koodali

Friday, June 21, 2013

మానవతప్పిదం..గంగమ్మ ఉధృతి ..మహా విలయం ...



ఉత్తరాఖండ్ లో  జరిగిన  విషాదం  అత్యంత  బాధాకరమైనది.   వరదల  వల్ల  జరిగిన  నష్టం  ఒక  విషాదమైతే,  ఆ  తరువాత   ఆహారం,  నీరు  అందక   బాధితులు  అనుభవించిన,  అనుభవిస్తున్న   వ్యధ  మరింత  విషాదకరం .  

 4  రోజులు  గడుస్తున్నా  ఇంకా  కొందరు  సహాయం  కోసం  ఎదురుచూస్తూ  కొండలలో  చిక్కుకుని  ఉన్నారని  వార్తలు  వస్తున్నాయి.   తమకు   సహాయం  అందటం  లేదని , తమను  ఆదుకోవాలని  బాధితులు   విలపిస్తున్నారు.  ఇదంతా  చూస్తుంటే  మనదేశ పరిస్థితి  ఏ స్థాయిలో ఉందో  తెలుస్తోంది.

ఇప్పటికయినా  దైవం  దయ  వలన  వాతావరణం  అనుకూలించి  వానలు  తగ్గుముఖం  పట్టాయి  కాబట్టి ,  సహాయకార్యక్రమాలు  అందించటానికి   వెసులుబాటుగా  ఉంది. ఇలాంటివి  గమనించినప్పుడు  ప్రకృతి  ముందు మనిషి  శక్తి  ఎంత  తక్కువో   తెలుస్తుంది.

 కొన్ని రోజులు  నీరు  ఆహారం  అందకపోయినా  ఎంతోమంది  ప్రజలు  ప్రాణాలతో  బయటపడటం  దైవం  దయ  వల్లనే.

 అత్యంత  క్లిష్టసమయంలో  సైన్యం  అందిస్తున్న  సేవలు  ఎంతో  ప్రశంసనీయమైనవి.  వారిని  చూసి  మనం  ఎంతో  నేర్చుకోవాలి. సమాజానికి  ఎంతో  సేవను  అందిస్తున్న   వారు,  వారి  కుటుంబసభ్యులు   ధన్యజీవులు. 

 మీడియా  వారు  కూడా  బాధితులకు  సమాచారాన్ని  అందించి   సేవ  చేస్తున్నారు. సైన్యం ,  పోలీసులు , ఉద్యోగస్తులు  మరియు  ఇతర  సేవకులు  ఇంకా   బాధితులకు  సహాయాన్ని  అందిస్తున్న  ప్రతి  ఒక్కరికి  కృతజ్ఞతలు.

ఈ  సంఘటనలో  పెద్ద  ఎత్తున  నష్టం  జరగటానికి  వెనుక  ఎన్నో    మానవ  తప్పిదాలు  ఉండవచ్చనిపిస్తోంది.  మానవుల  మితిమీరిన  కోరికల  వల్ల   వాతావరణం  విపరీతంగా  మారిపోతోంది.  విపరీతమైన  ఎండలు,  విపరీతమైన  వానలు,  వరదలుగా  మారుతున్నాయి. 
 
 
 
గంగానది  కాలుష్యానికి  ఎన్నో  కారణాలున్నాయి.  అద్భుతమైన ,  పవిత్రమైన,  పరిశుద్ధమైన  గంగమ్మను  పూజిస్తూనే ,  కలుషితాలను  కూడా  నదిలో   విపరీతంగా  కలిపేస్తున్నారు. గంగమ్మను  గౌరవించటం  ఇలా కాదు కదా !

 ఎన్నో  పారిశ్రామిక  వ్యర్ధాలను  గంగానదిలో    వదిలేస్తున్నారట. సగం మాత్రమే  కాల్చిన  శవాలను  కూడా గంగలో  వదిలేస్తారట. 

 గంగానదిని  కాలుష్యం  బారినుంచి  కాపాడాలని  నిరాహారదీక్ష  చేసి  కొంతకాలం  క్రిందట  ఒక  సాధువు  ప్రాణాలను  కోల్పోయారు.  అయినా    కాలుష్యనివారణ  చర్యలను    పెద్దగా  చేపట్టలేదు.  


