koodali

Friday, August 3, 2012

... దేవతలు చేసిన దేవీస్తవం.

ఓం. 

* నిన్నటి  టపాలో  దేవతలు  చేసిన  దేవీస్తవం  గురించి  తెలియజేశాను.  ఆ  దేవీస్తవం  ఇక్కడ  వ్రాస్తున్నాను.

 దేవతలు  చేసిన  దేవీస్తవం.


హే  దేవీ !  మహామాయా !  నమోఃనమః  నువ్వు  విశ్వోత్పత్తి  కారణానివి.  శుభప్రదవు.  నిర్గుణవు.  సర్వభూతేశ్వరివి.  జగన్మాతవు.  శంకరు డంతటివాడికి  కోరికలు  తీర్చినదానవు.  ప్రాణి కోటికంతటికీ  ప్రాణం  నువ్వే.  జీవ కోటికంతటికీ  ఆధారభూమివి   నువ్వే.  తెలివి,  కలిమి, వెలుగు,  ఓరిమి, శాంతి,  శ్రద్ధ, మేధ,  ధైర్యమూ,  స్మృతి....అన్నీ  నువ్వే. ఉద్గీధంలో  అర్ధమాత్రవు  .....నువ్వే.  గాయత్రివి  నువ్వే. జయ,  విజయ,  ధాత్రి,  లజ్జ, కీర్తి,  స్పృహ,  దయ .....అన్నీ  నువ్వే.  ముల్లోకాలనూ  సంవిధాన పరచగల్గిన  దయామయివి.  సర్వజననివి.  లోకహితకారిణివి. వరేణ్యవు,  వాగ్బీజవు , భవబంధవినాశినివి.  నమోస్తు  దేవీ  !  నమోనమః.  త్రిమూర్తులూ  అష్టదిక్పాలకులూ  ... అందరూ  నీ  సృష్టి.  స్థావరజంగమ   జగత్తులో   నువ్వే   ముఖ్యాతిముఖ్యవు.  సకలభువనాలనూ  తయారుచెయ్యాలి  అని  నీకు  అనిపించినప్పుడు  త్రిమూర్తులనూ  సృష్టిస్తూ  ఉంటావు.  వారితో  సృష్టి  స్థితి  లయాలను  జరిపిస్తూ  ఉంటావు.  నీకు  మాత్రం  ఈ  సంసార  స్పర్శ  రవ్వంతయినా  ఉండదు.  నీ  రూప  విభవాన్ని  గానీ  నీ  నామ సంఖ్యను గానీ  తెలుసుకున్నవాడూ,  తెలియజెప్పగలవాడూ   ఈ  ముల్లోకాలలో  ఒక్కడూ  లేడు.  మామూలుగా  చిన్న  నీటిగుంటనే  దాటలేనివాడు  ,  మహాసముద్రాన్ని  (  పారావారాన్ని )  ఈదుతాడా  !



హే  ! జగజ్జననీ  ! మానవులలోనే  కాదు  దేవతల్లో   కూడా   నీ  అనంతవిభవం  తెలిసిన  వారు  ఒక్కరూ  లేరు.   నువ్వు  అద్వితీయవు.  ఒంటిచేతితో  ఈ  సకల మిధ్యా   విశ్వాన్ని  సృష్టిస్తున్నావు.  దీనికి  వేదవాక్కులే  ప్రమాణం.  ఇంత  సృష్టీ  చేసి , నువ్వు  నిరీహంగా  ఉంటావు.  నీ  చరిత్ర  ....చిత్రవిచిత్రం.



