ఆ మధ్య ఒకే అబ్బాయి ఒక్కడే ఒక నదిని శుభ్రం చేశాడని వార్తల ద్వారా తెలిసింది. నిజంగా ఎంతో గొప్ప వ్యక్తి.అతని జన్మ ధన్యము. అలాంటి మనుషులుంటే చాలు.
ఒక్క మనిషి అంత చేశాడంటే అందరూ తలచుకుంటే ఏదైనా చేయొచ్చు కదా..
నేను కూడా ఆ అబ్బాయిలా చెయ్యలేను. నా పరిధిలో నేను ప్లాస్టిక్ విచ్చలవిడిగా పడెయ్యకుండా రోజు వచ్చే ప్లాస్టిక్ ఒకపెద్ద ప్లాస్టిక్ బాగ్ లో వేసి, అది నిండాక గట్టిగా కట్టి బయట పెడతాను. కొంతవరకు నేను చేయగలిగింది చేస్తున్నాను.
అందరూ ఆ అబ్బాయిలా శుభ్రం చేయలేరు కాని, ఎవరి పరిధిలో వారు శుభ్రతను పాటిస్తే సమాజం దానికదే బాగుపడుతుంది.
..............................
ప్రాచీనకాలం నుంచి ఎంతో గొప్పదైన భారతదేశం, ఇప్పుడు కూడా గొప్పవ్యక్తిత్వం కల ప్రజలతో గొప్పగా ఉండాలని, శుచి,శుభ్రతతో,సిరిసంపదలతో, తులతూగాలని అనిపిస్తుంది.
.........................
భారతీయులు చాలామంది ఎందుకు విపరీతంగా ప్రవర్తిస్తున్నారో తెలియటం లేదు. స్వార్ధం, ఎలాగైనా డబ్బు సంపాదించాలనే అత్యాశ, అశుభ్రత, ఒక పద్ధతి లేకుండా ప్రవర్తిస్తున్నారు. క్యూలైన్లలో వెళ్ళటం పాటించరు.
దేశంలో కొందరు తమకు డబ్బు, అధికారం కొరకు సాటిమనుషులను పట్టించుకోవటం లేదు. చచ్చాక ఏమవుతారో తెలియదు. చేసిన పాపాలకు మరుజన్మలో ఎన్ని కష్టాలు పడతారో తెలియదు. తరతరాలకు కూడబెట్టి ఏం లాభం?
భారతదేశంలో చాలా స్వేచ్చ ఉన్నట్లుంది. చాలామంది,మా మనోభావాలు అంటూ..ఎవరి ఇష్టానికి వాళ్లు ప్రవర్తిస్తున్నట్లుంది.
వీధుల్లో ఎక్కడపడితే అక్కడ చెత్త పోయటం, కిళ్లీలు ఊయటం, ఇలా ఎన్నో ఎన్నెన్నో..రైల్వేస్టేషన్, బస్సుస్టాండ్లు..పబ్లిక్ ప్లేసెస్ అశుభ్రత చూస్తే వాంతి వస్తుంది. పబ్లిక్ టాయ్లెట్లు సంగతి ఇక చెప్పనక్కరలేదు.
............................
సినిమావాళ్లు కనిపిస్తే వేలంవెర్రిగా నెట్టుకుని కొందరు చనిపోయే పరిస్థితి కూడా ఉంటుంది.
విదేశాలకు వెళ్ళిన వాళ్లు కొందరు , రోడ్లపైన సినిమాడాన్సులు వేస్తూ... గొప్ప అనుకుంటున్నారు.
స్వదేశంలోనైనా,విదేశాల్లో అయినా భారతీయులు గొప్పగా, పద్ధతిగా ఉండాలి. వెకిలిగా రోడ్లపైన సినిమాడాన్సులు వేయటం ఏమిటో?
అయినా, నిజజీవితంలో స్త్రీలుపురుషులు ఎవరైనా చెట్ల చుట్టూ తిరుగుతూ ఒకరినొకరు పట్టుకుని పాటలు పాడుతూ డ్యాన్సులు వేయరు కదా. అలా సినిమావాళ్లు చూపిస్తే, జనాలు నోరెళ్లబెట్టి ఆహా,ఓహో అని చూస్తున్నారు.
ఇవన్నీ వచ్చాకే పార్కుల్లో కొందరు జంటలు చెట్ల చాటున కూర్చుంటున్నారు. సినిమాల్లో డ్యూయట్లు వంటివి బాన్ చెయ్యాలి. బయట ఎవరూ గెంతుకుంటూ అలా డాన్సులు వేయనప్పుడు, అలా ఎందుకు చూపిస్తారో?
