koodali

Friday, November 28, 2014

భగవద్గీత గురించి కొన్ని విమర్శలు..నా అభిప్రాయాలు.

ఇక్కడ నేను వ్రాసిన విషయాలు.. ఒకామె వ్రాసిన పుస్తకంలోని విషయాలకు నా సమాధానాలు. ఆమె పేరు రంగనాయకమ్మ అనుకుంటా..? 
 
 ఈ విషయాలలో అంతరార్ధాలు చాలా ఉంటాయి.  అయితే, ఈ రోజుల్లో సామాన్యంగా అర్ధం అయ్యేలా వ్రాయటం జరిగింది.
 
 
వాళ్ళ అభిప్రాయాలు....  గీత అహింస, వైరాగ్యాలు ఉపదేశిస్తుందని కదా అంటారు?

anrd.గీత అహింస,వైరాగ్యాలు ఉపదేశిస్తుందన్నది నిజమే. సమాజానికి చెడు చేసేవాళ్ళను శిక్షించటం కూడా అహింస క్రిందకే  వస్తుంది. కర్తవ్యాన్ని ధర్మబద్ధంగా నిర్వహించాలంటే .. వైరాగ్యమూ అవసరమే. 

వాళ్ళ అభిప్రాయాలు.. (గీత 2/23) (ఆత్మను అస్త్ర - శస్త్రాలు ఏమీ ఛేదించలేవు. అగ్ని దహించలేదు) అని ఆలోచించి, ఎవరినైనా గండ్రగొడ్డలితో ఒక మాంచి దెబ్బ వేస్తే ఏం?’ తర్వాత వాళ్ళ బంధువులు  ఏడ్వడం మొదలు పెడితే .. 

ఏడుస్తున్నారెందుకు?’ (గీత 2/22) (మనిషి చిరిగిన బట్టలు విడిచిపెట్టి కొత్త బట్టలు ఎలా ధరిస్తాడో, అదే విధంగా జీవాత్మ జీర్ణించిన శరీరాన్నివదలిపెట్టి కొత్త శరీరాన్ని గ్రహిస్తుంది.) - అని అంటే!


anrd..మనిషి చిరిగిన బట్టలు విడిచిపెట్టి కొత్త బట్టలు ఎలా ధరిస్తాడో, అదే విధంగా జీవాత్మ జీర్ణించిన శరీరాన్ని వదలిపెట్టి కొత్త శరీరాన్ని గ్రహిస్తుంది.. 
 
 ఇలాంటి వాక్యాలు..జీవితంలో ధర్మయుద్ధం చేయటానికి భయపడినప్పుడు , ఆప్తులు  రణించినప్పుడు.. ధైర్యాన్నికలగజేస్తాయి.


 ధర్మయుద్ధం చేయటానికి వెనుకంజవేస్తున్న అర్జునునికి ధైర్యం చెప్పటానికి కృష్ణుడు ఇవన్నీ చెప్పారు. అంతేకానీ, ఎవరినిపడితే వారిని చంపి, పైవాక్యాలు అనాలన్నది కృష్ణుని ఉద్దేశం కాదు. 


వాళ్ళ అభిప్రాయాలు.. గీత పదును కూడా ఎక్కిందంటే ప్రతి ఊరూ కురుక్షేత్రం అయిపోతుంది. అందుకే నేను చేతులు జోడించి ఉడుకు రక్తంలో గీత చదవ వద్దు బాబూ, అంటాను.

anrd.. గీతోపదేశం విన్నతర్వాత ప్రతి ఊరూ కురుక్షేత్రం ఎందుకు అవుతుంది ? కృష్ణుడు చెప్పింది  ధర్మయుద్ధం చేయమని మాత్రమే. ఊరకనే ప్రజలు ఈటెలు, బల్లేలు బయటికి తీయమని  కాదు.

