koodali

Friday, September 5, 2025

konni vishayaalu...

 
ప్రాచీనకాలంలో   సమాజంలో పని విభజన జరిగింది. ఎవరి పనిని వారు చక్కగా చేస్తే స
మాజం సజావుగా ఉంటుంది. . రైతులు ఉదయాన్నే పొలానికి వెళ్తారు. సైనికులు  దేశరక్షణలో అప్రమత్తంగా ఉంటారు.
 
సమాజంలో ఎన్నో వృత్తులవారున్నారు. ఎవరి పని వారు చక్కగా చేస్తే అదికూడా పూజయే.

ఇవన్నీ తెలిసిన ప్రాచీనులు, కొన్ని వృత్తులవారు పెద్ద ఎత్తున పూజలు చేయనక్కరలేదు, వారు తమ స్వధర్మాన్ని చక్కగా పాటిస్తే చాలు, కొద్దిపాటి పూజలు చేసినా బోలెడు పూజలు చేసినంత పుణ్యం వస్తుందని తెలియజేసారు.

అయితే, ప్రాచీనులు చెప్పినదానికి వ్యతిరేకంగా ఇప్పుడు కొందరు ఏమంటున్నారంటే,  అన్ని వృత్తులవారు కూడా పెద్ద ఎత్తున పూజలు చేయవచ్చని, అందరూ చాలా ఆచారవ్యవహారాలను పాటించాలని  చెబుతున్నారు.

  మేమెందుకు పెద్ద ఎత్తున పూజలు చేయకూడదంటూ కొందరు మాట్లాడుతారు. ఇప్పుడు చాలామంది ఇతర ప్రాంతాల వారి నుండి నేర్చుకుని కూడా అనేకపూజలను చేస్తున్నారు. ఇవ్వాళ ఫలానా పూజ కాబట్టి, ఈ నియమాలను పాటించాలి, లేదంటే కష్టాలు వచ్చి పడిపోతాయంటూ చెప్పేవాళ్లు కూడా ఎక్కువయ్యారు.

 కొత్తకొత్త ఆచారవ్యవహారాలను చెబుతున్నారు కొందరు.  నిత్యమూ చాలా విషయాలను పాటించాలంటే అందరూ పాటించలేరు. వీటి గురించి కుటుంబసభ్యుల మధ్య గొడవలు కూడా జరుగుతున్నాయి. మళ్ళీ ఆ గొడవలు తగ్గాలంటే ఏమి పరిహారాలు చేయాలో? 

 కొందరు చెప్పేవి వింటే హిందువుల ముసుగులో హిందువులకు విసుగు కలిగేలా చెబుతున్నారేమో? అని సందేహాలు కూడా కలుగుతున్నాయి.

...........................................

ప్రతి విషయానికి ఎన్నో కొత్తకొత్త విధివిధానాలను చెబుతుంటే అవన్నీ గుర్తు ఉంచుకుని పాటించాలంటే చాలా కష్టం. ఇవన్నీ తప్పుల్లేకుండా పాటించాలంటే ధ్యాస అంతా విధివిధానాల పట్లే ఉంటుంది కానీ,  దైవము పట్ల ధ్యాస ఎలా?

ఉదా..ఎవరికైనా తాంబూలం ఇవ్వాలంటే అరటిపండ్ల తొడిమలు ఏ దిక్కున ఉండేటట్లు ఇవ్వాలి, ఎలా ఇవ్వకూడదు..ఇలా వందల నియమాలు చెబుతారు.

 పూజకు సంబంధించిన విధివిధానాల గురించి ఆలోచించటానికి, ఆచరించటానికే ఎక్కువ సమయం పడుతోంది. 

రోజువారి పనుల విషయంలో కూడా టెన్షన్ ఉంటుంది కాని, దైవానికి సంబంధించిన విషయాల్లో ఎక్కడ తప్పులు వస్తాయో అని టెన్షన్ మరింత ఎక్కువగా ఉంటుంది.టెన్షన్ లేకుండా ప్రశాంతంగా దైవపూజ చేసుకుంటే బాగుంటుంది.  

