koodali

Sunday, January 12, 2025

మరికొన్ని విషయములు..

 

 మహా కుంభమేళా సందర్భముగా శుభాకాంక్షలండి.

***********

సమాజంలో అందరూ తమ బాధ్యతలను సరిగ్గా నిర్వహిస్తేనే సమాజంలో కష్టాలునష్టాలు తగ్గుతాయి....నైతికవిలువలకు, క్రమశిక్షణకు, శుభ్రతకు..అందరూ ప్రాధాన్యతను ఇవ్వాలి. 


సమాజం బాగుండాలంటే, చిన్నతనం నుంచే పిల్లలకు నైతికవిలువలను పాటించటం నేర్పించాలి. మంచి పౌరులుగా తయారుచేయాలి. 

 

 ఆధునికత పేరుతో పర్యావరణాన్ని  పాడు చేకూడదు.

 ఎక్కడపడితే అక్కడ చెత్త వేయటం, అన్ని ప్రదేశాలను మురికిచేయటం..వంటివి లేకుండా బాధ్యతగా ఉండాలి.

 ***********

భారతదేశంలో చాలామంది ప్రజలకు బస్సులు, రైళ్లు ఎక్కేటప్పుడూ, దేవాలయాలకు వెళ్లినప్పుడు, సినిమాలకు వెళ్ళినప్పుడు..ఇలా చాలాచోట్ల   నెట్టుకుంటూ  వెళ్లటం అలవాటయింది. చక్కగా ఒకరితర్వాత ఒకరు క్యూలో వెళ్తే మంచిది.

 

బస్సులు, రైళ్లు ఎక్కేటప్పుడూ....లోపలి వాళ్లు క్రిందకు దిగకముందే బయట ఉన్నవాళ్లు లోపలికి ఎక్కడానికి ప్రయత్నిస్తారు. ప్రయాణీకులు నెట్టుకోకుండా ఉండాలంటే, ప్రభుత్వాలు సరిపడినంత బస్సులు, రైళ్ళు వేయాలేమో... 

 

అయితే, కొన్ని బస్సులకు ఎక్కువమంది ప్రయాణీకులు ఉండరు. ప్రయాణీకులు లేక నష్టాలు వస్తున్నాయంటారు. కొన్ని బస్సులు కిక్కిరిసి ఉంటాయి. అలాంటప్పుడు ప్రయాణీకులు ప్రైవేట్ బస్సులను ఎక్కుతారు .రద్దీ ఎక్కువున్న రూట్లలో ఎక్కువ బస్సులు నడపాలి.

****************

 చాలామంది అధికారులు తమ పనిని తాము సక్రమంగా చేయటం లేదు. సమాజంలో అవినీతి, లంచగొండితనం, సోమరితనం, కుల, మత, ప్రాంతీయ..ద్వేషాలు ఎక్కువయ్యాయి.

 

 రాజకీయులను గమనిస్తే, అధికారం లోకి ఎలా రావాలా? అని కొందరు, అధికారం లోకి వచ్చిన తరువాత ప్రభుత్వం పడిపోకుండా ఎలా కాపాడుకోవాలో ? అని కొందరు, అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని ఎలా పడగొట్టాలా? అని కొందరు,...

 

 ఎన్నికలు జరిగి అధికారంలోకి వచ్చి, వెంటనే  తరువాత జరిగే ఎన్నికల్లో ఎలా గెలవాలో? అనే ఆలోచనలతో కొందరు..ఇలా ఎవరికి వారు  పొద్దుపుచ్చటంతోనే కాలం గడిచిపోతోంది. ఇక ప్రజల కొరకు ఏమైనా చేయడానికి ఎవరికీ సమయం సరిపోవటం లేదు మరి.

  ***********

ఈ రోజుల్లో చాలామంది మనుషుల్లో  పాపభీతి తగ్గింది.

 కుటుంబ వ్యవస్థ  సరిగ్గా లేదు.   చాలామంది   స్త్రీలు, పురుషులు బాధ్యతలు లేకుండా స్వేచ్చగా జీవించడానికి ఇష్టపడుతున్నారు.

