koodali

Thursday, July 19, 2018

అహల్యాదేవికధ ..మరియు ..కొన్ని విషయాలు.. ..


అహల్య, గౌతమమహర్షి  కధలో..ఇంద్రుడు గౌతముని రూపాన్ని ధరించి  రావటం..తరువాత జరిగిన సంఘటనల ద్వారా గౌతముడు  అహల్యకు,  ఇంద్రునికి శాపం ఇవ్వటం జరిగింది.

అహల్యాదేవి  తాను చేయని తప్పుకు కొంతకాలం శాపాన్ని అనుభవించి,  తిరిగి గౌతముని వద్దకు చేరుకుంది.

అహల్యాదేవి  శ్రీరాముని పాదధూళి తాకి  తిరిగి పూర్వస్థితికి రావడం అనే విషయం తెలిసిందే.

 ఈ కధ గురించిన వివరాలు శ్రీపాదశ్రీవల్లభసంపూర్ణచరితామృతము గ్రంధంలో ఉన్నాయి.

****************
పురాణేతిహాసాల ద్వారా  ప్రపంచంలో జరిగే ఎన్నో విషయాలు తెలుస్తాయి.
***********

సమాజంలో పేరున్నవాళ్ళు (సెలెబ్రిటీలు ) ఏం చేస్తే అలా చేయాలని చాలామంది ప్రజలు తహతహలాడుతారు.

అందుకే ఆధునిక కాలంలో .. సబ్బులు, దుస్తులు ..వంటి ఉత్పత్తుల అమ్మకాల పెరుగుదల కోసం కంపెనీలు సెలెబ్రిటీలను వాడుకుంటారు.

సెలెబ్రిటీల జీవితాల్లో సంఘటనల గురించి కూడా ప్రజలు ఆసక్తిగా గమనిస్తారు. 

వాళ్లు ఎలా ప్రవర్తించారు? అని ఆసక్తిగా గమనిస్తారు.

**************
రామాయణంలో కొన్ని ప్రక్షిప్తాలు ఉన్నాయి..  అని కొందరంటున్నారు. అందువల్ల , నిజంగా సీతాదేవిని అడవులకు పంపేయటం జరిగిందా ? లేదా? అనేది  తెలియదు.

నిజంగా అలా జరిగి ఉంటే, రాముడు రాజు కాబట్టి, ప్రజల భయాలు, అనుమానాల వల్ల..  వేరేదారి లేక  , సీతారాములు అలా చేయటం జరిగి ఉంటుంది.

అయితే, ప్రజలు ఏదో అన్నారు కదా.. అని, శ్రీ రాముడు సీతాదేవితో..నువ్వు అడవులకు వెళ్ళిపో..ఇకమీదట  నీకూ నాకూ ఏం సంబంధం లేదు .. అనలేదు.

రాములవారు రాజ్యపాలన చేస్తూ కూడా తాను  కూడా ఋషి వలె జీవించారు.

స్వర్ణసీతను చేయించటం, పుత్రులైన కుశలవులను రాజ్యానికి  వారసులుగా చేయటం .. వంటి  చర్యల  ద్వారా సీతాదేవే తన భార్యని లోకానికి తెలియజేసారు.


**********
సీతారాములు.. గౌతముడుఅహల్య.. వీరి రెండు విషయాలను  పోల్చటం లేదు. రెండూ  పూర్తిగా వేరువేరు విషయాలు.

 అయితే, ఎవరైనా స్త్రీ తన ప్రమేయం లేకుండా పరపురుషుని  వల్ల నిందలు మోయవలసి వస్తే ఆమె తన భర్తను విడిచి వెళ్లవలసిందేనా?  అనే సందేహాలు కలుగుతాయి.

పురాణేతిహాసాలు స్త్రీలకు అన్యాయం చేయాలని చెప్పలేదు. 

 అహల్యాదేవి వృత్తాంతం ద్వారా...  భార్యాభర్త  తిరిగి కలుసుకోవటం..అనే విషయం గురించి తెలుసుకోవచ్చు.

