koodali

Wednesday, August 30, 2017

Friday, August 25, 2017

ఓం....

  
వినాయక చవితి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలండి.

 వినాయకచవితి పూజలో ఉపయోగించే పత్రి ఎన్నో ఔషధవిలువలు గలిగిన పత్రి. 

ఇప్పుడంటే  పత్రిని  బజారులో  కొంటున్నారు  గానీ, ఇంతకుముందు రోజుల్లో అయితే ఈ పత్రిని  సేకరించటంలో  పెద్దవాళ్ళతో  పాటు పిల్లలు  కూడా పాల్గొనేవారట. 

అందువల్ల  పిల్లలకు  రకరకాల  మొక్కల  గురించిన వివరాలు, వాటికి గల ఔషధగుణాలు తెలిసేవి . 

  పూజ  తరువాత  , పూజలో  వాడిన  పత్రిని  కూడా  నీటిలో  కలుపటం  ద్వారా  పత్రిలోని  ఔషధ  గుణాలు  నీటిలో  కలిసి  నీరు  బాగుంటుంది.

మట్టితో  తయారుచేసిన   విగ్రహాల   వల్ల     కలిగే  మంచి  గురించి   ఎందరో  ప్రచారం  చేస్తున్నారు.

  అందువల్ల  ప్రజలలోనూ  క్రమంగా   చక్కటి  చైతన్యం  పెరుగుతోంది.  

  పర్యావరణానికి  హానిని    కలిగించని   విగ్రహాలను  వాడటానికి  ముందుకొచ్చే  ప్రజల  సంఖ్య  పెరగటం   మంచి  పరిణామం.

Friday, August 18, 2017

త్యాగం వాటిది. ఫలితం మాత్రం మనకు మాత్రమేనా......ఇదెక్కడి అన్యాయం ?


 
ఈ సృష్టిలో మానవులమైన మనము మాత్రమే గొప్పవాళ్ళము అనుకుంటుంటాము. కానీ అల్పజీవులు అనబడే మొక్కలు, ఫలవృక్షములు, జంతుజాలము , ఇతరజీవులు మానవ మనుగడకోసం ఎన్నో త్యాగములు చేస్తున్నాయి.


మనము కోరికలతో ఎన్నో పూజలు చేసి వాటి ఫలితములను మాత్రము మనకు మాత్రమే దక్కాలని కోరుకుంటూ ఉంటాము. కానీ ఆలోచిస్తే పూజలో మనము వాడే ఎన్నో పదార్దములు ఇతర జీవుల నుంచి మనము పొందేవే.


ఉదా..పుష్పములు మొక్కల నుంచి పొందుతాము. మొక్కలు పెరిగేటప్పుడు వాటి కొమ్మలను తుంపటం, కత్తిరించటం ఇలా ఎన్నో బాధలకు గురవుతాయి.


మరి ప్రసాదముగా ..పాయసం, ఇతరపిండివంటలు తయారుచెయ్యటానికి వాడే పాలు  ఆవుల ద్వారా వస్తాయి కదా... ఈ రోజుల్లో ఆ పాలను వాటి దూడలను కూడా సరిగ్గా త్రాగనివ్వకుండా పిండేస్తున్నారు .


పండ్లు, బియ్యపుపిండి, గోధుమలు, బెల్లము , ఇవన్నీ మొక్కలు, చెట్లనుంచి మనము పొందేవే. ఇలా దేవునికి ప్రసాదముగా మనము సమర్పించే పదార్దములు ఇతరజీవుల నుంచి మనము పొందుతూ పూజా ఫలము మాత్రము ......... మనకు మాత్రమే దక్కాలని కోరుకోవటం ఏమి న్యాయం ? 

మనము మనదిగా భగవంతునికి ఏమి ఇస్తున్నాము ?


మనము కూడా సత్ప్రవర్తనతో జీవితాన్ని గడిపిభగవంతునిఆనందపరచవచ్చుఇంకా ప్రేమతోకూడిన భక్తిని వారికిసమర్పించవచ్చు.


మనము స్వచ్చమైన భక్తిని కూడా భగవంతుని యెడల ప్రదర్శించలేకపోతున్నాము. త్యాగం ఇతర జీవులది. ఫలితం మాత్రం మనకు మాత్రమేనా......ఇదెక్కడి అన్యాయం ?


