koodali

Monday, March 31, 2014

ఓం,

ఓం,

దైవానికి  అనేక  వందనములు,



సుధా సముద్రములో, మణిద్వీపములో, చింతామణిగృహములో నివసించే ఆదిదంపతులైన  పరమాత్మకు {శ్రీమన్మహాదేవుడుశ్రీమన్మహాదేవి} వందనములు.



అందరికి శ్రీ  జయ నామ సంవత్సర  ఉగాది శుభాకాంక్షలండి.



వసంత  నవరాత్రులు  ప్రారంభమయ్యాయి.



మహారాష్ట్రీయులు  ఏ  శుభకార్యక్రమము  ప్రారంభించిన  ప్రప్రధమమున  శ్రీ  గణపతి దేవునితో  సహా  నవగ్రహాలు, ముఖ్యముగా  శనేశ్వరుణ్ణి  పూజించటము  అనాదిగా  వస్తున్న  సుసంప్రదాయము.



 చైత్రశుద్ధ  ప్రతిపాదా  (  గుడిపాడువ  )   అంటే  ఉగాది  పర్వదినమున శని శింగణాపూర్  లో  విశేష  ఉత్సవాలు  జరుగుతాయట.



నూతన  సంవత్సరములో  ఆటంకాలు, అవరోధాలు,  కష్టనష్టాలు తొలగించి  సుఖశాంతులు  ప్రసాదించుమని  ఆ  కరుణాలవాలను భక్త  సముదాయము  శిరోధార్యులై  వేడుకుంటారట. 



అందరికి   శ్రీ  జయ నామ సంవత్సర  ఉగాది శుభాకాంక్షలండి.





Saturday, March 29, 2014

అంతా దైవం దయ.

సామాజిక  విషయాలు,  సంసారం,   స్త్రీలు,  పురుషుల  విషయాల  గురించి   మాట్లాడటం  తప్పనుకుంటారు  కొందరు. ....సామాజిక  విషయాల  గురించి  మాట్లాడుకోవటం తప్పుకాదు.


అయితే,   దైవపూజా   విధానాలతోపాటు    సంసారం,   స్త్రీలు,  పురుషుల  వంటి  విషయాలను  కూడా  పురాణేతిహాసాల  ద్వారా  పెద్దలు  తెలియజేసారు   కదా  !



 జీవితంలో  ఎలా  ప్రవర్తించాలో ,  ఎలా ప్రవర్తించకూడదో  పురాణేతిహాసాల  ద్వారా పెద్దలు  తెలియజేసారు.



అవన్నీ  తెలుసుకుని  మన  జీవితాలను  సరైన  పద్ధతిలో  మలుచుకోవాలన్నది  పెద్దల  అభిప్రాయం  కావచ్చు.



పూజామందిరంలో  కూర్చుని  దైవప్రార్ధన  చేయటం  పూజనే...దానితోపాటు   సత్ప్రవర్తనతో  జీవించటం  కూడా  దైవపూజ  వంటిదే.
...........................


ఎవరైనా మనలను  సరిగ్గా  పట్టించుకోకపోతే మనం   ఎంతో  బాధపడతాము. మరి  మనకు   జీవించటానికి  అవసరమైన  గాలి,  నీరు  వంటి  ఎన్నింటినో   ఇచ్చిన  దైవాన్ని  గురించి  మనం ఎంతవరకూ   పట్టించుకుంటూన్నాము?  


  దైవం  మనకు  ఎన్నో  ఇస్తున్నారు.  అందరికీ  ఆత్మబంధువు  దైవం.

.....................

మాకు  కూడా  దైవం  దయ  వల్ల   మంచి  జరిగింది . 

 మా  ఇద్దరు  పిల్లలలో  ఒకరికి  కొంత కాలం  క్రిందట  ఉద్యోగం  లభించింది .  ఒకరికి  ఉన్నతవిద్య   చదవటానికి  అవకాశం  లభించింది.  అంతా  దైవం  దయ. దైవానికి  అనేక  కృతజ్ఞతలు .
.....................


నాకు  తెలిసిన  విషయాలు  తక్కువ.  బ్లాగులో  ఈ  మాత్రం    విషయాలను   వ్రాయగలుగుతున్నానంటే  అంతా  దైవం  దయే.... దైవానికి  అనేక  కృతజ్ఞతలు .
....................


ప్రపంచం  శాంతి , సౌభాగ్యాలతో  కళకళలాడాలని  కోరుకుంటున్నాను.



Friday, March 28, 2014

స్త్రీలూ ముఖ్యమే పురుషులూ ముఖ్యమే.


స్త్రీలు  గొప్పవారే  పురుషులూ  గొప్పవారే.    స్త్రీలూ  ముఖ్యమే  పురుషులూ  ముఖ్యమే. సమాజానికి   అందరూ  అవసరమే.

అయితే,   మగవారికి ఉపాధి లభించటం ఎంతో అవసరం. మగవారికి ఉపాధి లభించకపోతే ఆ నిరాశానిస్పృహతో వ్యసనాలకు అలవాటు పడే అవకాశం ఉంది.

స్త్రీలకు ఉద్యోగం లభించకపోయినా తట్టుకోగలరు. సమాజం కూడా వారిని ఏమీ అనదు.

స్త్రీలకు ఇంటిని చక్కబెట్టుకోవటం అనే పని ఎలాగూ ఉంటుంది. వారికి దానితోనే కాలం గడిచిపోతుంది. తీరిక సమయం ఉన్న మహిళలు బోలెడు సమాజసేవ చేయవచ్చు.

ఉదా..ఆర్ధికంగా ఉన్నతంగా ఉన్న కొందరు మహిళలు కలిసి పేద, మధ్య తరగతి మహిళలకు సాయాన్ని అందించవచ్చు. వారితో కుటీరపరిశ్రమలను పెట్టించవచ్చు.

డ్వాక్రా సంఘాల మహిళలకు మరింత తోడ్పాటును అందించవచ్చు.

చదువుకున్న మహిళలు...చదువురాని మహిళలకు చదువును నేర్పించవచ్చు. మాతాశిశు సంరక్షణ గురించి నేర్పించవచ్చు.

తక్కువ ఖర్చుతో పుష్టికరమైన ఆహారాన్ని ఎలా తయారుచేయాలో పేద మహిళలకు నేర్పించవచ్చు.



కొందరు మహిళలు కలిసి గ్రూపుగా ఏర్పడి తమ కాలనీలోని సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవచ్చు...ఇలా మహిళలు తలుచుకుంటే ఎంతో సమాజ సేవ చేయవచ్చు.

మహిళలు వంటింట్లో కుందేలులా ? పడి ఉండనవసరం లేదు. ఇంటి పని అయిన తరువాత పగలు కొంత సమయాన్ని సమాజసేవకూ కేటాయించవచ్చు.

...........................................

అరుణారాయ్ అనే మహిళ అయ్యేయస్ పదవిని వదులుకుని సమాజసేవ చేస్తున్నారట. ఇంఫోసిస్ సుధామూర్తి గారు కుటుంబాన్ని చూసుకోవటం కోసం చక్కటి ఉద్యోగాన్ని వదులుకుని ఇటు కుటుంబాన్ని చూసుకుంటూనే ....సమాజసేవనూ చేస్తున్నారు.



మరెంతో మంది మహిళలు కూడా ఉన్నదానితో సరిపెట్టుకుని ఒక ప్రక్క కుటుంబాన్ని చూసుకుంటూనే ... మరో ప్రక్క తీరిక సమయంలో తమకు చేతనైనంతలో సమాజానికి తోడ్పాటును అందిస్తున్నారు.

....................................................

    మహిళలకు శారీరికంగా ఎన్నో సమస్యలు ఉంటాయి. ఉదా..గర్భిణీ సమయం, నెలసరి మొదలైనవి ఉన్నప్పుడు కొంత విశ్రాంతి అవసరం. ఉద్యోగం అంటూ బస్సులలో, షేర్ ఆటోలలో తిరిగితే   ఆ  కుదుపులకు   గర్భానికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది.

    ( అందరికీ కారులో వెళ్ళే ఆర్ధిక స్తోమత ఉండదు కదా !)

    ఇల్లాలికి ఇంట్లో చిన్న పిల్లలను చూసుకోవలసిన బాధ్యతా ఉంది .

    ఇంత కష్టపడుతూ కూడా ఇప్పుడు ఎందరో స్త్రీలు బయటకెళ్ళి పనులు చేస్తున్నారు. అయినా ఇంట్లో వాళ్ళ మెప్పును పొందగలుగుతున్నారా ?

 భార్య సంపాదన లాక్కుని తమ ఇష్టానికి ఖర్చుపెట్టేసే భర్తలు ఎందరో ఉన్నారు.

    అలాగని స్త్రీలు  పురుషులను  అందరిని   ద్వేషించటం సబబు కాదు. స్త్రీలలోనూ చెడ్డవారు, మంచివారూ ఉంటారు. పురుషులలోనూ చెడ్డవారు, మంచివారూ ఉంటారు.


......................................


    జంబలకిడిపంబ సినిమాలో  కొన్ని  దృశ్యాలలా సమాజం తయారవాలని భారతీయ స్త్రీ కోరుకోదు.

    ఇంటిని చక్కదిద్దుకోవటంలో మహిళలే నేర్పరులు. అంత ఓపిక సహనం మగవారిలో తక్కువ. అందుకని ఇంటి బాధ్యతను స్త్రీలే చక్కగా నిర్వహించగలరు.

    ................................................

   
కొందరు ఏమంటారంటే భార్యాభర్త చెరిసగం పనిని షేర్ చేసుకోవాలి అంటారు. ఇది ఆచరణలో సరిగ్గా పనిచేయదు. ఏ పనీ సరిగ్గా జరగదు....ఎవరికీ సరిగ్గా విశ్రాంతి లభించదు.

