koodali

Wednesday, November 4, 2020

కొన్ని విషయములు.. కలశజలాన్ని నేలపై ..ఆహారంలో వెండ్రుకలు కనిపిస్తే..

 

దేవాలయాలలో పూజలు, హోమాలు జరిగినప్పుడు పూజ తరువాత కలశంలోజలాన్ని  భక్తుల శిరస్సులపై చల్లుతారు. 

అలాంటప్పుడు ఆ మంత్రజలం నేలపై పడి  ప్రజలు ఆ నీటిని త్రొక్కడం కూడా జరుగుతుంది. 

పవిత్రంగా భావించే కలశజలాన్ని అలా నేలపై విచ్చలవిడిగా పడేటట్లు చల్లటం మంచిది కాదు.

 పూజ తరువాత అందరూ తీర్ధ ప్రసాదాలు తీసుకుంటారు. తీర్ధం ఇచ్చే దగ్గర  నేలపై చిన్న పట్టా వేసి, పైన స్టూల్ వేసి, దానిపైన కలశం పెట్టి.. తీర్ధం తీసుకోవడానికి వచ్చే భక్తుల శిరస్సులపై  కలశ జలాన్ని ఆకుతో కొద్దిగా చిలకరిస్తే సరిపోతుంది.

ఒక పంతులు గారు  కలశం వద్ద ఉండి,  ఒకటి లేక రెండు మామిడాకులతో ఒక్కొక్క భక్తునిపై  కలశజలాన్ని చిలకరించవచ్చు.  ఇంకొక పంతులుగారు తీర్ధాన్ని ఇవ్వవచ్చు.

 అప్పుడు నేలపై కలశజలం పడటం.. భక్తులు త్రొక్కటం.. అంతగా జరగదు. కొద్దిపాటి జలం పడినా అంతవరకూ తుడిచేస్తే సరిపోతుంది.

*********

వంట చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.  ఆహారంలో వెంట్రుకలు కనిపిస్తే మంచిది కాదు. 

దైవానికి నివేదించే పదార్ధాలలో వెంట్రుకలు  కనిపిస్తే ఆ పదార్ధాన్ని దైవానికి నివేదించకూడదు. 

కష్టపడి వంట చేసిన తరువాత వెంట్రుకలు కనిపిస్తే ఎంతో బాధగా ఉంటుంది. 

బంధువులెవరైనా ఇంటికి వచ్చినప్పుడు వారికి వడ్డించిన భోజనంలో వెంట్రుకలు  కనిపిస్తే బాగోదు కదా..

వంట చేసేటప్పుడు   తలకు కాప్ ధరిస్తే మంచిది.  

ఇంట్లో వంట చేసేటప్పుడు స్త్రీలు జుట్టును పైకి మడిచి కట్టుకుని కాప్  పెట్టుకుంటే సులభంగా ఉంటుంది.

 పెద్ద పెద్ద హోటల్స్ లో వంటచేసే వాళ్ళు(చెఫ్ లు)ధరించే పెద్ద కాప్  ధరించాలంటే అందరికీ కుదరకపోవచ్చు. 

చిన్నగా ఉండే షవర్ కాప్  బాగుంటుంది. ఇది 100 రూపాయలకే లభిస్తుంది. చెవులు కూడా కవర్ చేస్తుంది. ఈ ప్లాస్టిక్ కాప్ ను శుభ్రం చేయటం తేలిక.

వెంట్రుకలు, గోళ్ళు .. ఆహారం ద్వారా కడుపులోకి వెళ్తే అనారోగ్యం వచ్చే అవకాశాలు  ఎక్కువగా ఉన్నాయట.

 జుట్టుకు నూనె రాసి జడ వేసుకుంటే వెండ్రుకలు ఎగిరిపడే అవకాశం తక్కువ. జుత్తు విరబోసుకున్నప్పుడు లేక తలస్నానం చేసి, జుట్టు ఆరటానికి వదిలేసినప్పుడు వెంట్రుకలు రాలిపడే అవకాశాలు ఎక్కువ.

ఇంట్లో వంట చేసేటప్పుడు స్త్రీలు రోజూ కాప్ పెట్టుకోవటం కష్టం అనుకుంటే .. తలస్నానం చేసినప్పుడు జుట్టు వదులుగా ఉండేలా రబ్బర్ బ్యాండ్ పెట్టుకుని  కాప్ ధరించవచ్చు. కాప్ ధరించనప్పుడు జాగ్రత్తగా ఉంటే మంచిది.

 వండిన గిన్నెలపై మూతలు పెట్టకుండా నేలపై ఉంచితే.. నేలపై ఉన్న వెండ్రుకలు వచ్చి ఆహారపదార్ధంపై పడే అవకాశం ఉంది. అలా కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

 తలపైనుంచి రాలిపడే వెండ్రుకలు దుస్తులపై ఉండి, వంట చేసేటప్పుడు ఆ  వెంట్రుకలు  ఆహారంలో పడే అవకాశాలు కూడా ఉన్నాయి. అలా కాకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. 

నోటి నుండి తుంపరలు పడకుండా నోటికి మాస్క్ కూడా ధరించవచ్చు.

************

పెద్దవయస్సు వారికి చాలామందికి నిద్ర సరిగ్గా  రాదు.రాత్రి అందరూ నిద్ర పోతుంటే తమకు నిద్ర రావటం లేదని బాధపడుతూ కూర్చుంటారు. నిద్ర బిళ్ళలు వేసుకుంటారు కొందరు. 

నిద్ర త్వరగా రావటానికి ఆయుర్వేద చిట్కాలు చెబుతున్నారు కొందరు.ఇంటర్నెట్ ద్వారా కూడా ఈ చిట్కాలను తెలుసుకోవచ్చు.

నిద్ర పట్టనప్పుడు.. కూర్చుని కాని, పడుకుని కానీ కన్నులు  మూసుకొని  దైవస్మరణ.. ధ్యానం చేస్తే పుణ్యం వస్తుంది. నిద్రకూడా వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ నిద్ర రాకపోయినా ..ధ్యానం వల్ల శరీరానికి, మనస్సుకు చాలా విశ్రాంతి లభిస్తుంది.

అయితే, డీప్ మెడిటేషన్ , ప్రాణాయామం వంటివి   తెలిసిన వారి వద్ద నేర్చుకుని ఆచరించటం మంచిది. 

 దైవస్మరణ, దైవస్తోత్రాలు, భక్తిపాటలు మొదలైనవి మెల్లగా  ఎంతసేపైనా చక్కగా అనుకోవచ్చు. 

************
  ఇక, దైవం యొక్క చిత్రాలను ఎక్కడపడితే అక్కడ ప్రింట్ వేసి, తరువాత చెత్త కుప్పలలో పడవేస్తున్నారు. ఇలా చేయటం సరైనది కాదు.

న్యూస్ పేపర్లలోనూ, హారతి కర్పూరం పాకెట్ పైనా, ఇంకా అనేక చోట్ల దైవ చిత్రాలను ముద్రించటం.. తరువాత ఆ పేపర్లను, ప్లాస్టిక్ కవర్లను చెత్తలో వేయటం జరుగుతోంది. 
 ఈ విషయాన్ని ఈ బ్లాగ్ మొదలుపెట్టిన కొత్తలోనే వ్రాయటం జరిగింది. 



