koodali

Friday, January 26, 2018

. కొన్ని విషయాలు..బ్రహ్మచర్యం, గృహస్ఠ జీవనం.....



ఈ రోజుల్లో సమాజంలో చాలా మార్పు వచ్చింది.  వివాహేతర  సంబంధాలు ఉంటే తప్పేమిటి ? వంటి  మాటలు మాట్లాడే వారి సంఖ్య పెరిగింది. 

బయట ఆకర్షణలు ఎక్కువగా ఉంటున్నాయి...ఇలాంటప్పుడు భార్యాభర్తలు ఉద్యోగం  వల్లనో   లేక ఆచారవ్యవహారాలు
వల్లనో   లేక మరేదైనా కారణాలతోనే దూరంగా జీవించటం మంచిది కాదు.


  అయితే, కొన్నిసార్లు అనారోగ్యం వల్లనో, పూజాదీక్షల వల్లనో, ఉద్యోగరీత్యానో భార్యాభర్తలు దూరంగా ఉండక తప్పని పరిస్థితి   ఉండవచ్చు. ఇలాంటప్పుడు భార్యాభర్త  పద్ధతిగా వ్యవహరించాలి.


 భార్యాభర్త ఒకరి కష్టసుఖాల్లో మరొకరు పాలుపంచుకోవాలి. 


***************
బ్రహ్మచర్యం, గృహస్ఠ జీవనం..
*****************
ఈ లింక్ వద్ద కూడా దయచేసి చదవండి.
బ్రహ్మచర్యం దాంపత్య ధర్మం..వంటి విషయాల  గురించి ఎన్నో సందేహాలు ఉంటాయి... 

గృహస్థాశ్రమంలో భార్యాభర్తల ఏకాంతకార్యం విషయంలో నియమాల గురించి  ఎన్నో సందేహాలు వస్తుంటాయి. 

 అయితే, శ్రీ దేవీ భాగవతము ద్వారా ..తెలుసుకున్న కొన్ని విషయములు..

 నారాయణ మహర్షి నారద మహర్షికి తెలియజేసిన కొన్ని విషయములు .
 
జపహోమాది సమయాల్లో మౌనంగా ఉండాలి. ఏ సంభాషణమూ చెయ్యకూడదు. మైధునాలాపాలు అస్సలు చెయ్యకూడదు. మనోవాక్కాయకర్మలలో సర్వకాలసర్వావస్థలలో మైధున ప్రసక్తిని పరిత్యజించడమే బ్రహ్మచర్యమంటేను. అని  తెలియజేస్తూ


 ఇంకా...

  బ్రాహ్మణక్షత్రియులు గృహస్థాశ్రమంలో కూడా బ్రహ్మచర్యం పాటించవచ్చు.సంస్కారవంతురాలైన సవర్ణస్త్రీని వివాహం చేసుకుని నిషిద్ధసమయాలలో కలయికను పూర్తిగా పరిత్యజించి , అనుమతించిన దినాలలో రాత్రిపూట మాత్రమే సంగమిస్తూ సంసారం సాగిస్తే అది బ్రహ్మచర్యమే. అని  తెలుస్తోంది.

పై విషయాన్ని గమనిస్తే,

 
 ఎక్కువ నియమనిష్ఠలు ఉండే బ్రాహ్మణక్షత్రియుల విషయంలో కూడా..  
 నియమాల విషయంలో కఠినత లేకుండా, సరళంగా ఉన్నట్లు  తెలుస్తుంది. అందువల్ల ఈ విషయంలో ఎవరూ భయపడనవసరం లేదు.
..........................

సనాతనధర్మం ఎంతో చక్కటిది. అయితే,  కొందరి వల్ల ఆచారవ్యవహారాలలో విపరీత ధోరణులు ప్రవేశపెట్టబడ్డాయి. మూఢాచారాలను విడిచిపెట్టాలి. సదాచారాలను ప్రోత్సహించాలి.


 ఇహలోకంలో కూడా ఏదైనా ఉన్నతపదవిని చేపట్టాలన్నా కొంత శ్రమపడకతప్పదు. మరి అత్యంత ఉన్నతమైన మోక్షాన్ని పొందాలంటే  సత్ప్రవర్తనతో జీవించి దైవకృపను పొందాలి.
******

కొన్ని ప్రత్యేక పూజలు,  కొన్ని పండుగ రోజులలో దంపతులు బ్రహ్మచర్యం పాటిస్తారు.  అయితే, దాదాపు ప్రతిరోజూ ఏదో ఒక ప్రత్యేకపూజ అన్నట్లు ఉంటే దంపతులు ఎలాంటి నియమాలు పాటించాలి ? 


ఈ మధ్య కాలంలో   మీడియా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాక   ఈ నెలలో ఈ  పూజలు చేయాలి, వచ్చే నెల ఈ పూజలు  చేయాలి..దాదాపు నెలలో అన్ని రోజులూ ఏదో ఒక పండుగ ..అన్నట్లు  చెబుతున్నారు. ఇలాంటప్పుడు  ఏమనిపిస్తుందంటే, రోజూ ఏదో ఒక పండుగ అయితే, దంపతులు శృంగారజీవితానికి దూరంగా ఉండాలా ? అనే  అయోమయం కలిగే  అవకాశం ఉంది.
  

