koodali

Monday, October 30, 2017

కార్తిక సోమవారం సందర్భంగా...

ఓం 
త్రిమూర్తులకు వందనములు. 

కార్తిక మాసం శివకేశవులకు ప్రీతికరమైనది. 

శివపంచాక్షరీ స్తోత్రం....

నాగేంద్ర హారాయ త్రిలోచనాయ

భస్మాంగ రాగాయ మహేశ్వరాయ

నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ

తస్మై నకారాయ నమశ్శివాయ.


మందాకినీసలిల చందన చర్చితాయ

నందీశ్వర ప్రమధనాధ మహేశ్వరాయ

మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ

 తస్మై మకారాయ నమశ్శివాయ.


శివాయ గౌరీవదనారవింద

సూర్యాయ దక్షాధ్వరనాశకాయ

శ్రీ నీలకంఠాయ వృషధ్వజాయ

తస్మై శికారాయ నమశ్శివాయ.


వశిష్ట కుంభోద్భవ  గౌతమాది

మునీంద్ర దేవార్చిత శేఖరాయ

చంద్రార్క వైశ్వానర లోచనాయ

 తస్మై కారాయ నమశ్శివాయ.


యక్షస్వరూపాయ జటాధరాయ

పినాక హస్తాయ సనాతనాయ

సుదివ్య దేహాయ దిగంబరాయ

 తస్మై  యకారాయ నమశ్శివాయ.

పంచాక్షర మిదం పుణ్యం యః పఠే ఛ్చివస్సన్నిధౌ

శివలోక మవాప్నోతి శివేన సహమోదతే.

************
ఏకశ్లోకి  భగవద్గీత

ఓం  యత్రయోగేశ్వరః కృష్ణో యత్ర పార్ధో ధనుర్ధరః 
తత్ర  శ్రీర్విజయో భూతిర్ధ్రువా  నీతిర్మతిర్మమ.  
.........................

పార్ధాయ ప్రతి  బోధితాం....భగవతా నారాయణేనస్వయమ్  
వ్యాసేన  గ్రధితాం  పురాణమునినా  మధ్యేమహాభారతమ్ 
అద్వైతామృత వర్షిణీం భగవతీమష్ఠాదశాధ్యాయినీ
మంబ త్వా మనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీమ్ (భవద్దేషిణీమ్)
......................................

 వ్రాసిన  వాటిలో  అచ్చు తప్పులు ..   వంటివి   ఉంటే  తెలిసిన  వారు  చెప్పగలరు. (   మీకు  అభ్యంతరం  లేకపోతే ...) 

  అచ్చుతప్పుల  వంటివి  ఉన్నచో  దయచేసి  క్షమించమని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను. 



Sunday, October 29, 2017

మా ఇంటివద్ద ఉన్న పారిజాతం చెట్టు ..ఒక సవరణ..


మా ఇంటివద్ద ఉన్న పారిజాతం చెట్టు ..అనే టపాలో .. 

(పారిజాతం పువ్వులను చెట్టునుంచి కోయకూడదంటారు. క్రింద రాలిపడిన పువ్వులనే ఏరి పూజలో సమర్పించాలట.

 ఒక శుభ్రమైన వస్త్రాన్ని నేలమీద పరిచి వస్త్రం పైన రాలిపడిన పువ్వులను తీసుకోవచ్చట.  

అలాగని, వస్త్రాన్ని పరిచి, పని ఉందని మనం లోపలికి వెళ్తే..ఆ వస్త్రం పైనుంచి పిల్లి వంటివి నడిచి వెళ్తే దోషం కావచ్చు.

కాబట్టి, నేలమీద వస్త్రాన్ని పరచి, వెంటనే లోపలికి వెళ్లిపోకుండా.. చెట్టు కొమ్మలను నిదానంగా కదిలించి వస్త్రంపై రాలిన పువ్వులను ఏరుకోవచ్చు. ..)  అని వ్రాసాను.

***************
అయితే,పారిజాతం పువ్వుల కొరకు చెట్టుకొమ్మలను కదిలించకూడదట.(అంతర్జాలం ద్వారా ఈ విషయం తెలిసింది. ) 
క్రింద రాలిన పువ్వులను మాత్రమే తీసుకోవాలట.  
**************
నాకు ఏమనిపిస్తుందంటే, 

ప్రక్క ఉన్న చెట్టు కొమ్మలపైనా, ఆకులపైనా రాలిపడిన పువ్వులను  తీసుకోవచ్చు,

(పారిజాతం చెట్టు చుట్టుప్రక్కల.. మధ్యస్థం ఎత్తులో  పెరిగే మొక్కలను పెంచితే ఆ మొక్కలపై రాలిపడే పువ్వులను తీసుకోవచ్చు.)

లేదా నేలకు కొద్దిగా ఎత్తులో వెడల్పైన బల్లపైన వస్త్రాన్ని పరచి దానిపైన రాలిపడిన పువ్వులను తీసుకోవచ్చు,

 లేక కొమ్మలకు వెడల్పుగా ఊయలవలె వస్త్రాన్ని కట్టి అందులో పడిన పువ్వులను సేకరించవచ్చు.


**************
పారిజాతం చెట్టు ఇంటివద్ద పెంచకూడదు, దేవాలయంలోనే ఉండాలని కొందరు అంటారు, కొందరేమో ఇంటివద్ద పెంచుతారు. 

ఇంటివద్ద పెంచితే మాత్రం, కొమ్మలు రోడ్డుపై పెరిగి, పువ్వులు రోడ్డుపై పడి    కాళ్ళక్రింద త్రొక్కే విధంగా కాకుండా, ముందుగానే ఆలోచించి సరైన ప్రదేశంలో నాటుకోవటం మంచిది. 
***********************************

ఈ మధ్య విన్న విషయం.. 

