koodali

Monday, February 26, 2018

అన్ని రాష్ట్రాలు, అన్ని దేశాలు అభివృద్ధి చెందాలి....


ఈ రోజులలో  సరైన  ఉపాధి అవకాశాలు  లేక ఎందరో ప్రజలు   ఇతర రాష్ట్రాలకు ,  విదేశాలకు వెళ్లి అక్కడ ..ఇబ్బందులు  పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సమస్యలు ఉన్నాయి.  


అందువల్ల అన్ని రాష్ట్రాలు, అన్ని దేశాలు  అభివృద్ధి చెందాలి. ఎక్కడికక్కడ   విద్య మరియు   ఉపాధి లభించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. 


స్థానికంగా మా ఉద్యోగాలు మాకే  కావాలి.... అనే పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న  పరిస్థితిలో .. ఎక్కడివారికి అక్కడ ఉపాధి అవకాశాలను కల్పించటం  తప్పనిసరి.
 
మనవాళ్ళు విదేశాలకు వెళ్లే అవసరం లేకుండా స్థానికంగానే ఉపాధి లభించాలి.  రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టే  సంస్థలు స్థానికులకు ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వాలి. 


*******
పరిశ్రమలతో పాటు వ్యవసాయరంగం కూడా అభివృద్ధి చెందాలి. 


సారవంతమైన నేలలు,  ఎన్నో నదులు,  శ్రమించే వ్యక్తులు ఉండి కూడా ..ఇప్పటికీ  భారతదేశం   పప్పుదినుసులను ఇతరదేశాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితిలో ఉండటం  స్వయంకృతాపరాధం.

 పండించిన పంటలను నిల్వ చేసుకునే సౌకర్యాలు లేక  పండిన పంటలు పాడైపోతున్నాయి .  



పండించిన పంటను నిల్వ చేసుకునే సౌకర్యాలను కల్పిస్తే , ఇతరదేశాల నుంచి దిగుమతి చేసుకునే అవసరం ఉండదు. ఎంతో ధనం వృధా కాకుండా ఉంటుంది. 

 ఆహారపదార్ధాల తయారీ సంస్థల ద్వారా కూడా ఎందరికో  ఉపాధి  లభిస్తోంది.

ఇప్పటి యాంత్రిక కాలంలో కొన్ని  పెద్దపెద్ద  పరిశ్రమలవాళ్ళు కూడా ...20 వేలమందికి ఉపాధి కల్పిస్తామని   సరిగ్గా చెప్పలేని పరిస్థితి ఉంది.


అయితే, కడియం తోటల పై ఆధారపడి సుమారు 20 వేలమందికి ఉపాధి లభిస్తున్నదని వార్తల ద్వారా తెలుస్తోంది.
**************

పెద్ద పరిశ్రమలతో పాటు చిన్న, మధ్యతరగతి పరిశ్రమలనూ ప్రోత్సహించాలి...


 పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి కూడా  ఎన్నో దేశాలు  చాలా ఆదాయాన్ని పొందుతున్నారు. ఎంతో మందికి ఉపాధి  అభిస్తోంది. 


*************

దేశంలో పేదరికం పోవాలన్నా, అందరికీ ఉపాధి లభించాలన్నా,  ఆర్ధిక అసమానతలు తగ్గాలన్నా  మనుషుల్లో స్వార్ధం పోవాలి...  నల్లడబ్బు, అవినీతి వంటివి ఉండకూడదు. 


 సంపద కొందరి వద్దే పోగయ్యే పరిస్థితి పోయి , అందరికీ  సంపద పంచబడే పరిస్థితి ఉన్నప్పుడు పేదరికం ఉండదు.



Friday, February 23, 2018

రాజకీయులు .. మరియు...కొన్ని విషయాలు..


విభజన తరువాత రాయలసీమ, ఉత్తరాంధ్ర అనే విభేదాలతో  ఏపీ గొడవలలో మునిగిపోతుందని కొందరు అనుకున్నారు. అయితే, అలా గొడవలు లేకుండా ఉన్నదానితో సర్దుకుని ముందుకు అడుగులు వేస్తున్న తరుణంలో కొందరు హటాత్తుగా రాయలసీమ వెనుకపడిపోతోందంటూ మాట్లాడటం బాధాకరం.


రాష్ట్రాన్ని విడదీయాలనుకుంటే  ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలోనే ఎన్ని ముక్కలు చేయాలో అన్నీ చేసేయవలసింది.  అంతేకానీ,  ఇప్పుడు నాలుగేళ్ళ తరువాత   రాయలసీమ కు అన్యాయం జరుగుతోందంటూ  వేర్పాటు మాటలు మాట్లాడుతున్నారు. 


రాయలసీమపై  నిజంగా  ప్రేమ ఉంటే,  వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రా ప్రాంతాలలో  ప్రత్యేక హోదా వల్ల కలిగే ...పరిశ్రమలకు రాయితీలు  వంటివి  కల్పించండి. అంతేకానీ ఇప్పటికే సమస్యల తో సతమతమవుతున్న ఏపీలో మరిన్ని సమస్యలను సృష్టించకండి. 


విభజన సమయంలో వెనుకబడిన ప్రాంతాలను ఆదుకుంటామని చెప్పి అతికొద్ది నిధులు మాత్రమే ఇచ్చారు. బుందేల్ ఖండ్ కు ఇచ్చినట్లు ఇస్తామన్నారు.  వాళ్లకు వేలకోట్లు ఇచ్చారు.. ఏపీలో వెనుకబడిన ప్రాంతాలకు ఇచ్చినదెంత? 


**************

 ఇప్పటికే సమైఖ్యరాష్ట్రంలో ఏపీ బాగా నష్టపోయింది. రాష్ట్రం నుండి  ఎవరైనా  విడిపోవాలని అనుకుంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు  ?

ఇక మీదట సమైఖ్య రాష్ట్ర ఉద్యమాలు ఎవరూ చేయకపోవచ్చు.  చిన్నచిన్న రాష్ట్రాలు చేయడానికి , డిల్లీ వంటి రాజధాని కట్టిస్తాం అని హామీలు గుప్పించడానికి  కొందరు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు కూడా.

నీటిలభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాలలో నీటి అవసరం తక్కువగా ఉండే పరిశ్రమలను ఏర్పాటు చేయాలి.

నదీపరీవాహకప్రాంతం అయి యుండికూడా  ఆంధ్రప్రాంతం   ఎంతోకాలంగా  నిర్లక్ష్యం చేయబడింది, కనీసం వ్యవసాధారిత పరిశ్రమలను కూడా సరిగ్గా  ఏర్పాటుచేయలేదు. 


***************
 విభజన జరిగి నాలుగు సంవత్సరాలయినా  రాజధాని అమరావతికి 2.. వేలకోట్లు మాత్రమే ఇచ్చారు.  ఈ విధంగా నిదానంగా నిధులు ఇస్తే రాజధాని ఎప్పటికి కట్టాలి? ఈ రోజుల్లో 2..వేల కోట్లకు రాజధాని కట్టగలరా?


 ఒక రాజధానికే దిక్కులేనప్పుడు  రెండో రాజధాని అంటున్నారు.   కేంద్రం సరిపడినన్ని నిధులిస్తే ఎన్ని రాజధానులైనా కట్టొచ్చు. 

జమ్మూ కశ్మీరులోని ప్రత్యేక పరిస్థితి వల్ల అక్కడ రెండురాజధానులు ఉన్నాయి . ఏపీలో అలా ఎందుకు కోరుకుంటున్నారో తెలియటం లేదు. 


రెండు రాజధానుల కన్నా,  వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక హోదా  పన్ను రాయితీలు వంటివి అడగటం బాగుంటుంది. రాష్టంలోని అన్ని ప్రాంతాలు చక్కగా అభివృద్ధి చెందాలి.

ఉత్తరాంధ్రలో వైజాగ్ లో  బాగా అభివృద్ధి జరుగుతోంది. అలాగే,  రాయలసీమలో కర్నూలును అభివృద్ధి చేయాలి. తిరుపతి ఆధ్యాత్మిక కేంద్రంగా ఇప్పటికే  అభివృద్ధి చెందింది.


 రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ చక్కగా అభివృద్ధి చెందాలన్నదే అందరి అభిప్రాయం. 

బీజేపీ వాళ్లు కేంద్రంతో సామరస్యంగా మాట్లాడి రాష్ట్రానికి నిధులు తేవాలి ...అంతేకానీ , రాష్ట్రం కన్నా పార్టీనే ముఖ్యం అన్నట్లు మాట్లాడటం ,  నిధులు  సరిగ్గా  ఇవ్వకుండానే  చాలా ఇచ్చేసాం....వంటి మాటలు మాట్లాడటం   బాధాకరం. 


ఇవన్నీ గమనిస్తే ,  రాష్ట్రాలలో ప్రాంతీయపార్టీలు  ( రాష్ట్రాల సమస్యలను పరిష్కరించే పార్టీలు.. )....కేంద్రంలో జాతీయపార్టీలు అధికారంలోకి రావటం బాగుంటుందనిపిస్తోంది. 


విభజన సమయంలో ఏపీకి  బీజేపీ సపోర్ట్ రాకపోయినా ...విభజన తరువాత  బీజేపీ న్యాయం చేస్తుందని భావించి ఉమ్మడి గా అధికారాన్ని ఇచ్చారు ప్రజలు. 