    పూర్వం మగవాళ్ళు సంపాదన కోసం బైటకెళ్ళి కష్టపడి ,.......ఏ మధ్యాహ్నమో భోజనానికి ఇంటికి వచ్చినప్పుడు ... లేక ... ఏ సాయంకాలానికో ఇంటికి వచ్చినపుడు, కాసేపు విశ్రాంతి తీసుకోవటానికి అవకాశముండేది.

    (అప్పుడు మగవాళ్ళని ఇంటి పనులు చెయ్యమని ఎవరూ అడిగేవారు కాదు. అలాగే ఆడవాళ్ళని సంపాదించుకు రమ్మని అడిగే వారు కాదు. .)

    ఆడవాళ్ళు అయితే , మగవాళ్ళు బయటకు వెళ్ళాక నిదానంగా ఇంటి పనులు చక్కబెట్టుకొని పగలు కాసేపు విశ్రాంతి తీసుకోవటానికి అవకాశముండేది.

    కానీ ఈ రోజుల్లో భార్యాభర్తా ఇద్దరూ సంపాదన కోసం బైటకు వెళ్ళి రాత్రికి ఇంటికి వస్తారు.

    ఇక అప్పుడు అలసిపోయి ఇంట్లో పనులు చెయ్యాలంటే ఇద్దరికీ విసుగే. అప్పుడు నీరసంగా ఏదో ఇంత వండుకొని తింటారు.

    ఈ విధానంలో ఎవరికీ విశ్రాంతి తీసుకోవటానికి అవకాశం లేదు. ( రాత్రికి నిద్రలో విశ్రాంతి తప్ప. )

    నేనూ మీలాగే బైట సంపాదిస్తున్నాను కాబట్టి, భర్త కూడా ఇంటి పని చెయ్యాలంటుంది భార్య.

    ఇక ఇంటి పనులు తప్పించుకోవటానికి భర్త ఇంటికి ఆలస్యంగా రావటం మొదలవుతుంది. ఇక గొడవలు మొదలు.

    ఆ కోపమంతా ....... అప్పటికే అలసిపోయి బడి నుంచీ వచ్చిన పిల్లల పట్ల చూపిస్తారు.

    భార్యను భర్త తిడితే ........... పురుషాహంకారం నశించాలి ........ అని నినాదాలు చేస్తారు .

    మరి పిల్లలను తల్లిదండ్రులు తిడితే ......? తల్లిదండ్రుల అహంకారం నశించాలి ..... అని పిల్లలు కూడా నినాదాలు చెయ్యాలేమో ఇక !

    ఆఫీసుల్లో పని విభజన ఉంటుంది. ఎవరి పనిని వారు చేస్తారు. అలాగే ఇంట్లో కూడా స్త్రీలకు, పురుషులకు పని విభజన ఉండి ఎవరి పని వారు చేస్తే సులువుగా ఉంటుంది.


 ................................................

అలాగని స్త్రీల పని పురుషులు ....పురుషుల పని స్త్రీలు అసలే చెయ్యకూడదని కాదు. పాత కాలంలో కూడా భర్తలు తమ భార్యలకు సహాయాన్ని అందించేవారు.

ఉదా... భార్య వంట చేస్తుంటే అప్పుడప్పుడు భర్త కూరలు తరిగి ఇవ్వటం వంటివి.... భార్య కారప్పూస వండుతుంటే భర్త కారప్పూస వత్తటంలో సాయాన్ని అందించటం వంటివి....

పాతకాలంలో స్త్రీలు కూడా భర్తకు పనిలో సాయాన్ని అందించేవారు.

భార్యాభర్త కలిసిమెలసి పనిచేసుకునేవారు. 

భర్త వ్యవసాయం చేసేవారైతే ఇంటికి తెచ్చిన ధాన్యాన్ని భార్య జాగ్రత్త చేసేది. భర్త కుండలు చేసే వృత్తి అయితే భార్య భర్తకు పనిలో సాయాన్ని అందించేది.

 భర్త వ్యాపారస్తుడైతే భార్య సరుకులను శుభ్రం చేయటంలో సాయాన్ని అందించేది. అప్పట్లో కిరాణా కొట్లు వెనకే ఇల్లు ఉండేది.

ఇలా  కలిసి గడపటం వల్ల భార్యాభర్త మధ్య అన్యోన్యత పెరిగేది. ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడుంది ?

 
ఇప్పుడు ఉపాధి కోసం భార్యా భర్తా ఉదయం అనగా ఎవరిదారిన వాళ్ళు వెళ్తున్నారు. ఇక వాళ్ళకు మాట్లాడుకోవటానికి కూడా సమయం దొరకటం లేదు.

పరాయి స్త్రీలు పురుషులు కలిసి పనిచేయవలసిన ప్రస్తుత పరిస్థితి కొన్ని కుటుంబాలలో గొడవలకు కారణం అవుతోంది.

........................................

ఇక స్త్రీలకు బయటకు వెళ్తే రక్షణ సమస్య ఎలాగూ ఉంది.


 ఏమైనా ఇప్పుడు చాలా మంది స్త్రీల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లు అయ్యింది అనిపిస్తోంది.

స్త్రీలు  గొప్పవారా  లేక  పురుషులు  గొప్పవారా ? అన్నది  ఇప్పుడు  సమస్య  కాదు....ఇప్పుడు కుటుంబ వ్యవస్థను రక్షించుకోవటం   ఎంతో ముఖ్యం. 




Thursday, March 27, 2014

సందర్భాన్ని బట్టి సర్దుబాట్లు ....

ఈ  రోజుల్లో  బిజీ  జీవితాల  వల్ల   కుటుంబసభ్యులకు  సరిగ్గా  మాట్లాడుకోవటానికే  సమయం  కుదరటం  లేదు.

కొందరు   భార్యాభర్త  ఉద్యోగరీత్యా  వేరే  దగ్గర  ఉంటున్నారు.  ఇలా  ఎక్కువ  కాలం  ఉండటం  మంచిది  కాదు.
.........................................

స్త్రీలు   సహజంగా  కుటుంబానికి  ఎక్కువ  ప్రాధాన్యతను  ఇస్తారు.  భర్త  కొంచెం  మంచిగా  మాట్లాడితే  చాలు  సంతోషపడిపోతారు.


అయితే     ఎంచేతనో   కొందరు  పురుషులు   భార్యతో    తక్కువగా  మాట్లాడతారు.  బయట  అందరితో  చక్కగా  మాట్లాడే  వ్యక్తి  ఇంటికి  వచ్చేసరికి  ముభావంగా , ముక్తసరిగా  అయిపోతారు.


   ఎక్కువ  మాట్లాడితే  భార్య  నెత్తికెక్కుందేమోనని  ఇలాంటి  వాళ్ళ  భయం  కాబోలు.

బయట  వాళ్ళు  కొంచెం  సాయం  చేసినా  తెగ  పొగిడే  వ్యక్తి  తన  భార్య  ఎంత  సాయం  చేసినా  పట్టించుకోరు.  ఆ  ఏముంది,  తన  బాధ్యత  కాబట్టి  చేస్తుంది,  అంతే..  అనేస్తారు.


బయట  వాళ్ళకు  ఎంతో  విలువనిచ్చి  జీవితభాగస్వామికి  తక్కువ  విలువనిచ్చే    మనస్తత్వం  ఉన్నప్పుడు  కుటుంబంలో  కలతలు  వస్తాయి..


ఇలాంటి  వారి   కుటుంబ  జీవితం  సరిగ్గా  ఉండదు. 
 
......................................
ఈ  రోజుల్లో  కొత్తరకం  ఉద్యోగాలు  వచ్చిపడ్డాక  భార్యకు  భర్తకు  సరిగ్గా  మాట్లాడుకోవటానికి  కూడా  కుదరటం  లేదు. 

ఐటీ  కంపెనీల్లో    రాత్రి,  పగలు  తేడా  లేకుండా  ఉద్యోగాలు  చేయవలసి  వస్తోంది. 

విదేశాల  వారికి  పగలు  మనకు  రాత్రి  అయితే , మనవాళ్ళు   నిద్ర  మేల్కొని  ఉద్యోగాలు  చేసి  డబ్బు  సంపాదిస్తారు.  ఇదే  గొప్ప  అభివృద్ధి  అనుకుంటున్నారు  జనాలు.


 ( ఒకప్పుడు  ప్రపంచానికే    ఆదర్శ  దేశమైన  భారతదేశ  పరిస్థితి    ఇంకొకరి  మీద  ఆధారపడే  విధంగా  ఇలా  తయారయ్యింది.  )

 
........................................

కొందరు  పురుషులు  ఫ్రెండ్సే  లోకంగా  బ్రతికేస్తుంటారు.  వివాహం  అంటే  ఎన్నో  బాధ్యతలు  ఉంటాయి.  


 వివాహం  జరిగినా  కూడా  ఇంకా  బాచ్ లర్  లా   ఫ్రెండ్స్ తో    కులాసాగా  కబుర్లు  చెప్పుకుంటూ  ఎక్కువ  సమయాన్ని  గడపటానికి  ఇష్టపడుతుంటారు.

ఇందువల్ల  కుటుంబములో  ఎన్నో  మనస్పర్ధలు  వస్తుంటాయి.


ఈ  కాలంలో  కొందరు  స్త్రీలు  కూడా  కుటుంబబాధ్యత  కన్నా  ఫ్రెండ్స్ తో  సమయాన్ని  గడపటానికి  ఇష్టపడుతున్నారు.


జీవితంలో  ఫ్రెండ్స్  అవసరమే  కానీ,  కుటుంబము,   కెరీర్ ,  ఫ్రెండ్స్ ..దేనికి  ఎంతవరకు  ప్రాముఖ్యతను  ఇవ్వాలో  ఎవరికి  వారు  తెలుసుకోవాలి. 

 
...................................................

 సైనికులు ,    వైద్యులు   వంటి  వృత్తులలో  ఉండేవారికి   అయితే  కొన్నిసార్లు  కెరీర్ కు    ఎక్కువ  ప్రాధాన్యతను  ఇవ్వవలసి  వస్తుంది.