   విషయాలను ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా .. ఆచరణ సరిగ్గా ఉంటేనే ప్రయోజనం కలుగుతుంది.


Sunday, November 1, 2020

జాతకంలో రాసిపెట్టి ఉన్నది అనుభవించక తప్పదా ?

 Friday, April 21, 2017


 చాలామంది జీవితంలో ముందు ఏం జరుగుతుందోనని ఉత్సుకతతో జాతకాలను చూపించుకుంటారు. జాతకం మంచిగా ఉంటే సంతోషాన్ని , ఏమైనా తేడాగా ఉంటే బాధను పొందుతారు.

( ఈ రోజుల్లో జాతకాలు చెప్పటం సరిగ్గా తెలిసిన వారు అరుదుగా ఉన్నారు .)

ఆ జాతకమంతా పూర్వం తాను చేసిన మంచిచెడు కర్మల ఫలితమేనని తెలిసినా జీవితంలో చెడు జరగకూడదనే ప్రతివ్యక్తి కోరుకోవటం జరుగుతుంది.
*******************

రాసిపెట్టిఉన్నది ఎలాగూ తప్పనప్పుడు మనం ఏం చేయగలం? అని చాలామంది నిరాశగా అనుకుంటారు. అలా భావించటం పొరపాటు.


 దైవానుగ్రహాన్ని పొందగలిగితే భవిష్యత్తును మార్చుకునే అవకాశం ఉందని కొందరి చరిత్రల ద్వారా పెద్దలు తెలియజేసారు..

ఉదా..సతీ సావిత్రి చరిత్రలో సావిత్రి యమధర్మరాజును  మెప్పించి , సత్యవంతుని ఆయుర్దాయాన్ని పెంచుకోవటమే కాకుండా ఎన్నో వరాలనూ పొందటం జరిగింది.

 భక్త మార్కండేయుని చరిత్రను గమనించినా ..దైవానుగ్రహాన్ని  పొందగలిగితే  మంచి జరుగుతుందని తెలుస్తుంది.

*********

జాతకంలో చెడు సూచనలు కనిపించినప్పుడు బాధపడుతూ కూర్చోకుండా .. తమ చెడు ప్రవర్తనను మార్చుకుని,  దైవప్రార్ధన, పుణ్యకార్యాలు చేయటం, సత్ప్రవర్తనతో మెలగటం, ఇలాంటివి చేయటం ద్వారా రాబోయే కష్టం చాలావరకూ తగ్గే అవకాశం ఉందని పెద్దలు చెబుతున్నారు.

పూర్వం ఎందరో ఇలా చేసి తమ జీవితాలను సరిదిద్దుకున్న సంఘటనలు గ్రంధాలలో కనిపిస్తాయి.

*************

ఈ రోజుల్లో కూడా ..జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు సత్ప్రవర్తనను కలిగిఉన్నప్పుడు , ప్రభుత్వం వారు , వారి శిక్షా కాలాన్ని తగ్గించి ముందే వదిలిపెట్టడం, ఒకోసారి శిక్షను రద్దు చేయటం జరుగుతోంది కదా!

************
భగవంతుడు ఎంతో దయామయుడు. చేసిన తప్పులు తెలుసుకుని పశ్చాత్తాపపడిన వారిని వారు తప్పక క్షమిస్తారు.
....................

షిరిడి సాయిబాబా .. భక్తులు తమ జాతకాలలోని దోషాల గురించి భయపడినప్పుడు, వారిని భయపడవద్దనీ, ఆ జాతకాలను ప్రక్కన పెట్టి, తనపైన భారం వేయమని చెప్పిన సంఘటనలు జరిగాయి.

 ఇంకా, శ్రీ సాయి బాబా జీవిత చరిత్రము గ్రంధములో భీమాజీపాటీలు కధ వద్ద , షిరిడి సాయి భక్తుడు తన  స్వప్నములో బాధలుపడటం ద్వారా...  సాయి అతని జబ్బును పోగొట్టడం గురించి తెలుసుకోవచ్చు.

 (.గతజన్మలోని పాపకర్మల ఫలితముగా జబ్బు రాగా దానిలో జోక్యము కలుగజేసికొనుటకు బాబా యిష్టపడకుండెను.కాని రోగి తనకు వేరే దిక్కులేదనియు, నందుచే చివరకు వారి పాదముల నాశ్రయించితిననియు మొరపెట్టుకొని వారి కటాక్షమునకై వేడుకొనెను. వెంటనే బాబా హృదయము కరిగెను. భక్తుడు స్వప్నములో బాధలుపడటం .. సాయి అతని జబ్బును పోగొట్టడం జరుగుతుంది.)

ఎందరో పూజ్యులు.. తమను ఆశ్రయించిన భక్తులను వారి పూర్వకర్మ ఫలితాలనుండి రక్షించిన సంఘటనలు గ్రంధాలలో చెప్పబడ్డాయి.

**************

కొందరు ఎంత మంచిగా జీవిస్తున్నా వారి జీవితం కష్టాలమయంగానే ఉంటుంది. అంటే.. వారు క్రితం జన్మలో అంత ఎక్కువ తప్పులు చేసారని అర్ధం చేసుకోవాలి.( ఇలా కాకుండా మనకు తెలియని ఇతర కారణాలు కూడా ఉండొచ్చు.)

అలాంటివారు ఈ జన్మలో ఎంతో శ్రమకు ఓర్చి  నియమనిష్టలు కలిగిఉండటం, దానధర్మాలు చేయటం ద్వారా ఆ కష్టాలనుంచీ బైట పడగలరు.

****************
 దైవం ఎన్నో జీవులకు ఇవ్వని తెలివితేటలను మానవులకు ఇచ్చారు. అయితే, ఎన్నో జీవులు లోకానికి ఉపయోగపడుతుండగా , మనుషులు మాత్రం  దైవానికి ఇష్టం లేని అధర్మమైన పనులు చేస్తూ.. సమాజానికి సమస్యగా తయారవుతున్నారు.  ఇలా ప్రవర్తించటం సరైనది కాదు.

**********

* ఏ జాతకాలూ తెలుసుకోకపోయినా చెడుపనులకు దూరంగా ఉంటూ, సత్ప్రవర్తనను కలిగిఉండి, దైవభక్తి కలిగి జీవించే వ్యక్తికి దైవమే సరియైన దారిని చూపిస్తారు.

***********

జాతకాలు విషయంలో నాకు కలిగిన కొన్ని సందేహాలు....

 

రెండు పంచాంగాలలో ..ఒకే నక్షత్రం విషయంలో గంటల సమయం తేడా చూసి ఈ విషయం గురించి వ్రాయాలనిపించింది.

 సమయం విషయంలో ఇంత తేడా ఉంటే ..ఈ  మధ్యలో జన్మించిన పిల్లలు  ఏ నక్షత్రంలో జన్మించినట్లు? అనేది సందేహం కలుగుతుంది.