ఇప్పుడు బీజేపీపై   ప్రజలలో వ్యతిరేకత పెరిగింది. ఈ విషయాన్ని  వాళ్లు గ్రహించటం మంచిది. బీజేపీ అంటే అంతోఇంతో సానుభూతి ఉన్నవారికి కూడా వాళ్లంటే వ్యతిరేకత పెరిగేలా ...వారి మాటలు ఉన్నాయి.  ఈ విషయాన్ని గ్రహించకపోతే వారికే నష్టం.


ఈ రోజుల్లో చాలామందిలో స్వార్ధం ఎక్కువయింది. మిగతా వారు ఎలాపోయినా ఫరవాలేదు.. మేము బాగుంటే చాలు అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. 


ఇలాంటి  వారు రాజకీయుల్లోనూ, ప్రజలలోనూ కూడా ఉన్నారు. ఇలాంటి స్వార్ధపరుల సంఖ్య పెరిగిన సమాజంలో నీతి, నియమాల గురించి ఎక్కువగా ఆలోచించటం వృధాప్రయాస అనిపిస్తుంది.  

ఇతరులను అన్యాయం చేసేవారు దైవం నుంచి తప్పించుకోలేరు.



ఆంధ్రప్రదేశ్ ...... కొన్ని విషయాలు..

 

(Friday, September 16, 2016)

  ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో గమనించదగ్గ కొన్ని విషయాలున్నాయి.

రాజధాని అంటే నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది, 

రాష్ట్రంలో అన్ని ప్రాంతాల వాళ్ళు వచ్చిపోవటానికి రవాణాసౌకర్యం బాగుండాలి...ఇలా ఎన్నో విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి.
...............  


నీటికొరత ఉన్న ప్రాంతాలలో రాజధాని ఏర్పాటు చేస్తే రాజధానికి నీటికొరత ఏర్పడుతుంది.


నీటికొరత ఉన్న ప్రాంతాలలో రాజధాని ఏర్పాటు కన్నా,  ఆ ప్రాంతాలకు నీరు ఇవ్వటం ఎంతో అవసరం.


అందువల్ల నీరు ఉన్న కోస్తాలో రాజధాని ఏర్పాటు చేయటం... రాయలసీమ, ఉత్తరాంధ్రాకు నీటిని ఇవ్వటం అనే ఆలోచన మంచిదే.


నీటికొరత ఉన్న ప్రాంతాలకు నీటిని తరలించి ఆ ప్రాంతాలను సశ్యశ్యామలం చేస్తే అన్ని ప్రాంతాల వారు సంతృప్తి చెందవచ్చు. 


  రాష్ట్రానికి ఒక మూలన రాజధాని ఏర్పాటు కాకుండా ..రాష్ట్రమధ్యన రాజధాని ఏర్పాటు అవటం మంచిదే.

.....................

రైతులకు భూమి అంటే ఎంతో ఇష్టం ఉంటుంది. ఎంత డబ్బు ఇచ్చినా అమ్మటానికి ఇష్టపడరు. 


 తమ భూమిని ఇచ్చిన రాజధాని ప్రాంత రైతులు ఎంతో అభినందనీయులు.


  రాజధాని అభివృద్ధి చెందటం అవసరమే. అయితే, రాష్ట్రం అంతా అభివృద్ధి చెందటం మరింత ముఖ్యం.


రాజధాని అభివృద్ధిని కొంత తగ్గించి అయినా మిగతా ప్రాంతాలను అభివృద్ధి చేయాలి.


రాజధాని క్రమంగా అభివృద్ధి చెందుతుంది.

అమరావతి చుట్టుప్రక్కల  కూడా  కొంతభాగాన్ని వ్యవసాయానికి అట్టేపెట్టి మిగతా భాగాన్ని రాజధానిగా అభివృద్ధి చేస్తామంటున్నారు. అలా చేస్తే మంచిదే.

....................

 రాష్ట్రానికి  పారిశ్రామిక రాయితీలు ప్రకటిస్తే పరిశ్రమలు తరలివస్తాయంటున్నారు.


అయితే, పరిశ్రమలు రావాలంటే రాయితీలు మాత్రమే సరిపోవు.


 పారిశ్రామికవేత్తలు  భూమి తక్కువధరలో కావాలంటారు.


 కోస్తాలో భూమి ధర ఆకాశాన్ని అంటేలా ఉంది.


భూముల రేట్లు బాగా ఎక్కువ ఉంటే ఎన్ని రాయితీలు ఇచ్చినా పరిశ్రమలు రావు. 


అందువల్ల ఎక్కువ పరిశ్రమలను రాయలసీమ  మరియు ఉత్తరాంధ్రాలో ఏర్పాటుచేస్తే తక్కువధరకే భూమి లభిస్తుంది.


అక్కడ ఉద్యోగాలూ లభిస్తాయి.


అయితే పరిశ్రమల వల్ల  కాలుష్యం లేకుండా చర్యలు తీసుకోవాలి.


.....................

 రాష్ట్రంలో రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్రా ....అని కాకుండా అందరము ఒకే రాష్ట్ర ప్రజలం అని భావించాలి.


రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు రాష్ట్రానికి సంబందించిన అందరివీ.
............
 నా అభిప్రాయాలను వ్రాసాను. ఇక ఎవరి అభిప్రాయాలు వారివి. 

**************

 సమైఖ్య ఆంధ్రప్రదేశ్ విడిపోయి చాలా కాలమయింది. సీమాంధ్రుల అభిప్రాయాలకు పట్టించుకోకుండా  విభజన చేసారు. ఇస్తామన్న ప్రత్యేక హోదానూ ఇవ్వలేదు. ప్రత్యేక ప్యాకేజ్ కూ చట్టబద్ధతను ఇవ్వలేదు. వెనుకబడిన ప్రాంతాలకు ఇస్తామన్న రాయితీలను సరిగ్గా ఇవ్వలేదు.

రాష్ట్రప్రజలందరూ మూడు ముక్కలుగా కాకుండా మనందరమూ ఒకటే రాష్ట్రం వాళ్ళం అనే ఐకమత్య భావన పెంచుకోవాలి. ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా అనే పేర్లు వదిలేసి అందరమూ తెలుగువాళ్ళం అనుకోవాలి. అన్ని ప్రాంతాలనూ చక్కగా అభివృద్ధి చేయాలి.  

 తెలంగాణాలో హైదరాబాద్ రాజధానిగా ఎక్కువ అభివృద్ధి చెందినా కూడా అక్కడ  వెనుకబడిన ప్రాంతాలు కూడా చాలా ఉన్నాయి. కొన్ని చోట్ల  ఫ్లోరైడ్ వంటి సమస్యలు ఇంకా ఉన్నాయి. అయినా అక్కడి వాళ్ళెవరూ గొడవలు పడకుండా ఐకమత్యంగానే ఉంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు ఐకమత్యం లేకపోవటం పెద్ద సమస్య. దేశంలో కానీ, రాష్ట్రాలలో గానీ ప్రభుత్వాలు అన్ని ప్రాంతాలనూ చక్కగా అభివృద్ధి చేయాలి. అప్పుడు  దేశం బాగుంటుంది.

 ***************
 తమిళనాడు  వాళ్ళల్లో చాలామంది అప్పుడప్పుడూ ఏమంటారంటే.. తిరుపతి మాదే అంటుంటారు.

 ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని కొందరు  జనాలు...మా ప్రాంతాలు వెనుకబడ్డాయి కాబట్టి, మమ్మల్ని కర్ణాటకలో కలిపేయండని, మరి కొందరు తమిళనాడులో కలిపేయండని  అంటున్నారు.


తమ ప్రాంతాలు వెనుకబడి ఉంటే కష్టపడి అభివృద్ధి చేసుకోవాలి. అంతేకానీ, ఇతర రాష్ట్రాల వారు నవ్వుకునేలా ..మా ప్రాంతాలు వెనుకబడ్డాయి కాబట్టి, మమ్మల్ని ఇతర రాష్ట్రాలలో కలిపేయండి అంటూ మాట్లాడి నవ్వులపాలు కావద్దు.

************************
 అన్ని ప్రాంతాల వాళ్ళు ఒకే రాష్ట్ర ప్రజలుగా కలిసి అభివృద్ధి చెందండి.

 మీలో మీకు ఐకమత్యం లేకుంటే ఆ విషయం బయటకు ధైర్యంగా చెప్పి, రెండు  లేక మూడు రాష్ట్రాలుగా విడిపోయి ఎవరి  ప్రాంతాన్ని వాళ్ళు అభివృద్ధి చేసుకోవాలి.

ఆంధ్రప్రదేశ్ విడిపోవాలనుకుంటే... 

ఉదా..
* ప్రకాశం, కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరు, చిత్తూరు..ఆరు జిల్లాలు  కలిసి ఒక రాష్ట్రంగా ఏర్పడి కర్నూలు  పరిసర ప్రాంతాల్లో కానీ ఇంకెక్కడైనా కానీ  రాజధానిని ఏర్పరుచుకోవచ్చు.


* కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాలు , విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం ఏడు జిల్లాలు .. కలిసి ఇంకో రాష్ట్రంగా ఏర్పడి  విజయవాడలో కానీ, కాకినాడ పరిసర ప్రాంతాల్లో కానీ, ఇంకెక్కడైనా కానీ  రాజధానిని ఏర్పరుచుకోవచ్చు.

ఈ బాధలన్నీ ఎవరు పడతారనుకుంటే అందరూ ఐకమత్యంగా ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి.

********************
 కోస్తా జిల్లాలలో చాలా అభివృద్ధి ఉన్నదని చాలా మంది అనుకుంటారు కాని, అది పూర్తిగా నిజంకాదు. వ్యవసాయంలో ఎక్కువ లాభాలు ఉండవు. తుఫాన్లు, వరదలు, అతివృష్టి, అనావృష్టి..వంటి సమస్యలతో వ్యవసాయంలో ఎన్నో సమస్యలు ఉంటాయి.

