koodali

Friday, August 6, 2010

లోకం సంతోషముగా ఉంటేనే జగన్మాతా పితరులకు సంతోషం .......

 
ఓం.

తల్లిదండ్రులను ఎవరయినా తప్పక గౌరవించాలి. నేను కూడా మాతల్లిదండ్రులంటే గౌరవిస్తానండి. అయితే ఇక్కడ ముఖ్యముగా చెప్పుకోవటం పేరెంట్స్ అవినీతిపరులైనప్పుడు వారి పిల్లల ధర్మం ఏమిటి? అని .కదా..


 కొంతమంది పిల్లలు తల్లిదండ్రులను అగౌరవంగా చూస్తూ తాము పూజలు అవీ బాగా చేసేస్తుంటారు. వీరికి తమపిల్లలు పెద్దయితే అప్పుడు తత్వం తెలిసివస్తుంది. పూజలు చెయ్యండి కానీ , పేరెంట్స్ ను చూడకపోవటం ఏమి ధర్మం ?



గణాధిపత్యం కొరకు గజాననుడు,కుమారస్వామికి మధ్య పోటీ జరిగినప్పుడు శివుడు
వినాయకునితో తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేస్తే మూడు లోకాలు చుట్టివచ్చినంత ఫలితం కలుగుతుందని తెలియచేసారు. మనము తల్లిదండ్రులను తప్పక గౌరవించాలి .


ప్రహ్లాదుడు కూడా తండ్రిని అగౌరవపరచలేదు. తండ్రి చెప్పినట్లు శ్రీహరిని దూషించలేదు అంతే.



అధర్మపరులైన తల్లిదండ్రుల ఆజ్ఞలను మనం పాటించి అధర్మ మార్గములో నడిచినట్లయితే, 

 మరి జగన్మాతాపితరుల మాట ఏమిటి ?  వారు మనకు ఎన్నో జన్మలనుంచి మాతా పితరులు కదా.


.మన అధర్మం వల్ల లోకం అంతా కష్టాలు, బాధలు పడుతుంటే మన జగన్మాతా పితరులు ఎంత బాధ పడతారు .... వారి పట్ల మన ధర్మం మాట ఏమిటి ? వారిని సంతోష పెట్టటం మన ధర్మం కాదా ?



మనము మంచిపనులు చేయటం ద్వారా మాత్రమే జగన్మాతాపితరులు మరియు ఈ జన్మలోని మన మాతాపితరులకు మనం న్యాయం చేసినవాళ్ళమవుతాము. ఈ కాలం పిల్లలు మంచిమార్గములో నడవటంవల్ల తమ తల్లిదండ్రులను కూడా పున్నామ నరకం నుండి రక్షించిన వాళ్ళవుతారు.


ఇంకొక సంగతి. ఉత్తములైన తల్లిదండ్రులు గానీ, గురువులు గానీ మనకు ఇచ్చే ఆజ్ఞలు ఒకోసారి విపరీతముగా అనిపించవచ్చు. ఉదా; శ్రీదత్తాత్రేయస్వామివారు శిష్యుల భక్తిని ఇలాగే పరీక్షించేవారట.


సాయిబాబా కూడా ఒకసారి కాకాసాహెబుదీక్షిత్ అనబడే తన బ్రాహ్మణ శిష్యుని ఒకముసలి మేకను వధించమన్నారు. ఆయన మారుమాట్లాడక సాయి మీద అచంచలవిశ్వాసముతో కత్తి పైకెత్తగా ఆఖరు క్షణములో సాయి ఆ మేకను చంపకుండా అడ్డుకున్నారట.



ఇలా ఉత్తములైన మహాత్ముల ఆజ్ఞను ఎవరైనా తప్పక పాటించితే వారికి మంచి జరుగుతుంది. ఎందుకంటే ఇటువంటి మహాత్ముల ఆజ్ఞల వెనుక ఏదో ఒక పరమార్ధం ఉంటుంది.



ఇక ఎవరయినా సరే తాము చేసిన తప్పులకు పశ్చాత్తాపపడి మంచిగామారినప్పుడు ఆ భగవంతుడు వారిని తప్పక క్షమిస్తారు. వారిని మనము ఉత్తములుగానే భావించాలి..


నాకు ఇంకొకటి అనిపించిందండి. అందరి పిల్లలకు ప్రహ్లాదుడంతటి నిబ్బరం ఉండకపోవచ్చు. 



 తల్లిదండ్రుల కొరకు తప్పక ....... ఇలా ఇంద్రజిత్తులా అర్ధంతరంగా ఎవరయినా మరణించారనుకోండి ? వారికి ఏ ఫలితం వస్తుంది అని . ఇలాంటివారికి వీరస్వర్గం , అంటే స్వర్గనివాసం కలుగవచ్చు. { ఇది నిజమో కాదో నాకు తెలియదు కేవలం నా ఊహ. .} లేక ముందు చేసిన పాపాలకు నరకం కూడా పొందవచ్చు.


స్వర్గ లోక నివాసం శాశ్వతంకాదు. దానికి కాలపరిమితి ఉంటుంది. వారు మరల కర్మఫలముతో కూడిన జననమరణ మార్గములో పడి మళ్ళీ జన్మను ఎత్తుతారు.


ప్రహ్లాదుల లాంటివారికి కర్మఫలముతో సంబంధము లేని మహాత్ముల జన్మ లభిస్తుంది. వారు లోకమును ఉధ్ధరించుటకు మాత్రమే జన్మను పొందుతారు. రాఘవేంద్రస్వామి ప్రహ్లాదుల వారి అవతారమని పెద్దలు చెబుతున్నారు.


. మరి ప్రహ్లాదుల వారి కోసం శ్రీ నరసింహస్వామి వారే ఆవిర్భవించారు. . 



 గీతలో శ్రీకృష్ణపరమాత్మ రాక్షసులలో తాను ప్రహ్లాదుడనని తెలియచేశారు గదా...


.ఇంద్రజిత్తు బాధ్యతా తల్లితండ్రుల వరకే పరిమితమయినది.



ప్రహ్లాదుల వారి మార్గం తల్లితండ్రుల యందు బాధ్యతా, దైవభక్తి, మరియు లోకం యందు బాధ్యతా..


అప్పుడు ఇంద్రజిత్తు కన్నా ప్రహ్లాదులవారి మార్గం గొప్పది కదా.


స్వర్గమును పొందటము కన్నా పరమాత్మను పొందటం ఎంతో గొప్ప..

ప్రహ్లాదుల వారు పరమాత్మను పొందారు..


ఇంద్రజిత్తులా అర్ధాంతరముగా మరణించి స్వర్గమును పొందుటకన్నా... ప్రహ్లాదునిలా చిరకాలం జీవించి లోకములో ధర్మమును రక్షించి పరమాత్మను పొందుట మిన్న.



ఉత్తములైన వారి మార్గమును మనము అనుసరించవలెను. అధర్మపరులైనవారు ఎంత దగ్గరవారయినా వారి మార్గమును మనము అనుసరించనక్కరలేదు.. మనకు దారి తెలియనప్పుడు దైవాన్ని ప్రార్ధించుట వలన తప్పక ఆయన దారి చూపిస్తారు.
 


No comments:

Post a Comment