koodali

Wednesday, December 14, 2011

శాస్త్రీయ నిరూపణ.... టెక్నాలజీ.



నేను ఆధునిక శాస్త్రవిజ్ఞానానికి వ్యతిరేకిని కాదు. అయితే విజ్ఞానాన్ని ఒక పద్ధతి ప్రకారం ఉపయోగించుకోవాలి అన్నది నా అభిప్రాయం.

కొందరు ఏమంటారంటే శాస్త్రీయంగా నిరూపణ అయితేనే ఏ విషయాన్నయినా నమ్ముతాము అంటారు.

ఆధునిక శాస్త్ర విషయాలు కొన్ని , ఒకసారి నిరూపణ అయిందని భావించాక కొంతకాలానికి ఆ విషయం పొరపాటు అని తేలుతోంది.

ఇలా పదేపదే మార్పులుచేర్పులు జరుగుతున్నప్పుడు శాస్త్రబద్ధంగా నిరూపించటం అనేది ఎప్పటికి జరుగుతుంది ?

అంతిమంగా ఏ విషయమైనా ఇదీ సత్యమని తేలినప్పుడే కదా ! అది నిజమని నిరూపణ అయ్యేది.

ఒకసారి సత్యం అని నిరూపణ అయ్యాక కొంతకాలానికి మళ్ళీ అది పొరపాటని మళ్ళీ కొత్త సత్యం కనుక్కుంటే ఇక ఏది శాస్త్రీయమని నమ్మాలి ?

అందరూ తెలియని వాళ్ళే అయినప్పుడు ఏది తప్పో ? ఏది ఒప్పో ? ఎవరు నిర్ణయిస్తారు ?

హేతువాదులు చెప్పే శాస్త్రీయత అంటే ఏమిటి ? ఏదైనా అంతిమంగా నిర్ధారణ అయినప్పుడే గదా నమ్ముతారు.

ఎప్పటికప్పుడు మారుతూ ఉండే విషయం .శాస్త్రీయంగా నిరూపణ అయింది అని ఎలా చెప్పగలరు ?

అలా మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటూ, నిరూపణ నిరంతరాయంగా జరుగుతున్నప్పుడు దాన్ని ఎలా నమ్మాలి ?

........................

కొందరు నాస్తికులు ఏమంటారంటే , ...........ఆస్తికులు కూడా ఈ నాటి టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు కదా ! అంటారు. ..

మరి దైవం లేరనే నాస్తికులు కూడా ఆ దైవం ప్రసాదించే గాలిని పీల్చే బ్రతుకుతున్నారు.

వాళ్ళు తయారుచేసే అనేక వస్తువులు కూడా దైవసృష్టిలోని పదార్ధాలతో తయారుచేయబడినవే.

విమానాలు తయారుచేయటానికి ముందే పక్షులు గాలిలో ఎగురుతున్నాయి. నౌకలు తయారుచేయబడటానికి ముందే చేపలు నీటిలో ఈదుతున్నాయి.

సృష్టిలోని టెక్నాలజీని చూసి ఎంతో నేర్చుకుంటూ కూడా కొందరు ..... దైవం లేరు అంటారు. ఇది అన్యాయం.

ఈ నాటి టెక్నాలజీ లేకపోయినా ప్రాచీన కాలం నుంచీ ఆచారవ్యవహారాలు, పురాణేతిహాసాలు, ఇంకా ఎన్నో ప్రాచీన గ్రంధాలు ఇప్పటికీ అందుతూనే ఉన్నాయి. ఇక ముందూ కొనసాగుతాయి..

..............

కొందరు ఏమంటారంటే , మన దేశంలోని ప్రజల ఆలోచనాధోరణి వల్ల దేశం ఎంతో వెనకబడిపోయింది. ఇతరదేశాలు టెక్నికల్ గా ఎంతో అభివృద్ధిని సాధించాయి అంటారు.

ఆ దేశాలు మొదట అలా అభివృద్ధిని సాధించినట్లు కనిపించినా ఇప్పుడు చూడండి. పారిశ్రామికంగా అభివృద్ధి సాధించిన దేశాలు అనుకున్న దేశాలు ఆర్ధికమాంద్యంతో ఇబ్బందులు పడుతున్నాయి.

మరి వారికి పారిశ్రామికాభివృద్ధి జరిగీ కూడా ఆర్ధికమాంద్యం ఎందుకువచ్చింది ?
.........

అభివృద్ధి చెందిన టెక్నాలజీతో గొప్పగా కట్టిన కట్టడాలను చూసినప్పుడు గొప్పగానే అనిపిస్తుంది.