కోస్తాలో వ్యవసాయాధారిత పరిశ్రమలు కూడా ఎక్కువ లేవు. కోస్తావాళ్ళు ఇతరప్రాంతాలు, దేశాలు పట్టుకుని తిరుగుతుంటారు. విదేశాల్లో ఐటీ ఉద్యోగాలలో గమనిస్తే.. కోస్తా యువత ఎక్కువగా ఉంటారు. 

కోస్తాలో చాలామంది తల్లితండ్రులు తమ పిల్లలను చిన్నతనం నుండే రాచిరంపాన పెట్టి  చదివించటం,హాస్టల్స్లో వేయటం చేస్తుంటారు. ఈ పిల్లలు విదేశాలకు వెళ్ళి, అక్కడ కూడా విరగబడి పనిచేసి ,ఎప్పుడు పోతుందో తెలియని ఉద్యోగాలు చేస్తుంటారు.

 ఇదే చక్కటి జీవితం అనుకుంటే ఇతర ప్రాంతాల వాళ్లు కూడా చిన్నతనం నుండి చదువుకుని విదేశాలకు వెళ్ళచ్చు కదా! కోస్తా వాళ్ళు విదేశాల్లో బాగుపడిపోతున్నారు.. అనుకోవటం ఎందుకు?

ఇక్కడే సరైన చదువు, ఉద్యోగాలు ఉంటే విదేశాలకు  వెళ్ళే కర్మ ఎందుకు ఉంటుంది. ఉత్తరాంధ్రా, రాయలసీమ నుండి కూడా వలస వెళ్ళే వాళ్ళు ఎక్కువగానే ఉంటారు.

మొత్తంగా చూస్తే స్వాతంత్రం తరువాత కూడా దేశంలో ఇన్ని సమస్యలు, ఇంత వెనుకబాటుతనం  ఉన్నాయంటే.. అందుకు కారకులు కొందరు నిస్తేజమైన పాలకులు,  కొందరు నిస్తేజమైన ప్రజలూ కూడా.

Monday, February 19, 2018

ఆంధ్రప్రదేశ్ ప్రజల స్వయంకృతాపరాధాలు....


జరిగిన విషయాలలో   ఆంధ్రప్రదేశ్ ప్రజల స్వయంకృతాపరాధాలు కూడా ఉన్నాయి.
 ఇప్పుడు చాలామంది ఏపి ప్రజలు విభజన వల్ల అన్యాయం జరిగిందని అంటున్నారు. . .


విభజన తరువాత ఎంతమంది  ఏపీ వాళ్ళు  ఏపీలో పెట్టుబడులు పెట్టారు ? రాష్ట్ర విభజన తరువాత ఎంతమంది ఏపీ వాళ్లు ఏపీలో పరిశ్రమలు గానీ అభివృద్ధికి  కానీ ముందుకు వచ్చారు ? 


సుమారు 10 సంవత్సరాల కాలం తెలంగాణావాళ్ళు విడిపోతామని ఉద్యమాలు చేస్తుంటే,   అప్పుడు కూడా  ఏపీలో అభివృద్ధి గురించి  పట్టించుకోకుండా,  హైదరాబాదులో పెట్టుబడులు పెట్టుకుంటూ  ఉన్నారు.  అప్పుడు  దూరదృష్టి  లేకుండా .... ఇప్పుడు తీరిగ్గా విచారించి ఏం లాభం.

భవిష్యత్తులో  హైదరాబాద్ రెండో రాజధాని అవుతుందేమోనని కొందరు  ఏపీ వాళ్ళు  అనుకుంటున్నారేమో  ? విభజన సమయంలోనే హైదరాబాద్  దేశానికి రెండో రాజధానిగా  ఒప్పుకున్న  పరిస్థితి లేదు. 


  ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు తెలంగాణాలో పెట్టుబడులను పెట్టినా కూడా ..ఆంధ్రప్రదేశ్లో కూడా పెట్టుబడులు  పెట్టి అభివృద్ధిలో పాల్గొనాలి. 

ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలామంది తమ  అభివృద్ధి  వరకే ఆలోచిస్తారు.  తాము ఎక్కడుంటే  అదే  తమ ప్రాంతం అనుకుంటారు. ఎక్కడుంటే అదే మన ప్రాంతం అని మనం  అనుకుంటే   సరిపోదు... అవతలివారు కూడా  మనల్ని  తమవారేనని  అనుకోవాలి కదా!


 హైదరాబాద్ తో కూడిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు వల్ల ఆంధ్ర ప్రదేశ్ విపరీతంగా  నష్టపోయింది. రాజధాని  అని  ఏపీ ప్రజలు చాలామంది   హైదరాబాద్లో పెట్టుబడులు  పెట్టారు.


 అప్పట్లో  హైదరాబాద్ లో కాకుండా,  ఆంధ్రప్రదేశ్ లోనే రాజధాని ఏర్పాటు అయినట్లయితే ,  ఆంధ్రప్రదేశ్ వారి పెట్టుబడులు హైదరాబాద్ లో ఉండేవి కాదు.

బోలెడు కాలం గడిచిపోయింది. ఇప్పుడు అంతా మొదటినుంచీ  పని  అన్నట్లుంది.  ఇప్పటికైనా  హైదరాబాద్లో ఉన్న ఏపీ  వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కూడా పెట్టుబడులు పెట్టి ఇక్కడి అభివృద్ధికి ముందుకురావాలి. 


ఎంతకూ కేంద్రప్రభుత్వాన్నో మరెవరినో ఆడిపోసుకోవటం కాకుండా  ఎవరి రాష్ట్రాన్ని వారు  అభివృద్ధి చేసుకోవటం అవసరం.


************

ఈ మధ్య  ఒకరు ...హైదరాబాద్ లో  చాలా  ఆదాయం ఏపీ  ప్రజల నుంచే  వస్తోంది..వీళ్లందరూ ఏపీకి వెళ్తే నిధుల అవసరం తీరుతుందని  అన్నారు.. ఆసక్తి ఉన్నవారు  ఇక్కడ క్లిక్ చేసి చూడగలరు.  

Hyderabad Andhras key to AP development....

************

Amaravati: NITI Aayog has a sure-fire solution for state’s problem of funds: Let 40 per cent of people in Hyderabad who are of Andhra origin, shift to AP. The taxes they are paying to Telangana state would then go to Andhra. As NITI Aayog vice-chairman Dr Rajiv Kumar made the suggestion in lighter vein to Chief Minister N Chandrababu Naidu here on Thursday but in fact it held the key since Telangana is rich because of tax revenue mainly from Hyderabad.

“NITI Aayog will help you out but it is not a bad idea if Andhra origin people shift to AP,” he said, while assuring Chandrababu Naidu that his institution would help the state in every possible way.....

************

 ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు తెలివితేటలు, కష్టపడే తత్వమూ  బాగా ఉన్నాయి. అయితే, తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచన అంతగా ఉండదు. ఆ ఒక్క విషయంలో కొంత ముందుకు వస్తే ఇక ఏపీ అభివృద్ధి  విషయంలో ముందుకు  వెళ్తుంది.


రాష్ట్ర విభజన సమస్యలు...



రాష్ట్ర విభజన జరిగి చాలాకాలమయింది. అయినా ఆంధ్రప్రదేశ్ కు కొంచెం, కొంచెం ఇవ్వటం  తప్ప , అవసరమయినన్ని  నిధులు ఇవ్వలేదని తెలుస్తోంది.. వెనుకబడ్డ  ఉత్తరాంధ్రా, రాయలసీమకు  ప్రత్యేక ప్యాకేజీ  అతి కొద్దిగా ఇచ్చారు.. పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు  ఎంత ఇచ్చారు ?   విశాఖ రైల్వే జోన్  సంగతి  అలాగే ఉంది. దుగరాజపట్నం లేక మరేదైనా పోర్ట్  అభివృద్ధి చేయాలి. 


   వెనుకపడిన జిల్లాలకు  బుందేల్ ఖండ్ లాంటి ప్యాకేజ్ ఇస్తామని కొద్దిపాటి నిధులతో సరిపెడతామంటున్నారు. రహదారుల కోసం నిధులను అన్ని రాష్ట్రాలకూ ఇస్తారు.  ఏపీకి కొద్దిగా ఎక్కువ ఇచ్చుంటారు. అంతేకానీ, ఇవ్వవలసినవి సరిగ్గా ఇంకా ఇవ్వలేదు.


  ఇతర రాష్ట్రాలకు భారీగా నిధులు ఇస్తున్నారు.  కేంద్రం వద్ద నిధులు లేనప్పుడు  , గుజరాత్లో  వేలకోట్లతో బుల్లెట్ ట్రైన్ కు నిధులు ఎలా వస్తాయి?   దేశంలో  కొన్ని చోట్ల రైల్వే గేట్లే సరిగ్గా లేనప్పుడు  బుల్లెట్ ట్రైన్ అవసరమేముంది?


ప్రకటించిన  విద్యాసంస్థలు  చాలినన్ని నిధులు  అందక  నత్తనడకన సాగుతున్నాయి.  విభజన తరువాత ఆస్తుల పంపకాల  విషయంలోనూ అన్యాయమే జరిగినట్లు తెలుస్తోంది.  ఎన్నో సమస్యలు ఎక్కడివి అక్కడ ఉండగా  విభజన హామీలు  అమలుచేసేశామని కేంద్ర ప్రభుత్వంలోని పార్టీ  చెప్పటం ఆశ్చర్యంగా ఉంది. 