 పారిజాతం పువ్వులు నేలపై పడినవాటినే ఏరి దైవానికి సమర్పించాలి,  
నేలపై దుమ్ము ఉంటుందని వస్త్రం పరవటం కూడా సరైనది కాదు. నేల స్పర్శ తగలాలంటున్నారు.

 అంతగా నేల మురికిగా ఉంటుందనుకుంటే ఆవుపేడతో అలకవచ్చంటన్నారు. 

ఇలాంటప్పుడు మరికొన్ని సందేహాలు వస్తాయి.  

అయితేమరి,   చెట్టు  ఆకులపై   రాలి పడిన పువ్వులను,  పచ్చగడ్డిపై రాలిపడిన పువ్వులను .. దైవానికి సమర్పించకూడదా ? 

కేవలం నేలపై రాలిన వాటినే సమర్పించాలా ?  అనే  సందేహాలు వస్తాయి. 

******************
పారిజాత పువ్వులు క్రింద రాలి పడినప్పుడు, మట్టి పైన రాలిపడినవి మాత్రమే వాడాలి, ఆ పువ్వులకు మట్టి స్పర్శ తగలాలి అంటున్నారు కాబట్టి...

కొన్నిసార్లు గోడ ప్రక్కన  చెట్టు పెరిగినప్పుడు గోడపైన కూడా పువ్వులు రాలి పడుతుంటాయి.

పువ్వులు మట్టి పైన కాకుండా గోడపైనా, క్రింద ఉన్న రాళ్ళపైన రాలిపడితే వాటిని ఏరి, శుభ్రమైన మట్టి నేల మీద ఒకసారి ఉంచి వాడుకోవచ్చేమో ? 

 ఏమిటో  ఒక సందేహం తర్వాత ఇంకో సందేహంగా పరిస్థితి ఉంది.


Friday, October 27, 2017

పూజ మధ్యలో ...


నేను వీలు కుదిరినంతలో దైవ నామముల స్తోత్రాన్ని చదువుకుంటాను. 


అలా పూజ చేసేటప్పుడు మధ్యలో లేవకూడదని, లేవటం జరిగితే , మళ్లీ మొదటనుంచి చదవాలన్నట్లుగా ఎవరో చెప్పగా విన్నట్లు గుర్తు. 


అయితే, పూజ వద్ద కూర్చున్నప్పుడు మధ్యలో ఫోన్ కాల్ రావటం, లేక కాలింగ్ బెల్ మోగటం జరిగినప్పుడు మధ్యలో లేవక తప్పదు. 


పూజలో కూర్చుని.. మధ్యలో ఫోన్ మోగుతుందో ? కాలింగ్ బెల్ మోగుతుందో? అనే  ఆలోచిస్తూ ఉంటే, పూజ పట్ల ధ్యాస అంతగా ఉండదు. 


ఉదయం కొద్దిసేపు పూజ చేసుకుని , తరువాత తిరిగి కొంతసేపు పూజ చేయాలనుకుంటే..


రోజువారిచర్యలో భాగంగా.. ఇంట్లో వాళ్ళు  బయటకు  వెళ్ళాక,  పూజ వద్ద కూర్చున్నప్పుడు   లాండ్ ఫోన్ మ్రోగటం, ఇరుగుపొరుగు వాళ్ళు లేక  కూరల వాళ్ళు కాలింగ్ బెల్ మ్రోగించటం జరిగితే ..ఇలాంటి  సమస్య వస్తుంది.


పూజకు కూర్చోవటానికి ముందే .. ఫోన్ ఆఫ్ చేయటం, కాలింగ్ బెల్ ఆఫ్ చేయటం ..అనేవి కుదరకపోవచ్చు. 


అలాగని పూజ మధ్యలో లేచినందువల్ల .. మళ్లీ మొదటి నుంచీ చదవాలంటే కష్టమే.  


అందువల్ల,  నాకు ఇంతే వీలవుతుంది, దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధించుకున్నాను.  


పూజలో మధ్యలో లేవవలసి వచ్చినా, తిరిగి మొదటి నుంచి చదవటంలేదు.


పూజ మొదలుపెట్టిన తరువాత స్థిరంగా కూర్చుని పూజచేసుకోవటం మంచిది. 


అయితే, అలా కుదరనప్పుడు మధ్యలో లేవవలసి వస్తే లేవక తప్పదు.


     ఎవరి శక్తిని బట్టి , వీలునుబట్టి వారు పూజ చేసుకోవటం మంచిదని నాకు అనిపించింది. 


 ఏది చేస్తే తప్పో? ఏది ఒప్పో ? అనుకుంటూ ఎన్నో సందేహాలతో సతమతమవటం కంటే , ముఖ్యంగా దైవంపై ధ్యాస ఉంచి పూజ చేసుకోవటం మంచిదనిపించింది.


 అలాగని, పూజ మధ్యలో ..అనవసరంగా ఎక్కువగా ఫోనులో మాట్లాడటం..వంటివి చేయటం సరైనది కాదు.



మా ఇంటివద్ద ఉన్న పారిజాతం చెట్టు ..


మా ఇంటివద్ద పారిజాతం పువ్వుల చెట్టు ఉంది. పారిజాతం పువ్వులు బాగుంటాయని నేనే మొక్క తెచ్చి పెట్టాను. 

