koodali

Monday, December 13, 2010

మన ఆహారపు అలవాట్లను కొద్దిగా మార్చుకుంటే చాలా లాభాలు ...............

 

 

మన ఆహారపు అలవాట్లను కొద్దిగా మార్చుకుంటే చాలా లాభాలు ఉంటాయని చాలామంది చెబుతున్నారు.

మనము వరి, గోధుమను,......... ఆహారంలో ఎక్కువగా వాడుతున్నాము. వాటితోపాటు ఇతర ఆహారధాన్యాలను కూడా ఆహారంగా తీసుకుంటే అన్నిరకాలుగా మంచిది. వరి పంట పండించటానికి ఎక్కువగా నీరు కావాలి.


కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం తక్కువగా ఉంటుంది. అక్కడ చిరుధాన్యాలు అయిన రాగులు, జొన్నలు, సజ్జలు ఇలాంటివి బాగా పండుతాయి. వాటికి ఎక్కువ నీరు అవసరం లేదు. చీడపీడల సమస్య కూడా తక్కువగా ఉంటుందట. అవి చాలా బలమైన ఆహారమని అంటున్నారు.


మనం ఒక పూట వరి , గోధుమ తీసుకుని రెండోపూట ఇతరరకాలు ఆహారంలో తీసుకుంటే బలానికి బలం. వర్షపాతం తక్కువగా ఉండే ప్రాంతాలవారికి వారు పండించిన పంటలకు తగ్గ ఫలితం వస్తుంది. ఆహార కొరత తీరుతుంది.


ఇక మన పెద్దలు నవధాన్యాలుగా వడ్లు, గోధుమలు , కందులు, పెసలు, సెనగలు, అనుములు, నువ్వులు, మినుములు , ఉలవలు ఇలా .......... చెప్పటంలో ఇవన్నీ మనకు ఉపయోగమైనవని మనం గ్రహించవచ్చు.


నువ్వులతో చేసిన పదార్ధములలో ఎంతో ఐరన్ ఉంటుందట. మన పెద్దవాళ్ళు ఉడికించిన అనుములు , పెసలు, బొబ్బర్లు ఇలాంటివి చిరుతిళ్ళుగా తినేవారమని చెబుతుంటారు. మరి మనము పిజ్జాలు, బర్గర్లు తింటున్నాము.


ఇప్పుడయితే అలాంటివి తింటే పిల్లలకు కూడా అజీర్తి చేస్తుంది. ఇక పెద్దవాళ్ళకి ఏమి అరుగుతాయిలెండి. పనులన్నీ యంత్రాలకి అప్పజెప్పి మనం ఆయాసపడుతూ కూర్చుంటే అంతే మరి. మనము మెత్తని కేక్స్, బ్రెడ్, ఐస్ క్రీం ఇలాంటి వాటికి శరీరాన్ని అలవాటు చేశాము కదా !


పళ్ళు కూడా చెరకు గడలు లాంటి గట్టి పదార్ధములను నమలలేవు . కొన్నాళ్ళకి శరీరము పనిచెయ్యాలన్నా సహకరించదు. సరేలెండి ఈ సోది ఎప్పుడే ఉండేదే. చాలామందికి బోర్.


సరే, రోజూ .... వరి , గోధుమనే కాకుండా అన్నిరకములు సమపాళ్ళలో తీసుకుంటే మంచిది. పూర్వం పేరంటం వంటి ఫంక్షన్స్ లో నానబెట్టిన శనగలు పంచేవారు. ఉలవలు కూడా మంచిబలవర్ధకమైన ఆహారం.


ఇవన్నీ తిన్నా అప్పటివారికి ఏమీ తేడా చేసేది కాదు. తమపనులు తాము కష్టపడి చేసుకోవటం వల్ల , అన్నీ ఆహారపదార్ధములు చక్కగా అరిగి మంచి పుష్టిగా ఉండేవారు.


ఇప్పుడయితే ఇవన్నీ తింటే కాళ్ళు, కీళ్ళు పట్టేస్తాయి. కొన్ని రోజులు డాక్టర్ చుట్టూ తిరగటానికే సరిపోతుంది.


చిరుధాన్యాలైన రాగులు, జొన్నల యొక్క పిండి గోధుమ పిండితో కలిపి రొట్టెలు చేసుకోవచ్చు, ఇంకా నువ్వుల లడ్లు, జొన్న ఉప్మా, బొబ్బర్లతో వడలు ఇలా చాలామంది ఎన్నో వంటలు వ్రాస్తున్నారు గదా ఈ రోజుల్లో.


రాగి అంబలి అందరికీ తెలిసిందే. కొన్ని ప్రాంతాలలో గుడులలో , అమ్మవారికి రాగి అంబలిని నైవేద్యముగా పెట్టి భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. మనము అది బలమైన ఆహారమని తెలుసుకోవాలని పెద్దలు ఇలా ఏర్పాటు చేసిఉంటారు.

మనమేమో అవన్నీ వట్టి చాదస్తాలుగా భావిస్తాము. మన పూర్వులు ఎన్నో ఆలోచించి ఆచారములు ఏర్పాటు చేశారు.


నేను ఇవన్నీ కొంచెం తొందరగా వ్రాస్తున్నానండి. ఈ మధ్యన పనివత్తిడి బాగా పెరిగింది. ఇంకో పది రోజులు ఇలాగే పని వత్తిడి ఉంటుందేమో .

4 comments:

  1. మనం ఒక పూట వరి , గోధుమ తీసుకుని రెండోపూట ఇతరరకాలు ఆహారంలో తీసుకుంటే బలానికి బలం.
    ----
    మంచి సలహా. థాంక్స్ ఫర్ ది పోస్ట్.

    ReplyDelete
  2. ధన్యవాదములు నేనే మీకు చెప్పాలండి..

    ReplyDelete
  3. మంచి సలహా - ప్రయత్నించాలి.

    ReplyDelete
  4. మీకు ధన్యవాదములండి. గత కొన్ని రోజులుగా పనివత్తిడిలో బ్లాగ్ చూడటానికే కుదరలేదండి. మీ కామెంట్ నిన్ననే చూశానండి. ఆలస్యమయినందుకు దయచేసి క్షమించండి..

    ReplyDelete