koodali

Friday, December 20, 2013

సమాజంలో సతీసహగమనం.. వ్యాపించటానికి ..


పూర్వీకుల వల్లే ఈ దురాచారం సమాజంలో వ్యాపించిందని పూర్వీకులని తప్పుపడతారు..  కానీ, ఇలాంటివి   సమాజంలో  వ్యాపించటానికి  కారణం  ప్రజలే.....
ఒకరిని  చూసి  ఒకరు   అనుకరించే  ప్రజల  ప్రవృత్తే.


పూర్వం  రాజుల  కాలంలో  శత్రురాజుల   దండయాత్రల  వల్ల,     రాజు,  రాజ్యం  శత్రురాజుల  అధీనంలోకి    వెళ్ళినప్పుడు   రాణి  మొదలైన  స్త్రీలు  ,     శత్రు  రాజుల  చేతికి  చిక్కకుండా   తామే  ఆత్మార్పణం  చేసుకునేవారు.


  భర్త  చనిపోతే   తట్టుకోలేని   కొందరు  స్త్రీలు తమకు  తామే  సహగమనం   చేసేవారు.

 భర్త  పోయిన  స్త్రీల  జీవితం  కష్టంగా  ఉంటుందని  భావించిన  కొందరు  స్త్రీలు  కూడా  తమకు  తామే  సహగమనం   చేసేవారు.


ఇలా  కొందరు  తమ  ఇష్టపూర్వకంగా  సహగమనం  చేయటం  వల్ల,  ఇక  కాలక్రమేణా  అది  ఒక  ఆచారంగా  మొదలయి  ఉంటుంది.  అంతేకానీ ,  పెద్దలు   సతీసహగమనం  వంటి  ఆచారాలను  ప్రోత్సహించలేదు  .

* ఉదా   ......రామాయణంలో దశరధుని మరణం తరువాత కౌసల్యాదేవీ, సుమిత్రాదేవీ , కైకేయి సహగమనం చెయ్యలేదు కదా !

* భారతంలో ...... శంతనుని మరణం తరువాత సత్యవతీదేవి సహగమనం చేయలేదు.

* తమ భర్త మరణం తరువాత అంబిక, అంబాలికలు సహగమనం
చేయలేదు  కదా!

* అంటే ,  ఆ రోజుల్లో సతీసహగమనం తప్పనిసరి ఆచారంగా లేదని తెలుస్తోంది.

* పాండురాజు  చనిపోవటానికి  తానూ  కారణమని  భావించిన  మాద్రి    తన  ఇష్టంతోనే  సహగమనం   చేసింది.  ...(..తన  సంతానమైన  నకుల,  సహదేవుల  సంరక్షణను    కుంతీదేవికి  అప్పగించి ..... )

ఇలా ....మరి  కొందరు స్త్రీలు ఇష్టపూర్వకంగా సహగమనం చేయటం చూసి ,........

.....ఇక తరువాతి తరాల వాళ్ళు ఇష్టపూర్వకంగా కొందరు, ఇతరుల బలవంతం వల్ల కొందరు అలా...అలా....సమాజంలో సతీసహగమనం ఒక మూఢాచారంగా పెరిగిపోయి ఉంటుంది.



అంతేకాని,   భర్త మరణించిన   స్త్రీలందరూ  సహగమనం  చేయాలి ..అనేది    పెద్దల   అభిప్రాయం   కాదని    గ్రంధాల ద్వారా   స్పష్టంగా తెలుస్తోంది.........

.................................... 

ఇతరులను   గుడ్డిగా  అనుకరించటం  గురించి  పెద్దలు  ఒక  కధ  చెబుతారు..

ఒక  సాధువు  నదిలో  స్నానం  చేయటానికి  వచ్చి  , నది  ఒడ్డున  ఒక  చిన్న  గొయ్యి  తవ్వి  తన  కమండలాన్ని  అందులో  దాచి  పెడతాడు. ( భద్రత   కోసం.  ) దాచిపెట్టిన  ప్రదేశానికి    గుర్తుగా  దాని  పైన  ఇసుకను  గోపురం  ఆకారంలో  కుప్పగా  పోసి  స్నానానికి  నదిలోకి  వెళ్తాడు.

 ఇదంతా  దూరం  నుంచి  చూసిన  భక్తులు  కొందరు ,  సాధువు  చేసినట్లు  ఇసుకను  గోపురం  ఆకారంలో  తయారుచేస్తే  పుణ్యం  వస్తుందని  భావించి,   తామూ  అలా  చేయటం  మొదలుపెడతారు,

 (  సాధువు   అలా  ఎందుకు  చేసారో  అసలు  విషయం   వాళ్ళకు  తెలియదు.  )

ఇలా  ఒకరిని  చూసి  ఒకరు     చేయటం  వల్ల  , నది  ఒడ్డున   చాలా  ఇసుక  గోపురాలు  తయారవుతాయి.  సాధువు  స్నానం  చేసి  ఒడ్డుకు  తిరిగి  వచ్చి  తన  కమండలం  కోసం  చూసేసరికి ,

 ఇంకేముంది.... ఎన్నో  గోపురాలు  కనిపిస్తాయి.   ఆలోచించగా..... ఆయనకు  విషయం  అర్ధమయి ,  ఇక   చేసేదేమీ  లేక  కమండలం లేకుండానే   ఉత్తచేతులతో  తిరిగి  వెళతారు.

  సాధువు   తన  కమండలం   యొక్క   భద్రత   కొరకు   గోపురం  చేస్తే  , ఆ  విషయం   తెలియని  మిగతావారు    అనుసరించినట్లుగా...... 


కొన్ని  విపరీత  ఆచారాలు  కూడా   పెద్దలు  ఏర్పరిచినవి  కాదు.  వాటికవే  సమాజంలో  మొదలయ్యి  మూఢాచారాలుగా  పాతుకుపోయి  ఉండవచ్చు..   

దురాచారాలు  పెరగటానికి      కారణం  ప్రజలయితే,  ఇలాంటి   దురాచారాలను   పెట్టారని    ప్రాచీనులను  ఆడిపోసుకుంటారు.
వారి  అభిప్రాయాన్ని  సరిగ్గా  అర్ధం  చేసుకోకుండా అపార్ధం చేసుకుంటారు.



No comments:

Post a Comment