koodali

Monday, May 2, 2016

నీటి గొడవల గురించి కొన్ని సంగతులు...మరియు..


కాకతీయులు ఎన్నో చెరువులను త్రవ్వించారంటారు .  

కాకతీయులు తెలంగాణకు మాత్రమే సంబంధించిన వారు కాదు. కాకతీయులు  తెలుగువారందరికీ  సంబంధించిన వారు.

 మున్నూరు సీమ (కృష్ణా జిల్లా) ..  చెందిన జాయప్ప సేనాని  కాకతీయ సామ్రాజ్యంలో ముఖ్యమైన వ్యక్తి. జాయపసేనాని సోదరి రుద్రమదేవికి తల్లి.


ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా కు  కూడా దాహార్తి తీరుస్తున్న ప్రాజ్రెక్ట్  నాగార్జునసాగర్ ప్రాజెక్ట్.

  నాగార్జునసాగర్ ప్రాజెక్ట్  నిర్మాణం  జరగటానికి  ఆంధ్రకు  చెందిన ముక్యాల రాజా వారి కృషి ఎంతో ఉంది. వారి చొరవ లేకపోతే లేకపోతే నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ వచ్చేదే కాదంటారు.


 తెలుగు వారు  బాగుపడాలని భావించి ఎన్నో కష్టాలుపడి నాగార్జునసాగర్ ఏర్పాటుకు కారకులు ఆంధ్ర వ్యక్తి. ఈ విషయాలను మర్చిపోకూడదు. 

  
ఈ రోజుల్లో డబ్బు కన్నా నీరే ముఖ్యం. డబ్బు ఇచ్చినా నీటిని  ఇచ్చే పరిస్థితి లేదు. 

అయితే, ఆంధ్రప్రదేశ్కు నీటి కొరత ఉన్నా కూడా  చెన్నై కు త్రాగునీటిని ఇవ్వటం జరిగింది.


ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాను ఇవ్వటాన్ని తమిళనాడు వ్యతిరేకించటం అన్యాయం.

చిత్రమేమిటంటే, ఇవన్నీ ఎవరూ మాట్లాడటం లేదు.

...............

నదులు ప్రవహించే ప్రాంతాలు అన్నింటికి ఆ నీటిపై సమాన హక్కులు ఉంటాయి.

 నీరు దిగువ ప్రాంతాలకు రాకుండా ఎగువ రాష్ట్రాల వాళ్లే ఇబ్బడిముబ్బడిగా ఆనకట్టలు కట్టేసుకుని వాడేసుకుందామనుకుంటే అది అన్యాయం అవుతుంది.

 ట్రిబ్యునల్స్ ఉన్నాకూడా ఎగువ రాష్ట్రాల వాళ్ళు ఎక్కువ ఆనకట్టలు ఎలా కట్టగలిగారో తెలియటం లేదు. 


 ఎవరి వాటాను వారు వాడుకుంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు.  అయితే,  నీటిని న్యాయంగా వాటాలు వేయాలి. 


 ఎగువ రాష్ట్రాల వల్ల అన్యాయం జరుగుతుందని అనిపించినప్పుడు ...దిగువ రాష్ట్రాల వాళ్ళు తమకు న్యాయంగా రావాలసిన నీటి కోసం  న్యాయపోరాటం చేయక తప్పదు.


 నీరు దిగువకు పోకుండా ఆబగా ఆనకట్టలు కట్టేసుకున్న వాళ్ళు కూడా వర్షాలు పడకపోతే నీటికోసం  ఎన్నో కష్టాలు పడుతున్నారు కదా! 


ప్రకృతి సంపద  అందరితో  పంచుకోవాలి. అంతేకానీ అంతా మనకే చెందాలనుకుని అత్యాశకు పోకూడదు. 
........................

  సముద్రంలో నదుల నీరు కలవటాన్ని వృధాగా భావించకూడదు. నదులనీరు సముద్రంలో కలవటం ఎంతో అవసరం.

 వాననీరు కాలువలు, నదుల ద్వారా సముద్రంలో కలవటం..ఎండలకు ఆ నీటిఆవిరి వర్షంగా పడటం ప్రకృతి సహజమైన చర్య.

నదులనీరు సముద్రంలో కలవకుండా ఎక్కడికక్కడ అడ్దుకట్టలు కట్టేస్తే ... సముద్రపు నీటిలో లవణగాఢత హెచ్చితే...  వాతావరణంలో  ఏం మార్పులు జరుగుతాయో చెప్పలేం.

 మనం  ప్రకృతికి అనుగుణంగా ఉంటూ నీటిని పొదుపుగా వాడుకోవాలి. అవసరమైతే నీటి వాడకాన్ని తగ్గించుకోవాలి. 

  గృహావసరాల కోసం ఎక్కువ నీరు అవసరం ఉండదు. అయితే, ఆధునిక కాలంలో పరిశ్రమలకు ఎక్కువ నీరు అవసరమవుతోంది.


నీటిపొదుపు, వృక్షాలను బాగా పెంచటం, మేఘాలను అడ్డుకుని వర్షాలను కురిపించటం కొరకు కొండలను రక్షించుకోవటం.. వంటి చర్యలను తీసుకోవటం ఎంతో అవసరం.


45 comments:

  1. నేను సాగు నీరు రంగం గురించి దాదాపు రెండేళ్ళు అధ్యయనం చేసాను. వేలాది పేజీలు  ట్రిబ్యూనల్ నివేదికలు, ప్రాజెక్ట్ రిపోర్టులు, కోర్టు తీర్పులు, ప్రభుత్వ గణాంకాలు వగైరా లోతుగా పరిశీలించాను. తద్వారా జనసామాన్యానికి సరయిన అవగాహన లేని అనేక విషయాలలో/వాస్తవాలలో నాకు మంచి పట్టు ఉంది.

    మీముందు కొన్ని వాస్తవాలను ఉంచే ప్రయత్నం చేస్తాను. చాంతాడంత కాకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో పలు వ్యాఖ్యలలో వివిధ విషయాలు ప్రస్తావిస్తాను.

    ముందు మీకు కొన్ని నా విన్నపాలు:

    1. నేను రాసేవి అన్నీ వాస్తవాలే, అభిప్రాయాలు కావు. ఇంకా ఆధారాలు కావాలంటే ఇవ్వగలను.
    2. తెలంగాణా వాదానికి నా వ్యాఖ్యలకు ఎటువంటి సంబంధం లేదు. ఆంద్ర-తెలంగాణా బేధం లేకుండా ఒకప్పటి ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రం & పక్క రాష్ట్రాల విబేదాల గురించి మాత్రమె నేను వ్యాఖ్యానిస్తున్నాను
    3. కాదు కూడదు నేను ఆంద్ర వ్యతిరేకతతో రాసాని అని మీరు అనుకుంటే నా వ్యాఖ్యలను తొలగించగలరు.
    4. మీరు నా వ్యాఖ్యలను డిలీట్ చేస్తే నేను ఇవే వాస్తవాలను నా బ్లాగులో ప్రచురించే హక్కు నాకుందని మీరు అంగీకరిస్తే సంతోషిస్తాను.

    ReplyDelete
  2. వ్యాఖ్య 2: చెరువుల గురించి

    కాకతీయులే కాదు ఇంకా ఎందరో రాజవంశీయులు చెరువులు తవ్వించారు. ఉ. విజయనగర సామ్రాజ్యంలో బ్రహ్మాండమయిన చెరువుల అభివృద్ధి జరిగింది. చెరువులు కాకతీయులతో మొదలూ కాలేదు అంతమూ కాలేదు.

    క్రీస్తు పూర్వం కాలం నాటి తమిళ "పురనూరు" గ్రంధంలో చెరువులు గురించి రాసారు. కౌటిల్యుని అర్ధశాస్త్రం చెరువు నీటిపై హక్కులు & బాధ్యతల గురించి విసృతంగా చర్చించింది. తొమ్మిదవ శతాబ్దంలో చోళులు చెరువుల తవ్వకం & మరమ్మత్తుల విషయాలలో విప్లవాత్మకయిన సాంకేతిక ప్రగతిని సాదించారని అంటారు. కాకతీయులతో సహా ఇతర హిందూ ముస్లిం రాజవంశాలు ఇదే పరంపరను కొనసాగించాయి. ఆంగ్లేయులు కొత్తగా చెరువులు కట్టలేదు కానీ ఉన్నవి వట్టి పోకుండా కాపాడారు.

    వీటిలో హెచ్చు శాతం దక్షిణ పీథ భూమిలో (deccan plateau) ఉన్నవే. నీటి నిలువకు & గొలుసు కట్ట అనుసంధానికి ఈ ప్రాంత నైసర్గిక పరిస్తితులు చక్కగా సరిపోవడం ఇందుకు సహకరించింది. తీర ప్రాంతాలు దాదాపు నున్నగా ఉండడం వలన చెరువులకు పెద్దగా అనుకూలం కాదు.