 ప్రత్యేకమైన పూజలు చేసేటప్పుడు శ్రద్ధగా విధివిధానాలను పాటించాలి. భజనలు, నామసంకీర్తనలు  ఎవరైనా టెన్షన్ లేకుండా చేసుకోవచ్చు. 

 ఆచారవ్యవహారాల్లో ఎన్నో మంచివిషయాలను పొందుపరిచి ప్రాచీనులు మనకు అందించారు. అయితే, కాలక్రమేణా ఎన్నో మూఢనమ్మకాలు వచ్చాయి. అందువల్ల విచక్షణతో ప్రవర్తించాలి.

oka link....................................కష్టాలు తీరటం..
...............................

 ఈ కాలంలో పండుగలు, ఫంక్షన్లు సందర్భంగా అనేక కొత్త ఆచారవ్యవహారాలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా చాలా ఖర్చులు, శ్రమ కూడా ఉంటోంది. అనవసర సామాను ఎక్కువవుతోంది.
 
 ఇచ్చే గిఫ్టులతో ఇల్లంతా గజిబిజిగా తయారవున్నాయి. గిఫ్ట్ వద్దంటే వినరు. ఈ కార్యక్రమాల ద్వారా కొందరు వస్తువులను అమ్ముకుంటూ  వ్యాపారం కూడా చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమాల్లో అన్ని వృత్తులవారు 
(అందరూ) పాల్గొనటం వల్ల చాలామంది వ్యాపారస్తులకు ఆదాయం పెరిగింది.

పువ్వులు, పండ్లు, కొబ్బరి కాయలు..పూజాసామాగ్రి అమ్మటం..ఇలా కొందరికి జీవనోపాధి ఉంటుంది. కొందరికి జీవనోపాధి లభించే మాట నిజమే కానీ, ఎప్పుడూ రకరకాల పూజలంటూ చాలాసార్లు డబ్బు ఖర్చుచేయటం, అనేక ఆచారవ్యవహారాలను పాటిస్తూ చాలా సమయాన్ని కేటాయించటం అంటే అందరూ చేయలేరు.

కొంతకాలం క్రిందట కొన్ని వస్తువులు కొని సాటి స్త్రీలకు పంచిపెట్టాలని  లేకపోతే అరిష్టమని ప్రచారం చేసారు.  వ్యాపారస్తులు కొందరు వారి వద్ద వస్తువులను కొనిపించటానికి ఇలా ప్రచారం చేసారని వార్తలు వచ్చాయి.
 

ఈ రోజుల్లో కొందరు మతాల పేరుతో కూడా ధనార్జన..వ్యాపారం చేయటం ఎక్కువయ్యింది. జీవనవిధానంలో మతము, ఆర్ధికాభివృద్ధి కలగలిపి ఉండవచ్చు కానీ,   మతవిషయాలలో వ్యాపారమే ముఖ్యంగా మారకూడదు.

 అవసరమైనంత వరకు ఆర్ధికాభివృద్ధి అవసరమే కానీ, ఆర్ధికాభివృద్ధే జీవిత ధ్యేయం కాదుకదా.. ఈ రోజుల్లో చాలామంది  ఎలాగైనా సరే బోలెడు డబ్బు సంపాదించటమే  జీవితధ్యేయంగా బతుకుతున్నారు.

కొందరు మతం పేరుతో సంస్థలను మెలకొల్పి ప్రజల వద్ద డబ్బు తీసుకుని మోసం చేస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి.
........................................................

 పాతకాలంలో దేవాలయాల నిర్వహణకొరకు రాజ్యాలను ఏలే రాజులు ధనాన్ని సమకూర్చేవారు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు.. 

 ఈ రోజుల్లో అంటరానితనం వంటివి లేకుండా అందరూ దేవాలయాలకు వెళ్తున్నారు. 

ప్రజలు హుండీలలో వేసే ధనాన్ని.. బంగారాన్ని పెద్ద ఎత్తున నిల్వ ఉంచితే ఎవరైనా దోపిడీదారుల దృష్టి పడవచ్చు. హిందువులలో కూడా కొందరు చేతివాటం వాళ్ళుండే అవకాశం ఉంది.

