koodali

Monday, February 27, 2017

పిల్లల హక్కుల గురించి మనం ఏం చేస్తున్నాము ?

Wednesday, January 29, 2014 


 ఈ  రోజుల్లో  సమాజ  వ్యవస్థ  గందరగోళంగా  తయారయింది.  పిల్లల  పరిస్థితి  మరీ  అయోమయంగా  ఉంది .  పెద్దవాళ్ళు  తమ  స్వేచ్చ  గురించి,  తమ  హక్కుల  గురించి  మాట్లాడుతున్నారే  గానీ  పిల్లల  హక్కుల  గురించి   మనం  ఏం  చేస్తున్నాము ? 

పూర్వం  మగవాళ్ళు  కుటుంబం  కోసం  డబ్బు  సంపాదించటం,  ఇంటికి  కావలసిన  సరుకులను   తేవటం  వంటి  పనులను  చేస్తే ,  స్త్రీలు  ఇంటిని  చక్కదిద్దుకునేవారు.  అయితే  ఇప్పుడు  పరిస్థితి  మారింది. 


ఇప్పటి    స్త్రీలు  ఇంటిపనులతో  పాటు  సంపాదన..  వంటి  బాధ్యతలను  కూడా  నెత్తినేసుకుని  ఎంతో  కష్టపడుతున్నారు.  


ఇదే   సమయమని   కొందరు  పురుషులు  ఇంటి  బాధ్యత  అంతా     స్త్రీల  నెత్తిన  వేసి  తాము  పనుల  నుంచి  తప్పించుకు  తిరుగుతున్నారు .

ఉద్యోగాలు,  వ్యాపారాలు  చేయటం,   బయటకెళ్ళి  సరుకులను  తెచ్చుకోవటం..వంటి   ఎన్నో   పనుల  వల్ల    స్త్రీలకు  ఇంటిపట్టున  ఉండే  సమయం  తగ్గిపోయింది. 

బయట  పనులను  చక్కబెట్టుకుని   తల్లి   ఇంటికి  వచ్చేసరికి    కొన్నిసార్లు  రాత్రి    అయినా  అవవచ్చు. 


ఇలాంటప్పుడు   పిల్లలను    చూసుకోవటంలో  ఎన్నో  ఇబ్బందులు  వస్తున్నాయి.   
.................. 
పూర్వపు  ఆడపిల్లలకు   ఎక్కువగా   బయట  తిరగవలసిన  అవసరం  ఉండేది    కాదు.
 ఇప్పుడు   మారిన   వ్యవస్థలో   పిల్లల   జీవనవిధానం  ఎలా  ఉందన్నదానికి...ఒక  ఉదా..

కొంతకాలం  క్రిందట  పసిపిల్లలు  అమ్మ  జోకొడితే  హాయిగా  నిద్రపోయేవారు.  అమ్మ  కబుర్లు  చెబుతూ 
చందమామ  రావే  అంటూ..అన్నం  తినిపిస్తుంటే  చక్కగా   తినేవారు. 

 ఇప్పుడు   అవన్నీ  గతకాలపు  ముచ్చట్లు  అయిపోయాయి.  ( చాలామంది  పిల్లల  విషయంలో .)

ఇప్పుడు  తల్లులు  బిజీ  అయిపోయారు.   పిల్లలను   ఉదయాన్నే   ఆదరాబాదరాగా  తయారుచేసి       ఏడుస్తున్న  పిల్లలను   హడావిడిగా  ఏ  క్రెచ్ లోనో  వదిలి  పరిగెడుతుంటారు. 


  ఇక   ఏ  సాయంత్రానికో  పిల్లలు   ఇంటికి  తేబడతారు.  అప్పటికే  పగలంతా  ఆఫీసు  పనితో  అలసిపోయి  వచ్చిన  తల్లికి ..  ఇంట్లో  పని  చేసుకుని  ఇంకా  పిల్లలతో  తీరికగా  ముచ్చట్లాడటానికి  ఓపిక  ఉంటుందా  ?
...................... 


  పిల్లలు  కొంచెం   పెద్దయి   ప్లే   స్కూల్ కు  పంపబడతారు.  ఆ  స్కూల్స్  మధ్యాహ్నం  వరకే  ఉంటాయి  కాబట్టి  మధ్యాహ్నం  పిల్లలను  స్కూల్  నుంచి   పికప్  చేసుకుని  మళ్ళీ  ఏ  క్రచ్ లోనే  వదలాలి.  


..................
ఇక  పిల్లలు  సాయంకాలం  వరకూ  స్కూలులో  ఉండే  వయస్సు  వస్తుంది. 