 

 ఉదాహరణ .. ఒక కాలెండర్లో  ఆశ్లేష నక్షత్రం రాత్రి 8 గంటల 38 నిమిషాల వరకూ అని ఉంటే, అంతర్జాలంలో కొన్ని పంచాంగాలలో అర్ధరాత్రి 12 గంటల 30 నిమిషాల వరకూ ఆశ్లేష నక్షత్రం ఉన్నది..అని ఉంటే ఏ సమయాన్ని తీసుకోవాలో అర్ధం కాదు.

 

  సుమారు నాలుగు గంటల సమయం తేడా ఉంటే.. ఈ నాలుగుగంటల మధ్య జన్మించిన పిల్లలు ఆశ్లేష నక్షత్రంలో జన్మించినట్లా ? లేక  మఘ నక్షత్రంలో జన్మించినట్లా ? అనేది సందేహం.

 

  చాలామంది వివాహసంబంధాల విషయంలో నక్షత్రపొంతన వంటివి చూస్తారు. సంబంధాల విషయంలో చాలా విషయాలు నచ్చినా.. వివాహపొంతన కుదరలేదని సంబంధాలు వదులుకునే వారూ ఉంటారు.

  ఇలాంటప్పుడు జాతకాలు మొదలైన వాటి విషయంలో ఎన్నో సందేహాలు వస్తాయి.

 

 పంచాంగం రాష్ట్రంలోని వేరువేరు ప్రదేశాలలో ప్రింట్ వేసినా కూడా ఒకే రాష్ట్రంలో గంటల సమయం తేడా ఉండదు కదా? మరి ఎందుకు ఇలా జరిగిందో అర్ధం కాదు.

 మేము ఒక ముహూర్తం కొరకు సాధనతార, నైధనతార ..చూద్దామని వెతుకుతుంటే నక్షత్రం సమయంలో తేడా కనిపించింది.

 

 వివాహం విషయం మాత్రమే కాకుండా, ముహూర్తాల కొరకు సాధనతార, విపత్తార .. వంటివి పరిశీలించడానికి కూడా నక్షత్రం యొక్క సమయం అవసరం ఉంటుంది.

 

   ఇవన్నీ గమనిస్తుంటే ఏమనిపిస్తుందంటే.. కాలెండర్లను, కంప్యూటర్లో విషయములను చూడవచ్చు కానీ, తరువాత ముఖ్యమైన విషయముల కొరకు ..తెలిసిన పండితులను సంప్రదించటం మంచిది.

 

 సాయనవిధానము, నిరయన విధానము ..అయనాంశ..ఈ విధానాల గురించి  అభిప్రాయ భేదాలు ఉన్నాయట. అందువల్ల కొన్నిసార్లు .. సమయంలో  తేడా వచ్చే అవకాశముందని పండితుల ద్వారా తెలుస్తోంది. 

ఏ విధానాన్ని అనుసరించేవారు ఆ విధానాన్ని అనుసరించి చెబుతారు. 

***********

పై విషయములలో కొన్నింటిని క్రింద పోస్ట్ యొక్క  కామెంట్ వద్ద గమనించగలరు.

******************

Sunday, September 13, 2020

మహిళలు వాడే శానిటరీ నాప్కిన్స్ ...


 మహిళలు నెలసరి రోజులలో వాడే శానిటరీ నాప్కిన్స్ విషయంలో చాలా సమస్యలు ఉన్నాయి. పాతకాలంలో కాటన్ క్లాత్ వాడి ఉతకటం చేసేవారు.

కొన్నినెలల తరువాత వాటిని  బకెట్లో వేసి కాల్చివేసి, కొత్త క్లాత్ వాడే పద్ధతి కూడా కొందరు అనుసరించేవారు.

********

ఇప్పుడు కొత్తవి రకరకాలు అందుబాటులోకి వచ్చాయి.

ఎప్పటికప్పుడు వాడి పడేసే శానిటరీ నాప్కిన్స్ లో కొంత ప్లాస్టిక్ కూడా కలుస్తుందట.

 చాలామంది మహిళలు వీటిని శుభ్రం చేయకుండానే ఎక్కడపడితే అక్కడ పారవేయటం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి.

***********

 ఈ మధ్య కొత్త శానిటరీ నాప్కిన్స్ కొన్ని రకాలు మార్కెట్లోకి వచ్చాయి.

 ఇవి ఒకసారి కొంటే, ప్రతినెలా వాడి పడేయకుండా ... ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుని సుమారు ఒక సంవత్సరం వరకూ వాడుకోవచ్చట.

అలాగని పాతకాలంలోలా పెద్ద వస్త్రం ఉండదు. చిన్న సైజు నాప్కిన్ ఉంటుంది. వీటివల్ల పర్యావరణం సమస్యలు ఉండవట.


ఖరీదుకూడా ఎక్కువేమీ కాదు. నెలనెలా వాడిపడేసేవి నెలకు సుమారు 60 నుంచి 150 వరకు ఖరీదు అవ్వచ్చు.

కొత్తరకం నాప్కిన్లు  సంవత్సరానికి ఒక్కసారి 499 రూపాయలు ధరకు కొంటే సుమారు ఒక సంవత్సరం వరకూ వాడుకోచ్చంటున్నారు.

వీటిని గదిలో ఫాన్ క్రింద వేసినా ఆరిపోతాయి.

ఎప్పుడయినా బయట ఎండలో కుర్చీ పైన వేసి.. కొంతసేపు ఎండిన తరువాత తీసుకోవచ్చు.

******

  వివరాలను క్రింద లింక్ వద్ద చూడగలరు..

PEESAFE Brand.. Reusable Sanitary Pads ..12 + Months ..ZeroWaste.. Cost..499 Rupees .

100% Organic Cotton | Pee Safe Biodegradable Sanitary Pads

*********

అరటినార వంటి వాటితో కూడా శానిటరీ నాప్కిన్స్ తయారుచేస్తున్నారు, వీటిని వాడి ఎప్పటికప్పుడు బయటపడేయవచ్చు. ఇవి త్వరగా మట్టిలో కలిసిపోతాయట. 

మెన్స్ట్రువల్ కప్స్ కూడా వచ్చాయట.


Thursday, May 21, 2020

దైవభక్తి...


దేవాలయాలు త్వరలో  ప్రజలందరి  కొరకు తెరుచుకోనున్నాయి..

ఇంతకాలం  అందరు  ప్రజలకు దేవాలయాలలో దైవదర్శనం లేని పరిస్థితి ఏర్పడటం ఆశ్చర్యం మరియు బాధ కలిగించే విషయం.

***********
కోరోనా వల్ల ప్రపంచంలో జనజీవనం చాలావరకు   స్థంభించిపోయే పరిస్థితి ఏర్పడింది. లాక్డౌన్ సమయంలో దేవాలయాలకు కూడా వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది.

దైవానికి ఆగ్రహం కలిగిందేమో..  అని  చెప్పాలని కాదు.. కానీ, ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయో ఇప్పటికైనా ఆలోచించుకోవాలి.

చాలామంది మనుషుల అత్యాశ, అంతులేని కోరికలు,  అవినీతి,   అనేకవిషయాలలో తమకు తోచినదే సరైనదని మొండిగా ముందుకు వెళ్ళటం, పర్యావరణానికి హాని కలిగించటం..ఇలాంటివాటి  గురించి మనుషులకు కనువిప్పు కలగటం కొరకు దైవం ఒక హెచ్చరిక  చేసి  ఉండవచ్చు కదా.. అని నాకు అనిపించింది.