గంగను  శుద్ధిచేసి ,  కాలుష్యాలను  నదిలోకి  వదలకుండా  కట్టడి  చేసి,  నదిలో  పూడికను  తీసి  శుభ్రం  చేస్తే  ఇంత  విషాదం  జరిగి  ఉండేది  కాదనిపిస్తుంది.  

ఉత్తరాఖండ్  రాష్ట్రంలో  విద్యుత్  కోసం  నదీ  ప్రవాహాలను  దారి  మళ్ళించి  ఎన్నో    జల విద్యుత్ ప్రాజెక్టులు  నిర్మించారట.


  కొండలలో  ఎన్నో  సొరంగాలు  త్రవ్వారంటున్నారు. ఆ  సొరంగాలు  త్రవ్వగా  వచ్చిన  మట్టి  లేక  ఇసుకను  నదులలో  గ్రుమ్మరించారట.   ఆ  విధంగా  నదులలో  పూడిక  పెరిగిపోతే   వరదనీరు  ఊళ్ళ  మీద  పడే  అవకాశం  ఉంది.

 కొండలలో  సొరంగాలు  త్రవ్వటానికి   పేలుళ్ళు  జరిపితే,  బీటలు వారిన  కొండచరియలు  బలహీనమవుతాయి. అలా  బలహీనమైన  కొండచరియలు  త్వరగా  విరిగిపడే  అవకాశం   ఉంది.   ఇవన్నీ  కలిసి   ఇంతటి  మహావిషాదానికి  కారణం  అయిఉండవచ్చు. 


  ప్లాస్టిక్  వల్ల  పర్యావరణం  ఎంతో  కలుషితం  అవుతోంది. గాలికి  కొట్టుకువచ్చి  కాలువలకు  అడ్డం  పడే  టన్నుల  కొద్ది  ప్లాస్టిక్   కవర్ల   వల్ల   నీటిపారుదల  వ్యవస్థ  దెబ్బతిని , వాననీరు  పోయే  దారిలేక  కొంతకాలం  క్రిందట   ముంబయి  వంటి  నగరాలను  వరదలు  ముంచెత్తాయి.


 మేము  అమరనాధ్  వెళ్ళినప్పుడు  అక్కడ  కొండల  వద్ద  కూడా వాడి   పడేసిన  మంచినీటి  ప్లాస్టిక్  బాటిళ్ళు  కనిపించాయి. ( నిలువ  ఉండి  పుల్లటి  వాసన  వస్తున్న  కొన్ని  ఆల్బుకరా  పండ్లు  ఉన్న  ప్లాస్టిక్  కవరును  మేము  కూడా  అక్కడ  పడేసి వచ్చాము.)


ఇప్పటికైనా  ప్రజలు  మేలుకుని ,  వినోదకార్యక్రమాల  నుంచి  కొద్దిగా  బయటకొచ్చి ,  సమాజంలోని  సమస్యల  పరిష్కారానికి  కృషిచేస్తే  బాగుంటుంది.

 ప్రతి  వ్యక్తి  తన  పరిధిలో  పద్ధతిగా  జీవిస్తే  సమాజం  దానికదే  బాగుపడుతుంది.  అవినీతికి,  అత్యాశకు   దూరంగా  ఉండటానికి  ప్రయత్నించాలి.  ప్లాస్టిక్  కవర్ల  వాడకాన్ని  తగ్గించటం,  విద్యుత్  పొదుపుగా  వాడటం,  రసాయనాల  వాడకం  తగ్గించటం    వంటి    ఎన్నో  జాగ్రత్తలను  తీసుకోవాలి. 
 

 పర్యావరణ  పరిరక్షణ,  సమాజ  శ్రేయస్సు   అంటే   ఎవరినో  ఉద్ధరించటానికి  కాదు.  మనల్ని  మనం  ఉద్ధరించుకోవటం  కోసమే.

............................
ఈ  బ్లాగ్ ను  ప్రోత్సహిస్తున్న  అందరికి  కృతజ్ఞతలండి.


2 comments:

  1. రాష్ర్టీయ స్వయంసేవక్ వారు సహాయకార్యక్రమాల్లో పాల్గోంటున్నారట

    ReplyDelete
  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    ఇలాంటి క్లిష్ట సమయంలో బాధితులకు సహాయాన్ని అందిస్తున్న రాష్ర్టీయ స్వయంసేవక్ వారికి మరియు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలండి.

    ReplyDelete