ఇప్పుడు ఆ మొక్క పెద్దదయ్యి చక్కగా పువ్వులు పూస్తోంది. రాత్రి సమయంలో చక్కటి సువాసన కూడా వస్తుంది.

 అయితే, ఆ సువాసనను పీల్చితే, ఉదయాన ఆ పువ్వులను దేవునికి సమర్పించవచ్చో? లేదో ? అని నాకు సందేహం కలిగింది.

 అలాగని పీల్చకుండా ఉండటం కష్టం...ఇలా అతిగా ఆలోచించటం కూడా సరికాదేమోనని అనిపిస్తుంది.

**********
పారిజాతం పువ్వులను చెట్టునుంచి కోయకూడదంటారు. క్రింద రాలిపడిన పువ్వులనే ఏరి పూజలో సమర్పించాలట.

 ఒక శుభ్రమైన వస్త్రాన్ని నేలమీద పరిచి వస్త్రం పైన రాలిపడిన పువ్వులను తీసుకోవచ్చట.

అలాగని,  వస్త్రాన్ని పరిచి, పని ఉందని మనం లోపలికి వెళ్తే.. ఆ వస్త్రం పైనుంచి పిల్లి వంటివి నడిచి వెళ్తే దోషం కావచ్చు.

 కాబట్టి, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 

పారిజాతం చెట్టు దేవాలయంలో తప్ప ఇంట్లో పెట్టకూడదని కొందరంటారు...  

అయితే, ఇంట్లో కూడా పెంచుకుంటారు కొందరు.
*********

నేను మా ప్రహరీ బయట రోడ్డు ప్రక్క నాటాను. కొమ్మలు మా ఇంటివైపు కొన్ని, రోడ్డు వైపు కొన్ని పెరిగాయి. అందువల్ల, కొన్ని పువ్వులు రోడ్డుపైన పడుతున్నాయి.

 రోడ్డుపై వస్త్రాన్ని పరవటం అంటే కుదరదు కదా! వాహనాల వల్ల, నడిచేవారి వల్ల పువ్వులు నలిగిపోతుంటాయి. ఇదంతా చూసినప్పుడు బాధగా ఉంటుంది. క్రింద పడ్డ పువ్వులను కొంతవరకు ఏరివేస్తున్నాను. 

పారిజాతం దేవతా వృక్షం కాబట్టి, చుట్టుప్రక్కల విపరీతంగా పెరగకుండా కొమ్మలు కత్తిరించవచ్చో? లేదో ? అనిపించింది.
అయినా వేరే దారిలేక కొన్ని కొమ్మలను కత్తిరించాను.

 కొమ్మలు పెద్దగా పెరిగిన తరువాత కొమ్మలను కొడితే చెట్టుకు ఎక్కువ బాధ కలగవచ్చు.  అందువల్ల, చిగుర్లు వస్తున్నప్పుడే తుంపవచ్చు. 

అయినా, కొన్నిసార్లు పెద్దయిన కొమ్మలను కత్తిరించటమూ తప్పకపోవచ్చు. 

ఇవన్నీ ముందు తెలియలేదు.... ముందే ఆలోచన వచ్చి ఉంటే రోడ్డు ప్రక్క   మొక్క నాటకుండా, ఆలోచించి నిర్ణయం  తీసుకోవటం జరిగేది.


************
ఇంకో సమస్య ఏమిటంటే, పువ్వుల సీజన్ తరువాత కాయలు వచ్చి, విత్తనాలు నేలమీద పడి చిన్న మొక్కలు వస్తాయి. అలా వచ్చిన పారిజాతం మొక్కలను తీసివేస్తున్నాను. 

ఆ చిన్న మొక్కలను పీకివేస్తున్నప్పుడు బాధగా అనిపిస్తుంది. దేవతామొక్కలను ఇలా పీకవచ్చో ? లేదో ? పీకివేస్తే పాపమేమో ? అని భయంగా కూడా ఉంటుంది. వేరే దారిలేక తీసివేస్తున్నాను.

 వీలైనంతలో కాయలు  కోసివేయటానికి ప్రయత్నిస్తున్నాను కానీ, అన్ని కాయలనూ కోయటం నావల్ల కాదు. 

ఏమిటో, ఇలా.. అనేక విషయాలలో ఏం చేయాలో ? ఏం చేయకూడదో ? అని అయోమయంగా అనిపిస్తోంది.

*************
ఇలాంటప్పుడు ఏమనిపిస్తుందంటే, కొన్నిసార్లు ఎక్కువ విషయాలు తెలియకపోవటం వల్ల కూడా లాభాలుంటాయేమో? అనిపిస్తుంది.

తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పేనంటారు.

 కొన్నిసార్లు తెలియక చేసిన తప్పులకు దోషం అంతగా ఉండదట ? విషయం తెలిసినా పాటించకపోతే.. వచ్చే పాపం ఎక్కువట.

  అలాంటప్పుడు, ఎక్కువ విషయపరిజ్ఞానం లేకపోవటం కూడా కొన్నిసార్లు మంచిదేనేమో ? అనిపిస్తున్నది. 

  విషయపరిజ్ఞానం ఉండటం మంచిదే.  అయితే, పరిస్థితిని బట్టి విచక్షణతో ఆలోచించి నిర్ణయాలను తీసుకోవటం మంచిది. 

పరిస్థితి అయోమయంగా ఉంటే దైవాన్ని ప్రార్ధించటం ఉత్తమం.




Wednesday, October 25, 2017

తులసి మొక్క, రావి మొక్క కొన్ని విషయాలు..


కొన్ని సంవత్సరాల క్రిందట మేము అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు కుండీలలో తులసి, గులాబీ, చామంతి వంటి మొక్కలు పెంచటం జరిగింది.

