koodali

Wednesday, May 18, 2016

షిర్డి సాయి గురించి కొందరి అభిప్రాయాల గురించి ...

 
కొందరు ఏమంటున్నారంటే... సాయికి గురుపరంపర లేదు అంటున్నారు.

 దత్తాత్రేయుల వారు 24..గురువుల గురించి తెలియజేసారు. 
ఈ విషయాలను గమనిస్తే... గురువు కావాలంటే గురుపరంపర ఉండవలసిన అవసరం లేదని తెలుస్తుంది.

******************
షిర్డి సాయి గురించి  ప్రాచీన గ్రంధాలలో చెప్పలేదు అంటున్నారు.

 శ్రీ పాద శ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతము గ్రంధములో షిర్డిసాయి గురించిన వివరములున్నాయి.

 ధర్మ రక్షణ కొరకు  మహిమాన్వితులు లోకానికి రావటం జరుగుతుందని కూడా పెద్దలు తెలియజేసారు. 
****************
సాయి పుట్టుక గురించి ప్రశ్నిస్తూ .. సాయి హిందువా ? ముస్లిమా ? సాయిది ఏ కులం ? ...గురించి..

ఏరులు, వీరులు, గొప్పవారి .... పుట్టుక గురించి శోధించనవసరం లేదని పెద్దలు తెలియజేసారు కదా !

 కొన్ని మతముల వారి మధ్య సయోధ్య కుదర్చటం ఎంతో అవసరమైన ఆ రోజుల్లో షిర్డి సాయి  రావటం జరిగింది.

షిర్డి సాయి ఎన్నో విధానాలను పాటించారు...

 ఉదా..అగ్నిహోత్రాన్ని వెలిగించటం ( ధుని వెలిగించటం ), విభూతిని పంచి ఇవ్వటం,  హిందూ దేవాలయాలను బాగుచేయించటం..మరియు .. అల్లాహ్ నామాన్ని స్మరించటం, మసీదులను బాగుచేయించటం..ఇలా అన్ని మతాలకు సంబంధించిన విధానాలను అవలంబించారు. 

సాయి హిందువు అని తెలిస్తే ముస్లింలు దూరమయ్యే అవకాశముంది. సాయి ముస్లిం అని తెలిస్తే హిందువులు దూరమయ్యే అవకాశముంది. 

సాయి యొక్క పుట్టుక గురించి తెలియకపోవటం వలన ...అన్ని మతముల వారు సాయిని తమవారిగా భావించటానికి అవకాశం కలిగింది. 

ఇవన్నీ గమనిస్తే షిర్డి సాయి పుట్టుక  గురించి తెలియకపోవటం మంచిదే అనిపిస్తుంది.
****************

 షిర్డి సాయికి సరిగ్గా అంత్యక్రియలు జరగలేదనే విషయం గురించి .... 

 శ్రీ దేవీ భాగవతము ద్వారా తెలుస్తున్న విషయం ఏమిటంటే..సన్యాసికి అగ్ని సంస్కారం జరపకూడదు అని తెలుస్తోంది. 

ఉదా..భారతంలో  విదురుని శరీరం పడిపోగా,  ధర్మరాజు  కలిసి విదురునికి అగ్ని సంస్కారం జరపటానికి ప్రయత్నించగా ..ఇతడు విరక్తుడు, సన్యాసికి అగ్ని సంస్కారం జరపకూడదు.అలా వదిలి వెళ్లిపోండి. అని అశరీరవాణి అంటుంది.

  సాయి కూడా విరక్తులే. అంత్యక్రియలు సరిగ్గా జరగలేదనటం సరికాదు. 
 
******
షిరిడిలో సాయిబాబా సమాధి ఉండటాన్ని తప్పుపడతారు.
 
 అయితే, నాకు తెలిసినంతలో, హిందువులలో ..ఎవరైనా చిన్నపిల్లలు, గర్భిణి, సన్యాసులు..వీరి  మరణానంతరం శరీరాలను దహనం చేయకుండా మట్టిలో కప్పిపెడతారట.