అబ్బో ! మనుషులు ఎంత ఎదిగిపోయారు కొండల్ని కూడా పిండి చేయగలుగుతున్నారు అనిపిస్తుంది.

కానీ, అలా కట్టడానికి వెనుక ఎంత ఇనుము, ఎంత ఇసుక, ఎంత కంకర ఇలా ఎన్ని సహజవనరులు వాడారో కూడా తెలుసుకుంటే.......

కట్టడాలనే కాదు ఈ రోజుల్లో మనం వాడుతున్న వస్తువుల్లో చాలా మనకు అనవసరమైనవే.

ప్రాధమిక అవసరాలైన ఆహారం, వైద్యం, రక్షణ, విద్య, వసతి.........ఇలాంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వటం మాని విలాసవంతమైన వస్తువుల ఉత్పత్తికి ప్రాధాన్యత ఇస్తున్నాము. అందువల్ల పేదరికం అలాగే ఉండిపోతూంది.

. మన పూర్వులు ఇలాగే విచ్చలవిడిగా సహజవనరులను వాడి ఉంటే , ఇప్పుడు మనకు ఇవేమీ ఉండేవి కాదు.

ఇలా అన్ని సహజవనరులను విపరీతంగా వాడేస్తే మనం మళ్ళీ ఇనుప గనులను, సృష్టించగలమా ? పిండి చేసిన కొండలను తిరిగి సృష్టించగలమా ?

కోరికలకు అంతెక్కడ ? మనిషి కోరికలను పెంచుకుంటూ పోతే భూమి లాంటి పది గ్రహాలలోని సహజవనరులైనా సరే సరిపోవు.

రాబోయే తరాలను దృష్టిలో ఉంచుకొని అయినా మనం మన అలవాట్లను మార్చుకోవాలి.

ఎంతో ఖర్చు పెట్టి, గొప్ప టెక్నాలజీతో కట్టడాలు కట్టినా భూకంపాలు వంటి వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. కట్టడాలు పడిపోకపోయినా కొద్దిగా బలహీనమైనా అంత పెట్టుబడీ వృధానే కదా !

ప్రకృతి ముందు మనిషి ఎంత ?

* దైవం అంటూ ఎవరూ లేరు..... మనిషే గొప్ప . అని ఎవరైనా భావించటం హనుమంతుని ముందు కుప్పిగంతులు వెయ్యటంలా హాస్యాస్పదం...


4 comments:

  1. ఏదీ శాశ్వత సత్యం వుండదు. నిరంతరం జరిగే మార్పులోనే సత్యాన్ని ఎప్పటికపుడు నిత్యనూతనంగా వెతకాలి . అలాగే వెతుకుతారు కూడా . దైవం అనేది విశ్వాసం . శాస్త్రీయత - విజ్ట్నానం అనేవి ఋఉజువును బట్టి ఆధారపడి వుంటాయి.

    ReplyDelete
  2. ప్రాధమిక అవసరాలైన ఆహారం, వైద్యం, రక్షణ, విద్య, వసతి.........ఇలాంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వటం మాని విలాసవంతమైన వస్తువుల ఉత్పత్తికి ప్రాధాన్యత ఇస్తున్నాము.
    --------------------
    మీరు చెప్పినది అక్షరాలా నిజం. కానీ ఎందుకని అల్లా అయ్యింది? శాస్త్రజ్ఞుల తప్పు కాదు. శాస్త్రజ్ఞులు చేసిన, చేస్తున్న, ఇంకా చెయ్య బోయే పనులు అల్లా మనం ప్రకృతిలో మనం చూస్తున్న పనులు, చేస్తున్న పనులు ఎల్లా జరుగుతున్నాయి?. కారణాలు ఏమిటి అని పరిశోధించి చేత నయినంతవరకూ ఆనాడు ఉన్న పరిజ్ఞానము బట్టి తెలిసికోవటం. ఇవ్వాళ అది తేల లేదు కాబట్టి అది తప్పు అని నిర్ధారించరు. ఉదా: God particle ఇంకా వెతుకుతూనే ఉన్నారు. కొన్ని బిలియన్ల డబ్బు ఖర్చు పెట్టిన తరువాత కూడా!

    కనుక్కున్న వాటిని ఏ విధంగా ఉపయోగించాలి అని నిర్ధారణ చేసేది రాజకీయ వేత్తలు, పారిశ్రామిక వేత్తలు. ఎమన్నా తప్పుంటే వీళ్ళదే.

