koodali

Friday, November 23, 2012

అజామిళుని కధ. వంటి కధలను చెప్పటంలో.......


* పురాణేతిహాసాలలోని   చరిత్రలను  తెలుసుకుంటుంటే,   దైవము మరియు   పెద్దలు  మన  కోసము   ఎంతగా   ఆలోచిస్తారో కదా  !  అనిపిస్తుంది. ప్రపంచములోని   ప్రతి ఒక్కరూ  మంచి   ప్రవర్తనను  కలిగి   దైవానికి   దగ్గరవ్వాలని (  మోక్షాన్ని  పొందాలని  ) వారి   అభిప్రాయం.

* ప్రపంచములో రకరకముల మనస్తత్వముల వాళ్ళు ఉంటారు  , ఎన్నో రకాల పరిస్థితులు ఉంటాయి. ఒక్కొక్క వ్యక్తితో   ఒక్కో విధముగా    ప్రవర్తించవలసి ఉంటుంది.   అందుకే  ప్రాచీనులు  రకరకాల  కధలను  తెలియజేసారు.

* ప్రాచీన  గ్రంధాలలోని  కొన్ని   కధలలో  దైవ  నామాన్ని  స్మరించటం  వల్ల,   ఎన్నో   పాపాలు  చేసిన  వాళ్ళు  కూడా  నరకానికి  పోకుండా  స్వర్గానికి  వెళ్తారు.  అని  ఉంటుంది.  ఉదా..
అజామిళుని  కధ.  

* అజామిళుడు   ఎన్నో  పాపాలు  చేసాడు.  అయితే,   మరణించే  ముందు ,  నారాయణా.....అని    కొడుకు  పేరును  పిలవటం  వల్ల  నరకానికి  బదులు  స్వర్గానికి  వెళ్ళాడని  కధలో  ఉన్నది. 
 
* మరి  కొందరు వ్యక్తులు   ఎన్నో  పాపాలు  చేసినా , మరణానికి  ముందు   అనుకోకుండా  శివాలయంలో  దీపపు  వత్తిని  వెలిగించటం  వల్ల    నరకానికి  బదులు  స్వర్గానికి  వెళ్ళారని  కధలో  ఉన్నది.

* (   ఇలాంటి  వాళ్ళు   చివరిలో  అనుకోకుండా  దైవనామస్మరణ  చెయ్యటానికి   కొన్ని  కారణాలు  ఉండవచ్చు.  ఉదా...బహుశా  వీళ్ళు   పూర్వజన్మలో   చేసిన  పుణ్యం  వల్లకానీ,  వీరి  తల్లితండ్రులు  చేసిన  పుణ్యం  వల్ల  కానీ  వీరికి  అనుకోకుండా  దైవస్మరణ  చేసే  అవకాశం  లభిస్తుందేమో అనిపిస్తుంది.  )


అజామీళుడు  వివాహం  చేసుకున్న  ఆమెకు  అంతకు  ముందే  ఒక  కూతురు  ఉన్నదట.  (  ఆమెకు   మొదటి  భర్త  వల్ల   పుట్టిన  అమ్మాయి.  )   భార్య  మరణించిన  తరువాత  అజామీళుడు  భార్య  యొక్క  కూతుర్ని  వివాహం  చేసుకుంటాడు. . ఈ  అమ్మాయి  అతడి  సొంతకూతురు  కాదు. సొంతకూతురు  కాకపోయినా,  అతడు  చేసినది  పెద్ద  తప్పే. 

* ప్రాచీనులు , 
అజామిళుని  కధ   వంటి   కధలను   చెప్పటంలో  ఎన్నో  అర్ధాలున్నాయి.

* ఎన్ని  పాపాలు  చేసిన  వారికైనా   మంచిగా   పరివర్తన   చెందటానికి  కొంత  అవకాశం  కలిగించాలని  పెద్దల  అభిప్రాయం  కావచ్చు.  ఇలాంటి  ఆశ  లేకపోతే    పాపాత్ములు  నిరాశానిస్పృహలతో    మరింతగా  పాపాలు  చేసే  అవకాశం  కూడా  ఉంది.


* కొందరు  అనేక  చెడ్డపనులు  చేస్తూ  ఉంటారు.  అయినా  వారికి  మనస్సులో  ఒక  మూలన  కొంచెం  పాపభీతి  ఉండే  అవకాశం  ఉంది. వాళ్ళు  ఎన్నో పాపాలు చేసిన   తరువాత   తమ  తప్పు   తెలుసుకుని,   అయ్యో !  మనకు దైవ పూజ చేసి  ఉత్తమగతులు  పొందే   అర్హత ఉందో  ? లేదో  ?  అనుకుంటారు.



