koodali

Friday, June 8, 2018

కొన్ని ఆహార విషయాలు... మూడవ భాగం......



మన పూర్వీకులు నవధాన్యాలు, కొబ్బరి వంటి మంచి ఆహారం, ఖర్జూరం, బాదాం వంటి ఎండుపండ్లు,  ఉసిరి, నిమ్మకాయలవంటి ఎన్నో చక్కటి వాటి గురించి తెలియజేసారు

రాగి అంబలి వంటివి కూడా పూర్వీకులు తెలియజేసారు
............................

పాలు, నెయ్యి లేని పాయసం..అరకప్పు బియ్యాన్ని, పావుకప్పు పెసరపప్పును నానబెట్టాలి. అరగంట అయ్యాక కుక్కర్లో మెత్తగా ఉడికించాలి. ఉడికాక మెత్తగా మెదిపి, యాలక్కాయ పొడి, అరకప్పు కొబ్బరిపాలు, కప్పు తురిమిన బెల్లం వేసి అంతా చిక్కగా దగ్గరకు అయ్యేవరకు మాడకుండా తిప్పుతూ ఉడికించాలి. వేయించిన జీడిపప్పు పలుకులు కలపాలి.
  
 
కావాలంటే మరికొద్దిగా బెల్లం ఎక్కువ వేయవచ్చు.
 
కుక్కర్లో కాకుండా మట్టిపాత్ర.. ఇత్తడిగిన్నె..స్టీల్ గిన్నెలో కూడా వండుకోవచ్చు.
 
 (ఈ స్వీట్లో కొబ్బరిపాలు పోయకుండా కూడా తయారు చేయవచ్చు.)

.....................................
 
కడ ప్రసాదం....  ఈ ప్రసాదం పంజాబ్ వాళ్ళు  బాగా చేస్తారట. కప్పుగోధుమపిండి.. కప్పు న్ ఫ్లవర్ నూనె.. కప్పు బెల్లం..రెండుకప్పుల నీరు ..యాలకాయల పొడి, వేయించిన జీడిపప్పు పలుకులు.
 
వెడల్పుగా ఉన్న కడాయిలో నూనెవేసి,  గోధుమపిండి వేసి దోరగా వేయించుకోవాలి. (ముప్పావు కప్పు నూనె వేసుకోవచ్చు. ) 
 
 గిన్నెలో బెల్లం వేసి నీరుపోసి, ఇలాచిపొడి వేసి బెల్లం కరిగేలా వేడిచేయాలి...పాకం రానవసరం లేదు. 

గోధుమపిండి నూనెలో 5 నిమిషాలు వేగాక, కరిగించిన బెల్లం నీటిని నిదానంగా ...గోధుమపిండి లో పోయాలి.

 ఆ నీరంతా దగ్గరకు రావటానికి చాలా సమయం పడుతుందని భయపడనక్కరలేదు. ఆశ్చర్యంగా రెండునిమిషాల్లోనే నీరంతా దగ్గరకు వచ్చి హల్వాలా అవుతుంది.  
5 నిమిషాలు అంతా  దగ్గరకు అయ్యేవరకు మాడకుండా తిప్పుతూ ఉడికించాలి.  వేయించిన జీడిపప్పు వేసి దించేయాలి. 

 వేడి బెల్లం నీరు గోధుమ పిండిలో ఒకేసారి పోస్తే,  చేతికి వేడి తగిలే అవకాశం ఉంది. ..నిదానంగా  పోయాలి.

 కొద్దిగా ముందే బెల్లంలో నీళ్లు పోసి కరిగించి పక్కన పెట్టుకోవచ్చు. పొడుగుగా ఉన్న గరిటెతో తిప్పితే చేతికి వేడితగలదు.
 
 వాసనలేని నూనె (సన్ ఫ్లవర్ నూనె) వేయాలి. వేరుశగనూనె.. శనగపప్పు వాసన వస్తుంది కాబట్టి, ఈ స్వీటులో వేస్తే బాగోదు...పాతవాసన రాని ఫ్రెష్ కొబ్బరినూనె కూడా వేయవచ్చు. 
 
ఒక కప్పు పిండికి ఒక కప్పు నెయ్యి లేక నూనె వేయాలట. నేను ముప్పావు కప్పు అని రాసాను. అరకప్పు కూడా వేయొచ్చు కాని, స్వీట్ కొంచెం డ్రై గా ఉంటుంది. 

...........................................
 
పానీపూరీ...పూరీలు బయట అమ్మేవి తెచ్చుకోవచ్చు. 

