koodali

Friday, February 23, 2018

ఆంధ్రప్రదేశ్ ...... కొన్ని విషయాలు..

 

(Friday, September 16, 2016)

  ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో గమనించదగ్గ కొన్ని విషయాలున్నాయి.

రాజధాని అంటే నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది, 

రాష్ట్రంలో అన్ని ప్రాంతాల వాళ్ళు వచ్చిపోవటానికి రవాణాసౌకర్యం బాగుండాలి...ఇలా ఎన్నో విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి.
...............  


నీటికొరత ఉన్న ప్రాంతాలలో రాజధాని ఏర్పాటు చేస్తే రాజధానికి నీటికొరత ఏర్పడుతుంది.


నీటికొరత ఉన్న ప్రాంతాలలో రాజధాని ఏర్పాటు కన్నా,  ఆ ప్రాంతాలకు నీరు ఇవ్వటం ఎంతో అవసరం.


అందువల్ల నీరు ఉన్న కోస్తాలో రాజధాని ఏర్పాటు చేయటం... రాయలసీమ, ఉత్తరాంధ్రాకు నీటిని ఇవ్వటం అనే ఆలోచన మంచిదే.


నీటికొరత ఉన్న ప్రాంతాలకు నీటిని తరలించి ఆ ప్రాంతాలను సశ్యశ్యామలం చేస్తే అన్ని ప్రాంతాల వారు సంతృప్తి చెందవచ్చు. 


  రాష్ట్రానికి ఒక మూలన రాజధాని ఏర్పాటు కాకుండా ..రాష్ట్రమధ్యన రాజధాని ఏర్పాటు అవటం మంచిదే.

.....................

రైతులకు భూమి అంటే ఎంతో ఇష్టం ఉంటుంది. ఎంత డబ్బు ఇచ్చినా అమ్మటానికి ఇష్టపడరు. 


 తమ భూమిని ఇచ్చిన రాజధాని ప్రాంత రైతులు ఎంతో అభినందనీయులు.


  రాజధాని అభివృద్ధి చెందటం అవసరమే. అయితే, రాష్ట్రం అంతా అభివృద్ధి చెందటం మరింత ముఖ్యం.


రాజధాని అభివృద్ధిని కొంత తగ్గించి అయినా మిగతా ప్రాంతాలను అభివృద్ధి చేయాలి.


రాజధాని క్రమంగా అభివృద్ధి చెందుతుంది.

అమరావతి చుట్టుప్రక్కల  కూడా  కొంతభాగాన్ని వ్యవసాయానికి అట్టేపెట్టి మిగతా భాగాన్ని రాజధానిగా అభివృద్ధి చేస్తామంటున్నారు. అలా చేస్తే మంచిదే.

....................

 రాష్ట్రానికి  పారిశ్రామిక రాయితీలు ప్రకటిస్తే పరిశ్రమలు తరలివస్తాయంటున్నారు.


అయితే, పరిశ్రమలు రావాలంటే రాయితీలు మాత్రమే సరిపోవు.


 పారిశ్రామికవేత్తలు  భూమి తక్కువధరలో కావాలంటారు.


 కోస్తాలో భూమి ధర ఆకాశాన్ని అంటేలా ఉంది.


భూముల రేట్లు బాగా ఎక్కువ ఉంటే ఎన్ని రాయితీలు ఇచ్చినా పరిశ్రమలు రావు. 


అందువల్ల ఎక్కువ పరిశ్రమలను రాయలసీమ  మరియు ఉత్తరాంధ్రాలో ఏర్పాటుచేస్తే తక్కువధరకే భూమి లభిస్తుంది.


అక్కడ ఉద్యోగాలూ లభిస్తాయి.


అయితే పరిశ్రమల వల్ల  కాలుష్యం లేకుండా చర్యలు తీసుకోవాలి.


.....................

 రాష్ట్రంలో రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్రా ....అని కాకుండా అందరము ఒకే రాష్ట్ర ప్రజలం అని భావించాలి.


రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు రాష్ట్రానికి సంబందించిన అందరివీ.
............
 నా అభిప్రాయాలను వ్రాసాను. ఇక ఎవరి అభిప్రాయాలు వారివి. 

**************

 సమైఖ్య ఆంధ్రప్రదేశ్ విడిపోయి చాలా కాలమయింది. సీమాంధ్రుల అభిప్రాయాలకు పట్టించుకోకుండా  విభజన చేసారు. ఇస్తామన్న ప్రత్యేక హోదానూ ఇవ్వలేదు. ప్రత్యేక ప్యాకేజ్ కూ చట్టబద్ధతను ఇవ్వలేదు. వెనుకబడిన ప్రాంతాలకు ఇస్తామన్న రాయితీలను సరిగ్గా ఇవ్వలేదు.

రాష్ట్రప్రజలందరూ మూడు ముక్కలుగా కాకుండా మనందరమూ ఒకటే రాష్ట్రం వాళ్ళం అనే ఐకమత్య భావన పెంచుకోవాలి. ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా అనే పేర్లు వదిలేసి అందరమూ తెలుగువాళ్ళం అనుకోవాలి. అన్ని ప్రాంతాలనూ చక్కగా అభివృద్ధి చేయాలి.  