* ఇలాంటి  వాళ్ళకు    కూడా  దైవపరమైన  ఆశను  కలిగించి,   మంచిమార్గంలోకి  వచ్చే  విధంగా  చేస్తాయి  ఇలాంటి  కధలు. 


* అజామిళుడి  వంటి  పాపాత్ముడే  నారాయణ  నామస్మరణం  చేత  నరకానికి  బదులు  స్వర్గానికి  వెళ్ళాడనే  కధను  చదివిన  కొందరు  చెడ్డవాళ్ళకు  ............ తాము  కూడా  నారాయణ  నామ  స్మరణం  చేస్తే,   మరణించిన  తరువాత నరకానికి  బదులు స్వర్గానికి  వెళ్ళవచ్చు  కదా  !  అనే  ఆలోచన  మొదలవుతుంది.  



* ( ఎన్ని  తప్పులు  చేసిన  వాళ్లకయినా   నరకానికి  వెళ్ళటం  అంటే  ఇష్టం  ఉండదు  కదా ! )


* ఇలాంటి  వాళ్ళు  కూడా     దైవ  నామ  స్మరణాన్ని  ,  పూజలు  చేయటాన్ని  మొదలుపెట్టి ,   అలా   పూజలు  చేస్తూచేస్తూ....  ఉండటం   వల్ల  క్రమంగా  ఆ  పాపాత్ములలో  మార్పు  వచ్చి  మంచిగా  పరివర్తన  చెందుతారు.



* మందులు  మనకు  ఇష్టం  ఉండి  వేసుకున్నా,  ఇష్టం  లేక  మ్రింగినా   అనారోగ్యాన్ని  పోగొడతాయి  కదా  !  అలాగే  ఏ  కారణంతో  దైవనామస్మరణాన్ని  మొదలుపెట్టినా   ఫలితం  లభిస్తుంది.  

అయితే  దైవనామ  స్మరణం  చేసే  వ్యక్తి  యొక్క  భక్తిశ్రద్ధలు ,  నీతినిజాయితీలను  బట్టి  ఫలితాల్లో  ముందువెనుక  తేడాలుంటాయి.  కొందరికి  శీఘ్రంగా  మంచి  ఫలితాలు  కనిపిస్తాయి.  కొందరికి  ఒక  జన్మలో  మంచి  మార్పు  కనిపిస్తే,   మరి  కొందరిలో  కొన్ని  జన్మలు  పట్టవచ్చు.  


*  డాక్టరు  తన  వద్దకు  వచ్చిన  పది  మంది  రోగులకు  ఒకే రకం   మందులను  ఇచ్చినా ,  ఆ  రోగులు  సక్రమంగా  మందులను వేసుకోవటం,  సక్రమంగా  పధ్యాన్ని  పాటించే  విధానాలను   బట్టి  వారి  వ్యాధులు   తగ్గే  సమయంలో  ముందువెనుక  తేడాలుంటాయి.   కొందరికి   రోగం  త్వరగా  తగ్గుతుంది.  కొందరికి   ఆలస్యంగా  తగ్గుతుంది.  మందులు   సరిగ్గా  వేసుకోకుండా,  పధ్యం  సరిగ్గా  పాటించని  వారికి  రోగం  త్వరగా  తగ్గకపోవచ్చు  కూడా.



* ఈ   కధలను  విని  , జీవితమంతా  పాపాలు  చేస్తూ   కొద్దిగా   దైవనామాన్ని  స్మరించితే  చాలు....  ఇక  పాపాలన్నీ  పోయి,  స్వర్గానికి  వెళతాం  కాబోలు .... అని    అపార్ధం  చేసుకోకూడదు .


*  తప్పులు  చేసినవాళ్ళు  తాము  చేసిన  తప్పులకు  పశ్చాత్తాపపడి,   ఇకనుంచి    చెడ్డపనులను  చేయటం  మాని,  పుణ్యకార్యాలు  చేయటం  మొదలుపెడితే ,  అప్పుడు  వారికి  పడే  శిక్ష  గణనీయంగా  తగ్గే  అవకాశం  ఉంది. 


* అంతే  కానీ,  ఎన్ని  పాపాలు  చేసినా  ఫర్లేదు ,   కొన్ని   పుణ్యకార్యాలు  చేస్తే  చాలు ..  చేసిన  పాపాలు  కొట్టుకుపోతాయి  అనుకోకూడదు. 


