koodali

Sunday, September 7, 2025

ఎప్పటికైనా..

 
భారతదేశం ఎంతో సుందరమైనది. ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్న దేశం. కొన్ని విదేశాల్లో అందంగా ఉన్నా కూడా ,  అక్కడ కొన్ని చోట్ల విపరీతమైన చలి కూడా ఉంటుంది. భారతదేశంలో వాతావరణం ఎండాకా
లం, వర్షాకాలం, చలికాలం తట్టుకోలిగే విధంగానే ఉంటుంది. 

అయితే ప్రజలు ఈ దేశాన్ని శుభ్రత లేకుండా మురికిగా చేయటం బాధాకరం. ఎక్కడపడితే అక్కడ చెత్తవేయటం, కిళ్లీలు ఉమ్మటం..మలమూత్రాలు చేయటం చేస్తున్నారు. ఇలా చేసేవారిని శిక్షించటం, జరిమానాలు వేస్తేనే వారు మారతారు. 
ప్రభుత్వాలు కూడా పబ్లిక్ టాయిలెట్స్ కట్టించాలి. 

చెట్లు ఎక్కువగా నాటి పెంచటం,రోడ్లు, పార్కులు శుభ్రం చేయటం, పరిసరాలు అందంగా ఉంచటంలో అనేకమంది కార్మికులను నియమిస్తే ఎందరికో ఉపాధి లభిస్తుంది.


మన భారతదేశం ఎప్పటికైనా ఇలా శుభ్రంగా ఉంచుకోగలమా? ఈ లింక్ లో  చూడండి... దీనికి సంబంధించిన ఫొటోలు ఈ పోస్ట్ క్రింద 
కూడా ఉన్నాయండి.

Beautiful Village Giethoorn of Netherlands |

విదేశాల్లో వాళ్లు తమ దేశాన్ని ఎంత అందంగా ఉంచుకున్నారో..మనం ఎందుకు అలా చేయలేకపోతున్నాము? ఎవరి వద్ద నుండి  అయినా చెడును నేర్చుకోకూడదు కాని, మంచిని నేర్చుకోవచ్చు.

 పరిసరాలు శుచిగా, శుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి కొలువై ఉంటుందని ప్రాచీనులు తెలియజేసారు.

చండీగఢ్ కొంత శుభ్రంగా ఉంటుందంటారు. అలా శుభ్రంగా ఉండటానికి అక్కడ పనిచేసిన ఒక కమిషనర్ గారు..
ఇతర సిబ్బంది కూడా కారణట. వారు ప్రజలలో శుభ్రత గురించి ఎప్పటికప్పుడు అవగాహన తెస్తూ చైతన్యవంతులను చేస్తూ చిన్నపిల్లలకు  కూడా శుభ్రత గురించి చెబుతూ ఎంతో కృషి చేసారట.

 కమీషనర్ గారు..
సిబ్బంది చెప్పినవి విని ప్రజలు  పాటించటం కూడా గొప్ప విషయమే. ప్రభుత్వాలు, అధికారులు, ప్రజలు అందరూ సరిగ్గా పాటిస్తేనే ఏదైనా బాగుంటుంది.
..................................
 కొందరు మైకుల ద్వారా పెద్దగా శబ్దాలు పెడుతున్నారు. వార్తలు చెప్పేవారు కూడా ఎందుకో గట్టిగా అరుస్తూ  వార్తలు చెబుతున్నారు.
..................................

  ఇతరదేశాల వాళ్లు భారతీయులను వెళ్ళిపొమ్మంటున్నారని కొన్ని వార్తలు వస్తున్నాయి. మనము మన దేశాన్ని అభివృద్ధి చేసుకుంటే ఎక్కడికో వెళ్లి మాటలు పడే పరిస్థితి ఉండదు కదా..

భవిష్యత్తులో విదేశాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో? తమ తరువాత తమ పిల్లల పరిస్థితి అక్కడ ఎలా ఉంటుందో? (భయపడుతూ బతకాలేమో?) ఇవన్నీ విదేశాల్లో స్థిరపడాలనుకునే వాళ్ళు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచిది.
................
 

ఎవరైనా గొప్పవాళ్లం అనుకుంటే.. వారు తమ గొప్పతనంతో  తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయవచ్చు.  తామూ బాగుండవచ్చు.

........................

మన దేశంలో చిన్న పరిశ్రమలు నెలకొల్పితే,  విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా తిరిగివస్తారు. మన యువత కూడా ఐటీ రంగంలో మాత్రమే కాకుండా వ్యాపారాలు చేయటానికి ముందుకు రావాలి..

ఐటీలో ఉద్యోగాలు చేస్తూ ఎప్పుడు ఉద్యోగాల నుంచి తీసేస్తారో అని భయపడటం కన్నా, స్వంతంగా వ్యవసాయ రంగం, వ్యాపారం, కుటీర పరిశ్రమలు ఉపాధిపొందటం చెయ్యాలి.
...............