భవిష్యత్తులో ఈ సినిమాలు చూసి భారతదేశంలో ప్రేమికులు, అలా ఆరుబయట ఒకరివెనకాల ఒకరు పడి పాటలు పాడుతూ డాన్సులు చేసేవారు కాబోలని అనుకుని, చరిత్రలో వ్రాసే ప్రమాదముంది.
..........................................
ఇక, పండుగల్లో రసాయనాలరంగులేసిన విగ్రహాల్ని నీటిలో నిమజ్జనం చేయటం స్వదేశంలో అయినా, విదేశాల్లో అయినా తప్పే. రసాయనాలు, ప్లాస్టిక్..నీటిలో వేస్తే నీరు కలుషితం అవుతుంది.
పాతకాలంలో రసాయన రంగులు వేయని మట్టివిగ్రహాలే నీటిలో నిమజ్జనం చేసేవారు.కొత్తగా రసాయనాలు, ప్లాస్టిక్ వాడుతూ అవన్ని ప్రాచీన సాంప్రదాయాలు అనటం తప్పు.
....................................................
కొన్ని విదేశాల్లో పెద్దపెద్దశబ్దాలు చేస్తే ఊరుకోరు. భారతదేశంలో ఎన్ని శబ్దాలు చేసినా, విపరీతమైన శబ్దంతో మైకు పెట్టినా పట్టించుకునే వాళ్ళులేరు.
కొన్ని జనాభా ఎక్కువున్న దేశాల వాళ్ళు కూడా, తమ దేశాన్ని శుభ్రంగా ఉంచుకుంటున్నారు. పువ్వులమొక్కలు, రోడ్లపక్కన చెట్లు ఎంతో అందంగా ఉంటాయి. వీటికి ఎక్కువ డబ్బు ఖర్చు ఉండదు.
మనదేశంలో ఎవరైనా చెట్లు పెట్టినా కూడా, రకరకాల కారణాలు చెప్పి కొట్టేయటం ఎక్కువ.
ఏం చెయ్యాలన్నా కొందరు, ఎక్కువ డబ్బు లేదంటారు. ఆ అబ్బాయి దగ్గర బోలెడు డబ్బు, సాయం చేసే వాళ్లు లేకపోయినా, గట్టి సంకల్పబలం ఉంది.
అందరూ ప్రయత్నిస్తే కొంతకాలంలోనే శుభ్రంగా మార్చుకోవచ్చు. మొక్కలు, చెట్లు పెరగటానికి మరికొంత సమయం పడుతుంది. అవి పెరిగితే ఇంకా బాగుంటుంది.
...............................
సనాతనసాంప్రదాయంలో శుభ్రతకు ఎంతో విలువుంది. అశుభ్రంగా ఉంటే లక్ష్మీదేవికి నచ్చదంటారు.
పరమపూజ్యమైన దైవచిత్రాలను ఎన్నోచోట్ల ముద్రించి, చెత్తకుప్పల్లో వేసే వాళ్లకు ఏం చెబుతాం..?
నదులను చక్కగా ఉంచాలని ప్రాచీనులు తెలియజేసారు. నదుల్లో ప్లాస్టిక్, నగరాల మురికి, పరిశ్రమల వ్యర్ధాలు వదిలే వాళ్లకు శుభ్రత గురించి ఏం అర్ధమవుతుంది?
.......................................
ఎంతమంది తిడుతున్నా..సినిమాలు, క్రికెట్ చూడటం, చెత్తను రోడ్ల పక్కన పడేసి, పట్టించుకోకుండా ఆ రోడ్లపైన తిరగటం..ఇంకా ఎన్నో ఉన్నాయి...
సినిమాహాల్లో పేపర్లు చింపి పొయ్యటం, రోడ్లపైన పేపర్లు చింపిపొయ్యటం, ఎవరు ఎత్తుతారు అవన్నీ?
పరీక్షలు అయిపోతే రోడ్లపైన పేపర్లు వెయ్యకూడదని పిల్లలకు తల్లితండ్రి, స్కూల్లో టీచర్లు చెప్పాలి. పెద్దవాళ్ళే శుభ్రత పాటించనప్పుడు ఇక పిల్లలకేం చెబుతారులే.
జనం ఎప్పటికి మారుతారో? పట్టించుకోకుండా బతకటం అలవాటయిన వాళ్ళకు..?
ధర్మాన్ని పాటించనప్పుడు మోక్షం వస్తుందా? అయినా, ఎవరికర్మ వారిది. నాకు ఎందుకు తాపత్రయం.
...........................
ఎంతచెప్పినా వినకుండా సమాజాన్ని పాడుచేసేవాళ్లు కొందరు ఉంటారు. వాళ్లకు తగిన శిక్షలు వేయాలి.
చక్కని పద్ధతితో జీవించే వారి సంఖ్య పెరిగితే చాలా విషయాలు బాగుంటాయి.