koodali

Sunday, August 27, 2023

పాలు, తేనె వంటివి శాకాహారం ఎలా అవుతాయి?..హింస..అహింస..

 

వీగన్ అనే వారు పాలు, నేయి, పెరుగు..వంటివి కూడా తినరు. ఇవి కూడా జంతువుల నుంచి వచ్చినవే అని వారు తినరు. పాలు జంతువుల రక్తం నుంచి తయారయ్యే పదార్ధమే అని వైజ్ఞానిక పరిశోధనలో తేలిందని, అందువల్ల అవి శాకాహారం ఎలా అవుతుందని అంటారు. 

  శాకాహారం అంటే కూరగాయలు,పండ్లు,ఆకుకూరలు, కొన్నిరకాల దుంపలు..ఇలా మొక్కలు, చెట్లనుంచివచ్చేవి.

మరి.. పాలు, తేనె వంటివి శాకాహారం ఎలా అవుతాయి? తేనెను పిండే సమయంలో కొన్నిసార్లు  ఆ తేనెటీగలు చనిపోయి తేనెలో ఉండే అవకాశం ఉంది. పాల ఉత్పత్తులు, తేనె..వంటివి ఆహారంగా తీసుకునేవారిని శాకాహారులని ఎందుకు అనాలి? 

 కొందరు ఏమంటున్నారంటే, మనుషులు కూడా చిన్నతనంలో తల్లిపాలు త్రాగుతారు, అలాంటప్పుడు తల్లిరక్తం త్రాగినట్లు కాదు కదా..అని వాదిస్తుంటారు. పెద్దవారు పాలు త్రాగటానికీ, చంటిపిల్లలు పాలుత్రాగటానికి పోలిక ఏమిటి? 

 తల్లిపాలు త్రాగే చంటిపిల్లలు కొద్దిగా త్రాగుతారు. చంటిపిల్లలు పాలు తప్ప వేరే ఆహారం తినలేరు కాబట్టి పాలు త్రాగుతారు. బడితల్లాగా పెద్దయిన వారుకూడా కాఫీలు, టీలు, పాలతో చేసిన స్వీట్స్ రుచికి అలవాటు పడి పాలపదార్ధాలు వాడుతున్నారు. 

 ఇక ప్రసాదాల్లో పాలు, నెయ్యి, పెరుగు..వాడమని గ్రంధాలలో చెప్పారు ..అంటారు. నిజమే చెప్పారు, ఆ కాలంలో పశువులు ధారాళంగా పాలను ఇచ్చిన రోజుల్లో వాటిదూడలు త్రాగగా ఇంకా పాలు మిగిలిఉండేవి. వాటిని పిండుకుని పాలు, నెయ్యి, పెరుగు చేసుకుని ప్రసాదం తయారుచేసి దైవానికి నివేదించి ప్రసాదం స్వీకరించేవారు. 

 ఈ రోజుల్లో మనుషుల రుచులు పెరిగి, పాలను విరిచి పన్నీరులు, కాఫీలు, టీలు తయారీకి ఎన్ని పాలు కూడా సరిపోక పశువులకు హార్మోన్స్ ఇచ్చి కొన్నిచోట్ల వాటి దూడలను చంపి, మిషన్ల ద్వారా పాలను పిండుతున్నారు. ఇదేమి న్యాయమో ఆలోచించండి. 

 నువ్వులు వంటివాటిలో పాలకంటే ఎక్కువ కాల్షియం ఉంటుందని ఎందరో చెబుతున్నారు.

 ప్రసాదం అంటే తగుమాత్రం పుచ్చుకున్నా చాలు. అప్పుడు అందరికీ కొద్దిగా పాలు, నేయి, పెరుగు..సరిపోతాయి. అంతేకానీ భారీఎత్తున ప్రసాదాలు తయారుచేసి బోలెడంత  తినమని  వారి అభిప్రాయమని నాకు అనిపించటం లేదు .  మనం రోజూ తినే భోజనాన్ని కూడా తినేముందు దైవానికి నివేదించి తినవచ్చు. ఇది ఇంకోరకం ప్రసాదం.దీనిని కడుపునిండా తినవచ్చు. 