అందుకే పెద్దలు పూజాఫలమును పరమాత్మకే సమర్పించమని చెబుతుంటారు.


ఆ పరమాత్మకు మాత్రమే తెలుసు ఏది ఎలా చెయ్యాలో ! ఎవరికి ఏది , ఎంత ఇవ్వాలో !


ఈ విశ్వ మనుగడకు ఇతర జీవులు ఎన్నో త్యాగాలు చేస్తున్నాయి. మరి జీవులలో ఉత్తములు అనబడే మనం భగవంతునికి ప్రేమ భక్తితో పూజ కూడా చెయ్యలేకపోతున్నాము.

ఇంకా, మనం బ్రతకటం అంతా... మన గొప్పే, మన తెలివివల్లనే అని విర్రవీగుతుంటాము.


ఆలోచిస్తే ప్రాణవాయువు అందకపోతే... గట్టిగా కొంతసేపు కూడా ఉండలేని అల్పజీవులమైన మనం పుట్టినప్పటినుంచి మనకు ప్రాణవాయువును, నీటిని ,ఆహారాన్ని ఇంకా అనేకమైన వాటిని ఏర్పరిచిన పరమాత్మ పట్ల ఎంత కృతజ్ఞతగా ఉండాలి.


అలా లేకపోగా ..... మన బ్రతుకుకు తోడ్పడుతున్న ఇతరజీవులను మన భౌతికమైన సుఖములకోసం నిర్దాక్షిణ్యముగా వాడుకుంటూ, మానవులు ఎంతో గొప్పవాళ్ళు ..... ఇతరజీవులు అల్పమైనవి అంటుంటారు.


ఇంకా, ఎన్నో అవసరముల కోసం ఇతర జీవుల దయపై ఆధారపడి బ్రతుకుతూన్న మనం , భౌతిక సుఖములకు అతిగా అలవాటుపడి .... కన్నూమిన్నూగానక ఇతర జీవులను సర్వనాశనం చేస్తున్నాము.

అవి అల్పజీవులు కాదు. మనిషే... అల్పబుద్దిగలవానిగా తయారవటం నేటి దౌర్భాగ్యం.

(Friday, November 12, 2010)

 

**************
ఆహారాన్ని వృధా చేయటం ఎంతో పాపం. మొక్కలు, చెట్లనుంచి ఆహారం లభిస్తుంది. ఒక కాయ లేక పండు రావాలంటే చాలా కాలం పడుతుంది. ఆహారాన్ని వృధా చేయకూడదు. 
 
ఫంక్షన్స్ లో నూ ఇంకా కొన్ని హోటల్స్ లోనూ భోజనంలో బోలెడు పదార్ధాలను వడ్డిస్తారు. అవన్నీ తినలేక వదిలేయటం వల్ల బోలెడు ఆహారం వృధా అవుతుంది. అందువల్ల తక్కువ పదార్ధాలనే ఇవ్వాలి. ఉదా.. భోజనంలో 10 ఐటెంస్ బదులు 5 ఐటంసే పెట్టాలి.
 
 

Monday, August 14, 2017

శ్రీ కృష్ణాష్టమి మరియు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా....

 శ్రీ కృష్ణాష్టమి మరియు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అందరికి శుభాకాంక్షలండి.

అప్పుడు సముద్రంలో మునిగిన ద్వారకా నగరపు ఆనవాళ్ళను ఈ మధ్య కాలంలో సముద్రంలో గుర్తించామని అంటున్నారు.

ఆ విశేషాలను తెలుసుకోవాలంటే ఈ లింక్ వద్ద చూడగలరు.

ఈ విషయాలను తెలియజేసిన వారికి ధన్యవాదములండి.


Sri Krishna Lost City of Dwarka found

 Under Sea ll justwowtv





Friday, August 11, 2017

దైవం మెచ్చే విధంగా జీవించటం...

  
ఈ రోజుల్లో చాలామంది ప్రజలు పూజలు ఎక్కువగా చేస్తున్నారు. 

పూజలు చేయటం ఎంతో సంతోషించవలసిన విషయం.