 తులసి మొక్క గింజలు ప్రక్కనున్న కుండీలలో పడి వాటిలో కూడా మొక్కలు వచ్చాయి. అలా ఎక్కువ తులసి మొక్కలు రావటం సంతోషంగానే అనిపించింది.

 అయితే, గులాబీ మొక్కల కుండీలలో కూడా తులసి పెరిగితే గులాబీలు ఏపుగా పెరగవని భావించి, తులసి కండీలను.. మిగతా కుండీలను దూరందూరంగా జరిపాను.

ఎవరైనా తులసి మొక్క కావాలని అడిగితే మా వద్ద ఉన్న తులసి మొక్కలనుంచి తీసి ఇవ్వటం జరిగింది. 

తరువాత కొంతకాలానికి ఒకరు ఏం చెప్పారంటే, ఇంటిలో తులసి మొక్క ఒక్క కుండిలో ఉంటే చాలు, బోలెడు కుండీలలో ఉండకూడదన్నట్లు చెప్పారు. 

ఇది విన్న తరువాత సంశయం కలిగి, మా వద్ద రెండు కుండీలలో ఒక కుండీని మా ఇంటి ప్రక్క ఉన్న దేవాలయంలో పెట్టేసి వచ్చాను.

తరువాత  ఏమనిపించిందంటే,  దేవాలయంలో పెడితే ఒకవేళ నీరులేక మొక్క ఎండిపోతే ఎలా? అనిపించి అప్పుడప్పుడు వెళ్ళి నీరు పోస్తున్నాను.

 ఇలా కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఒక సందేహం కలిగి దానిని పరిష్కరించటానికి చూస్తే,  మరిన్ని సందేహాలతో వ్యవహారం గొలుసుకట్టు వ్యవహారంలా తయారవుతుంది.

నాకు ఏమనిపిస్తుందంటే, తులసి మొక్క ఉంటే చుట్టుప్రక్కల గింజలు పడి మొక్కలు రావటం సహజం. తులసి మొక్కలు ఎన్ని ఉన్నా పూజనీయమే.


అయితే , ఎక్కువ కుండీలలో తులసి ఉంటే అన్నింటికీ రోజూ పసుపు, కుంకుమతో ..  పూజలు చేయాలా? అనే సందేహాలు వస్తాయని భావించి,  ఒక్క కుండీ నే ఉండాలి. అని చెప్పిఉండవచ్చు. 


అంతేకానీ, ఎక్కువ మొక్కలు ఉంటే తప్పు ..అని  వారి  ఉద్దేశం కాకపోవచ్చు.  
***********
  తులసి ఆకులను ఎప్పుడుపడితే అప్పుడు తెంపకూడదని పెద్దలు తెలియజేసారు. అలా చెప్పటం మంచిదే. 

లేకపోతే భక్తులు పూజ కొరకు అంటూ విపరీతంగా తులసి ఆకులను, కొమ్మలను ఎప్పుడుపడితే అప్పుడు తెంపేసి మొక్కలను పెరగనివ్వరు. 

******************
 తులసి గింజలు ప్రక్కన పడకుండా, ఎండిన  తులసి కంకులను 
అప్పుడప్పుడు నేనే  త్రుoచి మొక్క మొదట్లో వేయటం జరిగేది.

అయితే, కొందరు ఏమంటారంటే , స్త్రీలు తులసి కంకులు 
త్రుoచ కూడదంటారు. మగవారు త్రుoచవచ్చంటారు.

 అయితే, మగవారికి ఇలాంటి విషయాల పట్ల ఆసక్తి ఉండవచ్చు, లేకపోవచ్చు.  అలాంటప్పుడు,  స్త్రీలే 
త్రుoచక తప్పదు కదా!


మరి , స్త్రీలు తెంపితే పాపం వస్తుందంటున్నారు. 

ఇలా ఎన్నో సమస్యలు, సందేహాలు కలిగి అసలు ఇలాంటి దేవతా మొక్కలను పెంచకుండా ఉంటే సరిపోతుందేమో ? అనిపించే పరిస్థితి రావచ్చు. 


పెద్దలు మనకు చక్కటి విషయాలను తెలియజేసారు. అయితే, అతి సందేహాలతో భయపడి అసలు విషయానికి దూరం కాకూడదు. 

***********
 రావి చెట్టు దేవతా వృక్షం. ఈ వృక్షం దేవాలయాలలో తప్ప ఇంట్లో ఉంటే మంచిదికాదంటున్నారు.రావి వృక్షాలను నరకటం వంటివి చేస్తే ఎంతో పాపం, కష్టాలు వస్తాయని అంటున్నారు.

 వృక్షాలు నరికితే తప్పే కావచ్చు. మరి చిన్నమొక్కలు వస్తే ఏం చేయాలో తెలియటం లేదు.

పక్షుల వల్ల రావి విత్తనాలు ఎక్కడయినా పడి మొక్కలు వస్తుంటాయి. మా ఇంటివద్ద చిన్న రావి మొక్కలు వచ్చాయి. వాటిని పీకాలంటే భయంగా ఉంది.

 ఎక్కువగా ఉన్న మొక్కలను తీసి వేరే చోట పెట్టవచ్చు కానీ, ఇలాచేయటం ఎప్పుడూ కుదరకపోవచ్చు.

**********
కొన్ని మొక్కలు , వృక్షాలలోని గొప్పదనాన్ని గ్రహించిన పెద్దలు వాటిని దేవతా మొక్కలు , వృక్షాలుగా తెలియజేసారు. అలాంటి  వాటిని  జాగ్రత్తగా సంరక్షించాలి.