 తెలంగాణాలో హైదరాబాద్ రాజధానిగా ఎక్కువ అభివృద్ధి చెందినా కూడా అక్కడ  వెనుకబడిన ప్రాంతాలు కూడా చాలా ఉన్నాయి. కొన్ని చోట్ల  ఫ్లోరైడ్ వంటి సమస్యలు ఇంకా ఉన్నాయి. అయినా అక్కడి వాళ్ళెవరూ గొడవలు పడకుండా ఐకమత్యంగానే ఉంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు ఐకమత్యం లేకపోవటం పెద్ద సమస్య. దేశంలో కానీ, రాష్ట్రాలలో గానీ ప్రభుత్వాలు అన్ని ప్రాంతాలనూ చక్కగా అభివృద్ధి చేయాలి. అప్పుడు  దేశం బాగుంటుంది.

 ***************
 తమిళనాడు  వాళ్ళల్లో చాలామంది అప్పుడప్పుడూ ఏమంటారంటే.. తిరుపతి మాదే అంటుంటారు.

 ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని కొందరు  జనాలు...మా ప్రాంతాలు వెనుకబడ్డాయి కాబట్టి, మమ్మల్ని కర్ణాటకలో కలిపేయండని, మరి కొందరు తమిళనాడులో కలిపేయండని  అంటున్నారు.


తమ ప్రాంతాలు వెనుకబడి ఉంటే కష్టపడి అభివృద్ధి చేసుకోవాలి. అంతేకానీ, ఇతర రాష్ట్రాల వారు నవ్వుకునేలా ..మా ప్రాంతాలు వెనుకబడ్డాయి కాబట్టి, మమ్మల్ని ఇతర రాష్ట్రాలలో కలిపేయండి అంటూ మాట్లాడి నవ్వులపాలు కావద్దు.

************************
 అన్ని ప్రాంతాల వాళ్ళు ఒకే రాష్ట్ర ప్రజలుగా కలిసి అభివృద్ధి చెందండి.

 మీలో మీకు ఐకమత్యం లేకుంటే ఆ విషయం బయటకు ధైర్యంగా చెప్పి, రెండు  లేక మూడు రాష్ట్రాలుగా విడిపోయి ఎవరి  ప్రాంతాన్ని వాళ్ళు అభివృద్ధి చేసుకోవాలి.

ఆంధ్రప్రదేశ్ విడిపోవాలనుకుంటే... 

ఉదా..
* ప్రకాశం, కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరు, చిత్తూరు..ఆరు జిల్లాలు  కలిసి ఒక రాష్ట్రంగా ఏర్పడి కర్నూలు  పరిసర ప్రాంతాల్లో కానీ ఇంకెక్కడైనా కానీ  రాజధానిని ఏర్పరుచుకోవచ్చు.


* కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాలు , విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం ఏడు జిల్లాలు .. కలిసి ఇంకో రాష్ట్రంగా ఏర్పడి  విజయవాడలో కానీ, కాకినాడ పరిసర ప్రాంతాల్లో కానీ, ఇంకెక్కడైనా కానీ  రాజధానిని ఏర్పరుచుకోవచ్చు.

ఈ బాధలన్నీ ఎవరు పడతారనుకుంటే అందరూ ఐకమత్యంగా ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి.

********************
 కోస్తా జిల్లాలలో చాలా అభివృద్ధి ఉన్నదని చాలా మంది అనుకుంటారు కాని, అది పూర్తిగా నిజంకాదు. వ్యవసాయంలో ఎక్కువ లాభాలు ఉండవు. తుఫాన్లు, వరదలు, అతివృష్టి, అనావృష్టి..వంటి సమస్యలతో వ్యవసాయంలో ఎన్నో సమస్యలు ఉంటాయి.

కోస్తాలో వ్యవసాయాధారిత పరిశ్రమలు కూడా ఎక్కువ లేవు. కోస్తావాళ్ళు ఇతరప్రాంతాలు, దేశాలు పట్టుకుని తిరుగుతుంటారు. విదేశాల్లో ఐటీ ఉద్యోగాలలో గమనిస్తే.. కోస్తా యువత ఎక్కువగా ఉంటారు. 

కోస్తాలో చాలామంది తల్లితండ్రులు తమ పిల్లలను చిన్నతనం నుండే రాచిరంపాన పెట్టి  చదివించటం,హాస్టల్స్లో వేయటం చేస్తుంటారు. ఈ పిల్లలు విదేశాలకు వెళ్ళి, అక్కడ కూడా విరగబడి పనిచేసి ,ఎప్పుడు పోతుందో తెలియని ఉద్యోగాలు చేస్తుంటారు.

 ఇదే చక్కటి జీవితం అనుకుంటే ఇతర ప్రాంతాల వాళ్లు కూడా చిన్నతనం నుండి చదువుకుని విదేశాలకు వెళ్ళచ్చు కదా! కోస్తా వాళ్ళు విదేశాల్లో బాగుపడిపోతున్నారు.. అనుకోవటం ఎందుకు?

ఇక్కడే సరైన చదువు, ఉద్యోగాలు ఉంటే విదేశాలకు  వెళ్ళే కర్మ ఎందుకు ఉంటుంది. ఉత్తరాంధ్రా, రాయలసీమ నుండి కూడా వలస వెళ్ళే వాళ్ళు ఎక్కువగానే ఉంటారు.

మొత్తంగా చూస్తే స్వాతంత్రం తరువాత కూడా దేశంలో ఇన్ని సమస్యలు, ఇంత వెనుకబాటుతనం  ఉన్నాయంటే.. అందుకు కారకులు కొందరు నిస్తేజమైన పాలకులు,  కొందరు నిస్తేజమైన ప్రజలూ కూడా.

No comments:

Post a Comment