అమ్మా  !  విష్ణుమూర్తి  శిరస్సు  తెగిపడిందని  నీకు  తెలియదా ?  తెలిసీ  ఈ  తాత్సారం  ఏమిటి  తల్లీ  ! అతడు  నీ  పాదసేవకుడు  గదా . మహాపాపం  ఏమైనా  చేశాడా  ?  అది  నీ  పాద సేవ  కంటే  బలీయం  అయ్యిందా  !  లేకపోతే   కన్నతల్లివి  ఇంత  ఉపేక్షిస్తావా  !  దేవతలకు  ఎంత  విషమస్థితి  దాపురించింది.  విష్ణుమూర్తి  శిరస్సు  ఎగిరిపోవడం  ఏమిటి  !  ఎంత  ఆశ్చర్యం  ! బహుశా  సకలదేవతలూ  చేసిన  దోషాలు  విష్ణుమూర్తిని  కొట్టి  ఉంటాయి.  అందరి  పాపాలనూ  అతడి  నెత్తిన  పెట్టి  ఉంటావు.  లేదా  మధుకైటభులతో  వేల  సంవత్సరాలు  సాగిన  యుద్ధంలో  నా  అంతట  నేనే  జయించానని  విష్ణుమూర్తి  ఏమైనా  గర్వించాడేమో  !  అందుకు  శిక్ష  విధించావా  జననీ  ! నీ  భావం  ఏమిటో  అంతుపట్టడం  లేదు. ఒకవేళ  సమరంలో  ఓడిపోయిన  (  మధుకైటభ )  రాక్షసులు  తీవ్రంగా  తపస్సు  చేసి  నిన్ను  మెప్పించి  ఇటువంటి  వరమేదైనా   కోరారా ?  అదీకాకపోతే,  క్షీర  సముద్రరాజ   తనయ   లక్ష్మీదేవి   మీద  నీకు  కోపం  వచ్చిందా ? భర్తృహీనను  చేసి  వినోదిస్తున్నావా  ?  అమ్మా  !  నీ  అంశతో   జన్మించాడు  విష్ణుమూర్తి.   అతడు  ఏవైనా  అపరాధాలు   చేసి  ఉంటే  క్షమించడమే  సమంజసం.  అతణ్ణి  త్వరగా   జీవింపజెయ్యి.  మమ్మల్ని  ఆనందింపజెయ్యి.


ఈ  దేవతలంతా  నిరంతరం  నీకు  మ్రొక్కుతూనే  ఉన్నారు.  నీకు  పరమభక్తులు.  నీ  ఆజ్ఞలనూ  పనులనూ  నెరవేర్చడంలో  అతిముఖ్యులు.  సమర్ధులు. ఇప్పుడు  ఇలా  శోకార్ణవంలో మునిగిపోయారు.  త్వరగా   వీళ్ళని  తరింపజెయ్యి.  విష్ణుమూర్తిని  బ్రతికించు. అతడి  శిరస్సు  ఎక్కడ  పడిందో  తెలియదు.  నీవు  తప్ప  మరొక  దిక్కు  లేదు.  మరొక   ఉపాయం  లేదు.  అమృతం  లాగా  జగత్తుకి  నీవే  జీవనప్రదాత్రివి.


వేదాలు  స్వయంగా  చేసిన  ఈ  ప్రస్తుతికి  మహేశ్వరి   ప్రసన్నురాలు  అయ్యింది.  కనిపించకుండా  ఆకాశవాణిని  వినిపించింది. చెవులకు  ఇంపైన  శబ్దాలతో  ఆనందకరంగా  శుభప్రదంగా  మాట్లాడింది.


 
దేవతలారా  !  చింతించకండి.  వేదస్తుతులతో  నేను   సంతుష్టి  చెందాను.  కుదుటపడండి.  ఈ  స్తుతిని  ఇటుపైని  ఎవరు  చేసినా  చదివినా  విన్నా  వారి  కోరికలన్నీ  తీరతాయి.  వేదాలు  చేసిన  స్తోత్రమంటే   వేదతుల్యమే   కదా  !


అప్పుడు ,  దేవి  ఎన్నో  విషయాలను  దేవతలకు  తెలియజేయటం  జరిగింది.  అలా .... దేవకార్యం  చక్కగా  నెరవేరింది.
 ..................

 వ్రాసినవిషయాలలో  అచ్చుతప్పుల  వంటి  పొరపాట్లు  ఉంటే  దయచేసి  క్షమించమని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.



2 comments:

  1. మంచి పోస్ట్...
    అభినందనలు మీకు...
    @శ్రీ

    ReplyDelete
  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
    మీ వ్యాఖ్యను కొద్దిసేపటి క్రితమే చూశాను.
    రిప్లై ఇవ్వటం ఆలస్యం అయినందుకు దయచేసి క్షమించండి.

    ReplyDelete