 అయితే,  మరీ అతి సందేహాలతో  భయపడి .. అసలు అలాంటి మొక్కలను, వృక్షాలను పెంచకుండా  దూరంగా ఉంటే మంచిది ..అనే పరిస్థితి రాకూడదు.


ఎన్నో విషయాల గురించి ఎన్నో సందేహాలు వస్తుంటాయి. అయితే మనం మరీ ఎక్కువగా సందేహాలతో భయపడి అసలు విషయాలకే దూరం కావటం కాకుండా,  ఆచారవ్యవహారాలలోని అసలు అంతరార్ధాలను అర్ధం చేసుకోవలసిన అవసరం ఉంది. 


 పెద్దలు ఎన్నో ఆచారవ్యవహారాలను తెలియజేశారు. ఆచారవ్యవహారాలలో ఎన్నో చక్కటి  విషయాలు ఉన్నాయి.


అయితే , ప్రాచీనులు  తెలియజేసిన విషయాలు కొన్నైతే, మధ్యలో వచ్చిచేరినవి కొన్ని.

ఏవి పెద్దలు చెప్పినవో? ఏవి  మార్పులుచేర్పులతో మధ్యలో వచ్చిచేరినవో తెలియటం లేదు.
 
 

Monday, October 23, 2017

పర్వదినముల సందర్భంగా ..


కార్తిక సోమవారం మరియు నాగులచవితి పర్వదినముల సందర్భంగా అందరికి శుభాకాంక్షలండి.




Friday, October 20, 2017

కొందరు పొత్తిళ్ళలో ఉన్న పిల్లలు కూడా వత్తిళ్ళ మధ్య ....

మాకు తెలిసిన ఒకామెకు తన కొడుకు విదేశాలకు వెళ్లాలని ఎంతో కోరిక. 

అయితే, ఆ అబ్బాయికి విదేశాలకు వెళ్లటం అసలే ఇష్టం లేదు.


 ఆ తల్లి నాతో ఏమన్నదంటే, పక్కింటి వాళ్ల అమ్మాయి విదేశాలకు వెళ్లి చదువుకుని, ఉద్యోగంలో చేరి తల్లితండ్రికి బోలెడు డబ్బు పంపిస్తుందట.


ఆ డబ్బుతోనే ఇక్కడ వాళ్లు పెద్ద బిల్డింగ్ కట్టారనీ, ఇంకా బోలెడు నగలు కొన్నారని చెప్పింది. 


ఆ అమ్మాయి తల్లి వేసుకు తిరిగే నగలన్నీ కూతురు విదేశాల నుంచి పంపిన సొమ్ముతో కొన్నవేనట. 


ఇవన్నీ చెప్పి, తన కొడుకు వెళ్ళటం లేదంటూ చెప్పి వాపోయింది.


నేను ఏమన్నానంటే, ఇప్పుడు విదేశాల్లో కూడా అంత తేలిగ్గా ఉద్యోగాలు దొరకటం లేదు, అయినా అక్కడ వస్తువులు ధరలు ఎక్కువగా  ఉంటాయి.


ఇండియాలో  రేట్లు  తక్కువ.
 విదేశాలలో నెలకు మూడు లక్షలు ఆదాయం వచ్చినా, ఇండియాలో నెలకు ఒక లక్ష ఆదాయం వచ్చినా ఒకటే. అని చెప్పాను.

విదేశాలలో కొందరు పిల్లలు పడుతున్న కష్టాల గురించి కూడా వార్తలు వచ్చాయి ..


 విదేశాల్లో ఈ మధ్య పరిస్థితి అంత బాగోలేదు కదా! అని చెప్పినా ఆమె అవన్నీ పట్టించుకునే పరిస్థితిలో లేదు. 


ఎంతసేపూ..విదేశాలకు వెళ్తే బోలెడు డబ్బు సంపాదించవచ్చు కదా! అంటుంది. 


మొత్తానికి ఏం చెప్పారో కానీ, ఆమె కొడుకు విదేశాలకు వెళ్ళటానికి ఒప్పుకున్నాడట.


 వెళ్ళటానికి ముందు విదేశీ భాష నేర్చుకుంటే అవకాశాలు బాగుంటాయంటూ, ఈ సంవత్సరమే ఇంజనీరింగ్ పూర్తయిన అబ్బాయిని విదేశీభాష నేర్చుకోవటం కొరకు వేరే ఊర్లో చేర్పించారు.


విదేశాల్లో చదవాలంటే బోలెడు డబ్బు ఖర్చు పెట్టడానికి సిద్దపడాలి. 
ఒకవేళ ఏదైనా  సబ్జెక్ట్ ఫెయిల్ అయి ఇంకో సంవత్సరం చదవాలంటే మరింత డబ్బు ఖర్చవుతుంది.


తరువాత ఉద్యోగం వస్తే ఫరవాలేదు. 
ఉద్యోగం రాకుంటే,  బోలెడు డబ్బు వృధా అయిందంటూ సూటిపోటి మాటలు అంటే పిల్లలు తట్టుకోలేరు.

 అందువల్ల పిల్లలను విదేశాలకు పంపాలనుకునేవారు ముందే అన్నివిషయాలను అర్ధం చేసుకోవాలి. అంతేకాని, 
ఇరుగుపొరుగుతో పోల్చి పిల్లలపై ఒత్తిడి తేవటం సరైనది కాదు.