   ఇవన్నీ  ఎవరికి  వారికి  తెలుస్తాయి.  సందర్భాన్ని  బట్టి   భార్యభర్త   సర్దుబాట్లు  చేసుకోవలసి  ఉంటుంది.

.......................................


కొన్ని  సంస్థలలో  ,   ఉద్యోగస్తులు   కుటుంబసభ్యులులా  కలిసి   స్నేహంగా   పనిచేయాలని , అప్పుడే  సంస్థ  అభివృద్ధి  వేగవంతమవుతుందని   సంస్థవాళ్లు  ఆశిస్తారు. 


  తమ  వద్ద  పనిచేసే  ఉద్యోగస్తుల  కోసం  ఎన్నో  వినోదకార్యక్రమాలను  ఏర్పాటు  చేస్తారు. ఇలా  అయితే,  ఎక్కువ  సమయం  ఆఫీసులోనే  సరిపోతుంది. 

కొన్ని   సంస్థలలో  పనిచేసేవారికి   తమ    కుటుంబసభ్యులతో  గడపటానికి  ఎక్కువ  సమయం  దొరకదు. 


 ఉదా..భార్య  పగలు  ఉద్యోగానికి  వెళ్తుంది.  భర్త  రాత్రి  షిఫ్ట్  ఉద్యోగానికి  వెళ్తాడు.
.....................................................

ఇక  సెలిబ్రిటీల  జీవితం  మరీ  పాపం  అనిపిస్తుంది.  వారికి  కుటుంబముతో  గడపటానికి  ఎక్కువ  సమయం  దొరకదు. 


 దానికి  తోడు  ఎవరెవరో  వచ్చి ... మా  సభకు  ముఖ్య  అతిధిగా  మీరే  తప్పక  రావాలి.  అని  మొహమాటపెట్టేస్తారు.

  ఇక   సెలవు  రోజులలో  కూడా  సెలబ్రిటీలకు   కుటుంబముతో  గడపటానికి  కుదరదు.
...........................................

పురుషులు  తమను  సరిగ్గా  గౌరవించకపోవటం  వల్లే  తామూ  తమ  ఇష్టప్రకారం  జీవిస్తాం  అంటున్నారు   ఈ  కాలపు   కొందరు  స్త్రీలు.


  ఇలా  అనటం  తప్పు.  కొందరు  పురుషులు  వేధించినా  కూడా  స్త్రీలు  దారి  తప్పకూడదు. 

స్త్రీలను  బాధపెట్టే  పురుషులు  వాళ్ళ  ఖర్మను  వాళ్ళు  అనుభవిస్తారు.  పురుషుల  మీద  కోపంతో  స్త్రీలు  తప్పుటడుగులు  వేయకూడదు.


 ఇతరులు తప్పులు   చేసారని  తామూ   తప్పులు  చేయకూడదు  కదా!



Wednesday, March 26, 2014

భార్యాభర్త .... మధ్యన మూడో వ్యక్తి వద్దు.


ఈ రోజుల్లో మారిన సమాజపు పోకడ వల్ల వ్యవస్థలో   ఎన్నో మార్పులు వచ్చాయి.

 ...............................

  మధ్య  వచ్చిన  ఒక  కధలో  ఒక  స్త్రీ  ఒక  పురుషుడు  ఒకరినొకరు  ఇష్టపడతారు.  ఇద్దరూ  వివాహమై  పిల్లలున్నవారే. 

ఇప్పటి  సమాజంలో  ఇలాంటి  సంఘటనలు  జరుగుతున్నాయి  కాబట్టే  అలాంటి  కధను  వ్రాసారు . 

అసలు  వివాహమైన  స్త్రీలు,  పురుషులు    ఇంకొకరి  భార్యనో   లేక  ఇంకొకరి  భర్తనో  ఇష్టపడటమేమిటి  ? ఇది  అధర్మం  కదా !

ఈ  రోజుల్లో  స్త్రీలకు  పురుషులకు  స్వేచ్చగా  మాట్లాడుకోవటానికి    ఎన్నో  అవకాశాలున్నాయి.  స్త్రీలు,  పురుషులు  మాట్లాడుకోవటంలో  తప్పులేదు.


 పర  స్త్రీని  సోదరి గానూ.... పర  పురుషుడిని  సోదరుని గాను  భావించినప్పుడు  ఎటువంటి  ఇబ్బందులు  ఉండవు.


.....................................

మాకు  తెలిసిన  ఒక  కుటుంబములో   భర్త  యొక్క   వివాహేతర  సంబంధాన్ని  తట్టుకోలేక  భార్య  ఆత్మహత్య  చేసుకుంది.

  ఇంకొక  కుటుంబంలో  భార్య  యొక్క  వివాహేతర  సంబంధాన్ని  తట్టుకోలేక  భర్త  ఆత్మహత్య  చేసుకున్నాడు. 

స్త్రీలు,  పురుషులు  కలుపుగోలుగా  మాట్లాడుకోవటం  అనేది  అనేక  అపోహలకు  దారితీసి  కొన్ని  కుటుంబాలలో      గొడవలు  జరుగుతున్నాయి.

................................. 

  కొన్ని  వార్తాపత్రికలలో  సైకాలజిస్టులను  కొందరు  సలహాలు   అడుగుతుంటారు. కొన్ని  సమస్యలను   గమనిస్తే  సమాజంలో   వివాహేతర  సంబంధాలు  ఎంతలా  పెరిగాయో  తెలుస్తుంది.
....................... 


ఈ రోజుల్లో ....
స్త్రీలు,  పురుషుల   మధ్య పరిచయాలకు ఎంతో అవకాశం ఏర్పడింది.కొందరి విషయంలో ఆ పరిచయాలు పెడత్రోవ పడుతున్నాయి.

అంతే, అప్పటివరకు   ఉన్నదాంట్లోనే సరిపెట్టుకుని ఒద్దికగా గడిపిన భార్యాభర్త వారి పిల్లలతో కూడిన కుటుంబం అనే ఆ బంధం విచ్చిన్నమయిపోతుంది...


పోయిన వారు పోగా మిగిలిన వారు ఒంటరి పక్షుల్లా మిగిలిపోతారు నిస్సహాయంగా.

అలా ఒంటరిగా మిగిలిపోయిన భార్య గానీ భర్త గానీ వారి పరిస్థితి అయోమయమే .. వారి పిల్లల పరిస్థితి అంతకన్నా అయోమయం.

 
అయినా ఇలా ఇతరుల కుటుంబములో చిచ్చుపెట్టడం న్యాయమా ?

..........................................  
 
మన దగ్గర కొన్ని ఉండకపోవచ్చు . అవి ఇతరుల దగ్గర ఉండవచ్చు. అంతమాత్రాన అవి మన సొంతమవాలని కోరుకోవటం ఏం న్యాయం ?


మనకు నచ్చాయని ప్రక్కింటి వారి కుక్క పిల్లనో, కుందేలు పిల్లనో మచ్చిక చేసి మన ఇంటికి తెచ్చేసుకుని మన సొంతం చేసుకుంటానంటే ఎవరూరుకుంటారు ?


మన దగ్గర ఎక్కువ డబ్బు లేదు కదా అని .... ఎదుటివారి డబ్బు కావాలని ఆశ పడి ప్రయత్నిస్తే  ఏమవుతుంది ? వారిని ఏమంటారు ?

 ఇతరుల వస్తువులు లాక్కునేవారికి శిక్షలున్నాయి. కానీ ఇతరుల కాపురాన్ని  కూల్చేవారికి  ..... ?


ప్రపంచంలో మనకు నచ్చినవన్నీ అధర్మంగా అయినే సరే పొందాలనుకోవటం అన్యాయం.


ఒక జంట వివాహ సమయంలో ఎన్నో ప్రమాణాలు చేస్తారు. కష్టసుఖాల్లో తోడుగా కడదాకా కలిసి ఉంటామని ........ భార్యాభర్త   బయటి ఆకర్షణల విషయంలో తప్పుటడుగులు వేయకూడదు మరి.




Tuesday, March 25, 2014

యువత సొంతంగా ఉపాధి ఏర్పాటు చేసుకోవటాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహించాలి.

కొందరు  విద్యార్ధులకు  చదువు  అయిపోయిన  వెంటనే  ఉపాధి  దొరకదు.   కొందరు   ఇంజనీరింగ్  చదివిన  విద్యార్ధులు   ఉపాధి  లభించక  ఇంట్లోనే  ఉంటున్నారు. 

 ఇంట్లో   ఏం  చేయాలో  వాళ్ళకు  తెలియదు.  కొన్నాళ్ళు  ఆ  కోర్సులు,  ఈ  కోర్సులు  నేర్చుకున్నారు. గంటల  తరబడి   లాప్ టాప్  ముందేసుకు  కూర్చుంటే  ఇంట్లో  వాళ్ళు   కోప్పడతారు. 

.......................................

ఇక  చేసేదేమీ  లేక  కొందరు  స్నేహితులు  కలసి  సిటీకి  వెళ్ళి  ఏదైనా  చిన్న  ఉద్యోగంలో  చేరాలని  నిర్ణయించుకుంటారు. 

వాళ్ళ  వద్ద  సొంతంగా  డబ్బు  ఉండదు  కదా  !  పెద్దవాళ్ళు  ఇచ్చిన  డబ్బు  తీసుకుని  సిటీకి  బయలుదేరతారు.

 ఒక  గది  అద్దెకు  తీస్కుని  అందులో  ఉంటారు.  పిల్లలు  అనగానే  ఒక్క  గది   కూడా  బోలెడు  అద్దె  చెబుతారు  యజమానులు. 

ఇక  ఉపాధి   కోసం  నిరంతర  అన్వేషణ  మొదలవుతుంది.  ఇంటి  నుంచి  తెచ్చుకున్న  డబ్బు  ఎక్కడ  అయిపోతుందో  అనే  భయంతో   డబ్బు  చూసిచూసి  వాడుకుంటారు.

