koodali

Wednesday, December 18, 2013

ఆడపిల్లలే పుట్టారని బాధపడవద్దు.


మనలో చాలా మంది మగపిల్లలు పుడితే చాలా సంతోషిస్తారు. అదే ఆడ పిల్లలు పుడితే చాలా బాధపడతారు.


 దీనివల్ల ఎన్నో కుటుంబాలలో సమస్యలు వస్తున్నాయి.

నాకు ఏమని అనిపిస్తుందంటేనండి,సీతాదేవికి తండ్రి అయిన జనకమహారాజు వారికి స్త్రీ సంతానము కదా!



జనకమహారాజు ఎంతో గొప్పవారు. సాక్షాత్తు శ్రీమహాలక్ష్మియే వారికి కుమార్తెగా అవతరించటం జరిగింది. ఈ విషయాన్ని గమనిస్తే   జనకులవారు భగవంతుని కృపను ఎంతగా పొందారో తెలుస్తోంది.
 

 జనకులవారు నిష్కామ కర్మ యోగిగా జీవించిన మహాత్ములని , అలా వారు భగవంతుని కృపకు ఎంతగానో పాత్రులయ్యారని, పెద్దలు చెబుతారు.
 

కొంతమంది.. పుత్రులవల్లనే పున్నామ నరకం తప్పుతుందని అనుకుంటూ, తమ  కుటుంబములలో కలతలు సృష్టించుకుంటున్నారు.

 
అసలు ఎవరైనా, సంతానము లేనివారుకూడా భగవంతుని పుత్రునిగా, పుత్రికగా కూడా భావించవచ్చు. భావనలోనే ఎంతో ఉందని పెద్దలు చెబుతున్నారు.


 ధర్మమును, భక్తిని కలిగినంతలోనే భగవంతుడు ఎందరినో అనుగ్రహించిన కధలు ఎన్నో మనకు తెలుసు. పుత్రులు లేనివారిని, అసలు సంతానమే లేనివారిని  కూడా  దైవం  తప్పక  అనుగ్రహిస్తారు. 


   వివాహం  చేసుకున్నాకూడా  సంతానాన్ని  పొందని భక్తులు  కూడా ఉన్నారు.వీరికి  సంతానం  లేకపోయినా  దైవకృపను  అపారంగా పొందారని వీరి  జీవితకధల  ద్వారా  తెలుస్తుంది.


పై  విషయాలను  గమనించితే  ఏమని  తెలుస్తుందంటే..ఎవరికైనా వారి ప్రవర్తన ఆధారంగానే భగవంతుని దయ ఉంటుంది కానీ, వారికి సంతానమున్నదా ? లేదా?
సంతానము ఉంటే ఆడపిల్లలా ? మగపిల్లలా ? ఇలాంటి వాటి పైన ఆధారపడి మాత్రమే భగవంతుని దయ, స్వర్గం, నరకం ఇత్యాదులు ఉండవు...అని  తెలుసుకోవచ్చు.


No comments:

Post a Comment