koodali

Friday, July 12, 2013

ఎవరూ తక్కువ కాదు , కులం కన్నా గుణం ప్రధానం..వంటి ఎన్నో మంచి విషయాలను తెలియజేసిన శ్రీ కృష్ణ పరమాత్ముని,భారతాన్ని,శంకరాచార్యుని విమర్శించటం సరైనది కాదు...


దయచేసి  ఈ  వ్యాసం  చివరి  వరకూ  చదువుతారని  ఆశిస్తున్నానండి.

కొందరు  ఏమంటారంటే ,  ప్రాచీన  గ్రంధాలలో  ఒకే  విషయం  ఎన్నో  విధాలుగా  ఉంటుంది.  అంటారు. 

 ఉదా..  సత్యమే  గొప్పది  కాబట్టి  అసత్యం  పలకకూడదు  అంటారు.


 అయితే,
  ఆపత్కాలంలో  అసత్యం  పలికినా   తప్పుకాదు  అంటారు. 

 ఇదంతా  మాకు  అర్ధం  కావటం  లేదు.  పెద్దలకు  సరైన  పంధా  లేదు  .  అని  కొందరు  విమర్శిస్తుంటారు.

ఆలోచించండి,   ప్రతిదానికి  అసత్యాలు  ఆడటం  వల్ల  సమాజంలో  అస్తవ్యస్థ  పరిస్థితులు  ఏర్పడుతాయి. 


ఎన్నో  ఘోరాలు,  నేరాలు  జరగటానికి  అబద్ధము  ఒక  ముఖ్యమైన  కారణం.  అందువల్ల  సత్యమే  పలకాలి.  అని  పెద్దలు  తెలియజేయటం  జరిగింది. 

అయితే,  అసత్యం  పలకటం  కొన్నిసార్లు  తప్పనిసరి  అవుతుంది. 

ఉదా...కొందరు  ఆకతాయి  కుర్రాళ్ళు   ఒక  సాధు  జంతువును  బాగా  కొడుతూ  వస్తున్నారు.  ఆ  జంతువు  అప్పటికే  బాగా  దెబ్బలు  తిని  ఆయాసంతో  వగరుస్తూ  మీ  ఇంటి  వద్దకు  వచ్చి   చెట్టు  క్రింద  దాక్కుంది.

ఆలస్యంగా   వచ్చిన   కుర్రవాళ్ళు  జంతువు   ఎటు  వెళ్ళిందని  మిమ్మల్ని  అడిగారు. అప్పుడు  మీరు  ఏం  చేస్తారు  ?

జీవితంలో  సత్యమే  పలుకవలెను...అని   ఆ  జంతువు  దాక్కున్న  ప్రదేశాన్ని  చూపించరు  కదా  !

అసత్యం  చెప్పకపోయినా , కుర్రవాళ్ళకు  యుక్తియుక్తంగా  జవాబు  చెప్పి  వాళ్ళను  అక్కడనుంచి   పంపించి  ఆ  జంతువును  రక్షించటానికే  ప్రయత్నిస్తారు  కదా !

( గ్రంధాలలోని ఒక  కధ ఆధారంగా ఈ సంఘటన వ్రాసాను.)

మనం  పలికే  సత్యం  వల్ల  నిష్కారణంగా  అమాయకుల  ప్రాణం  పోయే  పరిస్థితి  ఉన్నప్పుడు  సత్యం  పలికినా  అది  అసత్యం  పలికిన  దానితో  సమానమే  నంటారు. 


 అందువల్ల  పరిస్థితిని  విశ్లేషించుకుని   వివేకంతో  ప్రవర్తించాలన్నది  పెద్దల  అభిప్రాయం.

నిదానమే  ప్రధానం  అన్న  పెద్దలే  ఆలస్యం  అమృతం  విషం . అని  కూడా  అన్నారు.

ఇవన్నీ  చదివిన   కొందరికి  పెద్దల  మీద  కోపం  వచ్చేస్తుంది.  పెద్దలు  ఏమిటి ? గ్రంధాలలో  వాళ్ళ  ఇష్టం  వచ్చినట్లు  వ్రాశారు. 

కాసేపు  నిదానమే  ప్రధానమంటారు.  కాసేపు  ఆలస్యం  అమృతం  విషం  అంటారు.   పూర్వీకులకు  ఏమీ  తెలియదు . అని  ఇంకా  ఏమేమో  నోటికొచ్చినవన్నీ  అనేస్తారు.

పెద్దలు  చెప్పిన  దానిలో  తప్పేముంది ?  రెండూ  నిజమే.

జీవితంలో  కొన్నిసార్లు  నిదానమే  ప్రధానం . అన్నట్లు  ప్రవర్తించాలి.  కొన్నిసార్లు  ఆలస్యం  అమృతం  విషం . అన్నట్లు   త్వరగా  నిర్ణయాలు  తీసుకోవాలి.

