koodali

Friday, December 10, 2010

శ్రీ టెంబెస్వామి

 

 

శ్రీ టెంబెస్వామి
ఈ కధ శ్రీ శిరిడి సాయిబాబా జీవిత చరిత్రము గ్రంధము లోనిదండి.

యోగులు ఒకరినొకరు అన్నదమ్ములవలె ప్రేమించుకొనెదరు. ఒకానొకప్పుడు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వాముల వారు ( టెంబెస్వామి ) రాజమండ్రిలో మకాం చేసిరి. ఆయన గొప్ప నైష్ఠికుడు , పూర్వాచారపరాయణుడు, జ్ఞాని, దత్తాత్రేయుని యోగిభక్తుడు.


నాందేడు ప్లీడరగు పుండలీకరావు వారిని జూచుటకై కొంతమంది స్నేహితులతో పోయెను. వారు స్వాములవారితో మాట్లాడుచున్నప్పుడు సాయిబాబా పేరు శిరిడీ పేరు వచ్చెను.


బాబా పేరు విని స్వామి చేతులు జోడించి, ఒక టెంకాయను దీసి పుండలీకరావు కిచ్చి యిట్లనిరి. " దీనిని నా సోదరుడగు సాయికి నా ప్రణామములతో నర్పింపుము. నన్ను మరువవద్దని వేడుము. నా యందు ప్రేమ చూపుమనుము. " ఆయన స్వాములు సాధారణముగా నితరులకు నమస్కరించరనియు కానీ బాబా విషయమున ఇది యొక అపవాదమనియు చెప్పెను.


పుండలీకరావు ఆ టెంకాయను , సమాచారమును శిరిడీకి దీసికొని పోవుటకు సమ్మతించెను. బాబాను స్వామి సోదరుడనుట సమంజసముగా నుండెను. ఏలన బాబా వలె వారును రాత్రింబవళ్ళు అగ్నిహోత్రమును వెల్గించియే యుంచిరి.

ఒక నెల పిమ్మట పుండలీకరావు తదితరులును శిరిడీకి టెంకాయను దీసికొని వెళ్ళిరి. వారు మన్మాడు చేరిరి. దాహము వేయుటచే ఒక సెలయేరు కడకు బోయిరి.


పరగడుపున నీళ్ళు తాగకూడదని కారపు అటుకులు ఉపాహారము చేసిరి. అవి మిక్కిలి కారముగా నుండుటచే టెంకాయను పగులగొట్టి దాని కోరును అందులో కలిపి యటుకులను రుచికరముగా జేసిరి. దురదృష్టము కొలది యా కొట్టిన టెంకాయ స్వాములవారు పుండలీకరావు కిచ్చినది.


శిరిడీ చేరునప్పటికి పుండలీకరావుకీ విషయము జ్ఞప్తికి వచ్చెను. అతడు మిగుల విచారించెను. భయముచే వణకుచు సాయిబాబా వద్దకేగెను.

టెంకాయ విషయమప్పటికే సర్వజ్ఞుడగు బాబా గ్రహించెను. బాబా వెంటనే తన సోదరుడగు టెంబెస్వామి పంపించిన టెంకాయను దెమ్మనెను.


పుండలీకరావు బాబా పాదములు గట్టిగా బట్టుకొని , తన తప్పును , అలక్ష్యమును వెలిబుచ్చుచు , పశ్చాత్తాపపడుచు , బాబాను క్షమాపణ వేడెను. దానికి బదులింకొక టెంకాయను సమర్పించెదననెను.


కానీ బాబా యందులకు సమ్మతించలేదు. ఆ టెంకాయ విలువ సాధారణ టెంకాయ కెన్నో రెట్లనియు దాని విలువకు సరిపోవునదింకొకటి లేదనియు చెప్పుచు నిరాకరించెను.


యింకను బాబా ఇట్లనెను. " ఆ విషయమై నీవే మాత్రము చింతింప నవసరములేదు. అది నా సంకల్పము ప్రకారము నీ కివ్వబడెను. తుదకు దారిలో పగులగొట్టబడెను. దానికి నీవే కర్తవని యనుకొననేల ? మంచిగాని చెడ్డగాని చేయుటకు నీవు కర్తవని యనుకొనరాదు. గర్వాహంకారరహితుడవయి యుండుము. అప్పుడే నీ పరచింతన యభివృద్ధి పొందును. "ఎంత చక్కని వేదాంత విషయమును బాబా బోధించెనో చూడుడు. !


( ఇక్కడ " మంచి గాని చెడ్డ గాని చేయుటకు నీవు కర్తవని యనుకొనరాదు ) అంటే ........ కొంతమంది అవకాశవాదులు దీనిని సాకుగా తీసుకుని ......... చెడ్డ పనులు చేసి వాటికి తాము కర్తలం కాదు అని భావించమని దీనికి అర్ధం కాదు.


