koodali

Friday, December 2, 2016

ఏదో చేయాలనుకుంటే..ఏదో అవుతున్నట్లుంది..



సామాన్య మధ్య తరగతి వారికి అనేక హద్దులు ఏర్పరుస్తూ, సంపద లెక్కలు చూపమనటం బాగానే ఉంది.. నియమాలు ఎవరికైనా ఉండవలసిందే..

అయితే సమాజంలో వందలు, వేలకోట్ల సంపద ఉన్న వారెందరో ఉన్నారు.

కొందరికి ఇంత వరకే సంపద ఉండాలని హద్దులు పెడుతున్నప్పుడు ..కొందరి వద్ద వందలు, వేలకోట్ల సంపద ఉండకూడదు కదా!

నోట్లు, బంగారం సంగతి  అలా ఉంచితే భూమి సంగతి ?  పారిశ్రామిక వేత్తలకు, అనేక సంస్థలకు ప్రభుత్వాలే వందల ఎకరాలను ఇస్తున్నాయి.

భూమి లేని ప్రజలెందరో ఉండగా కొన్ని దేశవిదేశీ  సంస్థలకు వందల ఎకరాలు కట్టబెడుతున్నారు.

భవిష్యత్తులో ప్రభుత్వానికి భూమి కావాలంటే మళ్ళీ సామాన్యప్రజల వద్ద సేకరిస్తారు కాబోలు.

ఇక, బ్యాంకుల నుండి లక్షల కోట్లు అప్పుగా తీసుకుని తిరిగి చెల్లించని ధనవంతులను ఏం చేస్తున్నారు?


ఇక, వ్యవసాయంపై వచ్చే ఆదాయానికి పన్ను లేకపోవటం అనే కారణంవల్ల చాలామంది ధనవంతులు ..భూమి కొని  పన్ను కట్టకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.


  సామాన్య, మధ్యతరగతి రైతులకు పన్ను వేయకుండా పెద్దమొత్తంలో వ్యవసాయభూములు ఉన్న వారిపై పన్ను వేస్తే  ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం వస్తుంది.

ప్రజలందరికి సంబంధించిన ఖనిజాలు ...మొదలైన సహజసంపదలను ప్రైవేట్ సంస్థలకు లీజుకు ఇస్తున్నారు. ఆ సంస్థలు వందలు, వేల కోట్లు ఆర్జిస్తున్నారు.


 టాక్స్ చెల్లించినా కూడా వారివద్ద వందలు, వేల కోట్ల ఉంటున్నప్పుడు.. ప్రజలకు చెందవలసిన సొమ్ము కొందరు ప్రైవేటు వ్యక్తులు పొందటం అన్యాయం కాదా?

నష్టాలు వస్తున్నాయని చెప్పి ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయటం కాకుండా ..ప్రభుత్వరంగ సంస్థలను   ప్రభుత్వాలే సమర్ధవంతంగా నిర్వహించితే  చాలా ఆదాయం వస్తుంది.


 ప్రజలసొమ్ముతో నేతలు ఎన్నో సౌకర్యాలు ఏర్పర్చుకుంటున్నారు. దేశంలో జరిగే పెద్ద, చిన్నా ఫంక్షన్లకు నేతలు, అధికార్లు  విమానాలలో, కార్లలో వచ్చిపోవటానికి ఎంతో ప్రజల సొమ్ము ఖర్చవుతుంది. ఇక పార్టీల ఎన్నికల ఖర్చు సంగతి సరేసరి. 


 దేశంలో   సొమ్ము ప్రజలందరికీ న్యాయంగా అందాలి. ప్రభుత్వాలు ప్రజలను లెక్కలు అడుగుతున్నట్లు..ప్రభుత్వాలు కూడా ప్రజలకు లెక్కలు చెప్పవలసి ఉంటుంది.


 స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచినా కూడా దేశంలో ఇంత పేదరికం ఎందుకు ఉందో? ప్రభుత్వాలు ఎందుకు సమర్ధవంతంగా పనిచేయలేదో ? వంటి ప్రశ్నలు ప్రజలు కూడా వేస్తారు.


 అయితే చాలామంది ప్రజలలో కూడా అవినీతి బాగా పెరిగింది. అందువల్ల ఇప్పుడు ఎవరూ ఎవరినీ .. ఇదేమిటని...అడిగే  పరిస్థితి ఎక్కువగా  లేదు.


సమాజంలో ఉన్న  ఆర్ధిక అసమానతలు పోవాలంటే కొందరి వద్ద ఎక్కువ సంపద ..కొందరి వద్ద తక్కువ సంపద ఉండకూడదు.కనీసం విపరీతమైన  అసమానతలు ఉండకూడదు.

నల్లడబ్బు ఉన్న బడావ్యక్తులను పట్టుకోకుండా సామాన్య, మధ్యతరగతి వాళ్ళకు ఎక్కువ ఆంక్షలు విధిస్తున్నారనే అభిప్రాయాన్ని  ఎక్కువమంది ప్రజలు వ్యక్తపరచటాన్ని ప్రభుత్వం గమనించాలి.

************** 
కొన్ని విషయాలు ఏమిటంటే, 

పాతకాలంలో కొందరు స్వార్ధపరులు, ప్రాచీన గ్రంధాలలోని విషయాలను సరిగ్గా అర్ధం చేసుకోని వారు .. శూద్రులను చిన్నచూపు చూసేవారు. ఆ విధంగా శూద్రులు కష్టాలను అనుభవించారు. 