 ఇరుగుపొరుగు దేశాలనుండి అనేకమంది అక్రమంగా భారతదేశంలోకి వచ్చి ఇక్కడ స్ఠిరపడుతుంటే, మన వాళ్లు ఉపాధి వెతుక్కుంటూ విదేశాలకు వెళ్లి కష్టాలు పడుతున్నారు. 

ఎన్నో సంవత్సరాలనుండి విదేశీయులు వస్తుంటే ఎందుకు సమర్ధవంతంగా అడ్దుకోలేదో అర్ధం కావటం లేదు. ఇప్పటికైనా సరైన చర్యలు తీసుకోవాలి.
...........

జనాభా అదేపనిగా పెరిగితే అందరికీ ఉద్యోగాలు లభించాలంటే కష్టం. భారతదేశంలో జనాభా ఎక్కువ..భూమితక్కువ. కొన్ని విదేశాల్లో జనాభా తక్కువ.. భూమి ఎక్కువ. 

యంత్రాల వినియోగం పెరిగిన ఎక్కువైన తరువాత ప్రపంచం అంతటా నిరుద్యోగం ఎక్కువవుతోంది.

యంత్రాలతోనే ఎక్కువగా పనులు చేయించుకుంటున్న ఈ రోజుల్లో అందరికీ ఉద్యోగాలు లభించాలంటే కష్టమే. కష్టమైన పనులను యంత్రాలతో చేయించి, మిగతా పనులను మనుషులే చేయాలి.
.............

మనుషులు బతకటానికి అవసరమైన గాలి, నీరు, సూర్యరశ్మితో కూడిన వాతావరణం, ఆహారానికి అవసరమైన మొక్కలు, చెట్లు..వంటివెన్నో దైవమే ఏర్పాటు చేసారు. అయినా మనుషులు సరిగ్గా బతకలేకపోతున్నారు.

 ఆహారం,ఇల్లు, వైద్యం, విద్య, రక్షణ..ఇలా నిత్యావసరాలు బాగుంటే చాలు చక్కగా బ్రతకవచ్చు. అయితే, అనేకకోరికలతో విలాసాలనే నిత్యావసారాలుగా చేసుకుని వాటికోసం అదేపనిగా కష్టపడుతున్నారు. 

కొందరు మనుషులు సరిగ్గా బతకలేకపోవటానికి బలవంతులైన కొందరు బలహీనులను అణచివేయటం కూడా కారణమే.కొందరు చెడ్దవాళ్ళు ఇతరులను బాధిస్తూ పెత్తనం చేస్తున్నారు.
.............

కంపెనీల్లో ఒక పనికి ఎక్కువ జీతాన్ని ఇచ్చి (సుమారు లక్షన్నర అనుకోండి..) ఒక్కరితో ఎక్కువ పనిచేయించటంటం కన్నా, అదే పనికి ఇద్దరిని నియమించి ఒక్కొక్కరికి లక్ష ఇస్తే, నిరుద్యోగ సమస్య తగ్గుతుంది. 

వ్యక్తులు అలసిపోరు కాబట్టి పనిలో నైపుణ్యత పెరుగుతుంది.   పనిగంటలు తగ్గి సమయం మిగులుతుంది కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది, కుటుంబసంబంధాలు కూడా బాగుంటాయి.

ఉద్యోగుల జీతాలు పెంచితే, వ్యాపారస్తులు ధరలు పెంచుతారు. ఇలాంటప్పుడు తక్కువ ఆదాయ వర్గాల వారు కొనలేని పరిస్థితి ఉంటుంది.

విపరీతంగా ధరలు పెంచకుండా కూడా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.

.......................
ఈ రోజుల్లో ఉద్యోగాలంటూ స్త్రీలు ఉదయం వెళ్ళి రాత్రికి వస్తుంటే విపరీతమైన పనివల్ల అనారోగ్యాలు తెచ్చుకుంటున్నారు. స్త్రీలలో గర్భసంచి వ్యాధులు బాగా పెరిగాయి.

 స్త్రీలు అంద
రికి  ఉద్యోగాలు కావాలని  ఎవరినైనా బ్రతిమలాడటం కన్నా,  దర్జాగా  కొందరు స్త్రీలు కలసి చిన్న పరిశ్రమలు పెట్టుకోవచ్చు. తమకు సదుపాయంగా ఉండేటట్లు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు పనిగంటలు ఏర్పాటుచేసుకోవచ్చు. 

అందరూ స్త్రీలే  ఉంటారు కాబట్టి, లైంగిక వేధింపులు వంటివాటి బారినుండి కూడా కొంతవరకు తప్పించుకోవచ్చు.