 

సెల్ఫోన్లు వచ్చి,  సోషల్మీడియా అందరికీ అందుబాటులోకి వచ్చాక మంచితో పాటు చాలా చెడు జరుగుతోంది. 

  కొన్ని సినిమాలు, సీరియల్స్ వల్ల సమాజానికి చాలా హాని జరుగుతోంది.
 

ద్యం, మత్తు పదార్ధాలు,  అసభ్యకరమైన దృశ్యాలకు, రెచ్చగొట్టే వార్తలకు చాలామంది ఆకర్షితులవుతున్నారు.  వీటి వల్ల ఎన్నో నేరాలుఘోరాలు జరుగుతున్నాయి. వీటిని అరికట్టాలి.

***********

ఈ రోజుల్లో చాలామంది మాంసాహారాన్ని తినడం ఎక్కువయ్యింది.  మనుషులకు చిన్న దెబ్బ తగిలినా, కష్టం వచ్చినా..తట్టుకోలేరు.

 మరి పశుపక్ష్యాదులవి ప్రాణాలు కావా? మనుషులు ఇతర జీవులను హింసించినప్పుడు, వాటికీ నొప్పి, బాధ, భయం..ఉంటాయి కదా.

 

కొందరు మాంసాహారాన్ని తినకపోయినా , ఇతరజీవులకు హాని కలిగే విధంగా ప్రత్యక్షంగాకానీ, పరోక్షంగా కానీ ప్రవర్తిస్తారు.

 చాలామంది నిర్దాక్షిణ్యంగా పశుపక్ష్యాదులను చంపితింటారు. అయితే, తమకు ఏదైనా అనారోగ్యం వస్తే మాత్రం రక్షించమని దైవాన్ని కోరుకుంటారు. 

 

తాము ఇతరజీవులకు హాని చేస్తూ,   తాము మాత్రం ...నొప్పి, బాధ, భయం..లేకుండా జీవించాలని  ఆశపడటాన్ని ఏమనాలి?

పశుపక్ష్యాదులు  మూగజీవులు, బలహీనమైనవి కాబట్టి , మనుషులకు ఎదురుతిరగలేవు....అలా చనిపోయిన జీవుల ఉసురు తగిలి కూడా ప్రపంచంలో కష్టాలు వచ్చే పరిస్థితి ఉంటుంది.

****************

 మనశ్శాంతి కొరకు దైవపూజ చేసుకుందామంటే.. కొందరు,  ప్రతిదానికి అలా చేయకూడదు..ఇలానే చేయాలంటూ.. .లేదంటే అష్టకష్టాలు వస్తాయంటూ భయం కలిగేలా చెప్పేస్తుంటారు. ఇవన్నీ విని జనాలు అయోమయం అయిపోతున్నారు.

దేనికైనా నియమాలు తప్పకుండా ఉండాలి. అయితే, అవి అతిగా ఉంటే కష్టం. 


 ఇప్పటి సమాజంలో మనకు ఏం చేయాలన్నా అన్నీ సమస్యలు, సందేహాలు ఎక్కువైపోయాయి.

 అయితే,  కొందరు సమాజక్షేమం కొరకు ఎన్నో విషయాలను చక్కగా తెలియజేస్తారు.

*************

ప్రపంచంలో ప్రజలు కొందరు నూరేళ్ళు ఆరోగ్యంగా చక్కగా జీవిస్తున్నారట..వారిని పరిశీలిస్తే ..వాళ్లు రోజులో చాలా భాగం ఆరుబయట పనిచేసుకుంటారట. వారు కల్తీ లేని స్వచ్చమైన నీటిని.. ఆహారాన్ని తీసుకుంటారు కావచ్చు.

 
వారు..డబ్బు, సంపద, అధికారం కొరకు ఆరాటం లేకుండా జీవిస్తారు కావచ్చు... చక్కగా సులభంగా..హాయిగా దైవాన్ని ప్రార్ధించుకుంటారు కావచ్చు....పంతాలు, పట్టింపులు, కుల, మత, ప్రాంతీయ గొడవలు లేకుండా హాయిగా, సహజంగా జీవిస్తారు కావచ్చు....