***********

అయితే కొందరు పిల్లలేమో పెద్దవాళ్లు వెళ్ళమనకపోయినా , 


విదేశాలకు వెళ్ళటం మాకూ ఇష్టం లేదు  కానీ , ఇక్కడ పెద్దగా అవకాశాలు లేవు కాబట్టి , కొంతకాలం విదేశాలకు వెళ్ళి వస్తాం. అని అంటారు.అది వేరే విషయం.  


***************

ఈ రోజుల్లో ఎంత చదివినా ఉద్యోగాలు లభించటం కష్టంగా ఉంది.


 అయితే, ఉద్యోగం లేక ఇంటి పట్టున ఉండే పిల్లల పట్ల కొందరు తల్లితండ్రులు తమకు తెలియకుండానే పిల్లలు బాధపడేలా మాట్లాడతారు.


 ఇంకా ఉద్యోగం రాలేదు, తిని ఇంట్లో ఖాళీగా కూర్చోకుంటే ఏదైనా పనికోసం గట్టిగా ప్రయత్నించవచ్చు కదా! అంటారు. 


ఇలా అనటం వల్ల పిల్లలు అభివృద్ధిలోకి వస్తారని కొందరు తల్లితండ్రి సమర్ధించుకుంటారు. 


అసలే ఉద్యోగాలు లేక పిల్లలు బాధపడుతుంటే తల్లితండ్రి కూడా అలా ప్రవర్తిస్తే  పిల్లలకు ఏం దిక్కు ?


****** ********

ఈ రోజుల్లో కొందరు పొత్తిళ్ళలో ఉన్న పిల్లలు కూడా 
త్తిళ్ళ మధ్య పెరుగుతున్నారంటే అతిశయోక్తి లేదు.

 ఉదా..ఈ రోజుల్లో చాలామంది  పసిపిల్లలు, తల్లి వద్ద పెరగవలసిన సమయంలో బాటిల్ పాలు త్రాగుతూ ఎక్కువ సమయం బేబీ కేర్ సెంటర్లలో పెరుగుతున్నారు.


మాకు తెలిసిన ఒక అమ్మాయి డెలివరి తరువాత నెలలోపే కెరీర్ ముఖ్యం.. అంటూ పసిపాపను పెద్దవాళ్ళ వద్ద వదిలి విదేశాలకు వెళ్ళి జాబ్లో చేరిపోయింది.


 ఆ పెద్దవాళ్లు ఇంటి పనిలో సహాయం కొరకు కొందరు సహాయకులను నియమించుకున్నారు.సహాయకులు రానిరోజున ఇబ్బంది ఉంటుంది. 

*************
ఒకవేళ పెద్దవాళ్ళు అనారోగ్య పరిస్థితిలో ఉంటే పిల్లల్ని  బేబీ కేర్ సెంటర్లలో పెంచుతారు కాబోలు. 

ఏంటో పాపం ఈ రోజుల్లో చాలామంది పిల్లల పరిస్థితి ఇలాగైపోయింది.


*************

పెద్దవాళ్ళను పిల్లలు సరిగ్గా చూడాలంటూ చట్టాలున్నాయి.  


మరి, చిన్నపిల్లలను పెద్దవాళ్ళు  దగ్గరుండి సరిగ్గా చూసుకోవాలంటూ చట్టాలు లేవా?


పెద్దవాళ్ళు తమ హక్కుల గురించి మాట్లాడతారు. 


 బాల్యంలో  తల్లితండ్రి ఆలనాపాలనాతో పెరిగే హక్కు పిల్లలకూ ఉంటుంది కదా! 


తల్లితండ్రి.. కెరీర్ కు, సంపాదనకు  మొదటి ప్రాధాన్యత, పిల్లల పెంపకానికి రెండో ప్రాధాన్యత ఇవ్వటం కాకుండా.. పిల్లల పెంపకానికి చక్కటి ప్రాధాన్యతనివ్వాలి. 


పిల్లలు అందరూ చక్కగా హాయిగా  ఉండాలి.





కొన్ని సంఘటనలను రాస్తాను. ..

 కొందరు పేరెంట్స్ పిల్లలపై మోయలేని భారాన్ని వేస్తున్నారనేది నిజం. ఇలా అనటం వల్ల కొందరికి బాధ కలగవచ్చు. 

కొన్ని సంఘటనలను రాస్తాను. 


మా పిల్లల చిన్నతనంలో పేరెంట్స్ మీటింగ్ కు వెళ్ళినప్పుడు ఒక సంఘటన జరిగింది. 


ఒక బాబుకు 90 కన్నా కొంచెం ఎక్కువ మార్కులే వచ్చాయి.


 అయితే, 99 శాతం వరకు రాలేదని ఆగ్రహించిన బాబు తల్లి, పిల్లవాడిని అందరిముందు చెంప దెబ్బ కొట్టింది. 


పేరెంట్స్  ఇలా చేయటం సరైనది కాదు. చిన్న పిల్లలకు మార్కుల ప్రాముఖ్యత గురించి ఏం తెలుస్తుంది.


 పిల్లలను మందలించటం,  కొట్టడం  పిల్లల మంచి కొరకే, వారికీ బాధ్యత నేర్పటం కొరకే  .. అని కొందరు పెద్దవాళ్ళు అంటారు. 


పెద్దవాళ్ళను  తిట్టి,  కొడితే తేలిగ్గా తీసుకుంటారా?  


బాధ్యతలు నేర్పటానికి  ఒక పద్ధతి ఉంటుంది. 


అంతేకానీ, పిల్లల పట్ల నిరంకుశత్వంగా ప్రవర్తించటం సరైనది కాదు.