 ఈ జీవితం భగవంతుని ప్రసాదం. దైవానికి ఎప్పటికీ కృతజ్ఞులుగా ఉండాలి. జీవితంలో ప్రతి క్షణమూ దైవారాధనగా భావించి స్వధర్మంతో నిజాయితీగా జీవించటానికి ప్రయత్నించాలి. 

రోజూ పూజలు చేయవచ్చు. అలాగని, పూజల పేరుతో ఎప్పుడూ  దాంపత్య జీవితానికి దూరంగా ఉండాలని పెద్దలు చెప్పలేదు. 


 దంపతులు ఇద్దరూ ఇష్టపడి పూజలు చేస్తే  అది  వాళ్ళ ఇష్టం.. అలాకాకుండా ఎప్పుడూ పూజలు అంటూ నన్ను పట్టించుకోవటం లేదు అని దంపతులలో ఒకరు భావిస్తే , దంపతుల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంది.  ఇలాంటప్పుడు పూజచేసే వారికి కూడా మనశ్శాంతి ఉండదు.


 దాంపత్య జీవితంలో శృంగారం కూడా ఒక భాగమే. అయితే,  ముఖ్యమైన పండుగలు, పూజల సందర్భంలో నియమాలను పాటించి, మిగతా రోజులలో దాంపత్యజీవితాన్ని గడపవచ్చు.. అని నా అభిప్రాయం. 

దంపతుల మధ్య శృంగారం  విషయంలో గొడవలు వస్తే అక్రమసంబంధాలు పెరగటం,  తద్వారా కుటుంబజీవితం  అస్తవ్యస్థం కావటం.. వంటివి జరుగుతాయి. పెద్దలు ఇలా కోరుకోలేదు. 

  వ్యక్తులు చతురాశ్రమధర్మాలతో చక్కగా జీవించి మోక్షాన్ని పొందాలని తెలియజేశారు.

వానప్రస్తం, సన్యాసాశ్రమం లో అడవులకు వెళ్ళకపోయినా  తమ ఇంటిలో తాము  ఉంటూ కూడా ఇహజీవితపు బాధ్యతలను నెరవేర్చి, ఇహజీవితపు లంపటాలను తగ్గించుకుంటూ ,  మనస్సును అదుపులో ఉంచుకుంటూ , క్రమంగా మోక్షం కోసం ప్రయత్నాలు చేయటం మంచిది. 


మనిషి ఎప్పుడూ ఇహలోకపు తాపత్రయాలతోనే కొట్టుకుపోతుంటే మరి మోక్షం కోసం ప్రయత్నం చేసేదెప్పుడు? మోక్షం ఎందుకంటే,  కష్టాలు లేని పరమసుఖాన్ని పొందాలంటే పరమపదాన్ని( మోక్షాన్ని) పొందవలసిందే.

*************
నియమాల పేరుతో కఠినంగా వ్యవహరిస్తే, ఇతర మతాలలో ఇన్ని నియమాలు లేకపోయినా చక్కగా దైవాన్ని ప్రార్ధించుకుంటున్నారు కదా! అని కూడా కొన్నిసార్లు  అనిపించే అవకాశం ఉంది.

మనుషులకు  దైవం అవసరం ఎంతో ఉంది. అయితే, మరీ  క్లిష్టమయిన నియమాలు ఉన్నప్పుడు , వాటిని పాటించలేక సులభంగా దైవాన్ని ప్రార్ధించే విధానాలకు మరలే పరిస్థితి  కూడా ఉండవచ్చు.

 కలియుగంలో  చాలామందికి  ..మానసిక, శారీరిక దృడత్వం తక్కువగా ఉంటుంది. ఇవన్నీ తెలిసిన పెద్దలు , కలియుగంలో  దైవనామస్మరణ  తరుణోపాయం ... అని తెలియజేసారు.

 కలియుగంలో దైవనామస్మరణ చేసినా చాలు  ..యజ్ఞయాగాదులు చేయటం.. అనేది వ్యక్తుల  ఓపికను బట్టి చేసుకోవచ్చు.

సనాతనధర్మంలో దైవపూజ కు ఎన్నో విధానాలు ఉన్నాయి. ఎవరి ఇష్టప్రకారం వారు దైవాన్ని ఆరాధించుకోవచ్చు. విగ్రహారాధన చేసుకోవచ్చు. నిరాకార ఆరాధన కూడా చేసుకోవచ్చు. 

సనాతనధర్మం  ఎంతో సులభమయినది. అయితే,  కొందరి వల్ల ఆచారవ్యవహారాలలో విపరీత ధోరణులు ప్రవేశపెట్టబడ్డాయి. మూఢాచారాలను విడిచిపెట్టాలి. సదాచారాలను ప్రోత్సహించాలి.

 ఇహలోకంలో కూడా ఏదైనా ఉన్నతపదవిని చేపట్టాలన్నా కొంత శ్రమపడకతప్పదు. మరి అత్యంత ఉన్నతమైన మోక్షాన్ని పొందాలంటే  సత్ప్రవర్తనతో జీవించి దైవకృపను పొందాలి.



No comments:

Post a Comment