మేము చెన్నైలో ఒక అపార్ట్మెంట్లో ఉండే రోజుల్లో అపార్ట్మెంటుకు సెక్రటెరీగా ఒకామె ఉండేవారు. ఆమె బాగా చదువుకున్నామె . నాకు ఆమె గురించి ఎక్కువ విషయాలు తెలియవు.
అయితే, అపార్ట్ మెంట్ లో తెలుగు తెలిసిన ఒక పెద్దామె నాకు బాగా పరిచయం అయ్యారు.
ఆ పెద్దామె ఎన్నో కబుర్లు చెప్పేవారు. మాటల్లో సెక్రటరీ కుటుంబం గురించి కూడా కొన్ని విషయాలు తెలియజేసారు.
ఉదా.. సెక్రటరీ, శ్రీ కృష్ణజయంతి పండుగ రోజు బాగా పూజలు చేస్తారట , సుమారు 21 రకాల పిండివంటలతో నైవేద్యం దేవునికి నివేదిస్తారట.
ఒకసారి నేను ఒక పని గురించి సెక్రటరీ గారింటికి వెళ్ళాను. వారి ఇంట్లో గమనిస్తే , వేరే మతం యొక్క చిత్రాలు గోడకు కనిపించాయి. ఈ విషయాన్ని నేను నాకు పరిచయం ఉన్న పెద్దామెతో చెపితే ఆమె ఆశ్చర్యపోయి నమ్మలేదు.
కొంతకాలానికి సెక్రటరీ వాళ్ళు వేరే మతం ప్రకారం పూజలు చేస్తున్నట్లు బహిరంగంగా తెలిసింది ..ఈ విషయాన్ని పెద్దామె నాతో చెప్పి విపరీతంగా ఆశ్చర్యపోయింది.
నేను ఇంతకుముందే చెప్తే మీరు నమ్మలేదు కదా ! అన్నాను.
సెక్రటరీ గారు విషయాన్ని రహస్యంగా ఉంచటం వల్ల త్వరగా ఎవరికీ తెలియలేదు.
విషయం బయటకు తెలిసిన తరువాత సెక్రటరీ గారి ఆచారవ్యవహారాలలో చాలా మార్పులు వచ్చాయి.
అప్పటివరకూ విపరీతంగా హిందూ ఆచారవ్యవహారాలను పాటించిన ఆమెలో అంత మార్పు ఎలా వచ్చిందో ? అని మాకు ఆశ్చర్యం అనిపించింది.
కొద్దికాలం తర్వాత మేము మా సొంత కారణాలతో ఆ అపార్ట్ మెంట్ మారి వేరే ఇంటికి వెళ్లటం వల్ల అపార్ట్ మెంట్ విషయాలు సరిగ్గా తెలియలేదు.
అయితే, కొంతకాలం తర్వాత , మాకు తెలిసిన పెద్దామె ద్వారా కొన్ని విషయాలు తెలిసాయి. సెక్రటరీ మళ్లీ ఏమంటున్నదంటే , తమ పిల్లలకు హిందువులతోనే వివాహాలు జరిపిస్తామని చెప్పటం జరిగిందట. తరువాత ఏం జరిగిందో తెలియదు.
(ఈ సెక్రటరి గారు తమిళ బ్రాహ్మణులు.ఇది నిజంగా జరిగిన సంఘటన.)
వారు ఆలా ఎందుకు చేసారో నాకు తెలియదు.
*******************
ఎవరి శక్తిని బట్టి వారు దైవప్రార్ధన చేసుకోవచ్చు. ..
ఎవరి శక్తిని బట్టి వారు దైవప్రార్ధన చేసుకోవచ్చు. ..
ఎవరైనా మతం మారటానికి ఎన్నో కారణాలు ఉంటాయేమో? హిందువులలో కొందరు అంటరానితనం వంటి కారణాలతో బాధపడి మతం మారితే,కొందరు మారటానికి మరి కొన్ని కారణాలు కూడా ఉండవచ్చు.
ఇంకా మరికొన్ని విషయాలను గమనిస్తే, ఆధునిక కాలంలో ఆచారవ్యవహారాల్లో వచ్చిన విపరీతపోకడలు కూడా ఇందుకు కారణం కావచ్చు.