    ReplyDelete
  3. వ్యాఖ్య 3: నాగార్జున సాగర్ గురించి

    ఆరవ నిజాము (మహబూబ్ అలీ ఖాన్) కాలంలో అప్పటి హైదరాబాదు రాష్ట్రం కృష్ణా పారివాహిక ప్రాంతంలో మూడు అంతర్రాష్ట్రీయ ప్రాజెక్టులు తలపెట్టింది. ఇందులో మొదటిది బొంబాయితో కలిసి ఎగువ కృష్ణ (ప్రస్తుత ఆల్మట్టి) కాగా మరొకటి తుంగభద్ర ప్రాజెక్ట్. మూడవది దిగువ కృష్ణ: దీనికి రెండు ప్రత్యామ్నాయ సూచనలు వచ్చాయి. నందికొండ (ఇప్పటి సాగర్) ఒక ప్రస్తావన కాగా కృష్ణ-పెన్నా అనుసంధానం వేరేది.

    ఆరవ నిజాం కాలంలోనే బ్రిటిష్ ఇంజినయర్లతో సర్వేలు జరిపారు. కొంతవరకు ప్రణాలికలు ఏర్పడ్డాయి. బొంబాయి మదరాసు రాష్ట్రాల ఆంగ్ల ప్రభుత్వాలు కూడా ఆసక్తి చూపించాయి. అయినా కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్టులు ముందుకు సాగలేదు.

    దిగువ కృష్ణ ప్రాజెక్టులలో ఏది చేపెట్టాలో అన్న విషయంపై మదరాసు రాజకీయ నాయకులలో గొడవలు వచ్చాయి. రెంటిలోనూ ఎడమ కాలువ తెలుగు జిల్లాలకే లాభం కానీ సమస్యంతా కుడి కాలువలోనే. నందికొండ కుడి కాలువ మొత్తంగా తెలుగు రైతులకే లాభిస్తుంది. కృష్ణ-పెన్నా అనుసంధానం సింహభాగం కూడా తెలుగు వారికే లాభం అయినా అతిస్వల్ప భాగం తమిళ ప్రాంతాలకు పనికి వస్తుంది. కేంద్రం ఈ విషయాన్ని జస్టీస్ ఖోస్లా కమిటీకి అప్పచెప్పింది. కమిటీ అనేక విషయాలను అధ్యయనం చేసాక నందికొండ వైపే మొగ్గు చూపింది.

    ముక్త్యాల రాజా వారు నందికొండకు చేసిన సేవలు అపూర్వం అయితే ఆయన తీవ్రంగా వ్యతిరేకించిన కృష్ణ-పెన్నా ప్రాజెక్ట్ కూడా తెలుగు వారికి నష్టం చేసేది కాదు. ఎన్టీఆర్ హయాములో దాన్నేఎడమ కాలువ తొలగించి & సాగు నీటి ప్రాధాన్యత గణనీయంగా తగ్గించి తెలుగు గంగ అనే కొత్త పేరుతొ ప్రారంభించారు.

    చివరిగా తెలుగు గంగ ద్వారా మదరాసు నగరానికి ఇచ్చే నీరు మొత్తం 15 వెయ్యి కోట్ల చదరపు అడుగులు (వెకొచ) కాగా దీన్ని మహారాష్ట్ర, కర్నాటక, ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ చెరి 5 వెకొచలతో సమానంగా పంచుకున్నాయి.

    ReplyDelete
    Replies
    1. నిజాం కాలంలో ఆలోచనలు జరిగినా ఆచరణలోకి రాలేదు. ముక్త్యాల రాజాగారు... ప్రజలను, అధికారులను, నిపుణులను..అందరినీ కూడగట్టుకుని ఎన్నో కష్టనష్టాలకోర్చి నాగార్జునసాగర్ నిర్మాణానికి నాంది పలికారు.
      ..............

      ఇక, మీరు వ్రాసినట్లు ....ముక్త్యాల రాజా వారు నందికొండకు చేసిన సేవలు అపూర్వం అయితే ఆయన తీవ్రంగా వ్యతిరేకించిన కృష్ణ-పెన్నా ప్రాజెక్ట్ కూడా తెలుగు వారికి నష్టం చేసేది కాదు. ...అని మీరు అన్నది సరైనది కాదు.

      అప్పటి విధానం ప్రకారం..కృష్ణ-పెన్నా ప్రాజెక్ట్ వల్ల తెలుగురాష్ట్రానికి పెద్ద లాభమేమీ కలిగేది కాదు. నాగార్జునసాగర్ వల్ల ఆంధ్ర, తెలంగాణా ప్రాంతాలకు త్రాగునీరు, సాగునీరు అందుతోంది. అప్పటి కృష్ణ-పెన్నా ప్రాజెక్ట్ వల్ల రాయలసీమకు కూడా సాగునీరు లభించేది కాదు.

      ఇంకా, మీరన్నట్లు.... ఎన్ టీ ఆర్ హయాంలో సాగునీటి ప్రాముఖ్యతను తగ్గించలేదు. ఎన్ టీ ఆర్ హయాంలోనే రాయలసీమకు సాగునీరు ఇచ్చేటట్లు చేసారు.

      ఈ క్రింది విషయాలు చదివితే వివరంగా తెలుస్తుంది.........

      Delete
    2. తెలుగుగంగ ప్రాజెక్టు...వికీపీడియా నుండి
      (ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది.వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి.)

      భారత దేశంలో అత్యంత వివాదాస్పదమైన నీటిపారుదల ప్రాజెక్టుల్లో తెలుగుగంగ ప్రాజెక్టు ఒకటి. చెన్నైకి తాగునీరిచ్చే ఉద్దేశంతో మొలకెత్తిన ఈ ప్రాజెక్టు ప్రతిపాదనకు, రాయలసీమ, నెల్లూరు ప్రాంతాలకు సాగునీటి సరఫరా కూడా తరువాతికాలంలో చేరింది. నీటి కేటాయింపులను అధిగమించి, వాడుకుంటున్నారనే పక్కరాష్ట్రాల ఆరోపణతో అంతర్రాష్ట్ర జలవివాదం మొదలైంది.
      నేపథ్యం[మార్చు]
      తాగునీటి సమస్యతో అతలాకుతలమైపోతూ ఉండే చెన్నై నగరానికి కృష్ణా జలాలను అందించడమే సరైన పరిష్కారంగా ప్రభుత్వాలు, నిపుణులూ కూడా భావించారు. 1950ల మొదట్లో, నాగార్జునసాగర్ ప్రాజెక్టు కట్టక మునుపు, కృష్ణా-పెన్నా ప్రాజెక్టు నొకదానిని రూపొందించి, కృష్ణా నీటిని చెన్నైకి తరలించే ఆలోచన చేసింది, రాజాజీ నాయకత్వంలోని అప్పటి ఉమ్మడి మద్రాసు ప్రభుత్వం. అయితే నిపుణుల సంఘం దానిని ఆమోదించక, నల్గొండ జిల్లా నందికొండ దీనికనువైనదిగా సూచించింది. అక్కడే నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. అయితే, చెన్నై నీటి సమస్య అలాగే ఉండిపోయింది.
      ప్రతిపాదనలు[మార్చు]
      తమిళనాడు ప్రభుత్వ ప్రయత్నాల ఫలితంగా, 1971లో కృష్ణా పరీవాహక ప్రాంతంలోని మూడు రాష్ట్రాల మధ్యా ఒక ఒప్పందాన్ని అప్పటి కేంద్రప్రభుత్వం కుదిర్చింది. దీని ప్రకారం, ఈ మూడు రాష్ట్రాలు - మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ - తమ వాటా లోనుండి తలా 5 టి.ఎం.సి. నీటిని చెన్నై తాగునీటి కోసం కేటాయిస్తాయి.

      1976 ఏప్రిల్ 14 న మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు ముఖ్యమంత్రుల మధ్య ఈ విషయమై చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. తెలుగుగంగ చరిత్రలో ఇదో మైలురాయి. 1977 అక్టోబర్ లో జరిగిన అంతర్రాష్ట్ర మంత్రుల స్థాయి సమవేశంలో, శ్రీశైలం ప్రాజెక్టు నుండి ఈ నీటిని తీసుకోవాలని నిర్ణయించారు. 1978 లో ప్రాజెక్టుకు సంబంధించిన పరిశీలన పనులు మొదలై, 1983 కి ముగిసాయి.