అయినా మనకోసం ఇతర జీవులను ఇంతలా ఎందుకు బాధపెట్టాలి? 

  శాకాహారం కాని పాల ఉత్పత్తులు, తేనె వంటి వాటిని ఆహారంగా తీసుకుంటున్నప్పుడు,    శాకాహారులని ఎందుకు అంటారని సందేహం.

 
శాకాహారాన్ని కూడా ఎంతవరకో అంతవరకే తినాలి. రుచికొరకు అదేపనిగా తినటం కూడా తప్పే. అదేపనిగా తినటం వల్ల అనారోగ్యం కూడా వస్తుంది. పిల్లలు, యుక్తవయస్సు వారు సరిపడినంత పుష్టికరమైన ఆహారాన్ని తీసుకోవాలి. పెద్దవయస్సు వచ్చినతరువాత రుచికొరకు బోలెడు ఆహారాన్ని తినటం మంచిదికాదు.

 ..... 

సాత్వికాహారం,రాజసాహారం, తామసాహారం..అని కూడా ఉన్నాయి. సాత్వికాహార నియమాలు పాటించటం చాలా  కష్టం. చద్దివి, నిల్వ ఉన్నవి,  ఎక్కువగా వేయించిన వేపుళ్లు..వంటివి తినటం కూడా తామసాహారం కోవలోకే  వస్తుందంటారు. ... ఇంకా చాలా ఉన్నాయి. న్యాయార్జిత సొమ్ముతో సంపాదించిన ఆహారం కూడా తామసాహారమే.

  .......

పశువులు ఏమైనా చనిపోతే వాటి శరీరాలను పూడ్చవచ్చు, దహనం చేయవచ్చు. లేదంటే ఇతర పశుపక్ష్యాదులకు ఆహారంగా అలా బయట వదిలేయవచ్చు..వాటిని మనుషులు తినవలసిన అవసరం లేదు.

  ప్రాచీనకాలంలో రాజులు, సైనికులు యుద్ధాలలో శత్రువులను చంపవలసి వచ్చేది. సౌమ్యులుగా ఉండేవారు చంపలేరు. వారికి కొంత కఠినత్వం రావటానికి ..వేటకు వెళ్ళటం, జంతువులను చంపటం.. జరిగాయని అనిపిస్తుంది. యుద్ధసమయంలో కొన్నిసార్లు ఆహారం సరిగ్గా దొరకని సందర్భాలలో..  దొరికిన జంతువులను చంపి తినటం తప్పనిసరి అవుతుంది కాబట్టి,  అలా కూడా వారు మాంసాహారాన్ని అలవాటుచేసుకుని ఉండవచ్చన్నది నా అభిప్రాయం.

అయితే,  వేట అలవాటు వల్ల  దశరధ మహారాజు , పాండుమహారాజు.. కష్టాల పాలయ్యారు.


అయితే, మనుషులు తమలో తాము యుద్ధాలు చేసుకుని అందుకొరకు జంతువులను చంపటం క్రూరత్వమే.  తమపై దండెత్తివచ్చిన క్రూరులైన శత్రువులను చూస్తే ఆవేశం దానికదే ఉప్పొంగి శత్రుసంహారం చేస్తారు. అందుకొరకు మూగజీవులను చంపవలసిన అవసరం లేదు.  తమ మనస్సును అదుపులో ఉంచుకున్న వారే వీరులు. అంతేకానీ, మూగజీవులను చంపటం వీరత్వం కాదు.

