koodali

Monday, June 24, 2013

జీవులకు భూమి ఒక పరీక్షాలోకం.

 
మనకు  అనేక  సందేహాలు  వస్తుంటాయి.  లోకంలో  కష్టాలు  ఎందుకుండాలి  ?  అన్నీ  సుఖాలే  ఉండవచ్చు  కదా  !  వంటి  ప్రశ్నలు ..చక్కటి  ఆహారం  తీసుకోవటం  మనకు  సుఖంగా  అనిపిస్తే  మన  ఆహారం  కోసం  త్యాగం  చేసే  మొక్కల  సంగతేమిటి  ?  

మొక్కలు  సుఖంగా  ఉండాలంటే  మనుషులు  కేవలం  రాలిపడిన  ఆకులను,  పండ్లను  తిని  జీవించాలి.  అందుకు  ఎందరు  సిద్ధంగా  ఉంటారు  ?

కష్టాలు లేని లోకాలూ ఉన్నాయి. అవి పొందాలంటే, అర్హత సంపాదించాలి.....

కొంతకాలం క్రిందటి వరకూ ఇలా అనిపించేది.

* సృష్టిలో ఎన్నో బాధాకరమైన సంఘటనలు జరుగుతున్నాయి కదా ! అవి ఎందుకు జరగాలి ? అనిపించేది. 

  అయితే , ఇప్పుడు ఏమనిపిస్తుందంటే, ఈ లోకంలో బాధ కలిగించే విషయాలున్నాయి నిజమే.    కానీ , భూకంపాలు, సునామీలు, వంటి బాధలు , ఇతర బాధలు లేని లోకాలు కూడా ఉన్నాయి.

* " ఒక యోగి ఆత్మకధ " గ్రంధములో చెప్పబడిన , కారణలోకం.... వంటి  ఉత్తమలోకాలలో ఈ బాధలుండవు.

కానీ అక్కడికి చేరుకోవాలంటే ఈ జన్మలో సక్రమమార్గంలో జీవించాలి. అలా క్రమంగా అత్యుత్తమమైన బ్రహ్మానంద పరమపదమును పొందవచ్చు.

* మానవులు ఈ భూలోకంలోనే శాశ్వతంగా ఉండిపోవాలని దైవం యొక్క అభిప్రాయం కాదని పెద్దలు చెపుతారు.

* మానవులు సత్కర్మలను ఆచరించటం ద్వారా దైవకృపను పొంది ,బాధలు లేని ఉత్తమలోకాలను పొంది, పరమపదాన్ని పొంది బ్రహ్మానందాన్ని పొందాలని వారి భావన.


* ఇంకా, ఏమనిపిస్తుందంటే, ఇదంతా దైవం మనకు పెట్టే పరీక్ష.

ఈ ప్రపంచమనే పరీక్షలో ఎక్కువ మార్కులు తెచ్చుకుని పాసయిన వారికే బాధలు లేని ఉత్తమ లోకాలను పొందే అర్హత లభిస్తుంది. క్రమంగా అలా పరమపదాన్నీ పొందే అర్హత లభిస్తుంది.అనిపించింది.


లోకంలో మామూలు పరీక్షలంటేనే , ఎంతో కష్టపడి   చదవాలి. ఆటల్లో గెలవాలన్నా ఎంతో శ్రమపడి   కోచింగులు తీసుకోవాలి. ఆటల్లో తగిలే దెబ్బలకు  భయపడకుండా కష్టపడాలి.

మరి బాధలు లేని ఉత్తమలోకాలను పొందాలన్నా, పరమపదాన్ని పొందాలన్నా కొంచెమయినా  కష్టపడకుండా ఎలా .

* ఇలా అనిపించిన తరువాత నా సందేహం తీరింది.

* జీవులకు అసలు పరీక్ష........ మనసును అదుపులో పెట్టుకోవటమే.

అందుకే పెద్దలు అంటారు మనస్సును జయించితే.....ప్రపంచాన్ని
జయించినట్లే అని.


* అందుకే లోకంలో ఇన్ని కష్టాలు ఎందుకు ఉన్నాయి ? అని వాటిని చూసి నిరాశ పడిపోకూడదు.

గొప్ప సుఖాలను పొందాలంటే కొన్ని కష్టాలను ఎదుర్కోవాలి మరి.