రాష్ట్రానికి న్యాయం చేయనప్పుడు విభజించటం ఎందుకు  చేసారు ? విభజన   తరువాత ఇచ్చే నిధులను  కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇవ్వ వలసిందే. అంతేకానీ, మేము కాబట్టి నిధులు ఇస్తున్నాం  అని  అంటారేమిటో? 


కేంద్రానికి ఏపీ అంటే పెట్రోల్, సహజవాయువు గుర్తొస్తుంది. అక్కడ ..  ఎప్పుడు సహజవాయువులు లీక్ అవుతాయో ? అనే  భయంతో  ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకుని బ్రతుకుతున్నారు.

.....................

అసలు రాష్ట్ర విభజనే అన్యాయంగా జరిగింది.   ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా  విభజన చేసారు. విభజన సమయంలో  ఏపీకి  ప్రత్యేక హోదా ఇస్తామని  జాతీయపార్టీలు చెప్పాయి. తరువాత కేంద్రంలో  అధికారంలోకి వచ్చిన  తరువాత  హోదా ఇవ్వటానికి కుదరదు అన్నారు. 


విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్ సాక్షిగా ఒప్పుకున్నప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వవలసే ఉంటుంది. 

అయితే, ఏపీకి హోదా ఇస్తే, మాకూ ఇవ్వాలని కొన్ని రాష్ట్రాలు   అడగటం జరిగింది. .  హోదా గురించి దేశంలో  గొడవలు మొదలయ్యి , అడిగిన అందరికీ హోదా ఇస్తే,   రాష్ట్రానికి  ఎక్కువ  లాభముండదు. ..ఎలాగూ హోదాతో సమానమైన ప్యాకేజ్ ఇస్తామన్నారు  కదా !  అనుకుంటూ  మొత్తానికి  కారణాలు ఏమైనా ,  ప్యాకేజ్ కు  ఒప్పుకోవటం జరిగింది. 

ఇకపై ఏ రాష్ట్రానికి ప్రత్యేక  హోదా ఇవ్వకూడదని  కొత్తగా అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.  అయితే,  ప్రత్యేక హోదాను కొన్ని రాష్ట్రాల వారికి పొడిగించారని వార్తలు వచ్చాయి. 


  ఇతరులకు పొడిగించినా, పొడిగించకపోయినా,  ఆంధ్రప్రదేశ్కు  ప్రత్యేక హోదా అనేది..   విభజన సమయంలో ఇచ్చిన పాత హామీనే కాబట్టి  , కొత్తగా ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వము ..అనే విషయం ఆంధ్ర ప్రదేశ్ కు  వర్తించదు.

 ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు.. అని తెలిసినా కూడా ప్యాకేజీ సరిగ్గా ఇస్తే చాలులే... అనుకుని  ఆంధ్ర ప్రజలు ఊరుకున్నారు. 


ఇప్పుడు ప్యాకేజీ కూడా సరిగ్గా ఇవ్వకుండా  సరిపెట్టాలని చూడటం అన్యాయం.  ప్యాకేజ్ సరిగ్గా ఇవ్వనప్పుడు  తిరిగి  ప్రత్యేక హోదా  విషయం చర్చకు వస్తుంది. . ప్యాకేజ్  చట్టబద్ధత కూడా చేయలేదు.

......................
     బలవంతపు  విభజన వల్ల కలిగిన  నష్టాన్ని పూడ్చటం కొరకు ఇచ్చే నిధులను కేంద్ర  ప్రభుత్వం ఇవ్వవలసి ఉంటుంది. ఏపీ వాళ్ళు పదేపదే అడగవలసి రావటం  ప్రజలకు  అవమానకరమైన విషయం.

 ప్రజల సమస్యలు  తీర్చడం కోసం రాజకీయపార్టీలు పాటుపడాలి. అయితే,  పార్టీలు తాము ఇచ్చిన హామీల అమలును  సరిగ్గా అమలుచేయకుండా తాత్సారం చేస్తూ  ...ఉద్యమాలు చేయవలసి రావటం ద్వారా  ప్రజలు కష్టపడే పరిస్థితి తేవటం సరైనది కాదు. 


ఇప్పుడు  రాష్ట్రంలో  రాస్తారోకోలు, బందులు  మొదలుపెడితే  రాష్ట్రం వెనుకబడిపోతుంది,  మిగతా రాష్ట్రాలు ముందుకువెళ్తాయి.


విద్యార్ధులు చదువులతోనే కష్టపడుతున్నారు. ఇంకా ఉద్యమాలు చేసే బాధ్యత కూడా  విద్యార్ధులపై వేయడం  కాకుండా,  రాజకీయనాయకులే తాము ఇచ్చిన హామీలు అమలుచేయాలి. 

బందుల ద్వారా జనజీవనం స్థంభించటం, ప్రజలు కష్టపడటం  కాకుండా  ... రోజులో కొద్దిసేపు ర్యాలీలు చేయటం  వంటి ద్వారా ప్రజలు తమ నిరసన తెలియజేయవచ్చు.

 తెలంగాణా ఉద్యమంలో జరిగినట్లు ఆంధ్రప్రదేశ్లో   యువత ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రాకూడదు. ఎవరో చేసిన తప్పులకు యువత ఎందుకు ప్రాణాలు పోగొట్టుకోవాలి ?

....................
   ఆర్ధికవ్యవస్థతో ప్రయోగాల వల్ల బ్యాంకుల ముందు సామాన్యప్రజలు క్యూలలో నిలబడటం జరుగుతోంది కానీ ,  వేలకోట్లు దోచి వేస్తున్న బడా  వారిపైన  , విదేశాలకు నల్లడబ్బును తరలిస్తున్నవారిపైన   కఠినచర్యలు తీసుకోవాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. 

జీఎస్టీ వల్ల లాభాలు  వచ్చే ఎలా ఉన్నా..జీఎస్టీ తరువాత  కొందరు వ్యాపారులు తమకు ఇష్టం వచ్చినట్లు ధరలు పెంచటం వల్ల ప్రజలలో గందరగోళం నెలకొంది. 


 ప్రజలలో నెలకొన్న అభిప్రాయాలను బీజేపీ గమనించకపోతే ఆ పార్టీకే నష్టం.  కాంగ్రెస్, బీజేపీ మాత్రమే కాకుండా జాతీయస్థాయిలో ఇంకో కూటమి  రావాలని ప్రజలు  కోరుకున్నా  ఆశ్చర్యం ఏమీ లేదు.

***************
 విభజన జరిగిన కొత్తలో బీజేపీ వాళ్లు ఏపీ పట్ల సానుభూతితోనే ఉన్నారు. తరువాత కొంతకాలానికి వారిలో మార్పు కనిపించింది.

  రాష్ట్రానికి చెందిన బీజేపీ వాళ్ళు  ఎవరైనా  ..ఇక్కడి  ప్రజల అభిప్రాయాలను  సరిగ్గా అర్ధం చేసుకోకుండా  , కేంద్రానికి సరైన  సమాచారం ఇవ్వటం లేదనిపిస్తుంది. 


ఏపీ పట్ల కేంద్రం వారి వైఖరి మార్పు కనిపించడంలో  కేంద్రం  వాళ్ల రాజకీయాలు   కూడా  కారణం అయి యుండవచ్చు. ఏదైతేనేం ఏపీ ప్రజలను  చిన్నచూపు చూస్తున్నారు.


 ఏపీకి ప్రత్యేక హోదా వస్తే తామూ  హోదా గురించి  అడగొచ్చని  కొందరు ఇతర రాష్ట్రాల వాళ్ళు  ఎదురుచూస్తున్నారు.


***************
 అయినా రెండు రాష్ట్రాలు అయినప్పుడు ఇద్దరు గవర్నర్లను నియమించాలి గానీ ,  ఒకే గవర్నర్ ఏమిటి ? ఏపీకి కొత్త గవర్నర్ ను నియమించాలి.

*************

ఇప్పుడు  కొందరు రాష్ట్ర బీజేపీ  వాళ్ళు  మరీ  విడ్డూరంగా  మాట్లాడుతున్నారు.  రాజధాని కోసం బోలెడు డబ్బు  ఎందుకు ఖర్చుపెడుతున్నారు? అంత డబ్బు  కేంద్రప్రభుత్వం ఎందుకివ్వాలి ?  అంటూ  మాట్లాడుతున్నారు.


  కేంద్రం ఏపీకీ చాలా ఇచ్చింది .. ఇంకా ఇవ్వడానికేమీ లేదు...  ప్రాజెక్టులు ఇప్పుడే కట్టక్కర్లేదు.. పదేళ్లు సమయం ఉంది..అంటూ మాట్లాడుతున్నారు..

  రాజధాని లేదు కాబట్టి , ఢిల్లీ వంటి రాజధాని కట్టిస్తాము..  అని ఎన్నికల ముందు ఎందుకు చెప్పారు?

ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేసిన కాంగ్రెస్ పట్ల  ప్రజలకు  ఎంత  వ్యతిరేకత ఉందో, ఇప్పుడు బిజేపీ పట్ల కూడా  ప్రజలలో వ్యతిరేకత  ఉన్నాకూడా...  రాష్ట్ర బిజేపీ వాళ్లు అంతా బాగుందంటూ కేంద్రాన్ని వెనకేసుకు వస్తున్నారు. 

ఇప్పుడు బిజేపీ పట్ల ప్రజలలో ఉన్న వ్యతిరేకత  గురించి  ఆ పార్టీ వాళ్ళకు ఎందుకు అర్ధం కావటంలేదో ?  ఆశ్చర్యంగా ఉంది.


