koodali

Friday, September 16, 2011

కష్టాలు లేని లోకాలూ ఉన్నాయి. అవి పొందాలంటే, అర్హత సంపాదించాలి.....



కొంతకాలం క్రిందటి వరకూ ఇలా అనిపించేది.

* సృష్టిలో ఎన్నో బాధాకరమైన సంఘటనలు జరుగుతున్నాయి కదా ! అవి ఎందుకు జరగాలి ? అనిపించేది.

అయితే , ఇప్పుడు ఏమనిపిస్తుందంటే, ఈ లోకంలో బాధ కలిగించే విషయాలున్నాయి నిజమే.

కానీ , భూకంపాలు, సునామీలు, వంటి బాధలు , ఇతర బాధలు లేని లోకాలు కూడా ఉన్నాయి.

* పెద్దలు చెప్పిన స్వర్గం వంటి ," ఒక యోగి ఆత్మకధ " గ్రంధములో చెప్పబడిన , కారణలోకం, వంటి ఉత్తమలోకాలలో ఈ బాధలుండవు.

కానీ అక్కడికి చేరుకోవాలంటే ఈ జన్మలో సక్రమమార్గంలో జీవించాలి. అలా క్రమంగా అత్యుత్తమమైన బ్రహ్మానంద పరమపదమును పొందవచ్చు.

* మానవులు ఈ భూలోకంలోనే శాశ్వతంగా ఉండిపోవాలని దైవం యొక్క అభిప్రాయం కాదని పెద్దలు చెపుతారు.

* మానవులు సత్కర్మలను ఆచరించటం ద్వారా దైవకృపను పొంది ,బాధలు లేని ఉత్తమలోకాలను పొంది, పరమపదాన్ని పొంది బ్రహ్మానందాన్ని పొందాలని వారి భావన.

ఇంకా,

* ఏమనిపిస్తుందంటే, ఇదంతా దైవం మనకు పెట్టే పరీక్ష.

ఈ ప్రపంచమనే పరీక్షలో ఎక్కువమార్కులు తెచ్చుకుని పాసయిన వారికే బాధలు లేని ఉత్తమ లోకాలను పొందే అర్హత లభిస్తుంది. క్రమంగా అలా పరమపదాన్నీ పొందే అర్హత లభిస్తుంది.అనిపించింది.

లోకంలో మామూలు పరీక్షలంటేనే , ఎంతో కష్టపడి చదవాలి. ఆటల్లో గెలవాలన్నా ఎంతో శ్రమపడి కోచింగులు తీసుకోవాలి. ఆటల్లో తగిలే దెబ్బలకు భయపడకుండా కష్టపడాలి.

మరి బాధలు లేని ఉత్తమలోకాలను పొందాలన్నా, పరమపదాన్ని పొందాలన్నా కష్టపడకుండా ఎలా ?

* ఇలా అనిపించిన తరువాత నా సందేహం తీరింది.

* జీవులకు అసలు పరీక్ష...మనసును అదుపులో పెట్టుకోవటమే.

అందుకే పెద్దలు అంటారు మనస్సును జయించితే ప్రపంచాన్ని
జయించినట్లే అని.

* అందుకే లోకంలో ఇన్ని కష్టాలు ఎందుకు ఉన్నాయి ? అని వాటిని చూసి నిరాశ పడిపోకూడదు.

గొప్ప సుఖాలను పొందాలంటే కొన్ని కష్టాలను ఎదుర్కోవాలి మరి.

చిన్నపిల్లలు నడక నేర్చుకునే క్రమంలో ఎన్నోసార్లు క్రిందపడి దెబ్బలు తగిలించుకుని ఏడుస్తారు. అది సహజం.

 నడకనేర్చుకునేటప్పుడు దెబ్బలు ఎందుకు తగలాలి ? మా అమ్మ ఎంత దయలేనిది . నేను క్రిందపడి దెబ్బలు తగిలించుకుంటున్నా కూడా నడకనేర్చుకోమంటోంది. అని పిల్లలు అనుకోరు కదా ! .

సైకిల్ నేర్చుకునేటప్పుడు బాలన్స్ చేతకాక ఎన్నో సార్లు క్రిందపడి దెబ్బలు తగిలించుకుంటారు. అయినా లెక్కచేయకుండా ఉత్సాహంగా సైకిల్ నేర్చుకుంటారు.

  అంతేకానీ సైకిల్ నేర్చుకోవాలంటే దెబ్బలు ఎందుకు తగులుతాయి ? ఇది చాలా అన్యాయం, మా నాన్నకు కూడా దయలేదు, క్రిందపడుతున్నా జాలి లేకుండా సైకిల్ నేర్పిస్తున్నారు. అని పిల్లలు అనుకోరు కదా !