ఇక నుంచి అయినా సమాజంలో మంచిమార్పులు రావాలని కోరుకుందాము.

**********************
లాక్ డౌన్ సమయంలో  అనువుగాని పరిస్థితి వల్ల  దేవాలయాలకు  వెళ్లలేకపోయారు.

  దేవాలయాలకు వెళ్ళి దైవాన్ని దర్శించుకోవటం విషయంలో ....  పరిస్థితి అనుకూలించనప్పుడు మనస్సులో దైవాన్ని దర్శించుకుని, పరిస్థితి అనుకూలించిన తరువాత దేవాలయాలకు వెళ్ళవచ్చు.

************
ఇంతకాలం ప్రజలు దేవాలయ దర్శనాలకు ఎందుకు దూరమయ్యారో ? తెలియదు కానీ, కొన్ని విషయాల గురించి  ఆలోచించుకోవాలి.

వేలమంది ప్రజలు దేవాలయాలకు వెళ్తుంటారు. వీళ్ళందరూ నిజజీవితంలో ధర్మాన్ని పాటిస్తూ.. అవినీతి వంటి పనులకు దూరంగా జీవిస్తే దైవానికి ఎంతో ఇష్టులవుతారు.


 దైవపూజ దైవ ప్రీతి కొరకు చేయటం మంచిది.

మనం జీవించడానికి అవసరమైన గాలి, నీరు, ఆహారం, వాతావరణం..వంటివెన్నో ప్రసాదించిన దైవానికి కృతజ్ఞతలు తెలుపుకోవటం కూడా పూజయే.

కోరికలు తీరటం కోసం, బాధలు తీరటం కోసం కూడా దేవాలయాలకు 
వెళ్ళటం తప్పు కాదు కానీ , జీవితంలో మన నడవడికలో తప్పులుండకూడదు. 

దైవకృపను పొందాలంటే ధర్మబద్ధంగా జీవించటానికి ప్రయత్నించాలి.


****************************
దేవాలయాలలో రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రజలు   కొన్నిసార్లు ఒకరినొకరు నెట్టుకుంటూ ఉండేవారు.

అలా కాకుండా ఒక పద్ధతిలో వెళ్తే ప్రశాంతంగా దైవదర్శనం చేసుకోవచ్చు.

ఇప్పుడు కొరోనా భయంతో కొన్నాళ్ళైనా ఒకరినొకరు నెట్టుకోకుండా దైవదర్శనం చేసుకుంటారేమో?

రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు అలాగే దైవం ముందు నిలబడి దర్శించుకోవటానికి కుదరదు. వెనుక చాలామంది ఉంటారని గుర్తుంచుకోవాలి.
****************
హిందువులకు ఎన్నో ఆచారాలు ఉన్నాయి. ఈ ఆచారాలలో సనాతనకాలం నుండి వచ్చినవీ ఉంటాయి. మధ్యలో  కొందరి  చేత చేర్చబడ్డవీ కూడా ఉంటాయి. వాటిని గమనించుకోవాలి.

 మూఢాచారాలను వదిలేయాలి. సమాజానికి ఉపయోగపడే ఆచారాలను పాటించాలి.సమాజానికి  నష్టం కలిగించేవాటిని వదిలేయాలి.


***************
దయచేసి ఈ లింక్ ల వద్ద కూడా క్లిక్ చేసి చదవగలరు.

 దైవం యొక్క చాకచక్యం ఎవరి అంచనాలకూ అందనిది.

కొన్ని ఆచార వ్యవహారాలు.. కొన్ని మార్పులుచేర్పులు.....

మాకు తెలిసిన ఒక కుటుంబం ఇంకో మతం ..

ఆచారవ్యవహారాలు ...మరి కొన్ని విషయములు...

భక్తి ముఖ్యం.

మూఢనమ్మకాలను , మూఢత్వాన్ని వదిలి......

**************

దైవభక్తి కలిగి, జీవితంలో నైతికవిలువలను పాటిస్తూ జీవించటానికి ప్రయత్నిస్తే   దైవానికి ఇష్టులవుతారు.  దైవకృప కలుగుతుంది. 

*******
జీవితంలో సరైన విధంగా ప్రవర్తించటానికి ప్రయత్నించాలి. 

సరైన విధంగా ప్రవర్తించే శక్తిని అనుగ్రహించమని దైవాన్ని ప్రార్ధించుకోవాలి.

మంచిగా అందరూ దైవకృపను పొందాలి.



దైవమే దిక్కు....



ఏదైనా పుణ్యక్షేత్రం వద్ద 10 కిలోమీటర్లు నడవాలంటేనే పెద్దవాళ్ళకు కూడా కాళ్లు లాగేస్తాయి..

అలాంటిది కొందరు వలస కార్మికులు  ఎండలలో వందల కిలోమీటర్లు నడవటం ఏమిటో.... పిల్లలు మేము నడవలేమంటూ ఏడుస్తున్నా కూడా పెద్దవాళ్లు నడిపించటం ఏమిటో.

దేశంలోని  ప్రభుత్వాలు కూలీల కోసం తాము రైళ్ళను ఎక్కువగానే వేశామంటారు.కొందరు కూలీలను రైళ్ళలో వారి స్వస్థలాలకు పంపారు.

మరి, రైళ్ళలో ప్రయాణం కొరకు ఆన్ లైన్  బుకింగ్ తెలియకపోవటం వల్లనో? లేక ట్రైన్ దిగిన తరువాత క్వారైటైన్లో ఉండాలని భయం వల్లనో ? లేక మరేదైనా కారణాలో తెలియటం లేదు..  నడిచే వాళ్లు కొందరు నడుస్తూనే ఉన్నారు.

*************
ఏం చేయాలో తెలియని నిస్సహాయతతో కుటుంబసభ్యులు అందరూ అలా నడుస్తూ ఉండవచ్చు. నిస్సహాయత ఉన్నాకూడా అంతదూరాలు  అలా నడవటం  సరైనపనికాదు.

 పరాయి చోట ఉపాధి లేక చనిపోతామేమోనని భయం వల్ల  నడిస్తే.. నడవలేక కూడా చనిపోవచ్చు .. చనిపోకపోయినా .. తరువాత జబ్బు పడొచ్చు.

**************
లాక్డౌన్ సమయంలో ప్రజల కష్టాలు తీరటానికి ప్రభుత్వాలు, స్వచ్చంద సంస్థలు సహాయక చర్యలు చేసారు.

దేశంలోని ప్రభుత్వాలు పేదలకు కొంత ఆహారాన్ని అందించారు, కొన్ని రైళ్ళను వేసారు. కొందరిని స్వస్థలాలకు పంపించారు.

అయితే, ఆహారధాన్యాలు దండిగా ఉన్నాయంటున్నారు కాబట్టి, మొదటిసారి లాక్ డౌన్ నుండి ఉపాధి లేక ఆహారానికి ఇబ్బందులు పడుతున్న వారికి సరిపడా ఆహారధాన్యాలను ఇవ్వటం.... 


