koodali

Wednesday, April 8, 2015

డబ్బు ఉంటే ఉద్యోగాలను కల్పించటం పెద్ద పనేమీ కాదు.....

 
ప్రభుత్వం వద్ద డబ్బు ఉంటే.. నిరుద్యోగ సమస్య లేకుండా చేయవచ్చు. డబ్బు ఉంటే ఉద్యోగాలను కల్పించటం పెద్ద పనేమీ కాదు.

ఉదా.. రహదారుల   ప్రక్కన  మొక్కలు నాటి,  వాటిని  పెంచి పోషించే పని కోసం అనేక ఉద్యోగాలను కల్పించవచ్చు. 


స్వచ్చభారత్ కోసం వీధికి పదిమంది ఉద్యోగస్తులను నియమించవచ్చు.


ప్రభుత్వ ఆసుపత్రులలో మరింత మంది వైద్యులను, సిబ్బందిని నియమించవచ్చు. 


ఎన్నో ప్రభుత్వకార్యాలయాలలో సిబ్బంది కొరత ఉంది. ఆ విధంగా ఎందరికో ఉపాధిని కల్పించవచ్చు. 


ఏతావాతా తేలేదేమిటంటే , ప్రభుత్వం వద్ద డబ్బు ఉంటే  యువతకు ఉపాధిని కల్పించటం పెద్ద సమస్య కాదు.

....................

అయితే సమస్య ఏమిటంటే.. ప్రభుత్వాల వద్ద  డబ్బు ఉండాలి. 


 ప్రజలందరి  సొత్తు  అయిన  సహజవనరులను  ప్రైవేటీకరణ  పేరుతో  కొందరికి  అప్పగిస్తే  ప్రజా సంక్షేమ కార్యక్రమాలు  చేయటానికి  ప్రభుత్వం  వద్ద  డబ్బు  ఎక్కడినుంచి  వస్తుంది?


ప్రైవేటీకరణ  తగు మాత్రమే  ఉండాలి. ఎక్కువ సహజవనరులు  ప్రభుత్వం  యొక్క  ఆధీనంలోనే  ఉండాలి. 

...............

ప్రభుత్వానికి  ప్రజలు చెల్లించే  పన్నుల ద్వారా వచ్చే ఆదాయం ఒక మార్గం. 


అయితే, ఆదాయం కోసం  ప్రజల మీద  మరీ
 అధిక  పన్నులు  వేయటం,  మద్యం  మీద  వచ్చే ఆదాయంపై  ఆధారపడటం  సరైనది  కాదు. 
..................

ప్రభుత్వానికి  అనేక ఖర్చులుంటాయి.


 ఉద్యోగుల జీతాలకు, పెన్షన్లకు,  ప్రజల సంక్షేమ పధకాలకు, దేశరక్షణ  కార్యక్రమాలకు..... ఇలా ఎన్నో ఖర్చులు ఉంటాయి. 


మరి వీటన్నింటికి  అవసరమైనంత డబ్బు ఉండాలంటే ప్రభుత్వానికి ఆదాయం బాగుండాలి. అనవసరపు ఖర్చు తగ్గించుకోవాలి. 


అయితే, రక్షణ రంగం వంటి  విషయాలలో ఖర్చు తగ్గించటం అంటే కుదరదు. 

......................

దేశంలో ప్రభుత్వం వద్ద  ఎక్కువ డబ్బు లేకపోయినా, కొందరు  ప్రజల వద్ద  డబ్బు  ఎక్కువగానే ఉంది. 

.......................

 నల్లడబ్బు కట్టడి చేస్తే  దేశంలో పేదరికం తగ్గుతుంది. అవినీతి వల్ల దేశానికి ఎంతో నష్టం జరుగుతోంది. 


ప్రభుత్వం ప్రజల  సంక్షేమపధకాలకు విడుదల చేసే డబ్బులో కూడా అవినీతి జరిగి,  పేదలకు చెందవలసిన డబ్బును..  మధ్యలో వాళ్ళు మింగేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.


కొందరు వ్యాపారస్తులు  ధరలు బాగా పెంచి  వినియోగదారులను  మోసగిస్తారు .  పన్నులు సరిగ్గా కట్టకుండా ప్రభుత్వాన్ని మోసగిస్తారు . ఇలాంటివాటికి అడ్డుకట్ట  వేయాలి . 

 .........................

వేల రూపాయల జీతం తీసుకునే  ఉద్యోగస్తులు కూడా  తమకు జీతాలు మరింతగా పెంచాలని సమ్మెల ద్వారా వత్తిడి చేస్తుంటారు. 


ఇలాంటి ఎన్నో సమస్యలతో  వేగలేక , కొన్ని  ప్రభుత్వరంగసంస్థలు తమ సంస్థలను  ప్రైవేట్ పరం చేయటానికి పూనుకుంటున్నాయి.