 హోటల్  భోజనం  అయితే  బోలెడు  డబ్బు  అవుతుందనే  భయంతో...  రూములో   అన్నం  వండుకుని  కర్రీ  పాయింట్  వద్ద  కూరలు  తెచ్చుకుంటారు.

  అన్నం  ఎక్కువ  కలుస్తుందని  ఎక్కువగా  పప్పుకూరను  తెచ్చుకుంటారు.  ఇంట్లో  అమ్మ  వండే  భోజనం  రుచి  పదేపదే  గుర్తొస్తుంది.

 పదేపదే    సొంత  ఊరికి  వెళ్ళాలంటే  చార్జీలు  అవుతాయని  అప్పుడప్పుడూ  మాత్రమే  వెళ్ళివస్తుంటారు.

..........................................

ఉద్యోగం  ఎప్పుడొస్తుందో  తెలియదు. అలా  తిరగగా  తిరగగా  ఒక  చిన్న  కంపెనీలో  ఉద్యోగాలు  దొరికాయి.  తక్కువ  జీతమే  అయినా  ఎంతో  సంతోషం  వేసింది  మిత్రులకు. తమ  సొంత  సంపాదన  కదా  !


తరువాత  వారికి  పెద్ద  కంపెనీలో  ఎక్కువ  జీతంతో  ఉద్యోగాలు  వచ్చాయి.  దైవం  దయ  వల్ల   కధ   సుఖాంతం  అయింది.

...................................................

     పిల్లలు  ఉద్యోగం  దొరకక  ఖాళీగా  ఇంట్లో  ఉంటే  తల్లితండ్రి  కోప్పడకూడదు.  వాళ్ళకు  ఉపాధి  లభించేవరకూ  వాళ్ళు  అడగకపోయినా  అవసరమైనంత  డబ్బును  పంపించాలి.  


 ( ఎక్కువ  డబ్బు  ఇస్తే  పిల్లలు   చెడ్డ అలవాట్లు  నేర్చుకుంటారేమోననే భయంతో  కొందరు  పెద్దవాళ్ళు  ఎక్కువ  డబ్బును  ఇవ్వరు.  అయి తే,  బయటకెళ్ళి  బతకాలంటే  డబ్బు  అవసరం .....    ఈ రోజుల్లో    బయట    భోజనం చేయాలన్నా  ఎంతో  ఖర్చు  అవుతుంది  కదా ! ....  ఇవన్నీ  పెద్దవాళ్ళు  ఆలోచించాలి . )


పిల్లలు  కూడా  మొహమాటపడకుండా  తల్లితండ్రిని  డబ్బు  అడగాలి.  పెద్దవాళ్ళ  దగ్గర  మొహమాటపడితే  ఎలా ?  


ఉద్యోగాలకు  అప్లై  చేయటానికి  అప్లికేషన్స్  వాటికి  కూడా  కొంత  డబ్బు  అవసరమవుతుంది  కదా !


....................................

నిరుద్యోగులుగా   ఉన్న  పిల్లలతో   పెద్దవాళ్ళు   ఆప్యాయంగా  మాట్లాడాలి.  వారికి  ధైర్యాన్ని  చెప్పాలి.

 లేకపోతే,  ఇలాంటి  సమయంలో  నిరాశానిస్పృహల  వల్ల  యువత   మత్తుపదార్ధాలకు  అలవాటు  పడే  అవకాశాలు  కూడా  ఉన్నాయి.  అందుకే  తల్లితండ్రి  జాగ్రత్తగా  చూసుకోవాలి.

ఎంతో   కొంత  డబ్బు  ఉన్న  వారి  పిల్లల  పరిస్థితే  ఇలా  ఉంటే .... ఇక  పేదవారి  పిల్లల  పరిస్థితి  ఎలాగుందో  భగవంతునికే  తెలియాలి.

......................................


ఈ  దేశంలో  బడా  పారిశ్రామిక  సంస్థలకు  కోట్ల  కొద్దీ  రుణాలు  ఇస్తారు  కానీ,  నిరుద్యోగులైన  యువకులు  కొందరు  కలిసి    చిన్న , మధ్య  తరహా  పరిశ్రమలను   ఏర్పాటు  చేసుకోవటానికి    రుణాలు  అడిగితే  సవాలక్ష  ప్రశ్నలతో  వేధిస్తారు. 

యువత  సొంతంగా    ఉపాధి   ఏర్పాటు  చేసుకోవటాన్ని    ప్రభుత్వాలు  ప్రోత్సహించాలి.

....................................


దేశంలో  రాజకీయ  పార్టీలకు  ఎన్నికల్లో  గెలవటం,   సీట్లు  సంపాదించటం  ..ఇదే  గోల.  స్వాతంత్ర్యం  వచ్చి  ఎన్నో  ఏళ్ళు  గడిచినా  దేశంలో  ఇన్ని  సమస్యలు ఉండటం  ప్రజల  ఖర్మ.

..............................................

మితిమీరిన పారిశ్రామీకరణవల్ల నిరుద్యోగం , ఉద్యోగాలు...




Monday, March 24, 2014

ఉద్యోగం లేని యువకుల బాధలు .... ఉద్యోగాలు చేసే వారి బాధలు ..

ఈ  రోజుల్లో  అమ్మాయిల్లో  కూడా   ఇంజనీరింగ్  చదివేవారు  ఎక్కువయ్యారు. 
ఆ  విషయం  అలా  ఉంచితే,

................................


 కొంతకాలం  క్రిందట  ఒక  పెద్ద కంపెనీ  వారు  తమ  సంస్థలో  ఉద్యోగాల  కోసం  ఇంటర్వ్యూకు  రమ్మని  2000  వేల  మంది  అభ్యర్ధులను  పిలిచారట.  


రెండు , మూడు  వడపోతల  తర్వాత  2 వేలమందిలో  కేవలం  ఇద్దరు  అమ్మాయిలను  సెలక్ట్  చేసారట. 

 ఇక  అబ్బాయిల  నిరాశ  చెప్పనలవి కాదు.  అంతమంది  వెళ్తే  ఇద్దరినే  సెలక్ట్  చేసారు.  అబ్బాయిలను  ఎవరినీ  సెలక్ట్  చేయలేదు  అంటూ  వాపోయారు.  


ఎంతో  ఆశతో  వెళ్ళిన  వారి  మనస్సు    ఎంత బాధగా   ఉంటుందో   ఊహించటానికి  అందదు.
............................................


ఇంకొక  సంఘటనలో  ఒక సంస్థ  వాళ్ళు,   ఇంజనీరింగ్  పూర్తయిన  కొందరిని    ఉద్యోగానికి    సెలెక్ట్  చేయగానే  అందరూ  ఎగిరి గంతేసి  ఉద్యోగం  వచ్చేసిందని  సంతోషంగా   చెప్పుకున్నారట. 


అయితే  ఎంతకాలానికీ  సంస్థ  వారు  జాయిన్  అవటానికి  రమ్మని   పిలవటం లేదు.

 ఇలా  ఒక  సంవత్సరం  గడిచేసరికి  అబ్బాయిలలో  నిరాశానిస్పృహలు  పెరిగిపోయాయి.


 ఇక  ఎదురు  చూడలేక   కొందరు  అబ్బాయిలు  కలిసి  సంస్థ  వారికి  ఒక  మెయిల్  పంపించారట.

 తమ  దయనీయమైన   పరిస్థితిని  తెలియజేస్తూ  ఉద్యోగానికి  పిలవమని    ప్లీజ్  !   అని   వేడుకున్నారట.

 ఈ  సంఘటన  గురించి  విన్నాక    ఆ యువకుల  పరిస్థితికి    చాలా  బాధ  అనిపించింది. 


  ఉపాధి  కోసం  ఎదురు  చూస్తూ    ఖాళీగా  ఉంటే  అబ్బాయిలు  ఎంతో  నిరాశకు  గురవుతారు.  అలాంటప్పుడు  తల్లితండ్రి  వాళ్ళను  తిట్టకుండా  ధైర్యాన్ని  చెప్పాలి.  

..............................................


మాకు   తెలిసిన    కూరలు  అమ్మే   ఒక  ఆమెకు  ఇంజనీరింగ్   చదివిన  అబ్బాయున్నాడు.  అయితే  ఆ  అబ్బాయికి  ఉద్యోగం  లభించక  ఇంట్లోనే  ఉన్నాడని   నా దగ్గర  చెప్పి  బాధపడేది.  


నేను  ఏమన్నానంటే,   అబ్బాయిని  ఏమీ  కోప్పడవద్దు.   అసలే  అబ్బాయి  బాధపడుతున్నాడు.  ఇప్పుడు  అందరి  పరిస్థితి  అలాగే  ఉంది.    ఉద్యోగాలు  త్వరగా   రావటం  లేదు....అబ్బాయి  మాత్రం  ఏం  చేయగలడు.   అని  నచ్చజెప్పాను.  

......................................


ఈ  దేశంలో  బడా  పారిశ్రామిక  సంస్థలకు  కోట్ల  కొద్దీ  రుణాలు  ఇస్తారు  కానీ,  నిరుద్యోగులైన  యువకులు  కొందరు  కలిసి    చిన్న , మధ్య  తరహా  పరిశ్రమలను   ఏర్పాటు  చేసుకోవటానికి    రుణాలు  అడిగితే  సవాలక్ష  ప్రశ్నలతో  వేధిస్తారు. 


యువత  సొంతంగా    ఉపాధి   ఏర్పాటు  చేసుకోవటాన్ని    ప్రభుత్వాలు  ప్రోత్సహించాలి.

.......................................


అమ్మాయి   ఉద్యోగం  లేక   ఖాళీగా  ఉంటే  ఇరుగుపొరుగువారు  ఏమీ  అనరు.  