భార్యాభర్త   కొట్లాడుకుని  న్యాయమూర్తి  వద్దకు    తీర్పు  కోసం  వస్తే  నిదానమే  ప్రధానం  అని  నిదానంగా  ఆలోచించి  తీర్పు  చెప్పాలి.   కొంచెం  సమయం  గడిస్తే  ఈ  లోగా   భార్యాభ
ర్త  మధ్య  కోపం  తగ్గి  వాళ్ళే  సర్దుకుపోయే  అవకాశం  ఉంది.

అయితే,  అగ్ని  ప్రమాదం  జరిగి  కొంపలు  అంటుకుపోతుంటే  .....నిదానమే  ప్రధానం  అన్న  సూత్రం  వర్తించదు.  ఆలస్యం  అమృతం  విషం.  అన్నట్లు  త్వరగా  నిర్ణయం  తీసుకోవాలి. 

వేదాలలో  చెప్పిన  విషయాలు   చక్కగా  అర్ధం  అవటం  కోసం  పురాణేతిహాసాలు  వెలువడ్డాయి.

పురాణేతిహాసాలను  మరింత  స్పష్టంగా  వివరించటానికి  అవధూతలు,  అవతారమూర్తులు , సద్గురువులు...ఎందరో  అవతరించి  ప్రపంచానికి  దిశానిర్దేశం  చేస్తున్నారు.

........................................

శ్రీకృష్ణుడు  తనను  విందుకు  ఆహ్వానించిన  దుర్యోధనుని  ఆహ్వానాన్ని    తిరస్కరించి  విదురుని  ఇంట  విందును  స్వీకరించారు.  విదురుని  తల్లి  శూద్ర స్త్రీ. 


 ఈ  సంఘటన  ద్వారా   కులం  కన్నా  గుణమే  ప్రధానం  అని  లోకానికి  చాటినట్లయింది.

 శూద్రుడైన  ధర్మవ్యాధుడు  బ్రాహ్మణుడైన   పండితునికి   కర్తవ్యబోధ  చేసిన  సంఘటన  ఉంది.( భారతంలో..) 

   గొప్ప  సందేశాలున్న    మహా  భారతాన్ని,  అందులో  ముఖ్య పాత్రధారి   అయిన  శ్రీ  కృష్ణ  పరమాత్మను  విమర్శించటం  అంటే ,   విమర్శించిన  వారు   శ్రీ  కృష్ణపరమాత్మను  మరియు   ప్రాచీన  గ్రంధాలను  సరిగా  అర్ధం  చేసుకోలేదని  అర్ధం. 
...........................................

ప్రాచీన  గ్రంధాలలో  శివునికి  విష్ణువుకు  భేదం  లేదని  పెద్దలు  ఎన్నో  చోట్ల  తెలియజేయటం  జరిగింది.  


అయినా  ఎందరో  పండితులు  తరతరాలుగా  శివుడే  గొప్ప,  విష్ణువే  గొప్ప  అంటూ..    సమాజంలో    గొడవలను  సృష్టించారు.  ఆది  శంకరాచార్యుల  వారు  ఈ  భేదాలను  రూపుమాపటానికి  కృషిచేశారు.

 ఇంకా ,  మనీషాపంచకము  నాటి  సంఘటన  ద్వారా  అంటరానితనం  సరైనది  కాదని  లోకానికి  చాటి  చెప్పారు.  ఇంకా  ఎన్నో  చక్కటి  పనులను  చేశారు. 


 అంటరానితనం  తప్పని  లోకానికి  తెలియజేసిన  ఆది శంకరాచార్యుని  విమర్శించటం  సరైనది  కాదు.

 శివకేశవుల  మధ్య  భేదాలతో  కొట్టుకు చస్తున్న వారిని  ఉద్ధరించి , సమాజంలో  ప్రశాంత  వాతావరణాన్ని  ఏర్పరిచిన  ఆది శంకరాచార్యుని  విమర్శించటం  సరైనది  కాదు.

శూద్ర  వనిత  పుత్రుడైన  విదురుని  ఇంట  ఆతిధ్యం  స్వీకరించటం  ద్వారా  కులం  కన్నా  గుణం  గొప్పదని  లోకానికి  చాటిన   శ్రీ  కృష్ణుని  విమర్శించటం  సరైనది  కాదు.

ధర్మవ్యాధుని  కధ  ద్వారా  ఎవరూ  తక్కువ  వారు  కాదు ... మాంసాన్ని విక్రయించే వారు కూడా  గొప్పవారే .... అని  చాటిన  భారతాన్ని  విమర్శించటం  సరైనది  కాదు.

వ్రాసిన  విషయాలలో   పొరపాట్లు  ఉంటే  దయచేసి  క్షమించాలని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.


3 comments:

  1. మంచి మాటలు చెప్పారు. అర్థం చేసుకుంటారని ఆశిద్దాం.

    ReplyDelete
  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    ReplyDelete
  3. very nice post.., and 100% true...,

    ReplyDelete