రెండవ లాక్ డౌన్ కు ముందు రెండు రోజులు గాప్ ఇచ్చి  స్వస్థలాలకు వెళ్తామనేవారిని సరైన వాహన ఏర్పాట్లు చేసి పంపించటం వంటివి మరింత సమర్ధవంతంగా చేస్తే ,
 వలసకూలీలు రోడ్లపై నడవటం ఉండేది కాదు.

 ఇళ్ళలో ఉన్న కొందరు పేద కుటుంబాల వాళ్లు ఆకలితో బాధలు పడేవారు కాదు. కరోనా లాక్డౌన్ సమయం లో వలసకూలీల  విషాదగాధల జ్ఞాపకాలు ఉండేవి కావు.

అయితే, సమాజం బాగుండాలంటే .. ప్రభుత్వాలు, అధికారులు, ప్రజలు ఎవరి పని వారు సక్రమంగా చేయాలి.


*********************
ఈ మధ్య ఒక చిన్న పిల్లతో కొందరు పోలీసులు ఒక గది తుడిపించటం చూసి  అందరూ అన్యాయం అన్నారు. చిన్న పిల్లతో పనిచేయించటం అన్యాయమే.

మరి వలసకూలీలు తమ చిన్నపిల్లలను  అలా నడిపించటం కూడా అన్యాయమే. తల్లితండ్రి ..పిల్లలను కని, పెంచుతున్నారు కాబట్టి వాళ్లు వాళ్ల పిల్లల్ని కష్టపెడితే అన్యాయం అనకూడదా ?

తల్లితండ్రి తమ పిల్లలను కష్ట పెట్టకూడదు. అలాగని పిల్లలను అతి గారాబం చేసి పెంచకూడదు.

******
మరికొంత మంది తల్లితండ్రి చదువుల్లో ర్యాంకుల కోసం పిల్లల్ని దండిస్తారు. పిల్లల మంచికోసమే అలా చేస్తున్నామంటారు.

కొన్నిసార్లు పిల్లలు వాళ్ల శక్తికి మించిన చదువులు చదవలేక, తమ బాధలు ఎవరూ పట్టించుకోవటంలేదనే అభిప్రాయంతో ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు.

ఈ రోజుల్లో  చదువు, ఉద్యోగాలకు విపరీతమైన పోటీ ఉంది. ఇష్టమైన చదువులో సీటు లభించాలన్నా విపరీతమైన పోటీ ఉంది.
 పిల్లల శక్తిని, ఇష్టాఇష్టాలను కూడా పెద్దవాళ్లు కొంత పట్టించుకోవాలి.

****************
 ఇక కొందరు పెద్దవాళ్ల విషయాలను గమనించితే,  సమాజానికి మంచి చెప్పవలసిన కొందరు పెద్దవాళ్లే... మద్యపానం  చేయటం , స్త్రీ పురుషులు తమ ఇష్టానికి తిరగటం .. వంటివి తప్పులేదంటున్నారు.

***********
ప్రభుత్వాలు ..ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసుకుంటారు. తల్లితండ్రి..తమ పిల్లలు ఇబ్బందులు పడకుండా చూసుకుంటారు.

అయితే, కారణాలు ఏమైనా..సమాజంలో బలహీనులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు.

 సమాజంలో ...పేదవారు బలహీనులు. కుటుంబంలో...పిల్లలు బలహీనులు.

 సమాజంలో ఏదైనా సమస్య వస్తే,  పేదవారు ఎక్కువ ఇబ్బందులు పడతారు.

 కుటుంబంలో ఏదైనా సమస్య వస్తే,  పిల్లలు ఎక్కువ ఇబ్బందులు పడతారు.

****************
 పిల్లలు తప్పులు చేస్తే పెద్దవాళ్ళు దండిస్తారు. ప్రజలు తప్పులు చేస్తే ప్రభుత్వాలు, చట్టం ద్వారా దండన ఉంటుంది. 

మరి, ఎప్పుడైనా  సమాజంలో పెద్దవాళ్ళు, ప్రభుత్వాలు..ఏమైనా తప్పులు చేస్తే ఎవరు దండిస్తారు ?

ఇప్పుడు చాలామందికి  నైతికవిలువల సంగతి అలా ఉంచి, డబ్బు సంపాదనా, విలాసంగా జీవించటం వంటివి ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఎవరి ఖర్మ వారిది.  

ఇవన్నీ ఇలా ఎందుకు జరుగుతున్నాయో దైవానికే తెలియాలి.  దైవమే దిక్కు.



Saturday, May 16, 2020

ఎంత కాలమో ?.....


వలస కార్మికుల బాధలు ఎంతో దారుణంగా ఉన్నాయి.

కనీసం రెండో విడత లాక్డౌన్ ముందు అయినా.. కొంత సమయం ఇచ్చి స్వస్థలాలకు వెళ్ళాలని అనుకున్న వారిని పంపించవలసింది.

వాళ్ళు నడిచి వెళ్ళకుండా అవసరమైనన్ని రైళ్ళు వేయాలి.


 రైళ్లలో ప్రయాణించటానికి సవాలక్ష రూల్స్ పెట్టకుండా.. తేలికగా టికెట్ బుక్ చేసుకునే విధానం ఉండాలి.

వాహనాలలో ఊళ్ళకు వెళ్ళాలంటే ఆన్లైన్లో వివరాలు ఇవ్వటం వంటివి వాళ్ళకు చేతనవుతుందా ?

రోజులతరబడి వాళ్ళు అలా బాధలుపడవలసి రావటం దారుణం.


ఊళ్ళకు వెళ్లనీయకుండా బలవంతంగా వారితో పనిచేయించాలనుకుంటే మానవహక్కులను ఉల్లంఘించటమే అవుతుంది.

**************

వలస కార్మికులు రోజుల తరబడి సరైన సౌకర్యాలు లేకుండా గుంపులుగా ఒకే దగ్గర ఉండటం వల్ల కూడా వారికి కోరోనా వచ్చే అవకాశం ఉంది.

కొరోనా వచ్చిన వారిని స్వస్థలాలకు రానివ్వమని అనటం కూడా అన్యాయం.

వ్యాధిలేనివారే.. తమను పరాయి ప్రాంతంలో సరిగ్గా పట్టించుకోవటం లేదని అంటున్నప్పుడు, ఇక వ్యాధి వచ్చిన వారిని పరాయిప్రాంతంలో ఏం పట్టించుకుంటారు? ఇవన్నీ గమనిస్తే పరిస్థితి చాలా దారుణంగా ఉంది.

స్వస్థలాలకు వెల్తామనే వారిని స్వస్థలాలకు పంపించి , వారిని హోం క్వారైటైన్ లో ఉంచవచ్చు. అప్పుడప్పుడు వైద్యులు రోగుల ఇళ్లకు వెళ్లి వారిని పరీక్షించవచ్చు.

వేరే ఊరి నుండి వచ్చే వారివల్లే కోరోనా వస్తుందని అనుకోనక్కర లేదు. ఇప్పటికే కోరోనా దేశంలోకి వచ్చి ఉంది . 

స్వస్థలంలో ఇళ్ళలో ఉన్న వారికి కూడా కోరోనా వస్తోంది కదా!