ఆచారవ్యవహారాల్లో క్లిష్టత ఉన్నాకూడా ప్రజలు సరళంగా ఉండే విధానాలపట్ల మొగ్గుచూపే అవకాశం ఉంది.
ప్రజల మంచికోసం ఎన్నో చక్కటి ఆచారవ్యవహారాలను ప్రాచీనులు తెలియజేసారు.
అయితే ,ఆధునిక కాలంలో కొందరు ఆచారవ్యవహారాలను కొత్తగా మార్చుకుంటూ , తమకుతామే మోయలేనంతగా నెత్తిన వేసుకుని విసుగు తెచ్చుకుని..ఆచారవ్యవహారాలను ఆడిపోసుకోవటం న్యాయం కాదు కదా!
ఆధునిక కాలపు పరిస్థితులను ఊహించిన పూర్వీకులు ఎన్నో విషయాలను తెలియజేసారు.
ఉదా..కలికాలంలో కేవలం దైవనామాన్ని స్మరిస్తే చాలు ..గొప్ప ఫలితం లభిస్తుందని సడలింపులను తెలియజేయటం జరిగింది.
షిరిడి సాయి నవవిధ భక్తులు గురించి తెలియజేసారు. ఇంకా, భక్తి లేని సాధనములన్ని నిష్ప్రయోజనములని చెబుతూ కావలసినది ప్రేమాస్పదమయిన భక్తి మాత్రమే అని తెలియజేసారు.
సాయిబాబాను కొందరు ఆదిపరాశక్తి అవతారముగా భావించేవారట....
.భక్తులలో కొందరికి శివునిగా, కొందరికి కృష్ణుడుగా, కొందరికి గురువుగా ,కొందరికి వారివారి ఇష్ట దైవముల రూపములో దర్శనమిచ్చారట.
**************
ఆచార వ్యవహారాలు అవసరమే, అయితే మూఢత్వం పెంచే విధంగా కాకుండా ఎవరి విచక్షణతో వారు పాటించటం అవసరం.
ఆచారవ్యవహారాలను నిక్కచ్చిగా పాటించాలనుకుంటూ విసుగు వచ్చేలా చేసుకోవటం కాకుండా..తమశక్తికి తగినంతలోనే పూజలు చేస్తూ దైవభక్తి ఎక్కువగా ఉండేలా నిలుపుకోవటం సరైన పద్ధతి అనిపిస్తుంది.
దీనికి సంబందించిన ఒక కధను పెద్దలు తెలియజేసారు.
ఒక భక్తుడు భక్తి పారవశ్యంలో పూజ చేస్తూ దైవానికి అరటిపండ్లను నివేదించబోయి, భక్తి పారవశ్యంలో అరటిపండ్లను ప్రక్కన పడవేసి వాటి తొక్కలు తీసి దైవానికి నివేదిస్తారు. ఆ భక్తుని భక్తికి మెచ్చిన దైవం అతనికి దర్శనాన్ని అనుగ్రహించారని అంటారు.
తరువాత కొంతసేపటికి భక్తుడు తాను చేసిన పొరపాటు తెలుసుకుని.. ఈ సారి పొరపాటు రాకుండా పూజ చేయాలనే తాపత్రయంలో భక్తి కన్నా, పూజను చేసే విధానంపైనే ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించగా ఈసారి దైవం ప్రత్యక్షం కాలేదట.
ఈ కధ ద్వారా ఏం తెలుస్తుందంటే, పూజా విధానాలను, ఆచారవ్యవహారాలను చక్కగా పాటించటం మంచిదే కానీ, దైవంపై భక్తి అన్నింటికన్నా ముఖ్యం.. అని గ్రహించాలి.
శక్తి ఉన్నవారు ఆచారవ్యవహారాలను నిక్కచ్చిగా పాటించుకోవచ్చు. అంత ఓపిక లేనివారు తమకు వీలున్నంతలో పాటించుకోవచ్చు. ఎవరి శక్తిని బట్టి వారు దైవప్రార్ధన చేసుకోవచ్చు.
అంతేకాని, తమకు శక్తి లేనప్పుడు మోయలేనంతగా నెత్తిన వేసుకుని విసుగు తెచ్చుకుని..ఆచారవ్యవహారాలను ఆడిపోసుకోవటం న్యాయం కాదు కదా!
No comments:
Post a Comment