అయితే,  కొన్ని  ప్రైవేట్ సంస్థల వాళ్లు  ఎక్కువ జీతాలు ఉన్న కొందరు ఉద్యోగస్తులను  ఇళ్లకు పంపేసి,    తక్కువ జీతం ఇచ్చి కొత్తవాళ్లను నియమించుకుంటున్నారని వార్తలు వచ్చాయి.

................
 నల్లడబ్బును, అవినీతిని  నిర్మూలించటం ,  దేశంలోని  సహజవనరులను ప్రభుత్వం తన అధీనంలో ఉంచుకొనటం... ..వంటి చర్యల ద్వారా ప్రభుత్వానికి ఎంతో  ఆదాయం సమకూడుతుంది. 

తద్వారా దేశంలోని నిరుద్యోగ సమస్యను , పేదరికాన్ని  పారద్రోలవచ్చు. ఇందుకు  
ప్రజల తోడ్పాటు ఎంతో అవసరం.


8 comments:

  1. ఉద్యోగాలు కల్పించడం పరమావధి కాదు, కాకూడదు. దేశాభివృద్ధిలో భాగంగానే ఉద్యోగాలు వస్తాయి.

    అభివృద్ధి కావాలంటే ప్రభుత్వ రంగం ఒక్కటే ఖర్చులు పెడితే సరిపోదు. ప్రభుత్వ విధానాలు పారిశ్రీకరణను ప్రోత్సాహించే విధంగా ఏర్పరిస్తే అభివృద్ధి తద్వారా ఉపాధి లభిస్తాయి. దీనికి కావాల్సింది డబ్బు కాదు, సంకల్పం.

    ReplyDelete
  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    ప్రజలకు ఉపాధి లభించటం ఎంతో ముఖ్యం. పాతకాలంలో అయితే అనేక వృత్తులు ఉండేవి. అందుకని అప్పటివాళ్ళు ఉపాధికోసం ప్రభుత్వాలపై అంతగా ఆధారపడే పరిస్థితి ఉండేది కాదనిపిస్తుంది.
    ................

    ఈ రోజుల్లో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది. ఉపాధి లభించినా కూడా ఎంతకాలం ఉంటుందో చెప్పలేని పరిస్థితి ఉంది.

    ఈ రోజుల్లో ప్రజలకు ఉపాధి లభించకపోతే ప్రభుత్వాలనే నిందిస్తున్నారు. ఉపాధి కల్పించాలంటూ ప్రభుత్వాలనే అడుగుతున్నారు కదా !
    .................

    ప్రభుత్వాలకు సంకల్పం తప్పకుండా ఉండాలి. అయితే, సంకల్పం ఉన్నంతమాత్రాన సరిపోదు. సంపదనూ సమకూర్చుకోవాలి.

    ( డబ్బు అంటే.. అది డబ్బు కావచ్చు లేక సహజవనరులు కావచ్చు .పాతకాలంలో వస్తుమార్పిడి ఉన్న రోజుల్లో కూడా వనరులే డబ్బులా చలామణి అయ్యేవి. ఇక్కడ డబ్బు అంటే అది ఏ రూపంలో అన్నా ఉండవచ్చు. సహజవనరులను కూడా డబ్బు అనుకోవచ్చు.)

    ప్రభుత్వాల వద్ద సంపద ( డబ్బు ) లేకుంటే దేశ రక్షణ, ప్రజా సంక్షేమం, పాలన..వంటివి ఎలా చేయగలరు ?

    ఉదా..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పం ఉంది. అయితే రాజధానిని నిర్మించాలన్నా, ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలన్నా, యువతకు ఉపాధి కల్పించాలన్నా, రాష్ట్రానికి రక్షణ కల్పించాలన్నా..మరెన్నో అవసరాలకు డబ్బు అవసరం కదా !
    ....................

    ఉపాధి విషయంలో చూస్తే, పెద్ద ఎత్తున ఖనిజనరులను తవ్వేసి వస్తువులను తయారుచేసే కంపెనీల ద్వారా మాత్రమే ఉపాధి లభిస్తుంది అనుకోకూడదు.

    ఉపాధి పొందటానికి అనేక ఇతర మార్గాలు కూడా ఉన్నాయి.

    ఉదా..ఉద్యోగాలను ఎలా సృష్టించవచ్చంటే, దేశమంతటా రహదారుల ప్రక్కన మొక్కలు నాటి, వాటిని పెంచి పోషించే పని కోసం అనేక ఉద్యోగాలను కల్పించవచ్చు.( మరిన్ని విషయాలను పైన టపాలో వ్రాసాను.)
    ...............