************
మద్యం షాపులు తెరిచినప్పుడు ఇక లాక్డౌన్ ఎందుకు ?

మద్యం తాగిన వారు ఆ మత్తులో సోషల్ డిస్టెన్స్, 
చేతులు శుభ్రం చేసుకోవటం  వంటివి   పాటిస్తారా ?

మద్యం తాగిన వారి వల్ల ఇంట్లో వారికి, బయట వారికి కూడా కొరోనా సోకే అవకాశం ఉంది.


**********
వలస కార్మికులు మాత్రమే  కాకుండా .. ఎన్నో రంగాల వారు , ఎందరో వ్యక్తులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. వీరి  బాధలు ఎప్పుడు తీరుతాయో?

**********
మద్యం తాగితే కొరోనా తగ్గుతుందని కొందరు అపోహపడుతున్నట్లున్నారు. మరి, అమెరికాలో, ఇంకా కొన్ని దేశాలలో   చాలామంది మద్యం త్రాగుతారు. అక్కడ  కొన్నివేలమంది చనిపోయారు కదా. 

ఇందువల్ల ఏం తెలుస్తుందంటే, మద్యం త్రాగితే కోరోనా తగ్గకపోగా ఇంకా పెరిగే అవకాశముంది అని .

**********

క్రమంగా  లాక్ డౌన్  తీసి డిస్టెన్స్ పాటిస్తూ జాగ్రత్తగా పనులు చేసుకోవచ్చు.

బయటకు వెళ్ళి ఎక్కడైనా కుర్చీలో కూర్చుని లేస్తే... ఇంకొకరు  వెళ్ళి ఆ కుర్చీలో కూర్చుంటే... అప్పటికే కుర్చీకి అంటుకుని ఉన్న కొరోనా వైరస్... కుర్చీలో కొత్తగా వచ్చి కూర్చొన్న వారికి వచ్చే అవకాశం ఉండొచ్చు కదా ? 

ఇకమీదట.. లిఫ్ట్ బటన్లు, బస్సు లో సీట్లు, షాపింగ్ మాల్స్ లో వస్తువులు..ఇవన్నీ ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలేమో ? 

**********
లాక్డౌన్ వల్ల పర్యావరణ కాలుష్యం కొంత తగ్గింది. లాక్డౌన్ తరువాత కూడా పర్యావరణ కలుషితం కాని విధంగా ఉపాధి పెంచుకునే ప్రయత్నాలు చేయాలి. 

పారిశ్రామిక వ్యర్ధాలు విచ్చలవిడిగా గాలిలోనూ,నీటిలోనూ (నదుల్లోను, సముద్రంలోనూ..)  కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. 

పర్యావరణకాలుష్యం వల్ల అనేక జబ్బులు వస్తున్నాయి. జబ్బులు వచ్చి మనుషులు చచ్చిపోయినా ఫరవాలేదు.. ఆర్ధికవృద్ధి రేటు పెరగటమే ముఖ్యం..  అనుకుంటే మాత్రం కష్టం.

అయితే, దైవం చూస్తూ ఊరుకోరు..ఎవరిని ఎలా దారిలోకి తీసుకురావాలో సమయం వచ్చినప్పుడు చూపిస్తారు.

ఇప్పుడు చిన్న కోరోనా వైరస్  వల్ల ప్రపంచమే విలవిలలాడే పరిస్థితి  జరుగుతోంది కదా.

టెక్నాలజీకి మరీ అలవాటుపడకండి. భవిష్యత్తులో సోలార్ తుఫాన్లు వంటివి వచ్చి టెక్నాలజీ కూడా స్థంభించే పరిస్థితి కూడా రావచ్చు? 

అందుకే టెక్నాలజీ లేకుండా కూడా జీవించటం ఎలా? అనేదానికి కూడా మనం  సిద్ధపడి ఉండాలి.

ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి,  పద్ధతిగా జీవించాలి. 

టెక్నాలజీ అవసరమే కానీ, టెక్నాలజీ ఎంతవరకూ అవసరమో అంతవరకే వాడుకోవాలి.

( సోలార్  తుఫాన్  గురించి కొన్ని వివరాలను కామెంట్స్ వద్ద చదవగలరు. )

*************
ఎవరైనా సరే, ఇతరులను బాధపెడితే దానికి తగ్గ ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుంది.

తప్పుచేసిన వారు ఇహలోకంలో  తీర్పు నుండి తప్పించుకున్నా కూడా... దైవం యొక్క తీర్పు నుండి మాత్రం తప్పించుకోలేరు.




Thursday, April 30, 2020

పేదరికం, నిరుద్యోగ సమస్య తగ్గించటం.. కష్టమైన పనేమీ కాదు. .



అందరికీ ఉద్యోగాలు కల్పించటం కష్టమైన పనేమీ కాదు. 


ఇప్పుడు , దేశంలో చాలా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వైద్య శాఖలో ఎందరినో నియమించాలి. ప్రభుత్వ కార్యాలయాలలో ఎన్నో శాఖలలో చాలా మందిని నియమించవచ్చు.


************
కొందరు పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాలు తమకు కొన్ని వందల ఎకరాలను ఇస్తే, తాము కొన్ని వందలమందికి మాత్రమే ఉపాధి కల్పిస్తామంటున్నారు.

వ్యవసాయం వల్ల కూడా ఎక్కువమందికి ఉపాధి లభిస్తోంది.


ఉదా..కడియం తోటలపై ఆధారపడి సుమారు 20,000వేలమంది ఉపాధి పొందుతున్నారట. ఇవన్నీ గమనిస్తే, పారిశ్రామీకరణ వల్ల మాత్రమే ఉపాధి ఎక్కువగా లభించటం అనేది నిజంకాదని తెలుస్తుంది.


*************
ప్రభుత్వాలు దేశంలోని సహజవనరులను తమ అధీనంలో ఉంచుకుని, ప్రభుత్వరంగ సంస్థలను సమర్ధవంతంగా నడిపించాలి. ఉద్యోగుల జీతాలను తగ్గించాలి. అలా వచ్చిన ఆదాయంతో మరెందరికో ఉపాధిని కల్పించవచ్చు.

పాతకాలంలో ప్రభుత్వరంగ సంస్థలు సమర్ధవంతంగా పనిచేసేవి. క్రమంగా ప్రైవేట్ ఆధిపత్యం పెరిగింది.


 అయితే, ప్రభుత్వ సంస్థలలో ఉద్యోగులు తరచూ జీతాల పెంపు వంటి విషయాలకొరకు సమ్మెలు చేయటం వంటి వాటి ద్వారా కూడా ప్రభుత్వాలు విసిగిపోయి, ప్రైవేటీకరణ వేగవంతం చేసిఉండవచ్చు.


 ప్రభుత్వాలకు ఆదాయం బాగుండాలి.  కనీసం ప్రభుత్వం, ప్రైవేట్ భాగస్వామ్యంలో సంస్థలను నెలకొల్పాలి. అంతేకానీ, సంస్థలను పూర్తిగా ప్రైవేట్ పరం చేస్తే ప్రభుత్వాల పరిస్థితి బలహీనమవుతుంది.


అయితే, ప్రైవేట్ లో  కూడా కొందరు మంచి యజమానులు ఉంటారు. . అలాంటి వారి  సంస్థలను  ప్రోత్సహించవచ్చు.