అయితే, అందరూ అలాగే చేయాలనే రూల్ ఏమీ ఉండదు. ఎవరి పరిస్థితి వారిది. 

వారి సమస్య, స్థితి, పరిస్థితిని ..బట్టి పరిష్కారాలను ఎంచుకోవలసి ఉంటుంది.

 అంతేకానీ యధాతధంగా సెలిబ్రిటీలను అనుసరించనక్కరలేదు.

ఒకవేళ, ఎవరి అన్నిపరిస్థితులు.. యధాతధంగా  సెలెబ్రిటీకి కలిగిన  అన్ని పరిస్థితులులానే  ఉంటే , అప్పుడు వారు యధాతధంగా వారిలా చేయవచ్చు. 

పరిష్కారం లభించనప్పుడు  సరైన దారి చూపించమని  దైవాన్ని వేడుకోవాలి.  

******************
పరాయివాళ్ళతో తిరుగుతూ జీవితభాగస్వామిని మోసగించే వాళ్ళకు శిక్షపడటంలో తప్పులేదు.

   అయితే కొందరు మంచి  నడవడిక కలవారు,  ఇతరుల వల్ల కిడ్నాప్ కాబడి తరువాత రక్షించబడి, వారు చేయని తప్పుకు బాధలు పడుతున్నప్పుడు బాధగా ఉంటుంది.

 ఇలాంటప్పుడు కొన్ని సందేహాలొస్తాయి.

ఇతరులు చేసిన అన్యాయం వల్ల తప్పుచేయని వారి పరిస్థితి ఏమిటి ? అనిపిస్తుంది.

 పురాణేతిహాసాల  కధల ద్వారా... ఎన్నో సందేహాలకు సమాధానాలు లభిస్తాయి.

***************
తల్లితండ్రి పిల్లలకు కొన్ని విషయాలను చెప్పడానికి మొహమాటపడతారు.

ఉదా..కుంతీదేవి వివాహానికి ముందే సంతానాన్ని పొంది ఆ విషయాన్ని అందరితో చెప్పలేక , శిశువును వదిలేసి జీవితాంతం కుమిలిపోయింది.


కుంతీదేవి కధ ద్వారా ... వివాహానికి ముందే తెలిసీతెలియని తనం వల్ల వివాహానికి ముందే సంతానాన్ని పొందితే జీవితాంతం బాధతో కుమిలిపోయే పరిస్థితి ఉండవచ్చని తెలుస్తుంది.

శకుంతల కధ ద్వారా....  తల్లితండ్రికి తెలియకుండా వివాహం చేసుకుంటే వచ్చే కష్టాల గురించి తెలుస్తుంది.

పురాణేతిహాసాల  కధల ద్వారా  విషయాలను తెలుసుకుని,  జీవితంలో ముందుగానే  జాగ్రత్తగా ప్రవర్తించాలి. 

ఒకవేళ  ఏమైనా  సమస్యలు వస్తే,  ఎవరి సమస్య,  స్థితి, పరిస్థితి, శక్తి ని ..బట్టి పరిష్కరించుకోవాల్సి  ఉంటుంది. 

పరిష్కారం  తోచనప్పుడు  సరైన దారి చూపించమని  దైవాన్ని వేడుకోవాలి. 



5 comments:




  1. ఈ రోజుల్లో ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. భార్య కళ్ళుగప్పి వివాహేతర సంబంధాలు తిరిగేవారు కొందరైతే, భర్త కన్నుగప్పి తిరిగే స్త్రీలు కొందరు ..ఇలా జీవితభాగస్వామిని మోసగించే వాళ్ళకు శిక్షపడటంలో తప్పులేదు. మరికొందరు స్త్రీలు, పురుషులు పరాయివాళ్లతో తిరిగి తాము అమాయకులమని పరాయి వాళ్లే తమని మోసం చేసారని అబద్ధాలు చెప్పే వాళ్ళూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకు కూడా శిక్షపడటంలో తప్పు లేదు. అయితే కొందరు నిజంగా శీలవంతులు అయినవారు ఇతరుల వల్ల కిడ్నాప్ కాబడి తరువాత రక్షించబడి, వారు చేయని తప్పుకు వారు బాధలు పడుతున్నప్పుడు బాధగా ఉంటుంది. వారి బాధ పోయే విధంగా పరిస్థితి ఉంటే మంచిదే. అయితే అనేక కారణాల వల్ల, వారి బాధ పూర్తిగా పోయే పరిస్థితి లేనప్పుడు, కనీసం వారి బాధ కొంత వరకు అయినా ఉపశమనం కలిగే విధంగా వారిని ఆదుకోవాలి. స్త్రీల విషయంలోనైనా, పురుషుల విషయంలోనైనా అన్యాయం జరిగిన వారిని ఆదుకోవాలి.

    ఎవరి సమస్య, స్థితి, పరిస్థితిని బట్టి వారు సరైన నిర్ణయం తీసుకోవాలి.ఏం చేయాలో తోచనప్పుడు, సరైన పరిష్కారం లభించాలని దైవాన్ని ప్రార్ధించటం మంచిది.

    ReplyDelete

  2. కొందరి జీవితాలను గమనిస్తే బాధనిపిస్తుంది. ఎన్నో కష్టాలు,ఇతరుల కోసం తాము త్యాగాలు చేయవలసిరావటం..జరుగుతాయి.

    రాజకుటుంబాలు, సైనికుల కుటుంబాలు, ఇంకా మరికొందరి జీవితాలలో ఇతరుల కోసం కష్టపడే సంఘటనలు ఎక్కువగా ఉంటాయి.

    ఈవన్నీ గమనిస్తే, ప్రభువులు, సైనికులు, ఇంకా కొందరు మాత్రం త్యాగాలు చేస్తుంటే, మరికొందరు బాధ్యత లేకుండా బ్రతకటం న్యాయమా ? అనిపిస్తుంది.

    ఎవరికైనా జీవితంలో సుఖంగా ఉండాలనే ఉంటుంది.కష్టాలు అనుభవించాలని ఉండదు. మరి ఎందుకిలా? అని సందేహాలు వస్తాయి.

    ఇలా జరగటానికి కొన్ని కారణాలను గమనిస్తే,

    ఎవరికి ఎలాంటి జన్మ వస్తుంది? జివితంలో ఎలాంటి సంఘటనలు జరుగుతాయనేది వారి గత కర్మలను బట్టి ఉంటుంది. వారి గతకర్మల కారణాల వల్ల ..అలా కష్టాలు వచ్చి ఉండవచ్చు.

    కొందరు అవతారమూర్తులు ప్రజలకు కష్టం తగ్గడం కొరకు వారి కర్మల భారాన్ని తమపై వేసుకుంటారు.


    కొన్నిసార్లు లోకానికి దిశానిర్దశం కొరకు ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. వారి జీవితకధల ద్వారా తరువాతి తరాలకు ఎన్నో విషయాలు తెలియటం కోసం దైవం ఇలాంటి సంఘటనలను జరిపిస్తారనిపిస్తుంది.


    ప్రజలు కూడా పదేపదే తప్పులు చేస్తూ భగవంతునిపై భారాన్ని వేసేయటం కాకుండా, బాధ్యతగా, నీతిగా ప్రవర్తించడానికి ప్రయత్నించాలి.

    ReplyDelete
  3. నాకు తోచిన విషయాలను వ్రాసుకున్నాను. ఇప్పుడు ఈ విషయాలపై చర్చించాలని అనుకోవటం లేదు. దయచేసి కామెంట్స్ వ్రాయవద్దని కోరుతున్నానండి.

    ReplyDelete

  4. ఇక్కడ కొన్ని విషయాలను చెప్పాలనిపిస్తోంది. ఎవరైనా స్త్రీలు, పురుషులు వివాహేతర సంబంధాలతో తిరుగుతుంటే వారి జీవితభాగస్వాములు వారిని శిక్షించటంలో తప్పులేదు.

