koodali

Monday, December 19, 2011

ఆధునిక విజ్ఞానం అయినా ..ఆధ్యాత్మికత అయినా ...


ఆధునిక విజ్ఞానాన్ని కొందరు తమ స్వార్ధానికి వాడుకుంటున్నట్లే ఆధ్యాత్మికతను కూడా కొందరు తమ స్వార్ధ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు.

తమ స్వార్ధ ప్రయోజనాల కోసం ప్రజలను మోసం చేసే దొంగ స్వాములు కొందరి గురించి వింటూనే ఉన్నాము.

ఇలాంటి వారివల్ల ఎవర్ని నమ్మాలో ఎవర్ని నమ్మకూడని పరిస్థితి ఏర్పడింది.

హేతువాదుల వంటి వారి వల్ల ఇలాంటి మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. అందువల్ల మనం వారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి.

కొందరు స్వార్ధం వల్ల మరి కొందరు తెలిసీతెలియనితనం వల్ల సమాజంలో కొన్ని మూఢాచారాలను వ్యాపింపచేశారు.

మేధావుల్లో కూడా కొందరు ఎలా ఉంటారంటే వారు మంచివారే కానీ తాము నమ్మిందే నిజం అని పిడివాదం చేస్తుంటారు.


ఇలాంటివారు ప్రాచీన కాలంలోనూ, ఈ కాలంలోనూ, భవిష్యత్తులో కూడా ఉంటారు.

ఉదా.......మాకు తెలిసిన ఒక ( అల్లోపతీ ) డాక్టర్ ఉన్నారు. వారు మంచి వ్యక్తే.

కానీ వారు ఏమంటారంటే హోమియో మందులు ఏం పనిచేస్తాయి ? అవి వట్టి పంచదార బిళ్ళలు. అంటారు.

కానీ ,మాకు హోమియో బాగా పని చేసింది. ఆ విషయం చెప్పినా వారు ఒప్పుకోరు.

మీ అనారోగ్యం కాకతాళీయంగా తగ్గింది. హోమియో వల్ల కాదు అని పిడి వాదం చేస్తారు.

ఆయుర్వేదం, హోమియో, అల్లోపతి ఏ వైద్యమన్నా మాకు గౌరవమే.

ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే ఇలా పిడివాదం చేసే వారిలో మేధావులు కూడా ఉంటారు అని. .

( హోమియో వైద్యాన్ని కనుగొన్నది విదేశీయులే .... సమాజానికి ఉపయోగపడేది ఎవరు కనిపెట్టినా వారు స్వదేశీయులైనా విదేశీయులైనా వారిని గౌరవించాలి. )

సరే ఆ విషయం అలా ఉంచితే ఆధ్యాత్మిక రంగంలో కూడా పిడివాదులు ఉంటారు. తెలిసీతెలియనివారూ ఉంటారు. ఇలాంటి వారి వల్ల కూడా కొన్ని మూఢ నమ్మకాలు ప్రచారంలోకి వస్తాయి.

ఇలాంటి వారందరి వల్ల దైవం , పూజలు అంటే ఒకలాంటి భయం కలిగే పరిస్థితులు వచ్చాయి.

ఈ రోజుల్లో ప్రేమభక్తితో కన్నా భయంతో పూజలను చేసేవారే ఎక్కువగా కనిపిస్తున్నారు.

అసలు దైవం అంటే ఎందుకు భయపడటం ?

ఈ రోజుల్లో పూజలలో ఆడంబరాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి పూజకు మూలకారణమైన దైవానికి ,ప్రేమభక్తికి తక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు అనిపిస్తోంది. .

పూర్వపుకాలం వాళ్ళకు ఎంతో ఓపిక , శారీరిక మానసిక దృఢత్వం ఉండేవి. వాళ్ళు పూజలు విధివిధానంగా భక్తిగా చేసుకునేవారు.

ఈ రోజుల్లో మనుషులకు అంతటి ఓపిక ఎక్కడిది ? ఇవన్నీ ఊహించే కాబోలు పూర్వులు .కలికాలంలో నామస్మరణను మించినది లేదు. అని చెప్పటం జరిగింది.

అయితే ఓపిక ఉన్నవాళ్ళు వాళ్ళ ఓపిక ప్రకారం పూజలు చేసుకోవచ్చు.

కానీ కొందరు పూజ చేసేటప్పుడు భక్తి కన్నా పూజలో ఎక్కడ పొరపాట్లు వస్తాయో ? వస్తే ఏమవుతుందో ? అనే భయంతో పూజలు చేస్తూ ఉంటారు.

దైవం అంటే మనకు కొద్దిగా భయం ఉండవచ్చు . కానీ ఆ భయం దైవానికే దూరం అయ్యేలా ఉండకూడదు కదా !

ఒక చంటిబిడ్డ తన తల్లితండ్రుల దగ్గరకు ఏ భయం లేకుండా ఎంత స్వతంత్రంగా వెళ్తుందో ..... భక్తులు భగవంతుని అంతే స్వతంత్రంగా ఆరాధించాలి.

అంతే కానీ భయంతో ఆరాధించటం ఎందుకు ?