1.ఉదా.. ఇంట్లో ఏదైనా పని బాధ్యతగా చేయలేదని భర్త భార్యను మందలించి, ఒక చెంపదెబ్బ కొడితే భార్యకు చాలా బాధ కలుగుతుంది. 


భర్తపై కోపం కూడా వస్తుంది. విషయం మహిళా హక్కుల గురించి మాట్లాడే వరకూ వెళ్ళే అవకాశం కూడా ఉంది. 


భార్యను మందలించటం ఆమె మంచికొరకే , ఆమెకు మరింతగా బాధ్యత మరియు పనిలో మెళకువలు  నేర్పటం కోసమే..అని భర్త అంటే ఊరుకుంటారా?


బలహీనులను బలవంతులు అణచివేయకూడదంటూ మాట్లాడతారు.


2.ఉదా.. ఆఫీసులో ఏదైనా పని బాధ్యతగా చేయలేదని మగవారిని పై ఆఫీసర్ మందలించి , చెంపదెబ్బ కొడితే అతనికి చాలా బాధకలుగుతుంది.


 పై ఆఫీసర్ పై కోపం కూడా వస్తుంది. విషయం హక్కుల గురించి మాట్లాడే వరకూ వెళ్ళే అవకాశం కూడా ఉంది.


  ఆఫీసులో మగవారిని మందలించటం అతని మంచికొరకే ,  అతనికి మరింతగా 
బాధ్యత మరియు పనిలో మెళకువలు నేర్పటం కోసమే..అని పై ఆఫీసర్ అంటే ఊరుకుంటారా?

మరి, లోకజ్ఞానం తెలిసిన పెద్దవాళ్లు తమ బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించకపోయినా.. గట్టిగా నిలదీసే హక్కు ఎవరికీ లేదంటున్నప్పుడు, 


. లోకజ్ఞానం సరిగ్గా తెలియని పిల్లల పట్ల నిరంకుశత్వంగా ప్రవర్తించటం ఎంతవరకు సమంజసం? 


బలహీనులను బలవంతులు అణచివేయకూడదన్నప్పుడు,   పిల్లల పట్ల కూడా కఠినంగా ప్రవర్తించకూడదు కదా! 


****************

 మరి కొందరు తల్లితండ్రులు ఎలా ప్రవర్తిస్తారంటే, పిల్లల పట్ల భేదభావాన్ని చూపిస్తారు. 


ఉదా..తల్లికి తన పిల్లలలో ఒకరంటే ఎక్కువ ఇష్టం, మరొకరంటే కొంత తక్కువ ఇష్టం , తండ్రికి తన పిల్లలలో ఒకరంటే ఎక్కువ ఇష్టం, మరొకరంటే కొంత తక్కువ ఇష్టం అన్నట్లు ప్రవర్తిస్తారు. 


కొందరు తాతబామ్మలు కూడా పిల్లల పట్ల వ్యత్యాసాలను చూపిస్తుంటారు.


 ఇలాంటి విషయాలు పిల్లలను చాలా బాధకు గురి చేస్తాయి.


 ఒక పిల్ల పుట్టిన తరువాతే నాకు బాగా కలిసివచ్చిందని .. కొందరు పేరెంట్స్ ఇతరులతో చెపుతుంటే వింటున్న  మిగిలిన పిల్లలకు మనస్సు చాలా బాధగా ఉంటుంది. 


తనంటే తన పేరెంట్స్ కు అంత ఇష్టం లేదు కాబోలు అనుకుంటారు.


పిల్లల పట్ల పక్షపాతంగా ప్రవర్తించకూడదు.


Wednesday, October 18, 2017

నరకచతుర్దశి, దీపావళి సందర్భంగా..

 
నరకచతుర్దశి, దీపావళి సందర్భంగా అందరికి శుభాకాంక్షలండి.

  కామ,క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలను అదుపులో ఉంచడానికి ప్రయత్నాలు చేసినప్పుడు, జీవితంలో దీపావళి వెలుగులు విరబూస్తాయి.

Monday, October 16, 2017

విద్యార్ధుల ఆత్మహత్యలు...


ఈ మధ్య వరుసగా కొందరు విద్యార్ధుల ఆత్మహత్యలు జరగటం అత్యంత బాధాకరం. 

వీటిని ఆత్మహత్యలు అనేకంటే సమాజం చేసిన హత్యలు అన్నా తప్పులేదు. 

ఇలా జరగటానికి ఎన్నో కారణాలున్నాయి. 

కొందరు తల్లితండ్రులు  తాము పొందలేని వాటిని పిల్లల నెత్తిమీద రుద్దుతున్నారు. 

ఉదా..నేను డాక్టర్ చదవలేకపోయాను కాబట్టి నువ్వు చదవాలి అంటుంటారు కొందరు తల్లితండ్రులు. 

ఇరుగుపొరుగు పిల్లలు పైచదువులు చదివారు కాబట్టి, తామూ గొప్పలు చెప్పుకోవాలంటే తమ పిల్లలూ పై చదువులు చదివి తీరాల్సిందే..అనే మంకుపట్టు కొందరికి . 

ఇరుగుపొరుగు పిల్లలు విదేశాలకు వెళ్లారు కాబట్టి తమ పిల్లలూ వెళ్ళాలి, 

అక్కడ పరిస్థితి ఎలా ఉన్నా కూడా సర్దుకుపోయి చదివి, ఉద్యోగం సంపాదించాలి, అక్కడ నుండి డబ్బు పంపిస్తే ఇక్కడ ఆస్తులు , ఆభరణాలు కొని గొప్పలు చెప్పుకుంటారు.

