koodali

Monday, October 27, 2025

ఎన్ని చేసినా ..

 

 ఎన్ని పూజలు చేసినా కష్టాలు తీరట్లేదని కొందరు వాపోతుంటారు. అలా జరగటానికి అనేక కారణాలుంటాయి. 

మరి కొన్ని విషయాలను చెప్పుకుందాము..

ఆవుపాలు, నెయ్యి..వంటివి తీసుకుంటే ఆరోగ్యాలు బాగుంటాయని ప్రచారాలు ఎక్కువవటం, పూజలకంటూ పెద్ద ఎత్తున ధారాళంగా పాలు, నెయ్యి వాడకాలు పెరిగాక కూడా పాలు, నెయ్యి, పెరుగుకు డిమాండ్ బాగా పెరిగింది.

 వేలాదిగా జనం వచ్చే కొన్ని దేవాలయాలలో ప్రసాదాల కొరకు వేల లీటర్ల నెయ్యిని వాడుతారు. 

ఇంకా, మామూలుగా కూడా పాలు, నెయ్యి తో తయారుచేసిన స్వీట్స్ తినటానికి, కాఫీలు, టీలు..తాగటానికి జనాలు బాగా అలవాటు పడ్డారు. 

ఇంతమంది జనాలకు ఇన్ని పాలు కావాలంటే ఆవులు, గేదెలు..ఎన్ని సార్లు గర్భధారణ చేసి అలసిపోవాలి?

 మేము ఒకసారి కొద్దిగా ఆవుపాలకొరకు ఒక దగ్గరకు వెళ్తే, అక్కడ  చీకటిగా ఉన్న 
ఒక బిల్డింగ్లో ఆవులను ఉంచి పెంచుతున్నారు. సిమెంట్ గచ్చు ఆవులకు గుచ్చుకుంటుంది కదా..

 అక్కడ పరిసరాలు మురికిగా ఉన్నాయి.  ఆ మసక వెలుతురులో ఆ ఆవులు పాపం ఆకలి కొరకు తినటం చేస్తున్నాయి. అవన్నీ చూశాక నాకు చాలా బాధనిపించింది. 

 చక్కగా ఆరుబయట పచ్చికబయళ్ళలో తిరగాల్సిన ఆవులను డబ్బుకొరకు అలా కట్టేసి వ్యాపారం చేయటం..అలాంటి పాలు, నెయ్యి తెచ్చి దైవానికి ఇస్తే దైవము మెచ్చుకుంటారా? 

ఇక ముసలి ఆవుల పరిస్థితి అయితే చెప్పలేము. కొందరు వాటి పాలు పిండుకుని అవి ముసలివి అయ్యాక కబేళాకు పంపేస్తారు.ఇవి దారుణమైన విషయాలు. 

వాటిని జీవితాంతము చక్కగా పెంచగలిగితేనే వాటిని పెంచాలి. 

 మనకు పుణ్యం కొరకో, ఆరోగ్యం కొరకో, మనం అదేపనిగా స్వీట్స్ తినటానికి, కాఫీలు, టీలు..తాగటం కొరకో..వాటిని అలా  బాధించటం ఏమిటి? 

 తమ కష్టాలు తీరటం కొరకు మొక్కుకుని దూడలను పుట్టించి దేవాలయాలకు దానం ఇస్తారు కొందరు. ఇక అంతటితో అయిపోతుందా? అవేమీ బొమ్మలు కాదుకదా..ప్రాణమున్న జీవులు. 

వాటిని జీవితాంతము పోషించడానికి ధనం కావాలి, చక్కగా చూసుకునే మనుషులు ఉండాలి. 

వేలసంఖ్యలో గోవులు అయినప్పుడు,  ఒకవేళ వాటిని ఎవరైనా సరిగ్గా చూసుకోకుంటే ఆ పాపం ఎవరికి తగులుతుందో? మన కష్టాలు పోవాలని వాటిని కష్టపెట్టకూడదు కదా..

అభిషేకాల కొరకు లీటర్ల పాలు, పెరుగులు సమర్పించటం కన్నా, మంచినీటితో అభిషేకం చేసినా దైవానుగ్రహం కలుగుతుందని నా అభిప్రాయం. 

లేదంటే ఆవులను మంచిగా పెంచుతూ కొద్దిపాటి పాలతో అభిషేకించినా చాలు.

ఒక్కొక్కరు అభిషేకం చేయటం కంటే, సామూహికంగా  పూజ చేస్తూ పూజ చేయించుకునేవారు పక్కన ఉండి, వారి గోత్రనామాలు చదివి పూజారులు అభిషేకం చేయవచ్చు. అప్పుడు తక్కువ పాలు, నెయ్యి..సరిపోతుంది.
కొన్ని దేవాలయాలలో ఇలాగే అభిషేకాలు చేస్తారు. 

 ...................

అందరికి వేల లీటర్ల స్వచ్చమైన పాలు, నెయ్యి లభించక కల్తి చేస్తున్నారు. 

అన్యాయార్జిత సొమ్ముతో సంపాదించిన ద్రవ్యాలతోను, కల్తీ వాటితోను పూజలు చేసినా సరైన ఫలితాలు రాకపోవచ్చు.

......................
 జీవితంలో జాలి, దయ, నైతిక విలువలు పాటిస్తేనే దైవానుగ్రహాన్ని పొందగలరు కానీ, మానవత్వం లేకుండా ఎన్ని చేసినా ..

 

No comments:

Post a Comment