 అందరూ నా మాటే వినాలని పట్టుదలలు, అధికారం కావాలని, బోలెడు డబ్బు సంపాదించాలని, బోలెడు వస్తువులు కొనాలని, కెరీర్లో ఎక్కడికో వెళ్ళిపోవాలని..  వారు తాపత్రయపడరేమో?

************

ప్రాచీన సనాతన భారతదేశంలో నైతికవిలువలతో కూడిన చక్కటి జీవనవిధానముండేది. చాలామంది వంద సంవత్సరాల పైన ఆరోగ్యంగా, చక్కగా జీవించేవారు.  ఈ మధ్య కాలంలో కూడా యోగులు కొందరు, కొన్ని వందల ఏళ్లు జీవించిన ఆధారాలున్నాయి.

***********

 మనం చక్కగా జీవించడానికి దైవం ఎన్నో సృష్టించి ఇచ్చారు. ఎన్నో మొక్కలు, కాయలు, పండ్లు, వరి, గోధుమ....వంటివి ఎన్నో సృష్టించారు. ....

ఎన్నో పువ్వులు, ప్రకృతి సుందర దృశ్యాలను కూడా సృష్టించారు. వీటన్నింటితో హాయిగా జీవించటం చేతకాక చాలామంది కష్టాలు పడుతున్నారు.

 **************

 లాస్ ఏంజలెస్ లో కార్చిచ్చు మండుతోంది. అంత పెద్ద దేశమైనా కూడా కార్చిచ్చు రగలకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవటం, వెంటనే ఆర్పటం చేయలేకపోతోంది..టెక్నాలజీతో ఏమైనా చేయొచ్చని కొందరు మాట్లాడతారు కానీ, టెక్నాలజీతో కొంతవరకే చేయగలం.... ప్రకృతి ముందు మనుషులెంత.. 

  *****************

చాలామంది డబ్బు, అధికారం..వంటివాటి కొరకు తాపత్రయపడుతూ సమాజాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు.

 లోకంలో సంపదంతా కొందరు తమవద్దే ఉండాలని తాపత్రయపడుతుంటారు. ఒక్క కుటుంబమే వందలకోట్లు ఏం చేసుకుంటారో? సమాజంలో ఉన్న సంపద ..అందరి వద్ద కూడా ఉంటే..లోకంలో పేదరికం ఉండదు కదా..

ప్రపంచవ్యాప్తంగా  ఎన్నో గొడవలు జరుగుతున్నాయి.

**********

 చాలామంది  మనుషులు చేస్తున్న పాపాలు చూసి దైవానికి విసుగు కలిగి, ఎవరికర్మ వారిదని ఊరుకుని ఉంటున్నారేమో?

  అందరూ జాగ్రత్తగా మనస్సును అదుపులో ఉంచుకుంటూ జీవించడానికి ప్రయత్నించాలి.

 కొందరు మేము ఏ పాపాలు చేయలేదంటారు. కొందరికి తాము చేసే తప్పులు తప్పులుగా అనిపించవు. 

**********

 అయితే,  ప్రపంచంలో ఎంతో మంచిచేసేవాళ్లు కూడా ఎందరో ఉన్నారు. చెడ్డగా ప్రవర్తించినా కూడా తప్పు తెలుసుకుని మంచిగా మారుతున్నవారూ ఉన్నారు.  అందరూ మంచిగా ఉంటారని ఆశిద్దాము.

 ***********

 అందరూ నీతిగా జీవిస్తే ప్రపంచంలో ఇన్ని నేరాలు..ఘోరాలు వు. 

 దైవాన్ని నమ్మి భక్తితో ఉండేవారు ఎవరైనా మంచిగా జీవించాలి.  దైవభక్తి కలిగి ధర్మబద్ధంగా జీవించటానికి ప్రయత్నించాలి...అప్పుడే దైవకృపను పొందగలరు.

 లోకం అంతా ఎప్పుడూ శాంతిగా ఉండాలని కోరుకుంటున్నాను.


No comments:

Post a Comment