 

 సృష్టిలో పర్యావరణ సమతౌల్యం కొరకు  మొక్కలను జంతువులు తినటం, చిన్న జంతువులను పెద్ద జంతువులు తినటం ఉంది. ఎందుకంటే, మొక్కలు అన్నీ బ్రతికి పెరిగి పెద్దవయితే దగ్గరదగ్గరగా ఉండి బలంగా పెరగవు. భూసారం సరిపోదు. జంతువులు అన్నీ బ్రతికి, పెరిగితే వాటికి ఆహారం సరిపోదు. అందుకే జంతువులు ఒకదానిని మరొకటి తింటాయి.

సమతౌల్యం కొరకు మనుషులు జంతువులను తినే అవసరం లేదు.అయితే రుచి కొరకు తింటారు. మనుషులు పశుపక్ష్యాదులను పెంచి,  మరీ తింటున్నారు.

ఈ రోజుల్లో చాలామంది పర్యావరణాన్ని పాడుచేస్తున్నారు. ఇందువల్ల, కొన్ని జీవజాతులు అంతరించే పరిస్థితి వచ్చిందంటున్నారు. పర్యావరణంలో సమతౌల్యత ఉండాలంటే మానవుల జనాభా తగ్గాలి...


జగదీశ్చంద్ర బోస్ అనే శాస్త్రవేత్త మొక్కలకూ ప్రాణం ఉందని, కొంత స్పందిస్తాయని కనిపెట్టారు. ఈ విషయాన్ని  చదివినప్పుడు, ఆకుకూరలను తినాలన్నా ఏదోగా అనిపించేది. వాటిని కత్తిరించినప్పుడు చనిపోయేంతవరకూ బాధపడతాయేమోనని,  వేర్ల వద్ద కట్ చేసేదాన్ని. పుదీనా వంటి వాటికి  కణుపుల వద్ద కూడా వేర్లుంటాయి. బచ్చలి వంటివి కాడలు తెంపితే చాలు.

అయితే, కొమ్మలు తెంపినా చెట్లు బాధ పడతాయనుకుంటే ఇక మనం బ్రతకలేం.అలా అనుకుంటే నడిచేటప్పుడు కాళ్ళక్రింద ఎన్ని చీమలు చనిపోతాయో? అతి ఆలోచనలకు పోకుండా కొంతవరకే పాటించటం మంచిది.

హింస చేయకూడదనుకుని కొందరు.. క్రిందరాలిపడిన ఆకులను, పండ్లను తిని జీవిస్తారట. వారు 
 మాత్రమే గొప్పవారని, మామూలుగా జీవించేవారు తక్కువవారని చెప్పలేం. ఎన్నో నియమాలతతో ఎంతో తపస్సు చేసినా కూడా, కొందరు కొన్నిసార్లు కామక్రోధాలకు లొంగి పొరపాట్లు చేయటం జరుగుతుంది. మనస్సును నిగ్రహించుకోవటం అత్యంత కష్టం. దైవసహాయం తప్పనిసరి.

హింస అంటే చంపటం, తినటం ఒక్కటే కాదు. మనుషులను, పశుపక్ష్యాదులను.. మాటలతో, చేతలతో బాధించటం కూడా హింసే.

  జంతువులను ఒకదగ్గరనుంచి ఇంకొకదగ్గరికి పంపేటప్పుడు సరిగ్గా నీరు, మేత ఇవ్వకుండా చిన్న వాన్ లో కుక్కి పంపటం, జంతువులపైన విపరీతంగా బరువులను వేసి మోయించటం.. ఇవన్నీ హింసే.

 మొక్కలకు, 
మనుషులకు..  నెప్పి విషయంలో బాధపడే స్థాయిలో తేడాలుంటాయని అంటారు...ఈ విషయాలు సరిగ్గా అర్ధం కావట్లేదు.