డబ్బు బాగా ఉన్న స్త్రీలు మహిళామండలిగా ఏర్పడి సమాజసేవ చేయవచ్చు. పేద వారు పైకి రావటానికి సాయం చేయవచ్చు. అంటే విద్య, వైద్యం వంటి విషయాల్లో తమకు తోచిన సాయం చేయవచ్చు. వారికి చదువు చెప్పవచ్చు. చక్కటి సలహాలను అందించవచ్చు. 

రకరకాల చీరలు, నగలు ధరించినా కలగని సంతోషాన్ని ఇతరులకు సాయం చేయటంలో పొందవచ్చు...ఎంతో పుణ్యం కూడా వస్తుంది.
.................

ఈ మధ్య యూట్యూబ్ లో కొన్ని వార్తలు చదివాను. కొన్ని చోట్ల కొందరు స్త్రీలను కొందరు బాస్ లు బెదిరిస్తున్నారట. ఉద్యోగం ఊడకుండా ఉండాలన్నా, ప్రమోషన్లు కావాలన్నా తమ కోరికలు తీర్చాలని అడుగుతున్నారట. తప్పని పరిస్థితిలో కొందరు స్త్రీలు లొంగిపోతున్నారట. ఇలాంటివి ఎంతో బాధాకరం.

 తల్లుల మాట చాలా మంది పిల్లలు వింటారు కాబట్టి,  తల్లులు తమ పిల్లలకు చిన్నతనం నుంచి అమ్మాయిలు, అబ్బాయిలు ఒకరిని ఒకరు గౌరవించుకోవాలని,  నైతికవిలువలతో జీవించాలని నేర్పించితే వారు వినే అవకాశం ఉంది.

.................

 కొందరిలో ఎందుకో తెలియదు కాని,  పాపభీతి లేకపోవటం, అత్యాశ, సోమరితనం, స్వార్ధం..వంటి లక్షణాలు పెరిగాయి.

ఈ రోజుల్లో సమాజంలో జరుగుతున్న నేరాలు..ఘోరాలు గమనిస్తే, మనుషులకు నైతికవిలువలు ఎంత అవసరమో తెలుస్తుంది.

ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే, బయట ఎక్కువసార్లు తినకుండా చక్కటి ఇంటిభోజనం తినాలి.

 శారీరికంగా, మానసికంగా దేశానికి  మంచి పౌరులు తయారవ్వాలంటే ఇంట్లో పెద్దవాళ్ళు తప్పనిసరిగా వీలు కుదుర్చుకుని పిల్లలకు నైతిక విలువలను నేర్పించాలి. ఇందుకు గృహిణి యొక్క సహాయసహకారాలు ఎంతో ముఖ్యం.

 ఉపాధ్యాయులు కూడా పిల్లలకు నైతిక విలువలు పెంపొందేలా కృషిచేయాలి.

మంచి పౌరులను తయారుచేయటం ఎంతో గొప్పవిషయం.  
 నైతికవిలువలు కలిగిన మంచి పౌరులు ఉంటే ...కుటుంబాలు తద్వారా సమాజమూ అన్నీ బాగుంటాయి.

నైతికవిలువలు కలిగిన 
వారు  మంచిగా ప్రవర్తిస్తారు. అశ్లీల చిత్రాలు దేశమ్మీదకు వదిలి డబ్బు సంపాదించరు,  ఇతరులను మోసం చేయరు , నేరాలుఘోరాలు చేయరు. ధరలు విపరీతంగా పెంచి ఇతరులను దోచుకోరు. 

*నైతికత ఉన్న పౌరులు ఉన్నసమాజం దానికదే బాగుంటుంది. ఎప్పటికైనా అంతా బాగుండాలి.

 ................
* అన్నింటికి దైవమే దిక్కు. 

 ........................

Beautiful Village Giethoorn of Netherlands |

How to visit Giethoorn, Netherlands, a charming village ...
Visit Giethoorn, the picturesque Dutch village with no roads ...

***************
 
 దైవానికి అనేక కృతజ్ఞతలు.
 

 

Friday, September 5, 2025

ఏం మనుషులో...?

 


మేము వినాయక నిమజ్జనం కొరకు వెళ్ళినప్పుడు అక్కడ ఎలా ఉందంటే..ఎక్కడపడితే అక్కడ ప్లాస్టిక్ కవర్లు, ఆకులు, పువ్వులు ఉన్నాయి. చెత్త కూడా పడేసి ఉంది.  దుర్వాసన వస్తోంది.
 
 ఇక ఆ నీటిలో నిమజ్జనం చేయలేక ఇంటికి వచ్చి చిన్న బకెట్లో నీళ్ళు పోసి,  ఆ నీటిలో నిమజ్జనం చేసి నీటిని చెట్ల వద్ద పోసాను. ఎవరికైనా దగ్గరలో మంచి నీటి  చెరువు ఉంటే అక్కడ కూడా కలపవచ్చు.  