      రామారావు ప్రవేశం[మార్చు]
      1983 లో ముఖ్యమంత్రిగా రామారావు రంగప్రవేశం చేసాడు. కాంగ్రెసు పార్టీతో ఆయనకు ఉన్న రాజకీయ స్పర్థ తెలుగుగంగ విషయంలో నిర్ణయాలు తీసుకునే విషయంలో ఆయనకు ఉపయోగపడింది. పూర్వపు కాంగ్రెసు ముఖ్యమంత్రులు పార్టీ అధిష్టానాన్ని మన్నించి, సర్దుకోవలసి వచ్చేది. రామారావుకు ఇది లేకపోవడం వలన, తన వాదనలు, నిబంధనల విషయంలో గట్టిగా ఉండి, రాయలసీమ సేద్యపు నీటిని కూడా ప్రాజెక్టులో భాగం చేసాడు.
      1983 మే 23 న ఆంధ్ర, తమిళనాడు ముఖ్యమంత్రులు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ సమక్షంలో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రారంభం జరిగింది.

      వివాదాలు[మార్చు]
      అంతర్రాష్ట్ర వివాదాలు[మార్చు]
      రాయలసీమ, నెల్లూరు ప్రాంతాల సాగునీటి అవసరాలను పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి సహజంగానే వచ్చింది. మిగిలిన రాష్ట్రాలు దీనికి అభ్యంతరం తెలిపాయి. దీనికి ప్రధాన కారణం - బచావత్ ట్రిబ్యునల్ లో శ్రీశైలం నుండి రాయలసీమకు కృష్ణా జలాల కేటాయింపులు లేవు. శ్రీశైలం నుండి సాగునీరు వాడుకుంటే అది ట్రిబ్యునల్ కేటాయింపుల ఉల్లంఘనే అనేది ఎగువ రాష్ట్రాల వాదన. ఆంధ్ర ప్రదేశ్ వాదన ఇలా ఉంది. మూడు రాష్ట్రాల వాటా పోను కృష్ణా నదిలో ప్రవహించే అదనపు జలాలను వాడుకునే స్వేచ్ఛను ఆంధ్ర ప్రదేశ్ కు ట్రిబ్యునల్ ఇచ్చింది. కాబట్టి ఎగువ రాష్ట్రాలకు ఈ విషయంలో అభ్యంతరాలు ఉండనవసరం లేదు.

      కర్ణాటక ప్రభుత్వం చేసిన మరో వాదన: "శ్రీశైలం నుండి సాగునీరు ఇవ్వదలచిన నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాలు పూర్తిగాను, కర్నూలు జిల్లాలో సగానికిపైగాను పెన్నా పరీవాహక ప్రాంతంలోనివి. కృష్ణా బేసిన్ పరిధిలోకి రావు. సాగునీటిని వేరే బేసిన్ కు తరలించడం సరైనది కాదు." కర్ణాటక తన ఈ అభ్యంతరాన్ని ట్రిబ్యునల్ కు నివేదించగా, అలా తరలించడంలో తప్పేమీ లేదని ట్రిబ్యునల్ తేల్చింది.

      Delete
    3. తమిళనాడులో కావేరీ నది ప్రవహిస్తోంది. ఆ నీటిని వాళ్ళు చెన్నైకి ఎందుకు తరలించుకోలేదో ?

      చెన్నైకు త్రాగునీరు ఇవ్వటం మంచిదే. అయితే, ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాలకు త్రాగునీటి కొరత ఉన్నాకూడా ఆంధ్రప్రదేశ్ తన వాటా నుంచి చెన్నైకి త్రాగునీరు ఇవ్వటం గొప్ప విషయం.

      రాయలసీమలో కూడా కృష్ణా నది ప్రవహిస్తోంది. కృష్ణా నీటిపై వారికీ హక్కులు ఉంటాయి కదా!

      చెన్నై కృష్ణా నదికి చాలా దూరంగా ఉన్నా కూడా నీటిని ఇస్తున్నప్పుడు కృష్ణా పరీవాహక ప్రాంతమైన రాయలసీమలోని ప్రాంతాలకు సాగునీరు ఇవ్వటంలో అభ్యంతరం ఏముంటుంది.

      Delete
    4. వికీపీడియా ఎవరయినా ఎడిట్ చేయవచ్చు. నేను అందుకే దాన్ని పెద్దగా నమ్మను.

      అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించిన నీటిరంగ నిపుణులలో భారాతీయులు తక్కువే, అందులో తెలుగు వారిని వేళ్ళ మీద లెక్కించవచ్చు. శ్రీకాకుళం జిల్లాలో ఒక కుగ్రామంలో పుట్టిన డా. నిక్కు బాలరాజు గారు వీరిలో ప్రముఖులు. ఆయన తెలుగు గంగ మీద విసృత పరిశోధన చేసారు. ఇందులో భాగంలో ప్రాజెక్ట్ సంబంధ ప్రాంతాలలో తిరిగి నిపుణులు, ఇంజనీయర్లు & రైతులతో చర్చించారు. కుదిరితే వారు రాసిన Water Rights, Conflicts and Collective Action Case of Telugu Ganga Project పుస్తకం చదవండి.

      బాలరాజు గారు కృష్ణ-పెన్నా ప్రాజెక్ట్ వివరాలు ఇస్తూ కుడి ఒడ్డున సీమ, నెల్లూర్ & చెంగల్పట్టు జిల్లాలలో 36 లక్షల ఎకరాలు సాగు అయ్యేవని తెలిపారు. 1 హెక్టేర్= 2.5 ఎకరాల లెక్కలో ఇది 14.4 లక్షల హెక్టేర్లు.

      చెంగల్పట్టు జిల్లా సాగు వివరాలు ఆయన తెలపలేదు. అయితే అప్పటి చెంగల్పట్టు జిల్లా విస్తీర్ణం 7,975 చదరపు కిమీ. దాదాపు అంటే పెద్ద (8,727 చ. కిమీ విస్తీర్ణం) ప్రస్తుత కృష్ణా జిల్లాలో 2008-09 నీటి సంవత్సరంలో నికర (ఖరీఫ్ + రబీ) 467,975 హెక్టేర్లు సాగులో ఉన్నాయి. చెంగల్పట్టు జిల్లాలో అంతే అనుకున్నా తెలుగు జిల్లాలకు కుడి కాలువ ద్వారా 972,025 హెక్టేర్లు సాగయ్యేవి. 2008-09 నీటి సంవత్సరంలో సాగర్ కుడి కాలువ నికర సాగు 510,693 మాత్రమె. కృష్ణ-పెన్నా ప్రాజెక్టు కోల్పోవడం వలన కుడి ఒడ్డులో తెలుగు వారికి 462,332 తగ్గిందనే భావించాల్సి వస్తుంది.

      ఇక తెలుగు గంగకు వస్తే ఇందులో 2008-09 నీటి సంవత్సరంలో నికర సాగు 88,325 హెక్టేర్లు మాత్రమె. ప్రాజెక్ట్ ఇంకా పూర్తి కాలేదనుకోండి కానీ పూర్తి అయినా దాని ప్రణాళిక క్షమత 256,000 హెక్టేర్లు మాత్రమె. కృష్ణ-పెన్నా కుడి ఒడ్డు యొక్క 972,025 తో పోలిస్తే ఇది దాదాపు పావు వంటే అవుతుంది.

      Delete
    5. మదరాసు కావేరి పారివాహిక ప్రాంతంలో కూడా లేదండీ. నాకు తెలిసి నగరం పాలార్ బేసిన్లో ఉంది.

      పారివాహిక ప్రాంతాలు నైసర్గికంగా ఏర్పడతాయి. పారివాహిక ప్రాంతాల మధ్య నీటి తరలింపు ప్రకృతితో చెలగాటం. నీటిని బలవంతంగా పలు బేసిన్లు దాటుతూ తీసుకు వెళ్ళడం వివేకం కాదు.

      మీ సమాచారం కోసం రాయలసీమలో పావు భూభాగం మాత్రమె కృష్ణా బేసిన్లో ఉంది. సీమ సింహభాగం పెన్నా & ఇతర పారివాహిక ప్రాంతాలోకి వస్తుంది.

      ఇకపోతే సీమకు కృష్ణా జలాలు ఇవ్వడాన్ని ఎవరూ అభ్యంతరించలేదు. అన్ని ప్రాంతాలకు కలిపి రాష్ట్రం కేటాయింపులు దాటితేనే వివాదం. కేటాయింపు హద్దుల్లో ఉంటూనే అన్ని ప్రాంతాలకు న్యాయం చేయడం రాష్ట్రం బాధ్యత.

