koodali

Friday, November 12, 2010

త్యాగం వాటిది. ఫలితం మాత్రం మనకు మాత్రమేనా......ఇదెక్కడి అన్యాయం ?


ఈ సృష్టిలో మానవులమైన మనము మాత్రమే గొప్పవాళ్ళము అనుకుంటుంటాము. కానీ అల్పజీవులు అనబడే మొక్కలు, ఫలవృక్షములు, జంతుజాలము , ఇతరజీవులు మానవ మనుగడకోసం ఎన్నో త్యాగములు చేస్తున్నాయి.


మనము కోరికలతో ఎన్నో పూజలు చేసి వాటి ఫలితములను మాత్రము మనకు మాత్రమే దక్కాలని కోరుకుంటూ ఉంటాము. కానీ ఆలోచిస్తే పూజలో మనము వాడే ఎన్నో పదార్దములు ఇతర జీవుల నుంచి మనము పొందేవే.


ఉదా..పుష్పములు మొక్కల నుంచి పొందుతాము. మొక్కలు పెరిగేటప్పుడు వాటి కొమ్మలను తుంపటం, కత్తిరించటం ఇలా ఎన్నో బాధలకు గురవుతాయి.


మరి ప్రసాదముగా .... పాయసం, ఇతరపిండివంటలు తయారుచెయ్యటానికి వాడే పాలు .. ఆవుల ద్వారా వస్తాయి కదా.... ఈ రోజుల్లో ఆ పాలను వాటి దూడలను కూడా సరిగ్గా త్రాగనివ్వకుండా పిండేస్తున్నారు .


పండ్లు, బియ్యపుపిండి, గోధుమలు, బెల్లము , ఇవన్నీ మొక్కలు, చెట్లనుంచి మనము పొందేవే. ఇలా దేవునికి ప్రసాదముగా మనము సమర్పించే పదార్దములు ఇతరజీవుల నుంచి మనము పొందుతూ పూజా ఫలము మాత్రము ... మనకు మాత్రమే దక్కాలని కోరుకోవటం ఏమి న్యాయం ? మనము మనదిగా భగవంతునికి ఏమి ఇస్తున్నాము ?


మనము కూడా సత్ప్రవర్తనతో జీవితాన్ని గడిపిభగవంతునిఆనందపరచవచ్చుఇంకా ప్రేమతోకూడిన భక్తిని వారికిసమర్పించవచ్చు.


మనము స్వచ్చమైన భక్తిని కూడా భగవంతుని యెడల ప్రదర్శించలేకపోతున్నాము. త్యాగం ఇతర జీవులది. ఫలితం మాత్రం మనకు మాత్రమేనా..ఇదెక్కడి అన్యాయం ?

అందుకే పెద్దలు పూజాఫలమును పరమాత్మకే సమర్పించమని చెబుతుంటారు.

ఆ పరమాత్మకు మాత్రమే తెలుసు ఏది ఎలా చెయ్యాలో ! ఎవరికి ఏది , ఎంత ఇవ్వాలో !


ఈ విశ్వ మనుగడకు ఇతర జీవులు ఎన్నో త్యాగాలు చేస్తున్నాయి. మరి జీవులలో ఉత్తములు అనబడే మనం భగవంతునికి ప్రేమ భక్తితో పూజ కూడా చెయ్యలేకపోతున్నాము.

ఇంకా, మనం బ్రతకటం అంతా.. మన గొప్పే, మన తెలివివల్లనే అని విర్రవీగుతుంటాము.  ఆలోచిస్తే ప్రాణవాయువు అందకపోతే.... గట్టిగా కొంతసేపు కూడా ఉండలేని అల్పజీవులమైన మనం పుట్టినప్పటినుంచి మనకు ప్రాణవాయువును, నీటిని ,ఆహారాన్ని ఇంకా అనేకమైన వాటిని ఏర్పరిచిన పరమాత్మ పట్ల ఎంత కృతజ్ఞతగా ఉండాలి.


అలా లేకపోగా ... మన బ్రతుకుకు తోడ్పడుతున్న ఇతరజీవులను మన భౌతికమైన సుఖములకోసం నిర్దాక్షిణ్యముగా వాడుకుంటూ, మానవులు ఎంతో గొప్పవాళ్ళు .. ఇతరజీవులు అల్పమైనవి అంటుంటారు.


ఇంకా, ఎన్నో అవసరముల కోసం ఇతర జీవుల దయపై ఆధారపడి బ్రతుకుతూన్న మనం , భౌతిక సుఖములకు అతిగా అలవాటుపడి ..... కన్నూమిన్నూగానక ఇతర జీవులను సర్వనాశనం చేస్తున్నాము.

అవి అల్పజీవులు కాదు. మనిషే... అల్పబుద్దిగలవానిగా తయారవటం నేటి దౌర్భాగ్యం.


No comments:

Post a Comment