ఈ కధలో జరిగిన సంఘటనలా ........... పూజల్లో పొరపాటుగా,....... పొరపాట్లు జరిగినప్పుడు భక్తులు అదే ఆలోచిస్తూ భయపడకూడదని సాయి ఆ సంఘటనను ఆ భక్తుని ద్వారా ఇలా జరిపించారేమో....... అని కూడా భావించవచ్చునేమో. ( అయితే పొరపాటు జరిగిన తరువాత పశ్చాత్తాపం చెందటం బాగుంటుంది )


ఇంకా జీవితంలో జరుగుతున్న ప్రతి కష్టమునకు విపరీతంగా క్రుంగిపోకుండా తేరుకుని భగవంతునిపై భారం వేసి మన కర్తవ్యాన్ని నిర్వహించాలని .......... మనకు జీవితంలో లాభం కలిగినప్పుడు ................ అంతా నా గొప్పే అని విర్రవీగకుండా భగవంతుని దయ అని భావించి గర్వాహంకారరహితులమై ప్రవర్తించాలి అని కూడా భావించవచ్చు.

 .........................

 రికొన్ని విషయాలు..ఈ విషయాలను ఈ పోస్ట్ వ్రాసిన చాలాకాలం తర్వాత వ్రాసి పోస్ట్ చేయటం జరిగింది.

............
సమాజంలో రకరకాల మనస్తత్వాలవారుంటారు. కొందరు తమ మతంప్రకారం దైవాన్ని ప్రార్ధించుకుంటారు. కొందరు అనేకమతాలదేవతలను కూడా ప్రార్ధించుకుంటారు. కొందరు దైవాన్ని నమ్మని నాస్తికులుంటారు. 
 
సాయిబాబా షిరిడి వస్తే, అక్కడ కొందరు హిందువులు వారిని  సాయి అని పిలిచారట. తరువాత భక్తులు రావటం పెరిగింది. షిర్డిసాయి తనకు ఆడంబరంగా పూజలు చేయటం వద్దనేవారట. అయినా భక్తులు వినరు కదా..
 
సమాజంలో ఎందరో గొప్పవాళ్లు యోగులు, అవధూతలు ఉంటారు. వాళ్లు ఎంతో గొప్పవారే. ..హిందువులు ఎందరో యోగులను, అవధూతలను కూడా పూజిస్తారు. 
 
కొందరు మహిమలు కలవారు వారిమానాన వారు ఆడంబరం లేకుండా జీవించి మరణించిన తరువాత, వారి పేరుతో కొత్త విధానాలను తెచ్చి తాము లాభం పొందాలని చూసే వాళ్ళూ సమాజంలో ఉంటారు.
.....................
 
సాయిబాబా.. దత్తాత్రేయస్వామి అవతారం అని కొందరు, హనుమంతుని అవతారం అని కొందరు అంటున్నారు కదా.

అసలు దత్తాత్రేయుల వారు, హనుమంతుల వారు ఉండగా..ఇంకా ఎందుకు బాధ...దత్తాత్రేయస్వామివారిని, ఆంజనేయస్వామివారిని పూజిస్తే సాయిబాబాను కూడా పూజించినట్లే.....అలా వద్దనుకుంటే సాయిబాబాను పూజించుకోవచ్చు.

సాయిరాం, సాయి కృష్ణ అని సాయిబాబాకు రామ, కృష్ణ పేర్లను కలిపి అంటున్నారు కదా.. శ్రీరాముని, శ్రీకృష్ణుని పూజిస్తే సాయిని కూడా పూజించినట్లే.  దైవము ఒకే శక్తి.
 ...........................
 
కొందరు గొప్పవారికి మహిమలు ఉంటాయి. వారు ఎంతో గౌరవనీయులే. అలాగని చాలామంది దేవతలను పెంచుతూ ఉంటే, హిందువులకు బోలెడు దేవతలు, బోలెడు శాఖలుగా మారి, భవిష్యత్తులో ఏమవుతుందో?
 .....................
 
సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవటానికి ఎక్కువ డబ్బు ఖర్చుచేయలేము,  ఎక్కువ సమయం చేయలేము...అనుకుంటే, తక్కువ ఖర్చుతో, కొంత సమయంలో  పద్ధతిగా చేయవచ్చు. అసలే చేయకుండా మానటం కన్నా, చేయటం మంచిది కదా.. అనుకుంటున్నాను.

 
హిందువులు చాలా నియమాలను  పాటించగలిగిన వాళ్లు పాటించవచ్చు. అందరూ అలా పాటించాలి, లేకపోతే కష్టాలు మీదపడిపోతాయని చెప్పకూడదు. కలికాలంలో దైవస్మరణ..దైవనామస్మరణ చేసినా తరించుతారని ప్రాచీనులు తెలియజేసారు.
 
హిందు పెద్దలు కూడా ఈ విషయాలను గమనించాలి.  
ఈ  రోజుల్లో ఆచారవ్యవహారాలంటూ  బోలెడు నియమాలను చెబితే, పాటించలేక సరళంగా దైవపూజ చేసే మార్గాల వైపు జనం వెళ్లే అవకాశం ఉంది.

 పూజ అంటే చాలా నియమాలు పాటించలేమో? అని భయపడకండి. ఎక్కువ నియమాలతో కాకుండా,  సరళంగా కూడా హిందూదేవతలను పూజించుకోవచ్చు....చాలా నియమాలతో పూజించగలిగే వారు అలా పాటిస్తూ పూజించుకుంటారు.


 ఎవరైనా కూడా, దైవము పట్ల ప్రేమతో చక్కగా పూజించుకుంటే మంచిది.
**********
 వ్రాసిన విషయాలలో పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
 
 
 

No comments:

Post a Comment