koodali

Friday, March 7, 2014

జీవితంలో సంపాదన ఉంటే చాలా ?

 
ఈ రోజుల్లో   సమాజంలో  చిత్రమైన  పరిస్థితి  నెలకొంది.   సంపాదన  మీద  మోజు  పెరిగింది.  డబ్బు  ఉంటే  చాలు  అంతా  సుఖమే  అనుకునే  వాళ్ళ  సంఖ్య  పెరిగింది.

  పూర్వం  తల్లిత్రండ్రులు  తమ  పిల్లలు  సమాజంలో  చక్కటి  పౌరులుగా  ఉండాలని  ఆశించేవారు. 


 ఇప్పుడు  చాలామంది  తల్లితండ్రులు  తమ  పిల్లలు  బాగా  డబ్బు  సంపాదిస్తే  చాలు  అనుకుంటున్నారు. 

పూర్వం  ఇంటి  సంపాదన  తండ్రి  చూసుకుంటే  తల్లి  ఇంట్లో  కుటుంబసభ్యుల  బాగోగులు  చూసుకునేది. 


 ఈ  రోజుల్లో   తల్లితండ్రి  ఇద్దరూ  సంపాదన  మీదే  దృష్టిని  కేంద్రీకరించే  వారి  సంఖ్య  పెరిగింది.

 ఇంటిని  చక్కదిద్దుకోవటం,  ఇంట్లో  కుటుంబసభ్యుల  బాగోగులు  చూసుకోవటం  అనే  బాధ్యత    నిర్లక్ష్యం  చేయబడుతోంది.


  పిల్లలు  పుట్టకముందు  నుంచీ  ...   పుట్టినప్పటి  నుంచి  పెరిగేవరకూ  కూడా  తల్లితండ్రులకు  ఎన్నో  బాధ్యతలుంటాయి.   


 సంతానాన్ని  పొందాలనుకునే  తల్లితండ్రులు    ఎన్నో  జాగ్రత్తలు  తీసుకోవాలి.  

తల్లితండ్రి   పద్ధతిగా  జీవిస్తే   పుట్టబోయే  సంతానమూ  బాగుంటారు.

  నా  ఇష్టం  వచ్చినట్లు  తాగి  తిరుగుతాను,   నా  జీవితం  నా  ఇష్టం  అనుకోవటానికి  లేదు.  


 తల్లితండ్రులకు  చెడ్డ అలవాట్లు  ఉంటే  ఆ  ప్రభావం  వల్ల  పుట్టబోయే  పిల్లలకు  అనారోగ్యాలు  వచ్చే  అవకాశం  ఉంది. 

  పిల్లలకు  అనారోగ్యాన్ని   కలిగించే  హక్కు  తల్లితండ్రికి  ఉండదు  కదా  !

   సత్సంతానం  కావాలంటే  తల్లితండ్రి   చెడు  అలవాట్లు  లేకుండా   బాధ్యతగా  జీవించాలి.  


  బిడ్డ  పుట్టిన  తరువాత  కూడా   ఎన్నో  జాగ్రత్తలు  తీసుకోవాలి. 

  ఎదిగే  వయసులో  పిల్లలకు    చక్కటి   ఆహారాన్ని   అందిస్తే   పిల్లలు  ఆరోగ్యంగా  ఎదుగుతారు.   


చిన్నతనంలో  తీసుకున్న  ఆహారం  ప్రభావం  జీవితాంతం  ఉంటుందట.  

  చిన్నతనంలో    సరైన  పోషహాకారం  అందకపోతే   పెద్దవయసు  వచ్చాక   వారికి   త్వరగా  రోగాలు   వచ్చే  అవకాశాలు  ఎక్కువగా  ఉంటాయంటున్నారు.



చిన్నతనంలో  పెరిగిన  పరిసరాల    ప్రభావం  కూడా   జీవితాంతం  ఉంటుందట. 



పూర్వ  కాలంలో   తండ్రి    పనితో  బిజీగా  ఉండి  పిల్లలతో  ఎక్కువ  సమయాన్ని  గడపలేకపోయినా  తల్లి  పిల్లల  ఆలనాపాలనా  చూసుకోవటం  జరిగేది.  పిల్లలకు  కావలసిన  ఆహారాన్ని  తల్లి  చక్కగా  వండిపెట్టేది.


   పిల్లలతో    చక్కగా  మాట్లాడటానికి  సరిపడా  సమయం   పాత  తరం  తల్లులకు  ఉండేది.   పిల్లలు  తమ  భావాలను  తల్లితో  చెప్పుకునేవారు. 


 ఇప్పుడు    చాలామంది  తల్లులకు   పిల్లలను  చూసుకోవటానికి  కూడా  సమయం  లేనంతగా  బిజీగా  అయిపోతున్నారు.  