******************
వస్తువుల తయారీ మాత్రమే కాకుండా ప్రపంచంలో ఇంకా చాలా పనులున్నాయి...

ప్రభుత్వాల వద్ద ..  జీతాలు ఇవ్వటానికి  డబ్బు బాగా ఉంటే,  ప్రజలకు   రకరకాల  ఉపాధి  పనులు ఎన్నయినా కల్పించవచ్చు...   

ఉదా.. రోడ్లపై ఎన్ని గుంటలున్నాయో చూసి పూడ్చటం, దేశంలో రహదార్ల ప్రక్కన, చెరువుల ప్రక్కన, ఇంకా ఎక్కడ కావాలంటే అక్కడ మొక్కలు నాటి అవి బాగా పెరిగేలా పెంచటం, 


ఇంకా ఉద్యోగాలు సృష్టించాలంటే..  ప్రతి 50 మొక్కలకు ఒక్కొక్క ఉద్యోగిని ఉద్యోగంలో నియమించవచ్చు.

*******************************
పాతకాలంలో డబ్బుకు బదులు వస్తుమార్పిడి విధానం ఉండేది. కొంతకాలం తర్వాత వస్తుమార్పిడి విధానం మరియు జీతం ఇవ్వటం కలిపి ఉండేవి. 

ఉదా..పొలాల్లో పనిచేసే వారికి జీతంగా కొంత డబ్బు  మరియు  కొంత ధాన్యం ఇవ్వటం కూడా ఉండేది. 

************
చాలా కంపెనీలు తక్కువమంది ఉద్యోగులతోనే సంస్థలను నడిపిస్తున్నారు.  ఇద్దరు చేసే పనిని ఒకరితోనే చేయిస్తున్నారు.

జీతాలు తగ్గించి, ఎక్కువమంది  సిబ్బందిని  నియమించుకుంటే నిరుద్యోగ సమస్య తగ్గుతుంది. 


అప్పుడు ఉద్యోగస్తులకు కూడా  పని భారం తగ్గి , టెన్షన్ తగ్గి అనారోగ్యాలు తగ్గుతాయి.  పనిలో నైపుణ్యత కూడా మెరుగుపడుతుంది.


*********************

 పరిశ్రమల యజమానులు లాభాలలో తమ వాటాను కొంత తగ్గించుకుని, ఎక్కువమందికి ఉద్యోగాలివ్వాలి. ఉద్యోగస్తులు జీతాలను తగ్గించుకోవాలి.

 మరీ  ఎక్కువ ధరకు వస్తువులను అమ్మకూడదు . 
ధరలు తగ్గితే ..జీతాలు తగ్గినా సమస్యలు ఉండవు. 


జనాభా విపరీతంగా పెరగకూడదు.

ప్రజలు కూడా కోరికలను తగ్గించుకోవాలి.ఉన్నంతలో పొదుపుగా జీవించటం అలవాటుచేసుకోవాలి.


ఇవన్నీ జరిగితే, సమాజంలో సంపద అందరికీ న్యాయంగా లభిస్తుంది. నిరుద్యోగ సమస్య ఉండదు. పేదరికం ఉండదు.


************
 

వస్తువులను ఉత్పత్తి చేసే పరిశ్రమల వల్లే ఉపాధి ఎక్కువగా కల్పించగలం..అని చాలా మంది అపోహపడుతున్నారు.

మరి, పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిన దేశాలలో కూడా నిరుద్యోగ సమస్య, ఆర్ధికమాంద్యం ఎందుకు ఉన్నాయి ?


ఈ విషయాలను గమనిస్తే, ఆధునిక ఆర్ధికవ్యవస్థ ధనవంతులను మరింత ధనవంతులుగా, పేదవారిని మరింత పేదవారుగా చేస్తున్నట్లు అనిపిస్తోంది.



***************
ఇప్పుడు అందరూ డబ్బు సాయం చేయాలని కేంద్రప్రభుత్వాన్ని అడుగుతున్నారు...అందుకే ప్రభుత్వాల వద్ద సంపద ఉండాలి.

అయితే, లాక్డౌన్ వల్ల బాగా నష్టపోయిన చిన్న, మధ్య తరహా సంస్థలను ప్రభుత్వాలు ఆదుకోవచ్చు కానీ,

 పెద్ద సంస్థల వాళ్ళ వద్ద  ఇంతకుముందు వచ్చిన లాభాలతో చాలా సంపద వాళ్ళ వద్ద ఉంటుంది కదా... వాళ్ళకు ఈ నష్టం పెద్ద లెక్కలోనిది కాదు.

****************
ప్రజలు అందరూ కూడా జీవితంలో వాస్తవపరిస్థితిని గుర్తించాలి. 

ఎలాపడితే అలా  చేసి పది తరాలకు సరిపడేలా విపరీతంగా డబ్బు సంపాదించినా కూడా మనశ్శాంతిని పొందటం మాత్రం కష్టం. 





యుద్ధాలు రాకుండా అందరూ ఆలోచించాలి....



ఒక జబ్బు వస్తేనే ప్రజలు తట్టుకోలేకపోతున్నారు.


యుద్ధం అంటే మరెన్నో ఇబ్బందులు ఉంటాయి కదా!


************

 చాలామంది ప్రజలు యుద్ధం అంటే సైనికుల వరకే పరిమితం అనుకుంటారు. యుద్ధం అంటే సైనికులు మాత్రమే త్యాగాలు చేయటం కాదు.

యుద్ధం అంటే.. పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం.


శత్రుదేశం బాంబులు వేస్తుందనే భయంతో రాత్రిపూట విద్యుత్ నిలిపివేయవచ్చు.


ఎప్పుడు ఎక్కడ బాంబులు పడతాయో ? ఎందరు మరణిస్తారో ? ఎందరు వికలాంగులు అవుతారో? తెలియదు.


ఎన్నో  వ్యవస్థలు స్థంభిస్తాయి.  ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి ఉంటుంది.


 ఇతరదేశాలపై మనం యుద్దం  చేయాలా? వద్దా ? అనేది మనం నిర్ణయించుకోవచ్చు.


 తరువాత, మనదేశంపై ఇతరులు యుద్ధం చేస్తారా ? లేదా ? అనేది మన చేతిలో విషయం కాదు.


************* 

ప్రజలు కరోనా  కష్టాలే తట్టులేకపోతున్నప్పుడు యుద్ధం వల్ల వచ్చిపడే కష్టాలు అస్సలు తట్టుకోలేరు.


యుద్ధం వల్ల ఏ దేశానికైనా కష్టాలు తప్పవు. కరోనా వల్ల ప్రపంచ ఆర్ధివ్యవస్థ కూప్పకూలుతుందని  చెబుతున్నారు . 


యుద్ధాలు వస్తే.. ఆర్ధికవ్యవస్థ కుప్పకూలటం మాత్రమే కాకుండా, అన్నీ కుప్పకూలుతాయి.


*************** 

 విదేశాలకు, ఇతరదేశాలకు  వెళ్లిన వారు .... 
ఇప్పుడు కరోనా లాక్డౌన్ వల్ల   స్వస్థలాలకు వస్తామంటున్నారు.