ఆ నీటిని మొక్కల వద్ద పోస్తే మనం అక్కడ మట్టిలో నడుస్తాము కదా..అని సందేహాలు రావచ్చు..చెరువు నీటిలో నిమజ్జనం చేసినా చెరువునీటిలో నిలబడతారు, చెరువు నీటిని పనులకు వాడుకుంటారు, చెరువు నీటిని  స్నానానికి కూడా ఉపయోగిస్తారు  కదా..అనిపించింది. 

మరీ ఎక్కువ ఆలోచిస్తే అయోమయం అవుతుంది. కొంతవరకే ఆలోచించగలం. మానవప్రయత్నంగా కొంతవరకు ఆలోచించి పాటించి.. దైవాన్ని నమ్ముకోవటం మంచిది.
 ..............

 పాతకాలంలో వినాయక చవితి సందర్భంగా  కొందరు తమ పిల్లలను మొక్కలు, చెట్ల వద్దకు తీసుకువెళ్ళి పత్రిని సేకరించేవారు. ఆ విధంగా ఎంతో విలువైన 21 రకాల పత్రి గురించి పిల్లలకు తెలిసేది. పూజ తరువాత ఆ పత్రిని చెరువులలో కలపటం వల్ల ఆ ఆకులలోని మెడిసినల్ గుణాలు నీటిలో కలిసేవి. 
 
 వినాయకుని  ప్రతిమకు రసాయన రంగులు వేసి నీటితో కలిపితే మంచిది కాదు. 
.....................

పాతకాలంలో సంక్రాంతికి భోగి రోజున ఇంట్లోని పాత చెక్క సామాను విరిగినవి, పాడైనవి ఉంటే భోగిమంటలో వేసేవారు. ఆ విధంగా ఇల్లు శుభ్రం అయ్యేది. ఈ రోజుల్లో కొందరు భోగిమంటలో రబ్బరు టైర్లను కూడా వేస్తున్నారు. ఇందువల్ల పొల్యూషన్ పెరుగుతుంది.
...........................
 
టెక్నాలజి పేరుతో ప్లాస్టిక్ ..వంటివాటి వల్ల పొల్యూషన్ పెరుగుతుంటే.. వాటిని విచ్చలవిడిగా ఎక్కడపడితే అక్కడ పడేస్తూ మరింత పొల్యూషన్ పెంచుతున్నారు.
 
పెద్ద ఎత్తున ప్లాస్టిక్ వంటివి వాడి ఎక్కడపడితే అక్కడ పారేయటం,  ప్లాస్టర్ ఆఫ్ పారిస్ మరియు  రసాయన రంగులు కలిసిన భారీ విగ్రహాలను తయారు చేసి, నీటిలో నిమజ్జనం చేయటం.. జరుగుతోంది. 

ప్లాస్టిక్ వంటి కొన్నింటి తయారీ మరియు వాడకం వల్ల 
కొందరు ఉపాధి పొందుతున్నారు కాబట్టి, అలాంటి వాటిని విమర్శించకూడదు, నిషేధించమని అనకూడదని కొందరు అనుకుంటారు.

 పొల్యూషన్ వల్ల కొన్ని జీవజాతులు అంతరించే పరిస్థితిలో ఉన్నాయని శాస్త్రవేత్తలే చెబుతున్నారు. అలాంటప్పుడు మన అవసరాలకోసం లేక కొందరు బ్రతకటం కోసం  పొల్యూషన్ పెంచుతూ పోతే మనుషులతో సహా అన్ని జీవజాతులు అంతరించే ప్రమాదముంది.

.....................................

సోషల్ మీడియా వల్ల  విపరీతధోరణి మరింత పెరిగింది. మీడియాలో ఉండాలంటే ఎప్పుడూ ఏదో ఒక్కటి చెప్పాలని కొందరు ఎప్పుడూ ఏదో చెబుతూ ఉన్నారు.

 మన దేశంలో చాలా మందికి అత్యాశ పెరిగింది. ఎంతసేపూ ఎలాగైనా డబ్బు సంపాదించాలనే పిచ్చి పెరిగింది. తల్లితండ్రి పిల్లలను చంపటం, భార్యాభర్తల అక్రమసంబంధాలు..ఒకరినొకరు క్రూరంగా చంపుకోవటాలు ఎక్కువయ్యాయి. 


మీడియా ద్వారా అశ్లీలమైన, భయంకరమైన వ్రాతలు, దృశ్యాలు ప్రసారాల ప్రభావం చాలా ఉంటుంది. మూఢనమ్మకాలను ప్రచారం చేసేవాళ్లు కూడా ఎక్కువయ్యారు. ఇలాంటి వాటిని ఎందుకు బాన్ చెయ్యటం లేదో అర్ధం కావటం లేదు.