వాళ్ళ  అభిప్రాయాలు.. ‘అర్జునా!..ఇంత జ్ఞానం నేను ఇచ్చిన తర్వాత శరీరం నశ్వరమని, ప్రపంచం క్షణభంగురమని ప్రాపంచిక సుఖాలు తుచ్ఛమైనవి. రాజ్యకాంక్ష వదిలేసేయి.... ఈ మాటలేవీ ఆయన అనలేదు.

anrd..అసూయాపరుడైన దుర్యోధనుడు మాయాపాచికల  సాయంతో  పాండవులను ఓడించి  అడవులకు  పంపించాడు. అలాంటి దుర్యోధనుడుకి రాజ్యాన్ని వదిలి పాండవులు యుద్ధం చేయకుండా ఒక మూల కూర్చోవాలనటం  ఏం న్యాయం? ఇది న్యాయం కాదు కాబట్టే, దుష్టుడైన  దుర్యోధనుని శిక్షించటానికి  యుద్ధం చేయాలని శ్రీకృష్ణుల వారు అర్జునుని అనేక విధాలుగా ప్రోత్సహించారు.

 
వాళ్ళ అభిప్రాయాలు.. జీవుడు నశించనప్పుడు హత్య చేసిన వాడికి ఉరిశిక్ష ఎందుకివ్వాలి?

anrd. జీవునికి మరలమరల జన్మలను ధరించే అవకాశం ఉంది కాబట్టి, జీవుడు ఎప్పుడూ నశించడనేది వాస్తవమే. అలాగని జీవించి ఉన్నవారిని హత్యచేసే వాళ్ళను శిక్షించకుండా ఊరుకోవాలా?    

వాళ్ళ అభిప్రాయాలు.. కృష్ణుడు ఒకచోటనేమో ఇలా ఉపదేశిస్తున్నాడు --(గీత. 14/24) (సుఖదుఃఖాలను సమానంగా భావించి, ఆత్మస్థుడై ఉంటూ మట్టి గడ్డను, రాతిని, బంగారాన్ని, ఒకటిగానే ఎంచుతూ, ఇష్టానిష్టాలను, నిందాస్తుతులను సమభావంతో ఎవడు స్వీకరిస్తాడో వాడే ధీరుడు).ఒకసారి అనాసక్త కర్మను ఉపదేశిస్తాడు - (గీత 2/38) (సుఖదుఃఖాలను, లాభనష్టాలను, జయాపజయాలను, సమానంగా భావించి యుద్ధానికి సన్నద్ధుడవు కా. దీనివల్ల నీకు పాపమంటదు)తర్వాత గెలుపు ఆశ కూడా చూపుతాడు -(గీత 11/33) (కాబట్టి అర్జునా, లే, యశస్సు పొందు, శత్రువులను జయించి సమృద్ధమైన రాజ్యం అనుభవించు) ఇక నీవే చెప్పు, సుఖం, దుఃఖం, గెలుపు, ఓటమి, కీర్తి, అపకీర్తి అన్నీ సమానమైనప్పుడు భగవానుడు జయము, కీర్తి, వీటి ఆశ ఎందుకు చూపుతున్నాడు?

 భగవానుడంటాడు -  (గీత 18/61) (ఈశ్వరుడే సర్వప్రాణుల హృదయాల్లో నెలకొని తన మాయ ప్రభావంతో వానిని కీలు బొమ్మల్లాగా ఆడిస్తున్నాడు.) ఈ మాటే నిజమైతే ఇంత అయోమయం సృష్టించవలసిన పనే ముంది? నేరుగా తన యంత్రమే తిప్పేస్తే సరిపోయేదికదా! .. తర్వాత మళ్ళీ ‘యథేచ్చసి తథా కురు’ (గీత 18/63) (నీ కోరిక ఎలా ఉంటే అలా చెయ్యి) అనే మాట ఎందుకంటాడు?


