koodali

Monday, February 19, 2018

రాష్ట్ర విభజన సమస్యలు...



రాష్ట్ర విభజన జరిగి చాలాకాలమయింది. అయినా ఆంధ్రప్రదేశ్ కు కొంచెం, కొంచెం ఇవ్వటం  తప్ప , అవసరమయినన్ని  నిధులు ఇవ్వలేదని తెలుస్తోంది.. వెనుకబడ్డ  ఉత్తరాంధ్రా, రాయలసీమకు  ప్రత్యేక ప్యాకేజీ  అతి కొద్దిగా ఇచ్చారు.. పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు  ఎంత ఇచ్చారు ?   విశాఖ రైల్వే జోన్  సంగతి  అలాగే ఉంది. దుగరాజపట్నం లేక మరేదైనా పోర్ట్  అభివృద్ధి చేయాలి. 


   వెనుకపడిన జిల్లాలకు  బుందేల్ ఖండ్ లాంటి ప్యాకేజ్ ఇస్తామని కొద్దిపాటి నిధులతో సరిపెడతామంటున్నారు. రహదారుల కోసం నిధులను అన్ని రాష్ట్రాలకూ ఇస్తారు.  ఏపీకి కొద్దిగా ఎక్కువ ఇచ్చుంటారు. అంతేకానీ, ఇవ్వవలసినవి సరిగ్గా ఇంకా ఇవ్వలేదు.


  ఇతర రాష్ట్రాలకు భారీగా నిధులు ఇస్తున్నారు.  కేంద్రం వద్ద నిధులు లేనప్పుడు  , గుజరాత్లో  వేలకోట్లతో బుల్లెట్ ట్రైన్ కు నిధులు ఎలా వస్తాయి?   దేశంలో  కొన్ని చోట్ల రైల్వే గేట్లే సరిగ్గా లేనప్పుడు  బుల్లెట్ ట్రైన్ అవసరమేముంది?


ప్రకటించిన  విద్యాసంస్థలు  చాలినన్ని నిధులు  అందక  నత్తనడకన సాగుతున్నాయి.  విభజన తరువాత ఆస్తుల పంపకాల  విషయంలోనూ అన్యాయమే జరిగినట్లు తెలుస్తోంది.  ఎన్నో సమస్యలు ఎక్కడివి అక్కడ ఉండగా  విభజన హామీలు  అమలుచేసేశామని కేంద్ర ప్రభుత్వంలోని పార్టీ  చెప్పటం ఆశ్చర్యంగా ఉంది. 


రాష్ట్రానికి న్యాయం చేయనప్పుడు విభజించటం ఎందుకు  చేసారు ? విభజన   తరువాత ఇచ్చే నిధులను  కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇవ్వ వలసిందే. అంతేకానీ, మేము కాబట్టి నిధులు ఇస్తున్నాం  అని  అంటారేమిటో? 


కేంద్రానికి ఏపీ అంటే పెట్రోల్, సహజవాయువు గుర్తొస్తుంది. అక్కడ ..  ఎప్పుడు సహజవాయువులు లీక్ అవుతాయో ? అనే  భయంతో  ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకుని బ్రతుకుతున్నారు.

.....................

అసలు రాష్ట్ర విభజనే అన్యాయంగా జరిగింది.   ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా  విభజన చేసారు. విభజన సమయంలో  ఏపీకి  ప్రత్యేక హోదా ఇస్తామని  జాతీయపార్టీలు చెప్పాయి. తరువాత కేంద్రంలో  అధికారంలోకి వచ్చిన  తరువాత  హోదా ఇవ్వటానికి కుదరదు అన్నారు. 


విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్ సాక్షిగా ఒప్పుకున్నప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వవలసే ఉంటుంది. 

అయితే, ఏపీకి హోదా ఇస్తే, మాకూ ఇవ్వాలని కొన్ని రాష్ట్రాలు   అడగటం జరిగింది. .  హోదా గురించి దేశంలో  గొడవలు మొదలయ్యి , అడిగిన అందరికీ హోదా ఇస్తే,   రాష్ట్రానికి  ఎక్కువ  లాభముండదు. ..ఎలాగూ హోదాతో సమానమైన ప్యాకేజ్ ఇస్తామన్నారు  కదా !  అనుకుంటూ  మొత్తానికి  కారణాలు ఏమైనా ,  ప్యాకేజ్ కు  ఒప్పుకోవటం జరిగింది. 