 అశ్లీలత, భయానకమైన విషయాలు, మూఢనమ్మకాలు..ఇలాంటివి మీడియాలో రాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఇలాంటివి ప్రచారం చేసే వాళ్లపైన కేసులు పెట్టి శిక్షించాలి.
..........................

మన దేశంలో చాలామంది  శుభ్రతను పాటించటం లేదు. అశుభ్రంగా ఎక్కడపడితే అక్కడ చెత్త వేస్తూ పర్యావరణాన్ని కలుషితం చేసే వారిపైన కూడా కేసులు పెట్టి శిక్షించాలి.
....................

ఈ రోజుల్లో చాలా విషయాల్లో వేలం వెర్రిలా ఏది ఎందుకు చేస్తున్నారో తెలియకుండా తయారవుతోంది.

ఎలాగోలా డబ్బు సంపాదించటం..విపరీతంగా ఆస్తులు పోగేయటం..విపరీతంగా వస్తువులను కొనేయటం..రకారకాలు వండుకుని విపరీతంగా తినటం...చేస్తున్నారు. మా డబ్బుతో మేం కొనుక్కుంటాం.. అనటానికి వీల్లేదు. 


విపరీతమైన వస్తు వినియోగం వల్ల పర్యావరణం పాడవుతుంది. అమూల్యమైన ఖనిజ సంపద తరిగిపోతుంది. ఈ ప్రపంచం ఏ కొద్దిమందికి సంబంధించినది కాదు. అన్ని జీవులకు సంబంధించినది.
...............

 మన కష్టసుఖాల గురించి కొందరు మనుషులతో చెప్పుకోవటం కంటే, దైవానికి చెప్పుకోవటం మంచిదనిపిస్తుంది.
 
సమాజంలో బ్రతుకుతున్నప్పుడు సాటి మనుషులతో కూడా మంచిగా ఉండాలి.  కష్టసుఖాలలో సాటి మనుషుల  సహాయసహకారాలు కూడా అవసరమే కానీ, మనుషులు కొంతవరకే చేయగలరు. 
 
దైవము సర్వశక్తివంతులు. వారు తలచుకుంటే ఏమైనా చేయగలరు. మానవప్రయత్నం సరిగ్గా చేస్తుంటే, దానికి తగ్గ ఫలితాన్ని దైవమే అందిస్తారు. 


పండుగలు, పూజలు కూడా కొందరు తమకు తోచినట్లు చెబుతుంటే, చేసేవాళ్లు తమకు తోచినట్లు చేస్తున్నారు. ఆచారవ్యవహారాల పేరుతో ప్రజలను భయపెట్టటం కూడా ఎక్కువయ్యింది.

ఈ రోజుల్లో ఎవరికి ఏమీ చెప్పేటట్లు లేదు. అందరిని సరైన దారిలోకి తీసుకురావాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
 
 

konni vishayaalu...

 
ప్రాచీనకాలంలో   సమాజంలో పని విభజన జరిగింది. ఎవరి పనిని వారు చక్కగా చేస్తే స
మాజం సజావుగా ఉంటుంది. . రైతులు ఉదయాన్నే పొలానికి వెళ్తారు. సైనికులు  దేశరక్షణలో అప్రమత్తంగా ఉంటారు.
 
సమాజంలో ఎన్నో వృత్తులవారున్నారు. ఎవరి పని వారు చక్కగా చేస్తే అదికూడా పూజయే.

ఇవన్నీ తెలిసిన ప్రాచీనులు, కొన్ని వృత్తులవారు పెద్ద ఎత్తున పూజలు చేయనక్కరలేదు, వారు తమ స్వధర్మాన్ని చక్కగా పాటిస్తే చాలు, కొద్దిపాటి పూజలు చేసినా బోలెడు పూజలు చేసినంత పుణ్యం వస్తుందని తెలియజేసారు.

అయితే, ప్రాచీనులు చెప్పినదానికి వ్యతిరేకంగా ఇప్పుడు కొందరు ఏమంటున్నారంటే,  అన్ని వృత్తులవారు కూడా పెద్ద ఎత్తున పూజలు చేయవచ్చని, అందరూ చాలా ఆచారవ్యవహారాలను పాటించాలని  చెబుతున్నారు.

  మేమెందుకు పెద్ద ఎత్తున పూజలు చేయకూడదంటూ కొందరు మాట్లాడుతారు. ఇప్పుడు చాలామంది ఇతర ప్రాంతాల వారి నుండి నేర్చుకుని కూడా అనేకపూజలను చేస్తున్నారు. ఇవ్వాళ ఫలానా పూజ కాబట్టి, ఈ నియమాలను పాటించాలి, లేదంటే కష్టాలు వచ్చి పడిపోతాయంటూ చెప్పేవాళ్లు కూడా ఎక్కువయ్యారు.