 పిల్లలు విదేశాల్లో ఎన్ని కష్టాలు పడుతున్నారో? అనేది అంత ముఖ్యమైన విషయం కాదన్నట్లు ఉంది.. కొందరి పెద్దవాళ్ళ ప్రవర్తన.

 ఇలా రకరకాల మనస్తత్వాలు. 

ఇదంతా పిల్లల మంచి కోసమే అంటారు కొందరు. 

అయితే, వారి శక్తిని బట్టి, పరిస్థితిని బట్టి ప్రవర్తించాలి కానీ , మొండిగా ఒకరి అభిప్రాయాలను ఇంకొకరిపై రుద్దటం  మంచిది కాదు.

*****************
 మా ఇంటి దగ్గరలో ఒక ట్యూషన్ ఉంది. అక్కడకు ట్యూషన్ కొరకు బోలెడు మంది చిన్నపిల్లలు వస్తారు.

ఉదయమూ ట్యూషన్, తరువాత స్కూల్,  మళ్ళీ ట్యూషన్..రాత్రికి ఇంటికి తిరిగివెళ్తారు చిన్నపిల్లలు. 

ఆదివారం కూడా ట్యూషన్ చెప్పమని తల్లితండ్రులు వత్తిడి చేస్తున్నారని టీచర్ చెప్పారు. 

 మార్కులు తక్కువ వస్తే పిల్లలను కొట్టయినా చదివించమని టీచర్లతో చెప్పే పేరెంట్స్ కూడా ఉంటారు.

కన్నతల్లితండ్రికే పిల్లలంటే జాలి లేనప్పుడు బయట వాళ్లయిన కాలేజీ వాళ్ళను అని ఏం లాభం.

*******************
ఈ రోజుల్లో డాక్టర్, ఇంజనీరు కాకుంటే, బతకడానికి ఇక వేరే మార్గమే లేదనట్లు భావిస్తున్నారు కొందరు. 

ఈ చదువులకు  సీట్లేమో వేలల్లో ఉంటాయి. పోటీ లక్షల మంది మధ్య ఉంటుంది. 

ఇలాంటప్పుడు పరిస్థితి..  లైఫ్ అండ్ డెత్..  సమస్యలా ఉంటుంది.  

పోటీచదువులంటూ చిన్నతనం నుంచే పిల్లల్ని హాస్టల్స్లో వేయటం జరుగుతోంది. 

హాస్టల్స్లో కొన్నిసార్లు ర్యాగింగ్ వంటివి కూడా ఉంటాయి. అక్కడ పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు ? 

హాస్టల్లో ఉండలేను.. అంటే కూడా కొందరు తల్లితండ్రి అర్ధంచేసుకోకుండా హాస్టల్ కు వెళ్లితీరాలి, సర్దుకుపోవాలి, లేకుంటే జీవితం వృధా అంటారు. 

అక్కడ సర్దుకుపోలేక పిల్లలు ఆత్మహత్య చేసుకుంటే అప్పుడు తల్లితండ్రి ఏడవటం మొదలెడతారు.

***********
కొందరు  పిల్లలు మత్తుమందులకు అలవాటు పడుతున్నారని ఈ మధ్య వార్తలు వచ్చాయి.  ఈ విషయాల గురించి  కొంతకాలం చర్చలు జరిగాయి. 

 ఇప్పుడు వరుసగా కొందరు ఆత్మహత్యలు జరిగాయి కాబట్టి చర్చలు జరుగుతున్నాయి. మళ్లీ సద్దుమణుగుతుందేమో .... 

ఇప్పుడు ఎవరికీ దేన్నీ పట్టించుకునే సమయం లేదు.

 చాలామంది తల్లితండ్రులకు తమ పిల్లల గురించి పట్టించుకునే సమయమే లేదు.
*******************
కాలేజీల వాళ్ళు తమకు ర్యాంకులే ముఖ్యం అన్నట్లు కాకుండా పిల్లల జీవితాలు కూడా ముఖ్యంగా పిల్లలను చూసుకోవాలి. 

తల్లితండ్రికి దూరంగా , తమను నమ్మి వచ్చిన పిల్లలను చక్కగా చూసుకోవాలి.

 ర్యాగింగ్ వంటివి జరగకుండా కఠినచర్యలు తీసుకోవటం, పిల్లలకు చదువు మధ్యలో ఆటవిడుపు ఇవ్వటం వంటి చర్యలు తీసుకోవాలి.  
**************

ఇక ప్రభుత్వాలు,   ర్యాగింగ్ వంటివి జరగకుండా కఠినచర్యలు తీసుకోవటం, చదువుకోవటానికి ప్రవేశసీట్ల కొరకు పెద్ద ఎత్తున పోటీ లేకుండా కాలేజీలలో సీట్ల సంఖ్య పెంచటం ..వంటి చర్యలు తీసుకోవాలి. 

ఎవరు  ఎన్ని చర్యలు తీసుకున్నా విషాద సంఘటనలు  జరగకుండా ఉండాలంటే   సమాజంలో నైతికవిలువలు పెరగాలి.

*******************
చక్కగా జీవించటానికి ఎన్నో వస్తువులు అవసరం లేదు. 

మన పాతకాలంలో ప్రజలు ఇన్ని వస్తువులు లేకపోయినా చక్కగానే జీవించారు. 

అయితే, ఇప్పుడు ప్రపంచం అనేక  భ్రమల్లో పయనిస్తోంది. 

పరిస్థితి చక్కబడాలంటే, భ్రమలనుండి బయటపడి సరైన దారిలోకి రావటం తప్ప వేరే దారిలేదు.