    అయితే, మంచినడవడిక కలిగిన స్త్రీలు చెడ్డవాళ్ళైన పురుషుని వల్ల కిడ్నాప్ కు గురవ్వటం..వంటి సంఘటనలనల గురించి అప్పుడప్పుడు వింటున్నాము.

    ఇలాంటివి జరిగి, రక్షించబడి ఇంటికి వస్తే అప్పుడు ఆ భార్యాభర్తా పరిస్థితి కొంత గందరగోళంగా ఉండే అవకాశం ఉంది. సర్దుకుపొమ్మని చెప్పటం తేలికే గానీ, సర్దుకుపోవటం అంత తేలిక కాదు.

    జరిగింది ఒక యాక్సిడెంట్ అనుకుని ,భార్యాభర్త మామూలుగా ఉన్నాకూడా, ఇంట్లో పెద్దవాళ్లు ,ఇరుగుపొరుగులు, సమాజం ..సూటిపోటిమాటలతో వేధించే అవకాశాలే ఎక్కువ.

    ఈ బాధలు పడలేక భార్యాభర్త తలొకదగ్గర జీవించాలనుకుంటే భార్య పరిస్థితి ఏమిటి? ఆధారం లేని స్త్రీ ఎలా బ్రతకాలి?

    పాతకాలంలో స్త్రీలు.. భర్త పోయినా, భర్త వదిలేసినా పుట్టింటికి వెళ్ళేవారు. తల్లితండ్రి చనిపోయినా కూడా సోదరుల ఇంట ఉండేవారు.

    అరుదుగా మునుల ఆశ్రమాలలో ఆశ్రయం పొందేవారు.ఈ రోజుల్లో ఎవరిబ్రతుకులు వాళ్ళవే.
    వయస్సు మీదపడ్ద తల్లితండ్రి వాళ్ళే ఇతరుల సహాయంతో జీవించే పరిస్థితి ఉంటుంది.

    కొందరు తల్లితండ్రి కూడా సమాజానికి భయపడి కూతుర్ని ఆదరించకపోవచ్చు.

    పుట్టింటివాళ్ళు ఆదరించి అక్కున చేర్చుకున్నా కూడా ఆ కుటుంబంలో వచ్చిన కోడళ్ళకు వీళ్ళకు మధ్య గొడవలు లేకుండా ఉండాలి.

    ఉమ్మడికుటుంబాల్లో వదినా మరదళ్ళు.. ఆడపడుచుల మధ్య గొడవలు, తోడికోడళ్ళ మధ్య గొడవలు, అత్తా.. కోడళ్ళ మధ్య గొడవలు తెలిసినవే కదా!

    ఇక ఈ రోజుల్లో ఆశ్రమాల గురించి ఎవరిని నమ్మాలో? ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి.

    సమాజంలో స్త్రీల పట్ల లైంగికవేధింపుల గురించి ఎన్నో విషయాలు వింటున్నాము. ఇక, ఒంటరి మహిళ అంటే ఎన్ని కష్టాలో?

    మగవాళ్ళ దగ్గరకు వెళ్ళి కష్టాలు చెప్పి సాయం అడిగితే వాళ్ళు మోసం చేసే అవకాశం ఉంది.

    ఇలాంటి పరిస్థితిలో స్త్రీలకు అండగా ఆదుకోవడానికి మనసున్న మనుషులు ఇచ్చే విరాళాలతో స్త్రీ నిధి ఏర్పాటు కావాలి.

    స్త్రీలే మహిళామండలులు ఏర్పాటు చేసుకుని, డ్వాక్రా మహిళల వలె సొంతంగా గ్రూపులుగా చిన్నపరిశ్రమలు ఏర్పాటుచేసుకుని ఆర్ధికాభివృద్ధి సాధించాలి.