 కాలక్రమేణా శూద్రులలో కూడా కొన్ని కులాలు ఏర్పడ్దాయి. కొందరు ఆర్ధికంగా అభివృద్ధిచెందారు. కొందరు ఆర్ధికంగా ఎదగలేకపోయారు.

ఆర్ధికంగా ఎదిగిన శూద్రులలో కొందరు , తమకన్నా ఆర్ధికంగా క్రిందస్థాయిలో ఉన్న  శూద్రులను చిన్న చూపు చూడటం కూడా  జరిగింది. 

ఆధునిక కాలంలో రిజర్వేషన్లను ప్రవేశపెట్టారు. 

  కొందరు ఏమంటున్నారంటే, ఆర్ధికంగా అడుగున ఉన్నవారు అన్ని కులాల్లోనూ ఉన్నారు కాబట్టి ,మాకూ రిజర్వేషన్లు కావాలంటున్నారు.

మరి కొందరు ఏమంటున్నారంటే, పాతకాలంలో శూద్రులు వివక్షకు గురయ్యారు కాబట్టి, ఆర్ధికస్థితితో  సంబంధం లేకుండా, కులాల ప్రకారమే రిజర్వేషన్లు ఉండాలని అంటున్నారు.

అలా అయితే , ఇప్పుడు శూద్రులలో ఉన్నతకులాలుగా గుర్తించబడిన కులాల వారి పూర్వీకులు పూర్వకాలంలో వివక్షకు  గురయిన వారే .. అందువల్ల ఇప్పుడు  శూద్రులలో అన్ని కులాలకూ రిజర్వేషన్లు ఇస్తారా?

 అన్నికులాల వారిలోనూ పేదరికంతో బాధలు పడుతున్న వాళ్ళెందరో ఉన్నారు. 

ఒక ఉదాహరణ గమనిస్తే,  రిజర్వేషన్లు ఉన్న ఒక కుటుంబంలో తల్లితండ్రి ఉన్నతోద్యోగాలు చేస్తున్నారు.వారు ఆర్ధికంగా ఉన్నత స్థితిలో ఉన్నారు. 

ఇంకొక రిజర్వేషన్లు లేని కుటుంబం వారు  మధ్యతరగతికి చెందిన వాళ్ళు.

రెండు కుటుంబాల వారి అమ్మాయిలు వైద్యవృత్తిలో సీటు సంపాదించడం కొరకు బాగా కష్టపడి చదివారు. అయితే, ఇద్దరికీ మార్కులు బాగానే వచ్చాయి.

అయితే,రిజర్వేషన్లు లేని అమ్మాయికి సీటు రాలేదు. రిజర్వేషన్లు ఉన్న అమ్మాయికి  సీట్ లభించింది.

 తాను రిజర్వేషన్ లేని కులానికి చెందటం వల్లే తనకు సీట్ రాలేదని సీట్ లభించని అమ్మాయి వాపోవటం జరుగుతుంది.

 ఇలాంటప్పుడు మనుషుల మధ్య అసహనం, కులాల మధ్య విభేదాలు పెరిగే అవకాశముంది. 

అయితే, వెనుకబడిన వర్గాలను పైకి తీసుకురావటం ఎంతో అవసరం. వారికి ఆర్ధికంగా చేయూత నివ్వాలి. 

అదే సమయంలో రిజర్వేషన్లు లేని కులాలలో పేదవారికి కూడా ప్రోత్సాహాలు ఇస్తే బాగుంటుంది.
...............
పాతకాలమైనా, ఆధునికకాలమైనా, ఏ కులం వాళ్ళ పట్లా ఏ కారణం చేతనైనా వివక్ష ఉండకూడదు. 

 అందరికీ  అవకాశాలుండాలి.  అందరూ బాగుండాలి.ఎవరూ పేదరికంలో బాధపడకూడదు.

ఆశ్చర్యమేమిటంటే, రిజర్వేషన్లు ప్రవేశపెట్టబడి ఇన్నేళ్ళయినా.. దేశంలో పేదరికంతో బాధలు పడుతున్న వారెందరో ఉన్నారు.

పేదరికం పోకపోవడానికి సంపద కొందరి వద్దే ప్రోగుపడటం ముఖ్యకారణం.  


1 comment:

  1. ఇక బంగారం విషయానికి వస్తే, బంగారాన్ని బిస్కట్ల రూపంలో పెద్ద ఎత్తున దాచినవారికి ఆంక్షలు విధించటం సరైనదే.

    స్త్రీల విషయంలో ఆర్ధికంగా అవసరపడుతుందని ఆభరణాల రూపంలో బంగారాన్ని పెద్దలు ఏర్పాటుచేసారు.

    విపరీతంగా ఉండటం సరైనది కాదుకానీ వివాహిత స్త్రీ వద్ద 1000 గ్రాముల వరకూ ఉంటే బాగుంటుందని కొందరు స్త్రీలు కోరుకుంటున్నారు.

    అనేకకారణాల వల్ల ప్రభుత్వాలు బంగారంపై ఎక్కువ ఆంక్షలు పెట్టాలని అనుకుంటున్నాయి కాబోలు.

    అయితే, ఇంతకుముందు అనేకదేశాలు ఆర్ధిక మాంద్యంలో ఇబ్బందులు పడినప్పుడు కూడా.. భారతదేశానికి అంత ఇబ్బంది కలగలేదంటే ఈ దేశంలో ఉన్న బంగారం కూడా కారణం.

    భారతదేశాన్ని బంగారం ఎన్నోసార్లు ఆదుకుంది.

    స్పెక్యులేషన్ తో కూడిన షేర్ మార్కెట్ మీద మోజుతో బంగారాన్ని చిన్నచూపు చూడటం తగదు.

    ReplyDelete