*******************
 రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిప్రాయాలను పట్టించుకోలేదు. ఇప్పుడు కూడ విశాఖ రైల్వేజోన్ విషయంలో ఇతర రాష్ట్రాలను సంప్రదించాలంటున్నారు. ప్రత్యేక హోదా విషయంలోనూ ఆంధ్రకు ఇస్తే ఇతరరాష్ట్రాలు అడుగుతారన్నారు.  దేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిప్రాయాలకు విలువలేదా?

 అయినా  ఏపీ ప్రజలు   విభజన చేయమని అడగలేదు.  అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలెందుకు కష్టాలు పడాలి ?  నిధులు పొందటానికి ఏపీ వాళ్లు పదేళ్ళు ఎందుకు ఆగాలి? 




నదీ జలాల విషయాలు..



కొన్ని  నదులు ఎక్కడో  పుట్టి  ..  ప్రవహించి.. సముద్రంలో కలుస్తాయి. ఇలా జరగటం ప్రకృతిలో  సహజమైన విషయం.   ప్రజలు నీటిని పొదుపుగా  వాడుకోవాలి.  ఉన్న నీటిని అందరూ పంచుకుని వాడుకోవాలి .  


ఎగువ రాష్ట్రాలైనా, దిగువ రాష్ట్రాలయినా ప్రజలందరికీ నీరు అవసరమే. అయితే,   కొందరు ఎగువ ప్రాంతాల వాళ్ళు  ..తమకు బోలెడు నీరు కావాలంటూ   దిగువకు  సరిగ్గా  వదలకుండా   ఆపటం ప్రకృతికి వ్యతిరేకం. ...నీరు  క్రిందకు వదలం ...అనే హక్కు ఎవరికీ లేదు.


రాష్ట్ర విభజన జరిగింది కాబట్టి   ఆంధ్ర.. తెలంగాణా  రెండు రాష్ట్రాలకూ విడిగా కేటాయింపులు జరగాలంటున్నారు. మరి `భవిష్యత్తులో మహారాష్ట్ర విభజన జరిగితే ...అప్పుడు ఆ రెండు రాష్ట్రాలకూ వేరువేరుగా కేటాయింపులు జరిపితే దిగువ రాష్ట్రాల పరిస్థితేమిటి ? 


ఇప్పుడు కూడా  ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర వాళ్లు ఇబ్బడిముబ్బడిగా నీటి ప్రాజెక్టులు కట్టుకుంటున్నారు. వాళ్ళకు దిగువ రాష్ట్రమైన తెలంగాణా  వాళ్ళు ఏపీ  వాళ్లను ఆడిపొసుకోవటం తప్ప ,  ఎగువ రాష్ట్రాలను ఏమనలేక   వారితో  స్నేహంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు.


భవిష్యత్తులో ఎగువ రాష్ట్రాల వాళ్లు మరిన్ని ప్రాజెక్టులు కట్టి   క్రిందికి చుక్క నీరు రాకుంటే అప్పుడు పరిస్థితి ఏమిటో ?

నీటి విషయంలో గొడవలు తగ్గాలంటే న్యాయబద్ధంగా ఎవరికి రావలసిన వాటాను వారికి కేటాయించే పెద్దమనుషులుండాలి. ఇందులో ఎవరి వాదన వారిదే  అన్నట్లు  ఉండే గొడవలు తప్ప చేయగలిగిందేమీ లేదు. రాజకీయాలు కూడా ఉంటే అసలే చెప్పనక్కర లేదు.



 సముద్రపు నీటిని మంచి నీటిగా మార్చుకుని వాడుకోవచ్చు కానీ, అందువల్ల మిగిలిన ఉప్పువల్ల వాతావరకాలుష్యం వంటి సమస్యలు ఉంటాయి. నీటిని పొదుపుగా వాడుకుంటూ , న్యాయబద్ధంగా ఎవరి వాటా వారు  వాడుకుంటే సమస్యలు రావు.  

********

  ఆంధ్రప్రదేశ్ వాళ్లు ఎన్నో సహజవనరులున్నా కూడా, రాష్ట్రాన్ని సరిగ్గా అభివృద్ధి చేసుకోలేకపోతున్నారు.. తెలివితేటలు ఉండికూడా ఎప్పుడూ ఇతరరప్రాంతాలకు, ఇతరదేశాలకు వలసలు పోతుంటారు. మాకు సహాయం చేయండి..అంటూ ప్రతిచిన్నవిషయానికి కేంద్రాన్ని అడుగుతుంటారు.

ఏపి వాళ్ళు ప్రతిదానికి ఇతరులపై ఆధారపడటం కాకుండా, వారి రాష్ట్రాన్ని వారు అభివృద్ధి చేసుకోవాలి. వారి సమస్యలు వారు పరిష్కరించుకోవాలి. వనరులు, దేవాలయాల విషయాలు, అన్నిప్రాంతాల సమస్యలు తమకుతాము పరిష్కరించుకోవాలి.
 
 ఎవరేది చెబితే అది నమ్మటం కాకుండా, ప్రజలు విచక్షణతో ఉండాలి.
ఇతరరాష్ట్రాలతో కలిసి ఉండే నదీజలాల వంటివి అలా ఉంచితే, తమరాష్ట్రంలోని సమస్యలు తామే పరిష్కరించుకోవటానికి ప్రయత్నించాలి.


ఏపీ వారి పట్ల ఇప్పటికీ కొందరి ద్వేషభావం...


  ఇప్పటికీ కొందరు తెలంగాణా వాళ్ళ మాటల్లో ఏపీ ప్రజల పట్ల ద్వేషభావం ఉన్నదని తెలుస్తోంది  కాబట్టి  ఇవన్నీ  వ్రాయటం జరిగింది.. అయితే,  ఏపీ పట్ల సానుభూతి చూపిస్తున్న  ప్రొఫెసర్ కె.  నాగేశ్వర్ గారు  వంటి తెలంగాణా వాళ్ళూ ఉన్నారు.

  విభజన జరిగి ఆంధ్రప్రదేశ్ నష్టపోయి   ఉన్నా కూడా  ఇప్పటికీ కొందరు తెలంగాణా  వాళ్ల మాటలలో ఏపీ ప్రజలంటే  ద్వేషభావం  ఉంటోంది. ఇలా  ద్వేషభావం ఉండటం  అత్యంత బాధాకరం.

ఏపీ వాళ్లు దోపిడీదార్లయితే  సీమాంధ్ర  ఇలా వెనుకబడి ఉండేది కాదు. కొందరు పెట్టుబడిదారులు సమాజ  సంపదను  దోచుకున్న మాట విషయం వాస్తవమే.  అయితే,  సమాజసంపదను దోచుకున్న వారిలో  అన్ని  ప్రాంతాల  వాళ్లూ ఉన్నారు. తెలంగాణా  వాళ్ళు  కూడా  ఉంటారు.


ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రాంతం దోచుకునుంటే ... విభజన  జరిగిన వెంటనే తెలంగాణా సంపన్న రాష్ట్రం గా ఎలా మిగిలింది ?  ఆంధ్రప్రదేశ్ పేదరాష్ట్రంగా ఎలా మిగిలింది ?


******************

కొందరు  తెలంగాణా వాళ్లు ఏమంటారంటే, ఏపీ వాళ్లు మా ఉద్యోగాలను దోచుకున్నారు, మా నీటిని దోచుకున్నారు.. అన్నారు.

ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా  స్థానికులు..వలసవాదులు..అనే  సమస్యలు వస్తున్నాయి. ఒకే భాష వారిలో కూడా  స్థానికులు..వలసవాదులు..అనే  సమస్యలు  వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా రావడంలో ఆశ్చర్యం లేదు.

   ఆంధ్ర వాళ్ళ వల్ల మా ఉద్యోగాలు పోతున్నాయి.. అని కొందరు తెలంగాణా  వాళ్ళు అన్నారు.  మరి ఎందరో  తెలంగాణా వాళ్ళు  ఉద్యోగాల  కోసం  ఇతర దేశాలకు కూడా వెళ్తున్నారు కదా!  వీళ్ళ వల్ల  అక్కడి స్థానికుల  ఉద్యోగాలు తగ్గుతాయి కదా!


ఇంకో విషయం ఏమిటంటే,  నదులు అందుబాటులో   ఉండే ప్రాంతాలను నదీ పరీవాహక ప్రాంతాలంటారు.

అయితే, ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలేమిటంటే, కొన్ని ప్రాంతాలు ఎలా ఉంటాయంటే,  నదులు ప్రవహిస్తున్నా కూడా నీరు భూమికి  తేలికగా  అందనంత దూరంలో ఉంటుంది.  అంటే , భౌగోళిక పరిస్థితి వల్ల   నదుల నీరు  వాడుకోవాలంటే ఎత్తిపోతల ప్రాజెక్టులు అవసరమవుతాయి.

ఉదా..తెలంగాణాలో  నదులు ఉన్నా కూడా,  భౌగోళిక పరిస్థితి వల్ల ఎత్తిపోతల ప్రాజెక్టులు కట్టడం తప్పనిసరి.  ఇలాంటి ప్రాంతాలు పేరుకి  నదీపరీవాహకప్రాంతాలే కానీ,  నీరు అందుబాటులోకి రావాలంటే చాలా ఖర్చవుతుంది..


 ఏపీలోని  కృష్ణా, గోదావరి  ప్రాంతాలలో ఎక్కువ భాగం  పల్లంగా ఉంటాయి కాబట్టి , అక్కడ నీరు అందివ్వాలంటే    పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెట్టి   బోలెడు  ఎత్తిపోతల పధకాలు కట్టనవసరం లేదు.

