్టుణ్ణి  సంహరించగలవాడు  ఈ  భువనత్రయంలో   లేడు.  
 

అందుచేత,  ఓ  దేవతలారా !  ఒక  అందమైన  గుర్రపు  తలను తీసుకురండి.  దాన్ని  విష్ణుమూర్తి  మొండేనికి  దేవశిల్పి  (  త్వష్ట  )  నేర్పుగా  అతుకుతాడు.  అప్పుడు  ఈ  హయగ్రీవభగవంతుడు  ఆ  రాక్షసుణ్ణి    సంహరిస్తాడు.  ఇది  దేవకార్యం.

 

అశరీరవాణిగా  జగన్మాత  చేసిన  ఈ  ఉపదేశాన్ని  దేవతలంతా  విన్నారు.  తేరుకున్నారు. 


 దేవశిల్పిని  వేడుకున్నారు.  అతడు  దగ్గరలో  ఉన్న  గుర్రపుతలను   వెంటనే    ఖడ్గంతో   ఖండించాడు.  ఆలస్యం  లేకుండా  విష్ణుమూర్తి  శరీరానికి  కలిపాడు.  హయగ్రీవ  భగవంతుడు  ఆవిర్భవించాడు.  ఇది  మహామాయా  ప్రసాదం.  అటుపైని  కొంతకాలానికి   ఆ  రాక్షసుణ్ణి  మట్టుపెట్టాడు. 

 
.........................................
పైన  వ్రాసిన  విషయాలలో  ఏమైనా  పొరపాట్లు  ఉంటే ,  దయచేసి   క్షమించమని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.
.............................................................

రాఖీ పౌర్ణమి సందర్భంగా  బ్లాగ్  లోకంలోని  సోదరసోదరీమణులకు  శుభాకాంక్షలు...




2 comments:

  1. Thanks a lot for your contribution

    ReplyDelete
  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    ReplyDelete