    ముఖ్యంగా, దేశంలోని అవినీతిని కఠినచర్యల ద్వారా నిర్మూలించటం, నల్లధనాన్ని నిర్మూలించటం..వంటి చర్యల ద్వారా ప్రభుత్వానికి ఎంతో ఆదాయం సమకూడుతుంది. తద్వారా దేశంలోని నిరుద్యోగ సమస్యను , పేదరికాన్ని పారద్రోలవచ్చు.

    ReplyDelete
  3. వేటీకరణ చేసినా కూడా , ప్రభుత్వ ఆధీనంలో ఎన్నో రంగాలు ఉంటాయి. ఉదా.. రక్షణవ్యవస్థ, పాలనా వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, నదీ జలాలు, నీటిపారుదల వ్యవస్థ..వంటివి.

    ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వాలు ఎన్నో పధకాలను ప్రవేశ పెడుతూ ఉంటాయి. ఇవన్నీ సవ్యంగా నడిపించాలంటే ప్రభుత్వానికి ఆదాయం అవసరం.

    అన్ని రంగాలనూ ప్రైవేటుకు అప్పజెప్పి కూర్చుంటే ఇక ప్రజాస్వామ్యం ఎందుకవుతుంది. ప్రభుత్వాలు బలహీనపడి ప్రైవేట్ స్వామ్యమే ప్రభుత్వంపై పెత్తనం చెలాయిస్తుంది. ( అంటే, కార్పొరేట్ సంస్థలు ప్రభుత్వాలను శాసించే పరిస్థితి వస్తుంది.)
    ..............

    ఆధునిక పారిశ్రామీకరణ ద్వారా ఉపాధి అనేది కొంతవరకు అవసరమే. అయితే ఉపాధి కోసం పూర్తిగా ఆధునిక పరిశ్రమల పైనే ఆధారపడటం వల్ల అనేక నష్టాలున్నాయి.

    ఆధునిక పరిశ్రమల వల్ల సహజవనరుల తరుగుదల విపరీతంగా పెరిగింది. పర్యావరణ కాలుష్యమూ పెరిగింది. ఉపాధి కోసం సహజవనరులను విపరీతంగా వాడేయటం వల్ల భవిష్యత్ తరాలకు నష్టం కలుగుతుంది.

    అందువల్ల కేవలం పారిశ్రామీకరణ వల్ల మాత్రమే కాకుండా, ఇతర రంగాల ద్వారా కూడా ఉపాధి పొందాలి. ఉదా..సేవా రంగం, పర్యాటకం, వ్యవసాయ ఉత్పత్తుల రంగం, పర్యావరణానికి హాని కలిగించని ఉత్పత్తులను తయారుచేయటం....వంటివి.
    ...........................

    ప్రైవేట్ రంగంలో పరిశ్రమలు పెరిగితే ప్రైవేట్ సంస్థ స్థాపించటానికి అవసరమైన భూమిని, వస్తువులు తయారుచేయటానికి అవసరమైన సహజవనరులను ప్రభుత్వమే కల్పించవలసి వస్తుంది.

    పరిశ్రమల వల్ల వచ్చిన లాభాలతో సంపద పెరిగిన ధనవంతులతో కూడిన కార్పొరేట్ రంగం తయారవుతుంది.

    అంటే, ఉపాధిని కల్పించే కార్పొరేట్ వర్గం, ఉపాధి కోసం కార్పొరేట్ రంగంపై ఆధారపడే వర్గంగా సమాజం చీలిపోతుంది. సమాజంలో ఆర్ధిక అసమానతలు బాగా పెరుగుతాయి.
    ...............
    ఉపాధి కోసం ఇతరులపై ఆధారపడకుండా జీవించే రైతుల వంటి వారికి, చేనేత వృత్తుల వంటి వారికి గిట్టుబాటు ధరలను కల్పించటం, రుణాలను అందించటం వంటి సహకారాన్ని అందిస్తే బాగుంటుంది.

    ఇతరులపై అదేపనిగా ఆధారపడకుండా స్వతంత్రంగా జీవిస్తున్న వారిని వారి సాంప్రదాయ వృత్తులకు దూరం చేసి , ఉపాధి కోసం పరిశ్రమల వారి దయాదాక్షిణ్యాలపై ఆధారపడే పరిస్థితి కల్పించటం సరైనది కాదు.

    ReplyDelete
  4. ఉపాది అవకాశాలు కావాల్సిందే ఒప్పుకున్నాను. అయితే ఉపాది సొంతంగా రాదు. అది కేవలం ఆర్ధిక అభివృద్ధికి ఒక పర్యవసానం మాత్రమె తప్ప స్వయంభు కానేరదు.

