koodali

Monday, May 6, 2013

వ్యక్తులు చేయగలుగుతున్నప్పుడు .. . వ్యవస్థ ద్వారా చేయగలగటం సాధ్యమే కదా !

  
ఒకప్పుడు  ఈ  దేశం   ఎంతో  సిరిసంపదలతో  తులతూగేదని   అప్పటి   విదేశీ  యాత్రికులు  తమ  గ్రంధాల ద్వారా తెలియజేసారు. 
మరి ఇప్పుడు ..ఈ దేశం ఎందుకిలా తయారయ్యిందో ?

దేశంలో  ఎందరో  మేధావులు  ఉన్నారు.  ఎందరో  కష్టించి  పనిచేసేవాళ్ళు  ఉన్నారు. అపారమైన  ప్రకృతి  సంపదలున్నాయి.  జలజలపారే  జీవనదులెన్నో  ఉన్నాయి.   చక్కటి  సూర్యరశ్మి  ఉంది.   చక్కగా  జీవించటానికి  కావలసినవెన్నో  ఉన్నాయి.

 మరి  దేశంలో  ఇంత  పేదరికం,  ఇంత  అశుభ్రత  ఎందుకు  పెరిగిపోయింది ? మనం  మన దేశాన్ని    బాగుచేసుకోలేమా?  అందరూ  తలచుకుంటే   దేశంలో   పేదరికం,  అవినీతి,  అశుభ్రత  పోకుండా  ఉండదు  కదా!

   మన  పూర్వీకులు  చక్కగా  పొదుపుగా  జీవించేవారు.  ఎక్కువ  ఆడంబరాలకు  పోవద్దని  ,  పరిసరాలను  శుభ్రంగా  ఉంచుకోవాలని ,  మరెన్నో  చక్కటి  విషయాలను   గ్రంధాల  ద్వారా  తెలియజేశారు.

శుచిశుభ్రత  ఉన్న  ఇంట్లో ,  పరిసరాలలో   లక్ష్మీదేవి  ఉంటుందని  తెలియజేశారు.  జీవితంలో  ఎలా  ప్రవర్తించాలో,  ఎలా  ప్రవర్తించకూడదో ,   ఎలా  ప్రవర్తిస్తే  ఎలాంటి  ఫలితాలు  వస్తాయో  పురాణేతిహాసాల  ద్వారా  తెలియజేశారు.

 మనిషి  పుట్టుక  నుంచి  మరణానంతరం  కూడా  ఏమవుతుందో    వివరించే  విజ్ఞానాన్ని    అందించారు. చావుపుట్టుకల  మధ్య  జీవించటానికి  అవసరమైన  విజ్ఞానాన్ని  తెలియజేశారు.

  నైతికవిలువలను  పాటించిన  దగ్గరే  దైవానుగ్రహం  లభిస్తుంది.   నైతికవిలువలను  పాటించకుండా  జీవిస్తున్న  జాతి   గతి   అధోగతే.
..................................... 


 కొందరు  వ్యక్తులు  తాము   జన్మించిన  ఊళ్ళను   ఆదర్శంగా  తీర్చిదిద్దారని , పేదరికం,  నిరక్షరాస్యత ,  దురలవాట్లు.  వంటివి  లేకుండా  చేశారని ,  తమ  గ్రామాలను  ఎంతో  అభివృద్ధి  చేసారని  పత్రికల్లో  రాస్తుంటారు.

ఇలాంటి   గొప్ప  వ్యక్తులు  తమ  గ్రామాలను  ఏ  విధంగా   అభివృద్ధి   చేసారో  చూసి  తెలుసుకుని  ఆ  విధంగా  అన్ని  గ్రామాలను,  నగరాలను  అభివృద్ధి  చేయవచ్చు.

చేతిలో  అధికారం,  ఆర్ధికవసతులు  సరిగ్గా  లేకుండానే   కొందరు  వ్యక్తులు  గ్రామాలను  అభివృద్ధి చేస్తున్నారంటే ,   ప్రభుత్వం,  అధికారులు,  ప్రజలు  గట్టిగా  సంకల్పించుకుంటే  ఈ  దేశం  తిరిగి  పునర్వైభవాన్ని  పొందగలుగుతుంది  ....అని  ఆశించటంలో  ఎటువంటి  సందేహమూ  లేదు.





