koodali

Wednesday, September 14, 2011

మానవులను ఎదుర్కునే మహిమలు కావాలని మొక్కలు, పశుపక్ష్యాదులు భగవంతుని అడిగితే ,

 
ఈ బ్లాగ్ ను ఇంతకుముందునుంచీ చదువుతున్నవారికి , మరియు క్రొత్తగా చదువుతున్నవారికి, మరియు సపోర్ట్ చేస్తున్న అగ్రిగేటర్లకు అందరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలండి.


జీవితంలో మనకు చాలా సందేహాలు వస్తుంటాయి. మహిమలు అనేవి నిజంగా ఉన్నాయా ? ఉంటే ఈ ప్రపంచంలోని కష్టాలను మహిమలతో పోగొట్టవచ్చు కదా ! వంటి సందేహాలు.


ఈ మధ్యన , ఒకరు తమ బ్లాగులో ఇలాంటి అభిప్రాయాలను వ్రాయటం జరిగింది. నేను చదివాను. నాకు తెలిసినంతలో వాటి గురించి నా అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. వారి బ్లాగ్ పేరు ...ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్.

మహిమలవంటివి తప్పకుండా ఉన్నాయి. అలాంటి అనుభవాలు చాలామందికి జరుగుతున్నాయి. నమ్మనివాళ్ళని ఎలా నమ్మించగలం ?

ప్రతి పనీ మహిమతో పరిష్కరించుకుంటే ఇక సృష్టి అంతా నిస్సారంగా అయిపోతుంది.

ఇక్కడ ఇంకో విషయము. . మనం ఎంతకీ మన కష్టాల గురించి, మన సుఖాల గురించీ మాత్రమే ఆలోచిస్తున్నాము.

మనలాగే పశుపక్ష్యాదులకీ బాధలు ఉంటాయి. మరి మన స్వార్ధం కోసం పశుపక్ష్యాదులను ఎంతో బాధకు గురి చేస్తున్నాము. మానవుల కోసం లక్షలాది మూగజీవులు పడరానిపాట్లు పడుతున్నాయి.

* మానవులను ఎదుర్కునే మహిమలు కావాలని మొక్కలు, పశుపక్ష్యాదులు భగవంతుని అడిగితే , మానవులకు ఆహారమే ఉండదు. మానవులకు చాలా కష్టాలు వస్తాయి.

* ఈ సమస్యలన్నీ పరిష్కారం అవ్వాలంటే ప్రతివిషయానికీ మహిమలు అవసరంలేదు. మనం మన కోరికలను, స్వార్ధాన్ని కొంచెం తగ్గించుకోవాలి.

అలా ఎందుకు తగ్గించుకోలేకపోతున్నామో ? ఆలోచించండి.

ఇక్కడ, మొదటి వ్యక్తి, రెండవ వ్యక్తి అని సంభాషణ రూపంలో ఆ అభిప్రాయాలను చెబుతానండి.

* మొదటి వ్యక్తి....“గాలిలోంచీ వస్తువులు సృష్టించేవారు, మానవులందరికీ సరిపడా ఆహారం ఎందుకు సృష్టించరు?అలా అయితే ఎంతమందో అన్నార్తులకి ఆకలి బాధ తప్పించిన వారవుతారు కదా?


*రెండవ వ్యక్తి.... అన్నీ మహిమలతో చేసేస్తే ఇక మనిషి పనీపాటాలేకుండా ఏం చేస్తాడు. ?

తాము కూడబెట్టిన సంపాదనను కూర్చుని తినే పిల్లలను చూస్తే తల్లిదండ్రులకైనా చిరాకు వస్తుంది.

కష్టపడి సంపాదించే పిల్లలనే తల్లిదండ్రులు మెచ్చుకుంటారు.

ప్రతి జీవి తనకు తానుగా కష్టపడి అత్యుత్తమమైన పరమపదాన్ని పొందాలన్నది దేవుని ఆలోచన కావచ్చు.