అలా పెద్ద ఎత్తున బంగారాన్ని  ప్రోగుచేసి ఉంచటం కన్నా, కొంత నిల్వ ఉంచి, మిగతా ధనాన్ని హిందుపేదప్రజల కొరకు ఉపయోగించవచ్చు. అంటే, ప్రజలకు కొందరికి ఉచితంగా లేక కొందరికి తక్కువ ధరకు విద్యను, వైద్యాన్ని అందించవచ్చు.
 

 హిందువులలోనే చాలామంది పేదలున్నారు.  హిందూదేవాలయాల సొమ్మును ఇతరమతస్తులకు ఇచ్చే హక్కు ఎవరికి ఉండదు. అలాగని దేవాలయాలను ప్రభుత్వాల నుంచి తప్పించటమూ మంచిది కాదనిపిస్తుంది.  

కొందరు ఏమంటారంటే, దేవాలయాలను ప్రభుత్వాల నుంచి తప్పించి 
ప్రైవేట్ వారికి అప్పగించాలంటారు.
 (దేవాలయాల ప్రైవేటీకరణ) ప్రభుత్వం వద్ద ఉంటే అక్కడ ఏమైనా అవకతవకలు జరిగితే కనీసం ఓటు ద్వారా ఆ ప్రభుత్వాలను దింపే అవకాశమైనా సామాన్యప్రజలకు ఉంటుంది..... 

 .. ప్రైవేట్ వారి చేతుల్లోకి దేవాలయాలు వెళితే అక్కడ ఏమైనా అవకతవకలు జరిగితే సామాన్యప్రజలు ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండే పరిస్థితి కూడా ఉండవచ్చు.

 ఈ రోజుల్లో ఎవర్ని నమ్మాలో? ఎవరిని నమ్మకూడదో? అర్ధం కావటం లేదు.

 దేవాలయాలకు వెళ్తే , మన దేవాలయము ..అని స్వేచ్ఛగా  అనిపిస్తుంది.  ఆధునిక కాలంలో అన్ని వర్గాల ప్రజలు దేవాలయాలకు వెళ్తూ తమకు తోచిన సొమ్మును కానుకలుగా  సమర్పిస్తున్నారు. అలా కోట్ల రూపాయలు ధనం సమకూరుతోంది. 

దేవాలయాలను ప్రైవేటీకరణ చేస్తే బడా వాళ్ళు స్వాధీనం చేసుకుని, ప్రజలు దేవాలయాలకు సమర్పించిన సొమ్ముతో సహా దేవాలయాలను తమ స్వంత ఆస్తిలా పెత్తనం చేస్తారేమో? అని భయాలు కూడా కలుగుతున్నాయి.

 
హిందూ దేవాలయాల సొమ్ము హిందువులు మాత్రమే.. అనే చట్టం రావాలి.  దేవాలయాల వద్ద ఉన్న కొంతసొమ్ము తీసి, దేవాలయాల ఆధ్వర్యంలో హిందువులకు పాఠశాలలు, ఆసుపత్రులు కట్టించేలా  ప్రభుత్వాలను అడిగి.. ఆ విధంగా అందరూ చర్యలు తీసుకోవచ్చు.

 
 *****************
ఈ రోజుల్లో కొన్ని చోట్ల శుభ్రత లేని ప్రదేశాలలో కూడా కొత్తకొత్త దేవాలయాలను కడుతున్నారు. 

ఆశ్చర్యం ఏమిటంటే, జనాలకు సరైన భక్తి ఉంటే సమాజంలో ఇన్ని నేరాలు, ఘోరాలు చేయకూడదు.  కోరికలు తీరటానికి పూజలు చేయటం కూడా ఎక్కువయ్యింది. 

దైవకృపను పొందాలంటే దైవభక్తి కలిగి నైతికవిలువలతో జీవించటానికి ప్రయత్నించాలి.
.................

మన గ్రంధాలలో కొన్ని విషయాలను గమనిస్తే.. ఇలా ఎందుకు రాసారో? అనిపిస్తుంది. అవి ప్రక్షిప్తాలు కావచ్చు అనుకుంటున్నాము. ఈ విషయాల గురించి కొన్ని పాత పోస్టులలో ఉన్నాయి.
 