ఇకపై ఏ రాష్ట్రానికి ప్రత్యేక  హోదా ఇవ్వకూడదని  కొత్తగా అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.  అయితే,  ప్రత్యేక హోదాను కొన్ని రాష్ట్రాల వారికి పొడిగించారని వార్తలు వచ్చాయి. 


  ఇతరులకు పొడిగించినా, పొడిగించకపోయినా,  ఆంధ్రప్రదేశ్కు  ప్రత్యేక హోదా అనేది..   విభజన సమయంలో ఇచ్చిన పాత హామీనే కాబట్టి  , కొత్తగా ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వము ..అనే విషయం ఆంధ్ర ప్రదేశ్ కు  వర్తించదు.

 ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు.. అని తెలిసినా కూడా ప్యాకేజీ సరిగ్గా ఇస్తే చాలులే... అనుకుని  ఆంధ్ర ప్రజలు ఊరుకున్నారు. 


ఇప్పుడు ప్యాకేజీ కూడా సరిగ్గా ఇవ్వకుండా  సరిపెట్టాలని చూడటం అన్యాయం.  ప్యాకేజ్ సరిగ్గా ఇవ్వనప్పుడు  తిరిగి  ప్రత్యేక హోదా  విషయం చర్చకు వస్తుంది. . ప్యాకేజ్  చట్టబద్ధత కూడా చేయలేదు.

......................
     బలవంతపు  విభజన వల్ల కలిగిన  నష్టాన్ని పూడ్చటం కొరకు ఇచ్చే నిధులను కేంద్ర  ప్రభుత్వం ఇవ్వవలసి ఉంటుంది. ఏపీ వాళ్ళు పదేపదే అడగవలసి రావటం  ప్రజలకు  అవమానకరమైన విషయం.

 ప్రజల సమస్యలు  తీర్చడం కోసం రాజకీయపార్టీలు పాటుపడాలి. అయితే,  పార్టీలు తాము ఇచ్చిన హామీల అమలును  సరిగ్గా అమలుచేయకుండా తాత్సారం చేస్తూ  ...ఉద్యమాలు చేయవలసి రావటం ద్వారా  ప్రజలు కష్టపడే పరిస్థితి తేవటం సరైనది కాదు. 


ఇప్పుడు  రాష్ట్రంలో  రాస్తారోకోలు, బందులు  మొదలుపెడితే  రాష్ట్రం వెనుకబడిపోతుంది,  మిగతా రాష్ట్రాలు ముందుకువెళ్తాయి.


విద్యార్ధులు చదువులతోనే కష్టపడుతున్నారు. ఇంకా ఉద్యమాలు చేసే బాధ్యత కూడా  విద్యార్ధులపై వేయడం  కాకుండా,  రాజకీయనాయకులే తాము ఇచ్చిన హామీలు అమలుచేయాలి. 

బందుల ద్వారా జనజీవనం స్థంభించటం, ప్రజలు కష్టపడటం  కాకుండా  ... రోజులో కొద్దిసేపు ర్యాలీలు చేయటం  వంటి ద్వారా ప్రజలు తమ నిరసన తెలియజేయవచ్చు.

 తెలంగాణా ఉద్యమంలో జరిగినట్లు ఆంధ్రప్రదేశ్లో   యువత ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రాకూడదు. ఎవరో చేసిన తప్పులకు యువత ఎందుకు ప్రాణాలు పోగొట్టుకోవాలి ?

....................
   ఆర్ధికవ్యవస్థతో ప్రయోగాల వల్ల బ్యాంకుల ముందు సామాన్యప్రజలు క్యూలలో నిలబడటం జరుగుతోంది కానీ ,  వేలకోట్లు దోచి వేస్తున్న బడా  వారిపైన  , విదేశాలకు నల్లడబ్బును తరలిస్తున్నవారిపైన   కఠినచర్యలు తీసుకోవాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. 

జీఎస్టీ వల్ల లాభాలు  వచ్చే ఎలా ఉన్నా..జీఎస్టీ తరువాత  కొందరు వ్యాపారులు తమకు ఇష్టం వచ్చినట్లు ధరలు పెంచటం వల్ల ప్రజలలో గందరగోళం నెలకొంది. 


 ప్రజలలో నెలకొన్న అభిప్రాయాలను బీజేపీ గమనించకపోతే ఆ పార్టీకే నష్టం.  కాంగ్రెస్, బీజేపీ మాత్రమే కాకుండా జాతీయస్థాయిలో ఇంకో కూటమి  రావాలని ప్రజలు  కోరుకున్నా  ఆశ్చర్యం ఏమీ లేదు.