 అలాగే దైవం మెచ్చే విధంగా జీవించటం వల్ల దైవానుగ్రహం కలుగుతుంది.

  దైవాన్ని పూజించేవారు చెడ్డ పనులు చేయకుండా ఆదర్శంగా జీవించటానికి ప్రయత్నించాలి.

 జీవితంలో నైతికవిలువలను పాటిస్తే సమాజంలో సమస్యలు తగ్గుతాయి. 

జీవితంలో ఎవరి ధర్మాన్ని వారు పాటించాలి.

 ఇప్పుడు సమాజంలో  ఆధిపత్య ధోరణి, అత్యాశ, సంపాదన యావ..వంటివి ఎక్కువయ్యాయి.

తృప్తి, పొదుపు.. అనే విషయాలను అంతగా పట్టించుకోవటం లేదు.

అవినీతి, లంచగొండితనం.. ఎక్కువయ్యాయి..

వందలు, వేలకోట్లు సంపద పోగేస్తూ , డబ్బు సంపాదన కోసం పడరాని పాట్లు పడుతున్నారు.

 ఆహారంలోనూ కల్తీ చేస్తున్నారు. భూములను కబ్జా చేస్తున్నారు.

మత్తుపదార్ధాలను అమ్ముతున్నారు. 

ఇంకా ఎన్నో విధాలుగా డబ్బు సంపాదనా మార్గాలను ఎంచుకుంటున్నారు.

 ఎటు చూసినా డబ్బు యావ.

 సంపద అంటే డబ్బు మాత్రమే కాదు. తృప్తిగా, ఆరోగ్యంగా, సంతోషంగా.. జీవించటం కూడా సంపదే.

 అసూయాద్వేషాలు, ఆధిపత్య ధోరణి, అహంకారం..వంటివి ఉన్నవారు ఎంత సంపద ఉన్నా సంతోషంగా జీవించలేరని పెద్దలు తెలియజేసారు. 

ధర్మబద్ధంగా జీవించటం.. దైవానికి నచ్చే, దైవం మెచ్చే గొప్ప పూజ. 

**************** 
 సహజవనరులు...గొప్ప సంపదలు. 

పర్యావరణాన్ని పాడుచేసి , సహజవనరులను కోల్పోతే  ప్రపంచం చక్కగా ఎలా ఉంటుంది? 

. అప్పుడు మనిషి అచ్చు వేసే కాగితపు డబ్బుకు ఎంత విలువుంటుంది?

 అందువల్ల పర్యావరణాన్ని కాపాడటం , సహజవనరులను తక్కువగా వినియోగించటం చేయాలి.

అవసరాలు, అభివృద్ధి అంటూ సహజవనరులను విపరీతంగా వాడేస్తున్నారు. కోరికలను తగ్గించుకోవాలి. 

ఇవన్నీ చాలామందికి సిల్లీగా, అభివృద్ధి నిరోధక మాటలుగా అనిపించవచ్చు. 

అయితే, ఇదే విధంగా పర్యావరణాన్ని ధ్వంసం చేస్తూ, సహజవనరులను వాడేస్తూ ఉంటే భవిష్యత్తులో పశ్చాత్తాపపడవలసి ఉంటుంది. 

అలాంటి పరిస్థితి రాకుండా మేల్కొనవలసి ఉంది .     


Wednesday, August 9, 2017

కొన్ని విషయాలు..తక్కువ ధరకు భోజనాన్ని...


ఈ శ్రావణ పౌర్ణమికి ఈ సంవత్సరపు అమరనాధ్ యాత్ర సమాప్తమయింది. 
***************

మరి కొన్ని విషయాలు..


 కొన్ని రాష్ట్రాలలో అమలవుతున్న తక్కువ ధరకు భోజనాన్ని అందించడానికి ఏర్పాటయిన క్యాంటీన్ల గురించి చాలా మందికి తెలుసు.


ఎన్నో కారణాల వల్ల ప్రస్తుత పరిస్థితిలో అందరికీ పని లభించటం కష్టంగా ఉంది.


 ప్రభుత్వాలు కూడా అందరికీ ఉపాధి కల్పించలేవు. 