 పశువులకు  ఎప్పుడైనా దెబ్బలు తగిలితే,  మనుషులలానే బాధపడటం, పెద్దగా గాయాలు తగిలితే గిలగిలా కొట్టుకోవటం మనకు కనిపిస్తుంది.మొక్కలలో అలా కనిపించదు.
అయితే.. జుత్తు, గోర్లను కత్తిరిస్తే బాధ  ఉండదు. మత్తు ఇచ్చి ఆపరేషన్ చేసినా ఎక్కువ బాధ ఉండదు. అలా మొక్కలకు ఎక్కువ బాధ ఉండదేమో? అని కొందరి అభిప్రాయం. ఇవన్నీ సరిగ్గా అర్ధంకాని విషయాలు.... ఆధునిక వైజ్ఞానిక పరికరాలకు
కూడా  సరిగ్గా అంతుబట్టని  విషయాలు ఎన్నో ఉన్నాయి.

మొక్కలు, పశుపక్ష్యాదులు మూగజీవులు. వాటి భావాలు మనకు సరిగ్గా అర్ధం తెలియవు,

భూమి ఒక పరీక్షా లోకం.ఇక్కడ కష్టాలు, సుఖాలు రెండూ ఉండే విధంగా సృష్టి ఉంది. ఇది ఒక ఆటస్థలం, నాటకరంగం వంటిది కూడా కావచ్చు.  లౌకిక జీవితంలో ఒక గొప్ప స్థాయికి రావాలంటే ఎంతో కష్టపడాలి. మరి ఏ కష్టాలు లేని అత్యంత ప్రశాంతమైన, అత్యంత గొప్పదైన పరమపదాన్ని పొందాలంటే కొంతైనా కష్టాలు ఉంటాయి కదా. ఇక్కడ మంచిగా జీవించి దైవకృపకుపాత్రులైనవారు పైలోకాలకు చేరుకుంటారు.. పరమపదాన్ని పొందుతారు.

మనకు అర్ధం కాని విషయాలు సృష్టిలో ఎన్నో ఉన్నాయి. అవన్నీ దైవానికే తెలుస్తాయి.



8 comments:

  1. సోదరులు హరిబాబుగారి.. హరి కాలం.. బ్లాగ్ లో ఒక పోస్ట్ చదివిన తరువాత, నా అభిప్రాయాలను కూడా వ్రాయాలనిపించి, ఇక్కడ పోస్టులో కొన్ని విషయాలను వ్రాసాను.

    ReplyDelete
  2. అయితే, జీవితంలో కొన్నిసార్లు తప్పనిసరి పరిస్థితిలో హింస చేయవలసి వస్తుంది. ఎవరికైనా హాని కలిగే సందర్భాలలో కాపాడుకోవాలి. శత్రువులు దాడి చేసినప్పుడు చేతులు ముడుచుకుని కూర్చోలేరు కదా..

    క్రూరమృగాలు ఎదురైనప్పుడు వాటిని చంపక తప్పదు. దోమల్ని , బొద్దింకల్ని కూడా చంపుతాము. అయితే, దోమలు, బొద్దింకలు ..వంటివి పెరగకుండా ఉండాలంటే కొన్ని నివారణ చర్యలు ఉంటాయి. ఇంట్లో సామాను ఎక్కువ ఉండకుండా శుభ్రంగా ఉండటం, మురుగునీరు లేకుండా చూసుకోవటం వంటివి చేయాలి. అడవులు ఎక్కువగా నరకకుండా ఉంటే క్రూరమృగాలు ఊళ్ళోకి రావు.

    కొన్నిసార్లు ఎంత చేసినా కొన్నింటిని చంపక తప్పదు. అలాంటప్పుడు ఎక్కువ బాధ లేకుండా తేలికగా ప్రాణం పోయేలా చంపాలి.

    ReplyDelete
  3. కొన్ని పక్షులు వాటి పిల్లలను చూశాము. ఒకరోజు ఉదయం పెద్దపక్షులు కనిపించలేదు. ఎక్కడకు వెళ్ళాయి పెద్దపక్షులు? ఏమయినా అయ్యిందా వాటికి ?..ఎవరైనా వేటగాళ్ళు చంపేసారా? అలా అయితే ఇంకా ఎగరటం రాని పిల్లపక్షుల పరిస్థితి ఏమిటి? అని చాలా బాధ కలిగింది. దైవం దయ వల్ల కొద్దిసేపటికి పెద్ద పక్షులు పిల్లల వద్దకు వచ్చాయి.