 కృష్ణుడు ఇలా ఎందుకన్నాడు -(అన్ని ధర్మాలు (కర్తవ్య కర్మలు) వదలి పెట్టి నా ఒక్కని శరణు పొందు. నేను నీకు అన్ని పాపాల నుండి విముక్తి కలిగిస్తాను).ఈ మాటే చెప్పదలచుకొని ఉంటే, ఏడు వందల శ్లోకాల అవసరం ఏముంది? 


anrd..చదవటానికి ఇష్టపడని పిల్లవానికి తల్లి ఎన్నో విధాలుగా నచ్చచెప్పటానికి ప్రయత్నిస్తుంది. చదువు  ప్రాదాన్యత గురించి కాసేపు బుజ్జగించి చెబుతుంది. చదువుకుంటే జీవితంలో ఎన్నో సుఖాలు లభిస్తాయని ఆశ పెడుతుంది. చదువుకోకుంటే కష్టాలు వస్తాయని భయపెడుతుంది. చదువుకోవటం  విద్యార్ధి ధర్మం కాబట్టి తప్పక చదవాలని బోధిస్తుంది. చదువులో అర్ధం కాని ప్రశ్నలు ఉంటే తనను సాయం అడిగితే (శరణు కోరటం) అర్ధం అయ్యేటట్లు చెప్పి పరీక్షలో పాసయ్యేటట్లు  చేస్తానని  అభయమిస్తుంది. చదువుతావో..చదవవో ఇక నీ ఇష్టం అనీ అంటుంది. 

జగన్నాటకం అనే ఆట లేకపోతే సృష్టి జడంగా ఉంటుంది కాబట్టి , తన మాయాప్రభావంతో జీవులను సృష్టించి జగన్నాటకాన్ని ఆడిస్తారు దైవం. 


జీవికి ఒక జన్మను ఇచ్చి భూమికి పంపుతారు.పుట్టినతరువాత చాలామంది అంతులేని కోరికలతో ఎన్నో కర్మలు చేస్తారు...చేసిన పాపపుణ్య కర్మల ఫలితంగా కష్టసుఖాలను అనుభవిస్తూ, తిరిగితిరిగి జన్మలను పొందుతూ  ఉంటారు.మానవులు చేసే పాపపుణ్యాల ఫలితాల ప్రకారం జన్మలను ఇస్తూ..దైవం తన మాయ ప్రభావంతో జీవులను కీలు బొమ్మల్లాగా ఆడిస్తున్నారు.


 నిష్కామకర్మను ఆచరిస్తూ జీవించేవారికి పాపపుణ్యాల కర్మబంధం నుండి విముక్తి కలిగి, జన్మపరంపరనుండి విడుదల లభించి పరమపదాన్ని పొంది హాయిగా ఉంటారు.


వాళ్ళ అభిప్రాయాలు..  కృష్ణుడు మనసుకు ఏది తోస్తే అది చెప్పుకుంటూ వెళ్ళాడు -- క్షత్రియుడివి. కనుక యుద్ధం చెయ్యి. యుద్ధం చేయకపోతే నిందల పాలవుతారు. కాబట్టి యుద్ధం చెయ్యి.’

 
anrd..క్షత్రియుని స్వధర్మంలో యుద్ధం చేయటమూ ఒక భాగమే. రాజ్యాన్ని పాలించటమూ, కోల్పోయిన  రాజ్యం కోసం యుద్ధం చేయటమూ క్షత్రియులకు ధర్మమే.

 పాండవులకు అధికారదాహం  ఏమీ లేదు. పాండవులకు అధికారదాహమే ఉంటే గంధర్వుల  నుంచి దుర్యోధనాధులను రక్షించకుండా ఉపేక్షించి మొత్తం రాజ్యాన్ని ఏలుకునేవారు. కానీ పాండవులు  అలా చేయలేదు. గంధర్వులు దుర్యోధనుని పట్టుకున్నప్పుడు పాండవులే దుర్యోధనాదులను  రక్షించారు.


దుర్యోధనుడు అసూయతో  చిన్నతనం నుండి పాండవులను ఇబ్బందులు పెడుతూనే ఉన్నాడు. లక్క ఇంటిలో  చంపటానికీ ప్రయత్నించాడు. ధృతరాష్ట్రుడు అంధుడవటం వల్ల పాండు రాజే రాజ్యాన్ని సంరక్షించేవాడు. అయినా పాండవులు, మొత్తంరాజ్యాన్ని ఆశించలేదు. 


 అయిదు  ఊళ్ళు ఇస్తే చాలన్నా ఒప్పుకోకుండా, దుర్యోధనుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు.  దుర్యోధనుని అధికారదాహం, అసూయ వల్ల భారతయుద్ధంలో ఎందరో సైనికులు  మరణించారు. ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయి.