ఒక ఆఫీసులో ఉద్యోగస్తులను చేర్చుకోవాలన్నా వ్యక్తుల అర్హతలను పరిశీలించే ఉద్యోగంలో చేర్చుకుంటారు. రోడ్డున పొయ్యే వారిని పిలిచి ఎవరికైనా ఉద్యోగాలు ఇవ్వరు కదా !

* అలాగే, మరి కష్టాలు లేని ఉత్తమలోకాలను పొందాలన్నా దానికి కొన్ని అర్హతలను సంపాదించాలి.


* అలాగే పరమపదాన్ని సాధించే క్రమంలో  జీవితంలో ఎదురయ్యే కష్టాలు, సునామీలు, భూకంపాలూ అటువంటివే.

ఆ కష్టాలను చూసి ధైర్యాన్ని కోల్పోకూడదు. అప్పుడే బ్రహ్మానందం మనకు లభిస్తుంది.

* భూకంపాలు, రైలు ప్రమాదాలు వంటి ప్రమాదాల్లో కూడా కొందరు చెక్కుచెదరకుండా బయటపడతారు, కాలం కలిసి వస్తే అంతే మరి.

* చిన్నచీమ కూడా తాను ఎప్పుడు ఎవరి కాలిక్రింద పడి చనిపోతానో అని భయపడకుండా తన జీవితాన్ని సాగిస్తుంది.

* మనిషి కూడా ప్రతిదానికి భయపడకుండా భగవంతునిపై భారం వేసి స్వధర్మాన్ని పాటిస్తూ నిష్కామంగా జీవితాన్ని గడపటానికి ప్రయత్నించాలి.

* బాధలు లేని లోకాలను చేరాలంటే ఈ జన్మలో సక్రమమైన పద్ధతిలో జీవించాలి.

* జీవించటమో ? మరణించటమో ! కష్టమో ! సుఖమో ! అంతా భగవంతుని దయ .అనుకున్ననాడు బాధేలేదు.

* ఆ ధైర్యం రావాలన్నా దైవకృప అవసరం . అందుకే దైవకృప కోసం ప్రయత్నించాలి.

 

4 comments:

  1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    ReplyDelete
  2. సృష్టిలో ఇన్ని బాధలు, రోగాలు, కష్టాలు ఎందుకున్నాయని అనిపిస్తుంది. అవన్నీ మనుషులు మనస్సును నిగ్రహించుకోలేక చెడ్దపనులు చేస్తే వచ్చే పర్యవసానాలే. కలికాలంలో ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. ఎక్కువమంది మనస్సును నిగ్రహించుకోలేక చెడ్డ పనులు చేస్తారు కాబట్టి, చెడు సంఘటనలు కలికాలంలో ఎక్కువగా ఉంటాయి. మిగతా యుగాల్లో మంచివారు ఎక్కువగా ఉంటారు కాబట్టి మంచి ఎక్కువగా ఉంటుంది.

    అయితే చెడు లేకుండా మంచి మాత్రమే ఉండే లోకాలూ ఉన్నాయి. ఉదా..స్వర్గం ..వంటి లోకాలున్నాయి. భూమిపైన కూడా కృత, త్రేతా, ద్వాపర యుగాలలో ధర్మం కలియుగం కన్నా బాగానే ఉంటుంది.

    మిగతా యుగాల్లో ధర్మం పాళ్లు ఎక్కువ....కలియుగంలో అలాకాదు.

    భూమి ఒక పరీక్షాలోకం కావచ్చు. ఒక ఆటస్థలం కావచ్చు. లౌకికజీవితంలో ఏదైనా పొందాలంటేనే, ఎన్నో కష్టాలు ఉంటాయి. మరి పరమపదాన్ని పొందాలంటే కొంతయినా కష్టపడాలి కదా..

    చిన్నపిల్లలు సరదాగా ఆడుకునే ఆటలకు నియమాలు ఉండవు. అయితే, పోటీపడి ఆడే ఆటలకు కొన్ని నియమాలను ఏర్పరుచుకుంటారు. కొన్ని ఆటలలో గెలవాలన్నా కొన్ని సంవత్సరాలు కఠోర శిక్షణ తీసుకుంటారు కొందరు. ఆడేటప్పుడు దెబ్బలు తగిలితే భరించవలసి వస్తుంది, ఓడినప్పుడు ఆ బాధను తట్టుకోవలసి వస్తుంది. ఇవన్నీ తట్టుకోగలిగినప్పుడు గెలుపు వరిస్తుంది.