**************
 సాయి ఆలయాలలో ఇతర దేవతల విగ్రహాలు ఉండకూడదనే విషయం గురించి...

ఇప్పుడు సాయి ఆలయాలలో ఇతర దేవతల మూర్తులు కూడా ఉండటం వల్ల హిందువులు చక్కగా పూజలు చేసుకుంటున్నారు.

 సాయి ఆలయాలలో ఇతర దేవతామూర్తుల విగ్రహాలను తొలగిస్తే ... క్రమంగా సాయి మతం వేరేగా ఏర్పడే ప్రమాదం ఉంది.

కొందరు ఏమంటున్నారంటే, సాయిని ఆరాధించేవారు సాయిమతం ఏర్పరుచుకోండి అంటున్నారు. 

ఇప్పటికే హిందూ మతం నుంచి బౌద్ధమతం, జైన మతం ఏర్పడ్డాయి. హిందువులలో  ఇలా చీలికలు ఏర్పడటం మంచిది కాదు.
*****************
. మంచి విషయాలను కలుపుకుని ముందుకు పోవటం ప్రాచీనుల విధానంగా ఉండేది. 
.......................
వ్రాసిన విషయాలలో పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.



4 comments:

  1. మరికొన్ని విషయాలు ....

    శ్రీ రాములవారు భక్త రామదాసును విడిపించే సమయంలో ముస్లిం అయిన తానీషాకు దర్శనమిచ్చారు. తిరుమలలో బీబీ నాంచారి అమ్మను పూజిస్తారు.

    అయ్యప్ప దేవాలయానికి వెళ్లేవారు వావర్ అనబడే ముస్లిం ఆలయానికి కూడా వెళ్తారంటారు.

    అమర్నాధ్ గుహ కొన్ని సంవత్సరాల క్రిందట బుటా మాలిక్ అనే ముస్లిం ద్వారా వెలుగులోకి వచ్చిందని అంటారు.

    ReplyDelete
  2. సమాజంలో రకరకాల మనస్తత్వాలవారుంటారు. కొందరు తమ మతంప్రకారం దైవాన్ని ప్రార్ధించుకుంటారు. కొందరు అనేకమతాలదేవతలను కూడా ప్రార్ధించుకుంటారు. కొందరు దైవాన్ని నమ్మని నాస్తికులుంటారు. ఇలా రకరకాల అభిప్రాయాలవారున్నారు.

    అయితే, హిందువులకు ఎందరో దేవుళ్లు ఉండగా, కొందరు హిందువులు ఇంకా కొత్తగా అందరి వద్దకు ఎందుకు వెళ్తున్నారో? అనే విషయాల గురించి ఆలోచించాలి.

    ఇప్పుడు చూడండి..టోపీఅమ్మ అనే ఆమె తనమానాన తాను బ్రతుకుతుంటే జనాలు ఆమె వెనకాల కూడా పడుతున్నారు. ఆమె విసుక్కుంటున్నా కూడా వెనకాల పడుతున్నారు.

    తమకు ఎందరో దేవతలు ఉండగా ఇంకా కొత్తవారివెంట ఎందుకు పడుతున్నారో? హిందువులు తమను తాము ప్రశ్నించుకోవాలి. హిందువులు అలా వెళ్లటానికి గల కారణాలను కనుగొని సరిచేసుకోవాలి.

    తమ వ్యవస్థ కఠినంగా ఉందనుకుంటే సరళంచేసుకోవాలి.
    భక్తుల పరిస్థితి పట్టించుకోకుండా కొందరు తమ మానాన తాము నియమాలను చెపుతున్నారు. హిందువుల్లో కూడా తమలోతాము గొడవలు పడేవారున్నారు.

    ఈ రోజుల్లో హిందువుల్లో ఆచారవ్యవహారాలను నియమబద్ధంగా పాటించవలసిన వారిలో కూడా కొందరు..కొన్ని ఆచారాలను సరిగ్గా పాటించలేకపోతున్నారు. ఇక ఆచారవ్యవహారాల గురించి అంతపట్టింపు లేనివారికి ఇవన్నీ పాటించటం అంటే ఎంతవరకు పాటిస్తారు?