విదేశాలలో చదువుల కోసం వెళ్ళి హాస్టల్స్లో ఉన్నవారు.. మమ్మల్ని ఇక్కడ హాస్టల్స్ ఖాళీ చేసి వెళ్లమంటున్నారు. ఇప్పుడు విమానాలు లేవు, మాకు ఇక్కడ వసతి, ఆహారం సరిగ్గా లేదు.. మమ్మల్ని స్వస్థలాలకు తీసుకెళ్ళాలంటూ ప్రభుత్వాలను అడుగుతున్నారు.



ఇప్పుడంటే ఇంకా ఫో న్ కాల్స్, ఇంటర్నెట్..సౌకర్యాలు చక్కగా పనిచేస్తున్నాయి కాబట్టి,  ఏ దేశంలో ఉన్నవాళ్ళయినా స్వదేశంలో ఉన్న బంధువులతో మాట్లాడగలుగుతున్నారు.



యుద్ధంలాంటివి వస్తే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఫో న్ కాల్స్, ఇంటర్నెట్..సౌకర్యాలు ఉంటాయో ? ఉండవో ? తెలియదు. ఎవరి పరిస్థితి ఎలా ఉందో  తెలిసే సమాచార వ్యవస్థ ఏమవుతుందో తెలియదు.


*****************

ఎప్పుడు ఎక్కడ బాంబులు పడతాయో తెలియదు. అప్పుడు క్షతగాత్రులకు వైద్యసేవలు అందించటానికి హాస్పిటల్స్ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు.


యుద్ధం ఏమీ లేకపోయినా కూడా కరోనా వల్ల కొంత ఎక్కువమంది రోగులు వస్తేనే అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా హాస్పిటల్స్ , వైద్యులు సరిపోక  కొందరికి వైద్యసేవలు అందించలేకపోయారట.



ఇక యుద్ధాలు వస్తే పరిస్థితి మరీ ఘోరంగా ఉంటుంది. ఎంతమందికి వైద్య సేవలు అందుతాయో? ఎంతమందికి అందవో ? చెప్పలేం.


అందరికీ వైద్యసేవలు అందించాలని ప్రభుత్వాలు భావించినా కూడా.. పరిస్థితి అనుకూలించాలి కదా!


*****************

భవిష్యత్తులో బయోవార్లు మాత్రమే జరుగుతాయంటూ కొందరు అంటున్నారు.

 పాతకాలం లో కూడా బయోవార్ జరిపే  విషయంలో ప్రయత్నాలు జరిగాయంటారు. అయితే, బయోవార్లు చేయకూడదని అంతర్జాతీయంగా ఒప్పందాలు ఉన్నాయట.

 అయినా, భవిష్యత్తులో యుద్ధాలు జరిగితే ? జీవాయుధాలతో పాటు ఇప్పటికే గుట్టలుగా పోగయి ఉన్న ఆయుధాలను కూడా ఉపయోగించే అవకాశం ఉంటుందేమో ?

*************
 కొంతకాలం క్రిందట ఒక దేశంలో యుద్ధం జరుగుతుంటే, అక్కడ ఉన్న కొందరు భారతీయులు అప్పటివరకూ తాము కూడబెట్టిన  ఆస్తులన్నీ వదులుకుని భారతదేశానికి వచ్చేశారు.


కొందరు ఉన్నతచదువుల కోసం వెళ్లినా .. అక్కడ శాశ్వతంగా ఉండకపోవటమే మంచిది.


 కొన్ని సార్లు మరి కొన్ని సమస్యలు వస్తుంటాయి. 


ఉదా..కుటుంబంలో తల్లితండ్రి యొక్క వీసా సమయం ముగిసి స్వదేశానికి వెళ్ళవలసివస్తుంది. వాళ్ళ సంతానమేమో విదేశాల్లో జన్మించి అక్కడి పౌరసత్వం కలిగిఉంటారు. 


 ************

మొత్తానికి కరోనా ఎన్నో ప్రశ్నలను సృష్టించింది.

పరిస్థితి ఎలా ఉన్నా కూడా విదేశాల్లోనే ఉంటాము ..అనే వాళ్ళ గురించి ఆలోచించనక్కరలేదు.


శాశ్వతంగా విదేశంలో స్థిరపడాలా? వద్దా ? అనే  ఆలోచనలు ఉన్న వాళ్లు సరైన నిర్ణయం తీసుకోవటం మంచిది. 


విదేశాల్లో స్థిరపడటం అంటే మన తరువాత మన పిల్లల భవిష్యత్ ఎలా ఉంటుంది ? అనికూడా ఆలోచించుకోవాలి.



భవిష్యత్తులో విదేశాల్లో తరువాత తరం వాళ్లు స్వేచ్చగా ఉండగలరా ? లేక రెండవతరగతి పౌరులుగా ఉండవలసి వస్తుందా ? అని కూడా ఆలోచించాలి.



అక్కడ పుట్టి పెరిగిన పిల్లలు..తల్లితండ్రులు పుట్టి పెరిగిన దేశానికి రావటానికి ఇష్టపడకపోవచ్చు. 


కారణాలు ఏమైనా కూడా, అటు విదేశాల్లోనూ సరిగ్గా ఉండలేక , స్వదేశానికీ రాలేక బాధపడే  పరిస్థితి మాత్రం ఎవ్వరికీ ఎదురుకాకూడదు.


ఇప్పుడు చాలా చోట్ల స్థానికులు..  వలసలు వచ్చిన వారి వల్ల తమకు ఉద్యోగాలు పోతున్నాయని భావిస్తున్నారు.....ఎప్పుడు ఎవరి బుద్ధి ఎలా మారుతుందో చెప్పలేం ?

*************


ఏ దేశ పౌరులైనా కొంతమంది వరకూ విదేశాలకు వెళ్ళటం జరుగుతుంది. అయితే, ఆ సంఖ్య విపరీతంగా పెరిగితే మాత్రం దేశానికి మంచిది కాదు. 


 విదేశాల్లో ఉన్న కొందరి కోసం.. స్వదేశీయుల అవసరాలను త్యాగం చేయకూడదు కదా.(ఇలాంటి పరిస్థితి రావటానికి అనేక కారణాలుంటాయి.)


*************

 కష్టమైనా, సుఖమైనా ఎవరి స్వస్థలంలో వారు జీవించటం మంచిది. భారతదేశం లో ఎన్నో సహజవనరులున్నాయి. 

అందరూ కలిసి అభివృద్ధి చేసుకుంటే వలసలు వెళ్ళవలసిన అవసరం ఉండదు.


ప్రభుత్వాలు  కూడా స్వదేశంలోనే  ఉన్నతచదువులు, ఉపాధి కల్పించాలి. 


 *****

యుద్ధాల వల్ల ఎన్నో కష్టాలు, నష్టాలు ఉన్నాయి. 

అందువల్ల, అన్ని దేశాలవాళ్ళు ఇతరదేశాలను ఎలా దెబ్బకొట్టాలా..అని ఆలోచించటాన్ని మాని, ఎవరిదేశాన్ని వాళ్ళు అభివృద్ధి చేసుకోవటంపై దృష్టి పెడితే మంచిది.


అందువల్ల,  యుద్ధాలు రాకుండా అందరూ మంచిగా ఆలోచించాలి.