అయితే,  అమ్మాయి  విషయంలో   ఏమంటారంటే,   మీ  అమ్మాయికి  ఇంకా  పెళ్ళి  సంబంధాలు  చూడటం  లేదా  ?  అని  అడుగుతూ  హింసిస్తారు.

అబ్బాయి  ఇంట్లో  ఖాళీగా  ఉంటే  చుట్టుప్రక్కల  వారు ....
మీ అబ్బాయికి  ఇంకా  ఉద్యోగం  రాలేదా  ? వంటి   పరామర్శలతో  హింసించేస్తారు. 
 
..................................................

ఉద్యోగం  లేని  యువకుల  బాధలు  ఇలా  ఉంటే  ఉద్యోగాలు  చేసే   వారి  బాధలు   మరొక  రకంగా  ఉంటాయి.

మాకు  తెలిసిన   ఆఫీసులో  పనిచేసే  ఆడవారు  కొందరు  ఉద్యోగం  చేసే  ఊరిలో  కాకుండా  ప్రక్క  ఊరిలో  నివాసం  ఉంటారట.  


ఇక   సాయంత్రం  3 గంటలు  అవగానే  ఇంటికి   వెళ్ళిపోవాలని   అడుగుతారట. 

  అదేంటమ్మా  అప్పుడే  వెళ్ళిపోతే  ఆఫీస్   పని  ఎలా  ?  అంటే.... 


 ప్లీజ్  !   ఇప్పుడు  బయలుదేరకపోతే   బస్సు  అందదు,   చీకటి  అవుతుంది.  గంటన్నర  ప్రయాణం  చేయాలి....ఇంటికి  పిల్లలు  వచ్చేస్తారు..  అని  చెప్పి  వెళ్ళిపోతారట. 

వాళ్ళను   ఏమీ  అనలేక  పంపించేస్తారట  మగవాళ్ళు.   ముందే  వెళ్ళిపోయిన  ఆడవారి  పని   కూడా   కొన్నిసార్లు  ఆఫీసులోని   మగవాళ్ళే  చేయవలసి  వస్తుందట.  


  ఆడవాళ్ళు    ఆలస్యంగా  ఇంటికి వెళ్ళాలంటే    సెక్యూరిటీ  ప్రాబ్లం  , ఇంకా   ఇంట్లో   పని  ఉంటుంది  కదా  ! 


 ( అయితే,  అన్ని  ఆఫీసుల్లోనూ  ఇలా  త్వరగా  పంపించరు.  కొన్నిసార్లు  రాత్రై  తొమ్మిది  అయినా  పనిచేయవలసి  వస్తుంది.  )

 
ఏంటో   ఈ  రోజుల్లో   వ్యవస్థ  గందరగోళంగా  తయారయింది.




Saturday, March 22, 2014

సంతోషంగా మనసారా నవ్వటానికి బోలెడు డబ్బు అవసరం లేదు.. ఈ యూ ట్యూబ్ చూడండి.


  సంతోషంగా  మనసారా  నవ్వటానికి   బోలెడు  డబ్బు  అవసరం  లేదు..



   చూడండి...... 

Hysterical bubbles! (original) - laughing baby - YouTube



Baby Laughing Hysterically at Ripping Paper (Original) - YouTube 


****************
 
marikonni vishayamulu...

ఈ రోజుల్లో పనులు చేయటానికి మనుషులు లభించటంలేదని  కొందరు అంటారు కానీ, అది నిజంకాదు. ఈరోజుల్లో ఉపాధిలభించని మనుషులు ఎందరో ఉన్నారు. ఉపాధి లేక ఇతరప్రాంతాలకు,దేశాలకు వెళ్తున్నారు. తక్కువ జీతం తీసుకునే వారికొరకు యజమానులు ఎదురుచూస్తారు.  యంత్రాలయితే   జీతాలు ఇవ్వక్కర్లేదు, సమ్మెలు ఉండవు.. ఎక్కువ ఖర్చు ఉండదు. అందుకని యంత్రాల వాడకం పెరుగుతోంది.


పాతకాలంలో నలుగురు నెలరోజులు చేసేపనిని ఇప్పుడు యంత్రాలు ఒక్క గంటలో చేస్తున్నాయి. దీనివల్ల ఉపాధి అవకాశాలు తగ్గాయి.. అతిగా వస్తువినియోగం పెరిగి పర్యావరణసమస్యలు పెరుగుతున్నాయి....ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ కాలేజీలనుండి లక్షలమంది డిగ్రీ తీసుకుని బయటకువస్తున్నారు. ఇంతమందికి ఉద్యోగాలు రావాలంటే ఎన్ని కంపెనీలు ఉండాలి?


 యంత్రాలు వద్దని నా అభిప్రాయం కాదు.. కొన్ని కష్టమైనపనులకు యంత్రాలు వాడవచ్చు. అయితే, ప్రతిపనికి యంత్రాలు కాకుండా కొంతవరకు మాత్రం వాడితే మంచిది. సంపదను అందరూ పంచుకుంటే నిరుద్యోగం తగ్గించవచ్చు. కొందరు సంపదను తామే ప్రోగుచేసుకుని దాచుకోవటం కాకుండా, కొంతవరకు సంపాదించుకుని, ఇతరులకు అవకాశమివ్వాలి. మనుషుల్లో అత్యాశ వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి.
 
 
చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించాలి. చేతివృత్తులను,పర్యావరణహిత పరిశ్రమలను ప్రభుత్వాలు ప్రోత్సహించాలి.


 పశుపక్ష్యాదులకు పెద్ద కోరికలు ఉండవు. ఆహారం, చిన్నగూడు.. ఇలాగే అవి జీవిస్తాయి. మనుషులకు కూడా ఆహారం, ఇల్లు, రక్షణ, విద్య, వైద్యం..ఇవే ప్రాధమిక అవసరాలు. వీటికి పెద్ద కష్టపడనక్కరలేదు.


ప్రకృతిలోనే అన్నీ ఉన్నాయి. ఎన్నోమొక్కలు, చెట్లునుండి ఎంతోఆహారం..లభిస్తుంది. పాతకాలంలో మట్టితో..సున్నంతో ఇల్లు కట్టుకునేవారు..హరప్పా, మొహంజోదారో నాగరికత ఎంతో గొప్పది. ఆరోజుల్లోనే ఇళ్ళనుండి ఊరిబయటకు పోవటానికి చక్కటి డ్రైనేజ్ వ్యవస్థ ఉండేదని అప్పటి కట్టడాల ద్వారా తెలుస్తోంది. పాతకాలపు దేవాలయాలు ఎన్నో ఇప్పటికీ చక్కగా ఉన్నాయి.


వైద్యం కొరకు ఎన్నో మొక్కలున్నాయి, ఆయుర్వేదం ద్వారా ఎన్నో జబ్బులకు మందులున్నాయి. పాతకాలంలో శస్త్రచికిత్సలు కూడా జరిగేవని గ్రంధాల ద్వారా తెలుస్తుంది. రక్షణకొరకు  ఆయుధాలు వాడేవారు. అంతరిక్షం, ఇంజనీరింగ్.. ఇలా ఎన్నో విషయాల గురించి ప్రాచీనకాలంలో ఎంతో విజ్ఞానం ఉందని గ్రంధాల ద్వారా తెలుస్తోంది. 
 
 
దురదృష్టం ఏమిటంటే, మనదేశంలోని ప్రజలలో చాలామందికి స్వదేశం గురించి చిన్నచూపు ఉంది. భారతదేశం వెనుకబడటానికి ముఖ్యమైన కారణాలాల్లో ఇదొకటి.
 

 ఆధునిక టెక్నాలజీ వల్ల ఎన్నో మార్పులు వచ్చాయి. అయితే, ఆధునికటెక్నాలజీ వల్ల కొంత మంచి, కొంత చెడు ఉంది. టెక్నాలజీ ఎంతవరకో అంతవరకే వాడుకోవాలి. పర్యావరణసమస్యలు పెరిగే స్థాయిలో టెక్నాలజీ ఉండకూడదు. టెక్నాలజీ వల్ల ఓజోన్ పొర దెబ్బతిని  అనారోగ్యాలు విపరీతంగా పెరిగే ప్రమాదముందని పరిశోధకులు అంటున్నారు.
ణువ్యర్ధాలు, ప్రోగుచేసిన అణ్వాయుధ భయాలు ఉన్నాయి.ఇవన్నీ అందరూ ఆలోచించాలి.
 
 
సెల్ ఫోన్లు, కంప్యూటర్లు వాడకం వల్ల సమస్యలు కూడా ఉన్నాయి. అదేపనిగా వాడితే నరాల వ్యాధులు, కంటి వ్యాధులు..మొదలైనవి వచ్చే అవకాశాలున్నాయి. ఈరోజుల్లో చిన్న వయస్సు నుంచే వీటిని వాడుతున్నారు. భవిష్యత్తులో వీరి ఆరోగ్యం ఎలా ఉంటుందో?


ఈ రోజుల్లో సంపద, అధికారం కొరకు కొందరు, మతాల పేరుతో కొందరు, టెక్నాలజీ అంటూ కొందరు విపరీతంగా చేస్తున్నారు.. పర్యావరణాన్ని పాడుచేస్తూ కొన్ని జీవజాతులు అంతరించే పరిస్థితులను తెచ్చారు.  ఏదైనా ఒక పరిధిలో ఉంటేనే అంతా బాగుంటుంది.
 
  ఏ విషయంలోనైనా విపరీతధోరణి సరైనది కాదు. అన్నింటినీ సృష్టించిన దైవం అన్నింటినీ సరిదిద్దుతారు.

Friday, March 21, 2014

ఉపాధి కోసం .... స్త్రీలు,పురుషుల మధ్య పోటీ ?

 
ఒక  రోజు  ఇంటికి  వెళ్ళటానికి  బస్సులో  వెళ్తున్నాను.   అప్పటికే  రాత్రి  7 గంటల  సమయం   దాటింది.  ఇంటికి  వెళ్ళే  కాలేజ్  అమ్మాయిలు,  ఆఫీసుల  నుంచి  ఇంటికి  వెళ్ళే  ఉద్యోగినులతో  బస్సు  కిటకిటలాడుతోంది.  