తరతరాలనుంచి అంటరానితనం మరియు కొన్ని మూఢనమ్మకాల వల్ల  ఇప్పటికే హిందుసమాజం ఎంతో నష్టపోయింది. 

పాతకాలంలో జరిగిన అంటరానితనం, కొన్ని మూఢనమ్మకాలు..తద్వారా కొందరు బాధలుపడటం .. వంటి
 వాటి  వల్ల కాబోలు భారతదేశంలో విదేశీయుల పాలన రావటం, విదేశీమతాలు ప్రవేశం జరిగి ఉండవచ్చు. ప్రతివిషయానికి  కర్మ ప్రభావం ఉంటుంది కదా..
 

మనల్ని ఎవరైనా కష్టపెడుతుంటే వారిని ఎదుర్కోవటం తప్పు కాదుకానీ, మనము అనవసరంగా ఇతరులను బాధించటం తప్పే కదా..అలా బాధపడినవారి ఉసురు తగిలే అవకాశం ఉంది.

 ఇప్పటికైనా హిందువులు ఒకరినొకరు గొడవలు పడకుండా సామరస్యంగా ఉంటే బాగుంటుంది. సమాజంలో అన్ని వృత్తుల వారు అవసరమే. ఎవరి కష్టసుఖాలు వారికి ఉన్నాయి. అందరూ ఒకరికొకరు సహకరించుకుంటూ చక్కగా జీవించాలి.
..................................................

యజ్ఞయాగాదులను చక్కగా చేసే వాళ్ళు వాటిని చేయటం మంచిది. అందరూ అన్నీ చేయనవసరం లేదని నాకు అనిపిస్తుంది.

.................................

 జీవితంలో కొన్ని నియమాలు ఉంటే ఎవరికైనా ఆచరించడానికి సులభంగా ఉంటుంది. అదేపనిగా నియమాలంటూ అంతులేకుండా చెప్పుకుంటూ ఉంటే అందరూ పాటించలేరు. మతాన్నే వదిలేయాలనిపించవచ్చు. 

 ఎందరో హిందువులు మతం కూడా మారారు. అందువల్ల సరిదిద్దుకుని ముందుకు వెళ్ళాలి.

దైవము యొక్క అవసరం అందరికి ఉంటుంది. అయితే, దైవారాధనకు కఠినమైన మార్గాలను వదిలి సులభమైన మార్గాలను ఎన్నుకోవాలనిపించవచ్చు.

 పండుగలు వస్తున్నాయంటే టెన్షన్ వస్తుంది. బోలెడు నియమాలను పాటించలేక మతము అనేది లేకుండా నాకు కుదిరినంతలో దైవాన్ని ఆరాధించుకోవాలనిపిస్తుంది.  ఇదంతా గమనించిన తరువాత, నేను ఎలా మారతానో? అని భయం వేసి,  ఇప్పుడు నాకు వీలైనంతలో మాత్రమే పాటించటానికి ప్రయత్నిస్తున్నాను.

మేము ఇన్నిన్ని పాటించలేకపోతున్నాము బాబోయ్..అని మొత్తుకుంటున్నా కూడా అర్ధం చేసుకోకుండా కొందరు అపార్ధం చేసుకుంటున్నారు.

 కొందరు యువత..ఇవన్నీ మేము పాటించలేం, మాకు నచ్చిన పద్ధతిలో దైవాన్ని ప్రార్ధించుకుంటామని చెబుతున్నారు. అందువల్ల, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, కొంత పట్టువిడుపుగా ఉండటం మంచిది.

 ఇది కలికాలం. కలికాలంలో మనుషులు శారీరికంగా, మానసికంగా కొంత బలహీనులుగా ఉంటారు కాబట్టి, దైవభక్తి కలిగి దైవస్మరణ చేస్తే చాలు తరిస్తారని ప్రాచీనులే తెలియజేసారు.

బోలెడు పూజలను చేయకపోయినా.. జీవితంలో దైవభక్తి కలిగి, కొన్ని పూజలను చేస్తూ, నీతినిజాయితీలతో జీవించటానికి ప్రయత్నిస్తే దైవకృపను పొందే అవకాశం ఉంటుంది.


No comments:

Post a Comment