    విజయాన్ని సాధించాలంటే ఒక్కో కష్టాన్నీ దాటుకుంటూ ఆఖరికి వచ్చేసరికి కొన్నిసార్లు పెద్ద కష్టాన్ని ఎదుర్కుని విజయాన్ని సాధించవలసి ఉంటుంది.

    లౌకిక పరీక్షలలో పాసవ్వాలన్నా ఎంతో కష్టపడవలసి ఉంటుంది. అర్హతను పొందవలసి ఉంటుంది.

    జీవితం కూడా పరీక్ష వంటిది. జీవులు ఈ పరీక్షలో నెగ్గాలంటే, దైవభక్తితో, సత్ప్రవర్తనతో.. జీవితాన్ని గడిపితే, జీవితం అనే పరీక్షలో గెలుపొందుతారు. మనస్సును నిగ్రహించుకోలేకపోతే ఓడిపోతారు. కలియుగం పరీక్షాకాలమే కానీ, దైవభక్తితో కష్టాలు లేకుండా ఉండవచ్చు.

    ఏ బాధా లేని ఉత్తమలోకాలను..ఉత్తమగతులను పొందాలంటే భూమి అనే పరీక్షాలోకంలో మంచిమార్కులను పొందాలి.

    ReplyDelete
  3. మంచి..చెడు, అనుకూలత..ప్రతికూలత.. ఇవి విభిన్న లక్షణాలే. సర్వమూ దైవసృష్టే.

    అదితికి దేవతలు, దితికి రాక్షసులు జన్మించారంటారు. అప్పట్లో రాక్షసులు వేరేగా ఉండేవారుకావచ్చు.. అంతులేని తీరనికోరికలు, విపరీతమైన కోపం, అత్యాశ, అసూయ, ప్రతీకారం..వంటి లక్షణాలతో ఇప్పుడు కొందరు మనుషులే రాక్షసుల్లాగా..దయ్యాలుగా.. ప్రవర్తిస్తున్నారు.

    ప్రతికూలతను తట్టుకోవటం మనుషులకు కష్టం కాబట్టి, మనిషి దైవాన్ని నమ్ముకోవాలి. దైవం ఏమైనా చేయగలరు. దైవము దేనినైనా సృష్టించగలరు. నాశనమూ చేయగలరు. ప్రతికూలత హద్దుమీరితే దైవం దాన్ని అణచివేస్తారు.

    మనుషులందరూ మంచిగుణాలను పెంచుకుని, చెడ్డగుణాలను పోగొట్టుకుంటే కలికాలంలో కూడా త్రేతాయుగంలా జీవించవచ్చు.
    ......
    సృష్టిలో కొంత నెగటివిటీ కూడా ఉంటుంది..ఉదా..వెలుగు ఉంది..చీకటి ఉంది.

    కొన్నిసార్లు నెగటివ్ ఆలోచన కూడా అవసరమే అనిపిస్తుంది.
    ( నెగటివ్ ఆలోచన యొక్క ఫలితం పాజిటివ్ గా ఉన్నప్పుడు..)

    ఉదా..ఒక రాజ్యానికి రాజు అయిన వ్యక్తి నెగటివ్ గా కూడా ఆలోచించవలసి ఉంటుంది. రాజ్యం అంటే శత్రువు దాడిచేసే అవకాశాలు ఎప్పుడూ పొంచి ఉంటాయి కాబట్టి, రాజ్యరక్షణ కొరకు తగిన జాగ్రత్తలు తీసుకుంటే, శత్రువు దాడి చేసినప్పుడు సమర్ధవంతంగా తిప్పికొట్టగలిగే సత్తా ఉంటుంది.

    అలా కాకుండా...అంతా బాగానే ఉంది. లోకంలో అందరూ మంచివారే , రాజ్యంపై ఎవరూ దాడి చేయరు.. అని కేవలం పాజిటివ్ గా ఆలోచించుకుంటూ.. రక్షణ ఏర్పాట్లు చేసుకోకుండా తాపీగా కూర్చుంటే శత్రువు దాడిచేసినప్పుడు పరాజయం పొందే అవకాశం ఉంది.

    అతిగా ఆహారం తీసుకుంటే అనారోగ్యం కలుగుతుందేమోననే జాగ్రత్త ఉంటే, ఎక్కువగా తినకుండా జాగ్రత్త పడతాం. ఏమీ కాదులే అని .. మరీ పాజిటివ్గా ఆలోచించి అతిగా తింటే ఆరోగ్యానికి మంచిదికాదు.
    జీవితంలో ముందు జాగ్రత్తలు తీసుకోవలసిన సంఘటనలు ఎన్నో ఉంటాయి.

    ReplyDelete