 కొత్తకొత్త ఆచారవ్యవహారాలను చెబుతున్నారు కొందరు.  నిత్యమూ చాలా విషయాలను పాటించాలంటే అందరూ పాటించలేరు. వీటి గురించి కుటుంబసభ్యుల మధ్య గొడవలు కూడా జరుగుతున్నాయి. మళ్ళీ ఆ గొడవలు తగ్గాలంటే ఏమి పరిహారాలు చేయాలో? 

 కొందరు చెప్పేవి వింటే హిందువుల ముసుగులో హిందువులకు విసుగు కలిగేలా చెబుతున్నారేమో? అని సందేహాలు కూడా కలుగుతున్నాయి.

...........................................

ప్రతి విషయానికి ఎన్నో కొత్తకొత్త విధివిధానాలను చెబుతుంటే అవన్నీ గుర్తు ఉంచుకుని పాటించాలంటే చాలా కష్టం. ఇవన్నీ తప్పుల్లేకుండా పాటించాలంటే ధ్యాస అంతా విధివిధానాల పట్లే ఉంటుంది కానీ,  దైవము పట్ల ధ్యాస ఎలా?

ఉదా..ఎవరికైనా తాంబూలం ఇవ్వాలంటే అరటిపండ్ల తొడిమలు ఏ దిక్కున ఉండేటట్లు ఇవ్వాలి, ఎలా ఇవ్వకూడదు..ఇలా వందల నియమాలు చెబుతారు.

 పూజకు సంబంధించిన విధివిధానాల గురించి ఆలోచించటానికి, ఆచరించటానికే ఎక్కువ సమయం పడుతోంది. 

రోజువారి పనుల విషయంలో కూడా టెన్షన్ ఉంటుంది కాని, దైవానికి సంబంధించిన విషయాల్లో ఎక్కడ తప్పులు వస్తాయో అని టెన్షన్ మరింత ఎక్కువగా ఉంటుంది.టెన్షన్ లేకుండా ప్రశాంతంగా దైవపూజ చేసుకుంటే బాగుంటుంది.  

 ప్రత్యేకమైన పూజలు చేసేటప్పుడు శ్రద్ధగా విధివిధానాలను పాటించాలి. భజనలు, నామసంకీర్తనలు  ఎవరైనా టెన్షన్ లేకుండా చేసుకోవచ్చు. 

 ఆచారవ్యవహారాల్లో ఎన్నో మంచివిషయాలను పొందుపరిచి ప్రాచీనులు మనకు అందించారు. అయితే, కాలక్రమేణా ఎన్నో మూఢనమ్మకాలు వచ్చాయి. అందువల్ల విచక్షణతో ప్రవర్తించాలి.

oka link....................................కష్టాలు తీరటం..
...............................

 ఈ కాలంలో పండుగలు, ఫంక్షన్లు సందర్భంగా అనేక కొత్త ఆచారవ్యవహారాలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా చాలా ఖర్చులు, శ్రమ కూడా ఉంటోంది. అనవసర సామాను ఎక్కువవుతోంది.
 
 ఇచ్చే గిఫ్టులతో ఇల్లంతా గజిబిజిగా తయారవున్నాయి. గిఫ్ట్ వద్దంటే వినరు. ఈ కార్యక్రమాల ద్వారా కొందరు వస్తువులను అమ్ముకుంటూ  వ్యాపారం కూడా చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమాల్లో అన్ని వృత్తులవారు 
(అందరూ) పాల్గొనటం వల్ల చాలామంది వ్యాపారస్తులకు ఆదాయం పెరిగింది.

పువ్వులు, పండ్లు, కొబ్బరి కాయలు..పూజాసామాగ్రి అమ్మటం..ఇలా కొందరికి జీవనోపాధి ఉంటుంది. కొందరికి జీవనోపాధి లభించే మాట నిజమే కానీ, ఎప్పుడూ రకరకాల పూజలంటూ చాలాసార్లు డబ్బు ఖర్చుచేయటం, అనేక ఆచారవ్యవహారాలను పాటిస్తూ చాలా సమయాన్ని కేటాయించటం అంటే అందరూ చేయలేరు.

కొంతకాలం క్రిందట కొన్ని వస్తువులు కొని సాటి స్త్రీలకు పంచిపెట్టాలని  లేకపోతే అరిష్టమని ప్రచారం చేసారు.  వ్యాపారస్తులు కొందరు వారి వద్ద వస్తువులను కొనిపించటానికి ఇలా ప్రచారం చేసారని వార్తలు వచ్చాయి.
 

ఈ రోజుల్లో కొందరు మతాల పేరుతో కూడా ధనార్జన..వ్యాపారం చేయటం ఎక్కువయ్యింది. జీవనవిధానంలో మతము, ఆర్ధికాభివృద్ధి కలగలిపి ఉండవచ్చు కానీ,   మతవిషయాలలో వ్యాపారమే ముఖ్యంగా మారకూడదు.