చాలా  మంది  సీట్  లేక  నిల్చుని   కష్టపడుతూ   వెళ్తున్నారు.   అంతా   ఇరుకుగా,   చాలా  చిరాకుగా  ఉంది.


నాకు  ఇంటి  వద్ద  చాలా  పని  ఉంది.  వంట  చేయాలి.  ట్రాఫిక్  జాం  వల్ల    బస్సు  ఆగీఅగీ  వెళ్తోంది.     చాలా  చిరాకుగా  అనిపించి  చుట్టుప్రక్కల  వాళ్ళకు  వినిపించేలా  గట్టిగానే  అన్నాను.


ఏం  బాధలో... ఇప్పుడు  ఇళ్ళకు  వెళ్ళి పని  చేయటానికి   ఏం  ఓపిక  ఉంటుంది  ?  ఇంట్లో  పనులెలా  చేసుకుంటారు  ? ఇప్పడు  ఇంటికి  వెళ్తే  చంటి  పిల్లలు  ఎక్కడ  ఉంటారు  ?  కుటుంబాన్ని  చూసుకోవటమూ   ముఖ్యమే  కదా ! ఇలా....   అన్నాను.  


ఇదంతా  విన్న  ఒక  కాలేజీ  అమ్మాయి  నా  వైపు  కోపంగా  చూసింది. 

(  ఇంకా  బాధ్యతలు  తెలియని  వయస్సు  కదా ! )  

సీట్లలో  కూర్చుని  మాట్లాడుకుంటున్న  ఇద్దరు  మహిళలు   వాళ్ళలో  వాళ్ళు  మాట్లాడుకుంటున్నట్లుగా  నాకు  వినిపించేలా  ఏమన్నారంటే....

ఇంట్లో  హాయిగా  కూర్చోక   ఇలా  ఉద్యోగాలు  చేయటం  మనకు  మాత్రం  ఇష్టమా ...  ఉద్యోగాలు  మానేస్తామంటే  ఇంట్లో  మగవాళ్ళు  ఊరుకుంటారా  ?  వస్తువుల  రేట్లు  ఎంతో  పెరిగిపోయాయి.  స్కూల్స్,  కాలేజీల  ఫీజులు  బాగా  పెరిగాయి.  తప్పనిసరి  పరిస్థితిలో  ఉద్యోగాలు  చేయవలసి  వస్తోంది.....  అంటూ  మాట్లాడుకున్నారు.


ఆ  మహిళలు   అన్నట్లే    చాలామంది  అంటుంటారు.  భర్త   సంపాదించే  ఒక్క  జీతంతో  ఈ  రోజుల్లో  ఎలా  బతకాలి  ?  అంటారు. 


 
వస్తువుల  రేట్లు  పెరిగిపోతుంటే  వాటిని  తగ్గించమని  ప్రభుత్వంపై  వత్తిడి  తేవాలి  ...పెరిగే  వస్తువుల  రేట్లను  అందుకోవటానికి   మహిళలు  ఇంటాబయటా  ఎన్ని  పనులను  చేయగలరు  ? 

................................


(  పూర్వం  ఒక్క  సంపాదనతో  ఎన్నో  కుటుంబాలు  చక్కగా  జీవించారు  కదా ! 
అయితే, పూర్వపు  ప్రజలు  మనకన్నా  అల్పసంతోషులు.  ఇప్పటి  వారిలో  చాలామందికి   ఎన్ని   సౌకర్యాలు  ఉన్నా  ఏదో లేదని    అసంతృప్తి  ఫీలవుతుంటారు. )
........................


 కుటుంబాన్ని  ఆదుకునేందుకు  కొందరు  స్త్రీలు  ఉద్యోగాలు  చేస్తారు.   అయితే  అందరు  స్త్రీలు  ఆర్ధిక  లోటు  వల్లే  ఉద్యోగాలు  చేస్తున్నారని  అనలేం. 

 ఆర్ధిక  పరిస్థితి  బాగానే  ఉన్న  కొందరు  స్త్రీలు   మరింత  ఆర్ధికంగా  ఉన్నత స్థానం  కోసం  ప్రయత్నిస్తుంటారు.

ఎక్కువ  జీతం  వచ్చే   కొందరు  మహిళలు  వేల  రూపాయలు  పోసి  దుస్తులు  కొంటుంటారు.  లేటెస్ట్  డిజైన్లు  అంటూ  నగలను   ఎప్పటికప్పుడు   మార్చేస్తుంటారు. 


 స్త్రీలు,  పురుషులు   వేల  రూపాయలు  పోసి  లేటెస్ట్  సెల్  ఫోన్లను  కొని  పడేస్తున్నారు.
....................................


 ఆర్ధిక  పరిస్థితి  బాగా  ఉన్న  మహిళలు  కూడా   ఉద్యోగాల  కోసం   పోటీపడటం  వల్ల    ఆర్ధిక పరిస్థితి   సరిగ్గా లేని   మరికొందరికి  ఉద్యోగ  అవకాశాలు  తగ్గే  అవకాశం  ఉంది.  


ముఖ్యంగా  ఈ  పోటీ  ప్రపంచంలో  యువకులు  ఉద్యోగాలు   లభించక  నిరాశానిస్పృహలకు  గురవుతున్నారు. 


 ఉపాధి  లభించక   ఈ  మధ్య  కొందరు  యువకులు  ఆత్మహత్యలు  చేసుకున్నట్లు  వార్తలు  వచ్చాయి. 

ఆడపిల్లలు  ఉద్యోగం  చేయకపోతే  ఎవరూ  పెద్దగా  పట్టించుకోరు.  


మగపిల్లలు  ఉద్యోగం  లేక  ఇంటిపట్టున  ఉంటే  ఇంట్లో  వాళ్ళూ,  చుట్టుప్రక్కల  వాళ్ళూ  కూడా    ఈసడిస్తారు. 

ఏరా  !  ఇంకా  ఉద్యోగం  రాలేదా  ?  అని  పరామర్శలతో  హింసిస్తారు.


  ( ఉద్యోగాలు  ఏమైనా  అబ్బాయిల   జేబులో  ఉన్నాయా  ? )

 అసలే  విపరీతమైన   యాంత్రీకరణ  మూలంగా  నానాటికీ  ఉద్యోగాలు  తగ్గిపోతున్నాయి. 


 తక్కువమంది  ఉద్యోగస్తులతో  ఎక్కువ   యంత్రాలతో...  పనులు  చేయించుకోవటానికి  యజమానులు  ఎక్కువగా   ఇష్టపడుతున్నారు. దానికి  తోడు  ఉపాధి  కోసం  పురుషులకు  పోటీగా  మహిళలు  వచ్చారు.

 ...............................

అయితే,  కొందరు  మహిళలు  ఉన్నదానితో  తృప్తి   చెంది  కుటుంబాన్ని  చూసుకుంటూ  తీరిక  వేళలో   సమాజ  సేవ  చేస్తూ  జీవితాన్ని  సార్ధకం  చేసుకుంటున్నారు. 

అటు  కుటుంబానికి  న్యాయం  చేస్తున్నారు.....  ఇటు  సమాజానికి  తమకు  తోచినంతలో  సహాయాన్ని అందిస్తూన్నారు. 
........................................

సంపాదించే  డబ్బు  సరిపోవటం  లేదు  అంటారు  కొందరు. 


( కొందరు  నిజంగానే  తక్కువ   జీతాలతో  ఇబ్బందులు  పడుతుంటారు. )

 అయితే,   కొందరి  విషయంలో  మాత్రం   ఇలా  డబ్బు  సరిపోకపోవటానికి  మార్కెట్లో  వచ్చి  పడుతున్న  వస్తువులను  కొనాలనే  మోజు  కూడా   కారణం.

 ఈ  ఆసక్తి  తగ్గనంత  వరకు  ఇంటిల్లిపాదీ  ఉద్యోగాలు  చేసినా  ఎక్కడి  డబ్బూ  చాలదు. అవసరమైనంత  వరకే  ఆశలు  ఉన్నప్పుడు   డబ్బు  చక్కగా  సరిపోతుంది.

.......................


ఈ  రోజుల్లో ,   కుటుంబ సభ్యుల  మధ్య  
ఆప్యాయతలు,  అనుబంధాలు  తగ్గి ,   అర్ధికబంధాలు,  అధికారబంధాలు...  పెరిగాయనిపిస్తుంది.




Thursday, March 20, 2014

కుటుంబాలలో ర్యాగింగ్..


కొన్ని    విద్యాసంస్థలలో  కొత్తగా  చేరిన  వారిని  పాతవాళ్లు  ర్యాగింగ్  చేస్తారట. 

 అయితే ,  కొన్ని  కుటుంబాలలో  కూడా  కొత్తగా  పెళ్ళయి  అత్తవారింటికి  వచ్చిన  కొత్త  కోడలిని  ఆ  ఇంట్లోని  సీనియర్  మహిళలు  ర్యాగింగ్  చేస్తారు.  ఈ  తంతు  పెళ్లిచూపుల  నాడే  మొదలవుతుంది. 

ఉదా...అమ్మాయి  జడ  నిజమైనదా  ?  సవరమా  ?  అని  జడ  పట్టి  గుంజే  మహిళలూ  ఉంటారు.   ఇక,  ఇలాంటి  మనస్సు  కలుక్కుమనే  సంఘటనలెన్నో  మొదలవుతాయి. 


ఇక , పెళ్లిలో మర్యాదలు, పెట్టుపోతలు  గురించి  వచ్చే  గొడవల  సంగతి  చెప్పనే  అక్కరలేదు.


 ( పెళ్ళి  జరిగిన ఎన్నో  సంవత్సరాల  తరువాత  కూడా    భార్యాభర్త   తిట్టుకోవటానికి  ఈ  విషయాలు  కారణమవుతాయి. )

ఇక,  వివాహం  జరిగి  అమ్మాయి  అత్తగారింటికి  వచ్చిన  తరువాత   జీవితం  రకరకాలుగా  ఉంటుంది. 

