koodali

Monday, June 27, 2011

లేకపోతే కుటుంబం అంటూ లేని ఆటవిక కాలం నాటి వ్యవస్థ మళ్ళీ వచ్చినట్లే..

 
ఈ రోజుల్లో చాలా కాపురాలు విడాకులకు దారితీయటం ఎక్కువగా జరుగుతోంది. ఇలా జరగటానికి రకరకాల కారణాలున్నాయి.( దయచేసి పూర్తిగా చదవండి. )

అందులో కొన్ని 1. అందరికి పనివత్తిడి విపరీతంగా పెరగటం, 2. భార్యాభర్తల మధ్యన మూడోవ్యక్తి .. లాంటివి.

ఇలాంటి నెగిటివ్ విషయాల గురించి చర్చించకూడదు అంటారు కొందరు.

* నాకు ఏమనిపిస్తుందంటే, వెయ్యి అబద్దాలు ఆడి అయినా ఒక పెళ్ళి చేయటం కన్నా ... కూలిపోబోతున్న కాపురాలలో ఏ ఒక్క కాపురాన్ని కాపాడినా ఎక్కువ పుణ్యం వస్తుంది అని.


* 1.పనివత్తిడి.. పెద్దవాళ్ళు .పనులు చేయవద్దని, పిల్లలు చదువుకోవద్దని ఎవరూ అనరు. అయితే శరీరం తట్టుకోలేనంతగా వత్తిడి వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ.


ఈ రోజుల్లో అందరూ నెలకు 50 వేలు అంతకన్నా ఎక్కువ జీతం రావాలని కోరుకుంటున్నారు. అయితే యాజమాన్యం అంతపెద్ద మొత్తం జీతాలు ఇస్తున్నప్పుడు జీతానికి తగ్గ పని చేయించుకుంటారు కదా !


ఉద్యోగస్తుల సంఖ్య తగ్గించి ఉన్న వాళ్ళతోనే మొత్తం పని చేయిస్తారు. అంటే ఒకే వ్యక్తి ఇద్దరి పని చేయవలసి వస్తుంది.

అందువల్ల విపరీతంగా అలసిపోయి జబ్బులు కొని తెచ్చుకొంటారు.

నాకు ఏమనిపిస్తుందంటే, యాజమాన్యాలు ఒకే వ్యక్తికి 50 వేలు జీతం ఇవ్వటం కన్నా ....... 60 వేలు చొప్పున, ఒక్కొక్కరికి 30 వేలు జీతం ఇచ్చేటట్లు , ఇద్దరు ఉద్యోగస్తులను నియమించితే బాగుంటుంది.


అప్పుడు నిరుద్యోగుల సంఖ్యా తగ్గుతుంది. ఉద్యోగస్తులు అనారోగ్యాలు, సెలవులు లేకుండా ఉత్సాహంగా చేసే పని వల్ల , పనిలో నాణ్యత బాగుంటుంది.

ఎంత పెద్ద అధికారం లో ఉన్న వ్యక్తి అయినా మరింత మంది ఉద్యోగులను నియమించి అందరూ సమర్ధవంతంగా పని చేసేలా ప్రోత్సహించటం ద్వారా ... పని వత్తిడి తగ్గించుకోవచ్చు.అలా నిరుద్యోగం కూడా తగ్గించవచ్చు.


* ఎవరికయినా పని వత్తిడి వల్ల ఆరోగ్యం పాడయితే ఉద్యోగం పోయే అవకాశం కూడా ఉంది. సంపాదన ముఖ్యమే కానీ, అందుకు మనుషుల ఆరోగ్యం కూడా ముఖ్యమే. కదా !.

అదీకాక 24 గంటలు ఆఫీసుల్లోనే పని చేస్తే ఇక కుటుంబం బాగోగులు ఎవరు చూస్తారు ?

కుటుంబం అన్నాక భార్యకు , భర్తకు ఎన్నో బాధ్యతలు ఉంటాయి. వారు తల్లిదండ్రులుగా పిల్లలకూ ఎంతో సమయం కేటాయించవలసి వస్తుంది. లేకపోతే ఆ పిల్లలు చెడిపోతారు.