    కలికాలంలో మనుషులు నియమాలను సరిగ్గా పాటించలేరని ప్రాచీనులే చెప్పటం జరిగింది. అలాగని అన్నింటినీ వదిలేయమని నా అభిప్రాయం కాదు. గ్రంధాలలో ఉన్న వాటిని కూడా కాలమానపరిస్థితులను బట్టి కొన్నిసార్లు పూర్తిగా పాటించలేము. గ్రంధాలలో కొన్ని మార్పులుచేర్పులు జరిగాయని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అలాంటప్పుడు ఏ విషయమైనా విచక్షణతో నిర్ణయించుకోవాలి.

    జీవితంలో నియమాలు అవసరమే. అయితే ఆ నియమాలు బోలెడుపెరిగిపోయి వాటిని తట్టుకోలేని పరిస్థితి రాకూడదు.

    నా విషయంలో కూడా కొన్నిసార్లు, కొన్ని ఆచారవ్యవహారాలను పాటించలేక ఈ విధంగా ఎందుకు పెట్టారో? అనిపించేది. టెన్షన్ అనిపించేది. దైవం అందరికీ అవసరమే. ఇప్పుడు నాకు కుదిరినంతలో టెన్షన్ కాకుండా దైవాన్ని ప్రార్ధించుకుంటున్నాను.

    నాకు ఏమనిపిస్తుందంటే, మన ఆచారవ్యవహారాలలో కొన్ని విషయాలలో విపరీతధోరణి పెరిగింది. కొన్నింటిని సరళం చేసుకుంటే బాగుంటుంది.

    కొంతకాలం క్రిందట కొందరు మహానుభావులు ఎన్నో సవరణలు చేయటం వల్ల దారితప్పిన సమాజం యొక్క పరిస్థితి కుదుటబడింది.

    కొన్ని మతాలవారు హిందువులను మతం మార్చటానికి ప్రయత్నిస్తున్నారు. కొందరు హిందువులేమో మతం మారుతారు. ఇతర మతాలవారికీ కష్టసుఖాలుంటాయి. అయితే, వారు తమ మతాలను మారటం పెద్దగా ఉండదు. హిందువులే ఇలా ఎందుకు చేస్తున్నారో? వారి సమస్యలు ఏమిటో? హిందువులు మాట్లాడుకుని సరిదిద్దుకోవాలి.

    మూఢాచారాల వల్ల సమాజానికి నష్టం ఉంటుంది. కొందరయితే డబ్బు, అధికారం కొరకు మతాలను వాడుతున్నారనిపిస్తుంది.

    ఎవరి పద్ధతిలో వారు దైవాన్ని ప్రార్ధించుకుంటే సమస్య లేదు.
    అయితే, తమ మతమే అంతటా ఉండాలని కొందరు..తమ మతం పతనం కాకుండా ఉండాలని కొందరు..ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.

    విదేశాల్లో గమనిస్తే అక్కడా మతాలగొడవలున్నాయి. మతాలపేరుతో ఒకరినొకరు చంపుకుంటున్నారు. దైవం పేరుతో కూడా గొడవలు, హింస ఏమిటో?

    సమాజంలో ఎన్నో వైరుధ్యాలు, ఎన్నో అభిప్రాయాలు. ఎవరి అభిప్రాయాలు వారివి.

    ఆధునిక విజ్ఞానం విషయంలో కూడా అవసరమైనంత వరకు మాత్రమే వాడుకుంటే మంచిది. పర్యావరణసమస్యలు, గ్లోబల్ వార్మింగ్..వంటి సమస్యలు రాకుండా పర్యావరణహిత టెక్నాలజీ రావాలి. ఆధ్యాత్మికత అయినా ఆధునికత అయినా అతిధోరణి కాకుండా ఉంటే అందరికీ మంచిది.

    ఎవరెంత చెప్పినా కొందరు వినిపించుకోరు.ఇక అన్నింటికీ దైవమే దిక్కు.

    ReplyDelete