ఇలాంటి పరిస్థితిలో ప్రభుత్వాలు పేదలకు తక్కువ ధరకు ఆహారాన్ని అందించగలిగితే ఎంతో మంచిది. 


ఆకలితో ఉన్న మనిషికి పనిచేయటానికి సరైన శక్తి  ఉండదు. 


ఆకలితో  ఉన్నప్పుడు చాలామందిలో కోపం , ఆవేశం వంటి లక్షణాలు కూడా వస్తాయి. 


ఇందువల్ల సమాజంలో నేరాలు పెరిగే అవకాశం ఉంది.


అందువల్ల అందరికీ ఆహారాన్ని అందించటం ఎంతో ముఖ్యం. 


ఆకలితో ఉన్నవారికి  ఆహారాన్ని అందించటం ఎంతో మంచి విషయమని పెద్దలు తెలియజేసారు. 


***************

 ఈ రోజుల్లో పని చేయాలన్నా పని దొరకటమే కష్టంగా ఉంది. 

 ఇలాంటప్పుడు పని చేసినవారికే  ఆహారం అనటం సరైనది కాదు. 

పనికోసం విపరీతంగా పరిశ్రమలు పెట్టి సహజవనరులు త్వరగా తరిగిపోవటమూ సరైనది కాదు.


 సహజవనరులు వేగంగా తరిగిపోని విధంగా  ఇతర రంగాలలో ఉపాధి అవకాశాలు అభివృద్ధి చేసుకోవాలి..


 ఉదా.. పర్యాటకం..వంటి రంగాలను కూడా అభివృద్ధి చేసుకోవాలి. 


**************** 

రేషన్  కార్డుల  ద్వారా  నిత్యావసర  వస్తువులను  అందించటమూ  మంచిదే. 

అయితే, వంట  చేయాలంటే గ్యాస్  వంటివి ఎన్నో కావాలి.  


వంటచేసుకోవాలంటే  కుదరని వారికి  ఇలాంటి  క్యాంటీన్లు  ఎంతో  ప్రయోజనకరం.  


మనిషికి  ఆహారం  ముఖ్యం.  ఆకలితో  అల్లాడే  ప్రజలున్న  సమాజంలో  ఎంత  టెక్నాలజీ  ఉన్నా ఏం  లాభం ?  


అందరికీ  ఆహారాన్ని  అందించగలిగిన  రోజున  దేశంలో  ఎన్నో  సమస్యలు  పరిష్కారమవుతాయి.


***************

 ఇక్కడ  ఇంకో విషయాన్ని కూడా చెప్పుకోవాలి. 

 సమాజంలో  డబ్బున్న  వాళ్ళలో  కొందరు  మరీ  పిసినారివాళ్ళుంటారు.  


  ఇలాంటి  వాళ్ళు,  తక్కువ ధరకు  ఆహారం  లభిస్తుందంటే - ఇక  ఇంట్లో  వండుకోవటం  మానేసి  క్యాంటీన్లలోనే  భోంచేస్తారేమో ? 


  డబ్బున్న  వాళ్ళు  కూడా  ఇలా  చేస్తే , పేదవారికి  ఆహారం  సరిపోదు.  ఇలాంటి  క్యాంటీన్లను  ప్రారంభించిన  అసలు  ఉద్దేశ్యం  సరిగ్గా  నెరవేరదు. 


 ఎప్పుడో తప్పనిసరి  పరిస్థితిలో  తప్ప  డబ్బున్నవాళ్ళు  ఇలాంటి  క్యాంటీన్లను  ఉపయోగించకుండా  ఉంటేనే మంచిది.


  పీనాసితనాన్ని  తగ్గించుకుంటే  పేదవారి  కడుపు నింపిన వారవుతారు.


************

పేదవారికి రాత్రి సమయంలో తల దాచుకోవటానికి  షెల్టర్లు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అక్కడే వైద్య సహాయం ఉండాలి.

 ఇవన్నీ జరగాలంటే ప్రభుత్వాల వద్ద డబ్బు ఉండాలి. 


డబ్బు ఉండాలంటే, సంపద అంతా కొందరి వద్దే ప్రోగుపడకుండా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలి.