అందువల్ల,   నీరు సులభంగా ప్రవహించే ఆంధ్రప్రదేశ్లోని  కృష్ణా, గోదావరి ప్రాంతాల లో    కొంతవరకు    వ్యవసాయం  అభివృద్ధి చెంది ఉండవచ్చు.  అంతేకానీ, తెలంగాణాను చిన్నచూపు చూశారనుకోవటం సరైనది కాదు.


ఎత్తిపోతల ప్రాజెక్టులు కట్టాలంటే వేలకోట్ల డబ్బు అవసరమవుతుంది.  సమైఖ్య రాష్ట్రంలో  తెలంగాణా ప్రాంతంలో     నిర్మించిన   ఎత్తిపోతల పధకాలన్నీ  కేవలం   తెలంగాణా జిల్లాల  నుంచి వచ్చిన ఆదాయం తోనే కట్టారా?
......................

ఇంకో  విషయం ఏమిటంటే ,    రాజధాని కాబట్టి హైదరాబాద్ కు  అందరూ వచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో  మిగతా ప్రాంతాలలో ఎక్కువగా అభివృద్ధి జరగలేదు.. వ్యవసాయాధారిత పరిశ్రమలు కూడా  అభివృద్ధి కాలేదు ..ఏపీ  వాళ్లు కూడా తమ పెట్టుబడులను హైదరాబాద్ చుట్టుప్రక్కలే పెట్టారు.


కేంద్ర సంస్థలు ఎక్కువగా హైదరాబాద్   చుట్టూనే  ఏర్పాటు చేసారు.ఈ కారణాలతో  ఎక్కువమంది  హైదరాబాద్ కు  రావటం జరిగింది. ఎక్కడికక్కడ ఉపాధి ఏర్పాటు చేసి ఉంటే హైదరాబాద్   వెళ్ళవలసిన అవసరమేముండేది ?


సీమాంధ్రులు  విశాలాంధ్ర కోసం  తమ ప్రాంతములో రాజధానిని  త్యాగం చేశారు.  . విభజన తరువాత   తమ ప్రాంత అభివృద్ధిని కూడా పట్టించుకోలేదు.
 

****************
తెలంగాణా జిల్లాలలో సీమాంధ్ర జిల్లాల కన్నా అభివృద్ధి బాగానే ఉందని శ్రీ కృష్ణ కమిటీ వివరించారు కదా !

ఉమ్మడిరాష్ట్రంలో తెలంగాణాకు అన్యాయం జరిగిందని  కొందరు అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో  ఏ ప్రాంతంలోనూ  సరైన అభివృద్ధి  జరగలేదు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్ళయినా  భారతదేశంలో  జరగవలసినంత అభివృద్ధి జరగలేదు.  ఈ దుస్థితికి పాలకులు  మరియు ప్రజలు కూడా  కారణం.

***************

కొందరు ఏమంటారంటే , నాగార్జునసాగర్ విషయంలో ఆంధ్రవాళ్ళు అన్యాయం చేసారంటారు. ఏమిటి ఆంధ్రవాళ్ళు చేసిన అన్యాయం?

ఆంధ్ర.. తెలంగాణా.. రాయలసీమ.. ఉత్తరాంధ్ర...ప్రాంతాలకు నీరు అవసరం కదా! 


ఆ రోజుల్లో .. ఉమ్మడి మద్రాసు రాష్ట్రము  కృష్ణానది నీటిని తమిళ దేశానికి తీసుకుపోవుటకు సన్నాహాలు చేయుట మొదలుపెట్టింది. ....( అక్కడ కావేరి నది ఉన్నా కూడా .. ఆ నీరు చాలటం లేదని ,  ఎక్కడో  ఉన్న కృష్ణానీటి కోసం వారి ప్రయత్నం..)

 ఇలాంటి పరిస్థితిలో.. నదుల పరీవాహక ప్రాంతాల వాళ్ళయిన ఆంధ్రవాళ్ళు.. తమ నీటిని నదులకు  దూరంగా ఉన్న ప్రాంతాలకు  తరలించుకుపోతుంటే  అడ్డుకుని,  నాగార్జునసాగర్  ఏర్పాటుకు ఎంతో శ్రమించారు. ఇందులో  ఆంధ్రవాళ్ళు చేసిన అన్యాయం ఏముంది? 

***********

కె.సి.ఆర్. గారికి తెలుగు భాష అంటే ఎంతో ఇష్టం అనీ తెలుగువాళ్ళు కలిసిమెలిసి ఉండాలని కోరుకునేవారనీ వార్తా పత్రికలలో చదివాను. మరి ప్రత్యేక తెలంగాణా వాదాన్ని ఎందుకు ప్రచారం చేసారో ? ఆశ్చర్యంగా అనిపిస్తోంది......

కె.సి.ఆర్. గారు తెలంగాణాకే పరిమితం కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ప్రాతినిధ్యం వహించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసము ఉద్యమాలు చేస్తే ఎంతో బాగుండేది.

  రాష్ట్ర విభజన కోరకుండా ఉమ్మడిరాష్ట్రం లో  కొత్తపార్టీ పెట్టి గెలిచి ఉంటే... సమైఖ్య రాష్ట్రంలో  అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసే అవకాశం లభించి ఉండేది కదా !

అలా చేసి ఉంటే  , రాష్ట్రాన్ని విభజించిన వారిలో ఒకరిగా చరిత్రలో ఉండటం కన్నా, రాష్ట్రంలోని  అన్ని ప్రాంతాలనూ  అభివృద్ధి చేసిన  వారిగా చరిత్రలో  ఉండే అవకాశం ఉండేది కదా ! 

 **************
ఈ మధ్య  ఒకరు ...హైదరాబాద్ లో  చాలా  ఆదాయం ఏపీ  ప్రజల నుంచే  వస్తోంది..వీళ్లందరూ ఏపీకి వెళ్తే నిధుల అవసరం తీరుతుందని  అన్నారు.. ఆసక్తి ఉన్నవారు  ఇక్కడ క్లిక్ చేసి చూడగలరు.  
Hyderabad Andhras key to AP development....





Friday, February 16, 2018

పోలవరం ప్రాజెక్ట్ ...



ఈ ప్రాజెక్ట్ వల్ల ఆంధ్రప్రదేశ్కు అనేక ఉపయోగాలున్నాయని అంటున్నారు. నీరు  ఉంటే సుభిక్షంగా ఉంటుంది. అందువల్ల నీటిని పొదుపుగా వాడుకోవాలి. నీటిని వృధాచేయకూడదు. 


చెక్ డ్యాములు, ఇళ్ళ వద్ద , పొలాల వద్ద వర్షపు నీటిని ఒడిసిపట్టే  విధానాల  ద్వారా వర్షపునీటిని ఒడిసిపట్టి  నిలువ చేసే విధానాల గురించి రాష్ట్రప్రభుత్వం విస్త్రుతంగా ప్రచారం చేస్తోంది. ప్రజలు  వీటిపై మరింత శ్రద్ధ తీసుకోవలసిన అవసరం  ఉంది.  

నీటి వసతి అతి తక్కువగా ఉన్న రాజస్థాన్ వంటి ప్రాంతంలో చెక్ డ్యాములు..వంటి   పద్ధతుల ద్వారా   గణనీయంగా  నీటిని పెంచుకుని పంటలను పండిస్తున్నారని వార్తలు వచ్చాయి. 

కొందరు  తెలుగువాళ్లు రాజస్థాన్ వెళ్ళి  ఈ పద్ధతులను అక్కడి వారికి నేర్పిస్తున్నారట. ఇక్కడి తెలుగువాళ్లు కూడా    ఆ విధానాలను అవలంబించి లాభం పొందవచ్చు. 

  పోలవరం ప్రాజెక్ట్ చాలా పెద్దది.  పోలవరం ప్రాజెక్ట్ కట్టడానికి అయే వ్యయం పూర్తిగా తామే భరిస్తామని కేంద్రం హామీ ఇచ్చారు. అయితే, ఇప్పటికి 3 వేల కోట్లు మాత్రమే ఇచ్చారట. 

నిర్మాణ వ్యయం నానాటికీ పెరుగుతూ వస్తోంది. ప్రాజెక్ట్ వల్ల నిర్వాసితులైన వారికి పరిహారం,  పునరావాసం వంటి వాటికే 40 వేల కోట్లు ఖర్చవుతాయంటున్నారు. 

 నిర్వాసితుల  పరిహారం, పునరావాసం..వంటివి కూడా ప్రాజెక్టు వ్యయంలో భాగమే కదా! 

మొత్తం అన్నీ కలిపి సుమారు 50 వేల కోట్ల పై వరకూ ఖర్చవుతుందని అంటున్నారు.  మరి  ఇంత డబ్బు  కేంద్రం ఎప్పుడో ఇస్తారో ?  

 ప్రాజెక్ట్  డిజైన్ కొంత మార్చాలని  కొన్ని రాష్ట్రాలు చెబుతున్న    అభ్యంతరాలు ఉండనే ఉన్నాయి.  ఈ విషయాలతో  ప్రాజెక్ట్ సంగతి ఏమవుతుందో తెలియదు. 

 ఇవన్నీ తేలే లోపు  రాజస్థాన్ తరహా నీటి విధానాలను  ఆంధ్రప్రదేశ్లో కూడా  అమలు చేస్తే బాగుంటుంది. 

భారీ ప్రాజెక్టుల వల్ల భూకంపాలు, మరియు కొన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయని కొందరు చెబుతున్నారు. అయితే,   ఈ విషయాలను   పెద్దగా  పట్టించుకోకుండా భారీ ప్రాజెక్టులు కడుతున్నారు. 