వాళ్ళ  అభిప్రాయాలు.. శ్రీకృష్ణుడు అర్జునికేమో ఇలా ఉపదేశిస్తాడు -(గీత 2/11) (జ్ఞానులయిన వారు మరణించిన వారిని గురించిగానీ, జీవించి ఉన్న వారిని గురించిగానీ శోకించరు). కానీ, అభిమన్యుని చంపినప్పుడు ఈ జ్ఞానం ఎక్కడ మాయమై పోయింది? -- 

anrd.నిజమే, అభిమన్యుని చంపినప్పుడు  అర్జునుడు  శోకించాడు.ఎంత జ్ఞానం తెలుసుకున్నా మనిషిగా జన్మను ఎత్తిన తరువాత ఎంతటివాళ్ళైనా కూడా మానవుల వలెనే భావాలను ప్రకటించటం కనిపిస్తుంది.

వాళ్ళ అభిప్రాయాలు..  జయద్రథునితో పగ సాధించడానికి అంత మాయోపాయం ఎందుకు చేయవలసి వచ్చింది?

 anrd.. జీవితంలో స్వధర్మాన్ని ఆచరించే సమయంలో ఎన్నో ఎత్తులు పైఎత్తులు వేయవలసిన పరిస్థితులూ ఎదురయ్యే అవకాశం ఉంది.అలాంటప్పుడు  ఉపాయంగా ధర్మరక్షణ చేయవలసి  ఉంటుంది.


వాళ్ళ  అభిప్రాయాలు..  కృష్ణుడంటాడు - (గీత. 2/55) (ఎవరైతే అన్ని కోరికలు త్యజించి తమలో తామే సంతృప్తులై ఉంటారో, వారే నిజమైన స్థితప్రజ్ఞులు) అలాంటప్పుడు రాజ్యం, స్వర్గం, వీటి ఆశ చూపుతూ ఇలా ఎందుకన్నాడు?-(అర్జునా! చనిపోతే స్వర్గం ప్రాప్తిస్తుంది. జయం పొందితే రాజ్య భోగాలననుభవిస్తావు. రెంటికి అతని పాడు విధాల లాభమే ఉంది. అందువల్ల కృతనిశ్చయుడవై యుద్ధానికి లే! )

anrd..  యుద్ధం చేయటం అర్జునుని కర్తవ్యం. రాజ్యాన్ని స్వార్ధపరుల చేతుల్లో నుంచి రక్షించే బాధ్యత అతనిపై ఉంది. స్వార్ధము, కోరిక, సంతోషము, భయము, ఆశ, బంధుప్రీతి ..లేకుండా కర్తవ్యాన్ని నిర్వహించేవారు స్థితప్రజ్ఞులు... ఒక న్యాయమూర్తి తీర్పును ఇచ్చేటప్పుడు మిత్రులు,శత్రువులు.. అనే తేడా ఉండకూడదు.

బంధుప్రీతి వల్ల అర్జునుడు యుద్ధాన్ని చేయకపోతే, దుర్యోధనుని వంటి స్వార్ధపరుల వల్ల రాజ్యంలోని ప్రజలూ కష్టాలను అనుభవిస్తారు. ఇలాంటప్పుడు అర్జునునికి స్వర్గాశ చూపించి అయినా ధర్మయుద్ధం చేయించాలని  కృష్ణుడు అలా అని ఉండవచ్చు.


వాళ్ళ అభిప్రాయాలు..కృష్ణుడు తాను మాత్రం జరాసంధునితో యుద్ధం చేయలేక ద్వారకకు పలాయనం చిత్తగించాడు!

anrd..  ప్రతి వారిని శిక్షించటానికి ఒక సమయం  ఉంటుంది. తప్పుచేసిన వారిని వెంటనే శిక్షించరు. వాళ్ళు మారటానికి కొంత సమయాన్ని ఇస్తారు. అప్పటికీ మారకపోతే ఇక తప్పక శిక్షిస్తారు. జరాసంధుని కొంతకాలం వదలటానికి కారణం అప్పటికి  అతని పాపం పండలేదు.  