 జనాభా విపరీతంగా పెరిగినా ఇబ్బందే. మంది ఎక్కువయితే మజ్జిగ పలుచన అనే పరిస్థితి వస్తుంది. 


స్వాతంత్ర్యం వచ్చి ఎన్నో సంవత్సరాలు గడిచినా దేశంలో పేదరికం వంటి సమస్యలు ఉండటం బాధాకరం. 


 దేశంలో పేదరికం తగ్గాలంటే ప్రజలూ, ప్రభుత్వాలు, అధికారులు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తేనే చక్కటి ఫలితాలు వస్తాయి.



Wednesday, August 2, 2017

భారతదేశం గొప్పదే కానీ, చాలామంది భారతీయులే..

 
చాలాకాలం తరువాత ఇక్కడ పాతపోస్ట్ తీసి క్రింద విషయాలు రాయటం జరిగింది.
 
దేశంలో చాలామంది ప్రజలు బాధ్యత లేకుండా జీవిస్తున్నారు. శుచిశుభ్రత లేకుండా ఎక్కడపడితే అక్కడ మలమూత్రాలు చేస్తారు. రోడ్లపైన చెత్త వేస్తారు. స్నాక్స్ తిన్నాక బస్సు, కారు, ట్రైన్లో కిటికిలోనుంచి నుంచి ప్లాస్టిక్ కవర్లు రోడ్డుపై విసిరేస్తారు.
  
 సామూహిక పండుగలు ఉదా.. కుంభమేళా, జాతరలు.. ముగిసిన తర్వాత ఆ ప్రదేశాలు శుభ్రం చేయాలంటే ఎంత కష్టమో..శుచిశుభ్రత పాటించకుండా పూజలు చేయటం ఏమిటో?
 
 ఊళ్ళలోని మురుగును నదులలోకి వదలటం, గట్టిగా అరుచుకోవటం... జనం ఎందుకు ఇలా తయారయ్యారో.. తెలియటం లేదు. 

బయట బస్సు ఎక్కాలన్నా, గుడిలో క్యూలైన్లు పాటించకుండా ఒకరినొకరు తోసుకుంటారు. 
 
ఎక్కడైనా సినిమావాళ్లు కనిపిస్తే,  వెర్రిగా మీదపడిపోతారు.  వాళ్ళను చూడటానికి ఒకరినొకరు తొక్కేసుకుని, కొందరు చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. సినిమాఆడవాళ్ళను చూడటానికి అయితే,  ఇక చెప్పనక్కరలేదు.
 
 భారతదేశం గొప్పదే కానీ, చాలామంది భారతీయులే..భారతదేశం పరువుతీస్తున్నారు.  భారతదేశం గొప్పది అని చెప్పుకుంటే సరిపోదు. అలా గొప్పగా ఉండేలా  ప్రవర్తించాలి కూడా.
 
 సెలెబ్రిటీలు అనబడేవాళ్లు  కొందరు, అక్రమసంబంధాలతో ప్రవర్తిస్తుంటే.. అలా చేయటం తప్పని చెప్పకుండా, జనాలు కొందరు వాళ్ళను పొగుడుతుంటారు. 
 
సమాజంలో కొందరు స్త్రీలు, పురుషులు కూడా నైతికవిలువలను పాటింకుండా ప్రవర్తిస్తున్నారు.

 ఆ మధ్య కొందరు సినిమా ఆడవాళ్లు ఏం చెప్పారంటే, షూటింగ్ కొరకు బయటకు వెళ్లినప్పుడు  రూములో పడుకుంటే, రాత్రిసమయంలో కొందరు మగవాళ్లు తలుపులు కొట్టి తమకోరిక తీర్చమని అడిగేవారని చెప్పారు. 
 
సమాజం ఇలా ఉన్నప్పుడు, స్త్రీలు కూడా ఎక్కడికి పడితే అక్కడకు వెళ్ళకుండా జాగ్రత్తగా ఉండాలి.  మగవాళ్లు కూడా తలుపులు కొట్టి అలా అడగటం, అంత దిగజారిపోవటం అసహ్యకరం.

కొందరు సినిమావాళ్లే కాదు, బయటకూడా కొందరు ఇలా అక్రమసంబంధాలుతో తిరుగుతున్నారని తెలుస్తోంది.  

