koodali

Sunday, September 17, 2017

శిక్ష వల్ల తిరిగి మళ్లీ తప్పు చేయకూడదనేది సరైన ఉద్దేశ్యం. ...

 ఈ రోజుల్లో సమాజంలో పెరుగుతున్న చెడును గమనిస్తే చాలా బాధ కలుగుతుంది.

 కొందరు ప్రజలు పైకి చెప్పేదానికి, చేసే దానికి పొంతన ఉండటం లేదు. 

  భక్తులమని చెప్పుకునే వాళ్ళలో కూడా కొందరు చెడుపనులు చేస్తున్నారు.


 భక్తులనే వాళ్లు  పాపాల విషయంలో ఎందుకు భయపడటం లేదు? 


బహుశా వాళ్ళ ఉద్దేశం ఎన్ని పాపాలు చేసినా దానికి తగ్గ పరిహారం చేసుకుంటే చాలు.. పాపాల నుంచి విముక్తులు కావచ్చని అనుకుంటున్నారు కాబోలు, 


 
లేక మనస్సును అదుపులో ఉంచుకోలేక  తిరిగి తప్పులు చేస్తారు.  


****************
ఎవరైనా తప్పు చేస్తే చట్టంలో దానికి తగ్గ శిక్షలుంటాయి. 

ఇలా శిక్షించటం ఎందుకంటే, శిక్ష వల్ల భయంతో ఇకమీదటైనా తప్పులు చేయరనే ఉద్దేశంతో శిక్షిస్తారు.

అంతేకానీ , తప్పు చేసినా తప్పుకు శిక్షగా జరిమానా చెల్లించటం లేక కొంతకాలం జైల్లో ఉండి వచ్చి , చేసిన తప్పులకు పరిహారం జరిగిపోయింది కాబట్టి, మళ్లీ తప్పులు చేయటం  ..అనేది అసలు ఉద్దేశం కాదు. 


శిక్ష వల్ల తిరిగి మళ్లీ తప్పు చేయకూడదనేది  సరైన ఉద్దేశ్యం. 


 చెడుపనుల వల్ల   కష్టాలు వచ్చినప్పుడు , 
ఆ కష్టాల నుండి తప్పించుకోవటానికి పరిహార పూజలు చేసుకోవటంలో తప్పులేదు.

 అయితే పరిహారం జరిగింది కాబట్టి, మళ్లీ పాపాలు చేయటం తప్పు.


ఎన్ని పాపాలు చేసినా .. పరిహారాలతో బైటపడవచ్చు ..అనే భావన ప్రజలలో వస్తే అది ఎంతో ప్రమాదకరమైనది. పూర్వీకులు మనకు తెలిపిన ఉద్దేశ్యాలకు వ్యతిరేకమైనది.

****************
 రావణాసురుడు ఎంతో గొప్ప పండితుడు. అతనికి ఎన్నో పరిహారాలు తెలిసే ఉంటాయి. 

అయినా మరి శిక్ష నుంచి తప్పించుకోలేకపోయాడు.


పాపాలు చేయటాన్ని కొనసాగిస్తున్నప్పుడు పరిహారాలు చేయాలన్నా..అనుకున్నట్లు జరగకపోవచ్చు.

**************** 
  కష్టాల నుండి తప్పించుకోవాలంటే, చేసిన పాపాల గురించి పశ్చాత్తాపపడి మంచిమార్గంలోకి రావటానికి ప్రయత్నించాలి.

తప్పులు చేసిన వారిని క్షమించటమూ అవసరమే. అయితే ఎంతవరకు?  

 దైవం దయామయులు. ఎవరైనా మంచిగా మారటానికి కొంత సమయాన్ని ఇస్తారు. 


ఆ తరువాత కూడా వినకపోతే వారికి తగిన శాస్తి జరుగుతుందని పురాణేతిహాసాల ద్వారా తెలుస్తుంది. 


శ్రీరామునికి సీతాదేవిని అప్పగించేయమని ఎందరు చెప్పినా రావణాసురుడు వినలేదు. 


శివుని అంశ అయిన హనుమంతులవారు మంచి చెప్పినా రావణుడు వినిపించుకోలేదు. తుదకు అందుకు తగిన శిక్షను అనుభవించాడు.


శ్రీకృష్ణుడు..శిశుపాలుని నూరు తప్పుల వరకు సహించి తరువాత శిక్షించారు. 


అందువల్ల,  అందరమూ జాగ్రత్తగా ఉండటం మంచిది.
 
 
********
రావణాసురునికి తాను గొప్పసంపదలు ఉన్న వ్యక్తిని అనే అహంకారంతో పాటు, తన భక్తి కూడా ఎంతో గొప్పది, దైవం కూడా తన భక్తికి లొంగక తప్పదు.. అనే అహంకారం ఉండి ఉంటుంది.అందుకే అతనిపరిస్థితి అలా అయ్యింది.
 
 దైవం పట్ల ప్రేమతో కూడిన శరణాగతి ఉంటే,
 దై
వం  కాపాడుతారు.
 
 *******************
కొందరు చేసే చెడ్దపనుల వల్ల సమాజంలో ఎందరికో కష్టాలు వస్తాయి.

ఇలాంటప్పుడు దైవం చూస్తూ ఊరుకోరు.. చెడుపనులు చేసేవారిని తనదైన విధానంతో దారిలోకి తెస్తారు.
***************
ధర్మమార్గంలో జీవించే ప్రయత్నం చేయాలి..   సరైన మార్గంలో ప్రవర్తించే శక్తిని ఇమ్మని దైవాన్ని ప్రార్ధించాలి. 
అంతా దైవం దయ.



No comments:

Post a Comment