    ఎటువంటి నమూనా పాటిస్తే అభివృద్ధి జరుగుతుందో దాన్నే ఎంచుకోవాలి తప్ప ఇతరులను నఖలు చేయకూడదు. ఉ. ఆంధ్రలో సుదీర్ఘ తీరప్రాంతం, రేవులు & మత్స్యసంపద ఉన్నాయి. ఈ రంగాలను కేంద్రబిందువుగా చేసుకొని ప్రణాలికలు వేయాలి. దురదృష్టం కొద్దీ సాఫ్టువేర్ మోజులో పడ్డ ప్రభుత్వం వీటిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది. జాలర్లకు కనీసం ఇంశూరెంస్ ఇవ్వని ప్రభుత్వం వందలాది ఇంజనీరింగ్ కాలేజులు పెట్టి ప్రయోజనం ఏమిటి?

    అలాగే రైతులకు పంట సలహాలు ఇచ్చే extension శాఖ కుప్పకూలడంతో వారికి ఎ పంట ఎప్పుడు వేయాలో చెప్పే నాధుడు లేదు. ఐటీసీ లాంటి కంపనీల మాయలో పడి పొగాకు & నూనె గింజెలు వేయాల్సిన పరిస్తితి ఏర్పడింది.

    ఇట్లాంటి ఉదాహరణలు కోకొల్లలు. హైటెక్ ముసుగులో వచ్చిన తలతిక్క విధానాలతో గ్రామీణ సాధారణ ప్రజలు సతమతం అవుతున్నారు.

    ReplyDelete

  5. పాతకాలంలో ఉపాధి కోసం ఇతరులపై ఆధారపడటం తక్కువగా ఉండేది. ఆధునిక కాలంలో పారిశ్రామీకరణ వల్ల వృత్తులు వెనుకబడి ఉపాధి కోసం ఇతరులపై ఆధారపడటం ఎక్కువయ్యింది.

    నిజమే సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం యువత ఆశపడుతున్నారు కానీ, నిద్ర లేకుండా రాత్రి కూడా ఉద్యోగాలు చేయవలసి రావటం, ఇంకా టార్గెట్లతో కూడిన పనివత్తిడి వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.

    పాతకాలంలో రైతులు విత్తనాల కోసం, ఎరువుల కోసం ..ఇతరులపై ఆధారపడే పరిస్థితి ఉండేది కాదు. ఎప్పుడు ఏ పంట వేయాలో రైతులకు ఇతరులు చెప్పే పరిస్థితి ఉండేది కాదు.

    ఆధునిక కాలంలో సంస్థలపై ఆధారపడే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితులు మారాలని ఆశిద్దాము.

    ReplyDelete
    Replies
    1. మార్పు ఆశించడం తప్పు కాదు కానీ కేవలం ఆశే మార్పు తేదు.

      సాఫ్టువేర్ ఉద్యోగాలు పరమపద సోపానానికి మెట్లు అంటూ ప్రజలను కొందరు అతి తెలివి హై"టెక్కు" నాయకులు ప్రజలను బురిడీ కొట్టించారు. ఇంకా ఆ మత్తు నుండి బయటికి ఎంతమంది వచ్చారన్నది అనుమానమే.

      Delete
    2. అనుభవం అయితే కానీ తత్వం బోధపడకపోవటం ఎన్నో విషయాలలో జరుగుతుంటుంది.

      ప్లాస్టిక్ కనుగొన్న కొత్తలో అదే ప్రపంచంలోని ఎన్నో సమస్యలకు పరిష్కారం అని మురిసిపోయారు. చాలాకాలం తర్వాత ప్లాస్టిక్ తో సమస్యలు తెలుస్తున్నకొద్దీ విషయం బోధపడుతోంది.

      ప్లాస్టిక్తో కలిగే తాత్కాలిక లాభాలకు అలవాటుపడ్ద వాళ్ళు వాటికి దూరం కాలేకపోతున్నారు. శాశ్వత నష్టాలను గమనించిన వాళ్ళు వీలైనంత తక్కువ వాడటానికి ప్రయత్నిస్తున్నారు.
      .........
      ప్రస్తుతం కంప్యూటర్లు లేకుండా ప్రపంచం నడవలేని పరిస్థితి ఉంది. సాఫ్ట్వేర్ రంగం అనేది ఎంతోకొంత తప్పనిసరి అయింది. భవిష్యత్తులో పరిస్థితి మారుతుందని ఆశించాలి.

      Delete
    3. భవిష్యత్తులో సాఫ్ట్వేర్ రాయడానికి ప్రత్యేకమయిన ఉద్యోగుల అవసరం పెద్ద ఎత్తున ఉండదు. వివియోగాదారులే తమకు కావాల్సిన వాటిని తయారు చేసుకొనే సదుపాయం పెరుగుతుంది. మన దేశంలో రాసే హెచ్చు శాతం సాఫ్ట్వేర్ core technology కాదు, వీటికి గిరాకీ అంతగా పెరగదు.

      Delete