శృంగారం ఎక్కువ పాల్గొంటే శరీరం బలహీనమయ్యి రోగాలొస్తాయి. మనస్సును కంట్రోల్ చేసుకోవాలి.
.................................
 
  కొందరు ఎన్నో పాపాలు చేసి ఎంతో డబ్బు సంపాదిస్తారు. వేలకోట్లు ఒక కుటుంబానికి అవసరమా? చచ్చాక ఆ డబ్బు పట్టుకుపోలేరు కదా.బతికున్నప్పుడు చేసిన  పాపపుణ్యాలే చచ్చాక వెంట వస్తాయి తప్ప,  డబ్బు రాదు కదా..

 జనాభా ఎక్కువయితే ఎంత డబ్బూ సరిపోదు.  కొందరు  ఉచితాలు ఎవరు ఎక్కువిస్తే వాళ్లకు ఓట్లు వేయటానికి ఎదురు చూస్తుంటారు. 
 
కొందరు రాజకీయులు ప్రజలకు కొన్ని ఉచితాలు ఇచ్చి, తాము బాగా పైకి వస్తారు.

నేను ఒక దగ్గర చదివాను..ఒక దేశంలో ప్రజలు ప్రభుత్వం ఉచితాలు ఇస్తామని అన్నా కూడా, వారు తీసుకోలేదట. తాము కష్టపడి పని చేసి సంపాదించుకుంటామన్నారట. అలాంటి ఆత్మాభిమానం ఉన్న ప్రజలు ఎంతో గొప్పవారు.

యువత ఉద్యోగాలే కాకుండా, వ్యాపార, వ్యవసాయ రంగాల్లోకి రావాలి. ఎక్కడివాళ్లో వచ్చి ఇక్కడ చక్కగా వ్యాపారాలు చేసి సంపాదించుకుంటున్నారు. 
 
సమాజంలో వ్యాపారం, వ్యవసాయం చేసే వాళ్లను చిన్నచూపు చూడకూడదు.
 
 ఐటీ ఉద్యోగం ఎప్పుడు ఊడిపోతుందో.. అని భయపడుతూ అదేపనిగా పనిచేస్తూ ఆరోగ్యాలు చెడగొట్టుకోకుండా, స్వంతంగా చిన్న పరిశ్రమలు కూడా పెట్టుకోవచ్చు. 
 
విపరీతంగా వస్తువ్యామోహం ఉన్నవారికి ఎంత డబ్బు ఉన్నా సరిపోదు. 
..........................

 
చాలామంది ప్రజలు పాపభీతి లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఎంతసేపూ కోరికలు తీరాలి, కష్టాలు పోవాలి అనుకుంటారు. పాపాలు చేస్తూ ఉంటే కష్టాలు ఎలా పోతాయి? పాపాలు చేస్తే,  వచ్చే జన్మలో ఎన్నో కష్టాలు అనుభవించవలసి వస్తుంది.

  పాపాలు చేయకూడదని సన్నసన్నగా ఒకటిరెండు సార్లు చెప్పి, ఇక  ఫలానా పరిహారాలు చేస్తే కోరికలు తీరుతాయి, కష్టాలు పోతాయి అని చెబుతుంటారు. . పాపాలు చేస్తూ  నలుగురికి సాయం చేస్తే మంచివాళ్లయిపోరు కదా..
 
చావుతో జీవితం అంతంకాదని ఆధునిక శాస్త్రవేత్తలు కూడా ఒప్పుకున్నారు.అందువల్ల అందరూ మనస్సును అదుపులో ఉంచుకుని జాగ్రత్తగా జీవించాలి.
  ..........................
 
సమాజంలో చాలామంది స్వార్ధం, కుళ్లు, కుతంత్రాలతో.. చెడుప్రవర్తనతో ఉంటున్నారు.   ఇలాంటి వాళ్ళ గురించి బాధపడటం అవసరమా? అనిపిస్తుంది. ఎవరి కర్మ వారిది. 
 
అయితే, మంచివాళ్లకు, అభంశుభం తెలియని పసిపిల్లలకు, మూగజీవులకు ఆపదలు రాకుండా దైవము కాపాడితే బాగుండు.

దైవమే దిక్కు.