***************


ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, పోలవరం ప్రాజెక్ట్  విషయంలో భద్రాచలంలో శ్రీ  సీతారాములవారి దేవాలయం  ముంపుకు  గురి అవుతుందేమోనని కొందరు సందేహిస్తున్నారు.

 కొందరు  దేవాలయప్రాంతానికి   ఎటువంటి ప్రమాదమూ ఉండదంటున్నారు.

 ఏదిఏమైనా  సీతారాములవారి దేవాలయం ఉన్న ప్రాంతానికి ఎటువంటి  ముప్పు లేకుండా  జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉంది.

***********************

 పోలవరం ఒకే భారీ ప్రాజెక్టు గా  కాకుండా  విస్తీర్ణం తగ్గించుకోవటం ,   ప్రాజెక్ట్  ఎత్తు కొంత తగ్గించటం   (సుమారు 5  లేక 10 అడుగులు వరకు..)  లేక  రెండు  మధ్యతరహా ప్రాజెక్టు లుగా   కట్టుకుంటే  ఇబ్బందులు  తగ్గుతాయేమో?

 కొన్ని దేశాల్లో అండర్  గ్రౌండ్ డ్యామ్స్  కూడా కడుతున్నారట. 

  భారీ ప్రాజెక్టుల కన్నా చిన్న, మధ్యతరగతి  ప్రాజెక్టులు మేలు. ఒక పెద్ద భారీ  ప్రాజెక్టు బదులు  రెండు మధ్యతరగతి  ప్రాజెక్టులు నిర్మించుకోవటం సురక్షితం. 

**********
 రాజధానికి 3 వేల కోట్లు ఇచ్చి  ... అమ్మో ! ఇప్పటికే చాలా ఇచ్చేసాం...పోలవరం కట్టడానికి కాలపరిమితి   లేదు...10 ఏళ్ల వరకూ కూడా  కట్టుకోవచ్చు..అంటున్న వాళ్ళు పోలవరానికి 40 వేల కోట్లు ఎప్పుడు ఇస్తారో ? 

పోలవరం  ప్రాజెక్ట్ పరిస్థితి ఏమవుతుందో ... తెలియని  పరిస్థితిలో  అయోమయంలో ఉండేకన్నా,    డిజైన్  కొంత మార్చి   2019 కల్లా  పోలవరం పూర్తిచేయవచ్చనిపిస్తోంది. 

ఎడారిలో జలసిరులు గురించి  ... ఆసక్తి ఉన్నవారు  ఇక్కడ క్లిక్ చేసి చూడగలరు...

ఎడారిలో జలసిరులు | Special Report on Rajasthan Water Crisis ...




Monday, February 12, 2018

ఓం..



రాబోయే శివరాత్రి సందర్భంగా  అందరికి  శుభాకాంక్షలండి.




Saturday, February 10, 2018

ఓం ..శ్రీ శనిదేవులు...కొన్ని విషయములు..


శ్రీ శనిదేవునికి వారి అర్ధాంగికి వందనములు. 


శింగణాపూర్ లో శ్రీ శనేశ్వర భగవానులు తాను స్వయంభూ అవతార శిలారూపం నుండి సృష్టినంతా వీక్షిస్తూ జీవుల్ని పాలిస్తున్నారు.

కర్మపాశవిముక్తి దేవత గ్రహసార్వభౌమునికి మానవకృతపీడ,దోషాలు ఆపాదించడము దేవత యెడ మహాపరాధమవుతుంది.

 సకలజీవరాశులయెడ కృపాదృష్టి గల గ్రహదేవత లోకోద్ధరణ కాంక్షించి భూస్థలిపై శిలామూర్తియై అవతరించారు.
...........

 జీవి యొక్క రాశి చక్రములో శనిగ్రహదేవత , జన్మస్థానము నందు,  అష్టమ, ద్వాదశ యందు , అర్ధాష్టు యందు సంచరించునపుడు శోధించి జీవియొక్క గతజన్మల కర్మానుఫలంగా శిక్షకు గురిచేస్తారు . దీన్ని శనిదోషముగా భావించడము దైవము యెడ మహాపరాధము. అని పెద్దవారు తెలియజేసారు.

ఆయా స్థానములలో గ్రహరాజు సంచరించుకాలంలో.. శనిదేవుని పూజ చేయటం మంచిది.

దశరధుల వారు చేసిన శనిదేవుని స్తోత్రమును చదివినా, విన్నా మంచిదని పెద్దలు తెలియజేసారు.


 

Monday, February 5, 2018

మూఢాచారాల వల్ల కలిగే నష్టం కన్నా...ఆధునిక కాలంలో అభివృధ్ధి పేరుతో.....


ఆధునిక విజ్ఞానం అయినా ..ఆధ్యాత్మికత అయినా స్వార్ధ ప్రయోజనాలకు వాడకూడదు..


ఆధునిక విజ్ఞానాన్ని కొందరు తమ స్వార్ధానికి వాడుకుంటున్నట్లే ....ఆధ్యాత్మికతను కూడా కొందరు తమ స్వార్ధ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు.


కొందరు స్వార్ధం వల్ల , మరి కొందరు  తెలిసీతెలియనితనం వల్ల ..సమాజంలో కొన్ని మూఢాచారాలను వ్యాపింపచేశారు.


.........................

అయితే, మూఢాచారాల వల్ల సమాజానికి కలిగే నష్టం కన్నా... గ్లోబల్ వార్మింగ్ వంటి   వాటి  వల్ల  ప్రపంచానికి   కలిగే  నష్టం ఎక్కువ. 

.......................
 ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా  వాతావరణపరిస్థితిలో  విపరీతంగా మార్పులు వచ్చాయి.


 విపరీతమైన ఎండ వేడి, విపరీతమైన చలి, వరదలు, తుఫాన్లు..    పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రపంచంలో  క్లిష్టమైన పరిస్థితి  ఏర్పడవచ్చంటున్నారు.


ఆధునిక కాలంలో అభివృధ్ధి పేరుతో  ప్రపంచానికి, పర్యావరణానికి, కోట్లాది మూగజీవులకు ఎంతో హాని కలుగుతోంది.


పరిశ్రమల ద్వారా విడుదల చేస్తున్న ప్రమాదకర రసాయన వ్యర్ధాలు  నదులలో , సముద్రాలలో కలసి, భూమిలో ఇంకి,  ఆ నీటితో   పండించిన ఉత్పత్తులు తినటం వల్ల   మనుషులు, ఇతర జీవులు అనేక రోగాల బారిన పడటం జరుగుతోంది. 


   ప్లాస్టిక్  వంటి  వాటివల్ల కలిగే కొన్ని నష్టాలను అనుభవిస్తూనే ఉన్నాము.  ఇలా చాలా ఉంటాయి. 



ఇక అణు కర్మాగారాలనుంచీ విడుదలయ్యే అణువ్యర్ధాలను ఎక్కడ వదలాలన్న దానికి  సరైన  పరిష్కారం ఏమీ లేదు.

 ఆధునిక ఆవిష్కరణల వల్ల కొన్ని ప్రయోజనాలు కలుగుతున్నాయి.

కొన్ని విపరీత ఆవిష్కరణల వల్ల ప్రమాదాలూ కలుగుతున్నాయి.

ఆధునిక విజ్ఞానం అంటే నాకు ..వ్యతిరేకత ఏమీ లేదండి. 


ఆ విజ్ఞానం హాని చెయ్యకుండా ప్రపంచానికి ఉపయోగపడాలన్నదే నా అభిప్రాయం.

 గ్లోబల్ వార్మింగ్ వంటి  సమస్యల గురించి  అందరూ ఆలోచించవలసిన అవసరం ఎంతో ఉంది. 




Friday, February 2, 2018

వైద్యం..కొన్ని విషయాలు...



ఇంతకు ముందు మేము ఉన్న ఊరిలో .. ఇరుగుపొరుగు ఇళ్ళల్లో  ఒక లేడీ డాక్టర్ గారు లివర్ వ్యాధి వల్ల మరణించారు. ఆమె గమనించేసరికే వ్యాధి ముదిరి పరిస్థితి చేయిదాటి పోయిందట.

ఇంకొక ఆమె  కాన్సర్ వ్యాధితో మరణించారు.  కాన్సర్ అని తెలిసేవరకూ ఆమె ఆరోగ్యంగానే ఉండేవారు. వ్యాధి ఉన్న లక్షణాలేవీ తెలియలేదు. కాన్సర్ అని తెలిసిన కొన్ని నెలలకే ఆమె మరణించారు.

ఇప్పుడు మేము ఉన్న ఊరిలో .. కొన్ని రోజుల క్రిందట మా వీధిలో ఒకాయన లివర్ వ్యాధి వల్ల సడన్ గా మరణించారు. అంటే, మూడునెలల క్రితం మాత్రమే ఆ వ్యాధి ఉన్నట్లు వాళ్ళకు తెలిసిందట. 

 కిడ్నీ, కాన్సర్ వ్యాధిన బారిన పడుతున్న వారిలో పిల్లలు, మధ్యవయస్కులు, పెద్దవాళ్లు అని తేడా లేకుండా జబ్బులు వస్తున్నాయి.

ఇవన్నీ గమనించిన తరువాత ... ఈ రోజుల్లో వ్యాధులు బాగా పెరుగుతున్నాయనిపించి కొన్ని విషయాలను వ్రాసాను.

అయితే ,  అనారోగ్యాలు తక్కువగా వచ్చేవారు కూడా సమాజంలో ఉన్నారు.