      Delete
    6. ప్రభుత్వపరంగా కృష్ణా-పెన్నా ప్రాజెక్ట్ యొక్క విధానాలు ఏమిటో సరిగ్గా తెలియదు.

      కృష్ణా-పెన్నా కన్నా నాగార్జునసాగర్ వల్ల తెలుగువారికి ఎక్కువ లాభం జరుగుతుందని భావించి అప్పటి వాళ్లు నాగార్జునసాగర్ నిర్మాణానికి ఆసక్తి చూపించారు.
      ...........

      కృష్ణా-పెన్నా వద్దని నాగార్జునసాగర్ రావటానికి ఆంధ్రవాళ్ళు కృషి చేసి నిర్మింపజేసారు.

      ఇప్పుడు నాగార్జునసాగర్ ద్వారా తెలంగాణా పెద్దఎత్తున నీరు వాడుకుంటోంది. అయినా కూడా ఆంధ్ర వాళ్ళను దొంగలు, దోపిడీదార్లు అన్నారు. రాష్ట్ర విభజన చేసారు.

      నాగార్జునసాగర్ కట్టకుండా .. కృష్ణా నీరు సాటి తెలుగువారైన తెలంగాణాకు ఇవ్వకుండా .. కృష్ణ-పెన్నా నిర్మించి దూరంగా ఉన్నవారికి సాగునీరు ఇస్తే తెలంగాణా వారు ఊరుకునేవారా ?

      ఇప్పుడు శ్రీశైలం నుండి రాయలసీమకు ఇచ్చే సాగు నీరు విషయంలో తెలంగాణా వాళ్ళు అభ్యంతరాలు చెబుతున్నారు కదా !

      అయినా మీ అభిప్రాయం ఏమిటి ? నాగార్జునసాగర్ నిర్మాణం కాకుండా కృష్ణా-పెన్నా ప్రాజెక్ట్ వస్తే బాగుండేదని మీ అభిప్రాయమా ?

      ఇప్పటికీ మించిపోయింది లేదు. శ్రీశైలం నుండి రాయలసీమకు ఎక్కువ సాగునీరు అందటంలో అడ్డుపడకండి.

      మీకు ఆసక్తి ఉంటే తెలంగాణా వాటా నుండి తమిళనాడుకు కూడా పెద్ద ఎత్తున సాగునీటిని అందించండి.

      Delete

    7. మదరాసు కృష్ణా పరీవాహక ప్రాంతంలో కూడా లేదు కదండి.

      కావేరి నది తమిళనాడు రాష్ట్రంలోనే ఉంది. వారి రాష్ట్రంలో ఉన్న నది నుండి వారు రాజధానికి త్రాగునీరు తీసుకువెళ్ళటానికి ఎవరూ అభ్యంతరం చెప్పరు.

      నాకు తెలిసినంతలో చెన్నై నుండి కృష్ణానది కన్నా..కావేరి నదే దగ్గర.

      హైదరాబాద్ కు కూడా కృష్ణా, గోదావరి నీరు తరలిస్తున్నారు కదా !

      నాకు తెలిసినంతలో ఏ రాష్ట్రం అయినా తనకు జరిగిన కేటాయింపు ప్రకారం రాష్ట్రంలో ఎక్కడయినా నీటిని తరలించుకుని వాడుకోవచ్చు. కేటాయింపులు దాటకుండా చూసుకోవాలి అంతే.
      .................

      నదీపరీవాహక ప్రాంతాలకు దూరంగా ఉన్న నగరాలకు కొన్ని T M C లు తీసుకువెళ్తున్నప్పుడు రైతులకు సాగునీరు ఇవ్వటానికి అభ్యంతరం ఎందుకుండాలి?

      ఒక్క T M C నీటితో కొన్ని వేల ఎకరాలు సాగు చేయవచ్చు. రైతులు పండిస్తేనే కదా నగరాల వాళ్ళకు ఆహారం లభించేది. అందువల్ల త్రాగునీరు, సాగునీరు అని తేడా ఉండకూడదు. రైతులకు సాగునీరు కూడా అందించాలి.
      .............

      రాయలసీమ యొక్క పరివాహక ప్రాంతం గురించిన వివరాలు తెలుగుగంగ గురించి వ్రాసిన వ్యాఖ్యలో ఇచ్చాను. రాయలసీమలో నెల్లూరు మొదలైన ప్రాంతాల వద్ద పెన్న నది ఉంది.
      కర్నూల్ కృష్ణా పరీవాహక ప్రాంతంలో ఉంది. కర్నూల్ వద్ద తుంగభద్ర కూడా ప్రవహిస్తోంది. పెన్నా కూడా ఉంది. అయినా కర్నూల్ ప్రాంతానికి సాగునీరు సరిగ్గా అందకుండా ఉంది.

      Delete
    8. కృష్ణ-పెన్నా ప్రాజెక్ట్ బదులు ఇప్పుడు తెలుగుగంగ ఉంది. మొదట్లో తెలుగుగంగ ద్వారా రాయలసీమకు సాగునీరు ఇచ్చే ఉద్దేశం లేదంటారు.

      ఎన్ టి ఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత తెలుగుగంగ ద్వారా రాయలసీమకు సాగునీరు వచ్చేలా చేసారు.

      రాయలసీమకు సాగునీరు తరలించే విషయంపై కర్ణాటక తన ఈ అభ్యంతరాన్ని ట్రిబ్యునల్ కు నివేదించగా, అలా తరలించడంలో తప్పేమీ లేదని ట్రిబ్యునల్ తేల్చింది.

      Delete
    9. చెన్నపట్నం ఒకప్పుడు తెలుగువారి ప్రాంతమే.

      నాకు చెన్నై అంటే చాలా ఇష్టం. మేము కొన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నాము.

      అక్కడ వారిలో మాకు మంచి ఫ్రైండ్స్ ఉన్నారు.

      రాజకీయనాయకులు తమ స్వార్ధం కోసం ప్రజల మధ్య భేదాలు కలుగజేస్తున్నారు.

      Delete
    10. ఇరుగుపొరుగు వాళ్ళు ఒకరికొకరు సహకరించుకోవటం మంచిదే. చెన్నైకు త్రాగునీరు సరఫరా మంచి పనే. ఆంధ్రప్రదేశ్ కు నీరు సరిగ్గా అందాలి.

      Delete
  4. వ్యాఖ్య 4: నీటి కేటాయింపులు & ఉపయోగం గురించి.

    గోదావరిలో (ప్రస్తుతానికి) దండిగా నీళ్ళున్నాయి. పైగా గోదావరి జలాల పంపకాలు రాష్ట్రాల మధ్య ఒప్పందాల ద్వారా జరిగాయి. అంచేత మనం కృష్ణా పారివాహిక ప్రాంతానికి పరిమతం అయితే చాలును.

    మొదటి కృష్ణా జలవివాదాల ట్రిబ్యూనల్ (బచావత్) వివిధ రాష్ట్రాలకు కేటాయించిన వాటాలు (వెకొచలలో) ఇవి.

    మహారాష్ట్ర: 560
    కర్నాటక: 700
    ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్: 800

    దీనికి ప్రాతిపదిక 75% విశ్వసనీయత అనగా సదరు వాటా నాలుగింటి మూడేళ్ళు లబిస్తుంది.

    1972-2008 మధ్య 36 నీటి సంవత్సరాలలో ఏమి జరిగిందో రెండవ కృష్ణా జలవివాదాల ట్రిబ్యూనల్ (బ్రిజేష్ కుమార్) ప్రచురించింది. పూర్తి వివరాలకు ప్రాధమిక నివేదిక 320-321 పేజీలు  సంప్రదించగలరు.

    మహారాష్ట్ర 2005-06 నీటి సంవత్సరంలో మాత్రమె 560 వెకొచ దాటింది. కర్నాటక ఒక్క సారీ 700 దాటలేదు. ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఏడు సార్లు మాత్రమె 800 వెకొచ కంటే తక్కువ నీరు లభించింది (~ 80% విశ్వసనీయత). అందులో 650 వెకొచ కంటే తక్కువ లభ్యం అయింది కేవలం 2002-03 & 2003-04 నీటి సంవత్సరాలలో మాత్రమె.

    ReplyDelete
    Replies
    1. *********************
      మీరు వ్రాసిన వివరాల ప్రకారం చూసినా కర్ణాటక, మహారాష్ట్ర తమకు కేటాయించిన నీటివాటాను సమృద్ధిగా వాడుకుంటున్నాయని తెలుస్తోంది. ఒక్కొక్కసారి అంతకు మించి కూడా వాడుకోవటం జరిగింది.
      ఉదా..మహారాష్ట్ర 2005-06 నీటి సంవత్సరంలో 560 వెకొచ దాటింది.