కొద్దిగా నీటిలో కొంచెం చింతపండు నానబెట్టుకుని రసం తీసి వడకట్టాలి.  అందులో ఒకలీటర్ నీళ్లు కలపాలి.  నీటిలో కొద్దిగా మిరియాలపొడి, ఉప్పు , ఒక tea స్పూన్ నల్ల ఉప్పు .. వేసుకుని కలుపుకోవాలి.  
 
 ఒక కట్ట  పుదీనా, ఒక  కట్ట కొత్తిమీర, కొన్ని పచ్చిమిరపకాయలు  ..ఇవన్నీ ముక్కలుగా చేసి మిక్సీలో వేసుకుని పేస్ట్ చేసుకోవాలి

పేస్ట్లో నీళ్లు పోసుకుని వడకట్టి , పిప్పిని వేరుచేసి,  వచ్చిన రసాన్ని ముందే ఉంచుకున్న  లీటర్  నీటిలో  కలుపుకోవాలి. 

చింతపండు రసం వద్దనుకుంటే నీటిలో నిమ్మకాయ పిండుకోవచ్చు.  

ఆలు , శనగలు కలిపి కూర లేక  ఉడకబెట్టిన పెసలు  పూరీలలో వేసుకుని పానీ పోసుకుంటే పానీపూరీ తినవచ్చు.

పానీపూరి కొరకు చేసే  పానిలో  వేసే   నల్లఉప్పు,   పుదీనా,   కొత్తిమీర, జీలకర్ర.. మిరియాలపొడి, చింతపండురసం... ఇవన్ని   ఆరోగ్యానికి మంచిది. అప్పుడప్పుడు  ఈ  నీటిని మాత్రమే తయారుచేసుకుని త్రాగినా  మంచిదే.  

పావుబాజీ ....నానబెట్టుకున్న శనగలు,   కొన్ని  ఆలూ , రెండు  కారట్.....ఇవన్నీ కుక్కర్లో ఉడికించుకుని ఉంచుకోవాలి.  

బాణలిలో నూనె వేసి , ఉల్లిముక్కలు, మిర్చి వేసి వేయించుకుని,  ఇష్టమున్నవారు   అర టీ స్పూన్ అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేయించి సన్నగా తరిగిన కాప్సికం , టమేటో ముక్కలు వేసి వేయించుకోవాలి. 
 
(టమేటో ముక్కలు ఇష్టం లేకపోతే,  టమేటోముక్కలుని.. మిక్సీలో రుబ్బి,  ఆ గుజ్జును వేయించవచ్చు.)

ఇందులోనే  ఉడికించిన శనగలు, ఆలూ, కారెట్..మొదలైనవి వేసి....  ఉప్పు , పసుపుధనియాలపొడి,  పావుబాజీ మసాలా పొడి వేసుకుని మెత్తగా మెదపాలి. కొద్దిగా వెన్న కూడా  వేసుకుంటే బాగుంటుంది

పచ్చివాసన పోయిన తరువాత,  కొత్తిమీర వేసి దించుకోవాలి. పావు రొట్టెలు లేక మామూలు బ్రెడ్ ను కాల్చుకోవాలి

సన్నగా తరిగిన ఉల్లిముక్కలు,  కొత్తిమీర, నిమ్మరసం పిండుకుని ప్రక్కన ఉంచుకోవాలి. బ్రెడ్ తో కూర, ఉల్లిముక్కలు కలిపి తినవచ్చు.

***************
ఓక టేబుల్ స్పూన్ అంటే...  సుమారుగా మూడు టీ  స్పూన్లు. 
 
* కప్పు అంటే, మా ఇంట్లో రైస్ కుక్కర్ కొన్నప్పుడు వాళ్లు ఒక కప్పు ఇచ్చారు. దానిపైన కొలతలు రాసి ఉన్నాయి. కప్పుకానీ గ్లాసుకానీ పైనుంచి కింద వరకు ఒకేలా ఉండాలి. మన ఇళ్ళలో ఉండే గ్లాసులు కింద సన్నగా, పైన వెడల్పుగా ఉంటే కొలతలు సరిగ్గా తెలియవు. వాటి పైన కొలతలు రాసిఉంటే ఫరవాలేదు.

 *************

ఫ్రైడ్ రైస్ ... అన్నం పలుకుగా వండుకుని,  బాణలిలో కొద్దిగా నూనె వేసుకుని, అర టీ స్పూన్ తరిగిన అల్లం, వెల్లుల్లి ముక్కలు వేసి కొద్దిగా వేయించాలి.

