koodali

Monday, May 14, 2012

గ్రంధాలలో ఉన్న విషయపరిజ్ఞానం అనంతం....



విజయవాడ  వెళ్ళామండి. ఇంద్రకీలాద్రిపై  కొలువున్న   అమ్మవారిఅయ్యవారి ( దుర్గాదేవి దుర్గామల్లేశ్వరస్వామివారి ) దర్శనం   చేసుకుని  ఈ  రోజు  ఉదయమే  తిరిగి    వచ్చాము. .  ఈ  రెండురోజులు  బ్లాగ్  చూడటం  కుదరలేదు. 
....................

గ్రంధాలలో  ఉన్న  విషయపరిజ్ఞానం   అనంతం  అనిపిస్తుంది. 

గ్రంధాలలో  ఉన్నకొన్ని  విషయాలు....అక్కడక్కడా...
.........................................


సృష్టికి  ఆదిలో  త్రిమూర్తులు  ఆదిపరాశక్తిని  దర్శించి  స్తుతించారు.  అప్పుడు  జగదీశ్వరి  వారికి  ఎన్నో  విషయాలను  తెలియజేయటం  జరిగింది.  ఇంకా  ఆ  ముగ్గురికీ    మూడు  శక్తులను    (  బ్రహ్మ  విష్ణు   మహేశ్వరులకు......   సరస్వతీ  లక్ష్మీ  గౌరీ  ( మహాకాళీ  ) శక్తులను )బహుకరించి.........ఎన్నో  విషయాలను  వివరించి,  .....

.............విషమ  పరిస్థితి ఏదైనా  ఎదురైనప్పుడు  నన్ను  స్మరించండి.  స్మరణ  మాత్రం  చేతనే  నేను  మీకు  దర్శనం  అనుగ్రహిస్తాను.    అలాగే  సనాతనుడైన   పరమాత్మను  కూడా  తలుచుకోండి.  మా  ఇద్దరినీ  తలుచుకుంటే  మీకు  కార్యసిద్ధి నిస్సంశయంగా   కలుగుతుంది........... అని  కూడా  చెప్పటం  జరిగింది. 
....................................

శ్రీరాముడు  నారదుల వారిని  దేవీప్రభావాన్ని  తెలియజేయమని  అడిగినప్పుడు  నారదుడు  దేవి  గురించి  ఎన్నో  విషయాలను  రామునితో  చెప్పటం  జరిగింది.  

కొన్ని  విషయాలు....విష్ణుమూర్తిలో  పాలన శక్తి  ఆమె. బ్రహ్మలో     సృజనశక్తి  ఆమె. రుద్రుడిలో  సంహారకశక్తి  ఆమె.  ఈ  సృష్టిలో  ఏ  చిన్న  వస్తువైనా  సరే  అది  ఆవిడ  శక్తియే.  ఆవిడ  ఉత్పత్తియే.   ఈ  త్రిమూర్తులూ ఈ  సూర్యచంద్రులూ   ఈ  భూగోళం  ఏవీ  లేనప్పుడు  కూడా  ఈ  మహాదేవి  పూర్ణప్రకృతిగా  పరాత్పరుడితో  కలిసి  విహరిస్తూ ఉంటుంది.  నిర్గుణస్వరూప  తాను  సగుణస్వరూపగా  మారి  ముల్లోకాలనూ  సృష్టిస్తోంది.....బ్రహ్మాదులను  సృష్టించి  వారికి  తన  శక్తులను   ప్రసాదించి  లోక  సృష్టిని  నిర్వహింపజేస్తోంది....అని  నారదులవారు    ఎన్నో  విషయాలను  తెలియజేసారు. 

 తరువాత  శ్రీరాముడు  దేవీ  నవరాత్ర  వ్రతం   చేసి     దేవిని  పూజించి   .....తరువాత   రావణుని  సంహరించి  ,    రాజ్యపాలనను    స్వీకరించి  ప్రజలకు  చక్కటి  పాలనను  అందించారు.
.......................................

నారాయణమహర్షి  నారదమహర్షితో  చెప్పిన  విషయాలలోని  కొన్ని  విషయాలు. 

 నారదా  !  ఆత్మ  నిత్యం.  ఆకాశం  నిత్యం.  కాలం  నిత్యం.  దిక్కులు  నిత్యం.  అలాగే  ఈ  విశ్వంలో  గోలోకం  నిత్యం. అందులో  ఒక  ప్రదేశమే   వైకుంఠం. అలాగే  ప్రకృతి  - నిత్యం.  అది  బ్రహ్మలీల.  సనాతనం.  అగ్నికి  వేడిమి  ,  చంద్రుడికి  వెన్నెల  ,  పద్మానికి  శోభ,  సూర్యుడికి  ప్రకాశం       ఎలా  అవిభాజ్యాలూ  అవిభక్తాలూ  అభిన్నాలో   అలాగే  (  పరమ  )  ఆత్మ  -  ప్రకృతి  రెండూ  అభిన్నాలు....ఇలా  ఎన్నో  విషయాలను  చెప్పటం  జరిగింది.
..........................................


సృష్టికి  మొదట  ప్రకృతితో    కలిసి   పరమాత్మ   ద్వివిధ రూపం   ధరించాడు. (  అర్ధనారీశ్వరుడు.  )  ఈ  రూపంలో  దక్షిణ  భాగం  పురుషుడు.  వామభాగం  ప్రకృతి.  ఇదే  పరబ్రహ్మ  స్వరూపం.  ఇదే  నిత్యం.  ఇదే  సనాతనం.  అగ్నికి  దాహకశక్తి  ఎలా  భిన్నం  కాదో   అలాగే  ఆత్మకు   శక్తి (  ప్రకృతి  )  భిన్నం  కాదు.  అందుకే  యోగులకు  స్త్రీపురుష  భేదభావన  వుండదు.  వారికి  అంతా  బ్రహ్మమయంగానే  కనిపిస్తుంది. 


 నారాయణ  ముని  ఈ  విషయాలన్నింటినీ  నారదుడికి  చెప్పి ,  ఆయన  కోరిక  మీద  దేవిని  ఎలా  ఆరాధించాలో   వివరించినట్లు  వ్యాసుడు  జనమేజయునికి  తెలియజేశాడు. 
..............................

శ్రీ  దేవీ  భాగవతము  గ్రంధంలో  మణిద్వీపం  గురించి  చక్కగా  వర్ణించారు.
................................
 గ్రంధాలలో  ఉన్న  విషయపరిజ్ఞానం   అనంతం  అనిపిస్తుంది. 

వ్రాసిన  విషయాలలో  ఏమైనా  పొరపాటుగా  వ్రాస్తే  దయచేసి  క్షమించాలని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను..

......................

No comments:

Post a Comment