      మరి ఆంధ్రప్రదేశ్ విషయం చూస్తే ( మీరు ఇచ్చిన వివరాల ప్రకారం..)ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఏడు సార్లు 800 వెకొచ కంటే తక్కువ నీరు లభించింది (~ 80% విశ్వసనీయత). అందులో 650 వెకొచ కంటే తక్కువ లభ్యం అయింది 2002-03 & 2003-04 సంవత్సరాలలో .

      ఈ విషయాలను గమనించితే ఏం తెలుస్తోందంటే... ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన నీటికన్నా చాలాసార్లు తక్కువ వాటానే లభించిందని తెలుస్తోంది. ఇది ఆంధ్రప్రదేశ్కు జరిగిన అన్యాయమే కదా !

      Delete
    2. నేను పరిస్తితి సరిగ్గా వివరించలేకపోయానేమో?

      75% విశ్వసనీయత అంటే నాలుగేళ్ళలో మూడేళ్ళు కేటాయించిన వాటా లభించాలి. 36 సంవత్సరాలకు 75% అనగా 27 ఏళ్ళు.

      రాష్ట్రం:వాటా లభ్యమయిన ఏళ్ళు:వాస్తవ విశ్వసనీయత
      (State:Years allocation received:Actual dependability)
      మహారాష్ట్ర:1:2.8%
      కర్నాటక:0:0%:
      ఆంద్ర ప్రదేశ్:29:80.6%

      Delete
    3. మరొక్క విషయం: "మహారాష్ట్ర 2005-06 నీటి సంవత్సరంలో మాత్రమె 560 వెకొఘ దాటింది" అనడం వలన పరిస్తితి సరిగ్గా అర్ధం కాదేమో? ఆ ఏడు వారు 563.6 వెకొఘ వాడారు. మరో ఆరేల్లలు మాత్రమె 500 దాటారు.

      Delete
  5. వ్యాఖ్య 5 (చివరిది): న్యాయ పోరాటాల గురించి.

    కర్నాటక రాష్ట్రం తమిళనాడుకు నీళ్ళు ఆపేస్తూ చట్టం చేసింది. సదరు చట్టం రాజ్యాంగ విరుద్ధమని అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది.

    ఆలమట్టి డాం నిలిపి వేయాలని ఆంద్ర ప్రదేశ్ కోర్టు గుమ్మం తట్టింది. కోర్టు కర్నాటక వైపు తీర్పు ఇస్తూ ఆలమట్టి కట్టే హక్కు కర్నాటకు ఉందని తేల్చింది.

    మహారాష్ట్ర బభాలీ బారేజీ కట్టడం ఒప్పందానికి ఆంద్ర ప్రదేశ్ మళ్ళీ కోర్టు ఎక్కింది. మహారాష్ట్ర ఒప్పందాన్ని ఉల్లంఘించలేదని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.

    కోర్టులు కొట్టేసిన వాదనలే మళ్ళీ మళ్ళీ వాడి రాజకీయ నాయకులు ప్రజలను మభ్యపెట్టబూనడం మన దురదృష్టం.

    ReplyDelete
    Replies
    1. మీరు ఈ విషయాలను ఇంతకుముందు కూడా వ్రాసారు.
      అయితే, ఈ మధ్యే తెలంగాణా ముఖ్యమంత్రిగారు ఎగువరాష్ట్రాలు ఇబ్బడిముబ్బడిగా ఆనకట్టలు కట్టేయటం గురించి వివరంగా చెప్పారు కదా ! ( మీరేమో ఎగువరాష్ట్రాలు అనేక ఆనకట్టలు కట్టడంలో తప్పులేదంటారు. )

      తెలంగాణా ముఖ్యమంత్రిగారు ఇంకా ఏమన్నారంటే ..ఉమ్మడిరాష్ట్రంలో ఉన్నప్పుడు ఎగువరాష్ట్రాలు అనేక ఆనకట్టలు కట్టేస్తుంటే అప్పటి సమైఖ్య ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు పట్టించుకోలేదని, అప్పటి ప్రభుత్వాలను తప్పుపట్టారు .

      మరి, ఆలమట్టి డాం నిలిపి వేయాలని ఆంద్ర ప్రదేశ్ కోర్టు గుమ్మం తట్టింది. కోర్టు కర్నాటక వైపు తీర్పు ఇస్తూ ఆలమట్టి కట్టే హక్కు కర్నాటకు ఉందని తేల్చింది.మహారాష్ట్ర బభాలీ బారేజీ కట్టడం ఒప్పందానికి ఆంద్ర ప్రదేశ్ మళ్ళీ కోర్టు ఎక్కింది. మహారాష్ట్ర ఒప్పందాన్ని ఉల్లంఘించలేదని న్యాయస్థానం తీర్పు ఇవ్వటం జరిగిందంటున్నారు.

      అయితే, ప్రాజెక్టులు కట్టాక ఒక్కోసారి నీటిని ఎక్కువగా వాడే అవకాశం ఉంటుంది. ఉదా..మహారాష్ట్ర 2005-06 నీటి సంవత్సరంలో 560 వెకొచ దాటిందని మీరే వ్రాసారు.

      ఇవన్నీ గమనిస్తే కొన్ని సందేహాలు వస్తాయి.

      ఇలా కేటాయించిన నీటికంటే ఎక్కువ వాడుకున్నప్పుడు ట్రిబ్యునల్స్ వారు ఏం చేస్తారు ? అలా వాడుకున్న వాళ్ళకు ఏమైనా శిక్ష విధిస్తారా ?

      ఎక్కువ నీటిని వాడుకున్నట్లు ఎన్నిసార్లని, ఎవరు , ఎలా పరీక్షిస్తారు ?

      నదులలో నీరు తక్కువ ఉన్నప్పుడు నీటి కేటాయింపుల వాటాలలో మార్పులు ఉండవా ?

      దిగువ రాష్ట్రాలకు కేటాయించిన నీరు వాటాకు తగ్గట్లు అందనప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారు ?

      దిగువ రాష్ట్రాలకు కేటాయించిన నీరు అందేలా చర్యలు తీసుకోవలసిన బాధ్యత ట్రిబ్యునల్స్ తీసుకోవాలి కదా !

      ఎన్నో సందేహాలు ఉన్నప్పుడు, ఇప్పుడు ఎగువరాష్ట్రాలు కడుతున్న ప్రాజెక్టుల గురించి ఆంధ్రప్రదేశ్కు ఆందోళన ఉండటంలో తప్పులేదు కదా !

      Delete
    2. కెసిఆర్ వ్యాఖ్య గురించి నేను స్పందించను. ఒక నాయకుడు చెప్పినంత మాత్రాన ఆ విషయాన్ని గుడ్డిగా నమ్మడం విశ్లేషకులకు తగదని మాత్రమె అనగలను.

      గోదావరి పారివాహిక ప్రాంతంలో కేటాయింపులు ఒప్పందాల ద్వారా జరిగాయి. ఇందుట్లో సింహభాగం "ఫలానా చోటి దాకా నీరు మీది, ఆపైన మాది" తరహావి. మహారాష్ట్ర మన భూభాగం లోకి జోరబడలేదు కనుక వివాదం ఉండకూడదు.

      ఏయే ప్రాజెక్టులో ఎవరెంత నీరు తీసుకున్నారనే లెక్కలు కేంద్ర జల సంఘం (CWC: Central Water Commission) ప్రచురిస్తుంది.

      ఫిర్యాదులు ఉన్న రాష్ట్రం అంతర్రాష్ట్రీయ జల వివాదాల చట్టం, 1956, ద్వారా తమ సమస్యలు లెవనెత్తొచ్చు.

      "నదులలో నీరు తక్కువ ఉన్నప్పుడు నీటి కేటాయింపుల వాటాలలో మార్పులు ఉండవా ?"

      చెయ్యవచ్చు. అయితే కృష్ణా పారివాహిక ప్రాంతం గురించి బచావత్ ట్రిబ్యూనల్ చేసిన ఇటువంటి ప్రతిపాదన (స్కీం-బీ) ఆంద్ర ప్రదేశ్ తిరస్కరించింది.

      దిగువ ఎగువ రాష్ట్రాలు అన్నీ సమానమే. ఎవరి సమస్యలు వారికి ఉన్నాయి.

      సందేహాలు అనుమానాలు వాస్తవాలు కానేరవు.

      Delete

  6. ఎగువరాష్ట్రాలైనా దిగువ రాష్ట్రాలైనా ప్రజల బాధలు సమానమే. ఎవరూ నీరు లేక ఇబ్బందులు పడకూడదు.
    పశుపక్ష్యాదులు..కూడా ఇబ్బందిపడకూడదు.