చిన్నపిల్లలు నడక నేర్చుకునే క్రమంలో ఎన్నోసార్లు క్రిందపడి దెబ్బలు తగిలించుకుని ఏడుస్తారు. అది సహజం. 


నడకనేర్చుకునేటప్పుడు దెబ్బలు ఎందుకు తగలాలి ? మా అమ్మ ఎంత దయలేనిది . నేను క్రిందపడి దెబ్బలు తగిలించుకుంటున్నా కూడా నడకనేర్చుకోమంటోంది. అని పిల్లలు అనుకోరు కదా ! .

సైకిల్ నేర్చుకునేటప్పుడు బాలన్స్ చేతకాక ఎన్నో సార్లు క్రిందపడి దెబ్బలు తగిలించుకుంటారు. అయినా లెక్కచేయకుండా ఉత్సాహంగా సైకిల్ నేర్చుకుంటారు.


 అంతేకానీ సైకిల్ నేర్చుకోవాలంటే దెబ్బలు ఎందుకు తగులుతాయి ? ఇది చాలా అన్యాయం, మా నాన్నకు కూడా దయలేదు, క్రిందపడుతున్నా జాలి లేకుండా సైకిల్ నేర్పిస్తున్నారు. అని పిల్లలు అనుకోరు కదా !

ఒక ఆఫీసులో ఉద్యోగస్తులను చేర్చుకోవాలన్నా వ్యక్తుల అర్హతలను పరిశీలించే ఉద్యోగంలో చేర్చుకుంటారు..... రోడ్డున పొయ్యే వారిని పిలిచి ఎవరికైనా ఉద్యోగాలు ఇవ్వరు కదా !


* అలాగే, మరి కష్టాలు లేని ఉత్తమలోకాలను పొందాలన్నా దానికి కొన్ని అర్హతలను సంపాదించాలి.

* అలాగే పరమపదాన్ని సాధించే క్రమంలో ......... జీవితంలో ఎదురయ్యే కష్టాలు, సునామీలు, భూకంపాలూ అటువంటివే.

ఆ కష్టాలను చూసి ధైర్యాన్ని కోల్పోకూడదు. అప్పుడే బ్రహ్మానందం మనకు లభిస్తుంది.

* భూకంపాలు, రైలు ప్రమాదాలు వంటి ప్రమాదాల్లో కూడా కొందరు చెక్కుచెదరకుండా బయటపడతారు, కాలం కలిసి వస్తే అంతే మరి.


* చిన్నచీమ కూడా తాను ఎప్పుడు ఎవరి కాలిక్రింద పడి చనిపోతానో అని భయపడకుండా తన జీవితాన్ని సాగిస్తుంది.

* మనిషి కూడా ప్రతిదానికి భయపడకుండా భగవంతునిపై భారం వేసి స్వధర్మాన్ని పాటిస్తూ నిష్కామంగా జీవితాన్ని గడపటానికి ప్రయత్నించాలి.

* బాధలు లేని లోకాలను చేరాలంటే ఈ జన్మలో సక్రమమైన పద్ధతిలో జీవించాలి.

* జీవించటమో ? మరణించటమో ! కష్టమో ! సుఖమో ! అంతా భగవంతుని దయ .అనుకున్ననాడు బాధేలేదు.


* ఆ ధైర్యం రావాలన్నా దైవకృప అవసరం . అందుకే దైవకృప కోసం ప్రయత్నించాలి..

* దయచేసి  ఈ  క్రింది  లంకెను   కూడా  చదువుతారా........



* అందుకేనేమో దైవం సునామీలనూ, సుడిగాలులనూ కూడా... 



2 comments:

  1. జీవులకు అసలు పరీక్ష........ మనసును అదుపులో పెట్టుకోవటమే.
    -----------------------------------------
    ఎంత చక్కగా చెప్పారు.

    ReplyDelete
  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
    నిజమేనండి , మనస్సును అదుపులో ఉంచుకోవటం అత్యంత కష్టం.

    అయితే, ఉలి దెబ్బలను భరించిన తరువాతే శిల అందమైన శిల్పంగా మారుతుంది.

    నిప్పుల కొలిమిలో కాలిన తరువాతే మట్టి కుండ ధృఢంగా తయారవుతుంది.

    మనస్సును అదుపులో ఉంచుకోవటానికి ప్రయత్నించే మనిషి మనీషిగా మారే అవకాశం ఉందంటారు..

    ReplyDelete