అన్నీ మహిమలతో అమర్చి ఇస్తే , ఈ మానవులు సోమరుల్లాగ తింటూ కూర్చోవాలని ఎందుకు అనుకుంటున్నారో ?

సృష్టిలో పశువులు, పక్షులు కూడా తమకు తాముగా ఎన్నో కష్టాలు పడి ఆహారాన్ని సంపాదించటం , జీవించటం చేస్తుంటాయి.


మనుషులు మాత్రమే పని లేకుండా ఆహారాన్ని మహిమల ద్వారా సంపాదించటం ఎలా ? వంటి ఆలోచనలు చేస్తుంటారు అనిపిస్తుంది.

***********
* మొదటి వ్యక్తి... భవిష్యత్తు గురించి చెప్పేవారు,భూకంపాలగురించి ఎందుకు చెప్పరు? “భూకంపాలూ, రైలుప్రమాదాలూ వంటి వాటిని ముందే కనిపెట్టటం వలన అనేక మంది అమాయకుల ప్రాణాలను రక్షించిన వారమౌతాము.


* రెండవ వ్యక్తి....భూకంపాలను గుర్తించే శక్తి కొన్ని జంతువులకు ఉందట. జంతువుల ప్రవర్తనను గమనించి మానవులు జాగ్రత్తలు తీసుకోవచ్చు.

రైలు ప్రమాదాలు వంటివి మానవ తప్పిదాల వల్లే జరుగుతాయి.
***********

* మొదటి వ్యక్తి...రైలు ప్రమాదం లో, సునామీ లో మరణించిన వారందరూ (కొన్ని లక్షల మంది) వారి కిందటి జన్మల కర్మ ప్రకారం మరణించారనటం ఎందుకో నాకు సరిగా కనిపించటం లేదు.


* రెండవ వ్యక్తి...సునామీ వంటి వాటిలో మరణించటం కర్మసిద్ధాంతం ప్రకారమే జరుగుతుంది అనుకోవచ్చు. కర్మసిద్ధాంతం సరైనదే అనుకోవచ్చు.


మనం పరీక్షల్లో ఎలా వ్రాస్తే అలాగే మార్కులు వేస్తారు కదా ఉపాధ్యాయులు. ! అలాగే వారు చేసిన కర్మ ప్రకారం వారు ఫలితాన్ని అనుభవించటం అన్నది సరైనదే కదా !

**************
* మొదటి వ్యక్తి....సోమాలియా, ఇతియోపియా వంటి దేశాలలో ఎంత కష్టించి పని చేసినా ఆహారం ఉండదు ,. అలాంటి చోట్ల ఈ బాబాల మహిమలు ఉపయోగ పడ్తాయి.

* రెండవ వ్యక్తి...ఆకలిచావులు సోమాలియాలో అంత తీవ్రంగా కాకపోయినా భారతదేశంలో కూడా జరుగుతున్నాయి.

ఇదంతా మానవుల స్వయంకృతాపరాధం. అవును, దైవం ఎన్నో మొక్కలను, విత్తనాలను సృష్టించి మనకు ఇచ్చారు. వాటినుంచీ పుష్కలంగా పంటలు పండించుకోవచ్చు.

కానీ మనం ఆహారం కంటే విలాసవస్తువులను తయారుచేసే పరిశ్రమలను స్థాపించటం, , ఆయుధాలను తయారుచేయటం వంటివాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము.

ఆ విధమైన పెట్టుబడి తగ్గించుకుంటే సోమాలియా వాళ్ళకు కూడా ఆహారపదార్ధాలు సరఫరా చేయొచ్చు.

మనదేశంలో అయితే గిడ్డంగులు సరిపడాలేక ఎన్నో ఆహారౌత్పత్తులు పాడైపోతున్నాయి. ఇలా ప్రపంచమంతా ప్రణాళిక లేకుండా ఇష్టారాజ్యంగా సాగుతోంది.