వ్యాధులు రావటానికి గల కారణాలను గుర్తించి వీలైనంతలో జాగ్రత్తలు పాటించితే అనారోగ్యాలు రావటం తగ్గుతాయి.
..........................

ప్రాచీనకాలంలో ఆయుర్వేదంలో  గొప్పప్రావీణ్యత కలిగిన సుశ్రుతుడు, చరకుడు వంటి గొప్పవైద్యులు ఉండేవారు. సుశ్రుతుడు ఆ రోజుల్లోనే శస్త్రచికిత్సలు చేయటంలో గొప్ప నైపుణ్యం కలిగినవారంటారు.

ఇక వైద్యులైన అశ్వనీకుమారులు ..చ్యవన మహర్షి  యొక్క అంధత్వాన్ని పోగొట్టి, యవ్వనవంతునిగా చేసిన కధ చాలామందికి తెలుసు.


 రామాయణంలో హనుమంతులవారు  సంజీవని మూలిక తేవటం..లక్ష్మణుడు కోలుకోవటం  జరిగింది.


 ఇవన్నీ గమనిస్తే ప్రాచీనకాలంలోనే  వైద్యశాస్త్రం ఎంతో గొప్పగా ఉండేదని తెలుస్తుంది.


 ప్రాచీనకాలపు ఆయుర్వేద వైద్య విజ్ఞానం ఈ రోజుల్లో నిర్లక్ష్యానికి గురయింది. ఎంతో విజ్ఞానాన్ని మనం పోగొట్టుకున్నాం.

........................
 పూర్వం  వాళ్ళు  ప్రతి  చిన్న  అనారోగ్యానికి  వెంటనే   హాస్పిటల్స్ కు  పరిగెత్తేవారు  కాదు.


  ఇంట్లోని  బామ్మగారు  మొదలైన  పెద్దవాళ్ళు  వంటింట్లోని  పదార్ధాలను  కలిపి  మందుగా  ఇచ్చేవారు.  అవి  వేసుకుంటే  కడుపునొప్పి,  అజీర్ణం  వంటి  ఎన్నో  అనారోగ్యాలు  తగ్గిపోయేవి.

 బామ్మలు  పెద్ద  చదువులు   చదవకపోయినా  తరతరాలుగా  వారసత్వంగా   నేర్చుకున్న  చిట్కా  వైద్యంతో  కుటుంబసభ్యుల  రోగాలను  తగ్గించేవారు.

  ఈ  రోజుల్లో   కూడా    కొందరు  వ్యక్తులు   తాము    వారసత్వం  ద్వారా  నేర్చుకున్న  ప్రాచీన  వైద్యం  ద్వారా   ప్రజలకు    చక్కటి    వైద్య  సహాయాన్ని  అందిస్తున్నారు.

 డబ్బు  ఆశలేకుండా  సేవాదృక్పధంతో  ప్రజలకు   వైద్యాన్ని  అందించే  మంచి వాళ్ళను  అనుమానించటం సబబు కాదనిపిస్తుంది .

.....................................

ఇంగ్లీష్  వైద్యం వల్ల కూడా ఉపయోగాలున్నాయి.

 ఎన్నో రోగాలను తగ్గించటంలో, ఎవరికైనా విపరీతంగా నీరసం వచ్చినప్పుడు సెలైన్ ఎక్కించటానికి, ఆపరేషన్స్ అవసరమైనప్పుడు చాలా ఉపయోగపడుతుంది.
 

రేబిస్ వ్యాధికి టీకా కనిపెట్టిన లూయి పాశ్చర్ గారు గొప్ప వారు.
...............

హోమియో వైద్యాన్ని చాలామంది నమ్మరు. అయితే ,  హోమియో కూడా బాగా పనిచేస్తుంది.


నేను చిన్నతనంలో టాన్సిల్స్ వల్ల చాలా బాధపడ్డాను. 


ఇక, వేసవిసెలవులలో నాకు టాన్సిల్స్ సర్జరీ చేయించటానికి మా పెద్దవాళ్లు సిద్ధమవగా , ఒక హోమియో వైద్యులు పరిచయమయి , టాన్సిల్స్ తగ్గటానికి హోమియో మందులు ఇవ్వటం జరిగింది. 

అంతే టాన్సిల్స్ బాధ తగ్గిపోయింది. ఇప్పటివరకూ మళ్లీ ఇబ్బంది రాలేదు.


***************
  నా విషయంలో,  హోమియో వైద్యం ద్వారా  టాన్సిల్స్ సమస్య పూర్తిగా తగ్గింది. 

 ఆశ్చర్యమేమిటంటే .. హోమియో ద్వారా చాలామందికి జబ్బులు తగ్గటం కనిపిస్తున్నా  కూడా ,  హోమియో వైద్య విధానం  శాస్త్రీయం కాదని కొందరు అనటం విడ్దూరంగా ఉంటుంది.

 ఇలాంటి వారి దృష్టిలో శాస్త్రీయత అంటే అర్ధం ఏమిటో ?

అయితే ,  వైద్యం విషయంలో.. రోగాన్ని తగ్గించటంలో డాక్టర్ కు ప్రతిభ  ఉండాలి  మరియు రోగి కూడా డాక్టర్ చెప్పినట్లు మందులు  వేసుకోవాలి. 


డాక్టర్ రోగాన్ని సరిగ్గా  కనిపెట్టలేకపోయినా... రోగి సరిగ్గా మందులు వేసుకోకున్నా జబ్బు తగ్గకపోవచ్చు. ఇందుకు వైద్యశాస్త్రాన్ని తప్పుపట్టకూడదు.

************* 

  మాకు అనారోగ్యాలు తక్కువగానే వచ్చాయి. దైవానికి అనేక కృతజ్ఞతలు.
*****************

(Wednesday, December 16, 2015

వైద్యం..కొన్ని విషయాలు...)

 

సైన్స్... శాస్త్రీయత మరియు కొన్ని విషయాలు.



 ఈ  రోజుల్లో   ప్రతిదానికి   సైన్స్,  శాస్త్రీయత  అంటున్నారు.  అలా  ఆలోచిస్తే   ఆధునిక  సైన్స్ కు  అంతుపట్టని  విషయాలెన్నో  ఉన్నాయి.

ఉదా.... కొందరు  సామాన్యులు  కేవలం  తమ  పళ్ళతో  పెద్ద  లారీని   కొంతదూరం  లాగటం,  విమానాన్ని  జుట్టుకు  కట్టి  లాగటం  చూస్తూనే  ఉన్నాము. 
ఆధునిక సైన్స్,  శాస్త్రీయత  ప్రకారం  ఆలోచిస్తే   ఈ  విధంగా  లాగటం  అసాధ్యం  కదా !  


    ఆధునిక సైన్స్,  శాస్త్రీయత  ప్రకారం  .... జుట్టుతో    లేక  పళ్ళతో  భారీ  వాహనాన్ని  లాగాలని  ప్రయత్నిస్తే  జుట్టు  లేక  పళ్ళు  కుదుళ్ళతో  సహా  ఊడి  వస్తాయి. 

అయితే  కొందరు  వ్యక్తులు  ఈ  విధంగా  లాగి  చూపిస్తున్నారు  కదా  !  వాళ్ళెలా  భారీ  వాహనాలను  లాగగలుగుతున్నారు  ?

  ఈ విషయాలను ఆధునిక   సైన్స్, శాస్త్రీయత ప్రకారం  ఎలా  నిరూపించగలం ?

 
 ఇవన్నీ  గమనిస్తే    ఏమనిపిస్తుందంటే , శారీరికశక్తి  కన్నా  మానసిక  శక్తి  చాలా  గొప్పది  అనిపిస్తుంది.  


  ఇలాంటి  సాహసాలు  చేసేవారు  మనలాంటి  మామూలు  వ్యక్తులే.  కానీ,   వాళ్ళు  తమ  యొక్క  గట్టి  సంకల్పశక్తి  మరియు  పట్టుదల  వల్ల  ఇలాంటి  అసాధ్యాలను  సుసాధ్యం  చేస్తున్నారనిపిస్తుంది.  


 ఇంకా   ఏమనిపిస్తుందంటే ,   ఈ  కాలంలోని  సామాన్య  వ్యక్తులే  తమ  సంకల్పశక్తితో  కృషి  చేసి  ఇలాంటి  సాహసాలు  చేయగలుగుతున్నప్పుడు  ..... 
 


పూర్వకాలపు  మహర్షులు  గొప్ప  తపస్సులు  చేసి  పొందిన   శక్తితో  ఎన్నో  అసాధ్యాలను  సుసాధ్యాలు  చేసేవారనటంలో  ఎటువంటి  సందేహమూ  లేదు.

 
   ఆధునిక  భౌతికవాద  శాస్త్రవేత్తలు  మానవ  శరీరం  గురించి  కొన్ని  విషయాలను   తెలుసుకోగలిగారు  కానీ ,  మనిషి  మనస్సు  గురించి,   అది  పనిచేసే  విధానం  గురించి   ఆధునిక  భౌతికవాద  శాస్త్రవేత్తలకు  తెలిసింది  చాలాచాలా  తక్కువ. 


  అందువల్ల  మనం  తెలుసుకోవలసింది  ఏమిటంటే ,   దైవం సృష్టించిన  సృష్టిలోని  సైన్స్  గురించి   మనకు  తెలిసింది  సముద్రంలో  నీటిబొట్టంత  అని...  ప్రాచీనులకు  తెలిసిన... ఆధునికులకు  తెలియని ...  సైన్స్  ఇంకా  ఎంతో  ఉంది  అని.  

  ....................................

(Wednesday, June 5, 2013

సైన్స్... శాస్త్రీయత మరియు కొన్ని విషయాలు. )