కొందరు దైవ నామాలను కొంత సంఖ్య ప్రకారం వ్రాయాలనుకుని పుస్తకంలో రాస్తుంటారు.
పుస్తకం పూర్తి అయిన తరువాత ఆ పుస్తకం ఎక్కడ పెట్టాలో తెలియదు. కొందరు గుడిలో ఆ పుస్తకాలను ఇస్తుంటారు.
కొన్ని పుస్తకాలను కలిపి స్తూపంలా భద్రపరచటం కూడా జరుగుతోంది.
అయితే పేపర్ పైన దైవ నామాలను వ్రాసి, ఆ పుస్తకాలను ఎక్కడ దాచాలో అని సతమతమయ్యేవారికి నాకు తోచిన అభిప్రాయాన్ని వ్రాస్తున్నాను.
ఏదైనా పుస్తకంలో మనం అనుకున్న దైవనామాన్ని కొంచెం పెద్ద అక్షరాలతో రాసుకుని , మరల దైవనామాన్ని వ్రాసేటప్పుడు ఇంతకుముందు వ్రాసిన నామం పైనే మళ్లీ వ్రాసుకోవచ్చు.
అయితే, నామాలను మళ్లీ వ్రాసేటప్పుడు ఒకసారి వ్రాసిన నామం పైనే మరల దిద్దుకోవచ్చు.
ఇలా చేయటం వల్ల నామాలను రాయటానికి బోలెడు పుస్తకాలు తేవటం, అవన్నీ పూర్తయిన తరువాత ఆ ప్రతులను ఎక్కడ దాచాలో అర్ధంకాకపోవటం వంటివి ఉండవు.
కొందరు ఏదైనా మంత్రాన్ని దీక్షలో తీసుకుంటారు.
ఆ మంత్రాన్ని ఇతరులకు తెలియనీయకూడదన్నప్పుడు ఆ మంత్రాన్ని పుస్తకం పైన పెన్నుతో రాయకుండా... ఎన్ని సార్లు మంత్రాన్ని రాయాలనుకుంటున్నారో అన్ని సార్లు రోజూ ఒకే పుస్తకంపైన గరుకుగాలేని నున్నటి ఏదైనా పుల్లతో వ్రాయవచ్చు.
చూపుడు వ్రేలితో రాస్తే ..గబగబా రాయటం వల్ల ..వ్రేలి నరాలు బలహీనమయి ..తరువాత చేతి నొప్పి వచ్చే ప్రమాదం ఉంది.
అయితే, చూపుడు వ్రేలుకు బొటనవ్రేలు సపోర్టుగా ఆనించి చూపుడు వ్రేలితో వ్రాయవచ్చు.
పెన్నుకానీ, పెన్సిల్ కానీ తిప్పి పట్టుకుని ( అంటే రాయని వైపు ) కూడా వ్రాసుకోవచ్చు.
ఇలా రాసిన మంత్రము ఇతరులకు కనిపించదు.
రాసిన పుస్తకాలను ఎక్కడ దాచాలో అనే బెంగా ఉండదు. ఒకే పేపర్ పైన ఎన్ని సార్లైనా వ్రాయవచ్చు.
దైవనామాలను పుల్లతో వ్రాసేటప్పుడు ఎన్నిసార్లు రాసామో తెలియడానికి ....
ఒక్కొక్క నామం వ్రాసినప్పుడు ఎడమచేతి వ్రేళ్లతో లెక్కపెట్టుకుంటూ 10 నామములు పూర్తయిన వెంటనే ఒక పేపర్ పైన టిక్ చేసుకోవచ్చు. లేక ఎక్కడైనా గుర్తు పెట్టుకోవచ్చు.
.ఒకేసారి చాలా విషయాలను రాయటం వల్ల ఎక్కువగా అయి గజిబిజిగా ఉంటుందేమోననిపించి ...మరికొన్ని విషయాలను వ్యాఖ్యల వద్ద రాసానండి.