ఈ సమస్యలకు ఇలా ఎన్నో కోణాలున్నాయి .
**********

* మొదటి వ్యక్తి....ఒక పనిని సులువు గా చేయగల పరిస్థితి ఉన్నపుడు దానిని అనవసరమైన కష్టపడి చేయటం విజ్ణత అవుతుందా? 
 
* రెండవ వ్యక్తి....ఒక పనిని సులువుగా చేసే అవకాశం ఉన్నా కూడా ,
ప్రతిచిన్న విషయానికి యంత్రాలపై ఆధారపడకుండా , కష్టపడి మనపని మనమే చేయటం వల్ల మన ఆరోగ్యమే చక్కగా ఉంటుందని పెద్దలు అనుభవం ద్వారా చెప్పటం జరిగింది .

ఆ విధంగా మనకు విషయపరిజ్ఞానమూ పెరుగుతుంది.

ఉదా...కాలిక్యులేటర్లు ఉపయోగించని పాత తరాలవారికి మనకన్నా జ్ఞాపకశక్తి బాగా ఉండేది అనిపిస్తుంది.

**************

* మొదటి వ్యక్తి...ఏయిడ్స్ వలన అనేక మంది అమాయకులు కూడా చనిపోతున్నారు. సైంటిస్టులు కనిపెట్టబోయే విషయాలను(మందు) ముందే బాబాలు తెలుసుకొంటే, అనేక మంది రక్షించబడతారు.

* రెండవ వ్యక్తి.... నైతికవిలువలతో కూడిన జీవనవిధానం, ఇంకా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే , ఎయిడ్స్ వంటి రోగాల బారిన పడకుండా ఉండొచ్చని వైద్యులు అంటున్నారుకదా ! అలా ప్రయత్నించవచ్చు.

అయినా జననం మరణం పశుపక్ష్యాదులకు వలెనే మానవులకూ అనివార్యమైన విషయాలు.

ఈ ప్రపంచంలో కష్టాలూ, సుఖాలూ రెండూ ఉన్నాయి.

*ఈ కష్టాలన్నీ లేకుండా శాశ్వత బ్రహ్మానందం పొందాలంటే , దైవకృపను పొంది మోక్షమనే పరమపదమును పొందటం ద్వారా మాత్రమే సాధ్యమని పెద్దలు చెప్పటం జరిగింది...
**************

ఇతర బ్లాగులోని విషయాలు వారి అనుమతి లేకుండా వ్రాయవచ్చో లేదో ? ఇలాంటి నియమాలు ఉంటే దయచేసి తెలియజేయండి. ఇక ముందు జాగ్రత్త తీసుకుంటాను.

వారి అనుమతి లేకుండా వ్రాసినందుకు క్షమాపణలతో.,వారికి అభ్యంతరాలు ఉన్నచో ఈ టపాలో కొంత భాగాన్ని నిలిపివేయటం గురించి ఆలోచిస్తాను.
 

2 comments:

  1. మనం పరీక్షల్లో ఎలా వ్రాస్తే అలాగే మార్కులు వేస్తారు కదా ఉపాధ్యాయులు. ! అలాగే వారు చేసిన కర్మ ప్రకారం వారు ఫలితాన్ని అనుభవించటం అన్నది సరైనదే కదా !
    ----------------
    ఇది చాలా బాగుంది.

    ReplyDelete
  2. కృతజ్ఞతలండి.
    రైలు ప్రమాదాల వంటివి మానవతప్పిదాలే కదండి ! అవి కూడా ముందే తెలియాలంటే ఎలా ? ఏమిటో కలికాలపు చిత్రమైన ఆలోచనలు..

    ఇలా ఆలోచించి మనిషికి కష్టం లేకుండా ఉండాలని యంత్రాలు కనిపెట్టారు.
    యంత్రాల వల్ల మనిషికి పని తగ్గి , ఆరోగ్యమూ తగ్గి........జిమ్ము లకు వెళ్ళి కష్టపడవలసి వస్తోంది.

    ReplyDelete