*  అలాగైతే  రావణాసురుడు  
కూడా  పూజలు    చేసాడు. అతను    దైవపూజలు    చేసాడు  కదా  !  క్షమించేద్దాంలే.......  అని  దైవం  అనుకోలేదు.  ఎన్ని  పూజలు  చేసినా  కూడా ,  రావణుడు  తాను  చేసిన  తప్పులకు  చివరికి  నాశనం  అయ్యాడు. 

* అందుకని  ఒక  చేత్తో    పూజలూ  చేస్తూనే,   ఇంకో చేత్తో    పాపాలు  చేయటం ..... అనే  మనుషుల  అతితెలివి  విధానం  మంచిది  కాదు.

 ..................

*చేసిన  తప్పులకు  పశ్చాత్తాపపడి,  ఇక ముందు  పాపాలు  చేయకూడదని  భావించి , మంచి  మార్గంలోకి  రావాలనుకునే  వారికోసం,  వారిలో  మంచి  మార్పు  కోసం   ఇలాంటి  కధలను  పెద్దలు  అందించారు  అంతే కానీ  ,  చేసిన  తప్పులకు  పశ్చాత్తాపడకుండా , పూజలు  చేస్తూనే    మళ్ళీ  మళ్ళీ  చెడ్డపనులు  చెయ్యాలనుకునే  వారి  కోసం  ఇలాంటి  కధలు  చెప్పబడలేదు.

..................................

* దైవం  ఎంతో  దయామయుడు.   వ్యక్తులు  కొన్ని   తప్పులు  చేసినా  ఓపికగా  ఉండి,  వ్యక్తులలో  మార్పు  రానప్పుడు,  ఇక  శిక్షను  విధిస్తారు. 


*  (  శిక్షను  విధించటం  కూడా  వ్యక్తుల  మంచికోసమే.  వారు  మరిన్ని  పాపాలు  చేయకుండా  ఉండటానికే.  )

* శ్రీకృష్ణుడు  శిశుపాలుని  నూరు  తప్పుల  వరకూ  క్షమించి,   అప్పుడు  సంహరించారు.

*  హనుమంతుడు,  అంగదుడు,    లంకకు  వెళ్ళి  హితవు  చెప్పినా  కూడా   రావణుడు  వినిపించుకోలేదు.  రాములవారి  వద్దకు  సీతాదేవిని  పంపించలేదు.  అప్పుడు   ఇక,   రాముడు  రావణుని  సంహరించటం  జరిగింది.

...............................
* అందుకని ,     తెలిసోతెలియకో   తప్పులు  చేసినా    సరిదిద్దుకుని , ఇక  ముందు  తప్పులు  చేయకుండా  ఉండటానికి  ప్రయత్నించాలి.   జీవితంలో  సరైన  దారిలో  నడిచే  శక్తిని  ఇవ్వమని   భగవంతుని  ప్రార్ధించాలి.
...............................

 

2 comments:

  1. అందుకని ఒక చేత్తో పూజలూ చేస్తూనే, ఇంకో చేత్తో పాపాలు చేయటం ..... అనే మనుషుల అతితెలివి విధానం మంచిది కాదు.


    పాపం చేస్తున్నారు, అందులో వాటాగా రత్న కిరీటాలు వెంకన్నకి సమర్పిస్తున్నారు.నేటి కాలంలో ఇంతేనేమో

    ReplyDelete
  2. నిజమేనండి. ఈ రోజుల్లో కొందరు , పాపాలు చేసి ఆ సొమ్ముతో హుండీలో కానుకలను సమర్పిస్తున్నారు. బంగారు గనులనే సృష్టించిన దైవానికి ఇవన్నీ ఒక లెక్కలోనివి కాదు.

    కానుకల విలువను బట్టి కాకుండా, భక్తులకు గల నిజమైన భక్తి, నీతినిజాయితీలను బట్టి దైవానుగ్రహం ఉంటుందని ఇటువంటి ప్రజలు తెలుసుకుంటే బాగుండు.

    మీరు ఒక వ్యాఖ్యలో చెప్పినట్లు, ......గ్రంధాలను మనకుగా మనం చదివి తెలుసుకుంటే చాలా విషయాలు తెలుస్తాయి.

    మా ఇంట్లో శ్రీ దేవీ భాగవతము మరియు కొన్ని పుస్తకాలు ఉన్నాయండి.

    రామాయణ, భారత, భాగవత పుస్తకాలు ప్రతి ఇంట్లో ఉండాలని మీరు చెప్పిన అభిప్రాయం బాగుందండి. మీ అభిప్రాయం చదివిన తరువాత మా ఇంట్లో కూడా ఆ పుస్తకాలు ఉంటే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. అంతా దైవం దయ.

    మీకు కృతజ్ఞతలండి.

    ReplyDelete