4 comments:

  1. పదవీ కాంక్ష, డబ్బు సంపాదించాలనే తపన మూలంగా సమాజం అసహజంగా తయారయింది, వ్యక్తి చేయగల్గినపుడు సమష్టి ఎందుకుచేయలేదు, చేయవలసిన వారి స్వార్ధం అంతే

    ReplyDelete
    Replies

    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      నిజమేనండి, వ్యక్తి చేయగల్గినపుడు సమష్టి వల్ల కచ్చితంగా సాధ్యమవుతుంది.

      ఈ రోజుల్లో చాలామంది ఎన్నో మోసాలు చేసి పది తరాలకు సరిపడా డబ్బును కూడబెడుతున్నారు. ఆ పాపాల ఫలితంగా కష్టాలను అనుభవించవలసి వచ్చినప్పుడు బాధపడతారు.

      ఆ డబ్బును ఎలా దాచిపెట్టాలో ? అనే వర్రీతోనే వారి జీవితం గడిచిపోతుంది.
      ఎప్పటికైనా ఆ డబ్బే వాళ్ళను అష్టకష్టాల పాలుచేసే అవకాశం ఉంది.......లేకపోతే నయం కాని రోగాల వల్ల బాధలు పడుతూ ఉన్న డబ్బంతా ఖర్చుపెట్టవలసి రావచ్చు.

      Delete
  2. నిన్న ఇక్కడ ఒక సమావేశానికి వెళ్లాను. ఆయన విశాఖపట్నంలో చదువుకుని ఓక్లహోమ సిటీ అమెరికాలో ఉంటున్న ఆయన. ఆ వూళ్ళో ఇన్సురన్సు లేని వాళ్ళకి అందరికీ ఉచిత వైద్య సదుపాయములు అందే విధంగా ఒక సంస్థ స్థాపించ గలిగారు.ఊళ్ళో వున్న దాదాపు డాక్టరులు అందరూ వాలంటీర్లుగా ఆ సంస్థలో భాగంగా పనిచేస్తారు. ఈ సంస్థ పెట్టటానికి చాలా కష్టపడ వలసి వచ్చింది.
    ఎందుకు ఆయన అల్లా చేయ వలసి వచ్చింది. తోటి మానవుల వేదనని పంచుకుని ఆత్మీయత చూపగల శక్తి ఆయనకి ఉంది కాబట్టి అడ్డంకులనన్నీ ఎదుర్కుని సాధించ గలిగారు. ఆయన పేరు డాక్టర్ మురళీకృష్ణ.
    మనమెందుకు అటువంటివి చెయ్యలేము? తోటి మానవుల వేదనని పంచుకుని ఆత్మీయత చూపెట్టే శక్తి పోగొట్టుకుని మోద్దుబారాము కాబట్టి. మనము ఎన్నుకున్న వారిలో మనకి ఆదర్శవంత మైన మార్గ దర్శకులు లేక కూడా కావచ్చు.

    ReplyDelete
    Replies

    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      నిజమేనండి, గట్టి పట్టుదల ఉంటే ఎవరైనా చేయగలరు.

      ఇలాంటి వ్యక్తుల గురించి తెలుసుకుంటుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. ఇటువంటి వాళ్ళు ఎంతో గొప్పవాళ్ళు.. ఎన్నో అడ్డంకులు ఎదురైనా అనుకున్నపనిని సాధించగలరు.

      ఈ రోజుల్లో చాలా మంది ఎక్కువ డబ్బు సంపాదించి ఆ డబ్బుతో ఖరీదైన కార్లు, నగలు, దుస్తులు కొనుక్కుని అందరికి చూపిస్తూ అదే గొప్ప సంతోషం అనుకుంటున్నారు. ఇలా ఆడంబరంగా జీవించేవారికి ఇతరుల దృష్టిదోషం తగిలి కష్టాలు వచ్చే అవకాశం ఉంది.

      ఎక్కువ ఆడంబరాలకు పోకుండా జీవిస్తూ, చేతనైనంతలో ఇతరులకు సాయం చేస్తూ జీవించే వారు తాము చేసిన పుణ్యఫలం వల్ల దైవానుగ్రహాన్ని పొందగలరు.


      Delete