koodali

Sunday, June 19, 2011

జగత్తుకే తండ్రి అయిన పరమాత్మకు కృతజ్ఞతలు.



జన్మనిచ్చిన తల్లిదండ్రులను ప్రేమిస్తాము. అలాగే, జగత్తు అంతటికీ తల్లిదండ్రులు అయిన జగన్మాతాపితరులను ( పరమాత్మను ) ప్రేమించాలి.


ఆ పరమాత్మ మనకోసం ఎన్నో ఇచ్చారు.

ప్రాణవాయువును అందించారు. దాహం తీరటం కోసం నీటిని , ఆకలి తీరటం కోసం ఆహారాన్ని సృష్టించి ఇచ్చారు.


వెచ్చటి సూర్యరశ్మిని, వెండి వెన్నెలను, వైద్యం కోసం ఎన్నో ఔషధాలను సృష్టించి ఇచ్చారు.

మహోన్నతమైన మంచు పర్వతాలను, మహా సముద్రాలనూ సృష్టించారు.

రసభరిత ఫలాలను , పరిమళ భరిత పుష్పాలను, పిల్ల తెమ్మెరలను, పైరగాలిని, పసిడిపంటలను,..ఇలా ఎన్నింటినో ఇస్తూనే ఉన్నారు.

ఇంకా, మానవులు అహంకరించి దారి తప్పకుండా , ఒకింత భయ భక్తులతో ఉండటం కోసం అంతులేని అగాధాలను, అగ్నిపర్వతాలవంటి వాటిని కూడా సృష్టించారు.

తప్పులు చేస్తున్న మానవులను హెచ్చరించటానికి భగవంతుడు సునామీలను, సుడిగాలులనూ ( కూడా సృష్టించటం జరుగుతుంది.

అయినా తప్పులను సరిదిద్దుకొనకపోతే ఎవరి కర్మకు వారే బాధ్యులుకదా !

( కొంతకాలం క్రితం తండ్రి అంటే గౌరవంతో పాటూ ఒకింత భయం కూడా పిల్లలకు ఉండేది.

మళ్ళీ మనుమల విషయం వచ్చేసరికి మాత్రం తాతగారి వద్ద చనువు , . తండ్రి అంటే భయం ఉండేది. అలా పిల్లలు భయభక్తులతో ఉండేవారు. )


మనకు ఎంతో తెలుసు అనుకుంటున్నాము కానీ, ఇంకా మనకు తెలియని అంతులేని అనంత విజ్ఞానం ఆకాశమంతా నిండి ఉంది.

మనకు ఎన్నోఇచ్చిన భగవంతునికి ఏ విధంగా కృతజ్ఞతలు తెలుపుకోగలం ?

పువ్వులను సమర్పించాలంటే మొక్కలను అనుజ్ఞ అడగాలి.

పండ్లను సమర్పించాలంటే చెట్లను అడగాలి.

పాలు సమర్పించాలంటే ఆవులను అడగాలి.

పిండివంటలను సమర్పించాలంటే అందులోకి కావలసిన బియ్యం, పప్పులు, బెల్లం ,నూనె.. వగైరాలు మొక్కల నుంచే వస్తాయి కదా !

నగలు, వజ్రవైఢూర్యాలు సమర్పించాలంటే అంత స్థోమత అందరికి ఉండదు కదా !

అయినా , బంగారు,వజ్రాల గనులను కూడా దైవమే సృష్టించారు కదా !

మనతో సహా ఈ విశ్వంలో అన్నీ భగవంతుని సృష్టే కదా !


మరి,మనకు ఎన్నో ఇచ్చిన భగవంతునికి ఏ విధంగా కృతజ్ఞతలు తెలుపుకోగలం ?


పసిపిల్లలు కొద్దిగా ఆహారపదార్ధాన్ని అయినా , తన చిట్టిచిట్టి చేతులతో అమ్మానాన్నా నోటికి అందిస్తే ఆ తల్లిదండ్రులు ఎంత ఆనందపడతారో .భగవంతుడు కూడా అంతే.


భక్తులు ఆప్యాయంగా సమర్పించిన చిన్న దానితో వారు ఎంతో ఆనందపడతారు.

పెద్దలు ఏం చెబుతారంటే ...భగవంతుని ప్రేమించాలి. ,ఇంకా , మనము ధర్మబద్ధంగా జీవించటం ద్వారా దైవాన్ని
సంతోషపెట్టవచ్చు.అని. .

" మనసును జయిస్తే విశ్వాన్ని జయించినట్లే " అంటారు పెద్దలు.

ఆ మనసును అదుపులో పెట్టుకోలేక మనం ఎన్నో తప్పులు చేస్తూ తద్వారా ఎన్నో బాధలు అనుభవిస్తున్నాము.


భగవంతుడు మనకు ఎన్నో ఇచ్చినా తృప్తి లేక, ఇంకా ఏదో కావాలని ఆకాశాన్ని తాకే అత్యాశతో తడబడుతూ తప్పుటడుగులు వేస్తున్నాము.
ఆ అడుగులు ఎక్కడికి తీసుకువెళతాయో ?


పిల్లలు తప్పులు చేస్తుంటే తల్లిదండ్రులు చూస్తూ ఊరుకోరు కదా !

అలాగే పెడత్రోవన వెళ్తున్న మానవులను మంచి దారిలోకి తేవటానికి దైవం ఎన్నో ముందస్తు హెచ్చరికలు చేస్తారట.

అయినా వినకపోతే భగవంతుడు కూడా తన పద్దతిలో తాను సృష్టిని రక్షించుకొంటారు.

తమ పిల్లలు ధర్మబద్దంగా జీవించి , తమకు మంచి పేరు తేవాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. అప్పుడే వారు సంతోషపడతారు.

అలాగే భక్తులు కూడా ధర్మబద్ధంగా జీవించి భగవంతుని సంతోషపెట్టాలి.


అంతేకానీ, భక్తులట ! .. చూడండి !, ఎన్ని చెడ్డ పనులు చేస్తున్నారో ? .. అని ,. నాస్తికులు నవ్వేటట్లు, వెక్కిరించేటట్లు భక్తులు అనిపించుకొనేవారు ప్రవర్తించకూడదు కదా !


భగవంతుని భక్తులంటే ఇంత గొప్పగా ఉండాలి ... అని అందరూ మెచ్చుకునేటట్లు భక్తుల ప్రవర్తన ఉండాలి. ఆ విధంగా భగవంతుని సంతోషపెట్టవచ్చు...

ఆ విధంగా జీవితము గడపటానికి కనీసము ప్రయత్నం చేద్దాము..

మనం జీవించటానికి మొక్కలు, జంతువుల వంటి ఎన్నో ప్రాణుల సహాయం అవసరం కదా ! .

అందుకే మనతో పాటు లోకమంతా సుఖంగా ఉండాలని అందరూ దైవాన్ని కోరుకోవాలని పెద్దలు చెబుతుంటారు.


No comments:

Post a Comment