koodali

Saturday, December 3, 2011

మితిమీరిన పారిశ్రామీకరణవల్ల నిరుద్యోగం , ఉద్యోగాలు పోవటం , ఇంకా పర్యావరణానికి హాని.......

 
 
అసలు అభివృద్ధి అంటే పరిశ్రమలు విపరీతంగా పెడితే అభివృద్ధి ఉన్నట్లా ?
 పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందటం అంటే సహజవనరులను విపరీతంగా వినియోగించటం. సహజవనరులు ఏర్పడాలంటే ఎన్నో వేల సంవత్సరాల కాలం పడుతుందట. సహజవనరులు అన్నీ మన అంతులేని కోరికల కోసం వాడేసుకుని రాబోయే తరాలకు ఖాళీ చిప్ప చేతికిస్తామా ? ( పొల్యూట్ అయిపోయిన ప్రపంచంతో సహా ).

* ప్రజల పేదరికం పోవాలంటే సంపద అందరికి సమానంగా అందటం ముఖ్యం. అంతేకానీ పరిశ్రమలు విపరీతంగా స్థాపించటం వల్ల అభివృద్ధి జరగదు.

ఉన్న సంపదంతా కొందరు బడావాళ్ళు అందినంతవరకూ దోచేస్తుంటే ఇక పేదరికం ఎలా పోతుంది ?

పారిశ్రామీకరణ వల్ల కొంతకాలం బాగానే ఉన్నట్లు కనిపించినా అది బలుపు కాదు వాపు అని ఇప్పుడిప్పుడే అందరికీ తెలుస్తోంది. ఇప్పుడు ప్రపంచమంతటా ఆర్ధికమాంద్యం సమస్య చూస్తూనేఉన్నాము కదా !

పారిశ్రామీకరణ తప్పుకాదుకానీ , ఆధునికవిజ్ఞానాన్ని ఎంతలో వాడుకుంటే మంచిదో అంతలోనే వాడుకోవాలి. అతి పనికిరాదు.... యంత్రాలే అన్ని పనులు చేసేస్తే ఇక మనుషులకి మిగిలేది
నిరుద్యోగమే కదా!

.............


ఇది పాతటపానే. కానీ మళ్ళీ వేయాలనిపించింది.
........................
ఈ రోజుల్లో నిరుద్యోగం , ఉన్న ఉద్యోగాలు పోవటం.... ఇలాంటి సమస్యలు ఉన్నాయి. మితిమీరిన పారిశ్రామీకరణ వల్ల కూడా నిరుద్యోగసమస్య వస్తోందని నా అభిప్రాయమండి.

పనులన్నీ
యంత్రములే చేసేయ్యటం వల్ల మనకి చెయ్యటానికి ఇక పనులు , ఉద్యోగాలు ఎలా వస్తాయి ?


1. పాతకాలంలో ఇప్పటిలా ఇన్ని యంత్రాలు ఉండేవి కావు. ఉదా..వాళ్ళు ఒక వస్తువును తయారుచేయాలంటే ఒక వారం రోజులు సమయం తీసుకునేవారనుకుందాము. దీనివల్ల ఆ వారమంతా రోజూ చేతి నిండా పని ఉండేది. ఇలా చెయ్యటానికి ఎప్పుడూ పని ఉంటుంది...


అయితే ఇలా నెమ్మదిగా ఎక్కువ వస్తువులు తయారు చెయ్యలేము కాబట్టి భూమి పైన ఎక్కువ చెత్త వస్తువులు పేరుకుపోకుండా పర్యావరణం శుభ్రంగా ఉంటుంది.

2. ఈ రోజుల్లో అదే వస్తువును యంత్రాల సహాయంతో ఒక గంట సమయంలోనే ఒక వంద తయారుచేస్తున్నారు. దానివల్ల ఏమి జరుగుతుందంటే .. పని త్వరగా అయిపోయి ఇక చేయటానికి పని ఉండదు . ( నిరుద్యోగం. )

ఇంకా , ఇలా గుట్టలుగా వస్తువులను ఉత్పత్తి చేయటం వల్ల ఖనిజనిల్వలు ఖాళీ అయిపోవటం , భూమి పైన గుట్టలుగా పేరుకుపోయిన చెత్త వస్తువులతో ఎన్నో సమస్యలు.