    ఒంటరిగా జీవించడానికి భయంగా ఉంటే, స్త్రీలు అపార్ట్మెంట్స్ ఇళ్ళలో కలిసి కానీ, ప్రక్కప్రక్కన కానీ ఉంటే ఒకరికొకరు అండగా ఉంటారు. ఆర్ధికాభివృద్ధి సాధించి పిల్లలను చక్కగా పెంచుకోవచ్చు.

    పాతకాలంలో ఆభరణాలు , స్త్రీ ధనం ..ఆపదలలో స్త్రీలకు ఉపయోగపడేవి..

    ఈ రోజుల్లో.. కొన్ని కారణాల వల్ల వివాహబంధం నుంచి వేరుపడవలసి వచ్చే పరిస్థితిలో ఉన్న ఆర్ధిక ఆధారం లేని స్త్రీలకు న్యాయం జరగడానికి భర్తనుంచి మెయింటెన్స్ ఇవ్వాలనే చట్టాలు ఉండటం మంచి విషయం.

    అయితే, కొందరు స్త్రీలు డబ్బుకోసం అన్యాయంగా భర్తపై కేసులు పెడుతున్నారట. ఇలాంటి స్త్రీల వల్ల నిజంగా కష్టాలలో ఉన్న స్త్రీలకు అన్యాయం జరుగుతుంది.

    నిజంగా కష్టాలలో ఉన్న వారికి న్యాయం జరగాలి.

    మగవాళ్ళను స్త్రీలు కిడ్నాప్ చేయటం వంటి సంఘటనలు తక్కువే కానీ, మగవాళ్లకూ కష్టాలుంటాయి.

    కొందరు స్త్రీలు వివాహం జరిగిన పురుషుల వెంటబడి, తమను వివాహం చేసుకొమ్మని బ్రతిమాలటం లేకుంటే చచ్చిపోతామని బెదిరించే స్త్రీలూ ఉంటారు.

    వాళ్ళ కన్నీటికి కరిగిపోయో లేక చచ్చిపోతామనే బెదిరింపులకు భయపడో రెండో వివాహం చేసుకుంటే ఆ విషయాన్ని తెలిసి భరించలేక భార్య చనిపోతే ఆ కుటుంబం కష్టాల్లో పడిపోతుంది.

    ఇలాంటి సంఘటనల వల్ల కూడా కుటుంబాల్లో కష్టాలు వస్తాయి.

    స్త్రీలైనా, పురుషులైనా అసహాయ స్థితిలో ఉన్నప్పుడు వారిని ఆదుకోవాలి.

    ReplyDelete

  5. వ్యక్తుల ఆలోచనల మధ్య భిన్నత్వం ఉంటుంది. కొన్నిసార్లు ఒకే వ్యక్తి కూడా ఒకే విషయంలో భిన్నంగా ప్రవర్తించటం కూడా జరుగుతుంది.

    ఉదా..ఒకే స్త్రీ కూతురు విషయంలో ఒకరకంగా, కోడలి విషయంలో మరొకరకంగా ఆలోచించవచ్చు.

    కూతురు తప్పుచేస్తే సమర్ధించటం, కోడలు తప్పుచేయకపోయినా తిట్టటం వంటివి.

    ఉదా.. కూతురు అల్లుడు అన్యోన్యంగా ఉంటే అల్లుడు కూతురు అన్యోన్యంగా ఉన్నారని మురిసిపోవటం..

    కొడుకు కోడలు అన్యోన్యంగా ఉంటే కోడలు తన కొడుకును చెంగున ముడివేసుకుందని ఆరోపించటం...

    ఎన్నో వైరుధ్యాలు..ఎన్నో విలక్షణతలు ఉన్న ప్రపంచంలో ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సమస్యలు.

    ఒకే రకమైన సమస్యకు కూడా ఒకే విధమైన పరిష్కారం ఉండకపోవచ్చు. ఎవరి పరిస్థితిని బట్టి వారు విచక్షణతో ఆలోచించి నిర్ణయించుకోవాలి.

    ReplyDelete