అందులో సన్నగా  తరిగిన కారెట్, కాబేజ్, కాప్సికం, పచ్చిబటాణి..వేసి వేయించాలి. మరీ ఎక్కువగా వేయించకూడదు.
 
 ఫ్రైడ్ రైస్లో సన్నగా తరిగిన అల్లం తరుగు, కాబేజ్ తక్కువ వేయాలి...కాబేజ్ వెయ్యకపోయినా ఫరవాలేదు. కాప్సికం, మిరియాలపొడి, కారెట్, వెల్లుల్లి తరుగు తప్పనిసరి. బఠాణి,ఉల్లికాడలతరుగు కూడా ఉంటే వేసుకోవచ్చు.

అందులో మిరియాల పొడి, ఉప్పు వేసి అన్నం కలిపి వేయించుకోవాలి. ఎక్కువసేపు వేయించకుండా కొద్దిగా పెద్ద మంటలో తక్కువసేపు వేయించాలి. సన్నగా తరిగిన ఉల్లి కాడలను  వేసి అంతా మరొకసారి గరిటతో తిప్పుకోవాలి.

కొందరు పిల్లలు తరిగిన అల్లం ముక్కలు తినరు, దానిబదులు ఒక టీస్పూన్ అల్లం పచ్చడి వేసికలపవచ్చు.

ఫ్రైడ్  రైస్ లో , సోయాసాస్  వంటివి వేస్తారు.   అయితేనేను కొన్ని కారణాల వల్ల  సోయాసాస్ ,  వెనిగర్..వంటివి 
 .  వేయను.  ఎప్పుడైనా ఎప్పుడైనా అరుదుగా ఇంట్లోవాళ్లు  అడిగితే   వేస్తాను.
 .......................
మరీ నూనె లేకుండా తిననవసరం లేదు. శరీరానికి కొంత ఆయిల్ కూడా అవసరం. 
 
నూనె పదార్ధాలు ( కొవ్వు)   కూడా శరీరానికి అవసరమే

కొవ్వు తీసుకోవటం బొత్తిగా  మానేయటం వల్ల చర్మం ఎండిపోయినట్లు అవుతుందికీళ్ళలో గుజ్జు అరిగిపోతుంది

మితిమీరి కాకుండా అవసరమైనంత వరకు  క్రొవ్వు పదార్ధాలుపప్పుధాన్యాలు తినాలి.  

 పండ్లు కూడా తినాలి.
 
ఆర్గానిక్ నూనె ఖరీదు ఎక్కువ. బజ్జీలు, కారప్పూస ఇలాంటి..స్నాక్స్ కు మామూలు నూనె వాడి, మిగతా వంటలకు ...అంటే, కూరలు, టిఫిన్స్, పొంగలి..ఇలా అన్నింటికి ఆర్గానిక్ నూనె వాడవచ్చు.

****************
 
కరివేపాకు ఎక్కువగా తెచ్చి కడిగి నీడలో ఆరబెట్టి, కడాయిలో కొద్దిగా నూనె వేసి ఆకుపచ్చ రంగు పోకుండా, తడిపోయేలా కరివేపాకును వేయించుకోవాలి. అరకప్పు పచ్చిశనగపప్పు, పావుకప్పు మినప్పప్పు, కొద్దిగా జీలకర్ర కూడా వేయించి అన్నీ పొడి కొట్టుకోవాలి. పచ్చిశనగపప్పు బదులు వేయించిన శనగపప్పు కూడా వేసుకోవచ్చు. ఉప్పు కూరలో వేస్తాము కాబట్టి ఈ పొడిలో కొద్దిగా వేసుకోవచ్చు. 
 
 బాణలిలో  1 tea spoon  నూనె వేసి ,   ఆవాలు, జీలకర్ర  వేయించుకుని  పక్కన పెట్టుకుని, కరివేపాకు పొడిలో కలుపుకోవాలి.

కరివేపాకు అందుబాటులో లేనప్పుడు.. కూరల్లో ఈ పొడిని వేసుకోవచ్చు. 

 తిరగమోత చింది పొయ్యి జిడ్దు అవుతోందనుకుంటే... తిరగమోత బదులు ఈ పొడిని వేసుకోవచ్చు. మూకుడులో కొద్దిగా నూనెవేసి ఈ పొడిని వేసి, వెంటనే  కూరగాయలముక్కలు వేసి వేయించుకోవాలి.(వేయించిన పొడే కాబట్టి వేగనక్కరలేదు.) 
 