 అవసరమైనంత వరకు ఆర్ధికాభివృద్ధి అవసరమే కానీ, ఆర్ధికాభివృద్ధే జీవిత ధ్యేయం కాదుకదా.. ఈ రోజుల్లో చాలామంది  ఎలాగైనా సరే బోలెడు డబ్బు సంపాదించటమే  జీవితధ్యేయంగా బతుకుతున్నారు.

కొందరు మతం పేరుతో సంస్థలను మెలకొల్పి ప్రజల వద్ద డబ్బు తీసుకుని మోసం చేస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి.
........................................................

 పాతకాలంలో దేవాలయాల నిర్వహణకొరకు రాజ్యాలను ఏలే రాజులు ధనాన్ని సమకూర్చేవారు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు.. 

 ఈ రోజుల్లో అంటరానితనం వంటివి లేకుండా అందరూ దేవాలయాలకు వెళ్తున్నారు. 

ప్రజలు హుండీలలో వేసే ధనాన్ని.. బంగారాన్ని పెద్ద ఎత్తున నిల్వ ఉంచితే ఎవరైనా దోపిడీదారుల దృష్టి పడవచ్చు. హిందువులలో కూడా కొందరు చేతివాటం వాళ్ళుండే అవకాశం ఉంది.

అలా పెద్ద ఎత్తున బంగారాన్ని  ప్రోగుచేసి ఉంచటం కన్నా, కొంత నిల్వ ఉంచి, మిగతా ధనాన్ని హిందుపేదప్రజల కొరకు ఉపయోగించవచ్చు. అంటే, ప్రజలకు కొందరికి ఉచితంగా లేక కొందరికి తక్కువ ధరకు విద్యను, వైద్యాన్ని అందించవచ్చు.
 

 హిందువులలోనే చాలామంది పేదలున్నారు.  హిందూదేవాలయాల సొమ్మును ఇతరమతస్తులకు ఇచ్చే హక్కు ఎవరికి ఉండదు. అలాగని దేవాలయాలను ప్రభుత్వాల నుంచి తప్పించటమూ మంచిది కాదనిపిస్తుంది.  

కొందరు ఏమంటారంటే, దేవాలయాలను ప్రభుత్వాల నుంచి తప్పించి 
ప్రైవేట్ వారికి అప్పగించాలంటారు.
 (దేవాలయాల ప్రైవేటీకరణ) ప్రభుత్వం వద్ద ఉంటే అక్కడ ఏమైనా అవకతవకలు జరిగితే కనీసం ఓటు ద్వారా ఆ ప్రభుత్వాలను దింపే అవకాశమైనా సామాన్యప్రజలకు ఉంటుంది..... 

 .. ప్రైవేట్ వారి చేతుల్లోకి దేవాలయాలు వెళితే అక్కడ ఏమైనా అవకతవకలు జరిగితే సామాన్యప్రజలు ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండే పరిస్థితి కూడా ఉండవచ్చు.

 ఈ రోజుల్లో ఎవర్ని నమ్మాలో? ఎవరిని నమ్మకూడదో? అర్ధం కావటం లేదు.

 దేవాలయాలకు వెళ్తే , మన దేవాలయము ..అని స్వేచ్ఛగా  అనిపిస్తుంది.  ఆధునిక కాలంలో అన్ని వర్గాల ప్రజలు దేవాలయాలకు వెళ్తూ తమకు తోచిన సొమ్మును కానుకలుగా  సమర్పిస్తున్నారు. అలా కోట్ల రూపాయలు ధనం సమకూరుతోంది. 

దేవాలయాలను ప్రైవేటీకరణ చేస్తే బడా వాళ్ళు స్వాధీనం చేసుకుని, ప్రజలు దేవాలయాలకు సమర్పించిన సొమ్ముతో సహా దేవాలయాలను తమ స్వంత ఆస్తిలా పెత్తనం చేస్తారేమో? అని భయాలు కూడా కలుగుతున్నాయి.

 
హిందూ దేవాలయాల సొమ్ము హిందువులు మాత్రమే.. అనే చట్టం రావాలి.  దేవాలయాల వద్ద ఉన్న కొంతసొమ్ము తీసి, దేవాలయాల ఆధ్వర్యంలో హిందువులకు పాఠశాలలు, ఆసుపత్రులు కట్టించేలా  ప్రభుత్వాలను అడిగి.. ఆ విధంగా అందరూ చర్యలు తీసుకోవచ్చు.