వాళ్ళ అభిప్రాయాలు.. అర్జునుడు తర్కం శాస్త్రం చదవలేదు. అందుకే రెండు విధాలా ఉచ్చులో చిక్కుకున్నాడు. నేనుండి ఉంటే అడిగేవాణ్ణి. ‘హే కృపాసింధు, ఈ రెండూ కాక మరో పరిణామం కూడా జరగవచ్చు కదా! అర్జునుణ్ణి పట్టి బంధిస్తే అప్పుడు మరి ఎలా? స్వర్గమూ ఉండదు, రాజ్యమూ ఉండదు కదా! రెంటికీ చెడ్డ రేవడై పోయినట్లే కదా!’

anrd..అర్జునుడు రెంటికీ చెడ్డ రేవడి ఎందుకవుతాడు? బంధితులు ఎవరైనా సరే, కలకాలం అలా బంధితులుగానే జీవిస్తూ ఉండిపోరు కదా! యుద్ధం చేస్తూ పట్టుబడి బంధితుడుగా మరణించితే  స్వర్గం  లభిస్తుంది. బంధనాలనుంచి తప్పించుకుని మరల యుద్ధం చేస్తే రాజ్యం లభించే అవకాశమూ  ఉంది..

వాళ్ళ అభిప్రాయాలు..అంత భయంకరమైన యుద్ధం జరగబోయేముందు పద్ధెనిమిది అధ్యాయాల గీత చెప్పడానికి, వినడానికి తీరిక ఎవరికి వుంది? అంతవరకు పద్ధెనిమిది అక్షౌహిణుల సైన్యం త్రాటక ముద్రలో కుంభక ప్రాణాయామం చేస్తూ వుందా? సంజయుని కళ్లల్లో టెలివిజన్ ఫిట్ అయి ఉందా? 

anrd.. పద్ధెనిమిది అధ్యాయాల గీత చెప్పడానికి, వినడానికి  ఎక్కువ  సమయం  అవసరం లేదు. అంతా తృటిలో జరిగిపోతుంది దైవం తలచుకుంటే.

సంజయునికి దైవం ప్రసాదించిన దూరదృష్టికి నేటికాలంలో టీవీల ద్వారా చూస్తున్న దూరదృష్టికి  పొంతన లేనేలేదు. భౌతికశక్తి ద్వారా  పొందేదానికీ..ఆధ్యాత్మికశక్తి ద్వారా పొందే దానికి ఎంతో తేడా ఉంది. 

 ఒక మహర్షి ఒక మహారాజుకు తృటిలో జ్ఞానాన్ని ఉపదేశించారని గ్రంధాల ద్వారా తెలుస్తుంది. 
మరి, శ్రీ కృష్ణపరమాత్ములవారు ఇంకా ఎంతో గొప్పగా  బోధించగలరు.

 కృష్డుడు అర్జునునకు గీతను బోధించటం ఎలా జరిగింది? సంజయుడి దూరదృష్టి ఎలాంటిది ? అనే  విషయాలను కొద్దిగానైనా తెలుసుకోవాలంటే ఆధ్యాత్మిక మార్గం ద్వారా తెలుసుకోవలసిందే.కేవల  భౌతికవాదులకు అవి ఎప్పటికీ అంతుబట్టని విషయాలే.   

 ...........

 వ్రాసిన  విషయాలలో  ఏమైనా  పొరపాట్లు  ఉంటే  దయచేసి  క్షమించాలని దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను. 
...............

anrd..  ఎంతో తెలివిగలవాళ్ళమనుకునే వాళ్ళు కూడా, తమ చేతిలో ఏమీ లేదనీ, దైవమే అత్యంత శక్తివంతుడని ఎప్పటికో ఒకప్పటికి తెలుసుకుంటారు. ఇలా తెలుసుకోవటానికి కొందరికి కొన్నిజన్మలు  కూడా పట్టవచ్చు. ఎవరికైనా చివరికి తెలిసిదేమిటంటే, భగవంతుని శరణువేడటం తప్ప  వేరే మార్గం లేదని.


No comments:

Post a Comment