koodali

Monday, May 17, 2010

ఈ నాటి పిల్లలకు ఎ విధమయిన ఎడ్యుకేషన్ అవసరము అంటే .......

ఈ రోజుల్లో చదువు అన్న పదానికి అర్ధమే మారిపోయిందని నా అభిప్రాయం అండి.అంటే సంపాదన కోసమే చదువు అన్నట్లు ఉంది కదా మరి.

భుక్తితో పాటూ దైవ భక్తి, ఉన్నతవిలువలతో కూడిన చదువు అవసరమని నా అభిప్రాయం.సమాజములో పేదరికం పెరిగిపోవటానికి ..... ,ఇన్ని నేరాలు, ఘోరాలు జరగటానికి ముఖ్యకారణం అధర్మం పెరిగిపోవటం .....అంతేకాని డబ్బు లేకపోవటం కారణం కాదని నా అభిప్రాయం.

ఉదాహరణకు ....చూడండి......నైతిక విలువలు , ధర్మం మీద గౌరవం ఉన్నవారు ప్రపంచములో సంపద అంతా తనకే కావాలని అత్యాశ పడరు.దానివల్ల సంపద అందరికీ సమానముగా అందుబాటులోకి వచ్చి పేదరికం ఉండదు.తిండి లేక చనిపోయేవాళ్ళు ఉండరు.


నైతిక విలువలు పాటించేవారు మగవారయినా , ఆడవారయినా ,ఎటువంటి బలహీన క్షణము ఎదురయినా సరే పరాయి స్ర్తీ,పురుషులను పూజ్యభావంతో మాత్రమే చూస్తారు.దీని వల్ల అందరి కుటుంబములు పచ్చగా ఉంటాయి.కుటుంబ వ్యవస్త విచ్చిన్నం అవటం జరగదు.హత్యలు,ఆత్మహత్యలు ఉండవు.




నైతిక విలువలు పాటించేవారు అసూయ,లోభం, దొంగతనం, పరాయి సొమ్ముకు ఆశపడటం జరగదు.ధర్మబద్ధముగా అభివ్రుద్ది చెందటానికి ప్రయత్నిస్తారు. కుదరకపోతే తమకు అంతే ప్రాప్తం అని సరిపెట్టుకుంటారు. దీనివల్ల వ్యక్తులు,కుటుంబాలు,దేశాలు మద్యన కక్షలు, యుద్ధవాతావరణం ఉండదు. బోలెడు డబ్బు నష్టం ఉండదు..




ధర్మం ఆచరించేవారు సమస్త జీవకోటి యందు దయను కలిగి ఉంటారు.పర్యావరణానికి విచ్చలవిడిగా హాని కలిగించరు.ఇందువలన జీవ పర్యావరణం సమతుల్యంగా ఉంటుంది. చెట్లు పచ్చగా ఉండి సకాలంలో వర్షాలు పడతాయి.అప్పుడు ఆహారం కొరత ఉండదు.



వీటివలన అర్ధమయ్యేది ఏమిటంటేనండి ప్రపంచములో ఆనాడు కానీ, ఈనాడు కానీ ఇన్ని యుద్ధాలు, ఇంత గందరగోళం ,ఇన్ని కష్టాలు ఎందుకు ఉన్నాయంటే కేవలం దైవభీతి, పాపభీతి ఇవి లేకపోవటం ధర్మం, నైతిక విలువలు పాటించని కొంతమంది ప్రజలవల్లనే.



అందువలన పిల్లలకు మంచి విలువలతో కూడిన చదువు నేడు ఎంతో ముఖ్యం. చాలా సమస్యలకు అది పరిష్కారమని నా అభిప్రాయమండి..ఇలాంటి అబిప్రాయములు ఈ రోజుల్లో ఎవరిక్కావాలన్నది వేరే విషయం.... . . . . ..

No comments:

Post a Comment