లేదంటే, మూకుడులో నూనెవేసి వెంటనే కూరముక్కలు వేసి వేయించి ఆఖరికి తిరగమోత పొడి కూడా కలుపుకోవచ్చు.కూరల్లో వేసుకుని కూరలో కొన్ని పచ్చి కరివేపాకు కూడా వేసుకుంటే బాగుంటుంది. 
 
 *********************
 అనేక కారణాల వల్ల  ఈ రోజుల్లో ఎక్కువమంది  పిల్లలు  జంక్ ఫుడ్ వంటివి తినేసి కడుపు నింపుకోవలసి వస్తోంది...

ఇందువల్ల రాబోయే తరాలు బలహీనంగా తయారయ్యే అవకాశం ఉంది. అలా కాకుండా బలవర్ధకమయిన ఆహారం తినాలి. 

మరీ ఎక్కువ ఆహారం, తక్కువ ఆహారం కాకుండా అవసరమైనంతవరకు తీసుకోవాలి. తిన్న ఆహారం పుష్టినిచ్చేదిగా ఉండాలి. 

 జంక్ ఫుడ్ ఎక్కువగా తినకూడదని వైద్యులు చెబుతున్నారు.

ఆహారం గురించి ఎన్నో విషయాలుంటాయి. అయితే,  కొన్ని వంటలను   పై టపాలలో క్లుప్తంగా వ్రాసాను. 
 
******
 
 కొన్నిరకాల ఆహారపదార్ధాలను కొన్ని వారాలు, నెలలపాటు  బాగా పులవబెడితే వాటినుంచి ఆల్కహాల్ తయారవుతుంది. దానిని తీసుకుంటే మత్తు వస్తుంది. ఆ మత్తులో మానసికబలహీనత వచ్చి ఏం చేస్తున్నారో, ఎలా ప్రవర్తిస్తున్నారో.. వారికే తెలియదు. అలాంటప్పుడు ఎన్నో నేరాలు ఘోరాలు జరిగే అవకాశముంది. మత్తుపదార్ధాల వల్ల అనారోగ్యం కలిగే అవకాశం  కూడా ఉంది. లివర్ చెడిపోతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మత్తుపదార్ధాలను తీసుకోవటం తప్పని పెద్దలు తెలియజేసారు.


అయితే, పదార్ధాలు కొద్దిగా పులవటం వలన ఆరోగ్యానికి మంచి జరుగుతుందంటున్నారు. ఉదా..అంబలి, ఇడ్లీ, దోసె.. వంటివి. వీటిని సుమారు 5లేక 10గంటలు నిల్వ ఉంచుతారు. అంబలి వల్ల ఎంతో ఆరోగ్యం అని చెబుతున్నారు. B12 కూడా లభిస్తుందంటున్నారు. కొద్దిగంటలే నిల్వ ఉండటం వల్ల మత్తురాదు.

చలికాలంలో అప్పుడప్పుడు ఉదయం వండుకున్నవి రాత్రికి, రాత్రి వండి మిగిలితే ఉదయం తింటారుకదా. మంచో చెడో తెలియదు కానీ, ఈ రోజుల్లో ఫ్రిజ్లో నిల్వ ఉంచి కూడా తింటున్నారు.


 పచ్చళ్ళు కొన్ని నెలలు నిల్వ ఉంటాయి కానీ, వాటి వల్ల మత్తు రాదు. కొన్ని రకాల పదార్ధాలను కొన్ని వారాలు, నెలలు పులవబెట్టటం వేరే పద్ధతి. అదంతా ఆ పదార్ధాలను బట్టి, నిల్వ ఉంచే పద్ధతిని బట్టి ఉంటుంది.


****************
Friday, July 2, 2010

.జలుబు, దగ్గు తగ్గటానికి ఈ పానకం..........

................

#Health
The Best Eating times by Ravi Varma // తినడానికీ ఓ టైముంది ... అది తెలుసుకోండి.



3 comments:



  1. మలబద్ధకం అనేది చాలా పెద్ద సమస్య.

    ఆహారం మరీ తక్కువగా తిన్నా మలబద్ధకం వస్తుంది.

    అలాగని ఎక్కువ ఆహారం తింటే అజీర్ణం సమస్యలు వస్తాయి.

    ఎంతవరకు అవసరమో అంతవరకే తినాలి.

    ఆహారంలో ఆకుకూరలు, దోసకాయ..వంటివి తింటే మలబద్ధకం ఉండదు.

    పడుకోబోయే ముందు పండిన అరటిపండు కానీ పండిన జామపండు కానీ తినవచ్చు.