 ( అత్తవారిల్లు  అన్నారు  కానీ,  మామగారిల్లు  అని  ఎందుకు  అనలేదో ?....)

.........................................

  అత్తగారికేమో....  తన  కొడుకును  కోడలు  చెంగున  ముడేసుకుని  తనను   తిట్టిస్తుందేమోననే  భయం   పట్టుకుంటుంది. 


  కోడలికేమో ... భర్త  తల్లి  మాట  విని   తనను   తిడతాడేమోననే    భయం  పట్టుకుంటుంది.

  ఆడపడుచులకేమో...  పుట్టింటిలో  తమ  ప్రాధాన్యత  తగ్గిపోతుందేమో  ?  అనే  భయం   పట్టుకుంటుంది.

 ఈ  అత్తాకోడలి    సంగ్రామంలో  ఎవరి  ప్రక్క మాట్లాడితే  ఏమవుతుందో ? ....అని  జుట్టు  పీక్కుంటారు  మగవాళ్ళు. 


 ( మగవాళ్ళకు  ఎక్కువగా  బట్టతల  రావటానికి  ఇదీ  ఒక కారణమేమో  ?  )


భార్యతో  ఎక్కువగా  మాట్లాడితే  భార్యావిధేయుడైపోయాడని  తల్లితండ్రి    అనుకుంటారేమోనని  మొహమాటం  పడే  మగవాళ్ళూ  ఉంటారు... ఏమిటో  ఈ  ఖర్మ.

........................................

అత్త  తానూ  ఒకప్పుడు  కోడలినే  అనే  విషయాన్ని  గుర్తుంచుకోవటానికి  అస్సలు ఇష్టపడదు.

 కోడలు  తానూ  భవిష్యత్తులో  అత్తగారు  అవుతుందన్న  విషయాన్ని  
ఆలోచించటానికి  అస్సలు  ఇష్టపడదు.

ఆడపడుచు  తానూ  ఒకింటి  కోడలినే  అనే  విషయాన్ని 
తలుచుకోవటానికి   అస్సలు  ఇష్టపడదు.
.............................................

ఇంట్లో    చిన్న  విషయానికే   సూటిపోటి  మాటలు,   సందు   దొరికితే   ఒకరిమీద  ఒకరు  పితూరీలు  ...ఇవన్నీ  భరించలేనంత  బాధగా  ఉంటుంది.

  కొన్ని  సూటిపోటి  మాటలు  వింటే  మనస్సు   నలిగిపోతుంది. ఇలాంటప్పుడు ,  పెళ్ళి  ఎందుకు  చేసుకున్నాము  బాబోయ్.... అనుకుంటారు  ఆడవాళ్ళు  .

.................................

  కొందరు  అత్తలు  తమ  కోడళ్ళను  సాధింపులతో  పీల్చి  పిప్పి  చేస్తారు .  బతికుండగానే  నరకాన్ని  చూపిస్తారు .  


చిత్రమేమిటంటే  అత్తవారింట   కష్టాలు  పడ్డ  ఈ  కోడళ్లు  తాము  అత్తగార్లుగా  మారిన  తరువాత  తమ  కోడళ్ళను  వేధిస్తారు.

ఈ  రోజుల్లో  కూడా   కట్నం  కోసం  కోడళ్ళను  కాల్చిన  అత్తలు,  ఆడపడుచులూ   ఉన్నారు .   కోడలికి  పుట్టబోయేది  ఆడపిల్ల  అని    అనుమానం  వస్తే  అబార్షన్  చేయించుకోవాలని  ఆర్డర్  జారీ  చేసే  అత్తల  గురించీ  విన్నాము.

  ఈ కాలంలో   చాలామంది  అత్తాకోడళ్లు  కలిసి  ఒకే దగ్గర  ఉండకపోయినా ,  ఫోన్ల  ద్వారానే  పితూరీలు   ప్రసారం  చేస్తూ   కాపురాలను  అల్లకల్లోలం  చేసేస్తున్నారు.

................................

అసలు  ఆడవాళ్ళ  కష్టాలకు  చాలా  వరకూ  కారణం  తోటి  ఆడవాళ్ళే.  భర్తభార్యను  తిడుతుంటే  వద్దని   ఆపే   అత్తలు  ఎందరుంటారు  ? 


తల్లి  చెపితే  కొడుకు  కొంతయినా  తగ్గుతాడు  కదా  !  అలా  ఆపకపోగా  కోడలి  మీద  పితూరీలు  చెప్పి  విషయాన్ని  పెద్దది  చేసే  అత్తల   సంఖ్య  ఎక్కువే.
...................................


తల్లితండ్రికి  పిల్లలకు  మధ్య  విభేదాలను  కల్పించటం  పాపం ...భార్యాభర్త  మధ్య  విభేదాలను  కల్పించటమూ  పాపమే ...  అని  పెద్దలు  తెలియజేసారు.

................................

అయితే  అక్కడక్కడా  కొందరు  మంచిగా  ప్రవర్తించే   అత్తలూ  ఉంటారు.  కొడుకూకోడలూ  బాగుండాలని   పూజలు  చేయించే  అత్తమామలూ  ఉంటారు.

అయితే  ఇలాంటి  వారిలో  కూడా  కొందరు   అప్పుడప్పుడూ  కోడళ్ళను  సాధిస్తుంటారు. ఇలా  చేయటానికి  వీరిలో  ఉన్న  అభద్రతా  భావం  కారణం  అయి  ఉండవచ్చు.

.....................................
 
ఇప్పుడు  వచ్చే  కొన్ని  సీరియల్స్  వల్ల  కూడా  అత్తాకోడళ్లు  ఒకరినొకరు  నమ్మలేని  పరిస్థితి  పెరుగుతోంది. 

 ఈ  మధ్య  ఒక  సినిమాలో  ఒక  తల్లి   తన  కొడుకుతో  ఏమంటుందంటే .... 


ఏరా!  నీ  పెళ్లి  జరిగిన   తరువాత  నన్ను   ఎక్కువ  గౌరవిస్తావా  ?  నీ  భార్యను  ఎక్కువ  గౌరవిస్తావా  ? అని  అడుగుతుంది.

 (  డైలాగులను  ఉన్నది  ఉన్నట్లు  రాయటానికి  గుర్తు  రావటం  లేదు. )


అసలు  ఇలా  ఎందుకు  ఆలోచించాలి ? వివాహం  జరిగిన  తరువాత  తల్లి  విలువ  తల్లికీ  ఉంటుంది.  భార్య  విలువ  భార్యకూ  ఉంటుంది.  జీవితంలో  తల్లికీ  గొప్ప  స్థానం  ఉంటుంది.  భార్యకూ  గొప్ప  స్థానం  ఉంటుంది.

అత్తా  కోడళ్ళ  మధ్య  ఈ  పోటీ  వల్ల  సంసారాలు  నరకప్రాయంగా  మారుతున్నాయి.

...................................


  ఆడవాళ్ళ  కష్టాలకు  పురుషులే   కారణమని  కొందరు  అంటుంటారు  కాని,  అది  పూర్తిగా  నిజం  కాదు  .



Wednesday, March 19, 2014

శేషాచల అడవులలో మంటలు

శేషాచల అడవులలో  మంటలు  వ్యాపించాయట. 

వారం  క్రితం  మొదలైన   చిన్నపాటి  మంటలను  మొదటే  ఆర్పి  ఉంటే  ఇంత  నష్టం  జరిగేది  కాదంటున్నారు.  


చక్కగా  పెరిగిన అటవీ  సంపదకు  నష్టం  కలగటం  బాధాకరం.


మళ్ళీ  అంత  వృక్షసంపద  పెరగాలంటే   ఎంతో  సమయం   పడుతుంది. 


 ఉన్న  అడవులను  జాగ్రత్తగా  సంరక్షించుకుంటే  ఎంతో  బాగుండేది. 


ఇప్పటికైనా   చర్యలు  తీసుకుంటున్నందుకు  సంతోషం.


వర్షం   కురవటం  కోసం  పూజలు  కూడా  చేస్తే  బాగుండు.







Saturday, March 15, 2014

రాబోయే తరాల వాళ్ళను మానసిక, శారీరిక ధృఢత్వం ఉన్న వ్యక్తులుగా తయారుచేయాలి....



  వ్యక్తులకు  శారీరిక  ఆరోగ్యం   మానసిక  ఆరోగ్యం   రెండూ  ముఖ్యమే. ‌‌

యీసురోమని మనుషులుంటే   దేశమేగతి బాగుఅగునోయ్......అని  పెద్దవాళ్ళన్నారు.


  కాబోయే  దేశపౌరులయిన  పిల్లల   పట్ల  తల్లితండ్రులు  ఎంతో  శ్రద్ధ  తీసుకోవలసి  ఉంది. ఆరోగ్యంగా  ఉంటే  ఏ  పనైనా  చేయగలం.   చక్కటి  పుష్టికరమైన  ఆహారం  పెరిగే  పిల్లలకు  ఎంతో  అవసరం. 


బలహీనంగా  ఉండే  మొక్కకు  పూచే  పువ్వులు,  కాచే  పండ్లు   చక్కగా  ఉండవు.   ఆరోగ్యంగా  ఎదిగిన  మొక్కలకు  చక్కటి  పువ్వులు,  చక్కటి పండ్లు  వస్తాయి.

ఆరోగ్యంగా  పెరిగిన  వ్యక్తులకు  కలిగిన  సంతానం  ఆరోగ్యంగా  జన్మిస్తారు.


   రాబోయే  తరాల  వాళ్ళు   మానసికంగా,  శారీరికంగా  ఆరోగ్యంగా,  దృఢంగా  ఉండాలంటే ....  ఇప్పటి  పెద్దవాళ్ళు  పిల్లల  పట్ల  శ్రద్ధ  తీసుకోక  తప్పదు. 