ఇంకా, విపరీతమైన పనివత్తిడి వల్ల కోపం, అసహనం, చిరాకులు, జబ్బులు తప్పవు. ఇక కుటుంబంలో కలతలు మొదలవుతాయి.


* ఉదా..ఒక కుటుంబం గురించి చెబుతానండి. భార్యా,భర్త ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నారు. భార్య ఒకదగ్గర, భర్త వేరే రాష్ట్రంలో ఉద్యోగం చేస్తున్నారు.

భర్తకు వంట చేయటం వచ్చు. కానీ ఆఫీసులో పని పూర్తయి ఎప్పుడో రాత్రికి ఇంటికి వస్తారు.

ఇక అప్పుడు వంట చేసే ఓపిక లేక హోటల్లో భోజనం చేసేసి ఇంటికి వచ్చేవారు. హోటల్ మూసేస్తే ఇక ఇంట్లో ఏమైనా ఉంటే తినటం , లేకపోతే ఇక పస్తే.

అలా చాన్నాళ్ళు గడిచాక ఆరోగ్యం పాడయ్యి ఒకరోజు హఠాత్తుగా ఆయన మరణించారు. ఇందులో ఎవరిది తప్పో ?

* 2. భార్యాభర్తల మధ్యన ఉదా..ఒక కుటుంబం గురించి..ఒక ఇంట్లో అద్దెకు చేరిన కొత్తలో మా పొరుగున ఒక కుటుంబం ఉన్నారు.

ఆ ఇంటి ఆమె నాకు ఎప్పుడూ కనబడలేదు. ఆమె గురించి మా ఎదురింటి ఆమెను అడిగాను .

ఆమె ఏమి చెప్పారంటే..ఆ ఇంట్లోని భార్యాభర్తా పిల్లలు బాగానే ఉండేవారట.

అయితే, భర్తకు వేరే ఆమెతో పరిచయమయిందట. ఆ విషయం భార్యకు తెలిసి గొడవలు జరిగాయట.

ఇక భార్య తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందట.

వారి పిల్లలు స్కూల్ నుంచి వచ్చి తమకు చేతనయినంతలో వంట చేసుకొనేవారు. ఇరుగుపొరుగు ఎంతో కాలం ఇవ్వరు కదా !

కొంతకాలానికి వారు ఇళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు.

నాకు అనిపించింది ఆ భార్యకు భర్త వల్ల తట్టుకోలేనంత బాధ కలిగింది. ( అలాంటి పరిస్థితి తట్టుకోవటం కష్టమే . )

కానీ , పిల్లల కోసమైనా ఆమె జీవించి ఉంటే, కనీసం పిల్లలయినా సంతోషంగా ఉండేవారు కదా ! అనిపించింది.

* ఇళ్ళలో తల్లిదండ్రుల మధ్యన విడాకులు,ఇంకా ఇలాంటి గొడవలు చూసిన పిల్లల మనస్తత్వంలో ఒక తేడా వస్తుంది.

ఇంకా , చిన్నతనం నుంచీ హాస్టళ్ళలో పెరిగిన పిల్లలకు కూడా కుటుంబ వ్యవస్థ గురించి సరైన అవగాహన ఉండటం లేదు.

* అందుకేనేమో , ఈ మధ్య కాలంలో " సహజీవనం " అనే కొత్త తరం తయారవుతోంది. ఇలా జరగటానికి ఆ పిల్లలను తప్పుపట్టలేము.

కుటుంబవ్యవస్థ ఇలా బీటలు వారటానికి ఎందరో బాధ్యులు.
 
కుటుంబం గురించి మాట్లాడితే సంకుచిత తత్వం అంటారు కొందరు.

* కానీ ఇప్పటికి అయినా పెద్దవాళ్ళు మేలుకొని , మన పెద్దలు ఎంతో ఆలోచించి , ఏర్పరిచి , మనకు అందించిన , ప్రపంచంలోనే గొప్పదైన భారతీయ కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలి.

లేకపోతే కుటుంబం అంటూ లేని ఆటవిక కాలం నాటి వ్యవస్థ మళ్ళీ వచ్చినట్లే.
.
 

No comments:

Post a Comment