    పండిన దోసపండ్లను తింటే సుఖవిరేచనం జరుగుతుందని పెద్దలు తెలియజేసారు.

    కొందరు పెద్దవాళ్లు ఏం చేస్తారంటే, పండిన దోసపండ్లను పంచదారతో కలిపి లేక పంచదార లేకుండా తింటారు. ఇలా చేయటం వల్ల చలువ చేస్తుంది.

    ఇక్కడ నేను వ్రాసినవి కూరగా వాడే దోసకాయలు పండినవి.

    ఈ రోజుల్లో తర్బూజా వంటి దోసజాతికి చెందిన పండ్లు విరివిగా లభిస్తున్నాయి. అవి కూడా మంచివే.

    త్రిఫల పొడి కూడా వాడవచ్చు.


    ReplyDelete





  2. మైదా బయట అమ్మేది కాకుండా ఇంట్లో ఎలా చేయాలనే విషయం గురించి కొన్ని వివరాలు...

    క్రింద ఇచ్చిన సమాచారాన్ని కాపీ...పేస్ట్..క్లిక్..చేసి చూడగలరు.


    மைதா |Homemade Maida Recipe in Tamil | First time on YouTube | Homemade All Purpose Flour Recipe - YouTube

    HOW TO MAKE JAIN MAIDA (AT HOME) - YouTube


    ReplyDelete


  3. మిక్సీలలో బ్లేడ్స్ మార్చేవిధానం ఉంటే బాగుంటుంది.

    ఉదా..సుమీత్ మిక్సీలో ఒకే జార్లో మూడు బ్లేడ్స్ మార్చుకోవచ్చు. డ్రై, వెట్, బ్లేడ్స్, విప్పర్ బ్లేడ్స్ కూడా ఉంటాయి.

    డ్రై బ్లేడుతో పొడులు కొట్టుకోవటానికి, వెట్ బ్లేడ్ ఇడ్లీపిండి వంటివి రుబ్బుకోవటానికి పనికివస్తాయి.

    విప్పర్ బ్లేడ్ తో చాలా ఉపయోగాలున్నాయి. ఉదా..జార్లో వెట్ బ్లేడ్ వేసి గారెల పిండిని రుబ్బుకుని , పిండి జార్లో ఉండగానే బ్లేడును మార్చి విప్పర్ బ్లేడ్ బిగించి గారెల పిండిని కొద్దిసేపు రుబ్బితే ఏరిఏషన్ జరిగి , పిండి బాగా పొంగి గారెలు మృదువుగా వస్తాయి.

    విప్పర్ బ్లేడ్ స్టీల్ తో చేసినది అయితే స్ట్రాంగ్ గా ఉంటుంది.ఉదా..సుమీత్ మిక్సీలో విప్పర్ బ్లేడ్ బాగుంటుంది.

    మిక్సీలో సంబంధం లేకుండా విడిగా కూడా అలా గుండ్రని ఆకారంతో స్టీల్ హాండ్ మిక్సర్ తయారుచేస్తే బాగుంటుంది.క్రీం తయారీకి కూడా ఉపయోగపడుతుంది.

    ********

    బ్లేడులు మార్చే విధానం వల్ల బ్లేడ్ క్రింద ఆహారపదార్ధాలు ఇరుక్కుపోయినా శుభ్రం చేసుకోవటం తేలిక.

    జార్ కు బిగించేసిన బ్లేడ్ పద్ధతి వల్ల రుబ్బిన పదార్ధాలు బ్లేడ్ క్రింద ఇరుక్కుపోయి శుభ్రం చేయటానికి సరిగ్గా రావు.

    బ్లేడ్స్ క్రింద ఇరుక్కుపోయిన పదార్ధం కనిపించదు. అందువల్ల, పిండి రుబ్బిన తరువాత జార్ కడిగి, కొద్దిగా నీరు పోసి మరల త్రిప్పితే బ్లేడ్స్ క్రింద ఇరుక్కుపోయిన పదార్ధాలు కొంతయినా శుభ్రం అయ్యే అవకాశం ఉంది.

    జార్ ను సరిగ్గా శుభ్రం చేయకపోతే బ్లేడ్స్ క్రింద ఇరుక్కుపోయిన పదార్ధం కుళ్ళి అనారోగ్యం కలిగే అవకాశం ఉంది.

    ఇంకోసారి అదే జార్లో పిండిని రుబ్బినప్పుడు బ్లేడ్స్ క్రింద ఇరుక్కుపోయిన పదార్ధం పిండిలో కలిసే అవకాశం ఉంది.

    ReplyDelete