   తల్లితండ్రులు  శ్రద్ధ  తీసుకోకపోతే  పిల్లలు  సరిగ్గా  ఆహారం  తీసుకోరు. వాళ్ళకిష్టమైన  జంక్  పుడ్స్  ఎక్కువ  తంటూ  కడుపు  నింపేసుకుంటారు.  హాస్టల్స్లో  ఫుడ్  నచ్చకపోతే    చారన్నంతో  సరిపెట్టేసుకుంటారు. 


ఏం తినాలో  ?  ఎంత  తినాలో  ?  ఏమి  తినకూడదో  ?  పిల్లలకు  ఎలా   తెలుస్తుంది ? పెద్దవాళ్ళ  మార్గదర్శకత్వం  అవసరం  కదా !


జీవితంలో  ఎలా  ప్రవర్తించాలో  ?  ఎలా ప్రవర్తించ కూడదో   ? పిల్లలకు  ఎలా   తెలుస్తుంది ?  పెద్దవాళ్ళ  మార్గదర్శకత్వం  అవసరం  కదా !


జీవితంలో  శారీరిక  ఆరోగ్యంతో  పాటు  మానసిక  ఆరోగ్యం  కూడా  ముఖ్యమే.


 ఈ  రోజుల్లో   నైతిక  విలువలను  పాటించని   వ్యక్తుల  వల్ల    సమాజానికి  ఎంతో  హాని  జరుగుతోంది.

నైతికవిలువలతో  పెరిగిన  వ్యక్తుల  సంఖ్య  పెరిగితే   సమాజంలో  చెడ్డపనులు  జరగటం  గణనీయంగా  తగ్గుతుంది. 


 అందువల్ల  ప్రతి  తల్లితండ్రులు  తమ  పిల్లలను  ఆదర్శవంతమైన  వ్యక్తులుగా  తీర్చిదిద్దటానికి  ప్రయత్నిస్తే  ఎంతో  సమాజసేవ  చేసినవారవుతారు. 

 నేరం  జరిగిన  తరువాత    శిక్షించటం  అవసరమే.  అయితే  నేరమే  జరగకుండా  చూడటం  మరింత  మంచిది  కదా  ?

తల్లితండ్రులు    తలుచుకుంటే  ముఖ్యంగా  తల్లి    తలుచుకుంటే  ఇలాంటి  చక్కని  సమాజాన్ని తయారు చేయగలదు.


******************
వందేమాతరం ..బ్లాగులో....  దేశమును ప్రేమించుమన్నా -------- గురజాడ అప్పారావు గారి కలం నుండి జాలువారిన దేశభక్తి గీతం  ప్రచురించారు . 

 

Wednesday, March 12, 2014

వాళ్ళూ తమ పిల్లలకు మళ్ళీ బిజీగా డబ్బును సంపాదించాలి కదా !



ఈ  మధ్యనే  ఒక  పాఠశాలలో  ఒక  చిన్న  పిల్లవాడిని  రక్తం  కారేలా కొట్టిన  వార్తను  విన్నాము.    రెండురోజుల  తరువాత  కానీ  పిల్లవాడికి  జరిగిన   విషయాన్ని    గురించి  ఇంట్లోవాళ్ళు  తెలుసుకోలేకపోయారట.   

ఇక  హాస్టల్స్లో  ఇలాంటివి  జరిగితే    పిల్లలకు    జరిగిన  విషయాన్ని  ఇంట్లోవాళ్ళు  తెలుసుకోవటానికి  ఎంతకాలం  పడుతుందో ?
 
ఎంతమంది  తల్లితండ్రులు  విషయాన్ని  సీరియస్ గా  తీసుకుంటారు.  డబ్బు,   సీటు కన్నా  పిల్లలే  ముఖ్యం  అనుకునే  తల్లితండ్రులు  ఎంతమంది  ? 



ఎంతో  డబ్బు  పోసి  హాస్టల్లో  చేర్పించాము,  ఈ  సీట్  వదులుకుంటే  కష్టం  అనుకుని  బాధలు  భరించే  వాళ్ళూ  ఉంటారేమో  ?


 విద్యాలయాల్లో  చదువుల  వత్తిడిని,  తోటివారి ,  పైవారి   వేధింపులను  తట్టుకోలేక  కొందరు  పిల్లలు  ప్రాణాలను  కోల్పోయిన  వార్తలను  విన్నాము. 
.....................................

ఇంట్లో  ఉంటే  పిల్లలకు  సరిగ్గా  సాగదని   భావించి  కొందరు  తల్లితండ్రులు ,  గొప్ప  కాలేజీ  అని  కొందరు  ...  తమ   పిల్లలను    హాస్టల్లో  వేస్తారు. 


 అయితే  హాస్టల్లో  తోటి  పిల్లల  అల్లరితో  చదువు  సాగక  మార్కులు  తక్కువ  మార్కులు  వచ్చిన  పిల్లలూ  ఉన్నారు.

హాస్టల్  నచ్చలేదని  ఇంటికి  వచ్చేసిన  పిల్లలను  కోప్పడకుండా ,   హాస్టలుకు  కట్టిన  ఫీజులను  కూడా  వదులుకుని .... ఉన్న  ఊళ్ళోనే  కాలేజీలో  చేర్పించిన  తల్లితండ్రులూ  నాకు  తెలుసు.  


పిల్లల  బాధను  అర్ధం  చేసుకునే  ఇలాంటి  తల్లితండ్రులు    అభినందనీయులు.

.................................

 హాస్టల్స్ లో   కాలకృత్యాలు  తీర్చుకోవటానికి  కూడా   కొన్ని  ఇబ్బందులు  ఉన్నాయి.  మాకు  తెలిసిన  కొందరు  పిల్లలు   చెప్పినదాని   ప్రకారం   హాస్టల్లో   ఉదయాన్నే   స్నానం  చేసి  కాలేజీకి  వెళ్ళాలంటే  బాత్రూంస్  ఖాళీ  ఉండవట.



ఉదయం  టాయ్ లెట్ కు   వెళ్లాలన్నా  సమయం  కుదరదట.    అందుకని  కొందరు    పిల్లలు   రాత్రి  పూట   స్నానం    చేసి  ఇక  ఉదయానే  స్నానం  చేయరట.
ఇలా  ఇబ్బందులూ    ఉన్నాయి. 



ఇక, కొందరు  పిల్లలకు  కొన్ని  పదార్ధాలు  తింటే  సరిపడవు .
  ఇంట్లో  అయితే  పెద్దవాళ్ళు  పిల్లల  శరీరతత్వానికి  సరిపడే  విధంగా    అవసరమైన  విధంగా  ఆహారాన్ని అందిస్తారు.  ఇంటికి   దూరంగా  హాస్టల్లో   ఉండే  పిల్లలకు  ఇవన్ని  కుదరవు   కదా! 


 పిల్లలకు  తల్లితండ్రితో  కబుర్లు  చెప్పుకోవాలని  ఉంటుంది.  తమకు  నచ్చిన  వంటకాలను  వండించుకుని  తినాలని  ఉంటుంది.  అనారోగ్యం  వస్తే  తల్లితండ్రితో  బాధ  చెప్పుకోవాలని   అనిపిస్తుంది.


 హాస్టల్స్ లో   పిల్లలకు   అనారోగ్యం  వచ్చినా  పెద్దవాళ్ళు  దగ్గర  ఉండరు. ఇలా  చాల ఇబ్బందులు   ఉన్నాయి.    ఇక  పిల్లలకు  తల్లితండ్రి  ఎంత  డబ్బు  సంపాదించి  ఇచ్చినా   ఏమిటి  సంతోషం  ?  


 పూర్వం  తల్లులు   చక్కటి  ఆహారాన్ని  వండి  ఆప్యాయంగా  పిల్లలకు   తినిపించుకునేవారు.  పిల్లలకు  అనారోగ్యం  వచ్చినా   దగ్గరుండి   చూసుకునే  వారు.  అలా  పెద్దవాళ్ళు   పిల్లల  మధ్య  చక్కటి   ఆప్యాయతలు,  అనుబంధాలు   ఉండేవి.

పిల్లలతో  మాట్లాడటానికి  కూడా  సమయం  లేనంతగా  కొందరు  తల్లితండ్రి  బిజీ  అయిపోతున్నారు.  ఇదేమిటంటే  పిల్లలకు  డబ్బు  సంపాదించటం  కోసమే  కదా  మేము  తాపత్రయపడుతున్నాము ....అని  తల్లితండ్రులు  అంటున్నారు. 



 చిన్నతనం  నుంచి  ఒంటరిగా  బ్రతకటానికి   అలవాటయిన    పిల్లలు  పెద్దయిన  తరువాత   తమ  బిజీ లైఫ్  వల్ల 
తల్లితండ్రిని  ఖరీదైన  వృద్ధాశ్రమంలో  వేస్తే  తల్లితండ్రి  బాధపడతారు.

 ( వాళ్ళూ  తమ  పిల్లలకు  మళ్ళీ  బిజీగా   డబ్బును  సంపాదించాలి  కదా  !  ) 

అప్పుడు  పెద్దవాళ్ళు  ఏమంటారంటే,  మాకు  ఖరీదైన   వృద్ధాశ్రమాలు  వద్దు ..... పిల్లలు  మాతో  కొంచెం  సేపు  మాట్లాడితే  బాగుండు ,  మాకు   అనారోగ్యం  వస్తే  మా వద్ద  కూర్చుని,  మాతో  కొంచెం  సేపు  ఓదార్పుగా  మాట్లాడితే  చాలు  ... అంటారు.


 మరి  ఇలా  అనే  పెద్దవాళ్ళు  పిల్లలు  చిన్నగా  ఉన్నప్పుడు  వాళ్ళతో  ఎంతసేపు  మాట్లాడి  కష్టసుఖాలు  పంచుకున్నారో  ఆలోచించుకోవాలి.