లలితాసహస్ర నామాలలో " సుఖారాధ్యా " అన్న నామం ఎంత హాయిగా అనిపిస్తుందో కదా !

కష్టంలోనూ, సుఖం లోనూ అందరికి తోడునీడ దైవమే.

ఒక్కోసారి మనసు బాధతో ఉన్నప్పుడు నేనున్నానని గుర్తు వచ్చేది దైవం మాత్రమే. భక్తి భయపడే స్థాయికి రాకూడదు.

ఒక ఆకును కానీ, కొద్దిగా నీటిని కానీ, కొద్దిగా పువ్వులను కానీ ప్రేమతో సమర్పిస్తే చాలు అని భగవానుడే చెప్పటం జరిగింది. ఏమీ సమర్పించకపోయినా దైవం ఏమీ అనుకోరు.

మన అందరికీ హితులు, స్నేహితులు, జన్మజన్మల ఆత్మ బంధువు, ఆత్మ, పరమాత్మ అన్నీ దైవమే.

దైవం ఎంత గొప్ప అయినా మనలో ఆత్మగా అత్యంత సన్నిహితుడు .

తల్లిదండ్రులు ఎంత గొప్ప వారైనా పిల్లలకు ఆత్మీయులే కదా ! . రామకృష్ణపరమహంస చెప్పేవారట. దేవునికి భయపడటం ఎందుకు ? అని.

మనకు ఎవరైనా విసుగుతో పంచభక్ష్య పరమాణ్ణాలు పెట్టిన దానికన్నా .....ప్రేమతో పెట్టిన కొద్దిగా పదార్ధాలే బాగుంటాయి.

* అలాగే భగవంతుని కూడా విసుగుతో, భయంతో బోలెడు సేపు పూజ చెయ్యటం కన్నా ..... ప్రేమ భక్తితో మీకు వీలు కుదిరినంత సేపే పూజ చెయ్యండి అని నా అభిప్రాయం .

ఒకప్పుడు నేను కూడా తక్కువసేపు పూజ చేస్తే దేవునికి కోపం వస్తుందేమోననే భయంతో ఎక్కువసేపు పూజ చెయ్యటం జరిగేది.

పనులు మాని ఎక్కువసేపు అలా పూజ దగ్గర కూర్చున్నప్పుడు నాకు కూడా అయ్యో ! పనులేమీ అవలేదు కదా ! అని మనసు పీకుతూ ఉండేది....

ఈ గందరగోళంతో ఏం చెయ్యాలో ? ఏం చెయ్యకూడదో ? అర్ధం కాక విషయం మా అమ్మ మరియు నాన్నగారి వద్ద చెప్పి బాధ పడ్డాను.

అప్పుడు వారు ఏమన్నారంటే నువ్వు అంతసేపు పూజ వద్ద కూర్చుంటే పనులెలా జరుగుతాయి ? ఇంట్లో వారికి విసుగు వచ్చే అవకాశం ఉంది.

అందుకని నీ పనులు చేసుకుంటూనే కుదిరినప్పుడు దైవనామస్మరణ చేసుకుంటూ ఉండు. ఆన్నారు.

ఈ సలహా నాకు నచ్చింది. వీలున్నంత వరకూ పాటిస్తున్నాను.

ఆధునిక విజ్ఞానం అయినా ..ఆధ్యాత్మికత అయినా స్వార్ధ ప్రయోజనాలకు వాడకూడదు.

వ్రాసిన విషయాల్లో పొరపాట్లు ఉంటే దైవం క్షమించాలని ప్రార్ధిస్తున్నాను. ఎవరైనా తెలిసీతెలియక తప్పులు చేసినా .... దైవం వారిని ఒకవేళ శిక్షించవలసి వస్తే అది కూడా వారి మంచికే అవుతుంది.

దైవం కోరుకునేది . అందరూ పరమపదాన్ని పొంది ఎప్పటికీ పరమానందంగా ఉండాలనే.....

3 comments:

  1. ఈ రోజుల్లో ప్రేమభక్తితో కన్నా భయంతో పూజలను చేసేవారే ఎక్కువగా కనిపిస్తున్నారు.
    ------------
    ఏకాగ్రతతో పూజలు చేస్తున్నారు చాలులే అని సంతోషించవచ్చు. ఎందుకంటే ఏకాగ్రత దేనిలోవున్నా పని నేరవేరటానికి దోహదం చేస్తుందనుకుంటాను.

    ReplyDelete
  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
    నిజమేలెండి. భయంతోనయినా పూజ అంటూ చేస్తున్నారు . అయితే భయం లేకుండా పూజ చేస్తే మరింత సంతోషంగా ఉంటుంది కదా అనిపిస్తోంది.

    ReplyDelete
  3. ఇంకా నాకు ఏమనిపిస్తుందంటేనండి.......
    మనకు , ఇతరులు భయం వల్ల పలకరించటం కన్నా ..... ప్రేమగా పలకరించటమే బాగుంటుంది అనిపిస్తుంది కదా !
    అలాగే . దైవాన్ని కూడా మనము ప్రేమగా ఆరాధించటమే బాగుంటుంది.

    ReplyDelete