    ఇప్పటికైనా అందరూ వర్షాలు పడటం కోసం పర్యావరణాన్ని పాడుచేయకుండా ఉండటం, చెట్లు పెంచటం, నీటిని పొదుపుగా వాడటం, నీటి అవసరం ఎక్కువగా ఉండే పరిశ్రమలను తగ్గించుకోవటం వంటి చర్యలను తీసుకోవాలి.

    ReplyDelete
  7. This comment has been removed by the author.

    ReplyDelete
  8. నా వ్యాఖ్యలలో చిన్న పొరపాటు జరిగింది. వెయ్యి కోట్ల "చదరపు" అడుగులు (వెకో"చ") కాదు వెయ్యి కోట్ల "ఘనపు"టడుగులు (వెకో"ఘ") గా చదువుకోగలరు. Thousand Million Cubic Feet (TMC) అనే ఆంగ్ల పదాన్ని తప్పుగా తర్జుమా చేసాను, సారీ.

    వీలును బట్టి మిగిలిన ప్రశ్నలకు సమాధానం ఇస్తాను.

    ===========================================
    పై వ్యాఖ్యలో ఇంకో తప్పు దొర్లింది అందుకే డిలీట్ చేస్తున్నాను

    ReplyDelete


  9. మరికొన్ని వివరాలు గమనించితే ఏమనిపిస్తోందంటే,

    ఈ నీటి గురించి ఎన్నో వివాదాలు ఉన్నట్లున్నాయి. యధాప్రకారం ఎవరి వాదన వారు చేస్తున్నారు.
    ............

    ఒక T M C ( 1 T M C ) నీటితో సుమారు 7,000 నుంచి 10000 ఎకరాల కు సాగునీరు అందించవచ్చునంటున్నారు.

    కృష్ణా మరియు గోదావరి నీటి వాటాలు కలిపితే ఆంధ్రప్రదేశ్కు కూడా సుమారు 1,000 T M C లు పైనే వచ్చే అవకాశముంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్కు ఫరవాలేదనిపిస్తోంది.

    అయితే, ఎగువ రాష్ట్రాలు అయినా దిగువ రాష్ట్రాలు అయినా వారికి కేటాయించబడిన కేటాయింపుల ప్రకారం నీటిని వాడుకోవాలి. నీటి కేటాయింపులు న్యాయంగా ఉండాలి.ఎవరికైనా అన్యాయం జరిగిందనిపించినప్పుడు న్యాయస్థానం సహాయం తీసుకోవచ్చు.

    ఒకరితోఒకరు ఇచ్చిపుచ్చుకునే ధోరణి, మనమూ బ్రతకాలి ఇతరులూ బ్రతకాలి అనే ధోరణి ఉన్నప్పుడు సమాజంలో సామరస్యం ఉంటుంది. అలాకాకుండా పంతాలుపట్టింపులు వంటివి ఉన్నప్పుడు ఎవరికీ మనశ్శాంతి ఉండదు.

    భవిష్యత్తులో నీటి కరువు రాకుండా ఉండాలంటే అన్ని రాష్ట్రాల వాళ్ళు నీటిని పొదుపుగా వాడుకోవాలి. పర్యావరణహితకరమైన చర్యలను చేపట్టాలి.

    ***********

    ఇంకొక విషయం ఏమిటంటే, నాగార్జునసాగర్, పోలవరం వంటి భారీ ప్రాజెక్ట్స్ వల్ల ఉపయోగాలు ఉన్నాయి. అయితే ఇలాంటి భారీ ప్రాజెక్ట్స్ వల్ల భూకంపాలు మరియు కొన్ని ప్రమాదాలు జరగటానికి అవకాశముందని అంటున్నారు.

    ఇంత భారీ ప్రాజెక్ట్స్ కాకుండా చిన్నచిన్న ప్రాజెక్ట్స్ కట్టుకుంటే బాగుంటుంది అనికూడా అనిపిస్తుంది.

    ReplyDelete
  10. గతంలో మీరు నన్ను తెలంగాణా-ఆంద్ర మధ్య వివాదాల గురించి వ్యాఖ్యలు రాయవద్దని అడిగారు. నేను దానికి కట్టుబడే ఉన్నాను కనుక వాటి జోలికి పోదలచలేదు.

    అప్పట్లో హైదరాబాదు-మదరాసు రాష్ట్రాలు ఉమ్మడిగా కట్టుదామని అనుకున్న కృష్ణ-పెన్నా & నందికొండ (నాగార్జున సాగర్) రెంటిలోనూ కుడి (మదరాసు) & ఎడమ (హైదరాబాదు) శాఖలు ఉండేవి. నీటి లభ్యత దృష్ట్యా రెండిట్లో ఏదో ఒకటి మాత్రమె కుదురుతుందని ఇరువురి అవగాహన. హైదరాబాదుకు ఏదయినా నష్టం లేదు. మదరాసు రాజకీయాల ప్రభావం వలన కుడి ఒడ్డులో కొంత కలవరం చెలరేగింది. ముఖ్త్యాల రాజా లాంటి వారు నందికొండ కోసం లాబీయింగ్ చేస్తే సీమ & తమిళ నాయకులు కృష్ణ-పెన్నా వైపు మొగ్గు చూపారు.

    ఖోస్లా కమిటీ అందరి వాదనలు విన్నారు. ఇతర (సాంకేతిక & ఆర్ధిక) అంశాలు పరిగణనలో తీసుకున్నాక నందికొండ కట్టమని కేంద్రానికి సలహా ఇచ్చారు. వారి నిర్ణయం వెనుక సాంకేతిక విషయాలే కారణమని అనుకుంటా.

    సాగర్ కుడి కాలువ ద్వారా ప్రస్తుతం గుంటూర్ & ప్రకాశం జిల్లాలలో 510,693 హెక్టేర్లు సాగు అవుతున్నాయి. ఒకవేళ సాగర్ బదులు కృష్ణ-పెన్నాకట్టి ఉండుంటే కర్నూల్, కడప, చిత్తూర్ & నెల్లూర్ జిల్లాలలో 972,025 హెక్టేర్లు సాగు జరిగేదని నా అంచనా. ఏదేమయినా గతాన్ని తిరిగి రాయలేము. తాత్కాలిక రాజకీయాలకు రైతు ప్రయోజనాలు ఫణంగా పెట్టడం దురదృష్టం.

    ReplyDelete
    Replies
    1. ఈ విషయాల గురించి వ్యాఖ్యను క్రింద వ్రాసానండి.

      Delete
  11. "కావేరి నది తమిళనాడు రాష్ట్రంలోనే ఉంది. వారి రాష్ట్రంలో ఉన్న నది నుండి వారు రాజధానికి త్రాగునీరు తీసుకువెళ్ళటానికి ఎవరూ అభ్యంతరం చెప్పరు"

    కావేరి మీద కర్నాటక తమిళనాడు రాష్ట్రాల మధ్య ఎన్నో వివాదాలు ఉన్నాయి. ఇప్పటికే తమకు సరయిన సాగు నీరు దొరకడం లేదని గగ్గోలు పెడుతున్న తంజావూరు రైతులు మదరాసు పట్టణానికి 15 వెకోఘ తరలిస్తే ఊరుకుంటారను కోవడం కష్టమే.

    "హైదరాబాద్ కు కూడా కృష్ణా, గోదావరి నీరు తరలిస్తున్నారు కదా !"

    కృష్ణ బేసిన్లో ఉన్ననగరానికి గోదావరి నదులు ఇవ్వడం గురించి అనేక వివాదాలు ఉన్నాయి. మంజీరా డాం రైతులు ఎంతో ఆందోళనలో ఉన్నారు.

    "అందువల్ల త్రాగునీరు, సాగునీరు అని తేడా ఉండకూడదు"

    తాగు నీటికి ప్రాధాన్యత ఇవ్వాలనన్నది నీటి రంగ నిపుణుల ఎకగ్రీవ అభిప్రాయం.

    "ఎన్ టి ఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత తెలుగుగంగ ద్వారా రాయలసీమకు సాగునీరు వచ్చేలా చేసారు"

    నిజమే కానీ ఎంత? కృష్ణ-పెన్నా ప్రాజెక్ట్ వ్యాఖ్యలో నేను ఇచ్చిన గణాంకాలు చూడండి.

    "రాజకీయనాయకులు తమ స్వార్ధం కోసం ప్రజల మధ్య భేదాలు కలుగజేస్తున్నారు"

    నిజమే. అందుకే నేను బాలరాజు గారి లాంటి నిపుణులు ఇచ్చిన వివరాలు & ఇతరత్రా వాస్తవాలను స్వయంగా లోతుగా చదువుతాను.