 
 *****************
ఈ రోజుల్లో కొన్ని చోట్ల శుభ్రత లేని ప్రదేశాలలో కూడా కొత్తకొత్త దేవాలయాలను కడుతున్నారు. 

ఆశ్చర్యం ఏమిటంటే, జనాలకు సరైన భక్తి ఉంటే సమాజంలో ఇన్ని నేరాలు, ఘోరాలు చేయకూడదు.  కోరికలు తీరటానికి పూజలు చేయటం కూడా ఎక్కువయ్యింది. 

దైవకృపను పొందాలంటే దైవభక్తి కలిగి నైతికవిలువలతో జీవించటానికి ప్రయత్నించాలి.
.................

మన గ్రంధాలలో కొన్ని విషయాలను గమనిస్తే.. ఇలా ఎందుకు రాసారో? అనిపిస్తుంది. అవి ప్రక్షిప్తాలు కావచ్చు అనుకుంటున్నాము. ఈ విషయాల గురించి కొన్ని పాత పోస్టులలో ఉన్నాయి.
 
తరతరాలనుంచి అంటరానితనం మరియు కొన్ని మూఢనమ్మకాల వల్ల  ఇప్పటికే హిందుసమాజం ఎంతో నష్టపోయింది. 

పాతకాలంలో జరిగిన అంటరానితనం, కొన్ని మూఢనమ్మకాలు..తద్వారా కొందరు బాధలుపడటం .. వంటి
 వాటి  వల్ల కాబోలు భారతదేశంలో విదేశీయుల పాలన రావటం, విదేశీమతాలు ప్రవేశం జరిగి ఉండవచ్చు. ప్రతివిషయానికి  కర్మ ప్రభావం ఉంటుంది కదా..
 

మనల్ని ఎవరైనా కష్టపెడుతుంటే వారిని ఎదుర్కోవటం తప్పు కాదుకానీ, మనము అనవసరంగా ఇతరులను బాధించటం తప్పే కదా..అలా బాధపడినవారి ఉసురు తగిలే అవకాశం ఉంది.

 ఇప్పటికైనా హిందువులు ఒకరినొకరు గొడవలు పడకుండా సామరస్యంగా ఉంటే బాగుంటుంది. సమాజంలో అన్ని వృత్తుల వారు అవసరమే. ఎవరి కష్టసుఖాలు వారికి ఉన్నాయి. అందరూ ఒకరికొకరు సహకరించుకుంటూ చక్కగా జీవించాలి.
..................................................

జీవితంలో కొన్ని నియమాలు ఉంటే ఎవరికైనా ఆచరించడానికి సులభంగా ఉంటుంది. అదేపనిగా నియమాలంటూ అంతులేకుండా చెప్పుకుంటూ ఉంటే అందరూ పాటించలేరు. మతాన్నే వదిలేయాలనిపించవచ్చు. 

 ఎందరో హిందువులు మతం కూడా మారారు. అందువల్ల సరిదిద్దుకుని ముందుకు వెళ్ళాలి.

దైవము యొక్క అవసరం అందరికి ఉంటుంది. అయితే, దైవారాధనకు కఠినమైన మార్గాలను వదిలి సులభమైన మార్గాలను ఎన్నుకోవాలనిపించవచ్చు.

 పండుగలు వస్తున్నాయంటే టెన్షన్ వస్తుంది. బోలెడు నియమాలను పాటించలేక మతము అనేది లేకుండా నాకు కుదిరినంతలో దైవాన్ని ఆరాధించుకోవాలనిపిస్తుంది.  ఇదంతా గమనించిన తరువాత, నేను ఎలా మారతానో? అని భయం వేసి,  ఇప్పుడు నాకు వీలైనంతలో మాత్రమే పాటించటానికి ప్రయత్నిస్తున్నాను.

మేము ఇన్నిన్ని పాటించలేకపోతున్నాము బాబోయ్..అని మొత్తుకుంటున్నా కూడా అర్ధం చేసుకోకుండా కొందరు అపార్ధం చేసుకుంటున్నారు.

 కొందరు యువత..ఇవన్నీ మేము పాటించలేం, మాకు నచ్చిన పద్ధతిలో దైవాన్ని ప్రార్ధించుకుంటామని చెబుతున్నారు. అందువల్ల, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, కొంత పట్టువిడుపుగా ఉండటం మంచిది.

 ఇది కలికాలం. కలికాలంలో మనుషులు శారీరికంగా, మానసికంగా కొంత బలహీనులుగా ఉంటారు కాబట్టి, దైవభక్తి కలిగి దైవస్మరణ చేస్తే చాలు తరిస్తారని ప్రాచీనులే తెలియజేసారు.

బోలెడు పూజలను చేయకపోయినా.. జీవితంలో దైవభక్తి కలిగి, కొన్ని పూజలను చేస్తూ, నీతినిజాయితీలతో జీవించటానికి ప్రయత్నిస్తే దైవకృపను పొందే అవకాశం ఉంటుంది.