koodali

Wednesday, September 1, 2010

ధృడమైన నమ్మకము , ఓపిక ఎంతో అవసరము. ...

 

సాయి బాబా వారు శ్రధ్ధ, సబూరి అనునవి అందరికి ఎంతో అవసరం అని చెప్పేవారు.

ఈ సంఘటన శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము లోనిది. ఒకనాడు సాయిబాబా భక్తుడగు శ్యామాను విషసర్పము కరచెను. అతని చిటికెన వ్రేలును పాము కరచుటచే శరీరములోనికి విషము వ్యాపింప మొదలిడెను. బాధ ఎక్కువగా నుండెను. శ్యామా తాను మరణించెదననుకొనెను. స్నేహితులాతని విఠోబా గుడికి తీసికొనిపోవనిశ్చయించిరి. . పాముకాట్లు అచ్చట బాగగుచుండెను .


కాని శ్యామా తన విఠోబా యగు బాబా వద్దకు పరుగిడెను. బాబా యతనిని జూడగనే ఈసడించుకొని వానిని తిట్టనారంభించెను. కోపోద్దీపితుడయి బాబా యిట్లనియె, ఓరి పిరికి పురోహితుడా ! యెక్కవద్దు, నీవెక్కినచో నేమగునో చూడుమని బెదిరించి తరువాత యిట్లు గర్జించెను. పో , వెడలిపొమ్ము. దిగువకు పొమ్ము. బాబా ఇట్లు కోపోద్దీపితుడగుట జూచి శ్యామా మిక్కిలి విస్మయమందెను. నిరాశ చెందెను. అతడు మశీదు తన యిల్లుగా బాబా తన యాశ్రయముగా భావించుచుండెను. ఇట్లు తరిమివేసినచో తానెక్కడకు పోగలడు ?అతడు ప్రాణమందాశ వదలుకొని యూరకుండెను.


కొంతసేపటికి బాబా మామూలు స్థితికి వచ్చెను. శ్యామా దగ్గరకు పోయి కూర్చుండెను. అప్పుడు బాబా యిట్లనెను. భయపడవద్దు. ఏ మాత్రము చింతించకు. ఈ దయార్ద్ర ఫకీరు నిన్ను రక్షించును. ఇంటికి పోయి ఊరక కూర్చుండుము. బయటికి పోవద్దు. నా యందు విశ్వాసముంచుము. నిర్భయుడవు కమ్ము. ఆతురపడవద్దు. ఇట్లని శ్యామాను ఇంటికి పంపించెను.


వెంటనే బాబా తాత్యాపటేలును, కాకాసాహెబు దీక్షితును, అతనివద్దకు పంపి తన కిష్టము వచ్చినవి తినవచ్చుననియు, గృహములోనే తిరుగవచ్చుననియు, కాని పండుకొనగూడదనియు, ఈ సలహాల ప్రకారము నడుచుకొమ్మనెను. కొద్దిగంటలలో శ్యామా బాగుపడెను. ఈ పట్టున జ్ఞప్తి యందుంచుకొనవలసిన దేమన బాబా పలికిన 5 అక్షరముల మంత్రము ( పో , వెడలిపొమ్ము , క్రిందకు దిగు )శ్యామాను ఉద్దేశించినదిగాక సర్పమును ఆజ్ఞాపించిన మాటలు. దాని విషము పైకి యెక్కరాదనియు , అది శరీరమంతట వ్యాపింపరాదనియు ఆజ్ఞాపించిరి.


మంత్రములలో నారితేరిన తక్కినవారివలె , వారే మంత్రము ఉపయోగింపనవసరము లేకుండెను. మంత్ర బియ్యము గాని, తీర్ధము గాని ఉపయోగించ నవసరము లేకుండెను. శ్యామా జీవితమును రక్షించుటలో వారి పలుకులే మిక్కిలి బలమైనవి.


మనము కూడా కష్టములు వచ్చినప్పుడు నిరాశ పడకుండా గురువు,మరియు భగవంతుని యందు ధృడమైన నమ్మకము, ఓపిక కలిగిఉండవలెను .

భక్త రామదాసు అంతటి రామభక్తుడే ఒకానొక పూర్వకర్మానుసారము చెరసాలలో కొంతకాలము శిక్ష అనుభవించిన తరువాత భగవంతుడు వారిని కాపాడారు.

అందుకే అందరికి దైవం యందు ధృడమైన నమ్మకము , ఓపిక ఎంతో అవసరము. ...
.

2 comments:

  1. ఈ పట్టున జ్ఞప్తి యందుంచుకొనవలసిన దేమన బాబా పలికిన 5 అక్షరముల మంత్రము ( పో , వెడలిపొమ్ము , క్రిందకు దిగు )శ్యామాను ఉద్దేశించినదిగాక సర్పమును ఆజ్ఞాపించిన మాటలు. దాని విషము పైకి యెక్కరాదనియు , అది శరీరమంతట వ్యాపింపరాదనియు ఆజ్ఞాపించిరి.
    -------
    మంత్రాలకి చింతకాయలు రాలు తాయా అని అంటారు కానీ మంత్రాలు అన్నీ మనస్సుని ఆజ్ఞాపించేవి అయి ఉండవచ్చు. కాకపోతే వాటి మీద నమ్మకము సరి అయిన ఉచ్చారణ చాలా ముఖ్యము. మంచి సంగీతము మన మనస్సును స్వాధీనము చేసుకుని మనకు ఆనందము కలుగ చేయుట లేదా!
    థాంక్స్ ఫర్ ది పోస్ట్.

    ReplyDelete
  2. కామెంట్స్ కొద్దిసేపటి క్రితం మాత్రమే చూసినందువల్ల జవాబివ్వటం ఆలస్యమయినందుకు నిజంగా చాలా బాధగా ఉందండి. దయచేసి క్షమించండి. మీ అభిప్రాయములు తెలిపినందుకు ధన్యవాదములండి.

    ReplyDelete