.కంపెనీలు ఇలా గుట్టలుగా వస్తువులు తయారు చేస్తాయి . ఇలా గుట్టలుగా వస్తువులను తయారుచేసిన తర్వాత వాటిని ఎవరైనా కొంటేనే వారికి లాభాలు వచ్చి ఉద్యోగులకు జీతాలు ఇవ్వగలరు. ఎవరూ కొనకపోతే నష్టాలు వచ్చి జీతాలు ఇవ్వలేక ఉద్యోగులను తీసివేస్తారు.

అలాగని ఎవరు మాత్రం ఎంతకని వస్తువులు కొంటారు ? మనకు అప్పటికే ఇంటినిండా వస్తువులు ఉంటాయి, ఎన్నని కొంటాము ? కొత్తవి కొనేకొద్దీ ఇల్లంతా గజిబిజి .

మా ఇల్లు ఇలాగే చూసినవన్నీ కొని, అలా కొన్నవాటితో కొంచెం గందరగోళంగా ఉంటుంది. వాటిని పారవెయ్యలేము.

పారవేసినా అవి ఎక్కడో ఒకచోట భూమిపైనే చెత్తలా ఉంటాయి గానీ మాయమయ్యేవి తక్కువ . అందుకని ఇప్పుడు ఎంతో అవసరమయితే తప్ప , కొత్తవి కొనటం మానేసామండి.

ఎవరికయినా కొంతకాలానికి ఇలాగే విరక్తి వస్తుంది. అంటే దీనిని బట్టి మనకి ఏమి తెలుస్తుందంటే

1. వస్తువులను ఎవరూ కొనకపోతే , కంపెనీలకు నష్టం వచ్చి అందులోని వారికి ఉద్యోగాలు పోతాయి.

2. వస్తువులను కొంటే కంపెనీలకు లాభాలు వచ్చి ఉద్యోగాలు ఉంటాయి. కానీ భూమి ,పర్యావరణం మట్టికొట్టుకుపోతాయి.


3.అందుకే నాకు ఏమనిపిస్తుందంటేనండి ,పారిశ్రామీకరణ పూర్తిగా తప్పని అనటం లేదు. దానివల్ల కొన్ని లాభాల ఉన్నాయి. అయితే , మనకి కావలసినంత అంటే , మనిషి చేయలేని కష్టమయిన పనులకు యంత్రములను వాడుకోవాలి .

4. గుట్టలుగా వస్తువులను తయారుచేయటం మానాలి.

5. చేతివృత్తులను ప్రోత్సహించాలి.

6. అంతగా వస్తువులు తయారుచేయటం అవసరం లేని ...... అర్ధ శాస్త్రం , పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ , పర్యాటకం , ఆటలు , సంగీతం, వినోదం ఇలాంటివాటితో ఆర్ధికాభివృద్ధిని సాధించటానికి ప్రయత్నించాలి.

ఈ వినోదం లాంటివి మితిమీరి ప్రజలు తప్పుదారిన వెళ్ళకుండా , వారిలో సోమరితనం పెరగకుండా చూడాలి .

దీనివల్ల గ్లోబల్ వార్మింగ్ ఇలాంటివి తగ్గుతాయి. అన్నిటికన్నా కొత్త వస్తువులు కొనాలన్న మోజు , ఇలా ... మన కోరికలను కొంచెము తగ్గించుకోవాలి..

దైవభక్తి , ఇలాంటి వాటి విషయంలో తప్ప ..ప్రతి పనికీ ఒక పరిధి ( లిమిట్ ) ఉంటుంది. ఉదా..ఆరోగ్యానికి మంచిది కదా అని విటమిన్ టాబ్లెట్స్ విపరీతంగా వేసుకుంటే అనారోగ్యం కలుగుతుంది.

అలాగే పెద్దలు చెప్పినట్లు , దేనినయినా ఎంతవరకో అంతవరకే వాడుకోవాలి.. యంత్రములను వీలయినంత తగ్గించటం వల్ల అందరికీ పని దొరికే అవకాశం ఉంది. పర్యావరణం బాగుంటుంది.

* ఇంకా , మనము ఒళ్ళు వంచి పనులు చేసుకోవటం వల్ల మన ఆరోగ్యం ఎంతో బాగుంటుంది.
 

No comments:

Post a Comment