    ReplyDelete
    Replies
    1. " ఇప్పటికే తమకు సరయిన సాగు నీరు దొరకడం లేదని గగ్గోలు పెడుతున్న తంజావూరు రైతులు మదరాసు పట్టణానికి 15 వెకోఘ తరలిస్తే ఊరుకుంటారను కోవడం కష్టమే."

      తమిళనాడు వాళ్లు తమ రాష్ట్రంలోని నది సమస్యలను, తమ రాష్ట్ర ప్రజలను సమర్ధించుకోలేక ఇతర రాష్ట్రాల నీరు అడగటం ఎంతవరకు భావ్యం ? ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు మాత్రం నీటి సమస్య లేదా ?

      "తాగు నీటికి ప్రాధాన్యత ఇవ్వాలనన్నది నీటి రంగ నిపుణుల ఎకగ్రీవ అభిప్రాయం."

      త్రాగటానికి నీరు అవసరమేముఖ్యమే. అయితే మనిషి బ్రతకటానికి ఆహారం కూడా ముఖ్యమే కదా ! అందువల్ల సాగునీరూ ఇవ్వటమూ ముఖ్యమే.

      Delete
    2. మంజీరా రైతులు హైదరాబాదుకు నీరు తరలిస్తే అభ్యంతరం తెలుపుతూనే ఉన్నారు. తంజావూరు రైతులు అదే రకంగా స్పందిస్తారు.

      తాగు నీటికి ప్రాధాన్యత ఇవ్వాలన్న సూత్రం జాతీయ అంతర్జాతీయ నీటి న్యాయ సూత్రాలలో ముఖ్యమయినది. ఇది తప్పని ఎవరు అనుకున్నా న్యాయం మారదు.

      Delete
    3. అంటే ఆంధ్రవాళ్లే అందరి కష్టాలను నెత్తిన వేసుకుని భరించాలంటారా ?

      Delete
    4. ఆంద్ర ప్రదేశ్, కర్నాటక & మహారాష్ట్ర ముగ్గురూ సమానంగా 5 వెకోఘలు ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. ఇప్పుడు ఇందులో ఎవరయినా (లేదా అందరూ) ఒప్పందం వెనక్కు తీసుకుంటే తమిళనాడు చేయగలిగింది ఏమీ లేదు.

      శ్రీశైలం ఎత్తు జీవోల గొడవలు మీకు అవగతమే అనుకుంటా. వివరాలు కావాలంటే ఇవ్వగలను.

      Delete
    5. మిగతా రాష్ట్రాల గురించి మాకు అనవసరం. దిగువరాష్ట్రం అయిన ఆంధ్రకు అందవలసిన వాటా అందటం లేదు.

      ఇక శ్రీ శైలం ఆనకట్ట ఎత్తు జీవోల గొడవలు గురించి నాకు తెలియదు. తెలుసుకోవాలనే ఆసక్తీ ప్రస్తుతానికి లేదు.

      శ్రీ శైలం ఆనకట్టఎత్తు, ఎగువ రాష్ట్రాల వారు కట్టే అనేక ప్రాజెక్ట్స్ వాటి ఎత్తు గురించి ఎవరి అభిప్రాయాలు వారికుంటాయి.

      ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నంత వరకూ వాద వివాదాలు ఉంటూనే ఉంటాయి.

      Delete
    6. శ్రీశైలం ఎత్తు వివాదం ఒకే రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల మధ్య గొడవలకు చక్కని ఉదాహరణ. మీకు ఆసక్తి లేక పొతే వదిలేయండి.

      Delete
  12. కృష్ణా పారివాహిక ప్రాంతానికి ఏయే ప్రాంతం వర్షం ద్వారా ఎంత నీరు ఇస్తుందో, నీటి కేటాయింపులలో ఎంత వాటా తీసుకుంటుందో ఒకసారి చూద్దాం.

    ప్రాంతం: ఇస్తున్న నీటి శాతం: వాటా శాతం
    Region: Water contribution%: Allocation%

    మహారాష్ట్ర: 31.8%: 27.2%
    కర్నాటక: 42.7%: 34.0%
    తెలంగాణా: 17.9%: 12.8%
    కోస్తా: 3.6%: 19.5%
    సీమ: 4.1%: 6.5%

    ఇకపోతే ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి నీటి లభ్యం గణాంకాలు ఇలా ఉన్నాయి (వెకోఘలు):

    కృష్ణ: 800 (బచావత్)
    గోదావరి: 1,480 (ఇంజినియర్ల అంచనా)
    ఇతర పారివాహిక ప్రాంతాలు: 489 (ఇంజినియర్ల అంచనా)

    మొత్తం 2,769 సరిగ్గా వాడుకుంటే బానే ఉంటుంది. అంతేకాక చివరిది గణనీయంగా పెంచవచ్చును. పెన్నా, వంశధార, నాగావళి లాంటి 38 మధ్య & చిన్న తరహా పారివాహిక ప్రాంతాలలో చేరే వర్షపు నీరు రాష్ట్రం మొత్తటి వర్షంలో షుమారు 30% ఉండగా వీటి వలన వాడకంలో వచ్చే నీరు 17% మాత్రమె.

    ReplyDelete
    Replies

    1. కృష్ణ-పెన్నా ప్రాజెక్ట్ గురించిన వివరాలు ఊహాగానాలే కానీ విధానాలు ఏమిటో సరిగ్గా తెలియదు.

      అయినా,ఎన్నో విషయాలను ఆలోచించి ఖోస్లా కమిటీ నాగార్జునసాగర్ నిర్మాణానికి ఆమోదం తెలపటం జరిగింది.

      కృష్ణ-పెన్నా ప్రాజెక్ట్ బదులు ఇప్పుడు తెలుగుగంగ ఉంది. మొదట్లో తెలుగుగంగ ద్వారా రాయలసీమకు సాగునీరు ఇచ్చే ఉద్దేశం లేదంటారు.

      ఎన్ టి ఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత తెలుగుగంగ ద్వారా రాయలసీమకు సాగునీరు వచ్చేలా చేసారు.

      రాయలసీమకు సాగునీరు ఇవ్వటంలో ఎగువరాష్ట్రాలు అడ్డుపడటానికి ప్రయత్నించాయి.

      రాయలసీమలో పావు భూభాగం మాత్రమె కృష్ణా బేసిన్లో ఉంది. సీమ సింహభాగం పెన్నా & ఇతర పారివాహిక ప్రాంతాలోకి వస్తుంది. అని మీరు కూడా వ్రాసారు.

      రాయలసీమకు సాగునీరు తరలించే విషయంపై కర్ణాటక తన ఈ అభ్యంతరాన్ని ట్రిబ్యునల్ కు నివేదించగా, అలా తరలించడంలో తప్పేమీ లేదని ట్రిబ్యునల్ తేల్చింది.

      Delete

    2. ఇప్పటికీ కృష్ణా మరియు గోదావరి నీటి వాటాలు కలిపితే ఆంధ్రప్రదేశ్కు సుమారు 1,140 T M C లు పైనే వచ్చే అవకాశముంది.


      ఒక్క T M C ( 1 T M C ) నీటితో సుమారు 7,000 నుంచి 10000 ఎకరాల కు సాగునీరు అందించవచ్చునంటున్నారు.( ఇవి తెలంగాణా వారి ద్వారా తెలుస్కున్న విషయాలు .)


      అలా చూస్తే సుమారు 1,000 T M C ల నీటితో సుమారు కోటి ఎకరాలకు ( 1,0000000) నీటిని అందించవచ్చు.

      పట్టుదలతో ప్రయత్నిస్తే రాయలసీమతో సహా ఆంధ్రప్రదేశ్ మొత్తం లాభపడుతుంది.


      ( మీరు చెప్పిన 972,025 హెక్టార్లు అంటే 24,01926.08 ఎకరాలు మాత్రమే. 24 లక్షల కన్నా కోటి ఎకరాలే ఎక్కువ కదా !)


      అయితే, బాధాకరమైన విషయం ఏమిటంటే ఇంతవరకు ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన నీటికన్నా చాలాసార్లు తక్కువ వాటానే లభించిందని తెలుస్తోంది.

      ఇప్పుడు జరగవలసినది ఆంధ్ర నీటి వాటా ఆంధ్రకు సరిగ్గా అందేలా తగిన చర్యలు తీసుకోవాలి .

      ఈ విషయాల గురించి ప్రస్తుతానికి చర్చలు వద్దులెండి.

      Delete
    3. "మీరు చెప్పిన 972,025 హెక్టార్లు అంటే 24,01926.08 ఎకరాలు మాత్రమే. 24 లక్షల కన్నా కోటి ఎకరాలే ఎక్కువ కదా"

      నేను చెప్పింది ఒక్క ప్రాజెక్ట్ గురించి. మీరు అన్ని ప్రాజెక్టులు కలిపి చెప్తున్నట్టు ఉంది.