  పిల్లలు  స్కూల్  నుంచి  అలసి  ఇంటికి  వచ్చినా  ఇంట్లో  పెద్దవాళ్ళు   ఎవరూ  ఉండరు  కాబట్టి ...  పిల్లలు    కోచింగ్  క్లాసులలో  చేరతారు. 

 వారికి  అవన్నీ  నేర్చుకోవటం  ఇష్టం  ఉన్నా  లేకపోయినా  వారి  ఇష్టానికి  ప్రాధాన్యత   ఇచ్చే  పెద్ద  వాళ్ళు  తక్కువ  కాబట్టి  కోచింగులు  తీసుకోవాలి. 



  ఈ  పోటీ  ప్రపంచంలో  దూసుకుపోవాలంటే  సినిమా  పాటలు,  డాన్సులు  వంటివి  కూడా  నేర్చుకోవాలి   అంటారు .

కోచింగ్  క్లాసుల  తరువాత   ఇంటికి  వచ్చి  తాళం  తీసుకుని , స్నాక్స్  ఏమైనా  ఉంటే  తిని  కాసేపు  రెస్ట్  తీసుకుని    బోర్ గా  అనిపిస్తే   ప్రక్క  ఇంటి  పిల్లలు  తో  ఆడుకుంటారు.


 ఆటలు  అయిపోయి   పక్క  పిల్లలు   వెళ్ళిపోతే  ..  ఇంటికి  వచ్చి   టీవీ    లేక  కంప్యూటర్  చూడటం  చేస్తారు. 


 నెట్  ఉంటే  ఇక  బోలెడు  సమయం  గడిచిపోతుంది.  నెట్లో  చాలా  చూడవచ్చు.  అవన్నీ  చూస్తుంటే   సమయమే  తెలియదు ? 
................. 


ఇక   రాత్రి  సమయంలో  ఉద్యోగాలు  చేయవలసిన   తల్లులకు,   వారి    పిల్లలను  వదిలి  పనికి  వెళ్ళటం  అనేది  పెద్ద  సమస్య.  

 ........................ 

ఈ  కాలంలో  తల్లితండ్రులు  పిల్లలు   కలిసి   ఇంట్లో  గడిపే   సమయం  తగ్గిపోయింది.  ఎవరి  బిజీ  వారిది . ఇలాంటి  వాతావరణంలో  పిల్లలు  అభద్రత  భావంతో   జీవిస్తున్నారు . 

ఇవన్నీ  ఆలోచిస్తే   నేటి  సమాజంలో  పిల్లల  పరిస్థితి  అయోమయంగా  తయారయింది  అనిపిస్తోంది .

*******************
పిల్లల హక్కుల గురించి మనం ఏం చేస్తున్నాము ? రెండవ భాగం.

ఈ రోజుల్లో  దారుణమైన  వార్తలను  పత్రికలలో  చదువుతున్నాము.  పాఠశాలలో  5  సంవత్సరాల  పాప ను  అత్యాచారం  చేయటానికి  ప్రయత్నించిన  ఉపాధ్యాయుడు,  ప్రక్కింటికి  ఆడుకోవటానికి  వెళ్ళిన  పాప   పట్ల  అత్యాచార  యత్నం  చేసిన  ప్రక్కింటి  వ్యక్తీ ,  బంధువుల  వల్ల  అత్యాచార  యత్నానికి  గురైన  అమ్మాయి.....ఇలా  ఎన్నో  వార్తలు  చదువుతున్నాము.  అభంశుభం  తెలియని      పసిపిల్లల  పట్ల  కూడా  అమానుషంగా  ప్రవర్తిస్తున్నారు.  


ఇవన్నీ  గమనించితే  ఈ  కాలపు  పిల్లల  రక్షణ  పట్ల     సమాజం  ఎంత  నిర్లక్ష్యంగా  వ్యవహరిస్తుందో  తెలుస్తోంది. 

 ఆ  మధ్య  మీడియాలో  ఒక  విషయం  వచ్చింది.  దేశంలో  ఉత్తర  భాగానికి  చెందిన    ఒక  సెలిబ్రిటి  కూతురు  తాను  చిన్నతనంలో  లైంగిక  వేధింపులకు  గురయినట్లు  తెలియజేసింది.  తనను  వేధింపులకు  గురి చేసిన  వ్యక్తి  తన  తల్లితండ్రులకు  బాగా  తెలిసిన  వ్యక్తేనని,  తరచూ  తమింటికి  వచ్చే  వ్యక్తేనని  పేర్కొంది.

