కరోనాకు శాస్త్రవేత్తలు 2-DG.. అనే మందును కనుగొన్నారని ఆ మందు చక్కగా పనిచేస్తోందని వార్తలు వస్తున్నాయి. ఇంత త్వరగా టీకాలను, మందులను కనుగొనటం ఎంతో గొప్ప విషయం.చాలా సంతోషకరమైన విషయం.ఈ మందు త్వరగా అందరికీ అందుబాటులోకి వస్తే బాగుండు.
అయితే, కోవిడ్ కు టీకాలు అందరికీ ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో తెలియటం లేదు.
.......................
హోమియో, ఆయుర్వేదం లో కరోనా కట్టడికి, రోగనిరోధక శక్తి పెరగటానికి మందులు ఉన్నాయని అంటున్నారు. ఆయుర్వేదం, అల్లోపతి, హోమియోపతి..అన్నీ వైద్యాలు పరిస్థితిని బట్టి వాడుకోవచ్చు.
ఆయుర్వేదంలో అద్భుతమైన మందులు ఉన్నాయి. ప్రాచీనగ్రంధాలను శోధించి ఆ మందుల గురించి మరిన్ని విషయాలను తెలుసుకుని సమాజానికి అందించాలి.
కొన్ని సంవత్సరాల క్రితం మెదడు వాపు వ్యాధి ప్రమాదం వచ్చినప్పుడు హోమియో మందులు చాలామందికి అందజేసారు. హోమియో మందులు వాడటం వల్ల అప్పుడు మెదడువాపు వ్యాధి ఎక్కువగా వ్యాప్తి చెందలేదని తెలిసింది.
ఇప్పుడు కరోనాకు కూడా హోమియో మందులు, ఆయుర్వేద మందులను చిన్న పొట్లాలుగా అందరికీ అందజేస్తే మంచిది.
అయితే, మందులను ఎవరు పడితే వారు ఇవ్వటం కాకుండా ...వైద్యసంస్థలు ఇచ్చే ధ్రువీకరణ అనుమతి పత్రం చూపించిన వారి వద్ద నుండే మందులను తీసుకోవటం మంచిది.
ఇంటింటికీ వెళ్లి మందులు అందజేస్తే మంచిది. మందులు అందజేసే కార్యకర్తలు కూడా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి, ఇళ్ళలోపలకు వెళ్ళకుండా ఇంట్లో కుటుంబసభ్యుల సంఖ్యను తెలుసుకుని, సరిపడినన్ని మందులను ఇంటి గేటు వద్ద పెట్టి కుటుంబసభ్యులకు తెలిపితే మంచిది.లేకపోతే వీలైన జాగ్రత్తలు తీసుకుని ఇళ్ళలోకి వెళ్ళాలి.
ఈ మందులను ఎలా వాడాలో ఒక పేపర్ పైన ప్రింట్ చేసి మందులతో పాటు పెడితే మందులను ఎలా వాడాలో తెలుస్తుంది.
ఈవిధంగా చేస్తే కేసులు చాలావరకూ తగ్గే అవకాశం ఉంది. ఇప్పుడు కూడా కొందరు ఆయుర్వేదం, హోమియో వాడుతున్నారు కానీ , ఎక్కువమందికి ఇవన్నీ తెలియదు.
......................
నాకు తెలిసినంతలో..హోమియోలో వ్యాధి వచ్చిన వారందరికీ ఒకే మందు అని కాకుండా, రోగి యొక్క శారీరిక , మానసిక లక్షణాలను బట్టి ఎవరికి వారికి ప్రత్యేకంగా ఇచ్చే పద్ధతి కూడా ఉంటుంది.
హోమియో మందులను వైద్యుల సలహా ప్రకారం వాడుకోవటం మంచిది.
............................
దేశంలో కొందరు అధికారులు ముందుచూపుతో వ్యవహరించి తమ ప్రాంతాలలో కేసులు పెరగకుండా జాగ్రత్తపడిన వార్తలూ వస్తున్నాయి. తల్లితండ్రులు దూరమయిన పిల్లలను ప్రభుత్వాలు ఆదుకోవటం కూడా మంచి విషయం.
సోనూసూద్ గారు గత కోవిడ్ సమయంలో ఎందరికో సహాయం చేసారు. ఇప్పుడయితే ఏకంగా ఆక్సిజన్ ప్లాంట్లనే తెప్పించే ప్రయత్నంలో ఉన్నారంటున్నారు.
కొందరు స్వచ్చంద సంస్థల వారు కోవిడ్ బాధితులకు ఇంటికే ఆహారం అందజేస్తున్నారు.ఇలా ఎందరో ఎన్నో విధాలుగా బాధితులకు సహాయం చేస్తున్నారు.
..........................
భారతదేశంలో ఎప్పటినుంచో వైద్య సిబ్బంది కొరత ఎక్కువగా ఉంది. సిబ్బంది పని వత్తిడితో సతమతమవుతున్నారు. ఇప్పుడు కొవిడ్ వల్ల వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది..మరింత పని వత్తిడి, మానసిక వత్తిడితో నలిగిపోతున్నారు.
కోవిడ్ వల్ల అన్ని రంగాల వాళ్ళు కష్టాలు పడుతున్నారు. అన్ని రంగాలలోను మంచివారు ఉంటారు. చెడ్డవారు ఉంటారు. మంచి, చెడు గుణాలు కలిసిన వారు ఉంటారు. కొందరు చెడ్డవాళ్ళు ఉన్నారని.. అందరినీ తప్పుపట్టటం సరైనది కాదు.
.................
కొందరిలో కోవిద్ వచ్చి తగ్గిన తర్వాత ..కొంతకాలం తరువాత కూడా శ్వాసకోశసమస్యలు, నరాల సమస్యలు, తల తిరగటం..(పోస్ట్ కోవిడ్ లక్షణాలు )వంటివి ఉంటున్నాయంటున్నారు.
అల్లోపతిలో అయితే కొన్నిసార్లు ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క వైద్యుని వద్దకు వెళ్ళవలసి వస్తుంది.
అలా కష్టం అనుకుంటే హోమియోపతి, ఆయుర్వేదం వైద్యుల వద్ద మందులు వాడుకోవచ్చు.
********
ధర్మబద్ధమైన జీవనం, పర్యావరణ హితంగా జీవించటం..వంటివి పాటిస్తే అందరికీ మంచిది.
ధ్యానం చేయటం మంచిది.
బాధాకరమైన పరిస్థితులు త్వరగా చక్కబడాలని దైవాన్ని ప్రార్ధించాలి.