      "రాయలసీమకు సాగునీరు తరలించే విషయంపై కర్ణాటక తన ఈ అభ్యంతరాన్ని ట్రిబ్యునల్ కు నివేదించగా, అలా తరలించడంలో తప్పేమీ లేదని ట్రిబ్యునల్ తేల్చింది"

      తమ వాటా లోపల ఉన్నంత వరకు ప్రతి రాష్ట్రానికి అంతర్గత బట్వాడా విషయంలో పూర్తీ హక్కులు ఉంటాయని ట్రిబ్యూనల్ చెప్పింది. దాన్నే న్యాయస్థానం ధృవీకరించింది.

      "అయితే, బాధాకరమైన విషయం ఏమిటంటే ఇంతవరకు ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన నీటికన్నా చాలాసార్లు తక్కువ వాటానే లభించిందని తెలుస్తోంది."

      కృష్ణా పారివాహిక ప్రాంతం నీటిలో కేవలం పావు వంతు నీరు ఇస్తున్న ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ నీటిలో దాదాపు 39% తీసుకుంటుంది. అంతేకాక రాష్ట్రానికి చిన్న చిన్న బెసిన్లను సద్వినియోగం చేసుకునే అవకాశం ఉన్నా ఆ శ్రమ తీసుకోవడం లేదు. అయినా మీకు ఇంకా కావాలని అనిపిస్తే నేను ఏమీ అనను.

      "ఈ విషయాల గురించి ప్రస్తుతానికి చర్చలు వద్దులెండి."

      అలాగేనండీ, మీరు ఇంకో వ్యాఖ్య రాయకపోతే ఇదే నా ఆఖరి వ్యాఖ్య.

      Delete
    4. ఎన్ని ప్రొజెక్ట్స్ అయినా, ఏ రాష్ట్రానికి జరిగిన నీటి కేటాయింపులలోనే ఆ రాష్ట్రం వారు వాడుకోవలసి ఉంటుంది.

      కృష్ణా-పెన్నా ఉంటే కృష్ణా నీటిని ఆంధ్ర వాళ్ళు తమిళనాడుతో పంచుకోవలసి వచ్చేది. ఆంధ్రకు ఇప్పటికన్నా తక్కువ నీరే వచ్చేంది.

      కావేరీ నుంచి రాయలసీమకు ఏమైనా నీరు ఇస్తున్నారా ?

      Delete
    5. "కృష్ణా-పెన్నా ఉంటే కృష్ణా నీటిని ఆంధ్ర వాళ్ళు తమిళనాడుతో పంచుకోవలసి వచ్చేది. ఆంధ్రకు ఇప్పటికన్నా తక్కువ నీరే వచ్చేంది"

      నిక్కు బాలరాజు గారి సమాచారం & దానిపై మీ ముందు ఉంచాను. ఆపై మీ ఇష్టం.

      "కావేరీ నుంచి రాయలసీమకు ఏమైనా నీరు ఇస్తున్నారా ?"

      కావేరి నుండే కాదు గోదావరి నుండి సీమకు ఒక్క చుక్క రావడం లేదు.

      Delete
  13. తుంగభద్ర గురించి రాయబోయి కావేరి అని వ్రాసాను.

    కర్నూల్ వద్ద ప్రవహించే తుంగభద్ర కే రావలసిన నీరు సరిగ్గా రావటం లేదు.

    నిక్కు బాలరాజు గారి సమాచారం ఎలా ఉన్నా...ఎన్ని ప్రొజెక్ట్స్ అయినా, ఏ రాష్ట్రానికి జరిగిన నీటి కేటాయింపులలోనే ఆ రాష్ట్రం వారు వాడుకోవలసి ఉంటుంది.

    కృష్ణా-పెన్నా ఉంటే కృష్ణా నీటిని ఆంధ్ర వాళ్ళు తమిళనాడుతో పంచుకోవలసి వచ్చేది. ఆంధ్రకు ఇప్పటికన్నా తక్కువ నీరే వచ్చేది.

    పట్టిసీమ నీరు రాయలసీమకు వెళ్తే గోదావరి నీరు వెళ్ళినట్లే కదా!

    ReplyDelete
    Replies
    1. తుంగభద్ర ప్రాజెక్టుల నుండి సీమలో నికర సాగు: 124,242 హెక్టేర్లు.

      నిపుణుల లెక్క కన్నా వికీపీడియా సమాచారమే ఉత్తమనుకునే మీ హక్కును ఎవరూ కాదనలేరు.

      పట్టిసీమ (లేదా పోలవరం) ద్వారా నీటి తరలింపు వలన ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రానికి 45 వెకోఘలు అదనంగా వస్తాయి. అవి ఏయే జిల్లాలకు ఎంత ఇస్తారో అన్న నిర్ణయం ఇంకా రాలేదు. సీమకు ఇందులో కొద్దో గొప్పో వస్తే కరువు ప్రాంత రైతులు బాగు పడతారు.

      Delete
  14. వికీపీడియాలో వ్రాసేవారు నిపుణులు అయి ఉంటారు లేక నిపుణులు వ్రాసిన వ్యాసాల నుంచి సమాచారం తీసుకుని వికీపీడియాలో ప్రచురిస్తారు.

    నిపుణులలో కూడా విషయాలపై అభిప్రాయ భేదాలు ఉండవచ్చు.

    ReplyDelete
  15. ఇప్పటి దాకా ఈ టపాలో నా వ్యాఖ్యలన్నీవాస్తవాల ఆధారంగా రాసినవి. ఈ ఒక్క వ్యాఖ్యలో మాత్రం కొన్ని అభిప్రాయాలు పంచుకుందామని అనుకుంటున్నాను. మీకు నచ్చుతాయని ఆశ.

    ప్రస్తుతం నీటి ప్రాజెక్టులను బేరీజు వేసే క్రమంలో పర్యావరణ, సాంకేతిక & ఆర్ధిక గిట్టుబాటు అంశాలను మాత్రమె పరిగణనలో తీసుకుంటున్నారు. నా ఉద్దేశ్యంలో ఇది మార్చాల్సిన అవసరం ఉంది.

    1. సామాజిక & ఆర్ధిక నేపధ్యాన్ని ఆలోచిస్తే బాగుంటుంది. ఉ. రైతు కూలీలు/కౌలుదారులు/సన్నకారు రైతులకు 10% లాభం బడా భూస్వాములకు 20% లాభంతో సమానమే కదా. అలాగే ధనిక అగ్రవర్ణాల జేబు నింపడం కన్నా దళిత గిరిజన మైనారిటీ వర్గాల పొట్ట నింపడం.

    2. ప్రత్యక్ష ఖర్చులతో/లాభాలతో బాటు దీర్ఘ కాలిక పరోక్ష ఖర్చులను & లాభాలను చూడాలి. ఉ. వెనుక బడిన కరువు ప్రాంతంలో కట్టే ప్రాజెక్ట్ వలన జరిగే అభివృద్ధితో లభించే పన్నులను కూడా ఖర్చు-లాభం సూచీ (cost-benefit statement) లో లెక్క పెట్టాలి.

    3. సాగే కాదు ధాన్యం కూడా ముఖ్యం. ఫలానా ప్రాజెక్ట్ ఇన్ని హెక్టేర్లు అనే బదులు ఇన్ని టన్నుల ధాన్యం లెక్క చూస్తె ఆహార బద్రత పెరుగుతుంది. అదే తరహాలో వాణిజ్య పంటలకు ప్రాధాన్యత తగ్గించాలి.

    4. నీరు ఉచితం అనుకోవడం తప్పు. నిజానికి డబ్బు ఎంత పోసినా ఎన్నో చోట్ల నీరు దొరకదు. నీటి సద్వినియోగం చేసే సాగు (ఉ. చెరుకు/వారి బదులు రాగి/జొన్న) ఉంటె మంచిది.

    ReplyDelete
  16. నా వ్యాఖ్యలలో కొన్నిటిని మీరు డిలీట్ చేసారు. వాటిలో అభ్యంతరకరమయిన విషయాలు ఉన్నట్టు లేదు.

    ReplyDelete
  17. అభ్యంతరకరమైనవి ఉన్నాయి. ఆంధ్ర నీటి వాటా గురించి మా అభిప్రాయాలు మాకున్నాయి.

    ఈ విషయంలో మీ అభిప్రాయాలు మీవి. నా అభిప్రాయాలు నావి.

    అందువల్ల ఈ విషయాల గురించి గురించి ప్రస్తుతం ఇక్కడ చర్చించాలని నాకు లేదు.

    ReplyDelete