    ఏమిటో? ఈ ప్రపంచం అనిపిస్తుంది.

    ReplyDelete

  4. కొందరు ఏమంటారంటే, మాంసాహారాన్ని ఎందుకు తినకూడదు? మా తిండి మా ఇష్టం. చెప్పటానికి మీరెవరు? అంటారు. అయితే, పశుపక్ష్యాదులను చంపటానికి మనకు ఏం హక్కుంది? అదే ఎవరికైనా చిన్న వేలు తెగినా, కాలు విరిగినా, అనారోగ్యం కలిగినా విలవిలలాడుతూ హాస్పిటల్ కు పరిగెడతారు. జబ్బు తగ్గాలని దేవుళ్లకు మొక్కేస్తుంటారు. మరి మూగజీవుల ప్రాణం తీయటానికి ఎవరికైనా ఏం హక్కుంది? అలా జీవహింస చేస్తూ తమకు ఏమన్నా కష్టాలొస్తే మాత్రం మేం ఏ పాపం ఎరగం..దేవుడు మమ్మల్ని ఇలా కష్టపెడుతున్నాడంటూ దేవుణ్ని తిడుతుంటారు.

    ఇక్కడ పాపమా.. పుణ్యమా.. అన్న విషయం అలా ఉంచితే, ఎవరికి వారు ఆలోచించుకోవాలి. తమకు చిన్నగాయం తగిలితేనే విలవిలలాడినప్పుడు, ఇతర జీవులకు కూడా అలాగే నొప్పి, ప్రాణభయం ఉంటాయి కదా.

    మనుషుల్ని రాక్షసులు ఎవరైనా చంపి, మాంసం భలే రుచిగా ఉందని లొట్టలేసుకుంటూ తింటే ఎలా ఉంటుంది? ఆ ఊహే భరించలేరు కదా..మరి మనుషుల కొరకు బలయిపోతున్న పశుపక్ష్యాదుల ఉసురు మనుషులకు తగలకుండా ఉంటుందా? అయినా ఎవరి కర్మ వారిది. నాలుక రుచిని అదుపులో ఉంచుకోలేనప్పుడు దాని పర్యవసాన్నీ భరించక తప్పదు.

    ఊళ్లమీదకు క్రూరమృగాలు వచ్చినప్పుడు వాటిని చంపవచ్చు గానీ, అడవుల్లోకెళ్లి జంతువులను వేటాడినప్పుడు పాపం వస్తుంది.

    క్షత్రియులు, సైనికులు ..వంటివారు మాంసాహారం తినాలని రూలేమీ లేదు. ఒకరితో ఒకరు యుద్ధాలు చేసుకోవటం మనుషుల తప్పు. అందుకొరకు కూడా జంతువులను చంపుతుంటారు. అది పాపమే. ఆత్మరక్షణ కొరకు జీవులను చంపితే తప్పు కాదు. అయితే, ఎవరికీ హాని కలిగించకుండా ఉన్న జీవులను చంపినా, బాధపెట్టినా పాపమే.

    జీవహింస వల్ల బాధలు పడ్డ జీవుల ఉసురు ఎప్పటికైనా ఎంతోకొంత తగలవచ్చనిపిస్తుంది. మంచివారు కొందరు కష్టాలు అనుభవిస్తున్నప్పుడు, వారు గతంలో జీవహింస చేసి ఉండవచ్చనిపిస్తుంది.