  ఈ  నాటి  పిల్లలకు  చుట్టూ  ఎన్నో  సౌకర్యాలు  ఉన్నా  కూడా  మనసులో  మాట  వినే  మనుషులు  లేక  అభద్రతా  భావంతో  పెరుగుతున్నారు. 

టీవీలు,  కంప్యూటర్లే  లోకంగా  యాంత్రిక  జీవనంతో  కలిసి  తామూ  యంత్రాలుగా  జీవించటానికి  అలవాటుపడిపోతున్నారు.




2 comments:

  1. బాగా చెప్పారండి. మీరన్నట్టు తల్లి తండ్రులు పిల్లల కోసం తగిన సమయం కేటాయిస్తే మంచిది అనుకొంటాను. వారి చదువులు, అలవాట్లు, ప్రవర్తన విషయాల్లొ తల్లి తండ్రులు వారికి సహకారం అందిచ్చవచ్చు. అలాగే వారిని ఎక్కువగా టీవి, కంపూటర్ ని చూడనివ్వటం కంటే బయట ఆట పాటలని ప్రొత్సహిస్తే మంచిది.

    -వంశీ కృష్ణ

    ReplyDelete

  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
    టపాలో వ్రాయాలనుకున్న మరికొన్ని విషయాలను ఇక్కడ వ్రాస్తున్నానండి.

    ఇప్పటి స్త్రీలు కొందరు స్త్రీత్వానికి సహజమైన వంట చేయటాన్ని, పిల్లలను పెంచుకోవటాన్ని నిరసిస్తూ మేమే వంట చేయాలా ? మేమే పిల్లల్ని పెంచాలా ? వంటింటి కుందేలులా ఇంట్లో పడుండాలా ? అని ప్రశ్నిస్తూ మగవారే గొప్పవారు అన్నట్లు మాట్లాడుతున్నారు.

    వంట చేయటం, పిల్లల బాగోగులు చూసుకోవటం, ఇంటిని చక్కదిద్దుకోవటం ... తక్కువ విషయాలు కాదు. ఇంటి పని గొప్పది కాదు ... బయటకెళ్ళి సంపాదించే పనే గొప్పది ... అన్నట్లు కొందరు స్త్రీలు మాట్లాడటం బాధాకరమైన విషయం. అలా మాట్లాడి సాటి స్త్రీలను కించపరుస్తున్నారు.

    మన కోసం మనం ఆహారాన్ని వండుకోవటం తప్పు పని ఎలా అవుతుంది ?

    కుటుంబసభ్యుల ఆరోగ్యం కోసం ఇల్లు శుభ్రం చేసుకోవటం విలువలేని పని ఎలా అవుతుంది ?

    దగ్గరుండి పిల్లలను ఆరోగ్యవంతులుగా , ఉన్నతమైన వ్యక్తులుగా పెంచుకోవటం విలువలేని పని ఎలా అవుతుంది ?

    ఇవన్నీ ఎంతో ఓర్పు, నేర్పుతో చేయవలసిన పనులు. కుటుంబసభ్యుల అందరి ఆరోగ్యం ఇల్లాలు చేతిలో ఉంది. పిల్లలను ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దే అవకాశం స్త్రీలకు ఉంది.

    తల్లితండ్రి ఇద్దరూ డబ్బు సంపాదన మీదే దృష్టిని కేంద్రీకరిస్తే ఇంటిని చక్కదిద్దే బాధ్యతను ఎవరు నిర్వహిస్తారు ?

    డబ్బు సంపాదించి తెస్తే సరిపోదు కదా ! ఆ డబ్బుతో ఇంటిని సవ్యంగా నడిపించినప్పుడే ఆ సంపాదనకు సార్ధకత.

    ఇంటిని, కుటుంబసభ్యులను సమర్ధించుకుంటూ చాకచక్యంగా ఇంటిని నడపటం అనేది ఎంతో క్లిష్టమైన పని.

    పూర్వం రోజుల్లో కుటుంబానికి అవసరమైన సరుకులను తేవటం భర్త బాధ్యతైతే..భర్త తెచ్చిన సరంజామాతో ఇంటిని చక్కదిద్దే బాధ్యత భార్యది.

    ఇవన్నీ ఆలోచించి ఇల్లాలు అంటే ఇంటికి దీపం వంటిది అని గౌరవించారు పెద్దలు. ఇల్లాలు కన్నీరు పెడితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలువదనీ తెలియజేసారు.

    స్త్రీకి ఎంతో గౌరవాన్ని ఇచ్చిన సంస్కృతి మనది. ఆది శంకరాచార్యులు , శివాజీ మహారాజు, గాంధీ ... వంటి మహనీయులు గొప్పవాళ్ళు అవటానికి వెనుక వారి మాతృమూర్తుల సహాయసహకారాలు మరువలేనివి.

    ReplyDelete