***************
 విభజన జరిగిన కొత్తలో బీజేపీ వాళ్లు ఏపీ పట్ల సానుభూతితోనే ఉన్నారు. తరువాత కొంతకాలానికి వారిలో మార్పు కనిపించింది.

  రాష్ట్రానికి చెందిన బీజేపీ వాళ్ళు  ఎవరైనా  ..ఇక్కడి  ప్రజల అభిప్రాయాలను  సరిగ్గా అర్ధం చేసుకోకుండా  , కేంద్రానికి సరైన  సమాచారం ఇవ్వటం లేదనిపిస్తుంది. 


ఏపీ పట్ల కేంద్రం వారి వైఖరి మార్పు కనిపించడంలో  కేంద్రం  వాళ్ల రాజకీయాలు   కూడా  కారణం అయి యుండవచ్చు. ఏదైతేనేం ఏపీ ప్రజలను  చిన్నచూపు చూస్తున్నారు.


 ఏపీకి ప్రత్యేక హోదా వస్తే తామూ  హోదా గురించి  అడగొచ్చని  కొందరు ఇతర రాష్ట్రాల వాళ్ళు  ఎదురుచూస్తున్నారు.


***************
 అయినా రెండు రాష్ట్రాలు అయినప్పుడు ఇద్దరు గవర్నర్లను నియమించాలి గానీ ,  ఒకే గవర్నర్ ఏమిటి ? ఏపీకి కొత్త గవర్నర్ ను నియమించాలి.

*************

ఇప్పుడు  కొందరు రాష్ట్ర బీజేపీ  వాళ్ళు  మరీ  విడ్డూరంగా  మాట్లాడుతున్నారు.  రాజధాని కోసం బోలెడు డబ్బు  ఎందుకు ఖర్చుపెడుతున్నారు? అంత డబ్బు  కేంద్రప్రభుత్వం ఎందుకివ్వాలి ?  అంటూ  మాట్లాడుతున్నారు.


  కేంద్రం ఏపీకీ చాలా ఇచ్చింది .. ఇంకా ఇవ్వడానికేమీ లేదు...  ప్రాజెక్టులు ఇప్పుడే కట్టక్కర్లేదు.. పదేళ్లు సమయం ఉంది..అంటూ మాట్లాడుతున్నారు..

  రాజధాని లేదు కాబట్టి , ఢిల్లీ వంటి రాజధాని కట్టిస్తాము..  అని ఎన్నికల ముందు ఎందుకు చెప్పారు?

ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేసిన కాంగ్రెస్ పట్ల  ప్రజలకు  ఎంత  వ్యతిరేకత ఉందో, ఇప్పుడు బిజేపీ పట్ల కూడా  ప్రజలలో వ్యతిరేకత  ఉన్నాకూడా...  రాష్ట్ర బిజేపీ వాళ్లు అంతా బాగుందంటూ కేంద్రాన్ని వెనకేసుకు వస్తున్నారు. 

ఇప్పుడు బిజేపీ పట్ల ప్రజలలో ఉన్న వ్యతిరేకత  గురించి  ఆ పార్టీ వాళ్ళకు ఎందుకు అర్ధం కావటంలేదో ?  ఆశ్చర్యంగా ఉంది.


*******************
 రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిప్రాయాలను పట్టించుకోలేదు. ఇప్పుడు కూడ విశాఖ రైల్వేజోన్ విషయంలో ఇతర రాష్ట్రాలను సంప్రదించాలంటున్నారు. ప్రత్యేక హోదా విషయంలోనూ ఆంధ్రకు ఇస్తే ఇతరరాష్ట్రాలు అడుగుతారన్నారు.  దేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిప్రాయాలకు విలువలేదా?

 అయినా  ఏపీ ప్రజలు   విభజన చేయమని అడగలేదు.  అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలెందుకు కష్టాలు పడాలి ?  నిధులు పొందటానికి ఏపీ వాళ్లు పదేళ్ళు ఎందుకు ఆగాలి? 




1 comment:

  1. ఈ విభజన విషయాల గురించి ఈ బ్లాగ్ లో ఇంతకుముందు చాలాసార్లు చర్చలు జరిగాయి. ప్రస్తుతం బ్లాగ్ లో తిరిగి చర్చలు జరగాలని నేను అనుకోవటం లేదు. ఎవరూ పాజిటివ్ గా గానీ, నెగటివ్ గా గానీ వ్యాఖ్యలు వేయొద్దండి.

    ReplyDelete