    సమాజంలో మనిషిని చంపితే తప్పని జైల్లో వేస్తారు కదా..మరి పశుపక్ష్యాదులను విచ్చలవిడిగా చంపితింటే ఎన్ని శిక్షలు పడాలి? మన ప్రాణం లాంటిదే కదా వాటి ప్రాణం కూడా. మరి మనకు హానిచేయని జీవులను చంపితిన్నందుకు శిక్షలు ఉండవా..?
    ..........
    శ్రీరాముని తండ్రి దశరధులవారు, పాండురాజు వంటి గొప్పవారే వేట (జీవహింస)వల్ల శాపాలకు గురయ్యారు. అంతటివారే వాటినుంచి తప్పించుకోలేకపోయారు. అందువల్ల జీవహింస ఎప్పుడూ మంచిది కాదు.
    ...........
    మాంసాహారాన్ని మానలేనప్పుడు తినటం కొంత తగ్గించవచ్చు.
    మాంసాహారాన్ని వదలలేని వారికొరకు వెజ్ మీట్ వచ్చింది. ఇలాంటివి విదేశాల్లో ఎక్కువగా అమ్ముతున్నారు. భారతదేశంలో కూడా అమ్ముతున్నారు.కొందరు ఇంట్లో కూడా తయారుచేస్తున్నారు..

    ReplyDelete
  5. కొందరు సోయాను మాంసాహారంలా వాడుతారు.

    కొన్నిరకాల శాకాహారపదార్ధాలను కలిపి వెజ్ మీట్ గా తయారుచేసి మార్కెట్లో అమ్ముతున్నారు కొందరు.

    గోధుమపిండి తో కొందరు ఆ విధంగా ఇంట్లో కూడా తయారుచేస్తున్నారు.
    Link..
    Veg Chicken Recipe I Vegan Chicken Curry I Veg KFC I Seitan I ये वेज चिकन है 😱 I Pankaj Bhadouria

    ReplyDelete


  6. గాలిలో, నీటిలో సూక్ష్మ జీవులున్నాయి కాబట్టి, నేను కూడా మాంసాన్ని తింటే తప్పేమిటని కొందరు అంటారు. ఇలా మాట్లాడేవారిని ఎవరైనా కాలో,చెయ్యో విరిచేస్తే ఊరుకుంటారా?
    వాతావరణంలో సూక్ష్మజీవులుంటాయి, నిజమే.  నడుస్తున్నప్పుడు కాలిక్రింద చీమలూ చనిపోవచ్చు. మన చేతిలో లేని విషయాల గురించి మనం ఏమీ చెయ్యలేము. సాటిజీవుల పట్ల దయగా ఉండటం, మాంసాహారం తినకుండాఉండటం..తినకుండ ఉండలేనప్పుడు తక్కువగా తినటం ..వంటివి చేయగలం.

    సృష్టిలో ఏది ఎందుకు ఎలా జరుగుతుందో? మనకు తెలియదు. కొన్నిజీవులు సముద్రపు అట్టడుగు లోతుల్లోకూడా చక్కగా జీవిస్తాయి. మనుషులు అలా జీవించలేరు కదా..మనుషులకు వినిపించని ధ్వనులు.. కొన్ని జంతువులకు వినిపిస్తాయట..ఇలా వేటి లక్షణాలు వాటికుంటాయి. ఇలా సృష్టిలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. ఏది ఎందుకు ఎలా జరుగుతుందో దైవానికే తెలియాలి. మనుషులు చేయవలసింది .. మానవత్వంతో జీవించటానికి ప్రయత్నించటం.

    ReplyDelete
  7. శాఖాహారాన్ని కూడా వృధాచేయరాదు. అందువల్ల పెద్దలు అన్నంపరబ్రహ్మస్వరూపమని తెలియజేసారు.

    ReplyDelete
  8. ఒకప్పటి సినిమానటి జెనెలియా తెలుసుకదా..ఆమె వాళ్ళఫామిలి మాంసాహారాన్ని మాని వెజ్ మీట్ తీసుకుంటున్నారట.వాళ్ళు వెజ్ మీట్ తయారుచేసి అమ్ముతున్నారని కూడా వార్తలు వచ్చాయి.
    క్రికెటర్ విరాట్ కోహ్లీ వాళ్ళు కూడా ఆరోగ్యం కొరకు మాంసాహారాన్ని మానేసారని తెలుస్తోంది.

    ReplyDelete