    ReplyDelete
  3. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    ప్రాచీన విజ్ఞానం, చాలా ఆచార వ్యవహారాలు సరైనవే అని ఇప్పుడు నిరూపించబడుతోంది కదా ! గ్రహణాలు ఎప్పుడు వస్తాయో పంచాగం ప్రకారం లెక్కలు కట్టి ఎంతో ముందుగా చెప్పినా కూడా పంచాంగం శాస్త్రీయం కాదు అంటారు కొందరు. వాళ్ళకు ఇంకా ఎలా చెప్పగలం ?

    దైవం ఉన్నారని ... మహా భక్తులు రామకృష్ణ పరమహంస వంటి మహానుభావులు తాము దైవాన్ని చూశామని చెప్పటం జరిగింది. ఇలా ఎందరో భక్తులు తమ అనుభవాల ద్వారా చెప్పటం జరిగింది.


    ఆధునిక విజ్ఞానం కూడా అన్ని విషయాలకు ఋజువులు చూపించలేదు. ఉదా.....విశ్వావిర్భావం, బిగ్ బ్యాంగ్ ధియరీలను గురించి ఆధునిక శాస్త్రవేత్తలు చెపుతుంటారు. వాటిని నిరూపిస్తే కానీ మేము నమ్మము అని మేము కూడా అంటే వాటిని ఎలా నిరూపించగలరు ?

    ఇంకా వైద్యులు విటమిన్స్ గురించి చెబుతుంటారు. a, b, c, d,.. ...వగైరా విటమిన్స్ ఉన్నాయని మనం నమ్ముతాము. కానీ వాటిని ఎలా నిరూపించగలరు ? వాటిని చూడలేము, స్పర్శ ద్వారా గుర్తించలేము, వినలేము. మరి అవి ఉన్నాయని ఎలా నిరూపించగలరు ?


    తెలిసీతెలియని కొందరి వల్ల ప్రాచీనకాలం నుంచీ కొన్ని మూఢ నమ్మకాలు సమాజంలో వ్యాపించిన మాట నిజమే. అంత మాత్రాన ప్రాచీన విజ్ఞానం అంతా తప్పే అనటం అన్యాయం.

    ఆధునిక విజ్ఞానం వల్ల కూడా సమాజానికి కొన్ని నష్టాలు జరుగుతున్నాయి. ఆధునిక శాస్త్రవేత్తల సిద్ధాంతాలు కొన్ని తప్పని కొంతకాలానికి తెలుస్తోంది. ఆధునిక విజ్ఞానం యొక్క మంచిచెడులు తెలుసుకోవటానికి సమయం పడుతోంది.

    ప్రాచీనవిజ్ఞానం అంటే పూర్వులు తమ అనుభవంతో విలువైన విషయాలను ముందుతరాల హితం కోసం మనకు అందించారు. వాటిని చిన్నచూపు చూడటం తగదు..


    ప్రాచీన విజ్ఞానాన్ని తక్కువగా చూస్తూ ..ఆధునిక విజ్ఞానం మాత్రమే గొప్ప అనటాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను.

    ఏ విజ్ఞానం అయినా దానివల్ల ప్రపంచానికి మంచి జరగాలి. అది ప్రాచీనమా ? ఆధునికమా ? అనే వాదవివాదాలు ముఖ్యం కాదు...

    ReplyDelete
  4. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    తప్పు ఎవరిదైనా ........ ఇప్పుడు కొన్ని ఆధునిక ఆవిష్కరణల వల్ల ప్రపంచం గ్లోబల్ వార్మింగ్ వంటి ప్రమాదకరస్థితిని ఎదుర్కుంటోంది. పెద్దగా చదువుకోని సామాన్యుల కన్నా చదువుకుని అన్నీ తెలుసుకున్న వాళ్ళదే బాధ్యత ఎక్కువగా ఉంటుంది.

    ప్రపంచం ఇలా తయారవటానికి అందరూ కారణమేనండి. ప్రజలంటే సామాన్య ప్రజలు, శాస్త్రవేత్తలు, రాజకీయనాయకులు, పారిశ్రామిక వేత్తలు ఇలా అందరూ ఉంటారు.

    * ముఖ్యంగా సమాజంలో నైతిక విలువలకు ప్రాధాన్యత తగ్గిపోవటం ...........కోరికలు విపరీతంగా పెరిగిపోవటం ఈ పరిస్థితికి ముఖ్యమైన కారణాలుగా కనిపిస్తున్నాయి.

    ReplyDelete