( డిల్లీలో  నిర్భయ  సంఘటన  జరిగిన  తరువాత  ఈ  వార్త  పత్రికలలో  వచ్చింది.  వివరాలు  తెలుసుకోవాలంటే  అప్పటి  పత్రికలను  చూడవచ్చు. )

అయితే  ఇంత  జరుగుతున్నా  అమ్మాయి  తల్లితండ్రి  గమనించలేకపోవటం ...అమ్మాయి  తల్లితండ్రులకు  చెప్పలేకపోవటం  చూస్తుంటే  తల్లితండ్రులకు  పిల్లలకు  మధ్య  పెరుగుతున్న  కమ్యూనికేషన్  గేప్  ఎంతలా  ఉందో  తెలుస్తోంది. 


ఎటువంటి  విషయం  ఉన్నా  భయం,  మొహమాటం  లేకుండా   పిల్లలు  తల్లితండ్రులకు  చెప్పగలిగే  పరిస్థితి  ఉండాలి.

కొందరు  తల్లితండ్రులు   బయటకు  లేక   వేరే   ఊర్లు  వెళ్ళవలసి  వచ్చినప్పుడు  పిల్లలను  ఇతరుల   వద్ద  వదిలి  వెళుతుంటారు. 



  కంటికి  రెప్పలా  కాపాడుకోవలసిన  కన్నబిడ్డలను   పరాయి  వారి  వద్ద  వదిలే  ముందు  ఎన్నో  ఆలోచించాలి.    పసిపిల్లల  పట్ల  జరుగుతున్న  అత్యాచారాల  విషయంలో  తెలిసిన  వాళ్ళ  పాత్రే  ఎక్కువగా  ఉంటోందని  సర్వేల  ద్వారా  వెల్లడి  అయింది.  

అలాగని  అందరినీ  అనుమానించమని  అనటం  లేదు. అలా  అనుమానించటం  ఘోరమైన  తప్పు  కూడా.

ఇవన్నీ  ఎవరి  పరిస్థితిని  బట్టి  వారు  ఆలోచించుకోవలసిన  విషయాలు.


చెడ్డ  పనులు  చేయటానికి  చెడ్డవాళ్ళే  కానక్కరలేదు.  కొన్నిసార్లు  మంచివాళ్ళ  బుద్ధి  కూడా  విచక్షణను  కోల్పోయే  అవకాశం  ఉంది. 


 ఉదా...  మత్తుపదార్ధాలను  తీసుకున్న  వ్యక్తికి  ఆ  సమయంలో  బుద్ధి    విచక్షణను  కోల్పోతుందని   అంటారు.   ఇప్పుడు  సెల్ ఫోన్స్  లో  కూడా  అసభ్యకరమైన దృశ్యాలు   చూసే  వీలు  వచ్చేసింది. అనభ్యకరమైన  దృశ్యాలు  చూస్తున్న  వ్యక్తిపై  ఆ  దృశ్యాల   ప్రభావం  ఎంతో  ఉంటుంది. 


 మత్తు  పదార్ధాన్ని  తీసుకుని ,  అసభ్యకరమైన    దృశ్యాలను  చూస్తున్న  వ్యక్తికి    ఒంటరిగా  ఉన్న   అమ్మాయి   కనిపిస్తే   విచక్షణను   కోల్పేయే  అవకాశం  ఉంది.  అప్పుడు  ఆ  పిల్ల  పరిస్థితి   ఏమవుతుందో  చెప్పలేం.   ఇలాంటప్పుడు   అఘాయిత్యం  జరగటానికి   చిన్నపిల్ల    లేక  పండుముదుసలి   అనే  అభ్యంతరం  కూడా   ఉండకపోవచ్చు.


 పెద్దవాళ్ళయిన    ఆడవాళ్ళ  రక్షణ  గురించి  ఎన్నో  జాగ్రత్తలు  చెబుతున్నారు. అభంశుభం  తెలియని  చిన్నారుల    రక్షణ   గురించి  కూడా  ఆలోచించండి.

.........................

విచిత్రం ఏమిటంటే  ఈ మధ్య  కొందరు  ఆడవారు  కూడా  మత్తు  పదార్ధాలను   తీసుకుంటున్నారు . ఈ  మధ్య  ఒక  అమ్మాయి  మత్తులో  రోడ్డుపై  పడి  గొడవ  చేసిన  విషయాన్నీ  మీడియాలో  చూసాము కదా ! 


ఇది  మరింత  ప్రమాదకరం .


No comments:

Post a Comment